18, అక్టోబర్ 2018, గురువారం
17, అక్టోబర్ 2018, బుధవారం
ఏవిటి లాభం అంటే అదే లాభం – భండారు శ్రీనివాసరావు
‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నన్ను కష్టపెట్టడానికే పుట్టారు’ అనేది ఓ నలభయ్ ఏళ్ళ క్రితం నాకున్న ఓ నిశ్చితాభిప్రాయం.
అది చిన్నప్పుడు బలవంతాన కలరా సూదిమందు ఇచ్చిన సర్కారు మనిషి కావచ్చు, అడిగిన అప్పచ్చులు వెంటనే పెట్టలేదని నేను కోపం పెంచుకున్న మా బామ్మ కావచ్చు, హోం వర్కు చేయలేదని నా వీపు వాయగొట్టిన లెక్కల మాస్టారు కావచ్చు, దాచిపెట్టుకున్న గోలీలు కాజేసిన నా బెస్టు ఫ్రెండు కావచ్చు ఇలా ఈ డెబ్బయి ఏళ్ళ పైచిలుకు సాగిన నా ఈ జీవితంలో, ప్రతి దశలో ఎవరో ఒకరు నన్ను కష్టపెడుతూనే వచ్చారని అదేమిటో ఓ పిచ్చి నమ్మకం. ఆ నమ్మకంతోనే వాళ్ళతో పెరుగుతూ విరుగుతూ వచ్చిన మానవ సంబంధాలు.
ఇన్నేళ్ళ తరవాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏమిటో అంతా విష్ణుమాయ.
‘ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నన్ను సుఖపెట్టడానికే పుట్టారు’ అనేది కొత్తగా మొగ్గ తొలుస్తున్న భావన.
అది పొరుగింటివారు కావచ్చు, ఆటో డ్రైవరు కావచ్చు, ఇంట్లో పొద్దున్నే పత్రికలు వేసే పేపరు బాయి కావచ్చు, ఇలా ఎందరెందరో వాళ్ళ సుఖాల్ని వదులుకుని నన్ను సుఖపెడుతున్నారనే అభిప్రాయం నాలో నాకే ఒక కొత్త మనిషిని చూపిస్తోంది.
ఈ ఎరుక నలభయ్ ఏళ్ళ క్రితమే కలిగివుంటే ఈనాడు నాకు ఎటు చూసినా మంచి మిత్రులే వుండేవాళ్ళు. అలాంటి విలువయిన సంపదను నేనే చేతులారా పోగొట్టుకున్నానన్నమాట.
ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం?
‘ఏం లాభం అనే ప్రశ్నే శుద్ధ వేస్టు. మనిషి ఆలోచనా ధోరణి మంచిగా మారడం అనేది ఏ వయస్సులో జరిగినా అది లాభమే. నీకే కాదు, నీ చుట్టూ వున్న సమాజానికి కూడా’ అన్నాడు మా మేనల్లుడు రామచంద్రం.
లేబుళ్లు:
ఏవిటి లాభం అంటే అదే లాభం
16, అక్టోబర్ 2018, మంగళవారం
మా మంచం కధ – భండారు శ్రీనివాసరావు
మేము కాపురం పెట్టిన పదేళ్లకు కాబోలు మొట్టమొదటిసారి
మొదటి మంచం కొనుక్కున్నాము. ఇందుకోసం నేనూ మా ఆవిడా కలసి పెద్ద సర్వేనే చేసాం.
ఎక్కడమంచివి కొనుక్కోవచ్చని కాదు, ఎక్కడ కారు చౌకగా దొరుకుతాయాయని.
మొత్తం మీద లక్ డి కా పూల్ టెలిఫోన్ భవన్ దగ్గర మాకు తగ్గ షాపువాడు ఒకడు
దొరికాడు. డెకొలం షీట్ వేసిన సింగిల్ కాట్స్ రెండూ కలిపి రెండువందల యాభయ్ రూపాయలు.
షాపువాడే రిక్షాలో వేసి పంపిస్తానన్నాడు. సాయంత్రానికల్లా అవి దిగాయి. వున్న రెండు
గదుల్లో ఒక రూమును ఫినాయిల్ వేసి కడిగి సిద్ధంగా ఉంచాము. మంచాలు వేయగా కాస్త కాళ్ళు కదపడానికి కాసింత జాగా
మిగిలింది. మంచాలు అయితే వచ్చాయి కానీ వాటిమీద పరుపులు కొనడానికి మళ్ళీ ఒక నెల
ఆగాల్సి వచ్చింది. ఏ పని చేయాలన్నా ఫస్ట్ తారీకు రావాలికదా.
