26, జూన్ 2014, గురువారం

ఇద్దరూ ఇద్దరే!


టీవీ - 5  ఈరోజు (26-06-2014)  రాత్రి   ఏడు గంటలకు తమ హాట్ టాపిక్ ప్రోగ్రాం లో 'ఇద్దరూ ఇద్దరే!' అంటూ చంద్రబాబు, కేసీఆర్ ల వివాదగ్రస్త వ్యాఖ్యలపై ఒక  చర్చా కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. శ్రీ సుబ్బారావు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ ప్రోగ్రాంలో నాతో పాటు  టీడీపీ నాయకుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్, కొత్తగా టీఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎం ఎల్ సీ శ్రీ భాను ప్రసాద్, బీజెపీ తరపున శ్రీ భాను ప్రకాష్ (ఫోన్ ఇన్) పాల్గొన్నారు.



యధాప్రకారం రెండు కొత్త రాష్ట్రాల నడుమ రేగుతున్న వివాదాల చుట్టూనే చర్చ పరిభ్రమించింది. ఎవరి వాదన వారిదే. వారిని తప్పుబట్టే పనిలేదు. వర్తమాన రాజకీయాలు అలా వున్నాయి. ఇద్దరు ముఖ్య మంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం కాకపోయినా రెండు ప్రాంతాల్లో వాతావరణం తేలికపడుతుందని యధాప్రకారం నేను చేసిన  సూచనను శ్రీ రాజేంద్ర ప్రసాద్ నెరవేరని కలతో పోల్చారు. ఇరుపక్షాలు తమ వైఖరికి బాగా కట్టుబడి వున్నాయని, అంగుళం మేర కూడా సడలింపుకు అవకాశం ఇచ్చే ధోరణి కానరావడం లేదని ఈ చర్చలో పాల్గొన్న తరువాత అవగతం అయింది. సర్దుబాటు మనస్తత్వంతో వ్యవహరిస్తే వివాదాలు సర్దుకుపోతాయన్న నా వాదన అరణ్య రోదనమే అయింది. ఇక ఈ విషయాలపై మీడియాలో మరో కొన్ని వారాలపాటు చర్చలు తప్పవని కూడా బోధపడింది. ఇలానే కొనసాగితే, 'ఇద్దరూ ఇద్దరే' కాదు,  శ్రీ మోడీని కూడా కలుపుకుని   'ముగ్గురు ముగ్గురే' అని చర్చించాల్సి వస్తుందని కూడా చెప్పాను. ఎందుకంటే సర్వం రాజకీయం అయిపోతున్నప్పుడు ఆ పార్టీ మాత్రం యెందుకు మిన్నకుంటుంది?

బాబాగా మారిన బావ గారు


ఖమ్మం పొలిమేరల్లో వున్న శ్రీ సాయిబాబా ఆశ్రమంలో సాయిబాబాగా  భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ బాబా, మా బాబాయి చిన్న అల్లుడు. మధురక్కయ్య మొగుడు. విశేషం  ఏమిటంటే ఆయన సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత కూడా మా అక్కయ్య ఆశ్రమంలోనే వుంటూ ఆయనకు సేవలు చేస్తోంది. బహుశా నిన్ననో మొన్ననో ఖమ్మంలోని మా మేనకోడలు విమల ఇంటికి భిక్షకు వచ్చినట్టున్నారు. మేనల్లుడు దుర్గాప్రసాద్ ఆ ఫోటోలు పోస్ట్ చేసాడు.


పూర్వాశ్రమంలో మా బావగారు  శ్రీ యోగానంద కృష్ణమూర్తి  హైదరాబాదులో చాలాకాలం పోలీసు అధికారిగా పనిచేశారు. పాఠకుల్లో కొంత మందికి గుర్తు వుండి వుంటుంది. యాభై అరవై ఏళ్ళ కిందటి ముచ్చట.   రైల్లో ఒకర్ని హత్యచేసి శవాన్ని ముక్కలు గా కత్తిరించి ఆ మూటని రైల్లోంచి విసిరి వేసిన కేసు. షర్టుపై వున్న చాకలి గుర్తు ఆధారంగా మా బావగారు ఆ కేసును పరిశోధించి హంతకుడయిన ఒక డాక్టర్ ని అరెస్టు చేశారు. మంచి దక్షత కలిగిన అధికారిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు.

మూడు లక్షల హిట్లు




'భండారు శ్రీనివాసరావు - వార్తా వ్యాఖ్య' (http://bhandarusrinivasarao.blogspot.in/)అనే పేరుతొ తెలుగులో ఈ  నా బ్లాగు మొదలు పెట్టినప్పుడు నాకు బ్లాగంటే ఏమిటో తెలియదు. తెలుగులో యెలా టైప్ చేయాలో తెలియదు. నెట్ కనెక్షన్ అంటే ఏమిటో అంతకంటే తెలియదు.


