19, జూన్ 2015, శుక్రవారం

అపర పరమానందయ్య శిష్యుల కధ


అనగనగా ఒక వూరు. ఆ వూరు పేరు పుణే అనబడే పూనా.
ఆ నగరంలో ఇద్దరు గురువులు. ఒకరు పరమానందయ్య, మరొకరు ఆనందయ్య. పరమానందయ్య గారి దగ్గర ఏడుగురు, ఆనందయ్య గారి దగ్గర మరో ఏడుగురు శిష్యరికం చేస్తున్నారు.
గురువుల సంగతేమో కానీ వారి శిష్యులకు మాత్రం తమ తెలివితేటలపై అపరిమితమైన నమ్మకం. అలాగే  అవతల జట్టు శిష్యుల తెలివితేటలపై  అంతులేని అపనమ్మకం.
ఒక రోజు ఇద్దరు గురువులు తమ శిష్యులను పిలిచి ముంబై లో ఒక పని చక్కపెట్టుకుని రమ్మని ఆదేశించారు.
గురువాజ్ఞను శిరసావహించి ఆ పద్నాలుగుమంది రెండు జట్లుగా పుణే రైల్వే స్టేషనుకు వెళ్లారు.
ఆ శిష్యబృందానికి  ఒక మహత్తరమయిన ఆలోచన వచ్చింది. గురువులు ఎట్లాగో లేరు. ఎదుటి పక్షం వారు తమ సమక్షంలోనే వున్నారు. రెండు పక్షాలలో ఎవరి తెలివి తేటలు గొప్పవో తేల్చుకోవడానికి  ఈ ప్రయాణమే  సరయిన తరుణం  అనుకున్నారు. తదనుగుణంగా ఎవరికి వారు పధక రచన చేసుకున్నారు.

ఆనందయ్య బృందం తమ ఏడుగురికీ ఏడు టిక్కెట్లు కొనుక్కున్నారు. పరమానందయ్య శిష్యులు మాత్రం  ఏడు కొనకుండా అందరికీ కలిపి ఒకటే ఒక  టిక్కెట్టు కొన్నారు. ఇంతలో టీసీ వచ్చాడు. పరమానందయ్య శిష్యుల తిక్క కుదిరిందని ఆనందయ్య బృందం  ఆనందిస్తుండగానే, పరమానందయ్య శిష్యులు ఏడుగురూ తటాలున  రైలు బోగీలో వున్న   టాయిలెట్లో దూరారు. టీసీ టాయిలెట్ తలుపు తట్టాడు. తలుపు ఓరగా తెరుచుకుని ఒక చేయి బయటకు వచ్చింది. అందులో ఒక టిక్కెట్టు వుంది. టీసీ సంతృప్తి పడి  వెళ్ళిపోయాడు. ఇది చూసిన ఆనందయ్య శిష్యులకు వొళ్ళు మండింది. పరమానందయ్య శిష్యులు చేసిన ట్రిక్కు అర్ధమయింది.
సరే రెండు జట్లూ ముంబాయ్ చేరాయి. గురువులు ఒప్పగించిన పనులు చక్కబెట్టుకున్నాయి. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి వారికి డైరెక్ట్ ట్రైన్ లో టిక్కెట్లు దొరకలేదు. లోనావాలా వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడినుంచి లోకల్ ట్రైన్లో  పుణే వెళ్ళాలనుకున్నారు.
తిరుగు ప్రయాణంలో ఒకే టిక్కెట్టుఅనే  ట్రిక్కుతోనే  ఎదుటి పక్షం ఆట కట్టించాలని ఆనందయ్య శిష్యులు పధకం వేసారు. ఈసారి వారు ఏడు టిక్కెట్లకు బదులు ఒకే టిక్కెట్టు కొనుక్కుని లోనావాలా రైలెక్కారు. పరమానందయ్య శిష్యులు ఒక్క టిక్కెటు కూడా కొనలేదు.
టీసీ రావడాన్ని పసికట్టి రెండు జట్లూ చెరో టాయిలెట్లో దూరాయి. పరమానందయ్య శిష్యుల్లో  ఒకడు టాయిలెట్ నుంచి  బయటకు వచ్చి టీసీ మాదిరిగా ఎదుటి టాయిలెట్ తలుపు తట్టాడు. అలా తట్టింది  టీసీయే అని భ్రమపడి ఆనందయ్య  శిష్యులు తమ వద్ద వున్న ఒకే ఒక టిక్కెట్టును తలుపు ఓరగా తెరిచి   బయట పెట్టారు. అదను కోసం వేచి వున్న పరమానందయ్య శిష్యుడు తటాలున ఆ టిక్కెట్టు తీసేసుకుని తమ టాయిలెట్లోకి దూరిపోయాడు. మళ్ళీ పాత ట్రిక్కే ఉపయోగించి  టీసీ బారి  నుంచి తప్పించుకున్నారు. కొనుక్కున్న ఒకే ఒక్క టిక్కెట్టును  పోగొట్టుకున్న ఆనందయ్య శిష్యులు టీసీకి దొరికిపోయి పెద్ద జరిమానా చెల్లించుకున్నారు.  
ఏమయితేనేం, మొత్తం మీద వారంతా లోనావాలా చేరుకొని పుణే వెళ్ళే లోకల్ ఎక్కారు.
ఆనందయ్య శిష్యులు ఒక్క టిక్కెట్టు ట్రిక్ మళ్ళీ  ప్రదర్శించి వూరుచేరేలోగా ప్రత్యర్ధి జట్టుపై ఒక్కమారయినా ఆధిక్యత చూపాలని అనుకున్నారు.
పరమానందయ్య  శిష్యులు మాత్రం బుద్ధిగా ఏడు టిక్కెట్లు కొనుక్కుని లోకల్ ట్రైన్ ఎక్కారు. ఈ కధలో లెక్కప్రకారం రావాల్సిన టీసీ యధాప్రకారం  వచ్చాడు. పరమానందయ్య  శిష్యులు తాము కొన్న టిక్కెట్లు చూపారు. ఒక్క టిక్కెట్టుతోనే  రైలెక్కిన ఆనందయ్య శిష్యులు  టీసీ కళ్లబడకుండా దాక్కోవడానికి టాయిలెట్ కోసం వెతికారు. కానీ అది వారికి  దొరక్కపోగా వాళ్లు మాత్రం ఎంచక్కా టీసీకి దొరికిపోయారు. ఎదుటి పక్షాన్ని ఓడించాలనే ఆత్రుతలో లోకల్  ట్రైన్లలో టాయిలెట్లు వుండవన్న సంగతి వారు మరచిపోయారు.
అంటే నీతి ఏమిటంటే అనుసరణ  మంచిదే కావచ్చుకాని ఎంతో కొంత ఆలోచన కూడా దానికి తోడు కావాలి. అప్పుడే అది రాణిస్తుంది.
మూడేళ్ళ క్రితం స్వేచ్చానువాదం చేసి పోస్ట్ చేసిన రచన ఇది. 

