10, మార్చి 2011, గురువారం

తిరుక్షవరం – భండారు శ్రీనివాసరావు


తిరుక్షవరం – భండారు శ్రీనివాసరావు

పిల్లలకు చెడ్డీలు మార్చినంత సులభంగా రాజకీయనాయకులు పార్టీలు మార్చగలరన్న అపవాదును వారు మోస్తున్నారు. ఈ దేశంలో ప్రతిదీ తమ సొంతం , ప్రతిదీ తమకు ఉచితం అనే భావన వారిలో ప్రబలిపోయిందనడానికి సంకేతంగా ఇంటర్ నెట్ లో ప్రచారంలోకి వస్తున్న ఓ కధనం మీ కోసం.

క్షవరం చేయించుకుందామని పువ్వులమ్ముకునే ఓ చిరు వ్యాపారి ఓ రోజు ఓ క్షవరశాలకు వెళ్లాడు. పని పూర్తయిన తరవాత డబ్బులు ఇవ్వబోయాడు. ‘ఈ వారం రోజులూ నేను నా తోటివారికి నా చేతనయిన సర్వీసు ఉచితంగా చేద్దామనుకుంటున్నాను. అందువల్ల డబ్బులు తీసుకోను’ అని అతగాడు మృదువుగా తిరస్కరించాడు. ఆ మాటలకు ముగ్ధుడయిన ఆ పూల వ్యాపారి అక్కడినుంచి నిష్క్రమించాడు. మరునాడు క్షురకుడు తన దుకాణం వద్దకు వెళ్లేసరికి అందంగా తయారు చేసిన పూల బొత్తి షాపు ముందు కనిపించింది. ‘మీ సేవకు ధన్యవాదాలు’ అని దానికో చీటీ పెట్టివుంది.

తరువాత, ఆ షాపుకు ఓ పోలీసు వచ్చాడు. బిల్లు చెల్లించబోయేటప్పుడు అతడికి కూడా అదే సమాధానం వచ్చింది. ఈ వారమంతా అందరికీ ఉచిత సేవ అందించాలన్న నిర్ణయానికి అనుగుణంగా డబ్బులు తీసుకోనని క్షురకుడు తెగేసి చెప్పాడు. మరునాటి ఉదయం అతడు దుకాణం తెరవడానికి వచ్చినప్పుడు ఆ పోలీసు పంపిన ధన్యవాదాల సందేశం, దానితో పాటు అతడి ఇల్లాలు స్వయంగా తయారు చేసిన మిఠాయిలు కనిపించాయి.

ఆ మరునాడు, ఘనత వహించిన పార్లమెంట్ సభ్యుడు ఒకరు క్షవరం చేయించుకుందామని ఆ దుకాణానికే వెళ్లాడు. క్షురకుడు యధావిధిగా డబ్బులు తీసుకోకపోవడానికి కారణం ఆయన గారికి నివేదించుకున్నాడు. ఈ వారమంతా ఉచిత సేవ చేయాలని అనుకున్నానని పార్లమెంటు సభ్యుడితో చెప్పాడు. అస్తమానం ప్రజాసేవలో తరించే ఆ ప్రజా ప్రతినిధి ఆ మాటలు విని ఎంతో మురిసిపోయి వెళ్లి పోయాడు.

మరుసటి రోజు ఉదయం క్షురకుడు తన దుకాణం తెరవడానికి వెళ్ళినప్పుడు అక్కడ బారులు తీరి జనం కనబడ్డారు . విచారిస్తే తెలిసినదేమిటంటే వారంతా గౌరవ పార్లమెంటు సభ్యులేనని. ఉచితంగా దొరికే క్షవర సేవను అందుకుందామని వచ్చారని. తీరిగ్గా విచారించడమే ఇక అతగాడికి మిగిలింది.
సాధారణ జనాలకు, వారిని పాలించే రాజకీయ నాయకులకు - మనస్తత్వాల్లో స్తూలంగా వున్న తేడాను ఎత్తిచూపుతూ వెలువడిన ఈ కధనం ముక్తాయింపు ఇలా వుంది.

‘చంటి పిల్లలకు వాడే ‘డైపర్’ లనూ, రాజకీయనాయకులనూ తరచూ మారుస్తుండడం చాలా అవసరం.’

(10-03-2011)

1 కామెంట్‌:

శ్రీరామ్ చెప్పారు...

చాలా బాగుంది.