13, ఆగస్టు 2010, శుక్రవారం

సుత్తి ముక్తావళి - భండారు శ్రీనివాసరావు

సుత్తి ముక్తావళి




(కన్న వింతలూ- విన్న వింతలూ)



'నిన్ను గురించి నువ్వు ఎప్పుడూ చెప్పుకోకు. మంచి చెప్పుకుంటే ఎవ్వరూ నమ్మరు. చెడు చెప్పుకుంటే - ఇంకా ఎంతవుందో అనుకుంటారు'

'మన బతుకు ఎలాంటిదో మన చావు చెబుతుంది. అయితే, మన బతుకు ఎలాంటిదో లోకానికి చెప్పడం కోసం కనీసం ఇద్దరు బతికుండాలి. అందులో ఒకడు మన స్నేహితుడయివుండాలి. ఇంకొకడు తప్పనిసరిగా మన శత్రువై వుండాలి. మన గురించి శత్రువు చెబుతున్నదానికీ- స్నేహితుడు చెబుతున్నదానికీ యెంత వ్యత్యాసం వుంటే - అంత నిత్యనూతనంగా చచ్చిన తర్వాత కూడా మనం బతికేవుంటాం.'





'ఒక మాట నిజం.
బతుక్కన్నా చావుకే  ఆయుష్షు ఎక్కువ.
గట్టిగా ఒక్క తుమ్ము కూడా తుమ్మకుండా ప్రాణాలను కాచుకుంటూ, దాచుకుంటూ ఎన్నేళ్ళయినా బతుకు. నూరేళ్ళు- నూట యిరయై ఏళ్ళు- మహా అయితే నూట పాతికేళ్ళు.
కానీ, ఆ బతుక్కన్నా కూడా పొడవయినది చావు. ఎన్నేళ్ళు బతికి చచ్చినా- బతికినన్నాళ్ళకంటే ఎక్కువ ఏళ్ళు చచ్చినతర్వాత కూడా జనం జ్ఞాపకాల్లో బతికే వుంటాం.'



"ఏ పని అయినా కష్టపడుతూ కాదు - ఇష్టపడుతూ చేయాలి"


'నేను చేయగలనని అనుకోవడం ఆత్మవిశ్వాసం-నేనే చేయగలనని అనుకోవడం అహంకారం.'


'నర మాంసం తినే క్రూర జంతువు కూడా తన మాంసం తినదు'




" పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.తరవాత్తరవాత మొగుడిమాట భార్య వింటుందట.ఆ తర్వాత యిరువురి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట.'


'భయం అనే పదానికి తప్ప దేనికీ భయపడాల్సిన పని లేదు.'




'మీరు అద్భుతాలను నమ్ముతారా?'
'ఎందుకలా అడుగుతున్నారు?'
'మీ జీవితంలో నిన్న ఒక గొప్ప అద్భుతం జరిగింది తెలుసా?'
'నా జీవితంలోనా?'
'అవును. మీ చిన్నాన్న చనిపోయాడని చెప్పి నిన్న మీరు సెలవు పెట్టి వెళ్ళాక - మిమ్మల్ని చూడ్డానికి ఆయనే ఆఫీసుకి వచ్చారు.'


'దేవుడిని నమ్మి బాగుపడ్డామన్నవాళ్ళు తారసపడలేదు కానీ - దేవుడిని నమ్మేదిలేదంటూ లాభపడ్డవాళ్ళు బోలెడుమంది కనబడుతుంటారు.'

'ఉన్నతస్థానానికి చేరుకోవడం ఎంతో కష్టం. చేరుకున్న తరవాత ఆ స్థానాన్ని పదికాలాపాటు పదిలపరచుకోవడం మరింత కష్టం.'



" ఎవరికయినా వారి అవసరానికి యెంత సాయం చేసినా వెంటనే మరచిపో - ఇతరులు చేసిన సాయం యెంత చిన్నదయినా జీవితాంతం గుర్తుంచుకో "




" మనిషి ఏడుస్తూ పుట్టింది - నవ్వుతూ చనిపోవడానికి "
-భండారు శ్రీనివాసరావు

NOTE: All images in this blog are copy righted to their  respective owners

ఇంకానా! ఇకపై సాగదు! - భండారు శ్రీనివాసరావు

ఇంకానా! ఇకపై సాగదు!    - భండారు శ్రీనివాసరావు



రాను రాను - సామాన్యుడనే వాడికి - ఓటు వెయ్యడం మినహా ఏ ‘హక్కూ’ లేకుండా పోతోంది. కానీ, అతడ్ని అడ్డం పెట్టుకుని బతికేవారికి మాత్రం అన్ని హక్కులూ - హక్కుభుక్తమై పోతున్నాయి.




