19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పాలకొల్లు నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలుగు సంగీత కెరటం మాండలిన్ శ్రీనివాస్

(Published in Andhra Jyothy, Telugu Daily in its Edit page today)
ఎక్కడో పాలకొల్లులో జన్మించిన ఒక వ్యక్తి మరణవార్తను బీబీసీ శుక్రవారం నాడు ప్రసారం చేసింది. "ప్రసిద్ధ భారతీయ సంగీత  విద్వాంసుడు మాండలిన్ శ్రీనివాస్ దక్షిణాది నగరం చెన్నైలో శుక్రవారం నాడు కన్నుమూసారం"టూ, అతడు మరణించిన కొద్ది గంటల్లోనే బీబీసీ వెల్లడించింది.
బీబీసీలో ఈవార్త వచ్చిందంటే ఉప్పలపు శ్రీనివాస్ అనే నలభయ్ అయిదేళ్ళ ఈ పాలకొల్లు కుర్రవాడు ఏ స్థాయికి ఎదిగాడన్నది సులభంగా అర్ధం చేసుకోవచ్చు. పాశ్చాత్య సంగీత పరికరం మాండలిన్ పేరే శ్రీనివాస్ ఇంటిపేరుగా మారిపోయిందంటే దానిపై ఈ గ్రామీణ ప్రాంతపు, చదువూ సంధ్యా లేని కుర్రాడు యెంత పట్టు సాధించాడో తెలిసిపోతుంది.


పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు పాలకొల్లులో తన తండ్రి సత్యనారాయణతో కలిసి చిన్నతనంలోనే  బ్యాండ్ మేళాలలో శ్రీనివాస్ వాయిస్తూ వుండేవాడు. బాల్యంలోనే తాను  స్వయంగా నేర్చుకున్న సంగీత విద్యతో నలుగురినీ  మెప్పించేవాడు. పాలకొల్లు అంటేనే  సంగీతాభిమానుల పుట్టిల్లు. క్లారినెట్ వాయించే ఒక సాధారణ వ్యక్తి శిలావిగ్రహం ఆ వూరి నడిబొడ్డులో ప్రతిష్టించడం  సంగీతంపట్ల ఆ వూరివారలకు వున్నఆదరాభిమానాలకు నిదర్శనం.
బ్యాండ్  మేళంలో వాయిస్తున్న శ్రీనివాస్  అలనాటి సంగీత విద్వాంసుడు  రుద్రరాజు సుబ్బరాజు గారి కంటపడడం శ్రీనివాస్ జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఆ కుర్రాడిలో అంతర్లీనంగా దాగివున్న ప్రతిభను చెన్నైలో  స్తిరపడిన ఆ విద్వాంసుడు  చప్పున గుర్తించగలిగారు. వెంటనే తండ్రితో సహా ఆ కుర్రాడిని వెంటబెట్టుకుని మద్రాసు తీసుకువెళ్ళారు. దగ్గర  వుంచుకుని స్వయంగా  సంగీతంలోని మెళకువలను బోధించారు. అసలే దైవదత్తమైన సంగీతం శ్రీనివాస్ కు పుట్టుకతోనే అబ్బింది. పూవుకు సువాసన తోడయినట్టు సుబ్బరాజుగారి గురు కటాక్షం సిద్దించింది. మట్టిలో దాగున్న మాణిక్యం వెలుగులోకి వచ్చి నలుదెసలకు తన కాంతులను వెదజల్లింది.  ఇంతింతయి వటుడింతయి అన్నట్టు సంగీత ప్రపంచంలో  శ్రీనివాస్ ఎదుగుదలకు అడ్డులేకుండా పోయింది. అంతవరకూ కర్నాటక సంగీతంలో మాండలిన్ వంటి పాశ్చాత్య పరికరానికి చోటులేదు. సంగీత కచ్చేరీలలో ఎక్కువగా కానవచ్చే 'హార్మోనియం' కూడా  ఆకాశవాణి గుర్తింపు పొందడానికి దాదాపు యాభయ్ ఏళ్ళు పట్టింది. అలాటిది, తమిళనాడులోని సంగీత విద్వాంసులందరి మూకుమ్మడి  ప్రశంసలు పొందిన శ్రీనివాస్,  మాండలిన్ సమేతంగా ఆకాశవాణి స్టూడియోలో సగౌరవంగా అడుగుపెట్టడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన  అవసరం లేకుండా పోయింది. పాలకొల్లులో పుట్టి అనేక ప్రపంచదేశాలలో మాండలిన్ ప్రదర్శనలు  ఇచ్చి, అనేకానేక పురస్కారాలు పొంది, సమకాలీన సంగీత దురంధరుల సరసనే సముచిత స్థానం సంపాదించుకున్న శ్రీనివాస్ అకాల మృత్యువు వొడికిచేరడం నిజంగా విచారకరం. సామాజిక అసమానతలు మనుషులలోని అసలయిన ప్రతిభను అణచిపెట్టలేవు అనడానికి మాండలిన్ శ్రీనివాస్ నిలువెత్తు నిదర్శనం.
-ఆర్వీవీ  కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు     

(19-09-2014)

