27, జనవరి 2010, బుధవారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు- పదిహేనో భాగం ) - భండారు శ్రీనివాసరావు













మెట్రో డిజయిన్ మార్చిన స్టాలిన్ కాఫీ కప్పు


మాస్కో మెట్రో పట్ల స్టాలిన్ యెంతో శ్రద్ధ కనబరిచేవారని చెబుతారు. రోజూ ఏదో ఒక వీలు చూసుకుని మెట్రో నిర్మాణ పురోగతిని అధికారులతో, ఇంజినీరులతో సమీక్షించేవారు. అంతకుముందు ఏటవాలుగా, నిలువుగా, అడ్డంగా మెట్రో రైలుమార్గాలను డిజయిన్ చేశారు.వాటిని స్టాలిన్ కు చూపించి, ఆ మాపులపై స్టాలిన్ అభిప్రాయం కోసం అధికారులు ఎదురుచూస్తున్న సమయంలో కాఫీ తాగుతున్న స్టాలిన్-ఆ కప్పును ఒక మ్యాప్ మధ్యలో వుంచారుట. కప్పుకు వున్న కాఫీ మరక గుండ్రంగా దానిపై పడింది. దాన్ని స్టాలిన్ అభిప్రాయంగా పరిగణించిన ఇంజినీర్లు - వృత్తాకారంలో మరో మెట్రో మార్గాన్ని- మిగిలిన అన్ని మార్గాలను కలుపుతూ 'మెట్రో రింగ్ రూట్' కు రూపకల్పనచేసి నిర్మించారు. భూగర్భంలో రైల్ జంక్షన్ ల నిర్మాణానికి స్టాలిన్ ' కాఫీ కప్పు మరక' పరోక్షంగా దోహదం చేసిందన్న ఒక కధ
ప్రచారంలోకి వచ్చింది.


అయిదు కోపెక్కులనుంచి రెండువేల రూబుళ్ళకు పెరిగిన మెట్రో టికెట్
మేమున్న రోజుల్లోనే మాస్కో మెట్రోలో నూటయాభయి స్టేషన్ల దాకా ఉండేవి. ఇప్పుడవి 180  దాకా పెరిగాయి. మాఇంటికి దగ్గరలో ప్రొఫ్ సోవూజ్నయా అనే మెట్రో స్టేషన్ వుంది. అక్కడిదాకా నడిచి వెళ్ళి మెట్రో ఎక్కేవాళ్లము.



 మాస్కో రేడియోకు వెళ్ళాలంటే త్రేత్యా కోవోస్కయా అనే పెరుకలిగిన మెట్రోలో దిగాలి. అక్కడ ఎస్కలేటర్ ద్వారా పైకి వస్తే పక్కన పది అడుగుల దూరంలో మాస్కో రేడియో భవనం. ఈ మధ్యలో మరో అయిదు స్టేషన్లు వున్నాయి. అకడమిస్కయా , లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్, షావోలోస్కయా, అక్త్యా బ్రస్కయా (రింగ్ లైన్ లో వున్న మెట్రో జంక్షన్ ), నోవో కుజ్నిస్కయా అనేవి ఈ స్టేషన్ల పేర్లు .టంగ్ ట్విష్ట్ పదాలకోసం వెతుక్కోనక్కరలేదు. మాస్కో మెట్రో స్టేషన్ల పేర్లు సరిపోతాయి. నెలకు మూడు రూబుళ్ళు పెడితే మెట్రో పాస్ దొరికేది. దీన్ని కొనడానికి నియమనిబంధనలు ఏమీ లేవు . ఎక్కడబడితే అక్కడ దొరికే వీటిని ఎవరయినా, నెలలో ఎప్పుడయినా కొనుక్కోవచ్చు. ఒకరు కొనుక్కున్నదానితో మరొకరు ప్రయాణం చేయవచ్చు.


 పైగా ఈ పాస్ - మెట్రో రైళ్లల్లో, ట్రాముల్లో, ట్రాలీ బస్సుల్లో, సిటీ బస్సుల్లో - అన్నిటిలో పనికొస్తుంది. అంటే, మూడు రూబుళ్ళు పెట్టి అతి సులభంగా లభించే ఈ పాస్ కొనుక్కుంటే, నెల పొడుగునా మాస్కో అంతా వీర విహారం చేయవచ్చు. నెలసరి పాస్ అనవసరమనుకున్న వాళ్ళు - అంటే మాస్కోకి పనులమీద వచ్చే వాళ్ళు - ఒకే ఒక్క రూబుల్ తో పదిరోజులు వాడుకునే పాస్ కొనుక్కోవచ్చు. ఇన్ని సదుపాయాలతో, ఇంత చవకగా ప్రయాణించడానికి వీలున్న మెట్రో ప్రపంచంలో మరొకటి లేదన్న మంచి పెరు ఒక్క మాస్కో మెట్రో కే దక్కింది.


గత  కీర్తి  ఘనమెంతో....... ...


