2, డిసెంబర్ 2024, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (24) - భండారు శ్రీనివాసరావు

 

 

మా కుటుంబంలో ఇద్దరు ప్రసిద్దులయిన స్త్రీ మూర్తులు వున్నారు. ఇద్దరి పేర్లు ఒకటే అచ్చమాంబ. ఒకరు భండారు అచ్చమాంబ. రెండవవారు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ. మొదటి ఆవిడ రెండో అచ్చమాంబకు స్వయానా మేనత్త.

డాక్టర్ అచ్చమాంబ కొమర్రాజు లక్ష్మణరావుగారనే సుప్రసిద్ధ సాహితీవేత్త కుమార్తె. లక్ష్మణరావుగారు భండారు అచ్చమాంబ గారి సోదరులు. వారిది కృష్ణా జిల్లా నందిగామ వద్ద పెనుగంచిప్రోలు. ఆకాలపు ఆచారాల దృష్ట్యా అచ్చమాంబ గారికి తలితండ్రులు చదువు చెప్పించలేదు. అయితే ఎమ్మే వరకు చదివిన సోదరుడి పక్కనే వుండి సొంతంగా చదువు నేర్చుకుని అనేక భాషల్లో పండితురాలు కాగలిగిన పట్టుదల అచ్చమాంబ గారిది. తెలుగులో మొదటి కధ రాసింది భండారు అచ్చమాంబ అనే ప్రచారం ఒకటి వుంది. ఆవిడ మేనకోడలు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ బెజవాడలో పేరెన్నికగన్న వైద్యురాలు. విజయ టాకీసు ఎదురుగా ఉన్న రామచంద్రరావు రోడ్డు ( ఆయన మా పెద్ద మేనమామ, గొప్ప వకీలు) లో అచ్చమాంబ గారి ఆసుపత్రి వుండేది. తెల్లగా పొడుగ్గా తెల్లటి చీరె కట్టుకుని హుందాగా చేతిలో స్టెతస్కోప్ పట్టుకుని ఆస్పత్రిలో ప్రతి మంచం వద్దకు వెళ్లి రోగుల యోగక్షేమాలు విచారిస్తూ వుండేది. నిజానికి అక్కడ వేరే రోగాలతో బాధపడే వాళ్ళు ఎవరూ వుండేవారు కాదు. అందరూ రేపోమాపో పండంటి బిడ్డను కనడానికి ఆసుపత్రిలో చేరిన గర్భిణులే. పేరుకు నర్సింగ్ హోం అయినా నిజానికి పురుళ్ల ఆసుపత్రి. ఆమె హస్తవాసి మంచిది అనే మంచి పేరు వుండేది. మా బెజవాడ అక్కయ్య కానుపులన్నీ అచ్చమాంబ గారి ఆసుపత్రి లోనే. సాధారణంగా ఆవిడ కాలు బయటపెట్టి ఇళ్లకు వెళ్లి చూసేది కాదు. కానీ మా బావగారు కూడా బెజవాడలో సీనియర్ లాయర్. వారిద్దరి మధ్య గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం వుండేది. అంచేత మా అక్కయ్య గారు కడుపుతో వున్నప్పుడు ఎప్పుడైనా అవసరం పడి కబురు చేస్తే ఇంటికి వచ్చేవారు. ఆవిడ ఇంట్లోకి అడుగుపెట్టగానే, పాత సినిమాల్లో చూపించినట్టు, ఆమె చేతినుంచి తోలు పటకా  సంచిని మర్యాదగా అందుకుని ఆమెను వెంటబెట్టుకుని రావడం మా పిల్లల డ్యూటీ. రాగానే డాక్టరుగారు ముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కునేవారు. సంచీలోనుంచి ధర్మామీటరు తీసి మా అక్కయ్య నోట్లో పెట్టి, కళ్ళజోడు కాసింత పైకి ఎత్తి పట్టి రీడింగ్ చూసేవారు. స్టెతస్కోప్ తో ఏవో పరీక్షలు చేసే వారు. రెండు మూడు ప్రశ్నలు అడిగి చేతికి బీపీ మిషన్ తగిలించి రబ్బరు తిత్తిని నొక్కుతూ మిషన్ లో పాదరసం పైకి కిందికి తిరగడం గమనించి సాలోచనగా కాసేపు పరికించి చూసి సంచీ నుంచి ఓ చిన్న పుస్తకం తీసి అవసరమైన మందులు రాసి ఇచ్చేవారు. ఎంతో అవసరం అనుకుంటే తప్ప ఇంజక్షన్ చేసేవారు కాదు. ఒకవేళ చేయాల్సివస్తే పిల్లలం అందరం భయంతో ఆ గదిలోనుంచి పారిపోయేవాళ్ళం.

ఇవన్నీ అయిన తర్వాత మేము పిలుచుకు వచ్చిన రిక్షా ఎక్కి ఆసుపత్రికి వెళ్ళిపోయే వారు. పోయే ముందు మా బావగారితో ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడేవారు. ఆమె ఆయనా తప్ప, ఇంట్లో మిగిలినవాళ్ళు అందరూ గప్ చుప్. 

మా బావగారి ఇంట్లో, మా బంధువుల ఇళ్ళల్లో పురుళ్ళూ పుణ్యాలు అన్నీ ఆవిడ ఆసుపత్రిలోనే. ఆవిడ పుణ్యమే!

ఇంట్లో అంతమంది పిల్లలు వున్నా కూడా పెద్దగా ఆసుపత్రులతో పని పడేది కాదు. చిన్నా చితకా వాటికి కస్తూరి మాత్రలు, అల్లం, జీలకర్ర, వాము రసాలతో సరిపుచ్చేవారు. కాకపొతే, మా పిల్లలు అందరిలో   శాయిబాబుది కొంచెం బలహీనమైన శరీరం. సన్నగా పీలగా వుండేవాడు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం అని ఒక ప్రసిద్ధ ఆయుర్వేద ఔషదాల సంస్థ వారిని సంప్రదించి అక్కడి నుంచి మందులు తెప్పించి వాడేవారు. అలాగే బెజవాడలో రామ్మోహన ఆయుర్వేద వైద్య శాలలో తయారైన మందులు వాడేవారు. అయితే ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఈ మందులతో పని లేకుండా శాయిబాబు ఆరోగ్యం కుదుటపడింది. అతడి తెలివితేటలు మాత్రం  అమోఘం. సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి ప్రతిఫలించినట్టు ఆయన పక్కన తిరిగి నేనూ కొంత చదువుల్లో బాగుపడ్డాను. అయినా అది కొంత మేరకే. పెద్ద పెద్ద  మార్కులు రాకపోయినా, అతడితో కలిసి చదువుకున్నన్నాళ్ళు ఏ పరీక్షలో తప్పే భాగ్యం నాకు  కలగలేదు.  

