26, ఫిబ్రవరి 2015, గురువారం

ప్రభువులవారి రైల్వే బడ్జెట్



ప్రధాని మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు  రెండో రైల్వే బడ్జెట్ కూడా పట్టాలెక్కేసింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు పార్లమెంటుకు సమర్పించిన ఈ బడ్జెట్ 'కొత్తగా పురుడు పోసుకున్న రెండు తెలుగు రాష్ట్రాలను మాత్రం  ఉసూరుమనిపించింది. ఆంధ్ర.తెలంగాణా ముఖ్యమంత్రులిద్దరూ 'ఈ బడ్జెట్ లో కాస్త కనికరం చూపండి మహాప్రభూ' అంటూ, అనేక సార్లు ఢిల్లీ ప్రదక్షిణాలు చేసి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. బహుశా వారి మొర, మంత్రిగారి మనసు పొరలను తట్టిందో ఏమిటో కానీ, సురేష్ ప్రభువుల వారు,   తమ గంట పైచిలుకు చేసిన బడ్జెట్ ప్రసంగంలో కాస్త  దయతలచి, ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని 'రెండు వూర్ల పేర్లు' ఓసారి అనామత్తుగా ప్రస్తావించి వూరుకున్నారు.  'ఖాజీపేట (తెలంగాణా) - విజయవాడ (ఆంధ్ర ప్రదేశ్) నడుమ మూడో రైలు మార్గం వేసే ప్రతిపాదన పరిశీలనలో వుంద'ని దాని తాత్పర్యం. తాత దగ్గుకే మురవమన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలవాళ్లు ఆ ఒక్క మాటకే మురిసి ముక్కచెక్కలవుతారని మంత్రిగారి అభిప్రాయమేమో తెలవదు. 


      

ఏ బడ్జెట్ అయినా అది సార్వత్రిక బడ్జెట్ కానివ్వండి లేదా రైల్వే బడ్జెట్ కానివ్వండి అది రెండురకాలుగా కనిపిస్తుంది. అధికార పక్షం వారికి ఆహా ఓహోబడ్జెట్. ప్రతిపక్షం వారికి అదే బడ్జెట్ అంకెల గారడీ. అయితే ఈ రెండు కళ్ళే కాదు, పైకి కనబడని  మూడో కన్నుమరోటి వుంది. అది ప్రజలది. అంటే ప్రయాణీకులది. అందులోనూ అతి సాధారణ ప్రయాణీకులది. కానీ వారి గోడు ఎన్నికల సమయంలో తప్ప ఎవ్వరికీ పట్టదు. తమ ఈ 'మూడో కన్ను' తెరవాలంటే ఎన్నికలదాకా ఆగాలన్న ముని శాపం వాళ్లకు  వుంది.