ఇది గతం. గత కీర్తి మరింత ఘనం. మాస్కో మెట్రో గురించి మనం మంచిగా చెప్పుకునే రోజులకు నూకలు చెల్లిపోయాయి. అయితే ఇది నా కళ్ళతో చూసి చెబుతున్నది కాదు. చెవులతో విన్నది, వింటున్నది.
అయిదు కోపెక్కులనుంచి రెండువేల రూబుళ్ళకు పెరిగిన మెట్రో టికెట్
1935 లో మాస్కో మెట్రో తొలిసారి ప్రారంభమయినప్పుడు దాని టికెట్ ధరను యాభయి కోపెక్కులుగా నిర్ణయించారు. 1961 లో దాన్ని అయిదు కోపెక్కులకు తగ్గించారు. అప్పటినుంచి  1991 వరకు అంటే ముప్పయి సంవత్సరాలపాటు మెట్రో టికెట్ ఖరీదుని ఒక్క పైసా కూడా పెంచలేదు. గోర్భచేవ్ ఆర్ధిక సంస్కరణల నేపధ్యంలో 1991 లో 15  కోపెక్కులకు, 1992 లొ యాభయి కోపెక్కులకు అదే ఏడాదిలో  ఒక్కసారిగా మూడు రూబుళ్ళకు పెంచేశారు. అంటే అంటే రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలో- అమాంతం అరవై రెట్లు పెంచారన్న మాట. మన దేశంలో పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా గొడవలకు దిగే వాళ్ళు దీన్ని గమనిస్తే బాగుంటుందేమో. అంతటితో ఈ పెరుగుదల ఆగలేదు.అలా పెరుగుతూ పోయి మెట్రో టికెట్ ధర 1994 లో   నాలుగువందల రూబు ళ్లకూ,1995 లొ ఆరు వందలనుంచి పదిహేను వందల రూబుళ్లకూ, 1997 సంవత్సరం నాటికి ఏకంగా రెండువేల రూబుళ్లకూ పెరిగి ఇక పెరగడానికి వీలు లేక కాబోలు ఆగిపోయింది. పెరుగుట విరుగుట కొరకే అన్న సుమతీ శతక కారుడి సూక్తిని నిజం చేస్తూ ప్రస్తుతం మాస్కో మెట్రో టికెట్ ధర  మెట్రో  రైలులో  ఒక సారి ప్రయాణానికి 26  రూబుళ్ల వద్ద  నిలకడగా నిలచిపోయింది. ఇంతటి స్తాయిలో- అనేక వందల్ రెట్లు,అదీ అతి తక్కువ వ్యవధిలో ధరలు ఆకాశాన్ని దాటి చుక్కలను తాకినప్పటికీ కూడా నిబ్బరంగా  తట్టుకున్న మాస్కో పౌరులను అబినంధించి తీరాలి కదూ. అంతేకాదు - అంతటి ద్రవ్యోల్బన  ఉత్పాతాన్ని పది పదిహేనేళ్ళ వ్యవధిలోనే అధిగమించగలిగిన   లేదా  తట్టుకోగలిగిన విధంగా 'కుషన్' ఏర్పాటు చేసిన  'సోవియట్ ఎకానమీ'ని  అభినందించాలి.
ఉపసంహారం: నిశ్చింతగా ప్రయాణాలు సాగిన ఆ నాటి మాస్కో మెట్రో స్టేషన్లలో ప్రయాణాలు చేయాలనుకునే విదేశీయులకు వారి ఎంబసీలు ఈనాడు ఇస్తున్న ఉచిత సలహా వింటుంటే కడుపు తరుక్కు పోతుంది. అదేమిటంటే- 'మాస్కో మెట్రోల్లో జేబు దొంగలుంటారు జాగ్రత్త' - కళ్ళెదుటే  కలల సామ్రాజ్యం కనుమరుగు కావడం అంటే ఇదే.

(మెట్రో ధ్యాసలోపడి మరచిపోయిన  శంకరాభరణం శంకర శాస్త్రి గారి రష్యన్ పలుకులు వచ్చేసారి )   

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


 

.

నడిచి వచ్చిన దారి - భండారు శ్రీనివాసరావు


(ఆరేళ్ళ క్రితం రాసిన వ్యాసం ఇది. అప్పటికీ ఇప్పటికీ మారింది ఏమయినా వుందా? ఇందులో మార్చాల్సింది ఏమయినా వుందా?)


- భండారు శ్రీనివాసరావు




దసరా,దీపావళి మొదలయిన పండగల సరసన చేరిపోయిన జాతీయ పర్వ దినాలు ఆగస్టు పదిహేను, జనవరి యిరవై  ఆరు.

మొదటి పండుగ మొదటిసారి జరుపుకున్నప్పుడు నేను నెలల బిడ్డని. రెండో పండగ తొలిసారికి నా వయస్సు నాలుగయిదేళ్ళు. అంటే దాదాపు నాతోపాటే పెరిగి పెద్దవుతూ వచ్చిన పర్వదినాలు ఇవి. 




నిండు నూరేళ్ళు జీవించ గలిగే అవకాశం వుంటే - అరవై ఆరేళ్ళు  అన్నది మనుషుల విషయంలో పెద్దమాటే. కానీ ఒక జాతి జీవితంలో ఇది ఒక లెక్కలోనిది కాదు.

నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి త్రివర్ణ పతాకాలు చేతబట్టుకుని ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరి లో పాల్గొనే వాళ్ళం.


 ఆ మాటకు అర్ధం తెలియకపోయినా ఆ ఊరేగింపులో 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది. 'జనగణమన' గీతంలో- ఏ ఏ భాషల ప్రస్తావనవుందో, ఏ ఏ రాష్ట్రాల ప్రసక్తి వుందో మాకు తెలియదు. ఆ గీతాన్ని ఎవరు రాసారో, ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం.జనగణమన చరణాలలోని - 'న' ను 'న' లాగా- 'ణ' ను 'ణ' లాగా, తప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే మాకు తెలిసింది. ఢిల్లీ  ఎక్కడ వుందో తెలియదు, ఎర్రకోట అంటే తెలియదు, కానీ దానిపై చాచా నెహ్రూ  జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.

అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?

'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలి' అంటే 'కాసేపు పడుకోనీ మమ్మీ, ఈ రోజు సెలవే కదా!' అని పిల్లలనే రోజులు వచ్చేసాయి. పండగ దినం స్తానంలో సెలవు రోజు వచ్చింది. తప్పులు లేకుండా 'జనగణమన' పాడడం పోయి - అందులో తప్పులెన్నే రోజు వచ్చింది. జాతీయ జండాకు బదులు మరో జండా ఎగురవేస్తామనే వితండ వాదం పుట్టుకొచ్చింది. పతాకావిష్కరణలు మొక్కుబడి తంతుగా  మారిపోయాయి. ఈ పండగల సమయాల్లో  నాయకుల తలల మీద కానవచ్చే 'గాంధీ టోపీలు' మిగిలిన రోజుల్లో అటకెక్కుతున్నాయి.  ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయం మధ్య, నిఘా పోలీసుల డేగ కళ్ళ పహరాల నడుమ , జాతీయ పండుగలు జరుపుకునే దుస్తితి దాపురించింది.




సైనిక కవాతులు, శస్త్రాస్త్ర ప్రదర్శనలు, భారీ టాంకులు, వైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతను, జాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి  విషాదం?

అయితే ఏమిటట?

