25, నవంబర్ 2021, గురువారం

‘నా బలమా! నీ నామ బలమా!’ – భండారు శ్రీనివాసరావు

 

నాకు గంధర్వుల శాపం వుంది. అదేదో సినిమాలోలా విన్నది వెంటనే నోట్ చేసుకుంటే తప్ప ఆ తర్వాత గుర్తుండదు.

నాకు అప్పుడప్పుడు మితృలు పాశం యాదగిరి, ఆర్వీవీ కృష్ణారావు, అమెరికా నుంచి వీవీ శాస్త్రి గారు, తరచుగా మా అన్నగారు రామచంద్రరావు ఫోన్లు చేస్తుంటారు. ఆ మాటల్లో ఎన్నెన్నో పాత ముచ్చట్లు దొర్లుతుంటాయి. చాలా మంచి సంగతులు. వాళ్లకు రాయాలని తోచదు. నాకు రాయకపోతే తోచదు. కానీ చెప్పాను కదా! పాడు మతిమరపు. వెంటనే రాసుకుంటే సరి. లేకపోతె ఇంతే సంగతులు.

మొన్న రామజోగి మందు గురించి చెప్పిన కృష్ణారావు గారు రాత్రి మళ్ళీ ఫోన్ చేశారు.

ఈసారి ఇదిగో ఈ నామ బలం గురించి చెప్పారు.

ఓసారి, అంటే అప్పుడెప్పుడో దశాబ్దాల కిందట మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు బెజవాడ వచ్చారు. యథావిధిగా ఇండియన్ మెడిసిన్ హౌస్ డి.ఎల్. నారాయణ గారింట్లో మధ్యాన్న భోజనం. ఆ సాయంత్రం కచేరీ.

నారాయణ గారికి ఆయుర్వేద వైద్యశాల వారసత్వంగా వచ్చింది. వారి హయాములో మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లింది.

భోజనాల సమయంలో కృష్ణారావు గారు బాల మురళి గారితో అన్నారు. ‘నారాయణ గారి చవులూరించే విందు, మరి వీనుల విందుగా మీ విందు మాత్రమే మిగిలింది’

ఈ మాటలు గుర్తుపెట్టుకున్నట్టుగా ఆ సాయంత్రం కచేరీలో బాల మురళి గారు ఆనంద భైరవి రాగంలో ‘ నా బలమా! నీ నామ బలమా’ అనే త్యాగరాయ విరచిత కీర్తన సుమధురంగా పాడారు. ఆయుర్వేద వైద్యంలో డి.ఎల్. నారాయణ గారి ఆనంద భైరవి అనే ఔషధం వుంది. అలాగే కృష్ణారావు గారు అడిగిన వీనుల విందు లాంటి ఆనంద భైరవి రాగం వుంది.

సరే ఇదలా ఉంచితే ..

ఒకానొక కాలంలో ఆయుర్వేద వైద్యం తెలుగునాట విలసిల్లింది. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయానికి ఆ రోజుల్లో వెయ్యి కోట్ల టర్నోవర్ ఉండేదని చెప్పుకునేవారు. దాదాపు ప్రతి గ్రామంలో ఆయుర్వేద వైద్యులు వుండే వాళ్ళు. మిస్సమ్మ సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర అటు స్కూలు టీచరు, ఇటు ఆయుర్వేద వైద్యం. పిల్లల చేత మందులు అరగదీయించడం గుర్తుండే వుంటుంది.

ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారికి భవిష్యత్ వాణి తెలుసల్లె వుంది. ఆయుర్వేదానికి ముందు ముందు కాలం చెల్లిపోతుందన్న అనుమానం కలిగిందేమో తెలియదు. దొంగ రాముడు సినిమాలో ఒక సన్నివేశం పెట్టారు.

