అన్నా హజారే లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అన్నా హజారే లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఎవరీ అన్నా హజారే? - భండారు శ్రీనివాసరావు

'ఎవరీ అన్నా హజారే?' - భండారు శ్రీనివాసరావు

'ఎవరీ అన్నా హజారే?'
'ఓ మాజీ సైనికుడు. 1965 లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నాడు.'
'ఎవరితడు? ఏమిటి ఈయన ప్రత్యేకత? యిరవై నాలుగ్గంటలు దేశవ్యాప్తంగా మీడియా లో వార్తలన్నీ ఈయన గురించే. మహారాష్ట్ర లోని అహమ్మద్ నగర్ జిల్లాలో రాలెగావ్ అనే ఆదర్స ఆదర్శగ్రామ సృష్టికర్త అయిన అన్నా హజారే గురించే. ఏమిటి అన్నా హజారే విశిష్టత? ఏమిటి ఈ గ్రామం గొప్పదనం?'
'స్వయం పోషకంగా, ఎవరిమీదా ఆధారపడకుండా అన్ని హంగులు దీనికి ఏర్పరిచారు. ఈ గ్రామానికి అవసరమయిన విద్యుచ్చక్తి అక్కడే ఉత్పత్తి అవుతుంది. సౌర శక్తి, గాలిమరలు, బయో ఫ్యూయల్ ఇందుకోసం వాడుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం వరకు పేదరికం తాండవించిన గ్రామం అంటే ఈనాడు నమ్మడం కష్టం. ఎందుకంటె ఇప్పుడా గ్రామం మొత్తం దేశంలోనే అత్యంత సంపన్నగ్రామాల్లో ఒకటిగా తయారయింది కాబట్టి. దీన్ని ఆదర్శ గ్రామంగా నిర్ణయించడానికి అనేక కారణాలు వున్నాయి. ప్రభుత్వాల మీదా, ప్రభుత్వ పధకాల మీదా ఆధారపడకుండా అన్ని వసతులు గ్రామ ప్రజలే సొంతంగా ఏర్పాటుచేసుకున్నారు. ప్రకృతి సమతుల్యం దెబ్బతినని రీతిలో అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన జరిగింది. అన్నింటికీ మించి ఆ గ్రామ ప్రజల నడుమ వెల్లివిరిసే సామరస్యాన్ని మరెక్కడా చూడలేము.
ఇన్ని మంచి పనులు ప్రచారం జోలికి పోకుండా చేసిన మంచి వ్యక్తి కాబట్టే భారత ప్రభుత్వం అన్నా హజారేను పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది.'
'అది సరే! అన్నా హజారే పోరాటం అంటూ మీడియాలో వస్తోంది. దేనిమీద ఆయన పోరాటం. దేనికోసం ఆయన ఆరాటం?'
'ఆయన ఒక మంచి అంశం మీద పోరాటం ప్రారంభించారు. అవినీతిని నిర్మూలించే ధ్యేయంతో చట్టానికి సవరణ చేయాలన్నది ఆయన డిమాండ్.'
'ఈ రోజుల్లో ఇలాటివి సాధ్యమయ్యే పనులేనా?'
'మామూలు మనుషులకు కష్టమే. కానీ అన్నా హజారే వంటి వ్యక్తులు అనుకుంటే సాధ్యం కానిది వుండదు.
'ఇందుకోసం అన్నా హజారే లోక్ పాల్ బిల్లు కావాలంటున్నారు. మంత్రులతో సహా రాజకీయరంగంలోవున్న వాళ్ళు , ఐ ఏ ఎస్ ఐ పీఎస్ లతో సహా అధికార యంత్రాంగంలో పనిచేసే సిబ్బంది అందర్నీ – ఎవరికీ ఎలాటి మినహాయింపు లేకుండా ఈ బిల్లు పరిధిలోకి తీసుకు రావాలన్నది అన్నా హజారే కోరిక. ఈ బిల్లు ద్వారా ఏర్పడే వ్యవస్థ అత్యంత బలీయంగా వుండాలని కూడా ఆయన కోరుకుంటున్నారు.
