5, నవంబర్ 2017, ఆదివారం

భాగవత సప్తాహం – భండారు శ్రీనివాసరావు


మరణం తధ్యమని తెలిసిన పరీక్షిత్తు ఏం చేశాడు ? శుక మహర్షి ఆధ్వర్యంలో భాగవత సప్తాహంలో  శేషజీవితాన్ని గడిపాడు.
దాదాపు ఇదే మాదిరి వృత్తాంతం విశాఖ నుంచి వినవచ్చింది. కాకపొతే ఇది జరిగి నలభయ్ అయిదేళ్ళు గడిచాయి.
భాగవతుల పరమేశ్వర రావు గారి అసలు ఇంటి పేరు ఇదో కాదో తెలవదు. కానీ ఇదే పేరు అలా నిలబడి పోయింది. దానికి కారణం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆ కుటుంబం ఇచ్చే చేయూత.
ఉత్తరాంధ్రలో వారిది  బాగా కలిగిన కుటుంబం. తల్లి సీతమ్మ గారు వయో వృద్ధులు. మరణ సమయం ఆసన్న మైందని ఆవిడగారికెందుకో తోచింది. కొడుకును పిలిచింది. ఆస్తిపాస్తుల అప్పగింత కోసం కాదు, చెవులు వినబడుతూ ఉండగానే ధార్మిక ప్రవచనాలు వినాలని ఉందన్న తన మనోభీష్టాన్ని కుమారుడికి ఎరుక పరిచింది.
ఆయన కూడా తల్లికి తగ్గ కుమారుడు. పైగా సంపన్న కుటుంబం. కన్న తల్లి కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాడు. పరీక్షిత్తుకు శుక మహర్షి మాదిరిగా తల్లికి ఆధ్యాత్మిక ప్రవచానాలు వినిపించగల సమర్ధుడు ఎవ్వరన్న మీమాంస మొదలయింది. ఆ ప్రశ్నకు శ్రీ భాష్యం  అప్పలాచార్య స్వామి రూపంలో సమాధానం లభించింది. శ్రీరామ నవమి నాడు జన్మించిన అప్పలాచార్య సంస్కృతాంధ్ర భాషల్లో నిష్ణాతులు. ఉగాది పర్వదినం నాడు మొదలు పెట్టి శ్రీరామనవమి  వరకు  విశాఖ  గురజాడ కళాక్షేత్రంలో తొమ్మిది రోజులపాటు రామాయణ ప్రవచనాలు చేసేవారు. ఆ విధంగా ఆ ప్రాంతంలో ఆయన ప్రసిద్ధులు. శ్రీ భాష్యం వారిని పరమేశ్వర రావు గారు  తమ స్వగ్రామానికి ఆహ్వానించారు. పరీక్షిత్తుకు ఏడురోజుల్లో మరణం తధ్యం అని తెలిసిపోయింది  కాబట్టి భాగవత సప్తాహంతో ఆ కార్యక్రమం పూర్తయింది. అప్పలాచార్య స్వామి   త్రి సప్తాహం అంటే మూడు ఏళ్ళు  ఇరవై ఒక్క రోజులు భాగవత పారాయణం చేశారు.

తన ఆఖరి కోరిక తీరిన తరువాత  కొంత కాలానికి ఆవిడ కాలం చేశారు. పరమేశ్వర రావు గారికి ఆ సత్కార్యాల ఫలితంగా భాగవతం ఇంటి పేరుగా మారి భాగవతుల పరమేశ్వర రావుగా మారారు. 
త్రి సప్తాహం నిర్వహించిన శ్రీ భాష్యం  వారిప్పుడు లేరు. కీర్తిని మిగిలించుకుని  నిజమైన కీర్తిశేషులయ్యారు.  

కామెంట్‌లు లేవు: