20, మే 2022, శుక్రవారం

నిర్వచనోత్తర రామాయణం – భండారు శ్రీనివాసరావు

 సదస్సు

ఒకడి మనస్సులో వున్న అయోమయాన్ని

హాజరయిన అందరికీ, పెంచి మరీ పంచే వేదిక

 

రాజీ

వున్న ఒక్కకేకునూ అందరికీ పంచి, ప్రతి ఒక్కరూ తమకే పెద్ద ముక్క దొరికిందని సంతోషపడేలా

చేయడం.

 

కన్నీరు

ఆడదాని కంట్లో నుంచి వచ్చే ఆ కన్నీటి వేగం ముందు ఎంతటి బలవంతుడయిన మగవాడయినా నీరు కారిపోక తప్పదు అని నిరూపించే ప్రబల శక్తి

 

నిఘంటువు

వివాహం కన్నా విడాకులు అనే పదం ముందు కనపడే పుస్తకం

 

గోష్టి

ఒకరి మాట మరొకరు వినిపించుకోకుండా ఆఖర్న ఒకరితో ఒకరు విభేదించే మహత్తర కార్యక్రమం.

 

గొప్ప పుస్తకం

అందరూ మెచ్చుకునేది, ఎవరూ చదవందీ.

 

చిరునవ్వు

పైకి మెలికలాగా కనిపించినా, వంకర తిరిగినవాటిని కూడా సాపు చేయగల అద్భుత సాధనం

 

ఆఫీసు

ఇంట్లో పడ్డ శ్రమ అంతా మర్చిపోయి బడలిక తీర్చుకునే ఆహ్లాదకరమైన ప్రదేశం

 

ఆవులింత

భార్య ముందు నోరు తెరవడానికి మగవాడికి దొరికే అరుదైన అవకాశం

 

ఎట్సెట్రా

ఏవీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు బుకాయించే పదం

 

కమిటీ

విడివిడిగా ఎవరికి వారు ఏమీ చేయలేని మనుషులందరూ ఒక చోట కలిసి ఏమీ చేయలేమని కలిసికట్టుగా తీర్మానించే సంఘం

 

అనుభవం

తాము చేసే పొరబాట్లకు మనుషులు పెట్టుకున్న ముద్దుపేరు

17, మే 2022, మంగళవారం

అదృష్టం అంటే - భండారు శ్రీనివాసరావు

ఓసారి ముళ్ళపూడి వారు రాసారు. అదృష్టం అంటే ఎవడో కొన్న లాటరీ టిక్కెట్టును వాడు మన జేబులో పెట్టి మరిచిపోయి వెడితే, దానికి మొదటి బహుమతి తగలడం అని. మనం రూపాయో, అర్ధో పెట్టి టిక్కెట్టు కొంటే లాటరీ తగలడం అదృష్టం కాదని ముళ్ళపూడి వారి చమత్కారం.

అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు హైదరాబాదుకు దూరంగా ఉంటున్న ఓ రాజకీయ నాయకుడికి జిల్లా ఎస్పీ నుంచి ఫోన్ వెళ్ళింది. ఆయన గారు మంచి నిద్రలో వున్నారు.
ఎస్పీ చెప్పారు ఆయనతో. ‘ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఉన్నపాటున హైదరాబాదు వచ్చి కలుసుకోమన్నారు’ అని. వెహికిల్ అవసరం అయితే చెప్పండి అనేది కూడా ఆ ఫోన్ సారాంశం.
ఆయన రెక్కలు కట్టుకుని హైదరాబాదు వెళ్ళారు. అప్పటికే సిద్ధం చేసి వున్న రాజ్యసభ అధికార పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ ప్తరాలపై సంతకం చేశారు.
అంతే! ఆయన ఆరేళ్లు రాజ్యసభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించారు.

