bhandaru srinivasarao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bhandaru srinivasarao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఆగస్టు 2010, ఆదివారం

ఒకటి పక్కన పన్నెండు సున్నాలు – భండారు శ్రీనివాసరావు

ఒకటి పక్కన పన్నెండు సున్నాలు – భండారు శ్రీనివాసరావు


పత్రికల్లో గమనించారో లేదో సంఖ్యలు కొట్టొచ్చినట్టు కనబడడానికి అంకెల్లో రాస్తుంటారు.

ఉదాహరణకు వర్షాలు వరదల కారణంగా లక్ష మంది నిరాశ్రయులయ్యారు అని రాయడానికి 100000 మంది అని పేర్కొంటారు.అలాగే ప్రభుత్వ పక్షం వారు అసెంబ్లీకి సమర్పించే గణాంకాల్లో కూడా ఈ చమత్కారాలు తొంగి చూస్తుంటాయి. అల్లర్లలో అరెస్టులు గురించి చెప్పాలంటే – యాభయ్, వందా అని క్లుప్తంగా లాగించేస్తారు. బలహీనవర్గాలకు ఇళ్ళ పంపిణీ గురించి చెప్పేటప్పుడు 30 00000 మందికి ఇచ్చాం అని ఘనంగా ఉద్ఘాటిస్తారు.ఇక ప్రతిపక్షాలు – ‘మృతుని కుటుంబానికి 1000000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాల’ని డిమాండ్ చేస్తాయి.

ఈ విషయాలు పక్కనబెట్టి అసలు విషయానికి వద్దాం.

సున్నా స్వగతం : పక్కన నేనున్నప్పుడే కదా ఎవరికయినా విలువ ? 

ఒకటి పక్కన పన్నెండు సున్నాలు అంటే ఇంగ్లీష్ లో ‘ట్రిలియన్’ అంటారు. సంఖ్యలని లెక్కపెట్టడానికి మిలియన్, బిలియన్, ట్రిలియన్ ఇలా లెక్కించే విధానం పాశ్చాత్య దేశాల్లో అమల్లో వుంది. నాలుగు ట్రిలియన్లు అంటే నాలుగు పక్కన పన్నెండు సున్నాలు పెట్టాలి. 2008 లో ప్రపంచ దేశాలలోని జనాలు పరస్పరం పంపుకున్న ‘ఎస్ ఎం ఎస్’ లకు ఇది సమానం.

ఇదొక లెక్కమాత్రమే. అసలు లెక్క ఇంకాస్త ఎక్కువే కానీ ‘సున్నాల’ గందరగోళం ఎక్కువై అసలు ‘విషయం’ గుండు సున్నా అవుతుందేమోనని ఇవ్వడం లేదు. ఈ రెండేళ్లలో ఇంకా ఎంతకు పెరిగివుంటుందో వూహించుకోవచ్చు.

పల్లెటూళ్ళకు కూడా పాకిన ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల కధాకమామిషూ ఏమిటో ఓసారి చూద్దాం.
లోకం చుట్టిన వీరుడు


ఈ శతాబ్దంలో అత్యంత వేగంగా నేలనాలుగు చెరగులనూ చుట్టబెట్టిన ఏకైక ఆధునిక పరికరం ఏమిటంటే సెల్ ఫోన్ అని ఇట్టే చెప్పెయ్యొచ్చు. ఓ ఇరవయ్యేళ్ళ క్రితంవరకూ ఎవరికీ తెలియని ఈ ‘బుల్లి పరికరం’ ఈనాడు ‘హస్తభూషణం’ గా తయారయి కూర్చుంది. ‘ఇంటికి ఒక్క ఫోనే’ అబ్బురమనుకునే దేశంలో – ఇంట్లోవున్న నలుగురూ ‘నాలుగు ఫోన్లు – ఎనిమిది రింగులుగా ‘ కాలక్షేపం చేసే కాలం వచ్చేసింది. కుటుంబ సభ్యుల నడుమ మాటా మంచీ తగ్గిపోయి – ముక్కూ మొహం తెలియని వారితో మాటా మంతీ పెరిగిపోయింది.



