turaga janaki rani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
turaga janaki rani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, అక్టోబర్ 2013, గురువారం

పూర్వజన్మసుకృతం


అదృష్టరేఖ  అంటుంటారు. అదేదో నాకు జెర్రిపోతు మందాన వున్నట్టుంది.
పొద్దున్న ఓ చానెల్ చర్చకు వెళ్ళి ఇంటికివచ్చి పడుకుంటే మాగన్నుగా నిద్రపట్టింది. ఈ అరవై ఎనిమిదేళ్ళ వయస్సులో ఈ ప్రభాత భేరీలు యెందుకంటూ మా ఆవిడ సన్నాయి నొక్కులు. కానీ చాపల్యం అలాటిది మరి.  అది  ఆవిడకు అర్ధం కాదులే అని నేనే పెద్దమనసు చేసుకుని ఆవిడను  అర్ధం చేసుకుంటూ వుంటాను.
ఇంతలో ఫోను గణగణ. ఆ చప్పుడు విని ఎన్నాళ్ళు అయిందో అనిపించింది. ఎందుకంటే అది లాండ్ లైన్. ఇంట్లో ఒక అలంకార వస్తువుగా అలా మన్నుతిన్న పాములా పడి వుంటుంది. ఒకప్పుడు దాని వైభోగం యెలా వుండేదో చెబితే ఈనాటి సెల్ ఫోన్లకు ఒక పట్టాన అర్ధం కాదేమో.
“నేను వరూధిని మాట్లాడుతున్నాను’ అవతలనుంచి వినబడింది. అసలే నిద్ర మత్తేమో ‘వూ చెప్పండి’ అన్నాను అతి మామూలుగా.
“మీరు రాసిన పుస్తకం చదివానండి. చాలా బాగుంది”
“ఓహో! అలానా థాంక్స్”
“రోజూ ఎన్నో పుస్తకాలు చదువుతూ వుంటాం  కాని మాస్కో గురించి మీరు రాసిన విషయాలు చాలా బాగున్నాయి. పుస్తకం పేరు కూడా. మార్పు చూసిన కళ్ళు. భలేగా వుంది. అది చెబుదాం అనే ఫోను చేస్తున్నాను.”
ఎవరీవిడ అని ఆలోచిస్తూ కొంత మౌనంగా వున్నాను.
నా మౌనాన్ని ఆవిడ అర్ధం చేసుకున్నట్టున్నారు.
“మొన్న జానకీరాణి ఫంక్షన్ లో మీ పుస్తకం నా చేతికి వచ్చింది. ఆవిడ బలవంతంవల్ల అక్కడికి వచ్చాను. మంచిదే అయింది. మీ పుస్తకం చదివే అవకాశం దొరికింది”
అమ్మబాబోయ్! ఆ వరూధిని గారా! కొడవటిగంటి కుటుంబరావు గారి భార్యతోనా ఇప్పటిదాకా ఇలా మాట్లాడుతున్నది? నిద్రమత్తు ఒక్క పెట్టున వొదిలిపోయింది. మంచం మీద నిటారుగా లేచి కూర్చున్నాను. ఈ పొరబాటు  దిద్దుకోవడం యెలా!
ఆవిడ మాట్లాడుతూనే వున్నారు.
‘నేను మా అమ్మాయి, అల్లుడి దగ్గర కొండాపూర్ లో వుంటున్నాను. పుస్తకంలో మీ అడ్రసు చూసాను.  అమీర్ పేటకి చాలా దగ్గర్లో వుంటున్నట్టున్నారు. మేము లోగడ అక్కడే వుండేవాళ్ళం”
కొడవటిగంటి గారి సాన్నిహిత్యమో తెలవదు, ఆయన సాహిత్యాన్ని ఆస్వాదించిన ఫలితమో తెలవదు. ఆవిడ స్వరం అమృతం సేవించినట్టుగా అతి మధురంగా వుంది. కుసుమ కోమలంగా వుంది. తొంభై రెండేళ్లు దాటిన మనిషిలా లేదు. (తొంభై మూడేళ్లకు తక్కువ వుండవు అంటారు మా డి. వెంకట్రామయ్యగారు ఆవిడ గురించిన వివరాలు చెబుతూ. అంత వయస్సులో ఇంత శ్రద్ధగా ఓ పుస్తకం చదివి ఆ రచయితకు ఫోను చేసి మాట్లాడే సంస్కారం గురించి ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు). అది తలచుకోగానే,  అయిదున్నర అడుగుల పైన మరికొన్ని అంగుళాల పొడవుండే మనిషిని కాస్తా ఓ మరుగుజ్జుగా మారిపోయాను.
ఆవిడ చాలా సేపు మాట్లాడారు. చాలా విషయాలు చెప్పారు. కొడవటిగంటి కుటుంబరావుగారి గురించీ, వారి అబ్బాయి రోహిణీప్రసాద్ గురించీ  (ఏడాది అయిందనుకుంటాను ఆయన పోయి), అమ్మాయి శాంత సుందరి గురించీ, వారి అమ్మగారు కొమ్మూరి పద్మావతి గురించీ, వారికి దగ్గర బంధువు, సాహితీ సింధువు అయిన ‘చలం’గారి గురించీ. ఇక తురగా జానకీరాణి గారి సంగతి సరేసరి.
నిజంగా ఈరోజు భలే మంచి రోజు.    
అంతటి పెద్ద మనిషి నాతొ ఫోనులో మాట్లాడ్డమే ఓ అదృష్టం అనుకుంటే, నేను  రాసిన ఓ పుస్తకాన్ని గురించి ఆవిడ మెచ్చుకోవడం.  నిజంగా ఇది నాకు అయాచితంగా లభించిన మరో గొప్ప  అవార్డ్.
అందుకే అన్నాను. ‘పూర్వజన్మ సుకృతం’ అని. అదీ  మరో మాట దొరక్క.  పూర్వజన్మలమీద నమ్మకం లేకపోయినా ‘సుకృతం’ మీద మాత్రం నాకున్న  విశ్వాసం మరింత ఇనుమడించింది. అంతేకాదు.
ఎదిగినకొద్దీ వొదిగివుండడంలో వున్న గొప్పతనం ఏమిటో మరోమారు తెలిసివచ్చింది.
జీవితంలో గొప్పవారుకావడం గొప్ప విషయం కాకపోవచ్చు. కానీ ఆ గొప్పతనాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన గొప్పతనం.
హాట్స్ ఆఫ్ వరూధిని గారు.
(17-10-2013)