మొత్తం మీద పరుపులు కూడా అమిరాయి. ఇక ఆ
మంచాలే మాకు సర్వస్వం అయిపోయాయి. నలుగురు కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవాలన్నా,
చీట్ల పేకలు ఆడుకోవాలన్నా, ఆ మంచాల మీదనే. డైనింగ్ టేబుల్ అమిరేవరకు టిఫిన్లు,
భోజనాలు కూడా వాటిమీదనే. నిజం చెప్పొద్దూ భోజనాల బల్లలు కొనుక్కున్న తర్వాత కూడా మంచాల
మీద కూర్చునే అన్నాలు తినేవాళ్ళం.
ఉండడానికి మరో రూము వుంది కానీ, ఆ గది
పగలల్లా అమ్మవొడి. అంటే మా ఆవిడ నడిపే చైల్డ్ కేర్ సెంటర్ అన్నమాట. పదిహేను
ఇరవైమంది పసిపిల్లలు, చిన్న పిల్లలతో కీసర బాసరగా వుండేది. సాయంత్రం కాగానే
శుభ్రంగా కడిగించి వుంచేది. ఇక అప్పటినుంచి అది పర్మిషన్ అక్కరలేని పేకాట క్లబ్ గా
మారిపోయేది. పెద్దపెద్ద వాళ్ళు సాయంత్రానికల్లా అక్కడ జమయ్యేవాళ్ళు. అలా కాలక్షేపం చేసిన వాళ్ళు చాలామంది జీవితంలో చాలా పెద్ద స్థానాలలోకి చేరుకున్నారు. ఈ మధ్యనే
జ్వాలాకు ఒక ఆలోచన వచ్చింది కూడా, అప్పటి
క్లబ్ సభ్యులతో కలసి ఒక గెట్ టు గెదర్ ఏర్పాటు చేయాలని. ఇక మా ఆవిడ అమ్మవొడిలో
పెరిగిన పిల్లలు అనేకమంది ఇప్పుడు
విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
ఇలా అందరికీ కలిసొచ్చిన ఆ చిక్కడపల్లి
ఇల్లు ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్ మెంటుగా మారిపోయింది. మాస్కో వెళ్ళేంతవరకు మేము ఆ
ఇంట్లోనే అద్దెకు ఉన్నాము. ముప్పయ్యేళ్ళ తరవాత కూడా ఆ ఏరియాలో అమ్మవొడి అంటే
గుర్తుపట్టేవాళ్ళు వున్నారు.
సందర్భం వచ్చింది కాబట్టి ఓ విషయం
చెప్పుకోవాలి. నేను ఉదయం ఆరుగంటల కల్లా బయలుదేరి ఆఫీసు కారులో రేడియో స్టేషన్ కు
వెళ్లి పొద్దుటిపూట ప్రసారం అయ్యే న్యూస్ బులెటిన్
తయారుచేసి వార్తల అనంతరం ఏడున్నర కల్లా మళ్ళీ
ఇంటికి చేరేవాడిని. అలా అప్పుడు పక్క
ఎక్కితే మళ్ళీ మిట్ట మధ్యాన్నమే దిగడం. తర్వాత సెక్రెటేరియేట్, ఆఫీసు చూసుకుని
సాయంత్రం వచ్చేవాడిని. ఇది ఎవరికంటా పడలేదు కానీ, నేను పొద్దస్తమానం ఇంట్లో
పడివుండడం మాత్రం ఇరుగింటి పొరుగింటి అమ్మలక్కల కంటపడింది. నాకు ఉద్యోగం లేదనీ,
అందుకే ఇల్లు నడపడానికి మా ఆవిడ ఇలా కేర్ సెంటర్ నడుపుతోందని వాళ్లకి వాళ్ళే
తీర్మానించుకుని మా ఆవిడమీద బోలెడు జాలి, నా మీద లేనిపోని అక్కసు పెంచుకున్నారు
(ట). ‘ సెక్రెటేరియేట్ లో మా వారికి తెలిసిన వాళ్ళు వున్నారు. ఏదో కొలువు
ఇప్పిస్తారు, మీ వారిని ఓసారి కలవమని చెప్పండి’
అన్నదో ఆవిడ నేరుగా మా ఆవిడతోనే.
ఆ అమ్మలక్కలు అందించిన ఆ ఆయుధం నన్ను ఆట
పట్టించడానికి మా ఆవిడకు కొన్ని రోజులు బాగా ఉపయోగపడింది.
15, అక్టోబర్ 2018, సోమవారం
మా బామ్మ మంచం నా కంచం – భండారు శ్రీనివాసరావు
అరవై ఏళ్ళ కిందటి జ్ఞాపకం. మా
బామ్మగారికి అప్పుడు అరవై ఏళ్ళు పైమాటే. మా కుటుంబానికి ఆవిడ విక్టోరియా రాణి. మా
నాన్నగారు నాకు ఎరుకలేని చిన్నవయస్సులోనే పోయారు. ఆయనకు ఏడుగురు ఆడపిల్లలు.