- 635 510 000-
 అంటే ఫోన్ నెంబర్ అనుకునేరు – ఒక లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి మన దేశంలోని మొబైల్ ఫోన్ ల సంఖ్య ఇది. అమెరికాలో వాడే సెల్ ఫోన్లకంటే రెండు రెట్లు ఎక్కువ.

యెంత దగ్గరో - అంత దూరమూ


మొబైల్ ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడానికే కాదు, సందేశాలు కూడా పంపుకోవడానికి కూడా వీలు వుండడంతో వీటి గిరాకీ మరింత పెరిగిపోయింది. ఈ ఫోన్లు రంగప్రవేశం చేసిన తొలినాళ్ళలో ఈ సౌకర్యం వుండేది కాదు. మొదట జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఈ దిక్కుగా ఆలోచించాయి. ఆ దేశాల ఫోన్ కంపెనీలు చేసిన కృషి ఫలితంగా – 1992 డిసెంబర్ మూడో తేదీన మొట్ట మొదటి ‘ఎస్ ఎం ఎస్ ‘ ఇంగ్లండ్ లోని నీల్ పాప్ వర్త్ అనే ఒక వ్యక్తి నుంచి వొడా ఫోన్ ద్వారా వెళ్ళింది.


’హ్యాపీ క్రిస్మస్’ అనేది ఆ మొట్టమొదటి ‘ఎస్ ఎం ఎస్’


  అప్పటినుంచి ఈ చిట్టి పొట్టి సందేశాల ‘సాంకేతిక పిట్ట’ ప్రయాణం ఎదురులేకుండా సాగిపోయింది. అన్నిరకాల మొబైల్ ఫోన్ పరికరాలకు పనికివచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో – ‘ఎస్ ఎం ఎస్’ ల విశ్వవిహారం మొదలయింది. ఇంగ్లండ్ లో 2006 డిసెంబర్  లో క్రిస్మస్ పండుగ సందర్భంగా – ఒకే ఒక్కరోజున - యిరవై కోట్ల పైచిలుకు ‘ఎస్ ఎం ఎస్’లు - పండుగ  శుభాకాంక్షలు తెలుపుతూ - ‘ఫోన్లు మారాయి.’

ఈ లెక్కన ఈ లెక్కలు ఇప్పటికి ఎంతగా పెరిగాయన్నది లెక్కలు కట్టాల్సివుంది.

కానీ ఇలాటి లెక్కలు తీ సేవాళ్ళు చెప్పిన ఒక లెక్క ప్రకారం – 2006 నాటికే ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా ఎనభై బిలియన్ డాలర్లు దాటిపోయింది.

అమెరికా లాంటి దేశాల్లో వినియోగదారుల నుంచి ఒక్కొక్క ‘ఎస్ ఎం ఎస్’ కు పదకొండు సెంట్లు వసూలు చేస్తున్నారు. మరి ఈ ‘వసూలు రాజాల’ కు ఇందుకయ్యే ఖర్చు ‘చిల్లి సెంటు’ కూడా వుండదు. దీన్ని నిలువు దోపిడీ అనాలా లేక అదనపు సదుపాయం కల్పిస్తున్నందుకు వసూలు చేస్తున్న ‘అదనపు’ చార్జీ అనాలా! బియ్యం మిల్లు యజమానులకు ‘తవుడు’ అప్పనంగా మిగిలినట్టే, ఈ కంపెనీలకు ఇదొక అదనపు ఆదాయం.

ఇందులో ‘ఇంత’ వుంది కాబట్టే – ఈ ‘ఎస్ ఎం ఎస్ ‘ ల పేరుతొ ఇన్నిన్ని స్కీములు, ఇన్నిన్నిగేములు.

 వినియోగదారుల్ని వల వేసి పట్టుకుందుకు ఇన్నిన్ని ' గేలాలు' 

పేలాలు పంచి పప్పులు దంచుకునేందుకు ఇంకెన్నో టక్కు టమారాలు.

‘పట్టుకుంటే పట్టు చీరె’ నుంచి ‘ఆటాడుకుందాం రా’ వరకు అన్నే ‘ఎస్ ఎం ఎస్’ గేములే.

ప్రతి టీవీ చానల్ లో ప్రతి అంశం మీదా ‘ప్రజాభిప్రాయసేకరణలే. ‘ఎస్ ఎం ఎస్’ లు పంపాలని కోరని చానల్ తెలుగునాట కలికానికి కూడా కానరావడం లేదు.