16, ఆగస్టు 2012, గురువారం

వెంపటి చిన సత్యం గారితో తురగా జానకీరాణి గారి స్మృతులు


వెంపటి చిన సత్యం గారితో తురగా జానకీరాణి గారి స్మృతులు


వెంపటి చిన సత్యం మాస్టారు 

(తురగా జానకీరాణి గారు నాకు రేడియోలో సీనియర్ సహోద్యోగి. ఆకాశవాణిలొ చిన్నపిల్లల  ప్రోగ్రాము నిర్వాహకురాలిగా, రచయిత్రిగా, వక్తగా ఆమె తెలుసు. నాకు తెలియని ఆమెలోని మరో పార్శ్వం ఈరోజు ఫేస్ బుక్ లో ఆవిడ రాసిన సత్యం గారి జ్ఞాపకం.  చిన్నతనంలో నాట్యం నేర్చుకున్న సంగతి ఈరోజే తెలిసింది. ఫోనులో పలకరిస్తే తను ముప్పయ్యేడవ ఏట కూడా  రంగస్థలంపై  నర్తించిన సంగతి చెప్పారు.  ఆమె స్మృతులను  నలుగురితో పంచుకోవాలన్న తాపత్రయంతోనే ఈ ప్రయత్నం – భండారు శ్రీనివాసరావు)   

“పంతొమ్మిది వందల నలభై ఏడు ,ఎనిమిది ప్రాంతాల్లో మాస్టారికి పంతొమ్మిది నాకు పన్నెండు. మదరాసులో పెదసత్యంగారి దగ్గర నుంచి కూచిపూడికి తిరిగి వచ్చేసిన రోజుల్లో బందరులో నాకు నాట్యం నేర్పించారు. మహిళా సేవా మండలిలో కొందరికి నేర్పుతూ నాకు ఉదయం పూట ఆరు గంటలకి వచ్చి స్పెషల్ క్లాసు తీసుకునేవారు.