చిన్న నాగేశ్వర రావు తల్లికి జబ్బు చేసి ప్రాణం మీదకు వస్తే, ఆయుర్వేద వైద్యుడుగా వేసిన వంగర వెంకట సుబ్బయ్య రోగి నాడి పట్టి చూసి ఒక మందు చీటీ రాసిచ్చి పట్రంమంటాడు. చిల్లి కాణీ జేబులో లేకపోయినా చిన్న నాగేశ్వర రావు పరిగెత్తుకుంటూ ఆయుర్వేదం మందులు అమ్మే షాపుకి పరిగెడతాడు. షాపు వాడు చీటీ చూసి మందుల అలమరా తెరిచి, ఓ సీసా తీసి దానిపై వున్న దుమ్ము ఉఫ్ అని ఊది పిల్లాడి చేతికి ఇస్తాడు. అంటే ఆయుర్వేద మందులకు భవిష్యత్తులో గిరాకీ తగ్గి దుమ్ము కొట్టుకు పోతాయనే సంకేతం అందులో ఉందంటారు కృష్ణారావు గారు.

పూర్వం పాసింజర్ రైళ్ళలో ఆయుర్వేదం మందులు అమ్మేవాళ్లు. కస్తూరి మాత్రలు, సువర్ణ శూర్యావతి, పైత్యాంతక రసం, కాశీ దారాలు, ఇత్తడి పిన్నీసులు, పేల దువ్వెనలు వగైరా వగైరా. ఒక పొడవాటి కర్రకు వీటిని వేలాడగట్టి అటూ ఇటూ ఊపుతూ రైల్లో తిరిగి అమ్మేవాడు.

వెనకటి రోజుల్లో వైద్యుడు అనేవాడు ముందు నాడి పట్టి చూసేవాడు. వున్న ఊళ్ళో వైద్యం కనుక రోగుల శరీర తత్వం వాళ్లకి బాగా తెలుసు. అందుకు తగ్గ మందులు కుప్పెల్లో అరగదీసి, కల్వంలో నూరి అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయుర్వేదం వంటి దేశీయ వైద్య ప్రక్రియల్లో కూడా కార్పొరేట్ శక్తులు అడుగు పెట్టడంతో ఆకర్షణీయమైన ప్యాకెట్లలో అవి కూడా ఇంగ్లీష్ అలోపతి మందుల్లాగా మార్కెట్లో విరివిగా దొరుకుతున్న మాట వాస్తవమే అయినా, అందులో భారతీయ ఆత్మ లోపిస్తోంది. రోగికీ, వైద్యుడికీ నడుమ ఉండాల్సిన సున్నితమైన అనుబంధం చెరిగిపోతోంది. నాడి పట్టి చూడకుండానే చేసే వైద్యంలో డబ్బు ఉండవచ్చు కాని, జబ్బు నయం చేసే శక్తి క్రమంగా లోపిస్తోంది.

పోలీసు జులుం – భండారు శ్రీనివాసరావు


ఏకాంబరం ఇంటికి పోలీసులు వచ్చారు. తలుపు తీశాడు. పోలీసులను చూడగానే పక్క పోర్షన్ వాళ్ళు తలుపులు మూసుకున్నారు.

వాళ్లు ఏదో అడిగారు. ఏకాంబరం ఏదో చెప్పాడు. మర్నాడు స్టేషన్ కు పలానా టైముకు రమ్మని చెప్పి వెళ్ళిపోయారు.

ఏకాంబరానికి, అతడి భార్యకు భయంతో ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. సెలవు పెట్టి మర్నాడు పోలీసు స్టేషన్ కు వెళ్ళాడు. గంటలు గంటలు వెయిట్ చేయించి తర్వాత అసలు విషయం చెప్పారు, ఎవరో అనుకుని పొరబాటున అతడి ఇంటికి వచ్చారుట. వాళ్ళ మాటలో ఏమాత్రం క్షమాపణ ధోరణి ధ్వనించలేదు. అయినా  ఏకాంబరం కిమ్మనకుండా బతుకు జీవుడా అంటూ  బయట పడ్డాడు.

అదే రాజకీయ రక్ష రేకు వుంటే... మొత్తం కధే వేరుగా వుండేది.

