15, జూన్ 2022, బుధవారం

ఏపీలో ఎన్నికల పొత్తులు - భండారు శ్రీనివాసరావు

14, జూన్ 2022, మంగళవారం

నడిచి వచ్చిన దారి - భండారు శ్రీనివాసరావు


(నోటు మాటగా కాకుండా నోటి మాటతో)
"నీ గురించి నీవెప్పుడు చెప్పుకోకు. మంచి చెబితే ఎవరూ నమ్మరు. చెడు చెప్పుకుంటే ఇంకా ఎంత వుందో అనుకుంటారు"


సాయ్ లెన్స్ – భండారు శ్రీనివాసరావు

 

స్కూలు రోజుల్లో చూసిన సినిమాలో ఓ కోర్టు సీను లీలగా జ్ఞాపకం వుంది.
కోర్టు హాల్లో న్యాయమూర్తి ఆసనం పక్కనే దండం ధరించిన ఓ దండధరుడు నిలబడి ఉంటాడు. హాల్లో వాళ్ళు గుసగుసలాడుతున్నప్పుడు ఏమీ పట్టించుకోకుండా వుండిపోయి, అంతా నిశ్శబ్దంగా వున్నప్పుడు గొంతు గట్టిగా పెంచి, సాయ్ లెన్స్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ లెన్స్ గురించి మా ఫిజిక్స్ మాస్టారు ఎప్పుడూ చెప్పలేదు. అంచేత ఈ లెన్స్ ఏమిటా అనే సందేహం బాధించేది. తర్వాత తర్వాత అర్ధం అయ్యింది ఏమిటంటే అది సాయ్ లెన్స్ కాదు, సైలెన్స్.
ఇప్పుడే ఓ టీవీ చర్చలో రాజకీయ పార్టీల ప్రతినిధులు గోలగోలగా వాదాలు వినిపిస్తున్నప్పుడు యాంకర్ మౌనంగా వుండి, వాళ్ళు చల్లబడ్డ తర్వాత ప్లీజ్ ప్లీజ్ ఆగండి ఆగండి అని అంటుంటే వెనుక ఎప్పుడో చూసిన సినిమాలో ఆ దండధరుడి పాత్ర గుర్తుకు వచ్చింది.
(14-06-2022)

12, జూన్ 2022, ఆదివారం

అట్టహాసం ఆర్భాటం – భండారు శ్రీనివాసరావు

  

(ఈరోజు 12-06-2022 ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

 

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహంలింకన్ ఒక చక్కని మాట చెప్పారు.

“ఒక మంచి వాడిని, సద్గుణ సంపన్నుడిని ఎంపిక చేసుకోండి. అతడికి అధికారం ఇచ్చి చూడండి, ఇక అతడెలా మారిపోతాడన్నది మీరే చూస్తారు.”

చాలామందికి అర్ధం కానిది ఇదే. అధికారంలో లేని సమయంలో ఎలాంటి బందోబస్తూ లేకుండా ప్రజల నడుమ అరమరికలు లేకుండా స్వేచ్చగా తిరిగిన రాజకీయ నాయకులు, పదవిలోకి రాగానే చుట్టూ భద్రతా వలయాలు నిర్మించుకుని ప్రజలకు ఎందుకు దూరం అవుతారన్నదే జవాబు లేని ప్రశ్న.

ఉన్నత స్థానాల్లో వున్న వ్యక్తులకు భద్రత కల్పించడం ఆక్షేపణీయం యెంత మాత్రం కాదు. అయితే ఆ పేరుతొ చేస్తున్న హడావిడీ, అనవసర వ్యయం గురించి ఎవ్వరూ ప్రశ్నించకూడదు అనడం కూడా సబబు కాదు.


కొన్నేళ్ళ క్రితం చైనా అధ్యక్షుడు అధికార పర్యటనపై ఢిల్లీ వచ్చారు. ఆయన వెళ్ళే మార్గాలనే కాకుండా చుట్టుపక్కల దారులను కూడా దిగ్బంధించారు. ఆ క్రమంలో పార్కింగ్ చేసివున్న కొన్ని వాహనాలను పోలీసులు క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు. పార్కింగు చేసి వున్న ఒక కారులోని మహిళను కిందికి దిగే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. క్రేన్ తో పైకి లేపిన వాహనంలో ఆ మహిళ చిక్కుకు పోయిన సమాచారం బయటకు పొక్కి,  పోలీసులను చిక్కుల్లో పడేసింది. 