18, సెప్టెంబర్ 2014, గురువారం

దేవుడితో ముచ్చట


ఏకాంబరం దేవుడ్ని కలుసుకున్నాడు. ఆ రోజెందుకో దేవుడు కూడా ఖాళీగా వుండి ఏకాంబరం అడిగే చొప్పదంటు ప్రశ్నలు అన్నింటికీ జవాబులు చెప్పాడు.
'దేవుడూ  దేవుడూ నిన్నొకటి అడగనా?'
 'దాందేవుంది అలాగే అడుగు'
 'ముందే చెబుతున్నాను. అడిగిన తరువాత ఇదేం పిచ్చి ప్రశ్న అని ఆట పట్టించకూడదు సుమా!'
'మనుషులందరూ నా సంతానమే. సంతానం అంటే అందరికీ పిచ్చి ప్రేమే కదా! అడుగు. చేతనయిన జవాబు చెబుతాను'
'ఈరోజు తెల్లారిన దగ్గరినుంచి ఒక్కటీ సరిగ్గా జరగడం లేదు. రాత్రి సరిగా నిద్రపట్టక ఆలస్యంగా లేచాను. తయారై ఆఫీసుకు వెడదామని చూస్తె కారు స్టార్ట్ కాలేదు'
'హోటల్లో భోజనానికి వెడితే నా శ్రాద్ధం, ఉడికీఉడకని అన్నం నా మొహాన తగలేశాడు. తినబుద్దికాక రోడ్డుపక్కన బండి వద్ద దొరికింది తినేసి ఆఫీసుకు చేరాను. అక్కడ ఆఫీసరు మాత్రం చక్కగా వడ్డించాడనుకో, ఆలస్యం అయినందుకు'
'ఇంకా...'
'ఇంకా అంటే  చాలావుంది. ఫ్రెండుతో మాట్లాడుతుంటే  ఫోను చార్జ్ అయిపోయింది'
'తరవాత....పోనీలే! ఇప్పుడు నేను చెప్పనా! నీకీ రోజు ఎందుకు ఇలా గడిచిందో. నువ్వు ఆలస్యంగా లేవడం మంచిదయింది. ఇది నా నిర్వాకమే. నువ్వు నిద్రపోతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ సమయంలో నువ్వు  బాత్  రూమ్ లో వుండి వుంటే షాక్ కొట్టేది'
'కారు స్టార్ట్ కాకపోవడానికి కూడా కారణం నేనే. ఆ వేళప్పుడు మీ వీధిలో బాగా తాగి ఒకడు కారు అడ్డదిడ్డంగా నడుపుతున్నాడు. నువ్వు వెళ్ళినట్టయితే ప్రమాదం జరిగుండేది'
'హోటల్లో అన్నం సరిగ్గా ఉడకలేదన్నావు. అది వండిన మనిషికి ఈ రోజు వొంట్లో బాగా లేదు. అంటురోగం. అతడు వండిన వంట తినకపోవడమే మంచిదయింది'
'ఏదో ఫ్రెండూ ఫోనూ అని చెప్పావు చూడు. వాడు నిజానికి నీ ఫ్రెండు కాదు. వాడేదో వెధవ పనిచేస్తూ నిన్నూ ఆ ముగ్గులో దించాలని ఫోను చేసాడు. అదే టైం కి చార్జ్ అయిపోవడం వల్ల నువ్వా కేసులో చిక్కోలేదు'     
'హోరి దేవుడా! వీటి వెనుక ఇంత కధ ఉందా! తెలియక నిన్ను అనవసరంగా ఆడిపోసుకున్నానే! నన్ను మన్నించు మహాత్మా!'
'పరవాలేదులే ఇవన్నీ నాకు అలవాటే. మంచి జరిగితే దేవుడి దయ అంటారు. లేకపోతే దేవుడే చేశాడు అంటారు. మంచీ చెడూ అన్నీ నా ఖాతాలోకి తోసేస్తుంటారు. నాకు ధన్యవాదాలు చెప్పనక్కరలేదు కానీ, ఈ రోజు గడవడానికి ఇంకా సమయం వుంది. ఏదన్నా చేతయిన మంచి పని ఒకటి చేసి ఇతరులచేత మంచి అనిపించుకో. అది చాలు'