(19-05-2012)

నరేంద్ర యోగి -


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON SUNDAY, 21-06-2015)

పొందలేని దాన్ని సాధించగలగడాన్ని యోగం అంటారు.  ఉదాహరణకు ఆత్మ సాక్షాత్కారం. దీన్ని సాధించడం అంత సులభం ఏమీ కాదు. సాధించాలంటే అందుకుతగ్గట్టుగా శరీరాన్ని  తయారు చేసుకోవాలి. ఈ సాధనే యోగా. ఈ సాధన చేసేవారిని పూర్వం యోగులు అనేవారు. యోగసాధన ద్వారా లక్ష్యాన్ని అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగిన వారిని యోగయుక్తులు అంటారు. లక్ష్యసాధన ఒక ఎత్తయితే, సాధించిన దాన్ని పదిలపరచుకోవడం మరో ఎత్తు. మొదటిది యోగం, రెండోది క్షేమం. ఈ 'యోగక్షేమాల' ప్రసక్తి భగవద్గీతలో కూడా వుంది. గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో  అంటాడు భగవానుడు అర్జునుడితో, " అనన్యాచింతయంతోమా యేజనాః పర్యూపాసతే,  తేషామ్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్" అని. అంటే  'వేరే ధ్యాస లేకుండా నన్నే తలుస్తూ, నన్నే ధ్యానిస్తూ పోతే వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను' అని స్తూలార్ధం. అలాగే,  'అధాతో బ్రహ్మ జిజ్ఞాసా' అనే దానితో 'బాదరాయణ బ్రహ్మ సూత్రాలు' మొదలవుతాయి. ( ఈ బ్రహ్మ సూత్రాలు వేద వ్యాస విరచితమనీ, కాదు బాదరాయణుడు రాశాడనీ కొన్ని వాదాలు వున్నాయి. ఆ ఇద్దరూ ఒకరనే వాదం కూడా వుంది, అది వేరే విషయం) బ్రహ్మసూత్రాలలో చెప్పిన  అధాతో అంటే 'అటు పిమ్మట...'. శరీరాన్ని యోగాతో ఆత్మసాక్షాత్కారానికి అనువుగా 'మార్చుకున్న పిమ్మట' అని భాష్యం చెప్పుకోవచ్చు. శంకర భాష్యాన్ని ప్రముఖ పండితులు పుల్లెల రామచంద్రుడు తెనిగించి  పుణ్యం కట్టుకున్నారు. అందులోని జిజ్ఞాస అధికరణంలో ఈ యోగ ప్రసక్తి వుంది. ఈ యోగ సూత్రాలను  పతంజలి మహాముని  వెలికితీసి ఒకచోట గుదిగుచ్చి పంచాంగాలతో, కర్మ యోగము, రాజ యోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగములతో కూడిన 'యోగ దర్శనం'   తయారు చేశారు. అదే పతంజలి యోగశాస్త్రంగా ఈనాటికీ మన్ననలు అందుకుంటోంది.  పతంజలి యోగానికి ఇచ్చిన నిర్వచనం 'యోగసు కర్మ కౌశల్యం', 'చిత్తవృత్తి నిరోధం'. ఏ కర్మ (పని) చేసినా దాన్ని  నైపుణ్యంతో చేయడం, మానసిక చాంచల్యాలను జయించడం అని అర్ధం చెప్పుకోవచ్చు.
ఇందుకోసం ఆయన సాధన చతుష్టయాన్ని ప్రబోధించారు. నిత్యానిత్య వస్తువు వివేక జ్ఞానము, ఇహలోక పరలోక విషయం భోగ వైరాగ్యము, శమదమాది సాధన సంపద, మోక్షం పొందాలనే తీవ్రమైన వాంఛ- ఈ నాలుగు అలవరచుకుని యోగసాధన మొదలు పెట్టాలి. శమదమాది సాధన సంపద అంటే ఒకటి శమము( మనో నిగ్రహము), రెండు  దమము ( బాహ్య ఇంద్రియ నిగ్రహము ) మూడు  ఉపరతి (విషయాలనుంచి వెనక్కు మరలడం) నాలుగు తితిక్ష (సహనం), అయిదు  శ్రద్ధ (శాస్త్రాదుల పట్ల పరిపూర్ణ విశ్వాసం).  ఈ అయిదూ యోగసాధకుడికి అత్యవసరం. బ్రహ్మ సూత్రాలలో చెప్పిన మొదటి సూత్రం 'యధాతో బ్రహ్మ జిజ్ఞాస' అంటే అటు పిమ్మట అనేది, 'ఈ అయిదూ సాధించిన' పిమ్మట అనేది గ్రాహ్యం. తద్వారా  ఆత్మ సాక్షాత్కార సాధన సులభం అవుతుంది. ఈ నైపుణ్యం అలవరచుకోవడం కోసం కర్మయోగాది పంచ యోగాలు ఉపయోగపడతాయి. కర్మ, రాజ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగాలు కర్మతో మొదలయి జ్ఞానంతో అంతమవుతాయి.  ఈ జ్ఞాన సాధనతో యోగి యోగయుక్తుడు/ యోగసిద్ధుడు కాగలుగుతాడు.
పతంజలి చెప్పిన అష్టాంగయోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి విభాగాలు వున్నాయి.
ఇవన్నీ సరే, మామూలు మనిషికి ఇవన్నీ యెందుకు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
మానవ శరీరం శాశ్వితం కాదు. ఎప్పుడో ఒకప్పుడు నశించి  పోయేదే. జీవుడు శాశ్వితం. అతడికి నాశనం లేదు. కానీ శరీరాన్ని ఆవహించుకుని వున్న జీవుడికి ఆ తాత్కాలిక ఆవాసం మీదనే మోజు. తద్వారా సంప్రాప్తించిన సుఖ దుఃఖాలతో మునిగితేలుతుంటాడు.  ఈ అజ్ఞానం తొలగగానే లౌకిక  వ్యవహారాలను  నిర్లిప్త వైఖరితో పరికించే స్తితి వస్తుంది. ఇట్టి స్తితికే ముక్తి,  కైవల్యం, అపవర్గం అని పేర్లు. ఇలాటి స్తితిని దేహం వుండగానే చేరుకోగలిగితే అది జీవన్ముక్తి అనిపించుకుంటుంది. ఈ యావత్ యోగ సాధన అంతా ఈ స్తితికి చేరుకోవడం కోసమే.
బుధజనులతో అప్పుడప్పుడు జరిపే సంభాషణల్లో వినవచ్చిన ఈ మంచి సంగతులను, కేంద్ర ప్రభుత్వం నా ఫోనుకు పంపిన ఓ చిట్టి పొట్టి సందేశం గుర్తు చేసింది. 