అసామాన్యులకోసం అధికారులు అసాధారణ రీతిలో చేసే భద్రతా ఏర్పాట్ల కారణంగా సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ విషయం ఆ ప్రముఖులకు తెలుసో లేదో తెలవదు. శ్రీలంక అధ్యక్షుని హోదాలో మహీంద్ర రాజపక్సే వెంకన్న దర్శనం కోసం ఓ సారి తిరుపతి వచ్చారు. స్వామి సేవ చేసుకుని తిరిగి వెళ్ళారు. అయితే అయన రాకను పురస్కరించుకుని చేసిన భద్రతా ఏర్పాట్లు సామాన్య భక్తులకు చుక్కలు చూపించాయి. కొండ ఎక్కకుండానే వారికి దేవుడు కనబడ్డాడు. తిరుపతి అలిపిరి సెక్యూరిటీ గేటు వద్ద అసంఖ్యాకంగా వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. మరునాడు పత్రికల్లో వచ్చిన ఆ ఫోటోలు చూసే అవకాశం ఆ విదేశీ అతిధి దేవుడికి ఎలాగూ వుండదు. అంచేత తన భద్రత కారణంగా జనాలు ఎంతగా ఇక్కట్లకు గురయిందీ తెలిసివచ్చే అవకాశం ఆయనకి బొత్తిగా లేదు. 

ఆర్భాటపు భద్రతా ఏర్పాట్లకోసం ప్రజాధనం ఖర్చయినా ప్రజలు సహిస్తారు, ఎంతవరకు అంటే, తమ దినవారీ పనులకు ఆ ఏర్పాట్లు అడ్డం రాకుండా ఉన్నంత వరకు.

పొతే, ప్రముఖులకు కల్పిస్తున్న భద్రత, పటాటోపం, అధికార దర్పం ప్రదర్శించడానికే తప్ప వారి ప్రాణరక్షణకు సరిగా ఉపయోగపడడం లేదన్న అభియోగాలు వున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రముఖుల పేరుతొ కొందరికి కల్పిస్తున్న భద్రత అపహాస్యానికి గురవుతున్న మాటా నిజమే. 

ఉదాహరణకు 2014 లో ఒక వ్యక్తికి అసాధారణ భద్రత కల్పించారు. అతడికి ఏర్పాటు చేసింది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. అతడికి పహరా కాయడానికి కేంద్ర భద్రతా దళానికి చెందిన పాతికమంది సాయుధ పోలీసులను నియోగించారు. ఇంతకీ ఆ వీ.వీ.ఐ.పీ. వున్నది ఒక ఆసుపత్రిలో చావుబతుకుల నడుమ. వెంటిలేటర్ల సాయంతో అతగాడి ప్రాణాలను ఏ క్షణానికి ఆ క్షణం డాక్టర్లు నిలిపి వుంచుతున్న స్తితిలో. వెంటిలేటర్లు ఎప్పుడు తొలగిస్తే అప్పుడు ఆ వ్యక్తి ప్రాణాలు హరీ అంటాయి. అయినా పోలీసు భద్రతమాత్రం కొనసాగించారు. ఇది అవసరమా అంటే అవుననే అంటారు అధికారంలో వున్నవాళ్ళు.


ముప్పయ్యేళ్ళ క్రితం జరిగిన ఒక ఉదంతాన్ని గుర్తు చేసుకుందాం. 

స్వీడన్ దేశపు ప్రధాన మంత్రి పామే ప్రతి రోజూ మాదిరిగానే ఆఫీసునుంచి ఓ సాయంత్రం ఇంటికి వచ్చారు. సినిమాకు పోదామన్న కోరికను భార్య వెలిబుచ్చింది. సరే అన్నారు ప్రధాని. వారిద్దరూ కాలినడకన బయలుదేరి భూగర్భంలో వున్న మెట్రోలో ప్రయాణించి గ్రాండ్ సినిమా థియేటర్ కు చేరుకున్నారు. (మన దేశంలో ఇలాటివి కలలో కూడా ఊహించలేము). సినిమా చూసి, పామే దంపతులు తిరిగి నడుచుకుంటూ ఇంటికి చేరుకునే క్రమంలో దారిలో ఒక దుండగుడు చాలా దగ్గర నుంచి కాల్పులు జరపడంతో పామే అక్కడికక్కడే మరణించారు. ప్రధాని భార్య ఈ సంఘటనలో గాయపడింది. ఈ దుర్ఘటన కారణంగా స్వీడన్ దివంగత ప్రధాని నిరాడంబర జీవన శైలి ప్రపంచానికి తెలిసివచ్చింది.