నిజానికి, పార్టీలూ,పర్టీల నాయకులూ, అమాత్యులూ, అధికారులు,ఉద్యోగులు, పోలీసులూ, అందరూ ప్రజల్లో భాగమే. ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. ఎదిగో - ఎన్నికయ్యో, హక్కులు సాధించుకుని అధికారం చెలాయిస్తున్నారు. సామాన్యులు ఎలాంటి హక్కులూ లేకుండా కునారిల్లుతున్నారు. అదే తానులోంచి వచ్చిన వాళ్ళు మాత్రం వృత్తుల పేరిటా, ఉద్యోగాల పేరిటా,సంఘాలు పెట్టుకుని, హక్కుల పోరాటాల పేరుతో లేని అధికారాలు అనుభవిస్తున్నారు. పై పదవులకు నిచ్చెనలు వేసుకుంటున్నారు.

సంఘాల కుంపట్లు పెట్టుకోని వర్గాలు ఈనాడు కాగడాలు వేసి గాలించినా కనిపించవు. ఎన్జీవోలకు సంఘాలున్నాయి. ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులకు అసోసియేషన్లు ఉన్నాయి. రిక్షాలు లాగేవారికే కాదు, విమానాలు నడిపేవారికీ యూనియన్లు ఉన్నాయి. అమ్మేవారికి, కొనేవారికి సమాఖ్యలున్నాయి. రాసేవారికి, ఆ రాసిన వాటికి అచ్చేసేవారికీ సంస్థలు ఉన్నాయి. ఆడవారికీ, భార్యాబాధితులకు సయితం సమాజాలున్నాయి. వృత్తుల వారీగా, కులాలవారీగా, మతాలవారీగా ఎవరి సంఘాలు వారికి ఉన్నాయి. వీటన్న్టిటికీ, సొంతంగా ఏర్పరచుకున్న హక్కులు ఉన్నాయి. లేకపోయినా, వాటికోసం పోరాడగల యంత్రాంగ వ్యవస్తలున్నాయి.భావాలను విప్పిచెప్పగల గళాలు ఉన్నాయి. వాటిని ప్రజలకు చేరవేసే మాధ్యమాలు ఉన్నాయి. హక్కుల సాధనకోసం సమ్మెలు, బంద్ లు, ఆందోళనలు, నిరసనలు, రాస్తారోఖోలు, రైల్ రోఖోలు, ఘెరావ్ లు, ముట్టడులూ, ఊరేగింపులూ, బైఠాయింపులూ, అటకాయింపులూ, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు, ఇలా ఎన్నో రకాలుగా, ఎన్నెన్నో రూపాల్లో.. సామాన్యుడి సాదారణ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ మరింత దుర్బరంగా మారుస్తూ - పై పెచ్చు తాము పడుతున్న ఈ పడరాని పాట్లన్నీ ఆ సామాన్యుడి కోసమే అని చెప్పి నమ్మించగల టక్కుటమార విద్యలన్నీ వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ లేనివాడు, అసలేమీ లేనివాడు మాత్రం రాజ్యాంగం తనకు కల్పించిన అన్ని రక్షణలకూ తూట్లు పొడుస్తున్న ఈ అస్తవ్యస్త మధ్య చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతూ దిక్కుతోచక విలవిలలాడుతున్నాడు.

రాస్తా రోఖో కారణంగా ఆగిపోయిన అంబులెన్స్

కారణాలు ఏమైనా, హేతుబధ్దత ఎంత ఉన్నా, బంద్ ల వల్లా, రాస్తారోఖోల వల్ల నష్టపోతున్నదీ, కష్టపడుతున్నదీ సామాన్యులే అన్నది నగ్న సత్యం. నిరసనలూ, ఆందోళనల పేరుతో రాజకీయపార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, కార్మిక సంఘాలు, ఇతర సంస్థలూ, ఇష్టారాజ్యంగా నడిరోడ్లపై చేస్తున్న ధర్నాలు, బైఠాయింపులు నిత్యకృత్యంగా మారి జనజీవితాన్ని నరకప్రాయంగా మారుస్తున్నాయన్నది అంతే నిజం.


ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే నెపంతో రోడ్డెక్కుతున్న రాజకీయ పార్టీలు, కార్మికసంఘాలు తమ వైఖరులనూ, విధానాలను పునస్సమీక్షించుకోవాలి. ఏ సామాన్య జనం కోసమైతే ఉద్యమాలు, ఆందోళనలూ, నిర్వహిస్తున్నామని ఆయా పార్టీలూ, సంఘాలు అనుకుంటున్నాయో, ఆ సామాన్య జనాన్నే తమ విధానాలు మరింత చికాకు పరుస్తున్నాయన్న వాస్తవాన్ని అర్దం చేసుకోవాలి. పోరాటాల పేరుతోనో, ఇతరేతర రాజకీయ కారణాలతోనో బడుగుజీవి నడుం విరుస్తున్న ఈ అపబ్రంశపువిధానాలు ఏ నాగరిక దేశంలోనూ కానరావు. సాటి పౌరులకు ఇబ్బంది కలగని రీతిలో నిరసనలు ప్రకటించే పద్ధతులను సభ్యసమాజం పాటించి తీరాలన్న ప్రాధమిక స్పృహ మనదేశంలో కలికానికి కూడా కానరాదు.
ఒకసారి, సూర్యాపేట మీదుగా బస్సులో ఖమ్మం వెడుతుంటే నడుమ దారిలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కారణం వాకబు చేయడానికి వెడితే కొంతదూరంలో ఏదో పార్టీకి చెందిన కార్యకర్త్గలు - పట్టుమని పదిమంది కూడా లేరు. - జండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ నడిరోడ్డు పై ధర్నా చేస్తున్నారు. ‘ఇలా ఎంతసేపు మీ తమాషా చూడాలనిగద్దిస్తే ఒక్క అరగంట ఓపిక పట్టండి సార్! ఫలానా టీవీ వాళ్ళు దోవలో ఉన్నామని ఇప్పుడే సెల్ ఫోన్లో చెప్పారు. అని వాళ్ళనాయకుడు జవాబిచ్చాడు. ఇలాంటి ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోఖోలు ససేమిరా చూపించేది లేదని చానళ్ళన్నీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోగల్గితే మెరుగయిన సమాజం కోసం నిజంగా కృషి చేసినట్టవుతుంది. ప్రచారం కోసం కాకుండా ప్రజాక్షేమాన్ని కోరుకునే సంస్థలు కూడా తమ కార్యకర్తల్ని తక్షణం రంగంలోకి దింపి ‘ఇలా ప్రజలని ఇబ్బందుల పాలు చేసే వారికి దయచేసి ఓట్లు వెయ్యవద్దు అనే ప్లకార్డులను పట్టుకుని మౌనంగా ఆ పక్కన నిలబడితే, నవ్యత్వం కోసం పటుపడే ఛానెళ్ళన్నీ ఆ దృశ్యాలను ఒక్కమారైనా ప్రసారం చేయగలిగితే , ఇంకోసారి ఏపార్టీ, ఏయూనియన్ కూడా ఇలాంటి ఆందోళనలక్ సాహసించదు. కానీ సంచలనం ఒక్కటే సమస్తం అనుకునే ఈ పోటాపోటీ ప్రచార వ్యాపార యుగంలో ఇది నెరవేరని కలే.

కానీ, ఏదో ఒకరోజు ‘సామాన్యుడి రోజు’ కూడా వస్తుంది. నిరసనలని వ్యక్తం చేయడానికి ఎంచుకున్న విధానాల ద్వారా వేలాది మంది ప్రజలను అకారణంగా ఇబ్బంది పెట్టే హక్కు వీరికెవరిచ్చారన్న ప్రాధమిక ప్రశ్న ముందుకు వస్తుంది.


అర్భకుడు, అమాయకుడు అనుకున్న ఈ సామాన్యుడే తిరగబడి ‘ఇంకానా’ ఇకపై సాగదు!’ అంటూ హూంకరిస్తూ - తన జీవితంతో ఆటాడుకుంటున్న ‘వర్గాల’ మెడలు వంచే రోజు తప్పక వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

భండారు శ్రీనివాసరావు

NOTE: All images in this blog are copy righted to their respective owners

చిక్కు సమస్యలు - చిరు పరిష్కారాలు - భండారు శ్రీనివాసరావు

చిక్కు సమస్యలు - చిరు పరిష్కారాలు   - భండారు శ్రీనివాసరావు
యాభయ్ ఏళ్ళక్రితానికి - ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనబడే మార్పు ఏమిటి? అని అడిగితే - ఆ రోజుల్లో సినిమా హాళ్ళలో చుట్ట - బీడీ సిగరెట్లు తాగేవారు - ఇప్పుడది లేదని - ఆరు పదులు వయసు దాటిన వారెవరైనా జవాబు చెబుతారు.


