18, అక్టోబర్ 2021, సోమవారం
పెరుగుట పెరుగుట కొరకే
రావూరి భరద్వాజ అసలు పేరు - భండారు శ్రీనివాసరావు
(జ్ఞానపీఠ అవార్డు పొందిన రావూరి భరద్వాజ వర్ధంతి ఈరోజు)
17, అక్టోబర్ 2021, ఆదివారం
శుభకార్యాల్లో చావుల సంగతి ప్రస్తావించవచ్చా - భండారు శ్రీనివాసరావు
రాజమండ్రి వద్ద గోదావరిపై నిర్మించిన మొట్టమొదటి రైలు రోడ్డు వంతెన ప్రారంభోత్సవానికి రేడియోలో ప్రత్యక్ష వ్యాఖ్యానం బాధ్యత ఉషశ్రీ గారికి అప్పగించారు. ఆ రోజుల్లో మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు బెజవాడలో సమాచార శాఖ అధికారిగా పనిచేస్తూ వుండేవారు. ఆయనా ఉషశ్రీ గారు మంచి స్నేహితులు. ఆ వంతెన ప్రారంభోత్సవానికి వస్తున్నది సాక్షాత్తూ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ కావడంతో అధికారులు ఏర్పాట్లపై మరింత శ్రద్ధ పెట్టారు. వీవీఐపీ ప్రోగ్రాం కాబట్టి ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారం నిమిత్తం పనిచేసేవాళ్ళు, ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. వాటిలో భాగంగానే ఉషశ్రీ గారు, మా అన్నయ్యను కలిసి వంతెన తాలూకు వివరాలు సేకరించారు. అప్పుడు మా అన్నయ్య చెప్పిన సలహా నాకు బాగా జ్ఞాపకం వుంది.
‘రేడియోలో ప్రత్యక్ష
వ్యాఖ్యానం కాబట్టి మధ్యలో విరామాలు ఇవ్వడానికి వీలుండదు. మీరు ఏదో ఒక సంగతి
శ్రోతలకు నిరంతరం చెబుతూనే వుండాలి.
ఎక్కడా బ్రేక్ రాకూడదు. వంతెన వివరాలు ఎలాగూ మీకు ఇస్తాము. కానీ మధ్యమధ్యలో
ఎక్కడయినా వీలుచూసుకుని ఈ వంతెన నిర్మాణంలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తూ
ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని స్మరించుకుంటే బాగుంటుంది’
ఈ సలహా ఆయనకు నచ్చింది. కానీ, ఎందరెందరివో ధర్మసందేహాలు తీర్చగలిగిన ప్రతిభాశాలి ఆయనకే ఒక అనుమానం పొడసూపింది. శుభమా అంటూ కార్యక్రమం జరుగుతుంటే చనిపోయిన సంఘటనలు
గుర్తు చేయడం బాగుంటుందా అని.
దీనికి సమాధానం ఆరోజు ప్రధాని
ప్రసంగంలోనే లభించింది.
‘ఆసియాలోనే అతి పొడవైన రైలు రోడ్డు వంతెనను ప్రారంభోత్సవం చేయడం నాకు ఎంతో
ఆనందాన్ని కలిగిస్తోంది. అత్యంత క్లిష్టమైన ఈ ఇంజినీరింగ్ ప్రక్రియను జయప్రదంగా
పూర్తిచేయడంలో అవిరళ కృషి చేసిన ఇంజనీర్లను, కార్మికులను అభినందిస్తున్నాను. అయితే ఇదే
సమయంలో ఈ బృహత్తర కార్యక్రమ నిర్వహణలో అసువులు
బాసిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను’
63 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ వంతెన నిర్మాణం 1972 లో పూర్తయింది. రాజమండ్రి, కొవ్వూరులను కలుపుతూ నిర్మించిన ఈ
వంతెన అప్పట్లో ఆసియా ఖండంలోనే అతి పొడవైనదిగా చెప్పుకునే వారు. ఈ వంతెనకు
అధికారికంగా ఏం పేరు పెట్టారో తెలవదు కానీ స్థానికులు మాత్రం కొవ్వూరు బ్రిడ్జ్ అనే పిలుచుకునే వారట.
NOTE: రాజమండ్రి దగ్గర ఎన్ని కొత్త వంతెనలు వచ్చాయో నాకు తెలియదు. నా పోస్టు ఉద్దేశ్యం జాతికి పనికి వచ్చే ఇలాంటి ప్రాజెక్టులు ఎవరి హయాంలో కట్టారు అని కాదు వాటికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అనేది
వివరించడానికి మాత్రమే.