నలుగురు మగపిల్లలం. అయిదుగురు అక్కయ్యలకు ఆయన హయాములోనే పెళ్ళిళ్ళు అయ్యాయి.
మగపిల్లలం చాలా చిన్నవాళ్ళం. మగ దక్షత లేని కుటుంబ భారాన్ని ఆవిడ అప్పటినుంచీ భుజాలకు
ఎత్తుకుంది. లెక్కలు చెప్పుకోవడానికి పెద్ద ఆస్తి. కానీ లెక్క తీస్తే అయివేజు
అంతంత మాత్రం.
ఇదంతా ఎందుకంటే మా ఇంటికి మా బామ్మగారే
మకుటం లేని రాణి అని చెప్పడానికి. ఇంట్లో ఆవిడకూ, మా అమ్మగారికీ వెండి భోజనం
పళ్ళేలు, వాటి మధ్యలో ఒక బంగారం పువ్వు.
పక్కనే వెండి గ్లాసులు. ఇంకా వెండి సామాను వుండేది కానీ అవన్నీ ఇనప్పెట్టె లోనే.
వాటి తాళం చెవులు మా బామ్మగారి దిండు కిందా. ఇంట్లో మిగిలిన వాళ్ళ కంచాలు అన్నీ రాతెండివే. బయటనుంచి వచ్చిన
వాళ్ళకోసం మా అమ్మగారు దొడ్లో ఉన్న బాదం చెట్టు ఆకులతో విస్తళ్ళు కుట్టేది.
కంచమే కాదు, మా బామ్మగారి మంచం కూడా సపరేటే. ఇంట్లో చాలా మంచాలు, నవారువీ,
నులకవీ ఉండేవి. ఆమె మంచం మాత్రం ఆమెకే ప్రత్యేకం. మిగిలిన మంచాల మీద ప్రోటోకాల్
ప్రకారం దిండ్లూ, దుప్పట్లూ మారుతుండేవి. అంటే బావగార్లు కానీ అతిధులు కానీ వస్తే
వాళ్లకు నవారు మంచాలు. మిగిలిన వాళ్లకి నులక మంచాలు. ప్రతి రోజూ ఉదయం పూట ఈ
మంచాలకు సళ్ళు లాగి బిగించే కార్యక్రమం ఒకటి నడుస్తుండేది. దాన్ని మా ఆరో అక్కయ్య
ప్రేమక్కయ్య పర్యవేక్షించేది. లాంతర్లు, బుడ్డి దీపాలను ముగ్గుతో తుడిచి శుభ్రం
చేసి, కిరసనాయిల్ పోసి సిద్ధం చేసే పని మా ఏడో అక్కయ్య భారతక్కయ్య మీద పడేది.
అప్పటికి వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు కాలేదు.
కంచాలతో కదా మొదలు పెట్టింది. అప్పుడప్పుడే
స్టెయిన్ లెస్ స్టీల్ కంచాలు మార్కెట్లోకి వస్తున్న రోజులు అనుకుంటాను. మా ఇంట్లో
అప్పటికి అవి గృహ ప్రవేశం చేయలేదు. మా రెండో అక్కయ్య శారదక్కయ్య ఓసారి పండక్కి
వస్తూ రెండు స్టీలు భోజనం పళ్ళేలు తెచ్చి నాకు ఒకటీ, మూడో అన్నయ్య వెంకటేశ్వర
రావుకూ ఒకటీ ఇచ్చింది. అప్పట్లో వాటి ఖరీదు
రెండూ కలిపి పదిహేను రూపాయలు. అంటే కరణీకం చేస్తున్నప్పుడు మా నాన్నగారి మూడు నెలల
జీతం అన్న మాట. ఇహ అప్పుడు చూడాలి మా మోహంలో సంతోషం. ఏనుగు ఎలా వుంటుందో
తెలవదు కానీ అదెక్కినంత ఆనందం.
మా అక్కయ్య ఇచ్చిన ఆ కంచం మీద నాకు మోహం
ఎంతగా పెరిగిపోయిందంటే అది నాకే సొంతం అనుకునేవాడిని. ఆ తర్వాత ముప్పయ్ ఏళ్ళకు
పైగా అది నాతోనే వుంది. 1987లో మాస్కో వెళ్ళేటప్పుడు లగేజి సమస్య కారణంగా ఆ కంచంతో నా రుణానుబంధం
తెగిపోయింది.
తిరిగొచ్చిన తర్వాత లోకమే మారిపోయింది.
డిన్నర్ ప్లేట్లు, డిన్నర్ సెట్లు వచ్చిపడిన తర్వాత, చాలా కొద్ది మంది ఇళ్ళల్లో
తప్ప, ఇప్పుడు ఈ విడి కంచాల గోల లేదు.