(నెట్లో తిరుగాడుతున్న ఓ ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner 

17, సెప్టెంబర్ 2014, బుధవారం

అతడు – ఆమె – ఆవిడ



‘ ఓసారెళ్ళి ఆవిడ్ని చూసిరండి. ఒకటే కబుర్లు చేస్తోంది.’
శంకరం కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. భార్య  నోటి వెంట ‘ఆవిడ’ ప్రస్తావన రావడం ఈ అయిదేళ్ళలో ఇదే మొదటిసారి.
పెళ్ళయిన నాటి నుంచీ ఇదే తంతు.
'నేను మీ జీవితంలోకి వచ్చాను. అంతే. ఇక ఆవిడ ప్రస్తావన మన మధ్య రావడానికి వీల్లేదు’ దాదాపు హుకుం జారీ చేసింది.
మొదటి రాత్రే తనంటే ఏమిటో స్పష్టంగా తెలియచెప్పింది.  కాస్త వయసు మీదపడ్డ తరువాత పెళ్లి చేసుకుంటే ఇంతేనేమో. తానూ అప్పటినుంచి కుక్కిన పేను మాదిరిగానే పడివుంటున్నాడు, 'భార్య గీసిన గీత దాటడు' అనే పేరు బయట మారుమోగుతోందని తెలిసినా. ఇక, ఇంట్లో  ‘ఆవిడ’ ప్రసక్తి తేనంతవరకు, రానంతవరకు  భార్య తనని పల్లెత్తు మాట అనదు. పొరబాటున వచ్చిందంటే చాలు ఇక తన మాట వినదు.
ఏమిటో ఈ ఆడవాళ్ళు. మరో ఆడదాని మాట  మొగుడి నోట వెంట 'వినాల'ని కూడా అనుకోరు.
ఇంతకీ  శంకరం భార్య మొగుడ్ని  వెళ్ళి చూసిరమ్మని చెప్పిన ‘ఆవిడ'  ఎవరో కాదు, శంకరాన్ని నవమాసాలు మోసి కని పెంచిన అతడి కన్నతల్లి. పదిహేనేళ్ళ క్రితం తండ్రి చనిపోయిన నాటి నుంచి తన బాగోగులు చూస్తూ తను ఒక ఇంటివాడు అయ్యేంతవరకు కనిపెట్టుకుని చూసిన మనిషి.  పెళ్ళయిన మరుసటి నెలలోనే, కోడలి దాష్టీకం పుణ్యమా అని ఇల్లు వొదిలి పెట్టి పరాయి ఇంట్లో తలదాచుకుంటూ, ‘వంటలమ్మగా’  రోజులు వెళ్లమారుస్తోంది.
భార్యే స్వయంగా చూసి రమ్మని చెప్పడంతో ఇక  శంకరం ఆఘమేఘాలమీద తల్లి దగ్గర వాలిపోయాడు. తనకోసమే కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నట్టు వుంది. కానీ ఆ తల్లి కళ్ళల్లో కొడుకుని చూసిన తృప్తే తప్ప జీవం లేదు.
'నీతో కలిసి భోంచేయాలని వుందిరా శంకరం. నీకు అంత తీరుబడిఉందా? వెంటనే వెళ్ళాలా!' అని అడిగింది. పర్మిషన్ తీసుకునే వచ్చాడు కనుక 'దానికేముందమ్మా! అన్నం తినడమే కాదు ఈరోజంతా నీతో కలిసేవుంటాను' అనేసాడు. ఆ తల్లి తబ్బిబ్బయింది. తత్తరపాటుతో లేచి వెళ్లి వంట మొదలు పెట్టింది. శంకరం కూడా పక్కనే పీట వేసుకు కూర్చున్నాడు. ఆవిడ ఒక పక్క వంట చేస్తూనే శంకరం చిన్నతనపు అల్లరి గురించీ, తిండి అలవాట్లు గురించి గుర్తుచేసుకోవడం మొదలుపెట్టింది. ఆ కబుర్లు వింటుంటే చిన్నప్పుడు తల్లిని ఎంతగా ప్రాణాలు కొరుక్కు తినేవాడో అ విషయాలన్నీ కన్నీటిపొర తెరలా  కమ్మిన కళ్ళల్లో  గిర్రున తిరిగాయి. 
ఇద్దరూ కలిసి అన్నం తిన్నారు. తిన్నంత సేపూ తనివితీరా  కబుర్లు చెప్పుకున్నారు. పాత సంగతులు గుర్తుచేసుకున్నారు. కానీ ఆవిడ పొరబాటున కూడా 'ఆమె' ప్రసక్తి తీసుకురాలేదు.
బయలుదేరేటప్పుడు ఒక మూట చేతిలో పెట్టింది. ఇంటికి చేరగానే ఆ మూటను భార్య చేతిలో పెట్టాడు. ఆమె విసురుగా దాన్ని అటక మీదకు గిరవాటు వేసింది.
రోజులు గడిచాయి. మళ్ళీ కబురు. కానీ ఈసారి ఆవిడ నుంచి కాదు. ఆవిడ వంటలు చేసిపెట్టే వారినుంచి.
'అంతా అయిపొయింది. ఇన్నేళ్ళు మా ఇంట్లో వంటలు చేసి పెడుతోంది కానీ ఆవిడ ఎవ్వరో, ఎవరి తాలూకో కూడా తెలియదు. మొత్తం మీద మీ చిరునామా కనుక్కునేసరికి ఇన్నాళ్ళు పట్టింది. అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు చేసే ఒక సంస్థ వారు ఆపని పూర్తిచేశారు'
శంకరం బావురుమన్నాడు. ఇంటివారు కబురుచేసిన దానిప్రకారం తల్లితో కలిసి భోంచేసిన రాత్రే ఆవిడ కన్ను మూసింది. భార్యకు ఇచ్చిన మూట జ్ఞాపకం వచ్చి అటక మీద నుంచి తీసి చూశాడు. తల్లికి పుట్టింటివాళ్ళు పెట్టిన నాలుగు బంగారు గాజులు, వొంటిపేట చంద్రహారం అందులో వున్నాయి. వాటితో పాటే ఓ చీటీ.
'ఒరేయ్ శంకరం. నువ్వు పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకురాగానే  ఇవి ఇద్దామనుకున్నాను. ఇల్లు వొదిలి రావడం వల్ల కుదరలేదు. తరువాత ఇద్దామని ఎన్నోసార్లు అనిపించినా మళ్ళీ దేనికోసమో ఆరాటపడుతోంది అని అనిపించుకోవడం ఇష్టం లేక ఆ ఉద్దేశ్యం మానుకున్నాను. నా తరువాత ఇవన్నీ కోడలికే దక్కాలి. మనసులో ఏవీ పెట్టుకోకుండా తీసుకోమని చెప్పు. నేను ఇక ఎన్నో రోజులు బతుకుతానని అనుకోను. నిన్ను చూసాక ఇక నా ఆఖరి కోరిక కూడా తీరిపోయింది'
శంకరం ఆశ్చర్యంతో ఏడుపు ఆపేసాడు. మరొకరు ఆ గదిలో రోదిస్తున్న ధ్వని సన్నగా  వినబడుతోంది.