(యోగముద్రలో ప్రధాని నరేంద్ర మోడి)
  
ఆ ఎస్.ఎం.ఎస్. లో ఇలా వుంది.
"యోగా అభ్యసించండి. క్రమం తప్పకుండా పాటించండి.  యోగా  మన మనస్సు మీద, మన శరీరం మీద, మన భావోద్వేగాల మీద,  మన శక్తి యుక్తుల మీద అద్భుతంగా పనిచేస్తుంది. యోగాతో  జీవితాన్ని కడకంటా  సంపూర్తిగా ఆరోగ్యంగా అనుభవించండి" - ఆయూష్ మంత్రిత్వ శాఖ , భారత ప్రభుత్వం.
ఈ మాదిరి ఎస్.ఎం.ఎస్.లు బహుశా దేశంలోని ప్రతి ఒక్క మొబైల్ వినియోగదారుడికి చేరేవుంటాయని అనుకోవచ్చు. ఎందుకంటే స్వచ్ఛ భారత్ నినాదంతో దేశాన్ని ముంచెత్తిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగాదినాన్ని ఘనంగా  పాటించాలని దేశ ప్రజలకు పిలుపు ఇచ్చింది. ఆరువేల ఏళ్ళ క్రితం  మన పూర్వీకులు మనకందించి వెళ్ళిన  ఈ అత్యంత విలువైన జీవన విధానం ఇది.  అలాటి యోగాకి ప్రత్యేకించి  ఒక దినాన్ని కేటాయించాలని నిరుడు ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తి మేరకు ఏటా జూన్ ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ యోగాదినంగా  ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. అతి నిరాడంబరంగా పూర్వీకులు అందించిన భారతీయ యోగ శాస్త్రానికి సంప్రాప్తించిన యోగం అనుకోవాలి. అందుకే కాబోలు అంతర్జాతీయ  యోగా దినోత్సవాన్ని అత్యంత ఆడంబరంగా జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగమే బహుశా   ఈ సంక్షిప్త సందేశాల బట్వాడా కావచ్చు. చేసేది మంచి పని అయినప్పుడు దాన్ని అంతగా ఆక్షేపించాల్సిన అవసరం లేదు. స్వాగతం, శుభం భూయాత్ అనుకుంటే తప్పేముంది.
అయితే ఓ చిన్న ముచ్చట. రేపు ఇరవై ఒకటిన అట్టహాసంగా జరిపే యోగా విన్యాసాలు పతంజలి యోగశాస్త్రంలో పేర్కొన్న శమదమాది అష్టాంగ యోగంలో ఒక చిన్న భాగం మాత్రమే. మొత్తం సుమారు డెబ్బయి నాలుగు వేల  యోగాసనాలు వుంటే ఈనాడు లభ్యం అవుతున్నవి,  రాం దేవ్ బాబా వంటి వారు చేయించేవి నూరుకు లోపలే. పతంజలి యోగశాస్త్రంలో లేని 'ప్రక్షిప్తాలు' వీటిల్లో  అనేకం వున్నాయని కూడా అంటారు. అవేవిటన్నది ఆ 'యోగుల'కే ఎరుక.
మరో ముఖ్యమైన విషయం. మొత్తం మానవాళికి యోగావిద్యను ప్రసాదించింది భారతీయులే. కానీ మనస్సును, శరీరాన్ని అదుపులో వుంచుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవడానికి మంచి ఉపకరణం అయిన యోగాను ఏదో ఒక దేశానికో లేదా మతానికో పరిమితం చేసి చూడడం  మంచిది కాదు. తాజాగా ఇస్కాన్ నిర్వహించిన భగవద్గీత పఠనం పోటీలో మర్యం ఆసిఫ్ సిద్దికీ అనే ముస్లిం బాలిక ప్రధమ స్థానం దక్కించుకోవడం మనందరికీ గర్వకారణం.  అలాగే, మనం బాధపడాల్సిన అంశాలు కూడా వున్నాయి. మతాన్ని నల్లమందుతో సమానంగా పరిగణించే కమ్యూనిష్ట్ చైనాలో భగవద్గీతను చైనా భాషలో ప్రచురించి ప్రజలకు అందుబాటులో పెట్టారు. మనం పవిత్ర గ్రంధం అని పైకి  గొప్పగా  చెప్పుకుంటాము కాని భగవద్గీత గ్రంధాల ఉనికి,  కోర్టుల్లో సాక్షి ప్రమాణాలకు, మనుషులు కాలం చేసినప్పుడు మైకుల్లో వినిపించడానికి పరిమితం అయిపొయింది. ఇదొక విషాదం.
(18-06-2015)
NOTE COURTESY IMAGE OWNER