అప్పటికీ - ఇప్పటికీ పొగత్రాగేవారి సంఖ్య తగ్గిందా అంటే అదీ లేదు. సినిమా హాల్లో సిగరెట్ తాగితే జరిమానా వేస్తామని బెదిరించారా అంటే అదీ లేదు. అన్ని సినిమా హాళ్ళ వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి కట్టుదిట్టం చేశారా అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. పొగరాయుళ్ళను పట్టుకుని కౌన్సిలింగ్లూ గట్రా నిర్వహించారా అంటే అదీ లేదు. ప్రేక్షకులతో సమావేశాలు ఏర్పాటు చేసి పొగత్రాగవద్దని క్లాసులు తీసుకున్నారా అంటే ఆ దాఖలాలూ లేవు. మరి పొగత్రాగందే పట్టుమని పది నిమిషాలు ఓపలేని ధూమపాన ప్రియులు సిగరెట్ల జోలికి పోకుండా సినిమాలు ఎలా చూస్తున్నారు?

ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే. ప్రజల్లో ఓ సుగుణం ఉంది. అది చూసి నేర్చుకోవడం. డేరా టూరింగ్ టాకీసులూ,రేకుల సినిమా హాళ్ళ కాలం ముగిసి ఎయిర్ కండిషన్ థియేటర్ల కాలం మొదలు కాగానే సినిమా హాళ్ళలో పొగత్రాగడం మంచిది కాదని పక్క వాళ్ళని గమనిస్తూ ఎవరికి వారే తెలుసుకున్నారు. ఈ సూత్రాన్నే ట్రాఫిక్ అధికారులు గమనించి అమలు చేస్తే సమస్యలకు సగం పరిష్కారం లభిస్తుంది. లేని పక్షంలో - ఒక దినపత్రిక పేర్కొన్నట్టు -" సమస్యమీదే - పరిష్కారం మీదే మేం నిమిత్త మాత్రులం - ఇదీ ట్రాఫిక్ పోలీసుల వరుస" అనే విమర్శల తాకిడిని తట్టుకోక తప్పదు.

హైదరాబాదులో ట్రాఫిక్

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ని చక్కదిద్దడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. కాకపోతే , అందుకోసం తీసుకుంటున్న చర్యలేమిటన్నదే జవాబు లేని- రాని ప్రశ్న.

ట్రాఫిక్ అంశాలపై ఏర్పాటు చేసిన సదస్సులు - సమావేశాల్లో పౌరులు ఏదయినా చెప్పబోతే `సమస్యలు చెప్పమంటే, సలహాలు చెబుతున్నారని' కొందరు అధికారులు విరుచుకు పడిన తీరు గమనిస్తే వారి అసహన వైఖరి తేటతెల్లమవుతుంది. అవగాహన కల్పించే తీరు సరిగా లేదేమో అనిపిస్తుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న చర్యలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదని వారు గ్రహించాలి. అన్నింటికంటే ముందు చేయాల్సింది - ట్రాఫిక్ అధికారులు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడం.

రోడ్డు దోపిడీ

 హెల్మెట్లు, సీటు బెల్టులవంటి నిబంధనల అమలుకు తీసుకుంటున్న శ్రద్ధని - కొంతకాలం పాటయినా - ట్రాఫిక్ని చక్కదిద్దడానికి మరల్చాలి. ఎక్కడ - ఏ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందో అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని - ఆయా కూడళ్ళలో - అవుట్ సోర్సింగ్ పద్ధతిపై నియమించాలి. ఈ సిబ్బంది కయ్యే ఖర్చుని ఆయా కూడళ్ళ చుట్టు పక్కల ఉండే దుకాణాలు, నివాస సముదాయాలనుంచి పారదర్శక పద్ధతిలో వసూలు చేయాలి.