మా బావగారు మా ఇద్దర్నీ ముందు ఇంటికి నడక దూరంలోవున్న అరెండేల్ (అరండల్) సత్రంలో నడుస్తున్న మునిసిపల్ ప్రాధమిక పాఠశాలలో చేర్పించారు. ఆ సత్రం బ్రిటిష్ వాళ్ళ హయాములో నిర్మించి వుంటారు. బాగా పాతది అయినా చాలా అందంగా చక్కగా కళాత్మకంగా వుండేది. దానికి వాడిన కలప, చెక్కిన నగిషీలు అలాంటివి. సత్రం అంటే ఏమిటో తెలియని వయసులో ఆ సత్రంలోని ఒక భాగంలో నడిచిన మునిసిపల్ స్కూల్లో కొన్ని తరగతులు చదివాము. ఆ రోజుల్లోనే అప్పటి భారత ప్రభుత్వం, అంతవరకూ చెలామణీలో ఉన్న పాత నాణేలు, కాణి, అర్ధణా, బేడ, అర్ధరూపాయి, రూపాయి స్థానంలో కొత్త డెసిమల్ పద్దతి ప్రవేశ పెట్టింది. పైసా, అయిదు పైసలు, పది పైసలు, పాతిక పైసలు (పావలా), యాభయ్ పైసలు (అర్ధరూపాయి), నూరు పైసలు (రూపాయి) ఇలా అన్నమాట. పైసా నాణెం తళతళా మెరిసే రాగి నాణెం. చూడ ముచ్చటగా వుండేది. అది దగ్గర వుంటే చాలు  మనం ఓ కింగ్ అనే ఫీలింగ్. అది చేతిలో వుంటే  వొలకబోసే ఆ దర్జానే వేరు. కొత్తగా వచ్చింది కాబట్టి నయా పైసా అనేవాళ్ళు.  పైసాకు కూడా విలువ వుండే రోజులు. పాతిక పైసల వరకూ అన్నీ నికెల్ నాణేలు. అర్ధరూపాయి, రూపాయి సిల్వర్. అంటే వెండి కాదు.  

తరువాత మా బడి సీవీఆర్ హైస్కూలుకు మారింది. అది సిటీ సివిల్ కోర్టు భవనాలకు ఎదురుగా వుండేది. బెజవాడ గవర్నర్ పేట లోని సీవీఆర్ జీఎంహెచ్ (చుండూరు వెంకటరెడ్డి గవర్నర్ పేట మునిపల్  హైస్కూలు) భవనం,  విశాలమైన ప్రాంగణంలో వుండేది. నడిమధ్యలో రాజసం వొలకబోసే రాతికట్టడం. దానికి ఇరువైపులా తరగతి గదులు. ప్రధాన భవనంలో మెట్లకింద,  తెల్లని పంచె, లాల్చీ కండువా  ధరించిన సంస్కృతం మాస్టారు గారి  నోటివెంట  'రామః రామౌ, హే రామ హే రామౌ........'  అంటూ మధురంగా, మంద్రంగా వినవచ్చేవి శబ్ద మంజరి పాఠాలు.

 అలా ఆయన  చదువుతుంటే,  మేము ఒక పదిమందిమి కాబోలు సంస్కృతం రెండో భాషగా తీసుకున్నవాళ్ళం,  శ్రద్ధగా వింటూ మాస్టారు చెప్పింది వల్లె వేస్తూ వుండేవాళ్ళం. ఇంగ్లీష్, తెలుగు, లెక్కలు, ఇతర సబ్జక్టులు బోధించడానికి తరగతి గదులు విడిగా ఉండేవి కాని సంస్కృతం క్లాసు మాత్రం, శబ్ధమంజరి, అమరకోశం చెప్పుకుంటూ   మెట్ల కిందే నడిచేది. ఆ భాషకు ఇచ్చిన ప్రాముఖ్యం అది.  అది ఒకప్పటి జ్ఞాపకం.

వీవీఎస్ శర్మగారు (ఫేస్ బుక్ పెద్దాయన ) బతికి వున్నప్పుడు సంస్కృతం భాష వైశిష్ట్యాన్ని గురించి ఇలా రాసారు.

“ అందరికీ ఎస్వీ రంగారావు, సావిత్రి నటించిన నలుపు తెలుపు మాయాబజార్ సినిమా గుర్తుండే వుంటుంది. ఘటోత్కచుడి బృందానికి చిన్నమయ్య పాఠాలు చెబుతుంటాడు. లంబు, జంబు ఇత్యాది శిష్యులకు చిన్నమయ్య మాటల్లో వినబడే శబ్దాలు గమనించండి. ‘ ఔ, జస్, అం, ఔట్, బిస్, భ్యాం, భ్యస్. సంస్కృత శబ్దాలు రామః, రామౌ, రామా, రామేణ, రామాభ్యాం, రామై వలె ధ్వనిస్తాయి అని ఆయన రాసారు.  

పొతే అప్పుడెప్పుడో నెట్లో కానవచ్చిన ఒక ఆసక్తికర సమాచారాన్ని మిత్రులు శ్రీ పీ.వీ.వీ.జీ. స్వామిగారు అమెరికా నుంచి  పంపారు. ఆ ఇంగ్లీష్ వార్తకు నా తెలుగు అనువాదం నా సొంత బాణీలో :    

ఒకానొకకాలంలో సూర్యుడు అస్తమించని సువిశాల సామ్రాజ్యానికి అది రాజధాని. అన్ని భాషలకు మాతృభాషగా పేరొందిన సంస్కృతం పరిఢవిల్లిన  అఖండ భారతాన్ని వందల సంవత్సరాలపాటు బానిస దేశంగా పాలించిన బ్రిటిష్ ప్రభువుల రాజధాని నగరం.  అలాటి ఇంగ్లీష్ గడ్డ అయిన లండన్ నగరంలో సంస్కృతాన్ని బోధించే పాఠశాల. వినడానికే విచిత్రం అనిపించినా ఇది నిజం. లండన్ లోని సెంట్ జేమ్స్ ఇండిపెండెంట్ స్కూల్లో సంస్కృత భాషా విభాగం అధిపతి వార్విక్ జేస్సప్ మాటల్లో మిగిలింది తెలుసుకుందాం.

"ప్రపంచం మొత్తంలో సంస్కృతంతో పోల్చచదగిన ఉత్కృష్టమైన భాష మరొకటి లేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. జర్మన్ ప్రజలు జర్మన్ మాట్లాడతారు. మాట్లాడే ప్రజల పేరుతోనే ఆ భాషలకు నామకరణం చేసారు. సంస్కృతం ఒక్కటే మినహాయింపు. ఆ ఒక్క భాష చక్కగా నేర్చుకుంటే చాలు, సైన్సు, గణితం వంటి ఇతర అంశాలపై పట్టు చిక్కించుకోవడం సులభం అవుతుంది'   

ఇక ఆ స్కూలు హెడ్ మాష్టర్ పాల్ మాస్ గారు సంస్కృతం గురించి మరింత గొప్ప కితాబు ఇచ్చారు.

'దేవనాగరి లిపిలో రాయడం నేర్చుకుంటే విద్యార్ధులకు తమ చేతివేళ్ళపై గట్టి పట్టుచిక్కుతుంది. సంస్కృతంలో మాట్లాడడం  వస్తే ఇక ఆ నాలుకకు అడ్డే వుండదు. స్పష్టమైన ఉచ్చారణ అలవడుతుంది'  

పాల్ మహాశయులు అంతటితో ఆగలేది.ఇంకా ఇలా వివరించారు.