ఈ దేశంలో చట్టాలు సామాన్యులపట్ల ఒక రకంగా, అసామాన్యుల పట్ల మరోరకంగా అమలవుతాయి.

ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. టీవీ పెడితే చాలు, పేపరు తిరగేస్తే చాలు. ఇవే వార్తలు.

23, నవంబర్ 2021, మంగళవారం

ఆకాశంబున నుండి, శంభుని శిరంబందుండి – భండారు శ్రీనివాసరావు


సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు హైదరాబాదులో మా చుట్ట పక్కాల్లో చాలా మంది ఫోన్ రిసీవ్ చేసుకోరు. కారణం వారే చెప్పారు. ఆ సమయంలో ఎస్వీ బీసీ (టీటీడీ) టీవీ ఛానల్ లో భగవద్గీత మీద కుప్పా విశ్వనాధ శర్మ గారు అనే పెద్దాయన ప్రవచనం చెబుతారని, దాన్ని క్రమం తప్పకుండా ఆసక్తిగా వింటామని, అంచేత ఫోన్లు మాట్లాడమని.
ఈరోజు ఎందుకో ఛానల్స్ మారుస్తుంటే ఈ ఛానల్ తగిలింది. మా వాళ్ళు చెప్పినట్టు ఓ స్పురద్రూపి, కంచుకంఠంతో భగవద్గీతసారం గురించి చెబుతున్నారు. చ్యవనుడు, కౌశికుడి వృత్తాంతం ఆసాంతం వింటూ పోయాను. ఆసక్తికరంగా అనిపించింది. శర్మగారి ప్రవచనం తర్వాత నారాయణతీర్ధుల వారి కీర్తనలు శ్రవణానందకరంగా అనిపించాయి.
ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అలవాటుగా రిమోట్ టీవీ చర్చల వైపు మొగ్గింది.
అంతే!......... ఇక చెప్పడానికి ఏముంది?
23-11-2021

ఓ తుపాను ముచ్చట – భండారు శ్రీనివాసరావు

 ఏదైనా సాపేక్షమే, కష్టమైనా, సుఖమైనా!

దివి తుపాను సంగతి చాలామందికి తెలిసిన సంగతే. నేనైతే అప్పటికే యాక్టివ్ రిపోర్టింగ్ లోనే వున్నాను.

ఈ తుపాను అదికాదు. దివి సీమ తుపానుకు చాలా ఏళ్ళ ముందు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక తుపాను వచ్చింది. అప్పటికి వార్తా ప్రచార సాధన సంపత్తి లేకపోవడం వల్ల ఆ తుపాను సంగతి ఎవరికీ తెలియలేదు.

ఓసారి వేసవి సెలవులకు మా వూరు వెళ్ళాము. మామూలుగా సెలవులు ఇవ్వగానే ఖమ్మం నుంచి, రెబ్బారం నుంచి పక్కనే ఉన్న పెనుగంచిపోలు నుంచి మా అక్కయ్యల పిల్లలు అందరూ కంభంపాడు చేరడం ఆనవాయితీ. ఆసారి మరో ప్రత్యేకత ఏమిటంటే మా ఇంటి చిన్న అల్లుళ్ళు ఇద్దరూ కుటుంబాలతో వచ్చారు. ఇల్లంతా పిల్లల ఆటపాటలతో, పెద్దవాళ్ళ చతుర్ముఖ పారాయణాలతో, అమ్మలక్కల పచ్చీసు ఆటలతో హడావిడిగా వుంటే వంటింట్లో మా అమ్మ కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఇంతమందికీ వండి వారుస్తుండేది.