రోడ్లు దాటడానికి రాజధాని నగరంలో అనేక చోట్ల ఫుట్ వోవర్ బ్రిడ్జీలు నిర్మించారు. ప్రకటనలకు మినహా - వాటిని జనం ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. స్త్రీ, బాల, వృద్ధులు ఆ వంతెనలు ఎక్కలేరు. ఎక్కగలిగిన వారు, ఎక్కనే ఎక్కరు. అందువల్ల వాటిని మరింత ఉపయోగంలోకి తీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి. అందుకయ్యే వ్యయాన్ని కొద్ది కొద్దిగా వినియోగదారుల నుంచి రుసుము రూపంలో రాబట్టుకోవాలి. ఇలాటి ఏర్పాట్లకి వీలులేనిచోట్ల ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అనేక రద్దీ కూడళ్ల వద్ద రోడ్డుదాటలేక అవస్తలు పడేవారు అనేకమంది కనిపిస్తుంటారు. భవసాగరం కంటే రోడ్డు దాటడమే కష్టంగా భావిస్తుంటారు.ఇలాటి సంగతి పట్టించుకునే నాధుడు కనబడడు.
 బాగా అభివృద్ధిచెందిన ప్రపంచ నగరాలలో అయితే, రోడ్డుదాటడానికి పుష్ బటన్ వ్యవస్తలు వుంటాయి.


రోడ్డుపక్కన వున్న పుష్ బటన్ నొక్కగానే -



రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా దీపం వెలుగుతుంది.



దానితో ఎక్కడి వాహనాలు అక్కడే టక్కున ఆగిపోతాయి.

అంతేకాకుండా
 విద్యుత్ తో కూడా పని లేకుండా - జండాలను ఉపయోగించే ఒక విధానం అమల్లోవుంది. అదేమిటంటే- రోడ్డుకు ఇరువైపులా బాస్కేట్లలో కొన్ని జండాలను ఉంచుతారు. రోడ్డుదాటాలనుకునేవారు ఆ జండాను తీసుకుని ఊపుకుంటూ వెళ్లిపోవచ్చు.

ఎంచక్కా రోడ్డు దాటగానే


అవతలవైపు వున్న బాస్కేట్లో వుంచి తమదారిన వెళ్లిపోవచ్చు.


ఇలాగే, మరికొన్ని ఖర్చులేని పద్దతులు అమలుచేయవచ్చు.

ప్రైవేటు విద్యా సంస్థల వద్ద నిర్మించిన వంతెనల పూర్తి వ్యయాన్ని ఆ సంస్థల నుంచే వసూలు చేయాలి. విద్యార్ధుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు పిండుతున్న ఆ సంస్ధలకి ఇదేమంత పెద్దభారం కాబోదు.

థియేటర్లు, పాఠశాలలు, ఆఫీసుల వేళల్లో తగుమార్పులు చేయడం ద్వారా, ఒకే సమయంలో, ప్రజలు, వాహనాలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడం వీలుపడుతుంది.

కనిపించిన చోటల్లా `నోపార్కింగ్' బోర్డులు పెట్టకుండా పార్కింగ్ కి అనువయిన స్ధలాలని ముందుగా గుర్తించాలి.


అంతకంటే ముందు
పోలీసు వాహనాలు `నోపార్కింగ్' ప్రదేశాల్లో నిలపకుండా చూడాలి

ప్రయివేటు బస్సులని ఎలాగూ అదుపు చేయలేరు కనుక - రాత్రి సమయాలల్లో కొన్ని కొన్ని విద్యాసంస్తలకున్న ఖాళీ జాగాలలో ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వాలి.


 ఇందుకోసం వసూలు చేసే రుసుముని ఆయా విద్యా సంస్తలకే ఇవ్వాలి. ఇలాచేయడంవల్ల అనేక ప్రాంతాలలో రాత్రివేళల్లో ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి.

స్కూళ్ళకీ, ఆఫీసులకీ వెళ్ళే బిజీ సమయాల్లో చెకింగ్లు జరిపే పద్ధతికి స్వస్తి చెప్పాలి. సిగ్నల్ జంపింగ్ చేసే వాహనదారులను పట్టుకుని భారీ జరిమానాలు విధించాలి. రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని ` వీ ఐ పీ ' ల పర్యటనల వేళల్లో మార్పు చేయాలి.

ఇవన్నీ చేసినా, సమస్య నూటికి నూరుపాళ్లు పరిష్కారం కాకపోవచ్చు. కానీ పరిస్థితి కొంతలో కొంత మెరుగు పడడానికీ , పోలీసుల పట్ల ప్రజలకున్న అవగాహన, అభిప్రాయాల్లో సానుకూల మార్పు రావడానికే ఈ చర్యలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి.