గతంలో రైల్వే మంత్రులగా పనిచేసినవాళ్ళల్లో చాలామంది 'తమ' ప్రాంతాల 'పాల రుణం' అంతో ఇంతో కొంత  తీర్చుకున్నారు. వీరిలో బెంగాల్ ఆడపులి మమతా బెనర్జీ పేరే ముందు చెప్పుకోవాలి. యూపీయే హయాములో ఆమె రైలు భవన్ రాణీగా ఓ వెలుగు వెలిగినప్పుడు రైల్వే బడ్జెట్ లో సింహభాగాన్ని తూర్పు వెళ్ళే రైలుఎక్కించడానికి ఆవిడ  ఎంతమాత్రం సంకోచించలేదు. ఆ రాష్ట్రంలో గత 34 ఏళ్లుగా అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్న ఎర్రదండుపాలనకు శ్రీమతి బెనర్జీ 'ఎర్ర జెండా' చూపగలదేమో అన్న ఆశతో వున్న అప్పటి  యుపీఏ నాయకులు, ఆవిడ ప్రతిపాదించిన (బెంగాల్) రైల్వే బడ్జెట్ కు పచ్చజెండా వూపారు. ఆవిడ సమర్పించిన రైల్వే బడ్జెట్ లో  పశ్చిమ బెంగాల్ పై వరాలవర్షం కురిపించి అందరూ ఆశ్చర్యంతో హౌరాఅని నోళ్ళు వెళ్ళబెట్టేట్టు చేసారు. సింగూరులో మెట్రో కోచ్ ఫాక్టరీ, డార్జిలింగ్ లో సాఫ్ట్ వేర్ ఎక్సేలెన్సీ సెంటర్, కోల్ కతాకు ఇంటిగ్రేటెడ్ సబర్బన్ నెట్ వర్క్, అక్కడి మెట్రో కు 34 కొత్త సర్వీసులు ఇలా వరాల వాన కురిపించారు. లోగడ రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ 'తన అధికారాన్ని ఉపయోగించి అత్తవారి వూరికి ఏకంగా ఒక రైలును వేయగాలేనిది ఇప్పుడు తాను చేసిన దాంట్లో తప్పు పట్టాల్సింది ఏముంది' అన్న రీతిలో మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ను రూపొందించి, పుట్టింటిపై  ప్రేమను పార్లమెంటు సాక్షిగా  బాహాటంగా ప్రదర్శించి చూపారు. 'సొంత రాష్ట్రానికి, సొంత జనానికి ఏమి చేస్తే ఏమి తప్పుపడతారో' అని సంకోచించే నిత్య శంకితులకు మాత్రం నిజంగా  ఇది కనువిప్పే.
ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు అన్నట్టు లోకసభ సభ్యుడు ఎవరయినా రైల్వే మంత్రిని కలిసినప్పుడు, తన నియోజక వర్గం సమస్యలు తీర్చాలని మాత్రమే మహజరులు సమర్పిస్తారు.  రైల్వే ఓవర్ బ్రిడ్జిలు గురించో, లేక ఫలానా స్టేషనులో ఫలానా రైలుకు స్టాప్ ఏర్పాటు చేయాలనో  ఇలా చాలావరకు స్తానిక సమస్యలపైనే వుంటాయి. మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కలగచేసుకుని ముందుగా తమ అవసరాలను రైల్వే మంత్రికి తెలియచేసుకోవాల్సి వుంటుంది. నిజానికి ఈ విషయంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా తమ కోరికల చిట్టాలను ఏటా రైల్వే మంత్రికి అందచేస్తూనే వుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వున్న చంద్రబాబు. కేసీఆర్  ఇరువురూ ఈ విషయంలో తమ బాధ్యతను ఏమాత్రం విస్మరించలేదు. ఢిల్లీ పెద్దలకు ముందస్తుగానే శాయంగల విన్నపాలు చేసుకున్నారు. కానీ వాటిని కొత్త ప్రభుత్వం అంతగా పట్టించుకున్న దాఖలాలు బడ్జెట్ లో కనబడడం లేదు.
ఏదిఏమయినా, ఈసారి తెలుగు రాష్ట్రాలకు  అనుకున్న రీతిలో రైల్వే మంత్రి పూర్తి న్యాయం చేయలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  గత జులైలో సమర్పించిన రైల్వే బడ్జెట్ లో ప్రతిపాదనకు నోచుకున్న కొన్ని స్పీడ్ రైళ్ళు మాత్రం, ఆ ఒక్క రోజు  టీవీ స్క్రోలింగులకే పరిమితం అయ్యాయి కాని,  పట్టాలు ఎక్కిన దాఖలా లేదు. 'వూరికే మాటలు చెప్పడం యెందుకు అనుకున్నారేమో' ఈసారి అలాటి ప్రతిపాదనల వూసు కూడా లేదు. విశాఖ కేంద్రంగా  కొత్త రైల్వే జొన్ గురించి ప్రకటన వెలువడగలదని ఆశించిన వారికి మళ్ళీ  నిరాశే ఎదురయింది.
అయితే, ముందే చెప్పినట్టు ఈ బడ్జెట్ ని ప్రజల దృక్కోణంలో నుంచి పరిశీలిస్తే ఒకింత వూరట కలిగించే పద్ధతిలో వుందనే చెప్పాలి. వాళ్ళమీద కొత్త భారాలేవీ మోపలేదు. చార్జీలు ఏమీ పెంచలేదు. ఎందుకంటే ఆ పని ఆర్నెళ్ల ముందుగానే పూర్తయిపోయింది కాబట్టి.  

ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ ‘ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా లేదా అనే డౌటు ప్రయాణీకులకు లేకుండా చేయగలిగితే ఆ బడ్జెట్ సార్ధకమైనట్టే లెక్క. అలాగే, భద్రతకు పెద్దపీట వేసి,  రైలెక్కిన ప్రయాణీకుడి పేరు ముందు 'లేటు' అని రాయాల్సిన అవసరం లేకుండా చేస్తే మరీ గ్రేటు.    
NOTE: Courtesy Image Owner 

3 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

ఏమిటండీ బాధపడుతున్నారూ, ఇన్ని దశాబ్దాలలో ఏనాడైనా అంతపెద్ద తెలుగురాష్ట్రం మీద అభిమానం ఒలకపోసిన రైల్వే బడ్జెట్టు అంటూ చూసారా ఎవరైనా? ఇప్పుడు ఒకటికి రెండైనాక ఈ చిన్న తెలుగురాష్ట్రం మీద ఏదో ఒలికించలేదని కొత్తగా బాధపడవలసినది ఏముందీ? దక్షిణమధ్యరైల్వే అనే పేరుగల రైల్వే విభాగం తెలుగువారి సొమ్ములను పోగేసి ఇస్తుంది, అవి మిగతా దేశం ఖర్చుపెట్టుకొంటుంది. మామూలు భాగోతమే.

Jai Gottimukkala చెప్పారు...

Rail Budget: Telangana celebrates, Andhra Pradesh cries foul

http://timesofindia.indiatimes.com/budget-2015/rail-budget-2015/Rail-Budget-Telangana-celebrates-Andhra-Pradesh-cries-foul/articleshow/46388901.cms

అజ్ఞాత చెప్పారు...

గొట్టిముక్కల ఎదవా మరి ఇంకా ఇక్కడే చచ్చావే ఎల్లి డాన్సులాడకుండా. నువ్వెళ్ళి celebrations మొదలెట్టు మరి.