మళ్ళీ ముప్పయ్యారేళ్ళ తర్వాత మా ఆవిడకు
కలిగిన వింత కోరిక పుణ్యమా అని నాకు తిరిగి సొంత కంచం వైభోగం వచ్చిపడింది. మొన్న
బజారుకు వెళ్లి దసరా పండుగ సందర్భంగా చేసిన కొనుగోళ్లలో భాగంగా నాకు ఒక స్టీలు
కంచం కొనుక్కొచ్చింది.
నిన్న దానికి ప్రారంభోత్సవం చేయాలని
సంకల్పం. దేవుడు మరోలా అనుకున్నాడు. కంచం మధ్యలో ఆ స్టీలు కంపెనీ వాడు ఒక పెద్ద
స్టిక్కరు అతికించి కూర్చున్నాడు. దాన్ని తీయాలని మా పనిమనిషి గోటితో
ప్రయత్నించింది. ఆ స్టిక్కరు ఊడిరాకపోగా అది
వికటించి మరింత వికార స్వరూపం సంతరించుకుంది. ఇరుగింటి పొరుగింటి చిన్న ఆడ లేడీస్
(మరి మేము మాత్రమే ఈ అపార్ట్మెంట్లో అందరికీ ఆంటీలం,అంకుళ్ళం! ఆ చిన్నవాళ్ళను, మరీ అంత చిన్నవాళ్ళేమీ కాదులెండి,
పిల్లలకు పిల్లలు ఉన్నవాళ్ళే, కానీ ఆంటీ అంటే మాత్రం ఎంతో నొచ్చుకుంటారు) కలగచేసుకుని,
నీళ్ళు సలసలా మరగబెట్టి, ఆ వేడి వేడి
నీళ్ళు గుమ్మరించి ఆ కంచానికి అభ్యంగన స్నానం, సంప్రోక్షణ వగైరా సలక్షణంగా
పూర్తి చేశారు కానీ, ఆ స్టిక్కరు మాత్రం పోలింగు బూతులో వేలికి అసహ్యంగా అంటించిన ‘గుర్తు’
మాదిరిగా అలాగే వుండిపోయింది.
ఓ డౌటనుమానం కూడా మనసులోనే మిగిలి
పోయింది.
‘అవునూ! ఈ స్టెయిన్ లెస్ స్టీల్
కంపెనీల వాళ్లు తమ కంపెనీ స్టిక్కరు కంచాలకు వెనుక భాగంలో అరచేతి మందాన అంటిస్తే
వాళ్ళ సొమ్మేమయినా పోతుందా!’
లేబుళ్లు:
నా మంచం నా కంచం –
13, అక్టోబర్ 2018, శనివారం
ఐటీ ముఖ్యమంత్రికి ఐటీ తలపోటు – భండారు శ్రీనివాసరావు
ఐటీ
(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) అనగానే గుర్తొచ్చే రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే ఇప్పుడు మరో రూపంలో (ఐటీ) ఆయనకు ఓ తలనొప్పిగా తయారయింది.
ప్రస్తుతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) చేస్తున్న దాడులు
రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. గత మార్చి మాసంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి నుంచి
తెలుగు దేశం పార్టీ వైదొలగిన తర్వాత ఇలాంటి పరిణామాలు తప్పకుండా చోటుచేసుకునే అవకాశాలు వున్నాయని టీడీపీ వర్గాలు
మొదటి నుంచీ అనుమానిస్తూనే వున్నాయి. ఇందుకు
తోడు, బీజేపీ స్థానిక నాయకుల నోట ‘చుక్కలు
చూపిస్తాం’ అనే మాటలు రావడం, వాటిని సాకుగా చూపుతూ ఈ ఐటీ దాడులు కేవలం రాజకీయ
కక్షతో జరుగుతున్నాయని టీడీపీ నాయకులు ఎదురు దాడి ప్రారంభించడం ఈ ఐటీ తిత్లీ తుపానుకు ఆద్యం
పోశాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాజకీయంగా దెబ్బతీసే లక్ష్యంతో
సాగుతున్నాయనే సందేహాలు వ్యక్తం చేస్తూ ఆ తెలుగునాట చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
రాష్ట్ర
విభజన చట్టం ప్రకారం 2014 జూన్ రెండో తేదీన మునుపటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. అంతకు
ముందే ఉమ్మడి రాష్ట్రంలో విభజిత రాష్ట్రాల
అసెంబ్లీలకు విడి విడిగా ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో గెలుపొందిన టీఆర్ఎస్ అధినేత
కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తిధి వార నక్షత్రాల పట్టింపులు జాస్తి అని చెబుతారు.
కానీ ఆయన ఏమాత్రం కాలయాపన చేయకుండా, జూన్ రెండో తేదీనే
నూతన తెలంగాణా రాష్ట్రపు తొలి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసారు.