ఒకరోజు ఉన్నట్టుండి మబ్బులు కమ్మి వర్షం మొదలైంది. వేసవి వాన కావడం కారణంగా అందరం సంతోషపడ్డాము. సాయంత్రం అయినా తగ్గలేదు. కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలవదు. మా అక్కయ్యలు ఇంట్లో ఓ మూలన పడేసిన లాంతర్లు, బుడ్లు బయటకు తీసి శుభ్రం చేసి దీపాలు వెలిగించారు. ఆ వెలుగులోనే అన్నాలు. ఆరాత్రి గడిచింది. కానీ వాన తెరిపివ్వలేదు. వంటింట్లో నుంచి యధాప్రకారం కాఫీలు, టిఫిన్లు. సాయంత్రమయింది. పొద్దుగూకింది. అయినా వర్షం ఆగలేదు. ఆడవాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. విచారిస్తే తెలిసింది ఏమిటంటే వంటింట్లో పొయ్యి పైకి వున్నాయి. పొయ్యిలో పెట్టడానికే కట్టెలు తడిసిపోయాయి. ఎల్లా! ఆ పూటకి కొంత కిరసనాయిలు వాడి పొయ్యి వెలిగించారు. ఆ పూట ఎలాగో గడిచింది. మర్నాడు కూడా ముసురు తగ్గలేదు. పెరట్లో కూరగాయలు అయిపోయాయి. మూడు పాడి బర్రెల్లో ఒకటి ఇవ్వలేదు, మేత సరిగాలేక కావచ్చు.

తుపాను కష్టాలు మెల్లిమెల్లిగా అర్ధం అవుతున్నాయి. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి. పంచదార పరవాలేదు కానీ కాఫీ పొడుముకు కటకట. అల్లుళ్ళు ఇద్దరికీ సరిపోతే చాలు మిగిలినవాళ్ళు వాళ్ళే సర్దుకుంటారు అని తీర్మానించారు.

అలా పగలూ రాత్రీ తెలవకుండా వర్షం ధారాపాతంగా కురుస్తూనే వుంది. ఐదో రోజున కాస్త తెరిపి ఇచ్చింది.

వాన వెలిసిన తర్వాత దాని బీభత్సం కొద్దికొద్దిగా తెలుస్తూ వచ్చింది. మధిర రైల్వే వంతెన వరదల్లో కొట్టుకు పోయింది. హైదరాబాదు బెజవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిచి పోయాయి. బెజవాడ దగ్గరలో ఒక పాసింజరు రైలు పట్టాలమీద నిలిచిపోయింది. వాళ్లకు ఆహార పానీయాలు లేవు. రైలు ఎప్పుడు కదులుతుందో తెలవదు. వాళ్ళంతా బిక్క చచ్చి రైల్లోనే వుండిపోయారు. పక్క వూరి గ్రామస్తులు ఆ కష్ట కాలంలో వాళ్ళని ఆదుకున్నారు. తుపాను హడావిడి తగ్గిన తర్వాత కేంద్ర రైల్వే శాఖవారు ఒక స్టేషనుకు ఆ ఊరి పేరు పెట్టారు.

మా ఒక్క కుటుంబమే కాదు, మా ఒక్క ఊరే కాదు, అనేక గ్రామాల వాళ్ళు మేము పడ్డ కష్టాలే పడ్డారు. ఏం చేస్తాం మన ఖర్మ అనుకున్నారు.

తిట్టడానికి గవర్నమెంటు ఒకటుందని అప్పుడు తెలవదు.

భయం లేదు! యువతరం గొప్పగా ఆలోచిస్తోంది

 నా తరువాతి తరం వారిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది.

మొన్న మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్ర రావు గారి శత జయంతి జరిగింది. కరోనా లేకపోతె చాలా బాగా చేయాలని కుటుంబం అనుకుంది. కానీ కుదరక జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆ రోజు ఉదయం మా బావగారి మనుమడు  శంతన్ మా ఇంటికి వచ్చాడు. ఈ వేడుక సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికను ముందుగానే అందచేశాడు. దానితో పాటు ఓ కాంగ్రెస్ కండువా పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి చెప్పాడు, పుస్తకం ఆవిష్కరణ సమయంలో మెడలో వేసుకోమని.  

‘ఇదేమిటి ఇది ఎప్పటి నుంచి’ అని అడిగాను.