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే, భారత జాతి గర్వించ దాగిన గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు ఈ అరవై  ఆరేళ్లలో  కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు  బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినా, మరెన్ని వొత్తిడులకు గురయినా, అప్రతిహతంగా ఎంచుకున్న మార్గంలోనే పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.




జనానికి  జై!
జనాభాలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'వోటు' అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం. అక్షర జ్ఞానం లేకపోయినా, కానులూ, ఏగానులనుంచి, బేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనం' వారి ఆస్తి. గిద్దెలు, సోలలు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది. అలాగే 'మైలు రాళ్ళని' అధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇంకా మైలు రాళ్ళని దాటలేదన్న సంగతి ఇక్కడ గమనార్హం.
దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లోనే పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను  దాటి ఒకే బాలట్ పేపరు ముద్రించిన అనేక గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని ఎన్నుకోగల స్తాయిని అందుకుని ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకున్న జనాభా కలిగిన  దేశం మనది.

'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం' అనే నిర్లిప్త స్తితిని అధిగమించి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగా, ప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.



'చందమామ రావే' అంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్' వరకు ఎదగగలిగాము.

ఏ ఇంగ్లీష్ వారితో అహింసా మార్గంలో పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో, ఆ ఇంగ్లీష్ భాషతోనే భావి భారత నిర్దేశకులయిన మన యువతీ యువకులు - కంప్యూటర్ రంగాన్ని దేశ దేశాలలో తమ కనుసన్నలతో శాసించగలుగుతున్నారు.
కానీ.....

అయితే , అన్నీవున్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత మాదిరిగా ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఆరు దశాబ్దాల పై చిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది.

వెడుతున్న దోవ మంచిదే. నడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. ఒకదానికొకటి   అడ్డం పడుతున్నాయి.

వినిపిస్తున్న సందేశం మంచిదే. విభిన్న స్వరాలే అపస్వరాలతో అసలు అర్ధాన్ని మారుస్తున్నాయి.

అందరూ మంచివాళ్ళే. కానీ వాళ్ళ మంచితనం మంచులా కరిగిపోతోంది.

స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగా, ధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా - అవలక్షణలక్షిత సమాజం రూపుదిద్దుకుంటోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అవలక్షణాలు తలెత్తడం అతి సహజం. అయితే అది తాత్కాలికం కావాలి. శాశ్వితం కాకుండా చూసుకోవాల్సిన భాద్యత మాత్రం అందరిదీ.

నెపాలు మోపకుండా, తప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం.

ప్రతి పంద్రాగస్టు నాడు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన వాస్తవం ఇది.
ఏమంటారు?



NOTE: All the images in this blog are copy righted to their respective owners.

26, జనవరి 2010, మంగళవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 16







మెట్రో
మన దేశంలో యెంత మారు మూల పల్లెటూరికి వెళ్ళినా హోటల్ అన్న పదం విననివాడు, తెలియనివాడు వుండడు. కానీ ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలలో ఒకటయిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కోలో- ఆ రోజుల్లో 'హోటల్' అంటే తెలియనివాళ్ళు కోకొల్లలు. అంటే మాస్కోలో హోటల్స్ లేవని కాదు. హోటల్ అనే ఇంగ్లీష్ పదం కూడా వారికి తెలియదన్న మాట.   అదేమిటో గాని రష్యన్ తప్ప మరొక భాష వారికి అర్ధం అయ్యేది కాదు. ఒకసారి రాయపాటి సాంబశివరావు గారు వచ్చి మాస్కోలోని ఇంటర్నేషనల్ హోటల్ లో బస చేశారు.



 అక్కడికి వెళ్లాలని యెంతో మంది టాక్సీ డ్రైవర్ లను అడిగిచూసినా ప్రయోజనం లేకపోయింది. ఇంటర్నేషనల్ హోటల్ అంటే ఎవరికీ అర్ధం కాలేదు. రష్యన్లో హోటల్ ని గస్తనీచ్చ అంటారు. మేజ్దురోద్నయా గస్తనీచ్చ(ఇంటర్ నేషనల్ హోటల్) అని నాలుకను మూడు మడతలు చుట్టి అడిగితె కాని అర్ధం కాని పరిస్తితి. మిల్క్(పాలు), బటర్ మిల్క్ (మజ్జిగ) స్కూలు, రోడ్డు, స్ట్రీటు (వీధి), వంటి ఇంగ్లీష్ పదాలు సయితం వారికి తెలియవు. ఒక్క మెట్రో తప్ప.