మరో
పక్క నూతన ఆంధ్రప్రదేశ్ మొదటి
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు మరో ఆరు రోజులు ఆగి ఎనిమిదో తేదీన ముహూర్తం
పెట్టుకుని మరీ పదవీ ప్రమాణ స్వీకారం చేసారు. నిజానికి ఇలాంటి నమ్మకాలు ఆయనకు చాలా
తక్కువ అని తెలిసినవాళ్ళు చెప్పుకుంటారు. మంత్రివర్గ సమావేశాలకు కూడా ముహూర్తాలు
ఎంచుకోవడం ఆయన్ని ఎరిగిన వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసింది.
ముహూర్త
బలమో ఏదో తెలియదు కానీ, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న నాటినుంచి ఈరోజు
వరకు ఆయనకు కంటిమీద కునుకులేని రాత్రులే.
ఆయన ఒక్కడే కాదు, ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహనరెడ్డితో సహా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నెరిపే వారెవ్వరూ కూడా నిద్రలేని
రోజులే గడుపుతున్నారు అంటే అతిశయోక్తి లేదు. ఆ రాష్ట్ర రాజకీయాలు ఆవిధంగా
తయారయ్యాయి. పొరుగున ఉన్న తమిళనాడును తలపించేలా సాగుతున్నాయి. పాలకపక్షం,
ప్రతిపక్షం ఒకరినొకరు శత్రు పక్షాలుగా భావించుకుని రాజకీయాలు చేస్తున్నాయి.
రోజుకు
పద్దెనిమిది గంటలు పనిచేస్తాడనే మంచి పేరు ఇప్పటికే చంద్రబాబు ఖాతాలో వుంది. ‘నేను
నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అని తరచూ చంద్రబాబు చెప్పే మాటలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. గతంలో ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పరిపాలనలో
తల మునకలుగా వుండి ఆయన నిద్ర పోలేదు. ఈసారి పదమూడు జిల్లాల కొత్త రాష్ట్రపు
ముఖ్యమంత్రిగా సమస్యల అమావాస్యల నడుమ చిక్కిన చంద్రుడిలా సరిగా నిదుర పోలేని పరిస్తితి.
దేశ
విదేశాల్లో ఆయనకు అభిమానులు వున్నారు. టెక్నాలజీని తెలుగు ప్రజలకు పరిచయం చేసిన
ముఖ్యమంత్రిగా గుర్తు పెట్టుకునేవాళ్ళు ఈనాటికీ వున్నారు. పొరబాటున ప్రజలు మరచిపోతారేమో
అన్నట్టుగా చంద్రబాబు మధ్య మధ్య ఈ విషయాన్ని గుర్తుచేస్తుంటారు కూడా.
గతంలో
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కంప్యూటర్లు, వాటి పరిభాష జనాలకు కొత్త. ఆయన ఏం
చెప్పినా, ఏం చేసినా వారికి ఓ వింతగా వుండేది. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా హైదరాబాదు
నగరంలో కలయ తిరుగుతూ, బస్సు నుంచే సెల్ ఫోనులో సంబంధిత మునిసిపల్ అధికారిని
నిద్రలేపి, ‘నేను, చంద్రబాబును మాట్లాడుతున్నాను, ఎందుకు ఇక్కడ ఇలా చెత్త పేరుకుపోయింది’
అని ప్రశ్నిస్తుంటే ఆ బస్సులో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న విలేకరులు కూడా విస్తుపోయిన
రోజులకు నేనే సాక్షిని.
ఇలాటి
సంఘటనలు చిలవలు పలవులుగా ప్రాచుర్యంలోకి వచ్చి ఆయనకు ఐటీ ముఖ్యమంత్రి అనే బిరుదును
కట్టబెట్టాయి. ఆ నాటి యువజనంలో ఆయన పట్ల ఒక రకమయిన ఆరాధనా భావాన్ని కలగచేసాయి.
ఇదంతా
గతం. ఒకప్పుడు నేను సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే మా ఊరిజనం వింతగా చూసేవాళ్ళు.
ఇప్పుడు వరికోతలకు పోయేవాళ్ళ చేతుల్లో కూడా మొబైల్ ఫోన్లు కానవస్తున్నాయి. ఈ
తేడాను పాలకుడు అనేవాడు మరింత గమనంలో పెట్టుకోవడం అవసరం. కంప్యూటర్లు, వాటి పరిభాష
ఇవన్నీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా కరతలామలకం. వారిముందు మన ప్రతిభ ప్రదర్శించాలని చూడడం సబబుగా వుండదు. నిజానికి
పాత తరం ఈ కొత్త విషయాలను వారినుంచే తెలుసుకోవాల్సిన పరిస్తితి ఈనాడు వుంది.