‘మా తాతగారి మీది గౌరవం. తరాలు మారితే అభిప్రాయాలు, ఆలోచనలు మారడం సహజం. కానీ ఇది మా  తాతయ్య ఫంక్షన్. జీవితాంతం ఆయన కాంగ్రెస్ వాదిగా జీవించాడు. కాంగ్రెస్ సిద్ధాంతాలను పాటించాడు. మా తరం వచ్చేసరికి  మా అభిప్రాయాల్లో మార్పు వచ్చింది. కానీ తాతయ్యను గౌరవించడానికి అవేమీ అడ్డురాలేదు. అడ్డు కాకూడదు కూడా. అందుకే రాత్రి మార్కెట్లు అన్నీ గాలించి ఈ కండువాలు  కొనుక్కుని వచ్చాము. ఇది నా ఒక్కడి ఆలోచన కాదు. మా తాతయ్య మనుమరాండ్రు,  మనుమలం  అందరం కలిసి తీసుకున్న నిర్ణయం’

“తాతయ్యా! (వాళ్ళు నన్ను తాతయ్యా అనే పిలుస్తారు) నీకూ తెలియంది కాదు. ప్రతి ఏడాది మా తాతయ్య పుట్టిన రోజున మా ఇంటిల్లిపాదీ ఖాదీ బట్టలు కొనుక్కుంటాము. ఎన్నో ఏళ్ళుగా ఇలా చేస్తున్నాము, మా తాతయ్య గుర్తుగా

నాకెంతో సంతోషం అనిపించింది. మన అభిప్రాయాలు ఎలా వున్నా పెద్దల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలనే ఆలోచన ఆ తరం వారిలో వున్నందుకు.

సిద్దాంతాలకు విశాలదృక్పథం తోడయితే ఎన్ని సిద్ధాంత విబేధాలు వున్నా ఈ జాతికి వచ్చిన ముప్పేమీ వుండదు.



(23-11-2021)

పెంచిన ప్రేమ – భండారు శ్రీనివాసరావు

తలుపుకు తాళం వేస్తూ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. నిన్న ఉదయమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చారు. వృద్ధాప్యం కారణంగా మాగన్నుగా పడుకొని వుంది. బయట ఓ అరగంట పని. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళాల్సిన పని. ఇంట్లో అలా ఒంటరిగా  వదిలేసి వెడితే....ఎలా ..ఎలా...

అర్జంటు పని ఆలోచనలను కప్పేసింది.

‘ఓ అరగంటలో ఏమౌతుంది?  ‘ఏమీ కాదు’

ప్రశ్న సమాధానం  రెండూ మనసే చెప్పింది.

వెళ్ళిన పని వెంటనే అయిపోయింది. అరగంట లోపలే ఇంటికి తిరిగొచ్చారు. తలుపు తెరవగానే హాలంతా రక్తపు వాంతుల మరకలు. గబగబా వెళ్లి చూస్తే చలనం లేకుండా కింద పడి వుంది. ఈ కాసేపటిలో ఏమౌతుంది  అని వెడితే జరగకూడనిది ఆ కాసేపటిలోనే జరిగిపోయింది. వెంటనే రక్తపు వమనపు జాడలు శుభ్రం చేసి తెలివిలేకుండా పడి వున్న తమ  పెంపుడు కుక్కను భుజానికి ఎత్తుకుని పశువుల ఆసుపత్రికి బయలుదేరాడు.

నెలల పిల్లగా వున్నప్పుడు ఇంటికి తెచ్చుకున్న ఆ జీవిని దాదాపు పద్నాలుగు ఏళ్ళుగా ఎత్తుకెత్తుగా అపురూపంగా పెంచుకుంటూ వస్తున్నారు. ఇన్నేళ్ళుగా తమను అంటిపెట్టుకుని ఇంటికి, తమకు కాపలాగా ఉంటూ వస్తోంది. వయసు ఉడిగింది కదా వదిలించుకుందామనే ఆలోచనే మనసులోనికి రానీయలేదు.

పెంచిన ప్రేమ అలాంటిది. 