భండారు శ్రీనివాసరావు

NOTE: All images in this blog are copy righted to their respective owners

12, ఆగస్టు 2010, గురువారం

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ? - భండారు శ్రీనివాసరావు

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ? - భండారు శ్రీనివాసరావు


కిరోసిన్ లాంతరు  

మా తాత గారి కాలం నాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా - కరెంట్‌ బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.
పాతకాలం రేడియో

మా నాన్న గారి కాలం వచ్చేసరికి కరెంట్‌ రాలేదు కానీ - రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి. కాకపోతే ఆ రేడియోలు - మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.

బొగ్గు, నీటి ఆవిరితో నడిచే రైలు ఇంజిను

మా వూరి మొత్తం జనాభాలో- ఆరోజుల్లో - యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప- రైలుని చూసిన వాళ్ళు కానీ, బస్సు ఎక్కిన వాళ్ళు కానీ, మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వారు.
ఇక మా అమ్మ-


కట్టెల పొయ్యి

కట్టెల పొయ్యి ముందు కూర్చుని - పొగచూరిన వంటింట్లో పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట - కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి.

నుయ్యి లేక నీళ్ళ బావి

 ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగావేసి పాలకుండని వాటిపై ఉంచి - పైన ఒక రాతిపలకని కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై - అరచేతి మందాన మీగడ కట్టేది. మర్నాడు - ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు.



 మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టే వాళ్ళు . ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి- ఆటల్లోకి జారుకునే వారు. మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే - అంట్లగిన్నెలు సర్దేసి - వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టే వారు. రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈపనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. వాటితో పాటు శ్రమతెలియకుండా పాటలు పాడుకుండేవారు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.

ఇక మారోజులు వచ్చే సరికి - రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి - గ్యాస్‌ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్‌ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి.

పుల్ల కలం

 కరక్కాయ సిరాలు- పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్‌ పెన్నులుగా, బాల్‌పాయింట్‌ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్కకాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది.

బేడ నాణెం అంటే రూపాయిలో ఎనిమిదోవంతు    

 బేడలూ, అర్ధణాలూ, కాసులూ, చిల్లికాసులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్‌ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్ళు కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్‌ రాళ్ళు రోడ్లపై వెలిసాయి. ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు నిత్యకృత్యంగా మారి - అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోతున్నాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.
ఆరోజుల్లో సెలవులు ఇస్తే చాలు - పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తే వాళ్ళు. ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు- ఒకటేమిటి - ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని- ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని - పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్ళు.

ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి - మాయాబజారు సినిమాలో మాదిరిగా - కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ - ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు - ఆడిన ఆటలు, పాడిన పాటలు - కనురెప్పలకిందే కరిగి పోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.

జొన్న చేను

ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే - జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ
లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం-
రోజూ తినే వరి అన్నానికి - ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి - పని వాళ్ళు వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం-
కళ్లాల„సమయంలో - కొత్త వడ్లు కొలిచి - కొనుక్కుతినే కట్టె మిఠాయి-
సాయంత్రం చీకటి పడేవేళకు - మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు-వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ-
ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒక నాడు వున్నాయని అన్నా -



 కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు నమ్ముతారా?? కళ్లతో చూసిందే నమ్ముతాం అని వాళ్లంటే మీరేం చేస్తారు?



NOTE: All images in this blog are copy righted to their respective owners






























































..........................................

దేశం వెలిగిపోతోంది! - భండారు శ్రీనివాసరావు

దేశం వెలిగిపోతోంది!  - భండారు శ్రీనివాసరావు - (2008)