పైగా ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల కు వసూలు చేసే చార్జీ ఒకటికి నాలుగు రెట్లు ఎక్కువ. కానీ తియ్యటి నీటికి చేపలు ఎగబడే చందంగా – ఎవరికివారు పోటీలు పడి తమ ‘మొక్కుబళ్ళు’ చెల్లించుకుంటున్నారు. ఎవరి బాగుకోసం ఇదంతా. ఎవర్ని బాగుచేయడం కోసం ఇదంతా.

బహుళ జాతి కంపెనీల మీద నిలువెత్తున ఎగిరిపడే వాళ్ళు కూడా – చాపకింద నీరులా వ్యాపిస్తూ, సామాన్యుల నడ్డి విరుస్తున్న ఈ ‘ఎస్ ఎం ఎస్’ – వ్యాపార ధోరణులపై ఎందుకు చూపు సారించడం లేదో ఆలోచించాల్సిన విషయం.

టీవీ చానళ్ళు సయితం ఈ సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తూ వున్నాయో, ఇందులోని వ్యాపార ‘మర్మం’ ఏమిటో వెల్లడి చేస్తే బాగుంటుంది.

కానీ ఇది జరిగే పనేనా!

‘తప్పులెన్నువారు తమ తప్పులు ఒప్పుకుంటారా!’

NOTE: All images in this blog are copy righted to the respective owners

14, ఆగస్టు 2010, శనివారం

స్వయంకృతాపరాధాలు - భండారు శ్రీనివాసరావు

 స్వయంకృతాపరాధాలు  - భండారు శ్రీనివాసరావు

యోగి వేమన

‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నాడు వేమన. అలాగే - ‘విభక్తుల్లో సంబోధనా ప్రథమా విభక్తి’ తరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కాలవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ‘ఒసే’ అనడం - తండ్రిని ‘ఒరే’ అనడం ఈ మధ్య సినిమాల్లో షరా మామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగా, వడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతుంది.



  

బాపుగారికి క్షమాపణలతో

వెనుకటి రోజుల్లో పిల్లలు ఒకర్నొకరు సరదాగా ‘గురూ-గురూ’ అని పిల్చుకుంటూ ఉంటే విని పెద్దలు గుర్రుమనే వారు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి - బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది.ఇంట్లో అమ్మా అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం అమ్మగారూ అంటూ గౌరవంగా చెప్పుకునే వారు. ఉత్తరాలు రాసేటప్పుడు - గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి అనో, పూజ్యులైన తాతయ్యగారికి అనో వినమ్రత కనబరిచే వారికి వినయాన్ని సంస్కారంగా, విధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునేవారు. సభ్యతా, సంస్కారాలక్కు అదే కొలమానంగా భావించేవారు.


ఇక, పత్రికల్లో వాడే భాష, సినిమాల్లో వినిపించే సంభాషణలు, చట్టసభల్లో జరిగే చర్చలు, చాలా వరకు పరిధులకు, ప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలు, వార్తలు గిరి గీసుకుని, మడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానంగా చెబుతాయన్న నింద తప్ప - సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు.

కోరికలే జిరాఫీలయితే

కానీ, కాలం ఒక్క తీరుగా ఉండదు కదా!జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టి, తరాలను బట్టి మారిపోతుంటాఅయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడం, అమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత ‘వేగవంతం’ చేయడంలో ఈనాటి ‘ఎ టూ జెడ్’ చానెళ్ళు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.
ఓరి భడవా?
తరాలు మారుతున్నప్పుడు - వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు - రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి.

 మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే - ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతోంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వైరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను 'ఒసే' అనడం, నాన్నను 'ఒరే' అనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్ళకు, పత్రికలకు, పుస్తకాలకు, చట్టసభలకు విస్తరించి - సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు - చెప్పే మాటల్లో, ప్రవచించే పలుకుల్లో, రాసే రాతల్లో - సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు - ఈనాటి సినిమాలే! ఈనాటి ఛానళ్ళే! ఈనాటి పత్రికలే! ఈనాటి పుస్తకాలే! ఈనాటి చట్ట సభలే!
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళుండరు.రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్ళు మిగలరు
పాలితులను బట్టే పాలకులు- పాఠకులను బట్టే పత్రికలు - ప్రేక్షకులను బట్టే సినిమాలు - వీక్షకులను బట్టే ఛానెళ్ళు.


ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

NOTE: All images in this blog are copy righted to respective owners

మాట్లాడడం అంటే మాటలు కాదు - భండారు శ్రీనివాసరావు

మాట్లాడడం అంటే మాటలు కాదు - భండారు శ్రీనివాసరావు

'మౌనమే నీ భాష ఓ మూగవదనా!'

నిజానికి అరవై నాలుగు కళల్లో ఇది ఒకటి.ఇది నిజమో కాదో తెలియకపోయినా ఇలాంటి స్టేట్మెంట్లని అలవోకగా, ఘంటాపధంగా ఇవ్వగల కళలో ఆరితేరినవరే గట్టి వక్తలుగా పేరు తెచ్చుకోగలుగుతారు. పెళ్ళిళ్ళల్లో -పబ్బాల్లో నలుగుర్ని చేరదీసి- అంతకు ముందు అందరూ చదివేసిన పేపర్లలోని వార్తలూ, విశేషాలూ అన్నీ తనకే ముందు తెలిసినట్టుగా రంగులద్ది చెప్పడం ఇంకో కళ. దీన్నే సంభాషణా చాతుర్యం అని కూడా అందురు. ఐతే, ఈ కళ ద్వారా ఆకట్టుకోగల శ్రోతల సంఖ్య పరిమితం. రాగల పేరూ, ప్రఖ్యాతలు కూడా ఆ పాళ్ళలోనే వుంటాయి. వేదికలెక్కి ఉపన్యాసాలు దంచగల స్ఠాయికి ఎదగగలిగితే అభిమానుల సంగతి అటుంచి ఎదో కొంత గిట్టుబాటుగా కూడా వుంటుంది. సభా నిర్వాహకులు సయితం తమ తమ విభవాన్నిబట్టి చదివించుకుంటూ వుంటారు. సాధారణంగా అవార్డులూ-సత్కారాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఈ రకం వక్తలకు కొంత గిరాకీ వుంటుంది. పొగడడం మినహా మరో అంశానికి ప్రాధాన్యం వుండదు కాబట్టి మాట్లాడడం కూడా అంత శ్రమ అనిపించదు. అవార్దులు తీసుకునేవారూ, ప్రేక్షకులూ ప్రతిసారి మారిపోతుంటారు కావున ప్రసంగాల్లో పునరుక్తి దోషాలు ఎన్ని దొర్లినా ఎలాంటి ఇబ్బంది ఇసుమంత కూడా వుండదు. అతిశయోక్తులు దట్టించి ఎలా పొగడాలో తెలుసుకోవడానికి ప్రత్యేక శిక్షణా తరగతుల అవసరమే లేదు. ప్రోగ్రాం కంపీర్ అనో, వ్యాఖ్యాత అనో ఎదో ఒక పేరుతో మైకు ముందు నిలబడే శాల్తీ- సభకు వచ్చిన అతిధుల్నీ, అభ్యాగతుల్నీ(శ్రోతల్నీ) అదే పనిగా ఎలా పొగుడుతున్నారో కొద్దిగా గమనిస్తే చాలు సరిపోతుంది.
 
'మైకేరియాసురుడు'