(23-11-2021)


గుడిలాంటి ఆ బడిలో నేనూ చదువుకున్నా- భండారు శ్రీనివాసరావు

 బహుశా ఇది జరిగి డెబ్భయ్ ఏళ్ళు పై మాటే! బెజవాడలో ఇద్దరు లాయర్లు కార్తీకమాసంలో కృష్ణానదిలో స్నానం చేసి వస్తున్నారు. వారిలో ఒకరికి ఇసకలో కూరుకుపోయి వున్న ఒక చిన్న విగ్రహం కనిపించింది. తీసి చూస్తే కాలి మీద కాలు వేసుకున్న ఒక వ్యక్తి ప్రతిమ అది. ఆ రోజు గురువారం. ఆ ప్లీడరు గారు దాన్ని ఇంటికి తీసుకువచ్చి ప్రతి గురువారం దానికి పూజ చేయడం ప్రారంభించారు. విగ్రహం దొరికిన తరవాత చాలా ఏళ్లకు హైదరాబాదు నుంచి వచ్చిన ఒక చుట్టం ఆ విగ్రహాన్ని చూసి, ‘ఇదేమిటి! షిరిడీ బాబా విగ్రహం మీ ఇంట్లో ఎలావుంది?’ అని అడిగే దాకా ఆ విగ్రహం సాయిబాబాదని ఆయనకూ తెలియదు. అప్పుడు మొదలయిన ఆ పూజా పునస్కారాలు నేటికీ కొనసాగుతున్నాయి. మరో విశేషం ఏమిటంటే ఇన్నేళ్ళుగా బాబాను క్రమం తప్పకుండా పూజిస్తూవచ్చిన ఆ లాయరు గారు ఎన్నడూ షిరిడీ వెళ్ళిన దాఖలాల్లేవు.