'యూరోపియన్ భాషలు మాట్లాడేవాళ్ళు నాలుకలో వుండే అన్నిభాగాలను  ఉపయోగించరు. నాలుక కొసతో మాట్లాడేస్తుంటారు. రాసేటప్పుడు కూడా వేళ్ళల్లోని అన్నికదలికలను వాడరు. అదే సంస్కృతం మాట్లాడడం అలవాటు చేసుకుంటే మెదడు చురుగ్గా పనిచేయడానికి అది దోహదం చేస్తుంది'

తోక టపా: ఈ ఇంగ్లీష్ స్కూల్లో సంస్కృతం సెకండ్ లాంగ్ వేజ్ గా తీసుకునేవాళ్ళు విధిగా ఆరేళ్ళపాటు ఆ భాషను అధ్యయనం చేయాల్సివుంటుంది. (మెట్ల కింద కాదు. చక్కటి తరగతి గదులు వున్నాయి) సంస్కృత విద్యార్ధులకు స్కూల్లో శాకాహార భోజనమే లభిస్తుంది.”

మంచి విషయాలు విన్నట్టు వుంది కదూ!    

కింది ఫోటోలు:


 నా నేస్తం, నా గురువు తుర్లపాటి సాంబశివరావు (శాయిబాబు)



భండారు అచ్చమాంబ


డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ








(ఇంకావుంది)

1, డిసెంబర్ 2024, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (23) - భండారు శ్రీనివాసరావు

 

మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి వారు. మా ఊరు కంభంపాడుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో తిరుమలగిరి గుట్ట అనే స్వామివారి పుణ్య క్షేత్రం వుంది. మా కుటుంబంలో పుట్టిన పిల్లల పుట్టు వెంట్రుకలు, అన్నప్రాసన మొదలైనవి   ఆ గుట్ట మీద స్వామివారి సన్నిధిలో జరపడం ఆనవాయితీ. మా ఊరు నుంచి నాలుగయిదు బండ్లలో బయలుదేరేవాళ్ళం. అందులో పైన ఎండ తగలకుండా గుడిసె వున్న రెండు బండ్లు పెద్దవాళ్లకు, ఆడవాళ్ళకు, పసిపిల్లలకు. రెండు బండ్లలో ఇంటి పురోహితులు, వంట బ్రాహ్మణులు, పెద్దపిల్లలు. ఇంకో బండిలో గుండిగెలు మొదలైన వంట పాత్రలు, బియ్యం తదితర వంట సామాగ్రి, కట్టెలు, పనివాళ్లు. వాళ్ళు వంతులు వేసుకుని బండ్ల వెంట కాపలాగా రాత్రంతా  నడిచేవాళ్ళు. దొంగల భయం వల్ల కాదు. బండి బాట ఎగుడుదిగుడుగా వున్న చోట బండి పక్కకు ఒరిగి పోకుండా వాళ్ళు దన్నుగా వుండేవాళ్ళు.   రాత్రి అన్నాలు తిని అర్ధరాత్రి తర్వాత  ఎప్పుడో సామాన్లు సర్దుకుని బయలుదేరితే, తెలతెలవారుతుండగా తిరుమలగిరి చేరుకునేవాళ్ళం.

గుట్టమీద దేవుడు. గుట్టకింద అన్నీ ఊడలు దిగిన మర్రి చెట్లు. భక్తులు వంట చేసుకోవడానికి మూడు రాళ్ళతో ఏర్పాటు చేసుకున్న  పొయ్యిలు అనేకం  ఆ చెట్ల కింద కానవస్తాయి. దాదాపు అడవి మాదిరిగా అన్నీ చెట్లు, ప్రధానంగా ఈత, తాటి చెట్లు. ఎక్కడ చూసినా గుబురుగా మిన్నాగులు తిరిగే మొగలి  పొదలు. కిందనే  స్నానాలు చేసి మెట్ల మీదుగా గుడి చేరుకోవాలి. దైవ దర్శనం చేసుకునే దాకా ఎవరూ ఏమీ తినకూడదు. పైగా పైకి వెళ్ళిన వాళ్ళు చీకటి పడేలోగా కిందికి వెళ్లి తీరాలని హెచ్చరికలు. పూజారులు కూడా చీకటి పడితే కొండపైన వుండేవాళ్ళు కాదు. రాత్రి వేళల్లో  ఒక మహా సర్పం ఆ గుట్టను చుట్టుకుని కాపలా కాస్తుందని చెప్పుకునే వారు.

మా కుటుంబం, పురోహితులు గుట్ట పైకి వెళ్లి కార్యక్రమం పూర్తి చేసుకుని వచ్చేలోగా కింద వంటలు తయారయ్యేవి. ప్రతి మెట్టు మీద అందుకు విరాళం ఇచ్చిన దాతల పేర్లు వుంటాయి. మెట్ల దారిలో కొంత దూరం పైకి వెడుతున్నప్పుడు కుడిపక్క రాతి కొండ మధ్యలో  కోనేరు.  అందులోని నీటిని అటూ ఇటూ చేతితో తొలిపి కాళ్ళు కడుక్కుని నెత్తిన నీళ్ళు చల్లుకునే వాళ్ళం. ఎందుకంటే ఆ కోనేటి నీళ్ళు  పచ్చగా పాచిపట్టి వుండేవి. దీనికో ఐతిహ్యం చెప్పేవాళ్ళు. ఆ గుట్టమీద నుంచి చూస్తే సుదూరంలో చాలా ఎత్తైన కొంగర మల్లయ్య గుట్ట కనిపిస్తుంది. దాని మీద చిన్న సైజులో కనబడే కొంగర మల్లయ్య (మహాశివుడు) గుడి. ఒకసారి తిరుమలగిరి వెంకటేశ్వర స్వామికి, కొంగర మల్లయ్య శివుడికి ఏదో పేచీ వచ్చి ఒకరినొకరు శపించుకున్నారట. నువ్వు ఉన్న  గుట్ట భక్తులకు అందనంత ఎత్తుకు  పెరిగిపోయి నీకు నిత్య ధూప నైవేద్యాలు లేకుండా పోతాయి అని తిరుమలగిరి స్వామి శపిస్తే, దానికి ప్రతిగా నీ కోనేరు సతతం పాచిపట్టి, భక్తుల పవిత్ర స్నానాలకు, నీ అభిషేకాలకు పనికి రాకుండా పోతుందని మల్లయ్య తిరుగు శాపం ఇచ్చాడు. దాంతో ఇక్కడి కోనేరు పాచిపట్టిన నీటితో పచ్చగా వుంటుంది.  అలాగే,  హైదరాబాదు, విజయవాడ జాతీయ రహదారిలో చిల్లకల్లు దాటిన తర్వాత కుడి వైపు కొంగర మల్లయ్య గుట్ట,  దానిపై  గుడి చాలా ఎత్తులో వుంటుంది. అంత ఎత్తులో వుండడం వల్ల ఆ గుడిలో నిత్య పూజలు, పునస్కారాలు వుండవు. చిన్నతనంలో బెజవాడ బస్సులో  పోతూ  ఈ కొండ కనిపించినప్పుడల్లా నాకు మా పెద్దలు చెప్పిన ఈ కధ గుర్తుకు వచ్చేది. ఇందులో నిజానిజాలు ఎంత అన్నది చెప్పేవాళ్ళు నాకు తారసపడలేదు.

కొన్ని దశాబ్దాల తరువాత ఈ కొండపైకి నిటారుగా చిన్న మెట్ల వరుస నిర్మించారు. ఆ కొండ పైన టవర్ నిర్మించడానికి కేంద్ర టెలికాం శాఖ ఈ మెట్ల దారి నిర్మించింది. పైన గుడితో పాటు, టెలికాం టవర్ ని కూడా కిందనుంచి చూడవచ్చు. అయితే ధూపదీపవైవేద్యాలు జరుగుతున్నాయా లేదా అనే విషయంలో నాకు నిర్దిష్టమైన సమాచారం లేదు. తిరుమలగిరిలో పాచి కోనేరు మాత్రం ఇప్పటికీ అలాగే వుంది.