(NOTE: COURTESY IMAGE OWNER)

ఉప ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం?


(Published by  SURYA daily in its edit page on 18-09-2014)
సాధారణంగా సార్వత్రిక ఎన్నికల దరిమిలా వెంటనే వచ్చే ఉపఎన్నికల ఫలితాలు ఆయా పాలకపక్షాల తల  రాతను మార్చలేవు. ప్రతికూల  ఫలితాలు వచ్చినా,  వాటి మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే అవకాశం అసలే వుండదు. అంచేత ఉపఎన్నికల ఫలితాలపై చర్చకు ప్రాధాన్యత తక్కువ. సంకీర్ణయుగంలో వీటికి కొంత ప్రాముఖ్యత వుండే వీలుంది  కాని ప్రస్తుత తరుణంలో దానికీ అవకాశం లేదు. ఎందుకంటే,  గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమికీ, ఆంద్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి, తెలంగాణలో కేసీయార్ ఆధ్వర్యంలోని టీ.ఆర్.యస్. కు ప్రజలు ఎవరి మీదా ఆధారపడి మనుగడ కొనసాగించే అగత్యంలేని  మెజారిటీతో ఆయా పార్టీలకి అధికార పగ్గాలను అప్పగించారు. అందువల్ల ఉపఎన్నికల ఫలితాలు తారుమారయినా కూడా వాటికి అద్యతన భావిలో ఎదురయ్యే ముప్పు ఏమీ వుండదు. అయినా కానీ, ఫలితాల్లో ప్రతికూలతను తేలిగ్గా తీసుకుంటే ముందు ముందు మరిన్ని ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలను తోసిపుచ్చలేము. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే నానుడి ప్రకారం,  'గెలిచి తీరుతాం' అనే నమ్మకం వున్న పాలక పక్షాలు, 'గెలవడం అంత తేలిక కాదు' అనే అనుమానం వున్న ప్రతిపక్ష పార్టీలు కూడా  ఉప  ఎన్నికలను  సయితం ఒక సవాలుగా తీసుకుని ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెడతాయి. తమకున్న శక్తియుక్తులనన్నింటినీ పణంగా పెట్టి పోరాడతాయి. గెలిచిన పక్షంలో  తమ పాలనకు మెచ్చి ప్రజలిచ్చిన కానుకగా అభివర్ణించుకుంటూ పాలక పక్షం జబ్బలు చరుచుకుంటుంది. అదే ప్రతిపక్షానికి ఆ అవకాశం దక్కితే, పాలకపక్షం పట్ల ప్రజల్లో వేగంగా పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ఉపఎన్నిక ఫలితం ఒక సంకేతం అంటూ  బొబ్బలు పెడుతుంది. ఇది ఎన్నాళ్ళనుంచో సాగుతూ వస్తున్న జనమెరిగిన రాజకీయమే.
ఈ వాస్తవాలను గమనంలో ఉంచుకుని ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన 54 అసెంబ్లీ, మూడు  లోక సభ స్థానాల్లో ఉపఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటే తేటతెల్లం అయ్యేది ఒక్కటే. అదేమిటంటే రాజకీయపార్టీల పట్ల ప్రజల ఆదరణ ఎప్పుడూ  ఒకే తీరున ఉండదనీ, ఆ ఆదరణలో హెచ్చుతగ్గులు అతిసహజమనీ.