పలానా దేశపు ప్రధాన మంత్రి విమానాశ్రయంలో తోటి ప్రయాణీకుల మాదిరిగానే క్యూలో నిలబడి బోర్డింగు పాసులు తీసుకున్నారనీ, మరో దేశపు ప్రధాని, కొడుకును స్కూల్లో దింపి రావడానికి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాడనీ ఇలాటి వార్తలు విన్నప్పుడు, ఫోటోలు చూసినప్పుడు కూడా ఆశ్చర్యం అనిపించక మానదు. మన దేశంలో కూడా ఇటువంటి రాజకీయ ప్రముఖులు లేకపోలేదు. కాకపోతే వారి సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. 


చూసి నేర్చుకోవాల్సిన ఒక  ఉదంతం గురించి చెప్పుకుందాం.

ఇది జరిగి చాలా ఏళ్ళయింది.

అదొక సువిశాల భవన ప్రాంగణం.

సుదూరంగా కెమెరా కన్ను నుంచి చూస్తే అంతా నిర్మానుష్యంగా వుంది. ఆ భవనం ప్రవేశ ద్వారం వద్ద ఓ వ్యక్తి వొంటరిగా నిలబడి వున్నాడు. కనుచూపుమేరలో ఎవరూ లేరు. ఇంతలో ఓ పొడవాటి నల్లటి మోటారు వాహనం అక్కడికి చేరుకుంది. దానికీ వెనుకా ముందూ ఎలాటి వాహనాలు లేవు. అందులో నుంచి ముందుగా డ్రైవర్ దిగి వెనుక వైపు డోరు తెరిచిపట్టుకున్నాడు. ఒకే వ్యక్తి ఆ కారునుంచి దిగాడు. కోటు బొత్తాములు సవరించుకుంటూ ముందుకు నడిచాడు. అప్పటివరకు అక్కడ వొంటరిగా వేచివున్న వ్యక్తి, రెండు అడుగులు ముందుకు వేసి కారులో నుంచి దిగిన వ్యక్తితో ఆప్యాయంగా కరచాలనం చేశాడు. ఆదరంగా ఆహ్వానించి సాదరంగా ద్వారం వైపు చేయి చూపించి ఇతర అతిధుల రాక కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడి పోయాడు. ఆ వచ్చిన వ్యక్తి కూడా ఎవరికోసం ఎదురు చూడకుండానే, ఎవ్వరూ తోడు లేకుండానే వొంటరిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. 

చాలా దూరంనుంచి ఈ దృశ్యాన్ని రికార్డ్ చేస్తున్న అనేక టెలివిజన్ కెమెరాలు దాన్ని ప్రపంచ వ్యాప్తంగా తమ చానళ్ళలో ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఎందుకంటే ఆ ఇద్దరూ సామాన్యులు కారు. కారునుంచి దిగివచ్చిన వ్యక్తి ఈ ప్రపంచాన్ని తన కనుసన్నల్లో ఆడిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఆయనకు స్వాగతం పలికిన వ్యక్తి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రష్యాలోని సెంట్ పీటర్స్ బర్గ్ నగరంలో 2013 జరిగిన ఇరవై దేశాల అగ్ర నాయకుల (G-20) సదస్సులో పాల్గొనడానికి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా అక్కడికి వెళ్ళినప్పటి ముచ్చట ఇది. 

ఇదంతా యెందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీఐపీ భద్రత పేరుతో ఎంతో హడావిడి చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందుల పాలుచేసే అనుభవాలకు అలవాటుపడిన ప్రాణాలకు ఈ రకమైన దృశ్యాలు నిజంగా ఎంతగానో వూరట కలిగిస్తాయి. అలా అని వాళ్లు భద్రతా చర్యల పట్ల ప్రమత్తంగా వుంటున్నారని కాదు. ఆధునిక సాంకేతిక పరికరాలను సమర్ధవంతంగా వుపయోగించుకుంటున్నారని వేరే చెప్పనక్కరలేదు కూడా. 