అయిదు పైసల టిక్కెట్టుతో నూటయాభయి స్టేషన్లు




మెట్రో ప్రసక్తి లేకుండా మాస్కో గురించి చెప్పడం అంటే రాముడు లేని రామాయణాన్ని పారాయణ చేయడమే.
మాస్కో వీదుల్లో సంచరిస్తున్నప్పుడు-
రోడ్లపై ట్రాముల్లో, సిటీ బస్సుల్లో, ట్రాలీ బస్సుల్లో (కరెంటు తో నడిచే బస్సులు) తిరుగుతున్నప్పుడు-
ఎత్తయిన ఆకాశ హర్మ్యాలవైపు మెడలురిక్కించి చూస్తున్నప్పుడు-
మన కాళ్ళ కింద, భూమి అడుగున, వందల సంఖ్యలో మెట్రో రైళ్ళు సొరంగ మార్గాల ద్వారా అతివేగంగా ప్రయాణిస్తూ ఉంటాయని చెబితే -
మాస్కో మెట్రో గురించి తెలియనివాళ్ళు ఒక పట్టాన నమ్మడం కష్టం.
సోవియట్ యూనియన్ ఏర్పడడానికి పూర్వమే- జార్ చక్రవర్తుల కాలంలోనే - మెట్రో నిర్మాణం గురించి ప్రతిపాదనలు సిద్దం చేసారని చెబుతారు. అయితే ఈలోగానే, కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో మొట్టమొదటి సోవియట్ నిర్మాణం జరిగిన తరవాత ఆనాటి ప్రాదాన్యతలనుబట్టి, మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు కొంత వెనుకపడ్డాయి. 1935  లో తొలి మెట్రో రైలు మాస్కో భూగర్భంలో పరుగులు తీసింది. 13  కిలోమీటర్లతో మొదలయిన మెట్రో క్రమంగా విస్తరించి ౩౦౦ కిలోమీటర్ల   పరిధిలో 180  స్టేషన్లకు పెరిగింది. పనిదినాలలో, సగటున రోజూ 70  లక్షలమంది మెట్రో రైళ్ళలో ప్రయాణిస్తుంటారు. రద్దీ టైములో 90  సెకన్ల కొకటి చొప్పున మెట్రో రైలు ప్రయాణీకులకు అందుబాటులో వుంటుంది. 1935  లో 50  కోపెక్కులతో మొదలయిన  మెట్రో టిక్కెట్టు ధరను 1961  లో అయిదు కోపెక్కులకు తగ్గించారు. అంటే ఐదు పైసల (కోపెక్కుల) నాణెం - మెట్రో స్టేషన్ ప్రవేశ ద్వారం దగ్గరవున్న స్లాటులో వేసి లోనికి ప్రవేశిస్తే చాలు- ఎటునుంచి ఎటువైపయినా- ఎన్నిసార్లయినా సరే-స్టేషన్లతో నిమిత్తం లేకుండా  ప్రయాణం చేయవచ్చు. నగరం నలువైపులకు వెళ్ళే రైలు మార్గాలను కలుపుతూ వృత్తాకారంలో మరో మార్గాన్ని నిర్మించారు. అందువల్ల - అనేకవైపులకు ప్రయాణాలు చేసేవారు కూడా భూగర్భంలో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషను కు ఎస్కలేటర్ల ద్వారా వెళ్లి రైళ్ళు మారుతూ తమ గమ్యాలను చేరుకోవచ్చు.అంటే, భూగర్భంలోనే రైల్వే జంక్షన్లు నిర్మించారన్న మాట.ఒక సొరంగ మార్గంలో రైలు వెడుతుంటే- దానికి కిందా పైనా వున్న మార్గాలలోమరికొన్ని రైళ్ళు  తిరుగుతూవుంటాయి.


 ఈ  అద్భుతమయిన ఇంజినీరింగ్ కౌశల్యాన్ని - అధునాతన  సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే రష్యన్ ఇంజినీర్లు  ప్రదర్శించిన తీరు అమోఘం. మాస్కో మెట్రోలో మరో వెసులుబాటు ఏమిటంటే - ఒక రైలు వెనుకనే మరో రైలు వెంటవెంటనే వస్తుంటుంది కాబట్టి తొక్కిసలాటలకు, తోపులాటలకు ఆస్కారం తక్కువ. రైలు వచ్చి ప్లాటుఫారంపై ఆగగానే తలుపులు తెరుచుకోవడం - దిగేవాళ్ళు ఒక పక్క నుంచి దిగుతుండగానే మరో పక్కనుంచి ఎక్కేవాళ్ళు ఎక్కడం- తలుపులు మూసుకోవడం - రైలు కదిలిపోవడం అంతా క్షణాలలో నిశ్శబ్దంగా జరిగిపోతూ వుంటుంది.రైలు ఒక స్టేషన్ దాటగానే వచ్చేది పలానా స్టేషన్   అని ముందుగానే  పబ్లిక్ అడ్రసు సిష్టం ద్వారా అనౌన్స్ చేస్తుంటారు. అలాగే డోర్లు తెరుచుకుంటున్నాయి, డోర్లు మూసుకుంటున్నాయని కూడా   ప్రయాణీకులను  హెచ్చరిస్తూ  వుంటారు.   అన్ని లక్షలమంది ప్రయాణాలు చేస్తున్నా - ప్లాటుఫారాలన్నీ కడిగిన అద్దంలా మెరిసిపోతూవుంటాయి. ఒక స్టేషనుకు మరో స్టేషనుకు పోలిక లేకుండా - రష్యాలోని వివిధ జాతుల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఒక్కొక్క మెట్రో స్టేషను ను ఒక్కో మ్యూజియంగా తీర్చిదిద్దారు.


(రెడ్ స్క్వేర్ లెనిన్ సమాధి వద్ద పొడుగుపాటి క్యూలు - కన్నడ న్యూస్ రీడర్ శ్రీ రామకృష్ణ భార్య శ్రీమతి సరోజతో కలసి మా ఆవిడ నిర్మల)


 మాస్కోని సందర్శించే విదేశీ అధినాయకులు సయితం తమకు సమకూర్చిన చయికా కార్లను ( యద్దనపూడి నవలల్లో కధానాయకులు వాడే పడవ లాంటి కార్లు - ఈ ఆరు డోర్ల కార్లు అత్యున్నత స్తాయి విదేశీ అతిధులకి మాత్రమే అందుబాటులో వుంటాయి) పక్కన పెట్టేసి మెట్రో ప్రయాణం పట్ల ఆసక్తి వెలిబుచ్చుతారంటే మాస్కో మెట్రో ప్రశస్తిని అర్ధం చేసుకోవచ్చు.

(స్టాలిన్ తాగిన కాఫీ కప్పుతో మారిన మెట్రో డిజైన్ - ఈ వయినం గురించి మరో సారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

22, జనవరి 2010, శుక్రవారం

అడవి బాటలో రాజీవ్ గాంధీ - (భండారు శ్రీనివాసరావు)

ఈ రోజు రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని
అడవి బాటలో రాజీవ్ గాంధీ -  (భండారు శ్రీనివాసరావు)
(వార్తల వెనుక కధ పుస్తకం నుంచి - ప్రచురణ- మార్చి -2007)



ఒకరు - సాక్షాత్తు దేశానికి ప్రధాన మంత్రి. మరొకరు జిల్లాస్తాయి యంత్రాంగంలో ఓ జీపు డ్రైవర్. వీరిద్దరూ కలసి భద్రాచలం అడవుల్లో ఓ డొక్కు జీపులో కలసి ప్రయాణం చేశారు. నమ్మదగని విషయంగా అనిపించినా ఇది అక్షర సత్యం. పైగా దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని.
గోదావరికి వరదలు రావడం మామూలే. కానీ వరద నష్టం పరిశీలించడానికి ప్రధాన మంత్రి స్వయంగా రావడం మామూలు విషయం కాదు. అందుకే ఏర్పాట్లన్నీ పకడ్బందీగా జరిగాయి. అందులోనూ రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం - ఎన్ టీ రామారావు గారి నాయకత్వంలో నడుస్తున్న రోజులాయె.
హెలికాఫ్టర్ లో భద్రాచలం చేరుకున్న రాజీవ్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ కార్యక్రమాలను వివరించే ఫోటో ప్రదర్శనని తిలకించిన అనంతరం - అనేక వాహనాలతో కూడిన ప్రధాన మంత్రి బృందం రోడ్డు మార్గంలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలను చూసేందుకు బయలుదేరింది. ప్రధాని వెంట ముఖ్య మంత్రి రామారావు గారు, మాజీ ముఖ్య మంత్రి, అప్పటి కేంద్ర మంత్రి జలగం వెంగళరావు గారు అధికారులు, అనధికారులు అంతా వున్నారు. ఆ రోజుల్లో రేడియో విలేఖరికి కొద్దో గొప్పో ప్రాధాన్యత వుండడం మూలాన హైదరాబాదు నుంచి వెళ్ళిన నాకు కూడా ప్రధాని కాన్వాయిలో ఒక జీపు కేటాయించారు. అప్పట్లో ఇప్పటిలా ఇన్ని టీవీ ఛానళ్ళు లేవు. టేపు రికార్డర్ చేతబట్టుకుని వీ ఐ పీ ల వెంట తిరగగలిగే వెసులుబాటు వుండేది. భద్రాచలం నుంచి చింతూరు వరకు రోడ్డుమార్గంలో వెళ్లి రావాలన్నది అధికారుల ప్లాను. మార్గ మధ్యంలో రాజీవ్ గాంధీ అనేక చోట్ల వాహనాన్ని నిలిపి రోడ్డు దిగి కాలినడకన ఇసుక మేట వేసిన పొలాలలోకి వెళ్లి రైతులతో, కూలీలతో మాటా మంతీ కలిపేరు. కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావు ప్రజలకు, ప్రధానికి నడుమ దుబాసీగా వ్యవహరించారు. ఇలా అనేక చోట్ల కాన్వాయి ఆపడం - చాలాదూరం నడుచుకుంటూ వెళ్లి స్తానికులతో మాట్లాడడం - ఇదంతా యువకుడయిన రాజీవ్ గాంధీకి ఏమాత్రం అలసట కలిగించలేదు కానీ ఆ ఎర్రటి ఎండలో ఎగుడు దిగుడు పొలాల్లో వేగంగా అడుగులువేస్తూ వెడుతున్న రాజీవ్ గాంధీతో పాటు సమానంగా నడవడానికి మిగిలిన నాయకులు నానా హైరానా పడ్డారు. ఈ విధంగా సాగిపోతున్న ప్రధాని పర్యటన అనుకోని మలుపు తిరిగింది.
 పైలట్ రాజీవ్
నేను ఖమ్మంలో చదువుకునే రోజుల్లో వంటమ్మగారనే పేద వృద్ధురాలు వుండేది.నాలుగయిదు ఇళ్ళల్లో వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేది. ఆమె మనవడికి చదువు వొంట పట్టకపోవడంతో వారినీ వీరినీ ప్రాధేయపడి ఏదో చిన్న ఉద్యోగం వేయించగలిగింది. అతను కూడా డ్రైవింగ్ నేర్చుకుని ఓ ప్రభుత్వ శాఖలో డ్రైవర్ గా స్తిరపడ్డాడు. రాజీవ్ గాంధీ కాన్వాయిలో నేనెక్కిన డొక్కు జీపుకు అతనే డ్రైవర్ కావడం కాకతాళీయం. ఇక వర్తమానం లోకి వస్తే -
మరి కాసేపటిలో చింతూరు చేరతామనగా ఓ మలుపు దగ్గర రాజీవ్ గాంధీ వాహనం ఆపించారు. ఆ మలుపులో రోడ్డుకు ఎడమవయిపున దిగువగా అడవిలోకి వెళ్ళే ఓ బాట వుంది.
రాజీవ్ గాంధీ ఆయన కారు దిగి జేబులోనుంచి ఓ మ్యాప్ తీసి చూసుకుంటూ అడవి బాట పట్టారు. ఆ వెనుకే రామారావు గారు, వెంగళరావు గారు, ఒకరిద్దరు భద్రతాధికారులు, నేనూ, నామాదిరిగానే హైదరాబాదు నుంచి వచ్చిన పత్రికా విలేకరి సురేందర్ - అంతా ఆయన్ని అనుసరించాము.   రాజీవ్ గాంధీ పదే పదే రోడ్డు  దిగిపోయి పొలాలవెంట తిరిగిరావడం గమనిస్తూ వచ్చిన పోలీసులూ, ఇతర అధికారులూ రోడ్డు మీదే వుండిపోయారు.
ఆ అడవి బాటలో కొద్ది దూరం వెళ్ళిన తరవాత - 'ఇక్కడికి దగ్గరలో పలానా పల్లెటూరు వుండాలి కదా' అని అడిగారు రాజీవ్ గాంధీ మరో సారి మ్యాప్ కేసి చూస్తూ. ఖమ్మం జిల్లా ఆనుపానులన్నీ తెలిసిన వెంగళరావు గారికి కూడా ఈ గ్రామం గురించి తెలిసినట్టు లేదు. 'పదండి పోదాం' అంటూ రాజీవ్ కదిలారు. దూరంగా రోడ్డుపై జీపు ఆపుకుని వున్న డ్రైవర్ అదే అమ్ముమ్మగారి మనవడు - మేము ముందుకు కదలడం చూసి రివ్వున జీపు స్టార్ట్ చేసి మా దగ్గరకు వచ్చాడు. మ్యాప్ చూస్తున్న రాజీవ్ గాంధీ గభాలున ఆ జీపులో ఎక్కి కూర్చున్నారు. దాంతో, రామారావు గారు, వెంగళరావు గారు, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎక్కేసారు. నేనూ సురేందర్ పరిగెత్తుకుని వెళ్లి జీపు వెనుక డోరు కడ్డీపై చతికిలపడ్డాము- సెక్యూరిటీ వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా.జీపు కదిలింది. డ్రైవర్ పక్కన ముందు సీట్లో రాజీవ్ గాంధీ, ఆయన వెనుక వెంగళ రావుగారు, డ్రైవర్ వెనుక సీట్లో రామారావు గారు , సెక్యూరిటీ వాళ్ళు, నేనూ, సురేందర్- అంత చిన్న జీపులో ఎలా ఇరుక్కుని వెళ్ళామో ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి రాకముందు విమానాలు నడిపే పైలట్ గా పనిచేసారు. ఆకాశంలో కొన్ని వేల అడుగుల ఎత్తున విమానం నడుపుతూ, రాడార్ సాయంతో దిగాల్సిన ప్రదేశాన్ని గుర్తించి, నడి రాత్రయినా, పట్టపగలయినా రన్ వేపై ఖచ్చితంగా దించగలిగిన అనుభవం ఆయనకు వుంది. ఎక్కడో భద్రాచలం దగ్గర మారుమూల అరణ్య ప్రాంతంలో మ్యాప్ చూసి గ్రామాలను గుర్తించగలిగిన దక్షతను ఆ అనుభవమే ఆయనకు నేర్పి వుంటుంది.
అందరి ప్రాణాలు (అడవి) గాలిలో దీపాలు
అడవి గాలికి జీపుకు వేళ్ళాడుతున్న పాత టార్పాలిన్ పట్టాలు టపటపా కొట్టుకుంటున్నాయి. నిటారుగా పెరిగిన చెట్ల కొమ్మలు రాపాడుకుంటూ చప్పుడు చేస్తున్నాయి. నక్సల్స్ సంచరించే ప్రాంతాలలో కొత్త వ్యక్తుల రాక గురించి వారికి తెలియచెయ్యడానికి వారి సానుభూతిపరులు చెట్ల కొమ్మలను ఒకదానికి మరొకటి తాటించి చప్పుడు చెయ్యడం ద్వారా సంకేతాలు పంపుతారని చెప్పుకునేవాళ్ళు. నక్సల్స్ కు పట్టు వున్న అడవుల్లో ఇలా సంచరించడం క్షేమం కాకపోయినా - రాజీవ్ గాంధీ మాత్రం ముందుకే పోవాల్సిందని డ్రైవర్ కు సైగ చేశారు. తన పక్కన కూర్చుని సూచనలిస్తున్నది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి అన్న విషయం తెలిసికూడా మా అమ్మమ్మగారి మనమడు మాత్రం ఏమాత్రం తొట్రుపడకుండా - నిబ్బరం కోల్పోకుండా - సుశిక్షితుడయిన సైనికుడి మాదిరిగా జీపు నడపడం చూసి నివ్వెరపోవడం మా వంతయింది.
రాజీవ్ ఊహించినట్టుగానే దగ్గరలోనే ఆ లంబాడాగూడెం తారసపడింది. తీరా చూస్తె పట్టుమని పది పూరిళ్లు కూడా లేవు. రాజీవ్ గాంధీ ఎలాంటి భేషజం లేకుండా ఓ చుట్టూ గుడిసె లోకి వెళ్లి ఆ పేద కుటుంబం స్తితిగతులను ఆరా తీసారు. ఓ మూలాన మూడు రాళ్ళ పొయ్యిపై వున్న మూకుడు మీద మూత తీసి - అన్నం మెతుకులను పట్టి చూసి - ఆ పేదరాలి భుజంపై చేయి వేసి - సాయం చేయడానికి సర్కారు ఉన్నదన్న భరోసా కలిగించారు. ఆ మిట్టమధ్యాన్నం వేళ తమ ఇంటికి వచ్చిన అతిధి - దేశ ప్రధాని అన్న సంగతి ఆమెకు తెలుసో లేదో! ఇప్పటి ప్రచార యుగంలో ఈ సంఘటన జరిగి ఉన్నట్టయితే ఎంతటి ప్రాచుర్యం లభించి ఉండేదో!
తర్వాత  షరా మామూలే.- రాజీవ్ గాంధీ మళ్ళీ మ్యాప్ సాయంతోనే మమ్మల్నందర్నీ చేరాల్సిన చోటికి చేర్చారు.
ఒక  ప్రధాని-ఒక ముఖ్య మంత్రి- ఒక మాజీ ముఖ్య మంత్రి వెంట ఖమ్మం జిల్లా అడవుల్లో కలిసి తిరిగిన విశేషాలను మర్నాటి ఉదయం రేడియో వార్తల ద్వారా బయటి ప్రపంచానికి తెలియచెప్పడానికి - మట్టికొట్టుకుపోయిన దుస్తులతో తెల్లారేసరికల్లా భద్రాచలం చేరడం అదో కధ.