ఈ మధ్య ఒక సభకు వెళ్ళాను. బయట బాగా ఎండగా వుండడం వల్ల, సభా మందిరం ఏసీ హాలు కావడం వల్లా లోపల జనం నిండుగానే వున్నారు. భజంత్రీల్లో ఎవరో రాకపోవడంతో నన్ను మాట్లాడమన్నారు. ససేమిరా అన్నాను. ఒక్కసారి స్టేజి ఎక్కి మాట్లాడడం మొదలు పెడితే ఆ మత్తులో పడిపోతానేమోనని భయం. పైగా మొగమాటాలకు పోయి అనేక సభలకి హాజరైన అనుభవం వుంది. వేదికమీద వున్న, సారీ- వేదికను అలంకరించిన- ఇంకో సారి సారీ- (రంగురంగుల పూలతో, కాగితాలతో వేదికను అలంకరించినవారని అర్థం కాదు) పదిమందో, పదహారు మందో- ఒక్కొక్కరుగా లేచి తమ ప్రసంగం ప్రారంభించినప్పుడల్లా - వేదిక మీద వున్న మిగిలినవారిని పేరు పేరునా స్మరించడం-పనిలో పనిగా పొగుడుకోవడం గమనిస్తే చిర్రెత్తుకొస్తుంది. ఈ పరస్పర కుచమర్ధనాలకే సగం సమయం గడిచిపోతుంది. దండలు, పుష్పగుచ్చాలు, శాలువలు అందించేవారి పేర్లూ, అందుకుంటున్నవారి పేర్లూ - ఎలా సహస్రనామార్చన కొనసాగుతుంది.
ఈ కార్యక్రమంలో వీలైనంతమందికి వీలు కల్పించడంవల్ల సభ హాజరుకి మినిమం గ్యారంటీ వుంటుంది. ఈలోగా ప్రధమ తాంబూలం, లేదా ప్రధాన సత్కారం అందుకోవడానికి అన్నిరకాలుగా అన్నీ సమర్పించుకున్న శాల్తీ వేదిక మీదనే విలవిలలాడిపోతుంటాడు. కవర్ చేయడానికి వచ్చిన స్థానిక విలేకరులు తన సన్మాన కార్యక్రమాన్ని కవర్ చేయకుండానే మరో "గిఫ్టుబాటు" కార్యక్రమానికి వెళ్ళిపోతారేమోనని విలేకరుల గ్యాలరీ వైపు పిచ్చి చూపులు చూస్తూ దొంగ దండాలు పెడుతుంటాడు. ఎద్దు పుండు కాకికి రుచి అన్న సామెత మాదిరిగా నిర్వాహకులకు మాత్రం ఇదేమీ పట్టదు. అతిధులు, విశిష్ట అతిధులు, పరమ విశిష్ట అతిధులతో పాటు అతిధి ఆఫ్ ది డే - అతిధి ఆఫ్ ది ఇయర్తోటే వారికి గడిచిపోతుంటుంది. తెచ్చిన శాలువాలు, కప్పాల్సిన భుజాలు లెక్క పెట్టుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేస్తుంటారు. వక్తలు కూడా ఎవరికి వారు తమ ప్రసంగం పూర్తి కాగానే ఒకరి వెంట మరొకరు - కారణం చెప్పో చెప్పకుండానో వేదిక మీద నుంచి నిష్క్రమిస్తుంటారు. రైలుకో, బస్సుకో పోదామని బయలుదేరి మధ్యలో దొరికిన టైములో కాలక్షేపం కొసం శ్రోతల అవతారాలెత్తినవాళ్ళు కూడా ఆవులించుకుంటూ లేచి నిలబడి చేతి వాచీలవైపు, నిర్గమన ద్వారాల వైపు చూస్తుంటారు. ఇవన్నీ చూస్తూ నిర్వాహకులు - ఆనాటి "వ్యయ ప్రదాత"ను పిలిచి, తమకు జరిగిన ఈ అపూర్వ సన్మానానికి ముక్తసరిగా మూడు ముక్కల్లో ఉచిత రీతిన ధన్యవాదాలు తెలపాల్సిందిగా మనవి చేసుకుంటారు.
ఇదొక్కటే మొత్తం కాంట్రాక్టులో ఉచితంగా దొరికిన అవకాశంగా పరిగణించిన సదరు శాల్తీ - అలవాటులేని ప్రసంగాన్ని అధాటుగా ప్రారంభించి మధ్యలో దారితప్పి -అవాకులు, చవాకులతో శ్రోతల సహనాన్ని పరీక్షించే సమయంలో- సభా నిర్వహణ విధి విధానాలను "స్కాచి" వడబోసిన నిర్వాహకులు సత్కార కార్యక్రమాన్ని హడావిడిగా ముగించి సభకి మంగళం పాడతారు. కరిగిన సొమ్ముకూ, జరిగిన సన్మానానికీ బేరీజు వేసుకుంటూ బేజారైన గుండెతో సత్కార గ్రహీత ఇంటిదారి పడతాడు. నిర్వాహకులు విందు చేసుకుంటూ మరో "బఖరా" వేటలో పడతారు.
వినేవారికి మాట్లాడేవారు లోకువ
NOTE: All images in this blog are copy righted to the respective owners