సరే.
అసలు విషయానికి వద్దాము.
నిజానికి
ఐటీ దాడులు అనేవి శాఖాపరంగా జరిగేవి. సాధారణంగా పన్ను కట్టని వారిపై జరుగుతుంటాయి.
పన్ను కట్టడం, కట్టకపోవడం లేదా ఆదాయానికి
తగిన లెక్కలు చూపడం, చూపక పోవడం అనేవి జైలుకు పంపించేటంత స్థాయి నేరాలు కావు. వడ్డీతో
సహా కడితే ఆ కేసు అంతటితో మూసివేస్తారు. కాకపొతే డబ్బును అక్రమంగా వేరేవాళ్ళ
ఖాతాలోకి మళ్ళించడం, విదేశాలకు చేరవేయడం వంటివి ప్రమాదకరం. ఆదాయపు లెక్కలు తేల్చేవారికి
ఈ వివరాలు తెలుస్తాయి. అలాంటి ఆధారాలు ఏవీ సోదాల్లో దొరకక పొతే పేచీయే లేదు.
కాకపొతే,
రాజకీయ కోణం. ఇప్పుడు చర్చలు అన్నీ దీని చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. బీజేపీతో
తెగతెంపులు చేసుకుని, కేంద్రాన్ని ప్రశ్నించడం మొదలెట్టిన తర్వాతనే ఈ దాడులు,
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినవాళ్ళమీదా, లేదా చంద్రబాబుకు బాగా సన్నిహితులయిన
వాళ్ళమీదా ఒక పధకం ప్రకారం జరుగుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దాడులు
జరిగిన సమయాన్ని, విధానాన్ని గమనంలోకి తీసుకుంటే వారి వాదన సబబే అనిపిస్తుంది.
అయితే, ఎందుకీ దాడులు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారి అభిప్రాయం పొరబాటని
తోస్తుంది. తప్పుడు లెక్కలతో ప్రభుత్వాన్ని మోసగించాలని చూసేవారిపై దాడులు జరిపితే
దాన్ని తప్పు ఎంచడం ఏమేరకు సబబు అనే ప్రశ్న తలెత్తుతుంది.
తమ
నాయకుడు కేంద్ర ప్రభుత్వంపై ధర్మ పోరాటం మొదలు పెట్టినందువల్లే ఈ దాడులు అని
టీడీపీ ఆరోపణ. స్నేహం చేసిన రోజుల్లో కూడా ఇటువంటి దాడులు టీడీపీ నాయకులపై జరిగిన దృష్టాంతాలను పేర్కొంటూ బీజేపీ
నాయకులు టీడీపీ శ్రేణుల వాదాన్ని పూర్వపక్షం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ
క్రమంలో ఇరు పక్షాలు తమ వాదోపవాదాలతో చెలియలికట్ట దాటుతున్నాయనే అభిప్రాయం సామాన్య
జనంలో కలుగుతోంది.
‘చూసింది
ఇంతే, చూడాల్సింది ఇంకా ఎంతో వుంది’ అనే తరహాలో స్థానిక బీజేపీ నాయకులు సవాళ్లు విసిరినట్టుగా
వార్తలు వినబడుతున్నాయి. అలాగే దాడులు చేసే ఐటీ అధికారులు కోరినా పోలీసుల మద్దతు
ఇవ్వరాదని కేబినేట్ నిర్ణయించినట్టు కూడా పుకార్లు షికారు చేశాయి.
వ్యవస్థలు
లేకుండా ఏ ప్రభుత్వం పనిచేయలేదు. వ్యవస్థలు పనిచేయని ప్రభుత్వం ప్రభుత్వమే కాదు.
కానీ వున్నంతలో ప్రతి ప్రభుత్వం, కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, స్థానిక
సంస్థల ద్వారా ఎన్నికయిన అధికార వ్యవస్థలు కావచ్చు తమ కింద పనిచేసే విభాగాలను
ఎంతోకొంత తమ గుప్పిట్లో వుంచుకోవాలనే చూస్తాయి. ముఖ్యంగా ఐటీ, ఈడీ, ఏసీబీ, పోలీసు,
రెవెన్యూ విభాగాలు ఈ కోవలోకి వస్తాయి. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు పోలీసులను
ఉద్దేశించి హెచ్చరికలు చేస్తూ వుండడం పరిపాటి. ‘ మా పార్టీ అధికారంలోకి రాగానే మీ
సంగతి చూస్తాం’ అనే రీతిలో ఇవి సాగుతుంటాయి. ప్రస్తుతం అధికారంలో వున్నవాళ్ళు కూడా
లోగడ ఇలా హెచ్చరికలు చేసినవారే కావడం
గమనార్హం. ఇందుకు తగ్గట్టుగా రాజకీయ ప్రేరేపిత కేసులను తమ భుజ స్కందాలపై వేసుకుని విశృంఖలంగా
అధికార దుర్వినియోగం చేసే అధికార గణానికి కూడా ప్రస్తుత వ్యవస్థలో లోటులేదు.