మన దేశంలో ఈ దృశ్యం మరోరకంగా కానవస్తుంది. ఒక స్థాయి కలిగిన నాయకులు కలుసుకున్నప్పుడు సయితం కళ్ళు తిరిగే హడావిడి. మందీ మార్బలం, పుష్పగుచ్చాలతో సంసిద్ధంగా వుండే వ్యక్తిగత సిబ్బంది, ఏకే 47 వంటి తుపాకులు ధరించిన బ్లాక్ క్యాట్ బాడీ గార్డులు, ఎటుచూసినా అడుగడుగునా సాయుధ పోలీసు అధికారులు. ఇక విదేశీ ప్రముఖులు వస్తే చెప్పనక్కరలేదు. భద్రత పేరుతొ జనాలను కాల్చుకు తింటారు. చెప్పొచ్చేది ఏమిటంటే ఇలాటివాటిని చూసి నేర్చుకునేది ఏమైనా వుంటుందా అన్నదే.

ప్రముఖుల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా, ఏదైనా జరగరానిది జరిగితే అది సంచలన వార్త అవుతుందని, అంచేత సెక్యూరిటీ విషయంలో తాము చెప్పినట్టు విని తీరాల్సిందే అని భద్రతా విభాగం వారు నొక్కి చెబుతుంటారు. వారు చెప్పేది నిజమే కావచ్చు. మరి వందల కోట్లు ప్రజాధనం ఖర్చు అవుతున్న ఈ భద్రతా ఏర్పాట్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవచ్చు కదా, తద్వారా ప్రముఖుల రాకపోకల సందర్భంలో బందోబస్తు పేరుతొ సామాన్యుల రాకపోకలకు కలుగుతున్న ఇబ్బందులను ఓ మేరకు తగ్గించవచ్చు కదా! అనేది మామూలు మనుషులకు కలిగే సందేహం. ప్రస్తుతం అలా కూడా చేస్తున్నారు. అంగరక్షకుల చేతుల్లో చిన్న సైజు బ్రీఫ్ కేసులు కనిపిస్తుంటాయి. వాటిల్లో ఇటువంటి పరికరాలే వుంటాయి. అయినా ప్రముఖుల రాకకు ముందు, అది వివాహ వేడుక కావచ్చు, సాధారణ సమావేశం కావచ్చు పోలీసు జాగిలాలతో, బాంబులను నిర్వీర్యం చేసే దళాలతో క్షుణ్ణంగా తనిఖీ చేయడం తప్పనిసరి. అలాగే ప్రముఖులు ప్రయాణం చేసే మార్గాల్లోనే కాకుండా భద్రతాధికారులు ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ మార్గాల్లో సయితం వాహనాల కదలికలపై ఆంక్షలు విధించడం కద్దు. ఇంత శ్రమ పడ్డా, ఇంతటి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలేదు. దరిమిలా సెక్యూరిటీ ఏర్పాట్లను సమీక్షించి వాటిని మరింత పటిష్టం చేయడం ఒక్కటే జరుగుతోంది. తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతూనే వస్తోంది.

ఇది అవసరమా అనేది సామాన్యుల ప్రశ్న. అవసరమే అనేది అసామాన్యుల సమాధానం కావచ్చు.




11, జూన్ 2022, శనివారం

ఇదో తుత్తి

 నిన్న శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ హోటల్ దసపల్లాలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జీవితంపై ఆకాశ వాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్ గోపాల కృష్ణ రాసిన జీవనగానం పుస్తక ఆవిష్కరణ సభలో భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారి ఆత్మీయ పలకరింపు.




Photo Courtesy: Vice President Office

7, జూన్ 2022, మంగళవారం

కావాల్సింది పరిష్కారమా! టీవీ చర్చలా !


ఒక జరగరాని, జరగకూడని సంఘటన జరుగుతుంది. దానిపై వారిది బాధ్యత, వీరిది బాధ్యత అంటూ టీవీల్లో చర్చలు మొదలవుతాయి.

అవి ఒక కొలిక్కి రాకమునుపే అలాంటిదే మరో సంఘటన  జరుగుతుంది.

అంతే! ముందుది మరచిపోతారు. తాజా సంఘటనపై తాజా చర్చలు మొదలవుతాయి.

ఇదా కావాల్సింది. లేక పరిష్కారమా!

6, జూన్ 2022, సోమవారం

మౌనమె నా భాష

“I get intoxication while talking” అన్నాట్ట వెనుకటికి నాలాటి వాడు. అదేవిటో నా వదరుబోతుతనం ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయిందన్నది అచ్చంగా నా సొంత అభిప్రాయం. మాట్లాడడానికి తగ్గ వాతావరణం వుండాలని అప్పుడే మాట బాగా పెగులుతుందని ‘వసకారుడు’ ఏనాడో చెప్పాడు.