వెంకటేశ్వరస్వామి మా ఇలవేలుపు అని చెప్పాకదా! మా కుటుంబంలో పిల్లల అన్నప్రాసనలు, పుట్టు వెంట్రుకలు అన్నీ తిరుమలగిరి స్వామి సన్నిధిలోనే జరిపేవారు. అదొక సాంప్రదాయంగా మారింది. 

మా రెండో అన్నగారు రామచంద్రరావు గారి పెద్ద పిల్లవాడు జవహర్ లాల్, మూడో కుమారుడు లాల్ బహదూర్ ల వివాహాలు తిరుమలగిరిలోనే జరిగాయి. పెద్ద కోడలు రేణు మా రెండో అక్కయ్య కుమార్తె. అలాగే లాల్ బహదూర్ పెళ్లాడింది మా మేనల్లుడు కొమరగిరి రామచంద్రం ఏకైక కుమార్తె దీప. ఒకే కుటుంబానికి చెందిన రెండు కుటుంబాలు కలిసి చేసిన పెళ్ళిళ్ళు కాబట్టి ఆడపిల్లవాళ్ళు, మగపిల్లవాళ్లు అనే తేడా లేకుండా హాయిగా అందరం ఒక తీర్ధయాత్రకు వెళ్లి వచ్చినట్టు, మరో విధంగా చెప్పాలి అంటే ఓ పిక్నిక్ కు వెళ్లినట్టు, అతి నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్ళిళ్ళలోని మాధుర్యాన్ని ఆడుతూ పాడుతూ ఆస్వాదించాము. బయటవారు అంటూ ఎవరూ లేరు, బెజవాడ నుంచి వచ్చిన మండ్రాజుపల్లి అయ్యగారి వంటమనుషులు తప్ప. వధూవరుల దగ్గరి స్నేహితులు కూడా ఎవరూ లేరు. కాకపోతే, ఖమ్మంలో వధువు బాల్య స్నేహితురాలు తిరుమల అనే అమ్మాయి, కధాచిత్ గా పెళ్ళికి ముందు రోజు సాయంత్రం మా బావగారి ఇంటికి రేణుని చూడడానికి వెడితే ఇంటికి తాళం వేసి వుంది.  అందరూ రేణు పెళ్ళికి తిరుమలగిరి వెళ్ళారు అని ఎవరో చెబితే, నేను లేకుండా రేణు పెళ్ళా అంటూ  మొగుడ్ని అప్పటికప్పుడు పట్టుబట్టి ఒప్పించి పిలవని పేరంటం అని భేషజాలకు పోకుండా నైట్ బస్సులో అర్ధరాత్రి ప్రయాణం చేసి చిల్లకల్లులో దిగి కాలినడకన ముహూర్తం టైముకి  తిరుమలగిరి చేరుకుంది. వాళ్ళని చూసి  పెళ్లి కూతురే కాదు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయి స్నేహానికి ఇచ్చిన విలువను అంతా మెచ్చుకున్నారు.

ఇక ఒక ఇంటి వేడుకలా జరిగిన పెళ్లి ఏర్పాట్లను వధువు సోదరులు, స్వయంగా కళా హృదయం కలిగిన మా మేనల్లుళ్లు రాంబాబు, లచ్చుబాబు (ఫేస్ బు క్ లో పేరు   కొలనరావు) భుజాలకు ఎత్తుకున్నారు. ప్రతి విషయంలో నవ్యత్వం కనిపించాలని పడ్డ తాపత్రయం అంతా ఇంతా కాదు. తండ్రి లేని లోటు ఎక్కడా కనపడకూడదని, మేనరికం పెళ్ళే కదా అని, అందులోను  పిల్లవాడి తండ్రి పేచీలు పెట్టని మన మేనమామే కదా అని  తేలికగా తీసుకోకుండా వున్నంతలో ఏలోటు లేకుండా పెళ్లి జరిపించారు. మా బావగారు లేనందువల్ల మా పెద్ద మేనల్లుడు, నా బాల్య స్నేహితుడు రాజన్న (కొలిపాక రాజేంద్రప్రసాద్) గీత  దంపతులు, 1995 ఫిబ్రవరి అయిదో తేదీన జరిగిన ఆ పెళ్ళిలో  కన్నెధార పోశారు. హైదరాబాదులో వున్న బంధువులం అందరం ఒక బస్సులో బయలుదేరి పెళ్ళికి వెళ్ళాం. ఎదురుబదురుగా రెండు సత్రాలు. ఒక దానిలో ఆడపెళ్లి వాళ్ళు, రెండో దానిలో మగపెళ్లి వాళ్ళు. అవి పేరుకు మాత్రమే.  కానీ ఒకే కుటుంబం కావడం వల్ల ఎవరు ఎక్కడ అనే తేడా కానరాలేదు. పెళ్లి కొడుకు పేరు జవహర్ కనుక నెహ్రూకు ఇష్టం అయిన ఎర్ర గులాబీలతోనే, స్వామివారి గుడికి వెళ్ళే దారిలో ముఖ ద్వారానికి ఎదురుగా వున్న కళ్యాణ మంటపాన్ని అలంకరించారు. వధువు పూలజడపై వధూవరుల పేర్లు వచ్చేట్టు పూలను అల్లారు. పెళ్లి పీటల మీదకు వధువును మేనమామలు తీసుకువచ్చే బుట్టను విచ్చుకున్న తామరపువ్వులాగా తయారు చేశారు. వధువు అరచేతుల్లో వుండే కొబ్బరి బొండాంను ముత్యాలతో అలంకరించి దానిపై వధూవరుల పేర్లు రాసారు. అలాగే వారి నడుమ పట్టుకునే అడ్డు తెరపై  లచ్చుబాబు,  బాపూ లిపితో ‘వంగి వంగి చూడమాకు మేనబావా!’ అని రాశాడు. ఈవెంట్ మేనేజ్ మెంట్లు వచ్చిన ఈ రోజుల్లో ఇలాంటివి కొత్త కాకపోవచ్చు కానీ పాతిక ముప్పయ్ ఏళ్ళ క్రితం చూసేవారికి కొత్తగానే వుండేవి.

పెళ్లి ముహూర్తానికి ముందు వధువు తాలూకు వాళ్ళు, వారి వెనుకనే మేము మెట్లదారిలో బయలు దేరాము కానీ మధ్యలో అందరం కలగలిసిపోయాం. పెళ్లిని ఎంత సింపుల్ గా చేయవచ్చో, నాలుగు కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా ఎలా చేయవచ్చో ఈ పెళ్ళికి వెళ్ళిన వాళ్లకు తెలిసివచ్చేలా ఈ పెళ్లి జరిగింది.