అంచేతే ప్రతిదీ రాజకీయ రంగు పులుముకుని పెద్ద పెద్ద కేసులు కూడా దూదిపింజల్లా
తేలిపోతున్నాయి.
దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి
కొందరు తావీదులు, రక్షరేఖలు
ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు
పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ
నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు.
చట్టం చేతులు చాలా పొడుగు అనే పొడుగాటి డైలాగులు డైలాగులకే పరిమితం.
రాజకీయుల జోలికి వెళ్ళడానికి పోలీసులు
జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు రప్పించడానికి వుండే
నియమాలు, నిబంధనలు, ఖాకీ దర్పం రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్, హుష్ కాకీ.
అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే వస్తే వారికి ఆకస్మిక అనారోగ్యం
ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషయితే ‘బాగు
చేయిస్తాం రా’
అని స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు
విరగబొడుస్తారు. నాయకుల విషయం వచ్చేసరికి నిబంధనలన్నీ కట్టగట్టుకుని గాలికి
ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని
అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ
గొడుగు కింద వుంటే చాలు
ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క. అలా అని హోల్ మొత్తంగా రాజకీయ నాయకులందరూ
ఇలాగే ఉంటారా, వాళ్ళల్లో మంచివాళ్ళు లేరా అంటే ఎందుకు లేరు? గతంలో
వున్నారు. ఇప్పుడూ వున్నారు. ఇకముందూ వుంటారు.
కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అలాటి వారి సంఖ్య క్రమంగా పలచపడిపోతోంది.
అన్ని రంగాల్లో మాదిరిగానే, ఇప్పుడు రాజకీయాల్లోకి యువరక్తం
చేరుతోంది. రిజర్వేషన్ల పుణ్యమా అని శాసన సభల్లో బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం
పెరుగుతోంది. చదువుకున్న వారు, మంచి విద్యార్హతలు వుండి కూడా వేరే
ఉద్యోగ వ్యాపకాల్లో చేరకుండా రాజకీయ రంగం పట్ల ఆసక్తి పెంచుకునే విద్యాధికుల సంఖ్య
గణనీయంగానే ఉంటోంది. నిజానికివన్నీ ఆహ్వానించ తగ్గ పరిణామాలు. అసలు ఈనేపధ్యంలోనే
ముందు పేర్కొన్న రాజకీయ అవలక్షణాలను అంతగా ఉదహరించింది. ఎందుకంటే ఈ విపరీత
ధోరణులను కొత్తగా రాజకీయ రంగప్రవేశం చేస్తున్న యువకులు, విద్యాధికులు, మహిళలు
గుర్తించి వాటికి దూరంగా మసలుకోవడం అలవరచుకోవాలి. లేని పక్షంలో ఇటువంటి నిందలను
వాళ్ళు కూడా మోయాల్సివస్తుంది.
దేశంలో స్వార్ధ
రాజకీయ శక్తులకు కొదవలేదు. అయినా కానీ, మన ప్రజాస్వామ్య వ్యవస్థ చెక్కుచెదరకుండా వుంది. పడ్డ పునాదులు అంత
బలిష్టంగా, పటిష్టంగా ఉన్నాయనుకోవాలి. అది ప్రజలు
చేసుకున్న అదృష్టం.
రాజకీయ వ్యవస్థకు చెదలు పట్టనంత కాలం ప్రజల భద్రతకు ధోకా వుండదు. ఆ
వ్యవస్థను కాపాడుకోవడం అందరి బాధ్యత. అయితే ఇందులో సింహ భాగం రాజకీయులదే అనడంలో
సందేహం లేదు.
రాజకీయం అనేది దేశానికి రక్షరేఖగా వుండాలి కాని, ఎవ్వరో
కొందరు రాజకీయ నాయకులకి కాదు.
11, అక్టోబర్ 2018, గురువారం
గుడ్డుగారికో రోజు - భండారు శ్రీనివాసరావు
ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పాలూ,
నీళ్ళతో పాటు తప్పకుండా దొరికేది మరోటివుంది. అదే కోడి గుడ్డు.
రేపు శుక్రవారం అంతర్జాతీయ కోడిగుడ్డు
దినం కూడానట. ఇప్పుడే ఒక మిత్రుడి ద్వారా తెలిసింది.