సిసలైన నవ్వుకు అసలైన చిరునామా - జంధ్యాల


(జూన్ 19 జంధ్యాల వర్ధంతి)




నిండు నూరేళ్ళ జీవితం అనుకుంటే జంధ్యాల బతికింది యాభయ్ యేళ్ళే. కానయితేనేమి నూరేళ్ళకు సరిపడా  నవ్వులు నలుగురికీ పంచి పెట్టిపోయాడు.
ఆరోజు నాకు బాగా జ్ఞాపకం వుంది. నేను రేడియోలో వుంటే రాంపా ఫోను చేసి జంధ్యాల పోయాడని చెప్పాడు. నేను వెంటనే వార్త రాసి ఇచ్చేసి రాజభవన్ రోడ్డులోని వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పుడే వార్త తెలిసి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఓ కుర్చీలో జంధ్యాల నాన్నగారు నారాయణ మూర్తి  గారు కూర్చుని వున్నారు. కానీ ఆయనకు ఏదీ తెలియని పరిస్తితి. జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. ఏమి జరిగిందన్నది ఒక్కగానొక్క కొడుకు పోయాడన్నది  అర్ధం చేసుకునే స్తితి కాదు. ఏమిటో ఈ జీవితం అనిపించింది.
జంధ్యాల చనిపోయిన రెండేళ్లకు వేటూరి సుందరరామమూర్తి ఇలా గుర్తుచేసుకున్నారు.
“హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసం, నిన్నటి దరహాసం జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు  గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు.ఎంత కాదనుకున్నా కన్నీళ్ళు  కళ్ళతోనే మింగటం కన్నా శరణం లేదు.
“తెలుగు సినిమా అపహాస్యం పాలెక్కువై పరిహాస్యం పాలై పోతున్న ఈనాడు జంధ్యాల తన వంశవృక్షంతో సహా దర్శనమిచ్చి ఆదుకుంటాడు. పానుగంటి, కందుకూరి, గురజాడ, చిలకమర్తి, భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యం మొదలయిన శాఖోపశాఖలతో విరాజిల్లే ఆ హాస్య కల్పవృక్షానికి మూల స్థానం లో కూర్చుని "ఫిబరే హ్యూమరసం" అని రస పిపాసులకు తన కలం నించి వెలువడిన హాస్య రస కలశాలను అందించిన తెలుగుజాతి చిరునవ్వు జంధ్యాల.”
ఆ వేటూరిగారు కూడా ఇప్పుడు లేరు.  జంధ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.
కాని, ఆయన అన్నట్టు జంధ్యాల మార్కు  నవ్వుకు మాత్రం   మరణం లేదు.

18, జూన్ 2015, గురువారం

లండనింగ్లీష్ !


(Courtesy PVVG Swamy)



Spotted in a toilet of a London office: 
TOILET OUT OF ORDER. PLEASE USE FLOOR BELOW. 

In a London Laundromat:
AUTOMATIC WASHING MACHINES: PLEASE REMOVE ALL YOUR CLOTHES WHEN THE LIGHT GOES OUT 

Outside a London second-hand shop: 
WE EXCHANGE ANYTHING - BICYCLES, WASHING MACHINES, ETC. WHY NOT BRING YOUR WIFE ALONG AND GET A WONDERFUL BARGAIN? 