16, అక్టోబర్ 2021, శనివారం
ఎక్కువైనా తక్కువైనా కొట్లాటే
ఓ ఇరవై ఏళ్ళ క్రితం నాకు తెలిసిన కుటుంబం నగరంలో ఒక కాలనీలో రెండంతస్తులతో ఇల్లు కట్టుకున్నారు. మేము గృహ ప్రవేశానికి కూడా వెళ్ళాము. ఇంటి ఎదురుగా పెద్ద చెరువు. కాకపోతే నీళ్ళు ఆట్టే లేవు. వీళ్ళ ఇల్లు నిజానికి ఆ చెరువుకు నీళ్ళు పారే ప్రదేశంలో వుంది. చెరువుకు నిండా నీళ్ళు వస్తే ఇబ్బంది పడతారేమో అని చెప్పాలనిపించింది. కానీ సందర్భం కాదేమో అని ఊరుకున్నాను.
అంత చక్కటి ప్రదేశంలో మంచి ఇల్లు కట్టుకున్నందుకు వచ్చిన వాళ్ళు అందరూ గృహస్తును అభినందించారు. అప్పటికే ఆ కాలనీలో చాలా సుందర భవంతులు వెలిశాయి. చూడగానే సంపన్నుల కాలనీ అనిపించేదిగా వుంది. ఆ రోజుల్లో ముఖ్యమంత్రికి నగర సుందరీకరణ మీద మక్కువ ఎక్కువ కావడంవల్ల ఆ చెరువు కట్టను అందమైన మినీ టాంక్ బండుగా తీర్చిదిద్దారు. దానితో ఆ కట్టకు దిగువన దీనిని తలదన్నే మరో కాలనీ వెలిసింది. సరే కొంత కాలం ఆ కాలనీ వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళు సఖ్యంగానే వున్నారు.
ఆ సమయంలో ఇప్పటిలాగే కనీవినీ ఎరుగని వర్షాలు కురిసి చాలా కాలనీలు వరద ముంపుకు గురయ్యాయి. చెరువు నిండి ఆ ప్రవాహం వెనక్కి రావడంతో ఎగువ కాలనీలోని ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి. మునిగిపోతాయన్న భయంతో వాళ్ళు ఆ చెరువు కట్టకు గండి కొట్టే ప్రయత్నం చేయబోయారు. అంతే! దిగువన వున్న కాలనీవాళ్ళు గండి కొడితే తమ కాలనీ మునిగిపోతుందని భయపడి ఎగువ కాలనీ వాళ్లకు ఎదురు తిరిగారు. అప్పటిదాకా సఖ్యతగా ఉన్న రెండు కాలనీల వాళ్ళు ఒకరికొకరు పరమ శత్రువులు అయిపోయారు.
ఈ లోగా వరుణుడు శాంతించడం, వరద తగ్గు ముఖం పట్టడంతో పెద్ద సంఘర్షణకు అవకాశం లేకుండా పోయింది. ప్రకృతి ప్రజలకు ఉచితంగా ప్రసాదించే
నీరు తక్కువైనా కష్టాలే, ఎక్కువైనా కష్టాలే! అయితే ఈ కష్టాలకు
తామే కారణం అని ప్రజలకూ తెలుసు. కానీ తెలియనట్టుగా ఉండిపోతారు.
15, అక్టోబర్ 2021, శుక్రవారం
ఆర్కే ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు
ఆర్కే పోయాడు అనగానే ‘అయ్యో పాపం! అలానా’ అన్నవాళ్లు, ‘ఎన్కౌంటర్ లోనా!’ అని నొసలు విరిచిన వాళ్ళు వున్నారు.
14, అక్టోబర్ 2021, గురువారం
కులాల ప్రసక్తి అవసరమా – భండారు శ్రీనివాసరావు
మా బావగార్లలో
ఇద్దరు శ్రీ అయితరాజు రామారావు (వల్లభి), శ్రీ కొలిపాక
రామచంద్ర రావు (రెబ్బారం) స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఖమ్మం జిల్లాలో బ్రిటిష్
వ్యతిరేక ఆందోళనలు నడిపి పద్నాలుగు మాసాలకు పైగా కఠిన జైలు శిక్ష
అనుభవించారు. మహాత్ముని బోధనలకు ప్రభావితులై తమ గ్రామాల్లో అంటరానితనాన్ని
నిర్మూలించే విషయంలో గ్రామీణులను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించేవారు.
వున్నవాళ్ళు, లేనివాళ్ళు అనే తేడా లేకుండా వూరివాళ్ళతో రోజంతా తిరిగొచ్చి మళ్ళీ ఇంట్లో
అనుష్టానాలు చేసేవాళ్ళు. అన్ని కులాలవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో స్వేచ్చగా మసిలేవాళ్ళు.