నాలుగునెలలక్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశం నాలుగుచెరగులా మారుమోగి, ప్రజలను అనూహ్యంగా ఆకట్టుకున్న 'నమో' మంత్రం ఈ ఉపఎన్నికల్లో పనిచేయలేదు. అప్పుడు ప్రభంజనం మాదిరిగా ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో లోక సభ సీట్లను కొల్లగొట్టిన బీజేపీ, తాజాగా ఆ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చతికిలపడిపోయింది.  యూపీలో గత అసెంబ్లీ  ఎన్నికల్లో గెలుచుకున్న పది సీట్లలో బీజేపీ ఏకంగా ఏడింటిలో వోటమి చవిచూసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రాష్ట్రంలో ఆ పార్టీ ఎనభయ్ లోకసభ స్థానాల్లో అక్షరాలా డెబ్బయ్ ఒకటి  గెలుచుకుని 'మోడీ హవా' అంటే ఏమిటో యావత్ దేశానికి రుజువుచేసి నెలలు తిరక్క ముందే ఈ మాదిరి పరాజయం మూటగట్టుకోవడం అన్నది నిజంగా బీజీపీ నాయకులకు మింగుడు పడని ఫలితమే. అలాగే మరో దారుణమైన వోటమి రాజస్థాన్ లో ఎదురయింది. ఆ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం పాతిక లోకసభ స్థానాల్లో ఏ ఒక్కటీ బీరుపోకుండా అన్నింటినీ తన ఖాతాలో వేసుకుని విజయకేతనం ఎగరేసిన బీజేపీకి ఈసారి అక్కడ జరిగిన నాలుగు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఒక్కటంటే ఒకే స్థానం దక్కింది. కిందటి ఎన్నికల్లో తుడిచిపెట్టుకుని పోయిన కాంగ్రెస్ పార్టీకి మిగిలిన మూడు దక్కాయి.   ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో కేంద్రంలో పనిచేస్తున్న ఎండీయే సర్కారు పట్ల వోటర్ల వైఖరి ఈ కొద్దికాలంలోనే ఇంతగా మారిపోవడానికి ఆయన చేసిన ఘోర తప్పిదాలు ఏమీ లేవు. ఎన్నికలకు ముందు మోడీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఏవీ లేవు, ఈ స్వల్పకాలంలో అవేవీ అమలుచేయలేదని కినుక వహించడానికి. అయినా ఇలా ఎందుకు జరిగింది? ఇప్పుడు అందరి మనస్సుల్లో మెదులుతున్న ప్రశ్నే! దానికి మోడీయే స్వయంగా వివరణ ఇచ్చారు. మొదట్లో చెప్పుకున్న విధంగానే ఆ వివరణ సాగింది. కొత్త పద్ధతిలో తాను పరిపాలన  సాగిస్తున్నాననీ, ఉపఎన్నికల ఫలితాల నేపధ్యంలో తనపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు తన పని తీరు అర్ధం కావడానికి కొంత  సమయం పడుతుందనీ  ఆయన అన్నారు. ప్రతిపక్షాలు సరే! వాళ్ళు ఎట్లాగో విమర్శలు చేయక మానరు. ఈ ఫలితాలవల్ల ఇప్పటికిప్పుడు మోడీ సర్కారుకు వచ్చే ముప్పు  ఏవీలేని మాట కూడా నిజమే.  కానీ ప్రజలనుంచి  సయితం  ఇలాటి ప్రశ్నలు మొదలుకాకుండా చూసుకోవాలి. మోడీ విశ్వసిస్తున్నట్టు ప్రజలు మార్పు కోరుకుంటారు. అలా కోరుకునేవారు గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి పట్టం కట్టారు. మళ్ళీ వాళ్ళు మరోసారి మార్పుకోరుకోకుండా చూసుకోవడానికి ఈ ఉపఎన్నికల ఫలితాలను    ఒక హెచ్చరికగా పరిగణించాలి. లేని పక్షంలో ప్రజల ఆదరణ, ఆగ్రహంగా మారడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఈ సూత్రం ఒక్క మోడీకే కాదు ప్రజలు కోరుకుని ప్రభుత్వ పగ్గాలు అప్పగించిన అన్ని రాజకీయ పార్టీలకీ వర్తిస్తుంది. (17-09-2014)                         