Spotted in a safari park: 
ELEPHANTS PLEASE STAY IN YOUR CAR 

Seen during a London conference: 
FOR ANYONE WHO HAS CHILDREN AND DOESN'T KNOW IT, THERE IS A DAY CARE ON THE 1ST FLOOR 

Notice in a field: 
THE FARMER ALLOWS WALKERS TO CROSS THE FIELD FOR FREE, BUT THE BULL CHARGES

On a repair shop door: 
WE CAN REPAIR ANYTHING (PLEASE KNOCK HARD ON THE DOOR, THE BELL DOESN'T WORK) 

NOTE: Courtesy Image Owner


17, జూన్ 2015, బుధవారం

రాజకీయాల్లో విలువలు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 18-06-2015, THURSDAY)

"ఇదొక యుద్ధం. ఒక యుద్ధాన్ని గెలవడానికి ఓ పోరాటంలో ఓడిపోయినా పరవాలేదన్నది నా సిద్ధాంతం.  నేను చెబుతున్నాను.  మళ్ళీ నేను నిలబడతాను. నిలబడి పోరాడతాను. టీవీ పెట్టి చూడండి. ఆట మొదలయింది"
"మరో అందమయిన ప్రదేశం చేరుకోవడానికి విమానం ఎక్కాను" అని చెప్పడానికి ముందు లలిత్  మోడీ ట్విట్టర్ లో రాసిన వాక్యాలు ఇవి. ఇంగ్లీష్ లో ఆయన ట్వీట్ చేసిన దానికి కాస్త అటూ ఇటూగా తెలుగు అనువాదం ఇది.
ఎవరీ లలిత్  మోడీ అని వేరే చెప్పక్కర లేదు. గతంలో కంటే ఈ మధ్య మీడియాలో ప్రత్యేకించి జాతీయ మీడియాలో అనుదినం నలుగుతున్న పేరిది. పేరులో మోడీ అని వున్నా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ లలిత్ మోడీకి ఎలాటి సంబంధ బాంధవ్యాలు లేవు. అయినా ప్రస్తుతం లలిత్ మోడీ చిక్కుకున్న వివాదంలో ప్రధాని మోడీ పేరు కూడా అక్కడక్కడా వినబడుతోంది. వినబడ్డమే కాదు ప్రధాని మోడీ తన పదవికి రాజీనామా చేయాలని  డిమాండు చేసేవరకు కొందరు ఈ వివాదాన్ని సాగదీస్తున్నారు.
ముందు లలిత్ మోడీ వ్యవహారం చూద్దాం. అది చూడాలంటే కాసేపు క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాలి.
పూర్వం క్రికెట్ పోటీలు రెండు జట్ల నడుమ అయిదు రోజులపాటు జరిగేవి. రెండు జట్లు దాదాపు ఒకే మోస్తరు తెల్లని దుస్తులు ధరించి ఆడేవారు. కాలం  గడుస్తున్న కొద్దీ, జీవన వేగం పెరుగుతున్న కొద్దీ, దశాబ్దాల తరబడి ఆడుతున్న ఈ దొరల ఆటలో కూడా కొన్ని మార్పులు అనివార్యం అయ్యాయి. ఫలితంగా అయిదు రోజుల ఆటకు  పూర్తిగా భరత వాక్యం పలకకుండా, యాభయ్ పరిమిత ఓవర్ల ఒకరోజు క్రికెట్ పోటీలు వూపందుకున్నాయి. క్రమేణా  ఈ వన్ డే మ్యాచులకు ప్రజల్లో ఆదరణ పెరగడం మొదలయింది. ఆటగాళ్ళ దుస్తుల్లో, ఆట మైదానం రూపురేఖల్లో, ఆటని బుల్లి తెరలపై అద్భుతంగా చూపించే తీరులో అనేక మార్పులు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఒక్కదానిలో అడుగుపెడితే చాలు ఆ ఆటగాడి భవిష్యత్తే పూర్తిగా మారిపోయే వాణిజ్య ధోరణులు క్రికెట్ ఆటలో చోటు చేసుకోవడం కూడా మొదలయింది. దానాదీనా ఈ ఆటలో విలువలు దిగజారి, డబ్బుకు పెద్దపీట వేసే పెడధోరణి పీఠం వేసుకుని కూర్చుంది. అలా అలా జరిగి పోతున్న క్రికెట్ కధ వున్నట్టుండి పెద్ద మలుపు తిరిగింది. యాభయ్ ఓవర్ల వన్ డే మ్యాచ్ ని మించిన 'ట్వంటీ ట్వంటీ' మ్యాచ్ రూపుదిద్దుకుంది. దానితో,  క్రికెట్ ఆట రంగూ రుచీ ఒక్కసారిగా మారిపోవడంతో పాటు, హంగులు, హొయలు కూడా రంగప్రవేశం చేసాయి. 'చీర్  గాళ్స్' పేరుతో,  అర్ధ నగ్న సుందరీమణులు అటు ఆటగాళ్లను, ఇటు ప్రేక్షకులను రంజింప చేయడానికి బహిరంగ మైదానాల్లో అరంగ్రేట్రం చేశారు. దాంతో డబ్బు వెదజల్లి టిక్కెట్లు కొనే ప్రేక్షకులు పెరిగారు. నిర్వాహకులకు రాబడి పెరిగింది. ఇక ఆటగాళ్ల సంగతి చెప్పక్కర లేదు, అనతికాలంలోనే కోట్లకు పడగెత్తే  సువర్ణావకాశం వారి వొళ్ళో పడింది. అందర్నీ అన్ని రకాలుగా సంతోషపెట్టి సంతోషపడే కొత్త క్రికెట్ కు ఆద్యుడు ఎవరయ్యా అంటే, ఇదిగో మనం ముందు చెప్పుకున్న లలిత్ మోడీ.