పూణేలో మా రెండో అబ్బాయి సంతోష్ కొత్త  కాపురం చూడ్డానికి వెళ్ళినప్పుడు నాచేత బ్లాగు ఓపెన్ చేయించాడు. యెలా రాయాలో, యెలా పోస్ట్ చేయాలో వాడూ, మా అన్నయ్య కుమారుడు సాయి కలిపి అక్షరాభ్యాసం చేయించి కంప్యూటర్ తెరపై ఓనమాలు దిద్దించారు. ఆ తరువాత మా పెద్దబ్బాయి సందీప్ ని చూడడానికి అమెరికా వెళ్ళినప్పుడు కాలక్షేపం కోసం మొదలుపెట్టిన బ్లాగు రాతలు 14 వందల పైచిలుకు  పోస్టింగుల్లోకి వెళ్ళిపోయి  అక్షరాలా ఇవ్వాల్టికి మూడు లక్షల హిట్లను సంపాదించి పెట్టాయి. పబ్లిష్ అయిన కామెంట్లు రెండువేల మూడువందలు దాటాయి  బహుశా ఈ జీవితంలో నేను కూడబెట్టుకున్న తొలి, చివరి సంపాదన ఇదేనేమో! అభిమానించిన అందరికీ కృతజ్ఞతలు. గొప్పకోసం కాదు కాని ఈ విషయాన్ని పంచుకోవడం అదో తుత్తి. కదా మరి!  - భండారు శ్రీనివాసరావు  

NOTE: Artificial image taken from Google    

గాలి కారు

గాలిలో తేలినట్టుందే గాలిలో వూగినట్టుందే అని పాడుకుంటూ ఝామ్మున కారేసుకుని ఫుల్లుగా గాలి కొట్టేసుకుని షికారుకెళ్ళే రోజులు త్వరలో రాబోతున్నాయి. వుత్తి గాలి కబుర్లు అని కొట్టి పారేయకండి. పెట్రోలు డీసేలు లేకుండా కేవలం గాలితో నడిచే కారుని మనదేశంలోనే టాటా మోటార్స్ వాళ్లు తయారు చేశారు.



అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ గాలి కారు కొద్ది మాసాల్లోనే రోడ్డెక్కుతుంది. యాభై రూపాయల గాలి కొట్టించుకుంటే చాలు రయ్యిమని వంద కిలో మీటర్లు దూసుకెళ్ళవచ్చు. ఇంతా చేస్తే ఈ కారు ఖరీదు కాస్త అటూ ఇటూగా మూడున్నర లక్షల రూపాయలు. ఈ గాలి కారుకు తాళాలు కూడావుండవు. దీన్ని నడపడానికి ఒక యాక్సిస్ కార్డు ఇస్తారు.

మోడీ నెల పాలన


కేంద్రంలో మోడీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి అయిన సందర్భంగా V-6 ఛానల్  నిన్న (25-06-2014) రాత్రి ఏడు గంటలకు ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. నాతొ పాటు కాంగ్రెస్ రాజ్య సభ సభ్యులు శ్రీ రాపోలు ఆనంద్ భాస్కర్, బీజేపీ తరపున శ్రీ శ్రీ రామ్ పాల్గొన్నారు. యాంఖర్ శ్రీ బుచ్చన్న.


'అరవై నెలల్లో ఒక నెల గడిచింది. అడుగులు వడివడిగా పడకున్నా తడబడకుండా వున్నందుకు సంతోషించాలి.(అప్పటికి గ్యాస్ ధరల పెంపు నిర్ణయం వాయిదా ప్రకటన వెలుగులోకి రాలేదు) అయిదేళ్ళు పాలించే  ప్రభుత్వ పనితీరును నెల పాలనతో ముడిపెట్టి అంచనా వేయడం సరికాదు. కాకపొతే స్థాలీపులాకన్యాయంగా కొన్ని మంచి చెడులను ప్రస్తావించుకోవచ్చు. విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న నల్లధనం వెనక్కి రప్పించడానికి తీసుకున్న చొరవ శ్లాఘనీయం. కానీ ఇది కంటి తుడుపు చర్యగా మిగిలిపోరాదు. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగు పరచుకునే దిశగా తీసుకుంటున్న చర్యలని  స్వాగతించాలి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చినప్పుడు వాటిని తీసుకుని ప్రజలకు నచ్చచెప్పగలగాలి. అననుకూలంగా పరిణమించే అంశాలు వచ్చినప్పుడు నెపాన్ని కాంగ్రెస్ పై మోపే పద్దతి మంచిది కాదు. మంచి చెడులకు రెంటికీ బాధ్యత వహించే ధీమంతం వుండాలి. రాజనీతిజ్ఞత ప్రదర్శించాలి కాని ప్రతి విషయాన్ని రాజకీయం చేయకూడదు. 'అప్పుడు కాంగ్రెస్ ఇదే పని చేసింది కదా' అని తప్పించుకునే ప్రయత్నం పనికిరాదు.'

బాధ కాదు కాదు భయం వేస్తోంది


ఈరోజు (26-06-2014) మహా టీవీ లో న్యూస్ అండ్ వ్యూస్. యాంఖర్ స్వాతి. 



ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల నడుమ తీవ్రం అవుతున్న వివాదాలు, వాటిపై నాయకుల వ్యాఖ్యలు విన్నప్పుడు , వాటిపై చర్చిస్తున్నప్పుడు బాధ వేసింది. మధ్యలో కాలర్లు ఫోన్ ఇన్ లో మాట్లాడుతూ వ్యక్తం చేసిన అభిప్రాయాలు వింటున్నప్పుడు నిజం చెప్పొద్దూ భయం వేసింది. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రెండింటిలో పూర్తి సంఖ్యాబలం కలిగిన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కొత్తగా పురుడు పోసుకున్న రెండు కొత్త రాష్ట్రాలను మొత్తం దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతామని రెండు ర్రాస్త్రాల ముఖ్యమంత్రులు ప్రకటించినప్పుడు 'పరవాలేదు మంచి రోజులు రాబోతున్నాయి' అన్న ఆనందం ఇంత తొందరగా ఆవిరి అయిపోతుందని అనుకోలేదు. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా కొంపలు మునగవు. కానీ వారి మాటలతో జనం రెచ్చిపోతేనే అసలు సమస్య. ఏదైనా వివాదం వచ్చినప్పుడు పూర్తిగా ఒక వాదననే సమర్ధించడం అంటే సమస్యను మరింత జటిలం చేయడమే. ముళ్లు మరింత బిగిసిపోకముందే నాయకులు కళ్ళు తెరవాలి. కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. దానివల్ల సమస్య పరిష్కారం కాకపోయినా రెండు ప్రాంతాల ప్రజల నడుమ వాతావరణం తేలిక పడుతుంది. విజ్ఞతతో కూడిన సంయమనం నేటి అవసరం.  నచ్చినా నచ్చకపోయినా రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులకు నాది ఇదే విజ్ఞప్తి.

25, జూన్ 2014, బుధవారం

హాస్య నటుడు చెప్పిన చేదు నిజాలు


జార్జి  కార్లిన్ (1937 - 2008) పాత తరానికి చెందిన గొప్ప హాలీవుడ్  హాస్య నటుడు. నవ్వించేవారి వెనుక కాచి వడ బోసిన జీవితం వుంటుంది. ఆ అనుభవాల నుంచే ఆణిముత్యాల లాంటి జీవిత సత్యాలు వెలుగులోకి వస్తాయి. 


అవి ఆయన మాటల్లో:
'ఎత్తయిన భవనాలు నిర్మించుకుంటున్నాం. కానీ వాటిల్లో నివసించే మన మనసులు మాత్రం కుంచించుకు పోతున్నాయి.
'బాగా తింటున్నాము. బాగా తాగుతున్నాము. కానీ ఎప్పుడో ఒకప్పుడయినా మనసారా నవ్వుకోగలుగుతున్నామా? అనుమానమే!
'బతకడం ఎలాగో బాగానే నేర్చుకున్నాం. కాని, జీవించడం యెలా అన్నదే పూర్తిగా మరచిపోయాం.
'చంద్ర గ్రహంపై కాలుమోపి తిరిగి రాగలిగాం, కానీ నాలుగడుగులు వేసి వీధి దాటివెళ్ళి పొరుగువాడిని పలరించి రావడం చేయగలుగుతున్నామా?
'రోదసిని జయించామని జబ్బలు చరుచుకుంటున్నాం. కానీ మన మనసు చెప్పే మంచి మాటను మాత్రం  పెడచెవిన పెడుతున్నాము  
'ఆత్రుత  పడడం తెలుసుకున్నాం కాని ఓపిగ్గా వేచి వుండే తత్వాన్ని పోగొట్టుకున్నాం
'జీవితాన్ని  పరుగుల వరదలా మార్చుకున్నాం. తినడానికి టైం లేదు. నిద్రపోవడానికి సమయం వుండదు. భార్యా పిల్లలతో ముచ్చట్లకు వ్యవధి వుండదు. జీవితంవెంట పరుగులు పెట్టడమే సరిపోతోంది. ఆలుమగలు ఇద్దరికీ  ఉద్యోగాలు. ఒక్క జీవితం  రెండు జీతాలు అని మురిసి పోతున్నాం. ఆదాయాలు పెరగడం ఒక్కటే చూసుకుంటున్నారు.  మనసులు విరిగిపోతున్న సంగతీ,  విడాకుల సంఖ్య పెరుగుతున్న సంగతీ గమనించడం లేదు.
'అందుకే.....

'మనవారు అనుకున్నవారితో నాలుగు మాటలు చెప్పుకోవడానికి సమయం కేటాయించండి. మీ మనసులోని మాటల్ని పంచుకోవడానికీ, వారు చెప్పింది కాస్త వినడానికీ కాస్త  వీలు చేసుకోండి. నిజానికి వీరే మీకు తోడూ నీడా. కాని వారు మీ వెంట వుండేది, వారి వెంట మీరు వుండేది  కూడా తాత్కాలికమే. ఈ నిజాన్ని తెలుసుకుంటే మరింత సమయం వారితో గడపడం యెల్లా అన్న ప్రశ్న తలెత్తదు'
Photo Courtesy Image Owner