15, సెప్టెంబర్ 2014, సోమవారం

పరాశర గోత్రోద్భవభవస్య




ఖ్యాతి, భృగువు భార్య. ఆమె యందు భృగువు ఇద్దరు పుత్రులనుకన్నాడు. వారు పేర్లు ధాత, విధాత. వారి పుత్రులు ప్రాణుడు, మృకండుడు.
ఈ ఇద్దరికీ జన్మించిన  పుత్రసంతానం ఇలా వుంది....ప్రాణుని కొడుకు ద్యుతిమంతుడు. అతడి కుమారుడు  అజావంతుడు, అజావంతుని పుత్రుడు వంశుడు. పొతే,  మృకండుముని పుత్రుడు మార్కండేయుడు. ఈ మహామునికి జన్మించినవాడు వేదశిరుడు. ఇక్కడికి ఇలా ఉండనీ!
నవబ్రహ్మల్లో ఇంకొకడు మరీచి మహర్షి. ఈ మహర్షికి సంభూతి భార్య. వీరి సంతానం పౌర్ణమాసుడు. ఇతడికే విరజుడు పర్వతుడు అని ఇద్దరు పుత్రులు.
ఇట్లాగే మరొక బ్రహ్మ అంగీరసుడున్నాడు. ఈతని భార్య స్మృతి. సినీవాలి, కుహువు, అనుమతి అనే కన్య వీరి సంతానం.
అత్రి మహర్షి అనే బ్రహ్మకు అనసూయ సతి. మహాసాధ్వి ఈమె. వీరికి సోముడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు జన్మించారు. స్వాయంభువ మన్వంతరంలో ఇతడే అగస్త్యమహర్షి.
పులహునికి క్షమ యందు కర్దముడు, చార్వరీవంతుడు, సహిష్ణువు అని ముగ్గురు పుత్రులు జన్మించారు.
క్రతువునకు సంనతి అనే భార్య వల్ల బొటనవ్రేలి కణుపు ఎంత పరిమాణంలో ఉంటుందో, అంత ప్రమాణంలో వాలభిల్యుడు మొదలైన 60 వేల మంది పుత్రులు కలిగారు.
వసిష్ఠునికి ఊర్జవల్ల ఊర్థ్వబాహుడు, రజుడు, అనఘుడు, గోత్రుడు, సవనుడు, సుతపుడు, శుక్రుడు జన్మించారు. వీరు ఉత్తమ మనువుకాలంలో సప్తర్షులు.
బ్రహ్మ పెద్దకొడుకు వహ్నికి, స్వాహావల్ల గొప్ప ఓజస్సంపన్నులైన ముగ్గురు పుత్రులు కలిగారు. వీరే శుచి, పావకుడు, పవమానుడు. వీరికి తిరిగి జన్మించిన సంతానం 45 మందికి, ఈ వహ్ని మొదలగు అగ్నులు కలిసి మొత్తం 49 మంది అగ్నులుగా సుప్రసిద్ధులు.
బ్రహ్మవల్ల సృజింపబడిన అగ్నిష్వాత్‌, బార్హిషద్‌, అనగ్న, సాగ్నాది సంతతి తెలిసింది కదా! స్వధాదేవికి పితృదేవుని వల్ల పితృగణాలు, మేన - వైతరణి అనే యిద్దరు బ్రహ్మవాదినులైన కన్యలు కలిగారు. సర్వశుభలక్షణలు, గొప్పజ్ఞానవంతురాళ్లు. దక్షకన్యల గురించిన సంగతులన్నీ విన్నావు కదా! ఈ వైనం శ్రద్ధగా స్మరించిన వారికి సంతానహీనత కలుగదు" అని చెప్పాడు "పరాశరుడు"

(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు)


ఇదంతా అందరికీ అర్ధం అయ్యే రీతిలో చెప్పింది ఎవరో చెప్పాల్సిన పనిలేదు. ఇలా చెప్పగలిగిన ఒకే ఒక్కరు అందరికీ తెలిసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే మా గోత్రం "పరాశర" - అదీ విషయం - ఇంకో విషయం ఇది మోచర్ల  కృష్ణమోహన్ గారి  సౌజన్యం - భండారు శ్రీనివాసరావు

13, సెప్టెంబర్ 2014, శనివారం

నారావారి నూర్రోజుల పాలన

PUBLISHED IN 'SURYA'  TELUGU DAILY IN ITS EDIT PAGE ON 14-09-2014
(నూతన రాష్ట్రం 'ఆంద్ర ప్రదేశ్' ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల పదిహేనవ తేదీన వంద రోజుల పాలన పూర్తిచేసుకుంటున్న సందర్భంగా) 