టీవీ ఛానళ్ళు  వీక్షించే అలవాటు అంతగా లేని నాకు దేశం వెలిగిపోతోంది అన్న ఈ నిజం బోధపడడానికి చాలా ఆలస్యం అయిందనే చెప్పాలి. ఈ మధ్య ఎండలు పేట్రేగి పోవడంతో పగలు కాలు బయట పెట్టడానికి దడిసి ఇంట్లోనే కూర్చుని మా ఆవిడతో కలసి తీరుబాటుగా టీ వీ  చూసే అవకాశం కలిగింది. కరెంటు కూడా అంతరాయం లేకుండా సరఫరా అవుతుండడం వల్ల నా యీ నిరంతర టీ వీ వీక్షణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఎల క్షన్లు కదా! కరెంట్‌ ఇవ్వక ఏం చేస్తాడు రాజశేఖరరెడ్డి ! అంటూ మెటికలు విరుస్తాడు మా సుబ్బారావు. అంత మాత్రాన మా వాడు హార్డ్ కోర్‌ టీ డీ పీ మనిషని మనం పొరపాటు పడితే అది నిజంగా మన పొరపాటే! ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మా సుబ్బారావుది ఇదే వరస. వాళ్ళింట్లో పనిమనిషి నాగా పెట్టినా, వంటగ్యాస్‌ అయిపోయినా, స్కూటర్‌ టైర్‌ పంక్చర్‌ అయినా దానికి కారణం చంద్రబాబు అధ్వాన్నపు పరిపాలనే అని స్టేట్‌ మెంట్లు ఇచ్చే వాడు. అందుకే మా సర్కిల్లో వాడ్ని ఎవర్‌ గ్రీన్‌ యాంటీ ఇంకంబెంట్‌ అని పిలుస్తుంటాము. పది, పదిహేనేళ్ళ వరకూ మాలో చాలా మందికి ఈ ఇంగ్లీషు పదానికి సరైన అర్ధం తెలిసి చచ్చేది కాదు. కాకపోతే ప్రీ పోల్‌ సర్వే - పోస్ట్ పోల్‌ సర్వేలంటూ బయలు దేరిన 'సర్వే'జనా సుఖినోభవంతుగాళ్ళ పుణ్యమా అని ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనే దాన్ని గురించి మాకు బాగా వంట బట్టింది.
సరే! మా సుబ్బారావు యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్‌ సంగతి అలా ఉంచి - దేశం వెలిగిపోతోందనే విషయానికి వద్దాం!

వెనుకటి రోజుల్లో భారతదేశం ఎంత దరిద్రగొట్టుదో తెలుసుకోవాలంటే బీ బీ సీ చూడాలనేవారు. వాళ్ళు  చూపించే డాక్యుమెంటరీల్లో మన దేశపు పసి పిల్లలు డొక్కలెండుకుపోయి - అన్నమో రామచంద్రా అని అలమటిస్తూ కాన వచ్చేవారు. పందులు తిరిగే సందులు, పూరిగుడిసెలు, ఆకలి, హాహాకారాలు వాటిల్లో పుష్కలంగా కానవచ్చేవి. అవి చూసి మన దేశం ఇంత దరిద్రంగా ఉందా అని అనుమాన పడేవాళ్ళం మా చిన్నతనంలో. ఇక ఇప్పుడు టీ వీ ల వరుస చూస్తే దేశంలో దరిద్రం అన్నది మచ్చుకు కూడా లేదనిపిస్తుంది.

ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలతో,చుట్టూరా  పచ్చదనంతో పరిఢవిల్లేలా కళ్ళకు కట్టినట్టు చూపించే  రియల్‌ ఎస్టేట్‌  ప్రాయోజిత కార్యక్రమాలు,

 'వండుకు తిందాం రండి ' వంటి ప్రోగ్రాముల్లో పెళ్ళిళ్లు , పేరంటాళ్ళలో కట్టుకునే అతి ఖరీదయిన చీరలు ధరించి, 'ఇలా చేసి మాడండి' వంటకాలు వండుతూ కనిపించే ఆడంగులు, నేరేడు పండ్లని ముక్కుతో పట్టి నోటితో ఎన్ని తినగలరన్న పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనే శాల్తీల తాలూకు అపార్ట్మెంట్లలో బ్యాక్‌ గ్రౌండ్‌లో కానవచ్చే ఖరీదుకట్టలేని ఫర్నీచర్‌ ,

 'పంచపాండవులెంతమంది! నలుగురా! ముగ్గురా! అయిదుగురా! సరిగ్గా సమాధానం చెప్పేవారికి ఈ బంగారం అంతా మీదే ' అంటూ భ్రమలు కల్పించి బంగారులోకంలో విహరింపజేసే కార్యక్రమాల్లోని సెట్టింగులు -

వీటిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది?  'దేశం వెలిగిపోతోంద'ని అనిపించడం లేదా?
ఈ నిత్య  నూతన నిరంతర వార్తా స్రవంతుల మధ్య-
కోటి రూపాయల అపార్టుమెంట్లు - ఘుమఘుమల రెస్టారెంట్లు,