1975 వరకు ఎగ్గూ పెగ్గూ రెండూ మా ఇంటావంటా
లేవు. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా రెండోది ముందుగా వచ్చి చాలా కుటుంబాలలో తిష్ట వేసింది. మొదట్లో నిరసన
ధ్వనులు వినపడ్డా మొత్తం మీద దానికి పసుపు
నీళ్ళు చల్లి ఇళ్ళల్లోకి రానిచ్చారు. దాంతో పాటే మొదటిది కూడా తగుదునమ్మా అని
గృహప్రవేశం చేసి ఓటరు కార్డు, ఆధార్ కార్డు లేకుండానే ఇంట్లో సభ్యురాలు
అయిపొయింది. మంచి ఎండాకాలంలో కూడా చలి దుప్పటి కప్పుకుని పడుకునేది ఆ కోడిగుడ్డే.
తిన్నా తినకపోయినా ఇంటికి వచ్చిన నాన్
వెజ్ ఫ్రెండ్స్ ఎవరికయినా అవసరం
పడుతుందో ఏమో అని మా ఆవిడ ముందు జాగ్రత్తగా వాటిని కొని ఫ్రిజ్ లో దాచి ఉంచుతుంది.
ఎప్పుడో మా చిన్నప్పుడు మా చుట్టాల
అమ్మాయికి టైఫాయిడ్ వచ్చి నిమ్మలించిన తర్వాత త్వరగా కోలుకోవడానికి డాక్టర్ ఉడక పెట్టిన కోడి గుడ్డు రోజూ ఒకటి తినమన్నారు. అసలే నిప్పులు కడిగే ఆచారం. గుడ్డు
తినమనగానే ఇంట్లో వాళ్లకి నిలువు గుడ్లు పడడం చూసిన డాక్టరు గారు, పేషెంటు ముక్కూ, కళ్ళూ మూసి, నోరు తెరిపించి పటేల్ మని గుడ్డు పగల
గొట్టి తటాలున నోట్లో పోసి మింగించాడు. ఆ భీకర భీభత్స దృశ్యం చూసిన తరువాతే వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం అనే సామెత పుట్టి
వుండాలి.
ఏది ఏమైనా పిడికెట్లో నాలుగోవంతు లేని
కోడి గుడ్డుకు అంతర్జాతీయఖ్యాతి వచ్చి, దాని పేరిట ఒక దినం ఏర్పాటు కావడం, ఆ
సందర్భాన్ని పురస్కరించుకుని గుడ్డు ప్రాముఖ్యతను ప్రస్తుతిస్తూ రేడియో ప్రసంగాలు,
టీవీ కార్యక్రమాలు జరగడం కోడి గుడ్డు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. గుడ్డుగా
వున్నప్పుడూ నలుగురికీ ఉపయోగపడుతూ, గుడ్డు నుంచి కోడిగా మారిన కొత్త అవతారంలో కూడా
మానవులకు ఆహారంగా సేవలందిస్తున్న బలి,
శిబి చక్రవర్తులను మించిన ఆ త్యాగశీలికి
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం, ఆమ్లెట్ గావేసుకుని నోరారా తినడం తప్ప.
ఎవరికోసం ? – భండారు శ్రీనివాసరావు
తుపాను సృష్టించిన నష్టాలు, సహాయక
చర్యలపై టీవీలో చర్చ జరుగుతోంది.
“తుపాను తీరం దాటిన ప్రాంతం నుంచి మా
ప్రతినిధి చెప్పిన వివరాలు విన్నారు కదా! అక్కడ పరిస్తితి భీభత్సంగా వుంది.
పెనుగాలులకు చెట్లు కూకటి వేళ్ళతో కూలిపోయాయి. రోడ్లు భయంకరంగా దెబ్బతిన్నాయి. రవాణా పూర్తిగా
స్తంభించింది. విద్యుత్ సరఫరాకు తీవ్రమైన అంతరాయం కలిగి ఆ ప్రాంతాలన్నీ అంధకారబంధురంగా
మారాయి. సాధారణ పరిస్తితులు తిరిగి నెలకొనడానికి ఎంత కాలం పడుతుందో ఇప్పుడే
చెప్పలేమంటున్నారు అధికారులు. ఈ నేపధ్యంలో
సహాయక చర్యలు ఎలా వుండాలి? అక్కడి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనే
దానిపై ఇప్పుడు చర్చిద్దాం”
అన్నాడు యాంకరు.
“చర్చించి ఎవరికి ఉపయోగం? చర్చిస్తున్న
ప్రాంతంలో తుపాను ప్రభావం లేదు. ప్రభావం చూపించిన చోట కరెంటే లేదని మీ విలేకరే
చెప్పాడు. కరెంటు లేకపోతే పనిచేసే టీవీలు ఇంకా వినియోగంలోకి రాలేదు. మరెవరికోసం ఈ
చర్చ?”
కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకుడి
సందేహం.
లేబుళ్లు:
ఎవరికోసం ? టీవీల్లో తుపాను ప్రకటనలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)