గతంలో తొమ్మిదేళ్ళు పై చిలుకు అఖండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం వున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నిజానికి ఈ వంద రోజుల పాలన ఓ లెక్కలోనిది కాదు. కానీ ఈసారి లెక్క మారింది. ఆయన ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేనాటికి రాష్ట్రం రెండు ముక్కలయింది. ఇరవై మూడు జిల్లాలు కలిగిన  సువిశాల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పదమూడు జిల్లాలకు కుంచించుకు పోయింది. ఆయన ఒకనాడు కంటిచూపుతో శాసించిన సచివాలయం పరిస్తితీ అదే. వరసగా అనేక సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా సికింద్రాబాదు పెరేడ్ మైదానంలో  జాతీయ పతాకం ఎగరేసిన పంద్రాగష్టు పండుగను ఈసారి కర్నూలు వెళ్లి జరుపుకోవాల్సివచ్చింది. ఒక ముఖ్యమంత్రి పొరుగు రాష్ట్రం రాజధానిలో ఉంటూ, పొరుగునే వున్న మరో రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వుండడం అనే విచిత్ర పరిస్తితి కనీవినీ ఎరుగనిది. పాలకులు ఒకచోట, పాలితులు మరోచోట అనేది స్వతంత్ర భారత చరిత్రలో ఓ కొత్త ముచ్చట.
ఇలాటి వింత పరిరిస్తితి వల్ల పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులు గురించి, సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు చెబుతూవస్తూనే వున్నారు.  ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిపి, ఆ తరువాత విడతీయడం వల్ల అనునిత్యం  బయట పడుతున్న కొత్త చిక్కులు ఆయన్ని సతతం చీకాకు పరుస్తున్న మాట కూడా కాదనలేనిది. పైపెచ్చు ఇవన్నీ కొత్తగా ఏర్పడ్డ రెండు రాష్ట్రాల నడుమ సరికొత్త వివాదాలకు కారణం కావడం కూడా మరో కొత్త పరిణామం. పొరుగున వున్న తెలంగాణా ముఖ్యమంత్రి, ఆయన సహచరులు సహకార హస్తాన్ని అందించడం లేదన్న అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో ప్రబలుతోంది. పైగా తమని  చుట్టుముడుతున్న అన్ని చిక్కులకు వారే కారణమన్న భావం కూడా టీడీపీ నాయకుల్లో బలపడుతోంది. దానాదీనా ఉభయుల మధ్య ఒకరకమైన 'అసహన వాతావరణం' నెలకొని, ఇచ్చిపుచ్చుకోళ్ళవంటి సర్దుబాటు ధోరణి కనుమరుగవుతోంది. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు, కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, పాత కొత్త రాష్ట్రాల నడుమ  ఈ విధమైన ఘర్షణ వాతావరణం నెలకొన్న దాఖలా లేదు.  ఏదో ఒక అంశంపై వాదప్రతివాదాలు చోటుచేకుంటూ వుండడం, అవి ప్రసారమాధ్యమాల్లో చర్చోపచర్చలకు దారితీస్తూవుండడం నిత్యకృత్యమైపోతోంది. సహజంగానే ఇవన్నీ సరి కొత్త రాష్ట్రంలో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబుకు కొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి. అధికారం చేతికిచిక్కి నెలలు గడిచిపోతున్నా సొంత రాజధాని, సొంత సచివాలయం, సొంత పాలనా వ్యవస్థ లేకపోవడం అనేది పరిపాలనపై ప్రభావం చూపుతుంది. సమర్ధుడైన పాలకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు, మూడో సారి ముఖ్యమంత్రి అయిన తరువాత గతంలో మాదిరిగా చురుకుగా వ్యవహరించలేకపోతున్నారని, కేవలం పర్యటనలతో, ప్రకటనలతో పొద్దుపుచ్చుతున్నారని ప్రత్యర్ధులు విమర్శించడానికి ఈ నేపధ్యం కొంత కారణం. అయితే, ఇటువంటి విపత్కర పరిస్తితులను నిభాయించుకుని రావడంలో ఆయన అనుభవమే ఆయనకు చక్కగా అక్కరకువస్తోందన్న అభిప్రాయం కూడా వుంది. 'ఏవీ లేకుండా ఆయన మాత్రం ఏం చేస్తాడు' అనే సానుభూతి మాటలు  టీడీపీ కార్యకర్తలనుంచే కాకుండా సామాన్య ప్రజలనుంచి కూడా వినబడుతున్నాయి. రైతుల రుణ మాఫీ హామీ అమలులో జరుగుతున్న  తాత్సారం, లేదా ఆ హామీల విషయంలో వెలువడుతున్న కప్పదాటు ప్రకటనల దరిమిలా కూడా ప్రజలనుంచి నిరసన వ్యక్తం కాకపోగా సానుభూతి పవనాలు వీస్తున్నాయని  టీడీపీ నాయకులు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.  కాకపొతే ఇదంతా మీడియా మీద ఆయనకు వున్న పట్టువల్ల జరుగుతున్న ప్రచారమే కాని,  ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని ప్రత్యర్ధులు కొట్టిపారవేయడం జరుగుతోంది. కాని ఒక విషయం గమనంలో పెట్టుకోవాలి. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రధాన ప్రతిపక్షం, వై.ఎస్.ఆర్.సీ.పీ.  తొందరపడి చేపట్టిన ఆందోళన కార్యక్రమం పట్ల ప్రజలనుంచి ఆశించిన స్పందన రానిమాట మాత్రం వాస్తవం. ఇదే విషయంపై మరోసారి, కాకపొతే ఈసారి కొన్నాళ్ళు వేచి చూసిన తరువాత తమ పార్టీ ఆందోళనకు దిగుతుందని అ పార్టీ హెచ్చరికలు చేస్తోంది. రుణ మాఫీ విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం అని ఇన్నాళ్ళుగా చెబుతూ వచ్చిన టీడీపీ ప్రభుత్వానికి ఆ హామీ అమలు అనుకున్నంత సులభం కాదని నెమ్మది నెమ్మదిగా అర్ధం అవుతోంది. కానీ, తనకున్న అపార పరిపాలనానుభవాన్ని, కేంద్ర ప్రభుత్వంతో తనకున్న సాన్నిహిత్యాన్ని తుదికంటా వాడుకుని అయినా సరే రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అడుగులువేస్తున్నట్టు కనబడుతోంది. అసలు ఇటువంటి వాగ్దానాలు చేయడమే రాజకీయం అయినప్పుడు వాటి అమలు తీరు విషయం కూడా రాజకీయం కావడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. భవిష్యత్తులో రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానాలు చేసేటప్పుడు కొంత సంయమనం పాటించాల్సిన అవసరాన్ని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడులకు ఈ విషయంలో  ఎదురయిన  అనుభవం తేటతెల్లం చేస్తోంది.