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే పేరుతో 2008 లో లలిత్ మోడీ ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ అతి కొద్ది కాలంలోనే పెరిగి పెద్ద వట వృక్షంగా తయారయింది. అందులో అతితేలిగ్గా ప్రవేశించిన వాణిజ్య ధోరణులు సయితం అలాగే పెరిగి పెద్దవవుతూ కాలక్రమంలో వెర్రితలలు వేయడం మొదలెట్టాయి. త్వరగా సులభంగా డబ్బు సంపాదించడం ఎట్లాఅని ఆలోచించేవాళ్ళు, ఆ వేగంలో, వురవడిలో  కాలుజారడం కూడా అంతే తేలిక. లలిత్ మోడీ దీనికి భిన్నం ఏమీ కాదు. అలాగే జరిగింది కూడా. ఎదుగుదల యెంత వేగంగా జరిగిందో పతనం కూడా దానికి రెట్టింపు వేగంతో సాగింది. ఫలితం స్వదేశంలో మీద పడ్డ కేసులను ఎదుర్కోలేక పరాయి దేశంలో రోజులు వెళ్ళ దీయాల్సిన దుస్తితి దాపురించింది. ఈ కధ ఇంతటితో ఆగితే ఇలాటివాళ్ళను గురించి ఈ నాడు ఇంతగా తలచుకోవాల్సిన పరిస్తితి వుండేది కాదు. ఈరకమైన వ్యక్తులు తమకు తాము అపకారం చేసుకోవడం మాత్రమే కాదు, తమను గుడ్డిగా నమ్మిన వారికి కూడా కీడు కలిగిస్తారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలే ఈనాడు జాతీయ మీడియాలో చర్చోపచర్చలకు, జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ ల నడుమ రచ్చరచ్చకు దారి తీస్తున్నాయి.
ఈ లలిత్ మోడీ విషయం కాసేపు పక్కన పెడదాం.
నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే కూటమిని మట్టి కరిపించి కేంద్రంలో అధికార పీఠం ఎక్కింది. భారత రాజకీయాల్లో మోడీ సాధించింది అద్వితీయ విజయమని అందరూ వేనోళ్ళ పొగిడారు.  ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంలో కూడా మోడీ ప్రభుత్వం సాధించిన ఘన విజయాల జాబితాలో ఘనంగా పేర్కొన్నది కూడా గత ఏడాది కాలంలో తమ ప్రభుత్వం ఎలాటి మచ్చలేని స్వచ్ఛ పాలనను ప్రజలకు అందించిందన్న విషయాన్నే. ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో మోడీ ప్రభుత్వాన్ని నిలదీయలేని నిస్సహాయ స్తితి.
సరిగ్గా ఇదే సమయంలో  లలిత్ మోడీ వ్యవహారం తెర మీదకు వచ్చింది.
ఇంగ్లండులో తలదాచుకుంటున్న లలిత్ మోడీకి అత్యవసరంగా పోర్చుగల్ ప్రయాణం పడింది. అనారోగ్యంతో వున్న ఆయన భార్యకు అవసరమయిన వైద్యసాయం అక్కడ లభిస్తుందని ఆయన భావించారు. అందులో తప్పుపట్టడానికి ఏమీ లేదు. వచ్చిన చిక్కల్లా ఇంగ్లండు నుంచి పోర్చుగల్ వెళ్ళాలంటే తగిన అనుమతి పత్రాలు అక్కడి ప్రభుత్వం ఇవ్వాలి. అలా ఇస్తే రెండు దేశాల నడుమ సంబంధాలు దెబ్బతింటాయని బ్రిటిష్ ప్రభుత్వం సంకోచించింది. ఈ సమయంలో లలిత్ మోడీ తరపున భారత విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్న సుష్మా స్వరాజ్ కు అభ్యర్ధన వచ్చింది. రాజకీయాల్లో వున్నవాళ్ళకు ఇలాటి సిఫారసు లేఖల గొడవ తప్పనిసరి తలనొప్పి. ఇష్టం వున్నా లేకపోయినా, సిఫారసు చేసే వ్యక్తులతో ముఖ పరిచయం వున్నా లేకపోయినా రాజకీయ నాయకులు సిఫారసు చేయక తప్పని ఒత్తిడి వారిపై వుంటుంది. అందుకే సుష్మా స్వరాజ్ కూడా ఆ ఒత్తిడికి  లొంగి లలిత్ మోడీ విషయంలో ఒక సిఫారసు చేశారు. 'మీకున్న నియమ నిబంధనల పరిధిలోనే అనుమతి పత్రాలు ఇవ్వండి' అని ఆమె సిఫారసు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆక్షేపించడానికి ఏమీ లేదు. కానీ ఆ మంత్రి తమ సిఫారసు లేఖలో మరో పేరా జోడించారు. 'మీరు తీసుకునే నిర్ణయం ఉభయ దేశాల సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపదు' అని. ఇలా రాయడం ద్వారా, 'లలిత్ మోడీకి సాయం చేయండి' అని నిర్ద్వందంగా చెప్పినట్టయింది. మోడీకి పరోక్షంగా సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది.
సరే. ఆ తరువాత లలిత్ మోడీకి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయన పోర్చుగల్ వెళ్ళి తన పని పూర్తి చేసుకుని ఇంగ్లండు కూడా తిరిగి వచ్చేసారు. దాంతో కధ కంచికి పోవాలి. అలా జరిగితే కధ యెలా అవుతుంది. అందుకే సామాజిక మాధ్యమాల పుణ్యమా అని మళ్ళీ వెలుగులోకి వచ్చి, 'అనేక కేసుల్లో చిక్కుకున్న లలిత్ మోడీకి ఎలా అలా  సిఫారసు లేఖ ఇస్తారు' అనే ప్రశ్నతో మొదలయి ఇప్పుడది మోడీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంది.
కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు లేఖ ఇచ్చిన సుష్మా స్వరాజ్ ని రాజీనామా చేయాలని షరామామూలుగా పట్టుబడుతున్నాయి. అలా చేసేది లేదని బీజేపీ అగ్ర నాయకులు అంతే షరా మామూలుగా   తెగేసి చెబుతున్నారు.