(ఆనాటి ఆంద్ర జ్యోతి సంపాదకులు శ్రీ కె. రామచంద్రమూర్తి ,సీనియర్ జర్నలిష్ట్ శ్రీ కట్టా శేఖరరెడ్డి సంపాదకత్వంలో 2007 మార్చిలో వెలువరించిన 'వార్తల వెనుక కధ' అనే సంకలనం నుంచి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

Appeal to students ––‘struggles’ not ‘sacrifices’-

Appeal to students –‘struggles’ not ‘sacrifices’-
By Bhandaru Srinivasa Rao(I.I.S.)

It is very sad that many emotive students over separate statehood are ending their lives. Will such acts help Centre respond quickly and fast? Certainly not!

It is true that no movement in the world over succeeded without students active participation. Even our own freedom struggle is no exception. Thousands of students who got attracted to the call of Mahatma gave up their studies mid-way. But, those days were different from today. The ‘cause’ may be as important as ‘freedom’ to Indians as now to Telanganites. Yet, in our changed civil society the entire world is fast emerging as a ‘big village’ and it is being accepted by every one of us.

Opportunities opened up, world geographic boundaries disappeared, and we are witnessing colonization all over the world. This is evident from the thousands of Indians' migration to either America or UK or Australia or Canada or New Zealand for greener pastures.

In that race, even no less Telanganites are lagging behind, unlike in the past when the first revolt was raised in 1969.