పొతే,  రాజకీయంగా కుదురుకుని, మరో రెండు తడవలు రాష్ట్రాన్ని పరిపాలించే దిశగా చంద్రబాబు వేస్తున్న అడుగులు ఆయన పరిపక్వతని చాటుతున్నాయి. పార్టీని పటిష్టపరచుకునే క్రమంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆకర్ష్ పధకాన్ని ఆయన కట్టుదిట్టంగా అమలుచేస్తున్నాడు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ దిగ్గనాధీరులను టీడీపీలోకి తీసుకోవడం ఎంతగానో లాభించిన విషయం ఆయన మరచిపోలేదు. అందుకే, ఎవరిమీద ఆధారపడకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునే సువర్ణావకాశాన్ని ప్రజలు ఎన్నికల్లో కట్టబెట్టిన తరువాత కూడా ఆయన చేతులు  ముడుచుకుని కూర్చోలేదు. ఇలాటి విషయాల్లో  నైతికత అంటూ మడికట్టుకుని  కూర్చోలేదు. జిల్లాపరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు తన రాజకీయ విశ్వరూపాన్ని పూర్తిగా ప్రదర్శించారు. టీడీపీ చేతిలో ప్రభుత్వ పగ్గాలను  2029 వరకు ఉంచుకోవడం లక్ష్యంగా ఆయన చేసిన ప్రకటన ఇందుకు అద్దం పడుతోంది. సరే ఒక రాజకీయ పార్టీ అధినాయకుడిగా ఇలాటి సుదీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకోవడం తప్పేమీ లేదు. ఎన్నికల ప్రచార సమయంలో జగన్ మోహన్ రెడ్డి సయితం కొన్ని దశాబ్దాలపాటు తాము ఏర్పరచబోయే ప్రభుత్వానికి ధోకా ఉండదని పలుమార్లు ఉద్ఘాటించిన విషయం తెలిసిందే. భవిష్యత్తు గురించి పార్టీ శ్రేణుల్లో భరోసా కల్పించడానికి ఈ రకమైన ప్రకటనల అవసరం వారికి వుంటుంది. దాన్ని అలావుంచి, వర్తమానంలో ప్రజలకు ఏమిచేస్తున్నాము అనేది కూడా ప్రధానమైనదే. గతం నుంచి నేరుగా భవిష్యత్తులోకి అడుగువేయాలని   ఆలోచిస్తూ వర్తమానాన్ని మరచిపోవడం విజ్ఞుల లక్షణం అనిపించుకోదు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముందు సవాలక్ష సమస్యలు వున్నాయి. అన్నింటికంటే ముందు రాజధాని నిర్మాణం లేదా ఏర్పాటు. అత్యంత క్లిష్టం అనుకున్న ఈ నిర్ణయం విషయంలో చంద్రబాబు చురుకుగా, వ్యూహాత్మకంగా పావులు కదిపి సమస్యను చాలా సులువుగా తేల్చేసారు. ఇలాటి అతిముఖ్యమైన నిర్ణయంలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయడం ద్వారా,  ప్రజాస్వామ్య స్పూర్తితో వ్యవహరించిందన్న మంచి పేరు ప్రభుత్వానికి  వస్తుందన్న సూచనలను కూడా ఆయన ఖాతరు చేయలేదు. విజయవాడ పరిసర ప్రాంతాలలో కొత్త రాజధాని ప్రతిపాదనకు  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదముద్ర వేయించుకుని కొన్ని నెలలుగా ఈ అంశంపై నెలకొనివున్న అసందిగ్ధతకు, ముసురుకుంటున్న ఊహాగానాలకు ఒక్కమారుగా తెర దించారు.  బహుశా వంద రోజుల పాలనలో చంద్రబాబు సాధించిన ఘన విజయం ఇదేనేమో!  ఇంకా అనేకం చేసినా, చెప్పినా, ప్రకటించినా, ప్రచారం చేసినా   అవన్నీ చాలావరకు కాగితాలకే పరిమితం. కార్యాచరణకు దూరంగానే వున్నాయి.
అన్ని అవరోధాలను అధిగమించి, ఆయన కలగంటున్న'నవ్యాంధ్ర ప్రదేశ్' (గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 'స్వర్ణాంధ్రప్రదేశ్' తన స్వప్నం అని చెప్పేవారు) కల సాకారం చేసుకోవడానికి ప్రస్తుతానికి ఆయన వద్ద వున్న 'వనరు'  ఒకే ఒక్కటి. అదే అనుభవం. ఆ వొక్కదానితో మిగిలిన యావత్తు వ్యవహారాలను సంభాలించుకోవడం అన్నది చంద్రబాబు వ్యవహార దక్షత పైనే ఆధారపడివుంటుంది. ఘటనాఘటన సమర్ధుడైన రాజకీయ నాయకుడిగా పేరున్న చంద్రబాబుకు, ఆ పేరు నిలబెట్టుకోవడానికి దొరికిన అపూర్వ సువర్ణావకాశం 'ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం' (13-09-2014)
NOTE: Courtesy Image Owner 

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

నువ్వే కరెక్టు


సింగినాదం రామనాధంతో అన్నాడు.
"నా భార్యతో పడలేకుండా వున్నానురా. ఇంటికి పోవాలంటే భయంగా వుంది. విషం మింగి చావాలని అనిపిస్తోంది"
"అలా నిరాశ పడకు సింగినాదం. మేమంతా లేమా! రేపు మీ ఆవిడతో మాట్లాడి సర్దిచెబుతాను. ఈ లోగా నువ్వు మాత్రం ఎలాటి అఘాయిత్యం చేయబోకు"
అన్నట్టే రామనాధం సింగినాదం భార్యతో మాట్లాడాడు.
"మీ ఆవిడతో మూడు గంటలు మాట్లాడాను సింగినాదం.  నాకు అర్ధం అయింది ఏమిటంటే, నువ్వే కరెక్టు. విషం తాగడమే సరైన నిర్ణయం అనిపిస్తోంది"