(చుట్టరికం లేకుండా చిక్కుల్లో పడ్డ ఇద్దరు మోడీలు)


మామూలుగా అయితే ఇదంతా వడ్ల గింజలో బియ్యపు గింజ మాదిరి తేలిపోవాల్సిన వివాదం. కానీ మోడీ ప్రభుత్వం నైతిక విలువలు గురించి ఘనంగా చెప్పుకుంటోంది కనుక సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్తితి.
ఇక్కడే రాజకీయాల్లో నైతిక విలువలు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. రాజీనామా చేయాలని  డిమాండు చేయడం యెలా మోతాదుకు మించిన సంగతో, అలానే 'చేయను గాక చేయను' అని భీష్మించుకు కూర్చోవడం కూడా అదే వరస.
రాజీనామా చేయాలని కాంగ్రెస్ కోరనక్కరలేదు. రాజీనామా చేయమని ప్రధాని మోడీ తన మంత్రివర్గ సహచరురాలికి సూచించనక్కరలేదు. రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడేవాళ్లందరూ ఎవరికి వాళ్లు తమకు తాముగా తీసుకోవాల్సిన నిర్ణయం. అలా చేయడం వల్ల ఇప్పటికే మసకబారుతున్న ప్రజాస్వామ్య విలువలకు కాస్త వూపిరి వూదినట్టవుతుంది.
ఈ సూత్రం సుష్మా స్వరాజ్ ఒక్కరికే కాదు రాజకీయాల్లో వున్న ప్రతిఒక్కరికీ వర్తిస్తుంది. (17-06-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595
NOTE: Courtesy Image Owner

15, జూన్ 2015, సోమవారం

బామ్మగారి సాక్ష్యం


కోర్టులో కేసు విచారణ జరుగుతోంది.
సాక్షిగా ఓ వయస్సుమళ్ళిన సూరేకాంతం గారిని బోనులో నిలబెట్టారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొంతు సవరించుకుని బామ్మగారిని మర్యాదగా పలకరించాడు.
'చూడండి బామ్మగారు. నేను ఏకాంబరాన్ని. ఇక్కడ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. తెలుసనుకుంటాను'
'నువ్వు తెలియకపోవడం ఏమిట్రా సన్నాసి. చిన్నప్పుడు మా పక్కింట్లోనే వుండేవాళ్లు కదా మీరు మీ నాన్న. వొంట్లో ప్రాణం లేనట్టు పీలగా ఏబ్రాసి మొహం వేసుకుని వుండేవాడివి. పైకి నోట్లో వేలు పెడితే కొరకలేనట్టు, బోడి అమాయకం ఒకటి. కాని వున్నాడు కదా మీ నాన్న. వాడి పిదప బుద్ధులే నీకూ వచ్చాయి. ఆయనా అంతే. పందిరి గుంజకు చీరె చుడితే చాలు  దాని  కొంగు పట్టుకునే రకం. నీ వొంట్లో వాడి రక్తమేకదా! అందుకే బంగారం లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని, ఏం పోయేకాలం వచ్చిందని  పక్కింటి ఆడదాన్ని లేపుకుపోయి పక్క వీధిలో కాపురం పెట్టావు.  కట్టుకున్న ఇల్లాలి కన్నీళ్ళు  పట్టించుకోకుండా ఇరుగింటి పొరుగింటి ఆడవాళ్ళ వెంట తిరగడానికి సిగ్గు లేదట్రా. అడిగేవాడు లేక ఈ పోరంబోకు వేషాలు వేస్తున్నావు.ఈ పాపం కట్టికుడుపుతుంది ఏమనుకుంటున్నావో, యేమో!  ' సూరేకాంతం మాటలు ఆగడం లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోట మాట లేదు. నిలువు  గుడ్లేసుకుని నిలబడిపోయాడు.
ఇదంతా చూస్తూ వింటూ డిఫెన్స్ లాయర్ ముసిముసి నవ్వులు నవ్వాడు. బోను దగ్గర నిలబడి చిరునవ్వు చిందిస్తూ అన్నాడు. 'ఆయన సరేనండీ బామ్మగారు, నేనిక్కడ డిఫెన్స్ లాయర్ని. పేరు చిదంబరం. మీరుండేది అరండల్ పేటలోనే కదా! మూడో లేను నాలుగో ఇల్లు'
'హోర్నీ నువ్వట్రా చిదంబరం. యెంత ఎదిగి  పోయావు. సూటూ బూటూ వేసావు సరే బుద్దులు నిక్కర్ల నాటివేనా. పక్క దొడ్లో జామకాయలు కోసుకొచ్చి నువ్వూ మీ అమ్మా ఉప్పూ కారం రాసుకుని లొట్టలేసుకుంటూ తినేవారు. నాకు గుర్తు లేకపోవడం ఏమిటి.  పక్కింట్లో ఎత్తుకెళ్ళిన సైకిల్ వాళ్లకు ఇచ్చావా లేక పదో పరక్కో అమ్మి జీడీలు కొనుక్కు తిన్నావా?  అన్నట్టు మీ రెండో అమ్మాయినే కదా ఆ నల్లకోటు ఏకాంబరం తీసుకుపోయి భార్యకు తెలియకుండా వేరు కాపురం పెట్టింది. యెలా వుందా పిల్ల, ఇంకా వీడి మాయలోనే వుందా! నువ్వన్నా సరిగ్గా కాపురం ఏడుస్తున్నావా? వాడిలాగే పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావా? ఈ విషయాల్లో నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏమిటి? వాడిలాగా పైకి తేలవు కానీ నువ్వూ గోపాలకృష్ణుడివే, నాకు తెలవదా నీ సంగతి' బామ్మగారి మాటల ధాటికి చిదంబరం మరో మాట లేకుండా మ్రాన్పడిపోయాడు.
జడ్జీ గారు ఇదంతా చూస్తున్నాడు. పొరబాటున వీళ్ళిద్దర్లో ఎవరయినా తొందరపడి 'ఆయనెవరో తెలుసా' అని తనని చూపిస్తూ బోనులో  బామ్మగారిని అడిగారంటే కోర్టు కొల్లేరయి పోతుందని గ్రహించాడు. ఇక  ఒక్క క్షణం కూడా ఆలశ్యం చెయ్యకుండా కేసును మూడు నెలలకు వాయిదావేసాడు.