 వొళ్లు తగ్గించుకోవడానికి శతకోటి చిట్కాలు,  కళ్ళు  బైర్లుకమ్మే షాపింగ్‌  మాల్స్, క్లబ్బులు, పబ్బులు, మల్టీప్లెక్సులూ-




పట్టకారు కొనుక్కోండి అన్నంత సులభంగా ఈ కొత్త మోడల్‌ కారు కొనుక్కోండి అనే అర్ధగంట ప్రకటనలూ - ఇవన్నీ చూస్తున్నప్పుడు కూడా దేశం వెలిగిపోవడం లేదన్న భావం కలిగితే నిజంగా లోపం మనలోనే వుందనుకోవాలి.
కానీ మరొక్క విషయం టీ వీ ఛానళ్ళ కార్యక్రమ నిర్వాహకులు ఆలోచించుకుంటే బాగుండనిపిస్తోంది.

 ఇన్నిన్ని కార్యక్రమాల్లో ఇన్నిన్ని ధగధగలు చూపిస్తూ మరోప్రక్క నేరాలు - ఘోరాలవంటి కార్యక్రమాల్లో కూతుర్ని రేప్‌ చేసిన కామంధుడంటూ దిగువ తరగతి వారికి సంబంధించిన కధనాలు మాత్రమే ఎందుకు ప్రసారం చేయాల్సి వస్తోంది? ఉన్నతశ్రేణి వర్గాల్లో ఈ ఘోరాలు జరగవా? జరిగినా బయటకురావా? వచ్చినా, ప్రసారాలకు పనికిరావా?

కధ చెబుతా - ఊ కొడతారా  


తాజా తోక
ఇలాంటి నేర ఘోర కార్యక్రమాల ప్రాయోజికుల రూపం, హావభావాలు, ఉచ్ఛారణ కరడుగట్టిన నేరస్తులను తలపించేలా ఉండి తీరాలన్న రూలేమైనా ఉందా?
భండారు శ్రీనివాసరావు
21-5-2008

NOTE: All the images in this blog are copy righted to the respective owners

11, ఆగస్టు 2010, బుధవారం

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు


వెనుకటి రోజుల్లో -







రేడియో ఒక్కటే రాజ్యమేలుతున్న కాలంలో-

ఒక పెద్ద మనిషి నేను పనిచేస్తున్న ఆకాశవాణి కార్యాలయానికి ఫోన్ చేసి, ' మీ రేడియో వార్తలు వినలేక చస్తున్నాము ' అన్నాడు కోపంగా.

'పరిష్కారం మీ చేతుల్లోనే వుందికదా' అన్నాను జవాబుగా.

ఇందులో సమాధానం కన్నా ఎకసక్కెం పాలు ఎక్కువ వుందనుకున్నాడో ఏమో - 'ఎలా?' అన్నాడు మరింత కోపంగా.

'మీ రేడియో నాబ్ ని ఎడమవైపు తిప్పండి సరిపోతుంది.' అన్నాను కూల్ గా.

రేడియో పెట్టుకోవడం, ఆపుచేసుకోవడం మీ చేతుల్లో పనే కదా! అన్నట్టుగా ధ్వనించిన నా జవాబులో - ఏదయినా చమత్కారం తోచిందో ఏమో కాని, 'భలే వారే' అంటూ ఫోన్ పెట్టేసాడా శ్రోత.

మీడియాలో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి అనుభవాలు మామూలే.



అయితే- ఎంతో కష్టపడి ప్రోగ్రాం తయారుచేసామనే భావనతో వుండే సిబ్బంది - విమర్శలను తట్టుకోలేకపోవడం కూడా సహజమే. కానీ, ఇక్కడ మరో నిజం కూడా ఒప్పుకోవాలి. వ్యంగాస్త్రాలను అలవోకగా సంధించగల మీడియా వారు కూడా కొండకచో వ్యంగాన్ని భరించలేరు. కొన్ని పాళ్ళు స్వామి భక్తీ, కొన్నిపాళ్ళు వృత్తిమీది అనురక్తి - కలగలసి వారినలా మారుస్తుంది. అయితే- విమర్శలు చేసేవారికి - వాటిని స్వీకరించగల సహృదయత వుండాలనుకోవడం అత్యాశ కాదేమో!
ఆలోచిస్తే తప్పేముంది?

- భండారు శ్రీనివాసరావు

NOTE: All Images in this blog are copy righted to their respective owners.