మళ్ళీ మూడేళ్ల తరువాత 1998లో రెండో అన్నయ్య రామచంద్రరావు గారి మూడో కుమారుడు లాల్ బహదూర్ వివాహం కూడా ఇంతే సింపుల్ గా తిరుమలగిరిలోనే జరిగింది. (మా అన్నయ్యకు నలుగురు కుమారులు. జవహర్ లాల్, సుభాష్ చంద్ర బోస్, లాల్ బహదూర్, రాజేంద్ర ప్రసాద్) వధువు మా  ఐదో అక్కయ్య అన్నపూర్ణక్కయ్య మనుమరాలు, మా మేనల్లుడు కొమరగిరి రామచంద్ర మూర్తి , కరుణ దంపతుల కుమార్తె దీప. ఈ పెళ్ళిలో కూడా ఆడ, మగ పెళ్లివాళ్ళు  అనే తేడా లేదు. అందరూ అమ్మమ్మ సంతానమే. బయటివాళ్ళు, స్నేహితులు లేరు. అరుపులు, విరుపులు లేవు,  అలకలు లేవు. ఆడంబరాలు లేవు. ఇచ్చిపుచ్చుకోవడాలు అసలు ఇంటావంటా లేవు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే సింపుల్ దాన్ ది వర్డ్ సింపుల్.

మా మేనల్లుడు శ్రీరామచంద్రమూర్తి విశాఖ గ్రామీణ బ్యాంకులో సీనియర్ అధికారిగా పనిచేసి వీ ఆర్ ఎస్. తీసుకున్నాడు. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు ఆ బ్యాంక్ చైర్మన్ గా పనిచేశారు. వాళ్ళ ఇళ్లు శ్రీకాకుళంలో పక్కపక్కనే ఉండేవి. రామచంద్రం కుమార్తె దీప అప్పటికి చాలా చిన్న పిల్ల. మూడు చక్రాల సైకిల్ వేసుకుని మా అన్నయ్య గారి ఇంటికి వెడుతుండేది. ఆ ఆమ్మాయిని చూసి మా వదిన గారు, రావే అమ్మా! ఎప్పటికైనా మా ఇంటికి రావాల్సిన దానివే కదా! అనేదిట. ఆ మాటే నిజమైంది. తరువాత మా అన్నగారు అమెరికాలో స్టేట్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్  గా పనిచేసి, ఇండియా తిరిగి వచ్చిన తరువాత మద్రాసులో ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న రోజుల్లో దీపను తన ఇంటి కోడలుగా చేసుకుంటాను అని కబురు చేశారు. సంబంధం  నిశ్చయం చేసుకునే ముందు కూడా  అన్నగారు, వదిన గారు పిల్లని చూస్తామని మాటమాత్రంగా కూడా  అనకపోవడం తమకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని  దీప తల్లి కరుణ గుర్తు చేసుకుంది. మా అమ్మ నాన్నల వివాహ సమయంలో కూడా అప్పటి పెద్దవాళ్లు  కుటుంబ సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చిన సంగతి నాకు గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు చూడడం తప్పిస్తే, మళ్ళీ పెళ్లిలోనే వాళ్ళు  దీపను చూడడం. పెళ్లికూతురిగా పెళ్లి పీటల మీద తనను మొదటిసారి చూసినప్పుడు అత్తయ్య, తన జడ చూసి ఎంత బాగుందో అనడం తనకు గుర్తుండిపోయిందని దీప చెబుతూ వుంటుంది. అప్పుడు తను వున్న పరిస్థితుల్లో అమ్మాయికి పది రోజుల్లో పెళ్లి చేయడం తనకు చేతకాని వ్యవహారం అయినా, త్యాగయ్యకు (త్యాగరాజ స్వామి) కూతురు వివాహం చేయడంలో దైవసహాయం లభించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు అనే త్యాగరాయ కృతిని గురించి  రామచంద్రం నాతో చెబుతుండే వాడు.

ఈ పెళ్ళిళ్ళు జరిగి పాతిక ముప్పయ్యేళ్లు దాటింది. రేణు, జవహర్ దంపతులు, దీప, లాల్ దంపతులు ఇరు కుటుంబాల నడుమ మాట రాకుండా,  హాయిగా పిల్లాపాపలతో కాపురాలు చేస్తున్నారు. పిల్లలు విదేశాల్లో సెటిల్ అవుతున్నారు. వీటన్నిటికీ  దైవసన్నిధిలో పెళ్ళిళ్ళు జరగడం ఒక కారణం కావచ్చు, కానీ ఆ మనుషుల మంచితనమే వారికి శ్రీరామరక్షలా కలిసివచ్చిందనేది నా అభిప్రాయం.

 

కింది ఫోటోలు:


తిరుమలగిరి గుట్ట వద్ద రేణు, జవహర్  పెళ్ళి


తిరుమలగిరి గుట్ట వద్ద దీపలాల్ పెళ్లి 


ఒకప్పుడు తిరుమలగిరి మెట్లు ఎక్కుతూ మా ఆవిడ నిర్మల, మా వదిన గారు విమల





(ఇంకావుంది)

30, నవంబర్ 2024, శనివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (22) - భండారు శ్రీనివాసరావు

 

 

 

“కావాల్సిన కూరగాయలన్నీ  ఇంటి పెరట్లోనే పండేవి. కొష్టం నిండా ఆవులూ, బర్రెలూ వుండేవి. ఇంట్లోకి అవసరమయిన పాలు,పెరుగు,నెయ్యీ వాటి పాడితోనే సరిపోయేది. కొనుక్కోవాల్సిన పరిస్తితి వుండేది కాదు. అలాగే బియ్యం,పప్పులూ, ఇతర దినుసులు. వేరుసెనగ విత్తులను గానుగ ఆడించి నూనె తీసేవారు.                

 “ఆడవాళ్ళు ధరించే చీరెల నుంచి, మగవాళ్ళు కట్టుకునే దోవతులవరకూ వూళ్ళోని  నేతపనివారే నేసిపెట్టేవారు. ఏదయినా శుభాకార్యాలప్పుడే పట్నం వెళ్లి ఆలుగడ్డలు, టొమాటోలు వంటివి కొనుక్కుని వచ్చేవాళ్ళు. కాయలూ, పండ్లూ కూడా కొనుక్కోవాల్సిన అవసరం వుండేది కాదు. తోటల్లోనే కాసేవి. రుతువులనుబట్టి దొరికేవి. అరటి, జామ, మామిడి, సీమచింత, సపోటా, రేగిపళ్ళు  ఏవీ కొనాల్సిన పనివుండేది కాదు.  దెనుసు గడ్డలు (Sweet Potato) వేరే ఊళ్ళ నుంచి బండ్ల మీద తెచ్చి వీధుల్లో తిప్పుతూ అమ్మేవాళ్లు. ధాన్యం కొలిచి కొనుక్కునేవాళ్ళు. డబ్బుల అవసరం వుండేది కాదు. మా ఊర్లో సోడా దుకాణం వుండేది. అయితే అక్కడ తయారు చేయడం మాత్రమే. సోడా కాయల్లో నీరు నింపి ఓ మిషన్ లో వుంచి గిర్రున పైకి కిందికి తిప్పేవారు. దాంతో సోడాకాయల్లోకి గ్యాస్ వెళ్ళేది. వాటిని తోసుకుంటూ పోయే ఒక చిన్న బండిలో పెట్టి వూళ్ళో ఖామందుల భోజనాలు అయ్యే సరికి తీసుకువచ్చి అమ్మేవారు. అన్నం తిన్న తర్వాత సోడా తాగితే జీర్ణం అవుతుందని ఓ నమ్మకం. సోడాకాయ ఎదురు రొమ్ము మీద ఆనించుకుని ఒక రబ్బరు బిరడాతో గట్టిగా అదిమితే పెద్ద చప్పుడుతో లోపల వున్న గోళీ అడ్డు తొలగిపోయేది. నా చిన్ననాటి స్నేహితుడు వెంకటేశ్వర్లు ఆ సోడాలు అమ్మేవాడు. చదువుకోలేదు కానీ తెలివితేటలు ఎక్కువ. సోడాలతో పాటు నాటు కోడి గుడ్ల వ్యాపారం కూడా చేసేవాడు. సోడా కొట్టేటప్పుడు వివిధరకాలుగా శబ్దాలు వచ్చేలా చేసేవాడు. చిత్రంగా వుండేది ఆ ప్రక్రియ. ఒక్కోసారి కీచుమని చప్పుడు. మరోసారి ఏదో బాంబు పేలుతున్న ధ్వని.

