ఆత్మీయ కలయికలకు కరోనా మూడేళ్లు ముకుతాడు వేసింది. ఇప్పుడిప్పుడే నలుగుర్ని కలుసుకోవడాలు, ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్ళడాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మూడేళ్ళుగా ముఖాముఖి కలవని రాయపాటి సాంబశివరావు గారిని నిన్న చూడడం జరిగింది.
మొన్న
రాత్రి, జ్వాలా ఇంట్లో రాయపాటి ప్రసక్తి వచ్చింది. ఆయన ఎక్కడ వున్నారో తెలుసుకోవాలని జ్వాలా వెంటనే
ఫోన్ చేశాడు. హైదరాబాదులోనే వున్నట్టు
తెలిసి, చూడడానికి వస్తామని అంటే, మీరు ఎందుకు రావడం మీ
ఇంటికి రేపు రాత్రి నేనే వస్తాను
అన్నారాయన. అన్నట్టే వచ్చారు. తెల్లటి అంగీ, తెల్లటి లుంగీ. 78 ఏళ్ళ వయస్సు అన్న విషయం పైకి తెలియక
పోయినా (నాకంటే
ఏడాది, జ్వాలా కన్నా రెండేళ్లు
పెద్ద) ఈ మధ్య చేసిన సుస్తీల కారణంగా
ఆరోగ్య రీత్యా నియమబద్ధమైన జీవితం గడుపుతున్నానని చెప్పారు.
నన్ను
చూడగానే మనిద్దరిదీ ఇప్పుడు ఒకే పడవ
అన్నారు. (వారి శ్రీమతి చనిపోయిన రెండేళ్లకే మా ఆవిడ కూడా చనిపోయింది)
రాయపాటి
గారికి మా మేనకోడలు, జ్వాలా భార్య విజయలక్ష్మి పెట్టే ఆవకాయ కారాలు బాగా ఇష్టం. బహుశా ఆయన మా
ఇళ్ళ నుంచి అడిగి మరీ తీసుకువెళ్ళేవి ఈ కారాలు ఒక్కటే. మా ఆవిడ బతికున్న రోజుల్లో
ఆయన ఎప్పుడు హైదరాబాదు వచ్చినా దోసావకాయ కారం అడిగి చేయించుకుని తీసుకువెళ్ళే
వారు. మాస్కోలో ఇక సరేసరి. ఆయన వ్యాపారపు పనుల మీద ఎప్పుడు వచ్చినా, ఎన్నాళ్ళు వున్నా, ఎక్కడ బస చేసినా
రాత్రి భోజనం మా ఇంట్లోనే. కారాలు,
పచ్చళ్ళు అంటే ఆయనకు అంత ఇష్టం. మాస్కోలో మా అన్నదాత అని బాహాటంగా చెప్పడం మాకు
ఇబ్బందిగా అనిపించేది.
రాయపాటి
గారితో జ్వాలా కుటుంబానికి, మా
కుటుంబానికి స్నేహం దశాబ్దాలుగా సాగుతోంది. ఎక్కడ ఏ యాగం తలపెట్టినా మా కుటుంబాలను
గుర్తు పెట్టుకుని తీసుకు వెళ్ళేవారు. అలాగే తిరుపతి, షిర్డీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు
కూడా.
ఆయన
రాజకీయాలు,
వ్యాపారాలు మా స్నేహాలకు, పరిచయాలకు ఏనాడు
అడ్డం రాలేదు. వాటి ప్రసక్తి కూడా మా మధ్య మాటల్లో వచ్చేది కాదు. జ్వాలా పిల్లల పెళ్ళిళ్ళకే కాదు, మనుమడి ఉపనయనానికి కూడా వచ్చారు.
మా
మేనకోడలు కొసరి కొసరి వడ్డించింది. మిగిలిన అధరవులు పక్కనపెట్టి, ఆవకాయ, మెంతికాయ, మాగాయ, వెల్లుల్లి ఆవకాయ, నీళ్ళావకాయలతోనే
భోజనం ముగించారు. ముఖ్యంగా నూనె లేని నీళ్ళావకాయ కారం ఆయనకు బాగా నచ్చింది. జ్వాలా భార్య విజయలక్ష్మి ఆ కారాన్ని ప్యాక్ చేసి
ఇచ్చింది. జ్వాలా కూడా కరోనా కాలంలో తాను రామాయణ, భారతాలపై రాసిన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలను బహుకరించాడు.
వెడుతూ
వెడుతూ ఆయన ఎప్పుడూ అనే మాటే అన్నారు.
‘అన్నదాతా!
సుఖీభవ!’
(30-05-2022)