All these changes should not dampen or deter people of the region’s aspirations to stake claim for separate statehood. What pains me today is a youngsters ending life while bright future lies ahead of them. Unlike in the past, today’s parents are more concerned and care their children. The competitive spirit among the present day parents indeed more that of in their children. As a result, the parents end up with utmost joy and satisfaction if they ensure their children put their foot best forward in the respective chosen careers. If such a ‘dream’ of a ‘parent’ has to end halfway is what more painful.

In that context, I as a seasoned media practitioner felt it right to justify my professional obligation to make an appeal to the students community of all regions. Competitive examinations are the round-corner and in the recent past you made every Telugu proud topping, if not grabbing, maximum number of distinctions in several all-India common entrance tests. Especially, the Osmania University, which was in ‘dock’ for sometime had performed exceedingly well to bring back its old glory. Once again the University students are in great demand world over and the ‘campus’ recruitment bazaars are held with regularity.

I do understand, how ‘dear’ the aspiration to achieve separate statehood for Telangana to you as well to mine. Yet, it is examinations time and time to concentrate on studies to perform well. The Centre claims to have already taken the initiative and let us hold our breadth at least for some time. Everything could be achieved through negotiations and the Centre’s initiative to mobilize ‘consensus’ amongst all stakeholders has begun. Hence, it is better to declare truce at least for some time as the Centre requires some more time to arrive at a decision. Even, in case of formation of Andhra Pradesh on linguistic basis, though the formal decision was taken in 1952 itself, the state could be formed only after four years.

While giving time to the Centre, I would not like to advocate that the students should not put pressure on their representatives like MLAs, MPs, MLCs and others. At the same time, demanding for their resignations at this juncture will not help solve the problem. Instead let them stand united on the issue irrespective of their party ideologies and keep on building pressure on the Centre. Let these legislators and parliamentarians use their forums like Assembly and Lok Sabha to univocally highlight the importance for creating a separate Telangana state. Only such initiatives in a civilized society will help work wonders and also help ensure all round acclaim by law abiding citizens.

Hence, I sincerely appeal to all the entire students community to restrain from ending their lives and instead take part building constructive Telangana. Hope my voicing is reaching out to them…..!!!

20-01-2010

19, జనవరి 2010, మంగళవారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మాస్కోలో మా అనుభవాలు- పదకొండో భాగం) -భండారు శ్రీనివాసరావు






ఆ వచ్చిన వాళ్ళెవ్వరూ మా బంధువులు కాదు. కనీసం ముఖ పరిచయం వున్న వాళ్ళు కూడా కాదు. కానీ ఒక్క పూట మా ఇంట్లోగడిపిన 'పుణ్యానికి' ఆత్మ బంధువులుగా మారారు.

నిజానికి అది మా ఆవిడ చేసుకున్న పుణ్యం.ఇంకా చెప్పాలంటే - ఆమెను కట్టుకుని నేను చేసుకున్న పుణ్యం. ఇది మూట కట్టుకోవడానికి చాలా రోజులముందు బందరు నుంచి నాకో రోజు ఓ కార్డు ముక్క వచ్చింది. నిజానికి రాలేదు. నేనే వెళ్లి తెచ్చుకున్నాను. మాస్కోలో వుండే విదేశీయులెవరికీ నేరుగా ఇళ్ళకు ఉత్తరాలు రావు. ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు వస్తాయి. అంటే  హైదరాబాదులో వున్న మా వాళ్ళెవారయినా నాకు ఉత్తరం రాయాలనుకుంటే నా పేరు రాసి  తరవాత  కేరాఫ్ మాస్కో రేడియో అని రాసి డిల్లీలో వున్న మన విదేశాంగ శాఖ కార్యాలయానికి పోస్ట్ చేయాలి. అలా వచ్చిన ఉత్తరాలనన్నింటినీ 'డిప్లొమాటిక్ బాగ్ లో' వారానికోసారి మాస్కోకు విమానంలో పంపుతారు.



 మన ఎంబసికి చేరిన ఉత్తరాలను మనమే వెళ్లి వెదికి తెచ్చుకోవాలి.అలా ఉత్తరాలను గాలించి తెచ్చుకోవడంలో వున్న తృప్తి అనుభవిస్తే కానీ అర్ధం కాదు. చుట్టపక్కాలనుంచివచ్చే  ఉత్తరం ముక్కకోసం ఎంతగా మొహం వాచిపోయేవాళ్లమో ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.   మేము జవాబు రాయాలన్నా ఇదే వరస. ఇందులోవున్న ఏకైక సౌలభ్యం ఏమిటంటే మనకు ఉత్తరాలు రాసేవాళ్ళు ఎయిర్ మెయిల్ స్టాంప్  ఖర్చులు పెట్టుకోనక్కరలేదు. మామూలు తపాల స్టాంపులతో డిల్లీకి పోస్ట్ చేస్తే సరిపోతుంది. అక్కడనుంచి రాయాలన్నప్పుడు మాకూ అంతే. అందుకే ఎవరయినా వస్తున్నప్పుడు ఏమి పట్టుకురావాలని అడిగినప్పుడు ఇండియన్ స్టాంపులు తెమ్మని అడిగేవాళ్ళం. ఈ ఉత్తరాలతో పాటే ఇండియా నుంచి  ఇంగ్లీష్ దినపత్రికలు వచ్చేవి. వాటిల్లో బెంగళూరు నుంచి వెలువడే హిందూ వుండేది.



.మన రాష్ట్రం సమాచారం తెలియాలంటే హిందూలో హైదరాబాద్ నుంచి వారం వారం హెచ్ జే రాజేంద్రప్రసాద్ గారు రాసే ఆంద్ర ప్రదేశ్ న్యూస్ లెటర్ ఒక్కటే శరణ్యం.


 తరువాతి రోజుల్లో మాస్కోకు వచ్చిన అప్పటి ఆంద్ర జ్యోతి ఎడిటర్ -  ఐ. వెంకట్రావు గారు  తెలుగు పత్రిక కోసం అక్కడి తెలుగువాళ్ళు పడుతున్న  ఆరాటాన్ని గమనించి- హైదరాబాద్ తిరిగి వెళ్ళగానే ఎంబసీ ద్వారా ఆంద్ర జ్యోతి దినపత్రికను పంపడం ప్రారంభించారు.