సోడా అంటే బెజవాడ వాసులకు గుర్తొచ్చే ఒక పేరు పుష్పాల రంగయ్య. జైహింద్ టాకీసు వెనుక రోడ్డులో ఆయన పేరు మీదనే ఒక కూల్ డ్రింక్ షాపు వుండేది. మామూలు సోడాలే కాకుండా రకరకాల రంగుల సోడాలు, నిమ్మకాయ సోడాలు, ఐస్ సోడాలు  దొరికేవి. ఊరి పెద్దలు చాలామంది ఆ షాపు ముందు గుమికూడి నిలబడి, రంగయ్య గారూ మాకు ఆ సోడా కొట్టండి, ఈ సోడా కొట్టండి అని అడుగుతుండేవారు. పిల్లలకేమో రంగు సోడా తాగాలని మనసు. మా ఊళ్ళో మాదిరి కాదు కదా డబ్బులు ఎప్పటికప్పుడు  ఇవ్వకుండా నెలకోసారి ఇవ్వడానికి. ఆ దారంట స్కూలుకు వస్తూ పోతూ, ఎప్పుడైనా పెద్దవాడిని కాకపోతానా, దర్జాగా నిలబడి, రంగయ్య దుకాణంలో  రంగు సోడా తాగకపోతానా అనే చిన్నతనపు మనసు. ఆ రోజుల్లో నాకు మరో గట్టి కోరిక వుండేది. ఎప్పటికైనా సరే, బీసెంటు రోడ్డు మొగదలలో వున్న రవీంద్ర కూల్ డ్రింక్స్ అద్దాల షాపులో దర్జాగా కూర్చుని, గాజు కుప్పెలో ఇచ్చే తెల్లటి ఐస్ క్రీం ని వేరే వారితో పంచుకోకుండా నేను ఒక్కడ్నే, చుట్టూ వున్న అద్దాలలో నన్ను నేనే చూసుకుంటూ తినాలని. మా అక్కయ్య ఇంట్లో చదువుకుంటున్న రోజుల్లో, మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు,  బెజవాడ ఎప్పుడైనా వచ్చి, తిరిగి రైలు స్టేషన్ కు వెడుతున్నప్పుడు, నన్నూ, మా బావగారి అబ్బాయి సాయిబాబుని వెంటబెట్టుకుని వెళ్లి, మధ్యలో రవీంద్ర కూల్ డ్రింక్ షాపులో ఐస్ క్రీం తినిపించేవాడు. దాంతో పెద్దవాడిని కాకముందే నా చిన్ననాటి కోరిక తీరిపోయింది.

అప్పటికి నిద్రాణమైన మా పల్లెటూరిలో పండగలు, పబ్బాలతో చక్కటి కళ వచ్చేది.        

 చెప్పుకుంటే రకరకాల పండుగలు. కానీ ప్రతి పండగా పిల్లలకు పెద్ద  పండగే. అది ఆడవాళ్ళ వ్రతమయినా, మగవాళ్ళ వనభోజనాలయినా.

 వినాయక చవితి, మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీవ్రతం, కేదారేశ్వర వ్రతం, అట్లతద్దె, ఉండ్రాళ్ళ తద్దె, దసరాబతకమ్మ, దీపావళి, సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి  ఇలా పండగలే పండగలు. నోములే నోములు. నవకాయ పిండి వంటలతో పండగ భోజనాలన్నీ  అదిరిపోయేవి. ఆ పండగలన్నీ ఇప్పుడు లేవని కాదు. ఆనాడు  పిల్లల్లో పెద్దల్లో కానవచ్చే సంతోషం  సంబరాలు ఇప్పుడు మచ్చుకు కూడా కానరావడం లేదు. సంక్రాంతి, దసరా, దీపావళి పండగలు అంటే మరీ సంబర పడిపోయేవాళ్ళం. ఎందుకంటే ఈ పండగలకే పిల్లలకు కొత్త బట్టలు కుట్టించేవాళ్ళు. పెనుగంచిప్రోలు లోని బట్టల దుకాణం నుంచి అరువుమీద ఒకే రకం బట్ట కొని, ఊళ్ళోని దర్జీ పనివాడితో  అదే రంగు బట్టతో పిల్లలు అందరికీ ఒకే మోస్తరుగా చొక్కాలు, లుడిగీలు (నిక్కర్లు). మరీ చిన్నవాళ్ళం అయిన నాలాంటి వారికి అన్నయ్యలు వాడేసిన బట్టలు, పుస్తకాలు. పండగల్లో దీపావళి మరీ స్పెషల్. పిల్లలకి తలా ఒక ఐదో, పదో రూపాయలు ఇచ్చేవాళ్ళు. పదిరోజుల ముందే టపాకాయలు కొనుక్కుని వాటిని జల్లెడలో వుంచి పందిరిమీద ఎండడానికి పెట్టేవాళ్ళం. నాకు ప్రతి పది నిమిషాలకు అవి ఎండాయా లేదా చూడాలని ఆత్రం. ఈ టపాకాయల్లో బొమ్మ పిస్తోల్లు, వాటిలో పెట్టి పెట్టడానికి, పేల్చడానికి చిన్న చిన్న ఎర్రటి టేపులాంటి చుట్ట ఉంచిన చిన్న కాగితం  పెట్టె. అది సింహం బ్రాండ్ అయితే చాలా సంతోష పడేవాళ్ళం, బాగా పేలుతాయని. అలాగే లక్ష్మి బ్రాండ్ ఔట్లు, ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు. సీమటపా కాయలు. వాటిని కాల్చడానికి భయమైనా పెద్దవాళ్లు ఎవరైనా కాలుస్తుంటే గట్టిగా రెండు చెవులు మూసుకుని ఆనందించేవాళ్ళం. అలాగే రవ్వలురాలని, చిటపటలాడని సాదా కారప్పువ్వత్తులు అంటే ముచ్చట పడే వాళ్ళం. ఇక మతాబులు, చిచ్చుబుడ్లు ఇంట్లోనే, గంధం (పాస్పరస్) పొడి, సూరేకారం కలిపి తయారు చేసుకునే వాళ్ళం.  అలాగే ఇనుముతో తయారు చేసిన చిన్న సైజు రోలు రోకలి పల్లెటూళ్ళలో ప్రత్యేకమైన దీపావళి టపాసు. రోలు వంటి చిన్న ఇనుప రోటిలో కొంచెం మందు కూరి, దానిపై రోకలి లాంటి ఇనుప కడ్డీ వుంచి ఏదైనా గట్టి రాతిపై మోదితే పెద్ద శబ్దం వచ్చేది. అది కొట్టిన చోట పసుపు రంగుతో మచ్చ పడేది. వూళ్ళో దీపావళి మందులు కొనే స్తోమత లేని చాలామంది పిల్లలు ఈ రోలూ రోకలితోనే పండగ జరుపుకునే వాళ్ళు.  పగలంతా ఊరు ఊరంతా ఈ చప్పుళ్ళు వినవస్తూనే ఉండేవి. వెళ్ళు నలిగిపోతాయని మా వాళ్ళు వీటి జోలికి పోనిచ్చేవాళ్ళు కాదు. చాలా సార్లు దీపావళి పడగకి రెబ్బారం నుంచి మా రెండో బావగారు కొలిపాక రామచంద్ర రావు గారు, పండగకి మా ఊరు వస్తూ,  పెద్ద పెద్ద బుట్టల్లో టపాకాయలు వెంటబెట్టుకుని తెచ్చేవారు. ఆయన వస్తున్నారు అని తెలియగానే, పిల్లల కళ్ళల్లో దీపావళి కాంతులు మెరిసేవి.