13, ఆగస్టు 2010, శుక్రవారం

సుత్తి ముక్తావళి - భండారు శ్రీనివాసరావు

సుత్తి ముక్తావళి




(కన్న వింతలూ- విన్న వింతలూ)



'నిన్ను గురించి నువ్వు ఎప్పుడూ చెప్పుకోకు. మంచి చెప్పుకుంటే ఎవ్వరూ నమ్మరు. చెడు చెప్పుకుంటే - ఇంకా ఎంతవుందో అనుకుంటారు'

'మన బతుకు ఎలాంటిదో మన చావు చెబుతుంది. అయితే, మన బతుకు ఎలాంటిదో లోకానికి చెప్పడం కోసం కనీసం ఇద్దరు బతికుండాలి. అందులో ఒకడు మన స్నేహితుడయివుండాలి. ఇంకొకడు తప్పనిసరిగా మన శత్రువై వుండాలి. మన గురించి శత్రువు చెబుతున్నదానికీ- స్నేహితుడు చెబుతున్నదానికీ యెంత వ్యత్యాసం వుంటే - అంత నిత్యనూతనంగా చచ్చిన తర్వాత కూడా మనం బతికేవుంటాం.'





'ఒక మాట నిజం.
బతుక్కన్నా చావుకే  ఆయుష్షు ఎక్కువ.
గట్టిగా ఒక్క తుమ్ము కూడా తుమ్మకుండా ప్రాణాలను కాచుకుంటూ, దాచుకుంటూ ఎన్నేళ్ళయినా బతుకు. నూరేళ్ళు- నూట యిరయై ఏళ్ళు- మహా అయితే నూట పాతికేళ్ళు.
కానీ, ఆ బతుక్కన్నా కూడా పొడవయినది చావు. ఎన్నేళ్ళు బతికి చచ్చినా- బతికినన్నాళ్ళకంటే ఎక్కువ ఏళ్ళు చచ్చినతర్వాత కూడా జనం జ్ఞాపకాల్లో బతికే వుంటాం.'



"ఏ పని అయినా కష్టపడుతూ కాదు - ఇష్టపడుతూ చేయాలి"


'నేను చేయగలనని అనుకోవడం ఆత్మవిశ్వాసం-నేనే చేయగలనని అనుకోవడం అహంకారం.'


'నర మాంసం తినే క్రూర జంతువు కూడా తన మాంసం తినదు'




" పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.తరవాత్తరవాత మొగుడిమాట భార్య వింటుందట.ఆ తర్వాత యిరువురి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట.'


'భయం అనే పదానికి తప్ప దేనికీ భయపడాల్సిన పని లేదు.'




'మీరు అద్భుతాలను నమ్ముతారా?'
'ఎందుకలా అడుగుతున్నారు?'
'మీ జీవితంలో నిన్న ఒక గొప్ప అద్భుతం జరిగింది తెలుసా?'
'నా జీవితంలోనా?'
'అవును. మీ చిన్నాన్న చనిపోయాడని చెప్పి నిన్న మీరు సెలవు పెట్టి వెళ్ళాక - మిమ్మల్ని చూడ్డానికి ఆయనే ఆఫీసుకి వచ్చారు.'


'దేవుడిని నమ్మి బాగుపడ్డామన్నవాళ్ళు తారసపడలేదు కానీ - దేవుడిని నమ్మేదిలేదంటూ లాభపడ్డవాళ్ళు బోలెడుమంది కనబడుతుంటారు.'

'ఉన్నతస్థానానికి చేరుకోవడం ఎంతో కష్టం. చేరుకున్న తరవాత ఆ స్థానాన్ని పదికాలాపాటు పదిలపరచుకోవడం మరింత కష్టం.'



" ఎవరికయినా వారి అవసరానికి యెంత సాయం చేసినా వెంటనే మరచిపో - ఇతరులు చేసిన సాయం యెంత చిన్నదయినా జీవితాంతం గుర్తుంచుకో "




" మనిషి ఏడుస్తూ పుట్టింది - నవ్వుతూ చనిపోవడానికి "
-భండారు శ్రీనివాసరావు

NOTE: All images in this blog are copy righted to their  respective owners