ఆయన గారి పేరు తుర్లపాటి హనుమంతరావు పంతులు గారు. కాశీలో ప్లీడరీ చదివిన హనుమంతరావు గారు స్వార్ధాన్ని గయలోనే వొదిలేసి, బెజవాడలో ప్రాక్టీసు మొదలు పెట్టారు. ఆయన గారి ప్లీడరు ప్రాక్టీసుకు తోటి లాయర్లు అందరూ కలసి షష్టి పూర్తి చేసి కూడా దశాబ్దం దాటిపోయింది. కష్టపడి పై చదువులు చదువుకున్న ఆయనకు చదువన్నా, చదువుకునే వాళ్ళన్నా ఎంతో అభిమానం. తన రాబడిలో ఎక్కువ భాగం, చదువుకునేవారు పై చదువులు చదివించడానికే వెచ్చించారు. విద్యా సౌకర్యాలు అంతగా లేని ఆ రోజుల్లో చుట్టపక్కాల పిల్ల లందరికీ ఆయన గారి ఇల్లే ఓ ఉచిత హాస్టల్. ఎంత మందికో ఆయన విద్యాబుద్దులు నేర్పించి తమ కాళ్ళపై తాము నిలబడేట్టు చేసారు. చదువూ సంధ్యలకు దూరంగా పల్లెటూళ్ళలో రాళ్ళ మాదిరిగా రోజులు వెళ్ళమారుస్తున్న అనేకమంది ఆయన ఇంట్లో వుండి చదువుకుని రతనాలుగా మారారు. తమ తలరాతలు మార్చుకున్నారు. అంతగా కాకపోయినా, జీవితంలో ఓ మోస్తరు స్తాయికి చేరుకున్న నేను కూడా ‘అలాటి వాళ్ళల్లో నేనూ ఒకడిని’ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతాను.
వార్ధక్యం మీద పడ్డా ఆయన ఇచ్చే సలహాలు, సూచనలు బంధు మిత్రులందరికీ శిరోధార్యం. వీధిబడితోనే చదువు చాలించిన ఆయన సతీమణి సరస్వతమ్మ గారు, ఆ ఇంటికి ‘అన్నపూర్ణ’ గా మారి, ఆనాటినుంచి ఇంటిల్లిపాదికీ అమృతం పంచిపెట్టడమే ఒక బాధ్యతగా నెత్తికెత్తుకున్నారు. ఆ ఇంటి కోడళ్ళు, ఆడపడుచులు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
అక్షర బిక్ష పెట్టిన ఆ పెద్దమనిషికి బావమరదిని కావడం, అన్నం పెట్టి పెంచిన ఆ అమ్మకు ముద్దుల తమ్ముడిని కావడం నా పూర్వజన్మ సుకృతం.
2011 నవంబరులో ఆ పుణ్యమూర్తి తన తొంభయ్ మూడో ఏట పుణ్యలోకాలకు తరలివెళ్ళారు.
ఆ అమృత మూర్తుల సంస్మరణ సభ మా బావగారి శతజయంతిని పురస్కరించుకుని 2018లో విజయవాడ ఫార్ట్యూన్ మురళి పార్క్ హోటల్లో ఘనంగా జరిగింది. కుమారులు లాయర్లు అయిన తుర్లపాటి సాంబశివరావు, భైర్రాజు, బైరాజు కుమారుడు మరో కుర్ర లాయరు అయిన విహారి ఈ కార్యక్రమాన్ని అంత్యంత శ్రద్ధతో, కమనీయంగా, కన్నుల విందుగా నిర్వహించారు. మా బావగారితో పరిచయం కలిగిన సీనియర్ లాయర్లు, ప్రస్తుతం ప్రాక్టీసు చేస్తున్న ప్లీడర్లు అనేకమంది హాజరయ్యారు. ఇక ఆయన బంధువుల సంగతి చెప్పక్కర లేదు. దేశవిదేశాల నుంచి కూడా తరలి వచ్చారు. ఆ మహానుభావుడి పట్ల పెంచుకున్న అసాధారణమైన భక్తితాత్పర్యాలు అలా అందరినీ అక్కడికి లాక్కెల్లాయి.
ఆ సభలో ప్రసంగించిన ప్రముఖులందరూ ఏదో మొక్కుబడిగా కాకుండా మనసు పొరల్లోనుంచి మాట్లాడిన విధానం గమనించినప్పుడు ఆయన వొదిలి వెళ్ళిన ముద్ర ఎంతటి బలమయినదో అర్ధం అయింది. ఇంట్లో ఉన్న పాత సైకిల్ అమ్మకుని వచ్చియన్ పదిహేను రూపాయలతో రైలెక్కి కాశీ వెళ్లి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బారిస్టర్ పట్టా స్వర్ణ పతకంతో సాధించి, వృద్దుడయిన తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి బొంబాయిలో వచ్చియన్ రిజర్వ్ బ్యాంక్ ఉన్నతోద్యోగాన్ని వదులుకుని బెజవాడలో ప్లీడరు ప్రాక్టీసు మొదలు పెట్టి , రెండుగదుల అద్దె ఇంట్లోనే ఏళ్ళతరబడి ఉంటూ చదువుమీద వున్న ఆపేక్షతో చదువుకోలేని పేదపిల్లలకు చదువు చెప్పిస్తూ, చుట్ట పక్కాల పిల్లల్ని ఇంట్లో ఉంచుకుని చదివిస్తూ, చదువుకోవడానికి తనమాదిరిగా ఎవరూ కష్టపడకూడదు అనే సదాశయంతో రాబడినంతా ఖర్చుచేస్తూ, ఒక పక్క విద్యాదానం, మరో పక్క అన్నదానం చేస్తూ రెండుచేతులా సంపాదిస్తున్న డబ్బు యావత్తూ స్వార్ధం చూసుకోకుండా ఖర్చు చేసిన మా బావగారి గుణగణాలను సోదాహరణంగా నిండు హృదయంతో గుర్తు చేసిన ఆ ప్రసంగాలు నిజంగా ఆ మహానుభావుడికి నిజమైన శ్రద్ధాంజలి.
ఆయన ధన్య జీవి. సందేహం లేదు. ధన్యజీవితం గడిపి తన తొంభయ్ మూడో ఏట దాటిపోయాడు. అయితే ఆయన ఆశీస్సులు పొందిన మేమందరం కూడా ధన్యులమే.