ఇక ఆ రోజుల్లో  పుట్టిన రోజు పండగ  చేయడం అలవాటు లేని పని. పుట్టినరోజు ఎప్పుడో, పెళ్లిరోజు ఎప్పుడో పెద్దవాళ్లకు కూడా గుర్తుండేది కాదు. ఈ ఒక్క విషయంలో నాకు పెద్దవాళ్ల పోలిక వచ్చింది. మా ఆవిడ పుట్టిన రోజు, పిల్లల పుట్టిన రోజు ఇప్పటికీ గుర్తురావు, గూగుల్ గుర్తు చేస్తే తప్ప.  ఈ పండగలు  కాక, బంధు మిత్రులతో కలసిచేసే వనభోజనాలు, తిరునాళ్ళు, తీర్ధయాత్రలు. వ్రతాలు,పూజలు, పేరంటాలు, ఆ రోజుల్లో అలా ఇంటింటా, ఊరంతా  ఒకటే  సందడే సందడి.

కింది ఫోటోలు:  (గూగుల్ సౌజన్యం)

(గోళీ సోడా మిషన్)


(దీపావళి పిల్లల బొమ్మ పిస్తోలు)





 

(ఇంకా వుంది)

29, నవంబర్ 2024, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (21) - భండారు శ్రీనివాసరావు

 


ఆడవాళ్ళ ప్రయాణాలకి మా ఇంట్లో ఒక మేనా వుండేది.  నేను హైస్కూలు చదువు చదివే రోజుల్లో కూడా ఇంటి మధ్య హాల్లో ఆ మేనాను మోకులు కట్టి పైన రెండు దూలాల మధ్య వేలాడదీసి ఉంచేవాళ్ళు. దాన్ని మోయడానికి ఆరుగురు బోయీలు. పరిస్తితుల ప్రాబల్యం వల్ల మేనా వైభోగం అటక ఎక్కింది. ఆ  తరువాత చాలా కాలం వరకూ  పంటలు రాగానే వాళ్లకు ‘మేర’ (ధాన్యం వాటా) ఇవ్వడం కూడా నాకు గుర్తుంది. మేనా రోజులు అయిపోయిన తరువాత ఇంట్లో ఆడవాళ్ళు ఊళ్లకు పోవడానికి గుడిసె బండ్లు కట్టేవాళ్ళు. ఒక్క మగవాళ్ళ ప్రయాణాలకే అయితే గుడిసె కట్టకుండా కేవలం జల్ల బండ్లు మాత్రమే కట్టేవాళ్ళు. మా ఇంట్లో రాముడు భీముడు అని ఒక ఎడ్ల జత వుండేది. కాడి మెడ మీద పడగానే వాటికి ఎక్కడ లేని హుషారు. అవి లాగే బండి ఎక్కడానికి మేము పోటీలు పడేవాళ్ళం. బండి తొట్లో కూర్చుని, తోకలు మెలిపెడుతూ, చర్నాకోలతో ఎడ్లను అదిలిస్తుంటే అవి పరుగు మొదలు పెట్టేవి. వాటి మెడ పట్టెలలో గంటలు మోగుతుంటే అదో తమాషాగా అనిపించేది. బండి నడిపే మనిషి వాటితో ఏవేవో మాట్లాడుతుండేవాడు. ఆ భాష వాటికి అర్ధం అవుతున్నట్టే అనిపించేది. ఒక ఈడు వచ్చిన తరువాత మేము రైలుకు పోవాలంటే మోటమర్రికి, బస్సు ఎక్కాలంటే పెనుగంచిప్రోలుకు మూడు, నాలుగు మైళ్ళు నడిచే వెళ్ళే వాళ్ళం. అలాగే పొరుగూరు వత్సవాయి టూరింగు టాకీసులో సినిమా చూడడానికి కూడా చాలామందిమి కలిసి కాళ్ళకు పనిచేప్పేవాళ్ళం. ఆ సినిమాల్లో రెండు మూడు ఇంటర్వెల్స్ ఉండేవి. పైన డేరా చిరుగులు పడి ఆకాశం కనిపిస్తూ వుండేది. హాలు బైట పెట్టిన మైకు మాత్రం గట్టిగా పనిచేసేది. సినిమాకు ముందు వేసే ‘నమో వెంకటేశా పాటలు చాలా దూరం వినిపించేవి. అవి వినపడడం లేదు అంటే సినిమా మొదలు పెట్టారని అర్ధం.

ఇంటి వెనుకనే శివాలయం.

కార్తీక మాసం నెల రోజులూ  చీకటి పడుతుండగానే గుడి ఆవరణలోవున్న ధ్వజస్తంభానికి ఆకాశదీపం వేలాడదీసేవాళ్ళు.  ఆకాశదీపం అంటే  – చిన్న చిన్న కంతలు కలిగిన మూత వుండే ఒక రకం దీపం. లోపల ప్రమిదెలోనూనె పోసి  వొత్తి  వెలిగించి దానిని ఈ ఆకాశదీపంలో వుంచేవారు. చీకట్లో అంత ఎత్తున  ధ్వజస్తంభం నుంచి వేలాడుతూ - చిరు కాంతులు వెదజల్లుతూ మా పిల్లలందరికీ అది నిజంగా  ఆకాశంలో వెలిగే దీపంలాగానే అనిపించేది.