భోజనాలు చేసేవాళ్ళు. అందరూ వాళ్ళది కాంగ్రెస్ మడి’ అనే వాళ్ళు. పెద్ద బావగారు
అయితరాజు రామారావు గారు వాళ్ళ వూరు
వల్లభిలో ఏకంగా ఒక హరిజనుడిని రామాలయ పూజారిగా నియమించారు. ఆ రోజుల్లో అదొక సంచలన
వార్త. మా నాన్నగారు మా వూరు కంభంపాడు కరణం. ఆయన దగ్గర
పనిచేసే వెట్టి వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందు వాళ్ళకోసం ఒక చావిడి లాంటిది
వుండేది. ఆయన మరణించిన తర్వాత కరణీకం బాధ్యతలు స్వీకరించిన మా మూడో అన్నయ్య భండారు
వెంకటేశ్వరరావు చేసిన మొట్టమొదటి పని ఆ చావిడిని నేలమట్టం చేసి వెట్టివారిని
ఇంట్లో తిరిగేలా చేయడం. వూళ్ళో నిరసన వెల్లువెత్తినా మా అన్నయ్య లెక్కచేయలేదు. ఆయన
చనిపోయిన రోజు ఊళ్ళోని దళితులందరూ ఆడామగా తేడా
లేకుండా దహన సంస్కారాల్లో పాల్గొన్నారు.
మా బాబాయి కుమారుడు భండారు సత్యమూర్తి అన్నయ్య మా గ్రామానికి సుదీర్ఘ కాలం
సర్పంచ్ గా పనిచేశారు. ఊళ్ళోని అన్ని కులాల వారు ఆయన్ని బాగా అభిమానించే వారు. ఆయన
గుండెపోటుకు గురై ఆకస్మికంగా
మరణించినప్పుడు ఇది మరింత ప్రస్పుటంగా కనబడింది. మామూలుగా పాడె మీద కాకుండా బండి
మీద పడుకోబెట్టి మనుషులు లాగుతూ ఊరేగింపుగా దాన్ని శ్మశానానికి చేర్చారు. ఆయనకీ తల కొరివి
పెట్టే హక్కు మాకూ వుందని బహిరంగంగా ప్రకటించి అలాగే చేశారు. ఇంట్లో వాళ్ళు కూడా
వాళ్ళ డిమాండ్ కాదనలేని పరిస్థితి. ఆరోజు మొత్తం గ్రామంలో ఎవరింట్లో పొయ్యి
వెలిగించలేదు.
“అంటరానివాడు, అని మీరు
అనుకుంటున్నవాడు, అంటుకున్నాడో, ఇక ఆరని మంటే” అని మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాల రావు గారు
ఏకంగా ఒక కవితలో రాశారు.
ఈ నేపధ్యం వుంది
కాబట్టి వివిధ రాజకీయ పార్టీల్లో SC నాయకులను ఒక
ప్రశ్న అడుగుతూ వచ్చాను, మహాత్మా గాంధి వారిని ఉద్దేశించి పెట్టిన పేరు ‘హరిజన్’ అనే పేరు ఎందుకు
మార్చారని. అసలా పదం వాడకూడదు, వారిని SC లుగా మాత్రమే
వార్తల్లో పేర్కొనాలని రేడియోలో పనిచేసేటప్పుడు తెలుసుకుని ఆశ్చర్య పోయాను. నిజంగా
‘హరిజన్’ అనేది నిషేధిత పదమా! అందులో ఏదైనా మతానికి సంబంధించిన అన్వయం నాటి
పాలకులకి స్పురించి అలా చేశారా అనే అనుమానం ఇప్పటికీ తీరలేదు. వారి నుంచి
సంతృప్తికరమైన సమాధానం ఇంతవరకు లభించలేదు.
నా పోస్టులను ఫాలో
అయ్యేవారు ఒక విషయాన్ని గమనించే వుంటారనే నమ్మకంతో ఇది రాస్తున్నాను.
సాధ్యమైనంతవరకు, ఎంతో అవసరమైన సందర్భాలలో తప్ప నేను కులాలు, మతాల ప్రసక్తి
తీసుకురాను. ఫేస్ బుక్ అనేది అయినా ‘మనుషుల నడుమ మతాల గళ్ళు, కులాల ముళ్ళు లేని ప్రపంచంగా’ వుంటే బాగుటుందని, ఇందులో విహరించే
కాస్త సమయంలో అయినా వాటికి అతీతంగా వుంటే ఇంకా ఎంతో హాయిగా ఉంటుందని భావించే
అనేకమందిలో నేనొకడిని.
ఇది చరిత్ర
రికార్డుకు అవసరమయ్యే అంశం కాబట్టి, కేవలం
తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నా సందేహం తీర్చాలని కోరుకుంటున్నాను.