చదువుకునే రోజులనుంచి నాకీ మాటల పిచ్చి వుందనీ, అందుకే మాటల్లో పడి అసలు చదువు చెట్టెక్కిందనీ మా పెద్దవాళ్ళు అంటుండగా అనేకసార్లు వినే అదృష్టం నాకు కలిగింది. అయినా వేరే ఆటలకన్నా నాకు ‘మాటల ఆటలు’ అంటే వున్న వ్యామోహం ఏమాత్రం తగ్గలేదు. బహుశా రేడియోలో ఉద్యోగం ఇవ్వడానికి నాకు వున్న అనేక అనర్హతలను ఈ అదనపు అర్హత కప్పిపెట్టిందేమో అని అనుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎస్సారార్ కాలేజీలో నాకంటే వయస్సులోనూ, చదువులోనూ పెద్దవాళ్లయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు వుండేవాళ్ళు. కాస్త వీలు దొరికితే చాలు, వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు మొదలు పెట్టేవాడిని. శ్రద్ధ, సుధ అనే పేర్లు కలిగిన వాళ్ళిద్దరూ, వాళ్ల నోట్సులు రాసిపెట్టేవరకు నా మాటలు విని ఆ తరువాత ఎంచక్కా ‘మంచిది వెళ్ళి రండి’ అనేసేవాళ్ళు. అలా అని మాటల వల్ల అసలు ఏమాత్రం ఉపయోగం లేదనే గొప్ప అభిప్రాయానికి వెంటనే రానక్కర లేదు. వెనుకటికి నేను రైళ్ళలో రిజర్వేషన్ లేకుండానే ఈ మాటల మంత్రంతో తేలిగ్గా ప్రయాణాలు చేసేవాడిని. కూర్చున్నవాళ్ళ పక్కన కాసేపు నిలుచుని వాళ్ళతో మాటలు కలిపేవాడిని. ఆ తరువాత వాళ్లు మాటల మైకంలో పడిపోయి ‘అదేమిటి మాస్టారు అలా నిలబడేవున్నారు, వచ్చి ఇలా కూర్చోండి’ అని జాగా ఇచ్చేవాళ్ళు. కొండొకచో మరికొందరు శ్రోతలు మరీ మొహమాట పడిపోయి నా మాటలు వింటూ వాళ్లు లేచి నిలబడి నాకు కూర్చునే జాగా ఇచ్చేవాళ్ళు. రేడియో ఉద్యోగంలో చెప్పక్కర లేదు. ఆఫీసుకి పోవడమే గగనం కాని, వెళ్ళానంటే చాలు, మా న్యూస్ యూనిట్ చిన్న సభా ప్రాంగణంగా మారిపోయేది.
అలాటి ఘన వాక్చరిత్ర కలిగిన నేను ఈ నడుమ యెందుకు మాటలాటలు తగ్గించానని మా ఆవిడ సయితం అనుమానించడం మొదలెట్టింది. ‘వున్నట్టుండి ఈ వయస్సులో అంటే అరవై ఎనిమిది దాటిన తరువాత మా ఆయనకు కాసింత పెద్దమనిషితనం కానీ అంటలేదు కదా’ అని బోలెడు బోలెడు సంతోషపడిపోయేది. తెలుగు సీరియళ్ల ప్రోత్సాహాక ఉద్యమంలో మునిగిపోయి, టీవీల్లో రాజకీయ చర్చలు పట్టించుకోకపోవడంవల్ల పేరుకుపోయిన అజ్ఞానాంధకారణంగా ఆవిడకు ఈ జ్ఞానోదయం ఆలశ్యం అయిందని నా అనుమానం.
నిజమే. కొన్నేళ్ళ క్రితం వరకు, టీవీ చర్చావేదికల్లో ఒకరిని మించి మరొకరు, దూషణలతో కూడిన తిరస్కారాలవల్ల కలిగిన మాత్సర్యసహిత ప్రేలాపనలు పక్కన కూర్చుని అదే పనిగా వినీ వినీ నాకు మాట పడిపోయింది అనే విషయం ఆవిడకు తెలవదు.
అందుకే అన్నారు -
అంతయు మన మేలునకే

NOTE: Courtesy Image Owner