పొరుగున పెనుగంచి ప్రోలులో తిరుపతమ్మ తిరుణాల జరుగుతుంటే ఆ సంబరం ఛాయలు మా వూళ్ళో కనిపించేవి. రంగు కాగితాలతో రకరకాల ప్రభలు తయారు చేసి వాటిని బండ్లపై అమర్చేవారు. వాటికి కట్టే ఎడ్లను కూడా అందంగా అలంకరించేవారు. వాటిపై బుక్కా గులాములు చల్లేవాళ్ళు. మేళ తాళాలతో ఊరేగిస్తూ ప్రభలను పెనుగంచి ప్రోలు తీసుకువెళ్ళి ఏటి ఒడ్డున వున్న తిరుపతమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించేవాళ్ళు. ఏటి ఒడ్డున మొక్కుబళ్ళు తీర్చేవాళ్ళు. గుడి పక్కన ఎత్తైన  పెద్ద ఇనుప ప్రభ వుంది. మా చిన్నతనంలో అదొక పెద్ద ఆకర్షణ. మామూలుగా వెదురు గడలతో ప్రభలు కడతారు. అలాంటిది తిరుపతమ్మ ప్రభను పూర్తిగా ఇనుముతో తయారు చేశారు. దాని చక్రాలు కూడా ఇనుమే. పైగా చాలా ఎత్తు. అంత ఎత్తైన  ప్రభ  ఊరేగింపుగా  ఊళ్ళో తిరుగుతుంటే  జనం ఎగబడి చూసేవాళ్ళు. ఇలాంటి ఇనుప ప్రభ వున్న గుడి మరోటి లేదని చెబుతారు. వూరికి కరెంటు వచ్చిన తరువాత  తీగెలు అడ్డం వస్తాయని ఆ ప్రభను కదలకుండా గుడి పక్కనే వుంచేసారు. తిరుపతమ్మ వారి ప్రభలు దశదిశలా వ్యాపించడంతో భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు పెద్ద స్థలంలో చిన్నగా వున్న గుడి ఇప్పుడు చిన్న స్థలంలో పెద్ద దేవాలయంగా కనబడుతోంది. ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది. గుడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గుడి పుణ్యమా అని పెనుగంచిప్రోలు స్థితిగతులు కూడా బాగా మెరుగుపడ్డాయి.  

పెనుగంచిప్రోలు దేవాలయాలకు ప్రసిద్ధి.  101 ప్రాచీన దేవాలయాలు వున్నాయని స్థల పురాణం. అందుచేత  పెద కంచీపురం అనేవారుట. శ్రీ  తిరుపతమ్మ కధ అనే పేరుతొ గతంలో ఒక సినిమా కూడా వచ్చింది. కీర్తిశేషులు ఎన్టీ రామారావు, కృష్ణకుమారి 1963 లో విడుదల అయిన ఈ చిత్రంలో నటించారు. మా ఐదో అక్కయ్యగారు కొమరగిరి  అన్నపూర్ణ  తిరుపతమ్మ మీద ఒక పుస్తకం రాసింది. ప్రతి ఏటా గుడిలోని తిరుపతమ్మ, గోపయ్యల విగ్రహాలను పదకొండు జతల ఎడ్ల బండ్లపై ఊరేగింపుగా జగ్గయ్యపేట తీసుకు వెళ్లి, అక్కడి రంగుల మడపంలో కొత్త రంగులు వేయించి తిరిగి పెనుగంచి ప్రోలు తీసుకువచ్చి మళ్ళీ గర్భ గుడిలో పునః ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది.       

తిరుపతమ్మకు ఏటా రెండు తిరుణాళ్ళు జరిగేవి. ఒకటి పెద్ద తిరుణాల. రెండోది చిన్న తిరుణాల. అదేమి చిత్రమో పెద్ద తిరుణాల జరిగిన సంగతే ఎవరికీ తెలిసేది కాదు. అదే చిన్న తిరుణాల చాలా అట్టహాసంగా జరిగేది. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలియదు. చిన్న తిరుణాల జరిగినన్నాళ్ళు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో పండగ వాతావరణమే. పెనుగంచిప్రోలు మీద జనం ఎగబడేవారు. ఊరుమీద ఊరు పడ్డట్టు వుండేది. ఆ వూళ్ళో మా బావగారి ఇల్లు తిరుణాలకు వచ్చిన చుట్టపక్కాలతో నిండిపోయేది.

తిరుణాల జరిగినన్నాళ్ళు ఏటి వడ్డున గుడి ప్రాంతం యావత్తూ సంబరాలతో మారుమ్రోగేది. బొమ్మల దుకాణాలు, మిఠాయి అంగళ్లు, కోలాటాలు, భజనలతో అంతవరకూ నిద్రాణంగా ఉన్న ప్రాంతం సందడి సందడిగా మారిపోయేది.     

తిరుణాల లేని రోజుల్లో ఏడాది పొడుగునా ఆ దేవాలయ ప్రదేశం నిర్మానుష్యంగా వుండేది.  రోజూ వచ్చే భక్తులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.  అలాటిది గత కొన్నేళ్లుగా ఆ గుడి ప్రభలు జగజ్జేయమానంగా వెలిగిపోతున్నాయి. అక్కడ వాతావరణమే పూర్తిగా మారిపోయింది. మొన్నీ మధ్య మా మేనల్లుడు రామచంద్రం ఆ వూరు వెళ్లి వచ్చి చెప్పాడు, ‘వెనక ఏడాదికి రెండు తిరుణాళ్ళే. ఇప్పుడు ఏడాది పొడుగునా రోజూ తిరుణాళ్ళే’ అని.

జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచే కాదు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ ఊరికి ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు.  ప్రతి రోజూ అనేక ట్రిప్పులు బస్సులు నడుస్తున్నాయి. ఖరీదైన మోటారు వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. వారికి తగిన వసతి సదుపాయాలు కూడా ఏర్పడ్డాయి.

మేము చదువు కునే రోజుల్లో బెజవాడ నుంచి పొద్దున్న ఒకటి (ఫస్ట్ బస్ అనే వాళ్ళు), సాయంత్రం ఒకటి (నైట్ హాల్ట్ బస్ అనేవాళ్ళు) బెజవాడ నుంచి వచ్చి పోయేవి. సాయంత్రం వచ్చిన బస్సు అక్కడే వుండిపోయేది. డ్రైవరు, కండక్టర్ కూడా అక్కడే నిద్ర చేసే వాళ్ళు. మళ్ళీ పొద్దున్నే ఫస్ట్ బస్  లో బెజవాడ వెళ్ళే వాళ్ళు. బస్సు బయలుదేరేటప్పుడు గట్టిగా హారన్  మోగించేవాళ్ళు. అది వింటూనే  ప్రయాణాలపై వెళ్ళేవాళ్ళు హడావిడిగా ఇళ్ళ నుంచి  సామాన్లు మోసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేవాళ్ళు. డ్రైవర్ పక్కన ఒక సీటు వుండేది. దాన్ని ఫ్రంట్ సీటు అనేవాళ్ళు. మునసబు, కరణాలకు, పోలీసులకు ఆ సీటు ప్రత్యేకం. బస్సులో ఖాళీ లేకపోయినా, నిల్చుని ప్రయాణం చేసేవాళ్ళు కాని వేరే వాళ్ళు అందులో కూర్చునే వాళ్ళు కాదు. బెజవాడకు టిక్కెట్టు రూపాయి వుండేది. పిల్లలకు అర  టిక్కెట్టు కొట్టించకుండా పెద్దవాళ్ళు నానా ప్రయాస పడేవాళ్ళు. వయసు తక్కువ చెప్పేవాళ్ళు. కండక్టర్ గట్టివాడయితే సీటు పక్కన నిలబెట్టించి పొడుగ్గా వుంటే పూర్తి టిక్కెట్టు కొట్టేవాడు. ఆ లడాయి నందిగామ చేరేదాకా సద్దుమణిగేది కాదు.

 

కింది ఫోటోలు:


పెనుగంచిప్రోలులో ఒకప్పుడు ఇనుప ప్రభతో తిరుపతమ్మ గుడి


ఇప్పుడు అభివృద్ధి చేసిన తిరుపతమ్మ దేవాలయం







(ఇంకా వుంది)