“మా అమ్మమ్మ ఆయనగారికి కంచు గ్లాసులో కాఫీ ఇచ్చేది. అది త్రాగి గోడవారగా పెట్టేవారు.


“నేను అప్పటికే మదరాసులో పందనల్లూరు చొక్కలింగం పిళ్ళై గారి దగ్గర కొంత నేర్చుకొన్నాను. అందువల్ల నాకు ఒకే సారి కొన్ని అంశాలు నేర్పించారు. అలరింపు, అఠాణా స్వరజతి, భైరవి, కల్యాణి రాగాల్లో జతిస్వరాలు, కానడ తిల్లానా, వసంత రాగంలో స్వరజతి, మా వల్లకాదమ్మ దేవి యశోద, కొన్ని అరవ పాటల రికార్డింగులు, ఇలా ఎన్నో. ఆయనే నట్టువాంగం, గానం చేసేవారు. తేలికగా, లైట్ గా మాట్లాడేవారు.

“నాచేత బుట్టాయపేట హాలులోను, గుడివాడ, వడాలి మొదలైన కొన్ని పల్లెటూళ్ళలో ప్రదర్శనలిప్పించారు. మువ్వలు కొని వాటికి వెండి పూత పూయించి తోలు పట్కా మీద కుట్టించి ఇచ్చారు. అవి నా దగ్గరున్నాయి. బహుశ నేను ఆయనకు తొలి శిష్యురాలినేమో. ఆ తరువాత ఆయన మదరాసు వెళ్లి పోయారు. నేను మళ్ళీ చొక్క లింగం పిళ్ళై గారి దగరకి నేర్చుకోవడానికి వెళ్ళాను. నిజానికి ఆయన నాకు భరత నాట్యమే నేర్పారు.

“ఆ తరువాత ఆయన్ని రాజసులోచన మేడ మీద క్లాసులు నడుపుతుండగా చూసి వచ్చాను. ఇంకొక సారి ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాదు నుంచి  భోపాల్ వరకు చేసిన ప్రయాణంలో ఆయన ఎందరెందరి గురించో  చెప్పారు. ఆ తరువాత తెలుగు విశ్వ విద్యాలయం విశిష్ట పురస్కారం ఇచ్చినప్పుడు నేను స్టేజీ మీదకు వెళ్లి నాకు పన్నెండు, ఆయనకు పంతొమ్మిది ఏళ్ల వయస్సులో ఎంత గొప్ప గురు భావం ఉండేదో చెప్పినప్పుడు, అయన అలాగా’ అన్నారు. ‘ఇంకా ఎంతో చెయ్యాలని ఉందమ్మా’ అని కూడా  అన్నారు. ‘ఎప్పుడూ అమ్మ బాగున్నారా మామయ్యా బాగున్నారా’ అని అడిగేవారు. ఆ సాన్నిహిత్యం, అభిమానం నేను కలకాలం మదిలో నిలుపుకుంటాను. నేను కొంత వరకైనా దూరదర్శన్,  రేడియోలతో పాటు, రవీంద్ర భారతి రంగస్థలం మీద అనేక నృత్య రూపకాలకి, బృంద గీతాలకు దర్శకత్వం వహించగలిగానంటే అది ఆయన పెట్టిన భిక్షే. ప్రాతః స్మరణీయులు ఆ మహామనీషి.” 

తురగా జానకీరాణి

(16-08-2012)