మాస్కోలో ఉంటున్న తెలుగు వారిలో నా పరపతి పెరగడానికి ఇది దోహదం చేసింది కూడా. ఇక కార్డు విషయానికి వస్తే-
కార్డు కదా! కొంత విరామం తీసుకుందాం. ఏమంటారు?



NOTE: All the images in this blog are copy righted to their respective owners.

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు - పదో భాగం)- భండారు శ్రీనివాసరావు

   










నదిపై పిల్లల  ఫుట్ బాల్  ఆట 
నీళ్ళపై నడయాడగల యోగపురుషులున్న పుణ్య భూమి గా పేరుగాంచిన భారత దేశంనుంచి వెళ్ళిన మేము - మాస్కోలో 'నదిపై ఫుట్ బాల్ ఆడుతున్న పిల్లల'ను కళ్ళారా చూసాము.
ఉత్తర ధృవానికి చేరువగా వుండడం వల్ల, మాస్కోలో ఉష్ణోగ్రతలు సున్నాకంటే ముప్పయి నలభై డిగ్రీలు తక్కువగా వుంటాయి. ఈ చల్లదనానికి మాస్కో నగరం మధ్యలో పాయలుగా పారే మాస్కవా నదిలో నీళ్ళు గడ్డకట్టుకు పోతాయి. కాంక్రీటు మాదిరిగా గట్టిపడిన ఆ నది ఉపరితలం పిల్లలకు ఆట మైదానంగా మారిపోతుంది. ఇక దానిపై ఫుట్ బాల్ ఆటలేనా, స్కేటింగ్ లేనా, ఓహ్! అది చూసి తీరాల్సిన దృశ్యం.



సాధారణంగా మనవైపు ముసురు పట్టినప్పుడు, చల్లగాలులు వీస్తున్నప్పుడు చంటి పిల్లలను బయట తిప్పడానికి సంకోచిస్తాము. కానీ అక్కడ అలా కాదు. ఒక పక్క మంచు నిలబడి కురుస్తూనే వుంటుంది. మరో పక్క నెలలు నిండని శిశువులను సయితం చలి దుస్తుల్లో 'ప్యాక్' చేసి ఆరుబయట వొదిలేసి తల్లులు 'షాపింగ్' చేస్తుంటారు. అది చూస్తూ 'మన దేశం నుంచి వెళ్ళిన తల్లులు' ఇలా ఎలా ? అన్న ప్రశ్నలు వేసుకుని సతమతమౌతుంటారు.
తుమ్మి చిరంజీవ
అలా అని - తుమ్మని వాళ్ళూ , పడిసం పట్టని వాళ్ళూ అసలే లేరని కాదు. మనదగ్గర పల్లెల్లో ఇప్పటికీ పిల్లలు తుమ్మినప్పుడు దగ్గరున్న పెద్దవాళ్ళు వాళ్ళ నెత్తిపై తట్టి 'చిరంజీవ! చిరంజీవ!!' అని అంటూ వుండడం కద్దు. అలాగే అక్కడ కూడా ఎవరయినా తుమ్మగానే పక్కనున్నవాళ్ళు ' బూజ్ ద్దరోవా '( బహుశా దీనికి అర్ధం వెయ్యేళ్ళు బతకమని కాబోలు) అంటుంటారు. మోడరన్ అమ్మాయిల మాటేమోగాని పాత తరం మనుషులు ఇప్పటికీ చిన్న చిన్న నలతలకు ఇళ్ళల్లోనే చిట్కా వైద్యాలు చేస్తుంటారని పిలిపెంకో దంపతులు చెబుతుండేవాళ్ళు.
భోజనాలకు కటకట






పిలిపెంకో ఓసారి పట్టుపట్టి మమ్మల్ని లెనిన్ గ్రాడ్ రైల్లో తీసుకువెళ్ళాడు. అక్కడ పట్టుమని రెండు రాత్రులు కూడా గడపలేదు. ఎప్పుడు వెళ్లి ఇంట్లో పడదామా అన్న ఆరాటంతోనే సరిపోయింది. ఆ నగరంలో చూడాల్సినవి ఎన్నోవున్నాయి. కానీ తినకుండా తిరగడం అన్నదే సమస్యగా మారింది.



 శాఖాహారులకు హోటళ్ళలో తినడానికి ఏమీ దొరకదు. ముతక బియ్యంతో పొడి పొడిగా వండిన అన్నంపై ఉప్పూ మిరియప్పొడి చల్లుకు తినాలి. పెరుగు కాదు కానీ పెరుగు లాంటిది 'కిఫీర్'   దొరుకుతుంది. దానితో సరిపెట్టుకుని భోజనం అయిందనుకోవాలి. అలాగని మాంసాహారులకు రుచికరంగా అన్నీ దొరుకుతాయని అనుకోనక్కరలేదు. ఉడికించిన కోడిగుడ్లు మినహా మిగిలినవేవీ మనవైపునుంచి వెళ్ళిన వాళ్లకు అంతగా రుచిస్తాయనుకోవడానికి లేదు. మాంసాన్ని ఉప్పునీళ్ళల్లో ఉడికించి అదేమాదిరిగా సర్వ్ చేస్తారు. ఉప్పుకారాలు దట్టించి, నూనెల్లో వేయించి వేయిన్నొక్క రకాలుగా వంటలు వండుకుని తినే అలవాటు వున్న వాళ్లకు ఆ తిండి సయించడం కష్టమే. అందుకే అక్కడికి వ్యాపారపు పనులమీదనో లేక ఇండో సోవియట్ సాంస్కృతిక సంఘం ఆహ్వానం మేరకో వచ్చినవాళ్ళు భోజనానికి కటకట పడుతుంటారు.అలా వచ్చినవాళ్ళు మొదటి రోజు అక్కడి హోటళ్లు, బస ఏర్పాట్లు చూసి పరవాలేదనుకుంటారు. విందుల్లో మందు తప్ప ఇష్టపడి తినదగిన భోజనం కనబడక పోవడంతో- ఆకలి ఎరుగని దేశంలో వాళ్లకు ఆకలి కష్టాలు మొదలవుతాయి.

(భోజనానికి బస్సు వేసుకువచ్చిన అతిధులతో మా ఇల్లు ఎలా కళకళ లాడిందన్న ముచ్చట మరోసారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.