'లోక్ పాల్ బిల్లు అంత కొత్త విషయం ఏమీ కాదే. 1972 లోనే అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ ఈ బిల్లును ప్రతిపాదించారు.'
'కానీ ఏమి లాభం! మళ్ళీ ఎవరూ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు ఈ బిల్లు పట్ల శ్రద్ధ వుండదు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వారెవ్వరికీ ఇలాటి చట్టాలు రుచించవు.
'అందుకే, మచ్చలేని ప్రజాసేవకుడయిన అన్నా హజారే ఎట్టకేలకు ఈ బిల్లుకు మోక్షం కలిగించడానికి నడుం బిగించాల్సి వచ్చింది. ఇందుకోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా స్పందన లభిస్తోంది. ప్రభుత్వం కూడా స్పందించి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింప చేస్తామని ప్రకటించాలని అన్న హజారే కోరుతున్నారు. ఈ బిల్లు రూపకల్పన కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నది కూడా ఆయన డిమాండ్. ఈ కమిటీలో ప్రభుత్వంతో పాటు ప్రజా సంఘాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటె, ఇలాటి ముఖ్యమయిన బిల్లును తయారుచేసే బాధ్యతను కేవలం ప్రభుత్వాలకు వొదిలివేస్తే ప్రయోజనం వుండదని ఆయన అభిప్రాయం.
అన్నా హజారే కోరుకున్న విధంగా బిల్లు తయారయి చట్ట సభల ఆమోదం పొందితే, స్వయం ప్రతిపత్తి కలిగిన లోక్ పాల్ వ్యవస్థ ఏర్పడుతుంది. భారత ఎన్నికల సంఘం మాదిరిగా ఈ లోక్ పాల్ వ్యవస్తకు కూడా సర్వాధికారాలు వుంటాయి. ప్రతి రాష్ట్రం లో స్వయం ప్రతిపత్తి కలిగిన లోకాయుక్త వ్యవస్తలు ఆవిర్భవిస్తాయి. అవినీతి ఆరోపణలు వచ్చిన రాజకీయ నాయకుడిని కానీ, అధికారిని కానీ ఈ వ్యవస్థ విచారిస్తుంది. ఈ దర్యాప్తు ఏళ్ళూ పూళ్ళూ సాగకుండా ఒక్క ఏడాది వ్యవధిలో పూర్తి చేయాల్సి వుంటుంది. కేవలం రెండేళ్ళ లో అవినీతికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాల్సి వుంటుంది. బోఫార్స్ కుంభకోణం విషయంలో, భోపాల్ గ్యాస్ దుర్ఘటన విషయంలో ఏమి జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి. ఆ దర్యాప్తులు దాదాపు పాతికేళ్ళకు పైగా సాగాయి. చివరికి సాధించింది శూన్యం.
అవినీతి పై అన్న హజారే ప్రారంభించిన ఈ మహోద్యమంలో ఆయన ఒంటరి కాదు.
బాబా రాం దేవ్, మాజీ ఐ.పీ.ఎస్. అధికారి కిరణ్ బేడీ, స్వామి అగ్ని వేష్, సమాచార హక్కు ఉద్యమకారుడు అరవింద్ కేజరీ వాల్, ఇంకా అనేకమంది అన్నా హజారేకు మద్దతుగా నిలిచారు. అలాగే, ప్రముఖ సినీ నటులు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ఆయనకు బాసటగా నిలబడ్డారు. అందరి బాగుకోసం అన్నా హజారే ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని దేశం నలుమూలలకు, ఇంటింటికీ చేర్చడంలో ప్రతి ఒక్కరు తమకు చేతనయిన విధంగా తోడ్పాటు అందించాలని కోరడానికే ఈ వివరాలు. అవినీతిపై అన్నా హజారే మొదలు పెట్టిన ఈ ఉద్యమ స్పూర్తిని నేల నాలుగు చెరగులకు చేర్చడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.' (08-04-2011)