(Based on english version posted by Shree PVVG Swamy)
NOTE ; Courtesy Image Owner

13, జూన్ 2015, శనివారం

ఈ ప్రపంచం ఓ మాయా దర్పణం


ఓ కుక్క దారి తప్పి దారి పక్కన కనబడ్డ ఓ మ్యూజియం లోకి ప్రవేశించింది. ఆ హాల్లో ఎటు చూసినా అద్దాలే. బ్రూస్ లీ సినిమాలో మాదిరిగా కిందా, పైన, పక్కనా, నలువైపులా నిలువెత్తు అద్దాలు. అందులో చేరిన కుక్కకు మతి పోయింది. ఎటు చూసినా తనను బోలిన శునకాలే. నిజమో కాదో తేల్చుకోవడానికి ఆ కుక్క పళ్ళు బయటపెట్టి భయపెట్టింది. చుట్టూ అద్దాల్లో కనిపిస్తూవున్నవి దాని ప్రతిబింబాలే. అవికూడా పళ్ళు బయటపెట్టి భయపెట్టినట్టు కనిపించడంతో ఓ  కుక్కల గుంపు నడుమ తాను నిష్కారణంగా చిక్కుకు పోయాననుకుని ఆ కుక్కకు పెద్ద భయం పట్టుకుంది.  వాటిని మరింత భయపెట్టి తప్పించుకుందామన్న ఆలోచనతో మొరగడం మొదలు పెట్టింది. చుట్టూ అద్దాల్లో కనిపించే ఆ కుక్క ప్రతిబింబాలు సయితం అదేమాదిరిగా మొరగడం మొదలు పెట్టాయి. కుక్క గొంతు పెంచి గట్టిగా మొరుగుతూ అటూ ఇటూ దూకడం మొదలెట్టింది. చుట్టూ అడ్డాల్లోని  వందలాది కుక్కలు కూడా అంతే మెరుపు వేగంతో గెంతడం మొదలయింది. ప్రాణ భయంతో కుక్క ప్రాణాలు ఠావులు తప్పాయి. ఆరోజు సెలవు దినం కావడం వల్ల మ్యూజియం సిబ్బంది మరునాడు వచ్చి తలుపు తీసేసరికి ఆ అద్దాల మహల్ లోని  అద్దాలు అన్నీ పగిలిపోయి చిందరవందరగా  పడివున్నాయి. వాటి మధ్యలో విగతజీవిగా పడున్న ఓ కుక్క శరీరం.


నిజానికి ఆ హాల్లో కుక్కకు హాని తలపెట్టే వాళ్లు ఎవ్వళ్ళూ లేరు. అద్దాల్లో తన ప్రతిబింబాలను తానే చూసుకుని గాభరా పడిపోయి, అందువల్ల కలిగిన భయంతో తన చావును తానే కొనితెచ్చుకుంది.
ఈ ప్రపంచం తనకు తానుగా ప్రజలకు ఏ అపకారం తలపెట్టదు. మన మనస్సుల్లోని ఆలోచనలే మనకు  మేలయినా, కీడయినా కలిగిస్తాయి. మనకు  మంచి జరిగినా, చెడు జరిగినా  దానికి కారణం మన భావాలే. మన కోరికలే. మన నిర్ణయాలే. మనం చేసే పనులే.
ఎందుకంటే మన చుట్టూ వున్న లోకమే ఓ పెద్ద దర్పణం.

 (శ్రీనివాస్ వూటుకూరు పోస్ట్ ఆధారంగా)
13-06-2015

NOTE: Courtesy Image Owner