ప్రతి ప్రభుత్వానికీ అనుసరణీయం గడప గడపకు కార్యక్రమం - భండారు శ్రీనివాసరావు

 గడప గడపలో నిరసనలు వెల్లువెత్తినా సరే,  గడప గడపకు అనే  కార్యక్రమం చాలా మంచి నిర్ణయం. టీవీ చర్చల్లో వెలువడే విమర్శలకు రాజకీయ రంగు ఉండవచ్చు కానీ ఈ గడప గడపకు కార్యక్రమంలో వెలువడే నిరసన నిఖార్సయినది.  వీటిని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. కొంత రాజకీయం ఉండవచ్చు కానీ అది చాలా స్వల్పం. దీని ద్వారా లభించే ఫీడ్ బాక్  ప్రభుత్వానికి చాలా మేలు చేస్తుంది. ఉపకరిస్తుంది కూడా.  ప్రజలకు కావాల్సినవి ఇస్తున్నామా లేక ప్రజలకు అనవసరమైనవి పంచి పెడుతున్నామా అనేది తెలిసి వస్తుంది. ఏ పధకం ఎలా అమలవుతోంది, ఏ పధకం అమల్లో విఫలం అవుతోంది అనే విషయాలు  వాస్తవ రూపంలో తెలుస్తాయి.  రాజకీయాలకు అతీతంగా  అందరి గడపలకు కూడా వెడితే పాలక పక్షం నేతలకు వాస్తవాలు బోధపడుతాయి.  ప్రజలు తమ సమస్యలను టీవీలకు ఎక్కి అనుదినం  చెప్పుకోలేరు. అలాంటి వారికి ఇది వరప్రసాదం. నిరసన తెలిపినా, నిలదీసినా ఆ హక్కు ప్రజలకే వుంటుంది. ఇలాంటి వాటికి నెగెటివ్ ప్రచారం ఎలాగు వుంటుంది. అయితే పొరబాట్లు  సరిదిద్దుకునే మహత్తర అవకాశం ప్రభుత్వానికి ముందుగా  లభిస్తుంది. నిఘా వర్గాలు కూడా ఇటువంటి గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని అంచనా వేయలేవు. వేసినా అరకొర సమాచారమే ప్రభుత్వానికి చేరుతుంది.  ప్రజల నాడి యధాతధంగా  పట్టుకోవడానికి ప్రభుత్వం చేతిలో ఉన్న ఏకైక కొలమానం ఈ గడప గడపకు కార్యక్రమం. అంతా సజావుగా వుంది అనే భ్రమలు ఏమైనా వుంటే అవి తొలగడానికి ఈ కార్యక్రమం పనికి వస్తుంది.  ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరకు నేతలు పోవడం అనేది ఆ నాయకులకే ప్రయోజనం. ప్రజలు నిరసన తెలిపినా దానిని ఆ స్థాయిలోనే అదుపు చేయడానికి, అది అసహనంగా మారి ఆగ్రహంగా పరిణమించకుండా జాగ్రత్త పడడానికి  నాయకులకు ఇదొక  ఆయుధంగా ఉపయోగపడుతుంది.  నిరసనలకు కారణం ప్రత్యర్థుల ప్రేరేపణ అని ఎదురుదాడికి దిగడం కన్నా వాటిని సానుకూలంగా మార్చుకోవడంలోనే నాయకుల ప్రతిభ, పరిణతి  వెలుగు చూస్తుంది.

తప్పులు దొర్లడం తప్పుకాదు. ఆ తప్పులను దిద్దుకోవడం ఉత్తమ లక్షణం. కాబట్టి ఈ గడప గడపకు కార్యక్రమాన్ని ఏదో తూతూ మంత్రంగా కాకుండా  ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో చేస్తే ఇటు ప్రజలకు మంచిది, అటు ప్రభుత్వానికి మంచిది.

కేంద్రంతో సహా, దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దృష్టిలో తమ స్థానం ఏమిటన్నది తెలుసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోవాలి.

(17-05-2022)

కాటి కాపరిని చూడాలని వుంది - భండారు శ్రీనివాసరావు

 

(ఈరోజు హైపర్ టెన్షన్ డే అంటున్నారు, కాస్త ఉల్లాసం కోసం అంతే)

‘కలం కూలీ’, ప్రముఖ పాత్రికేయులు, కీర్తిశేషులు జి.కృష్ణ గారు గొప్ప వాక్చాతుర్యం కలవారు. అంతేకాదు మంచి సంభాషణాచతురులు కూడా. హైదరాబాదు రాం నగర్ లో ఆయన అద్దెకు వున్న ఇంటికి వెళ్లి ఆయన చెప్పే కబుర్లు వినే వారిలో కేవలం పత్రికల వాళ్ళే కాకుండా విభిన్న వ్యావృత్తులకు చెందిన వాళ్ళు కూడా వుండేవారు. అలా వెళ్ళిన ఓ పెద్దమనిషిని కృష్ణ గారు ఓ కోరిక కోరారు. ఒక మనిషిని చూడాలని వుందని, చూడడమే కాదు అతడితో మాట్లాడాలని వుందని మనసులో మాట బయట పెట్టారు. ఒకపక్క ఇంతమంది కృష్ణ గారిని చూడడానికి వస్తుంటే కృష్ణ గారు చూడాలని అనుకుంటున్నదెవరా అని ఆశ్చర్యపోతుండగా కృష్ణగారు అతడి వివరాలు చెప్పేశారు. అది విని ఆ పెద్దమనిషి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. అతడెవరంటే, బన్సీలాల్ పేట శ్మశానంలో పనిచేసే కాటికాపరి.
కృష్ణ గారి కోరిక తీర్చడం మహద్భాగ్యం అనుకునే ఆ పెద్దమనిషి ఒకటి రెండు రోజుల్లోనే అతడిని వెంటబెట్టుకుని తీసుకువచ్చాడు. ఆ కాటికాపరిని చూడగానే కృష్ణ గారి కళ్ళు వెలిగి పోయాయి. అతడిని ఆప్యాయంగా తన పడక పక్కనే కూర్చోబెట్టుకుని, ‘లచ్చమ్మా!(కృష్ణ గారు భార్యను పిలిచే తీరు) మనవాడు వచ్చాడు, మంచి కాఫీ పట్రా’ అని కేకేసి అతడితో సంభాషణ ప్రారంభించారు.
‘ఇదిగో చూడవయ్యా! (అతడి పేరు గుర్తుకు రావడం లేదు) నువ్వు రోజుకు ఎన్ని శవాలు దహనం చేస్తుంటావు ఏమిటి?’
‘రోజుకు ఇన్ని అనీ లెక్కేమిటుంటాది చెప్పండి. ఎన్నొచ్చినా కాదనకుండా కాలుస్తూ పోవడమే’ అన్నాడా కాటి కాపరి.
‘సరే! నన్ను చూసావు కదా. బక్క పలచగా వున్నాను. కాస్త నొప్పితగలకుండా కాల్చడం కుదురుతుందా?’
‘అన్ని నొప్పులు వొదిలేకే కదా మా దగ్గరకు వచ్చేది. ఆ బాధేమీ వుండదు లెండి.’ అన్నాడతను తాపీగా.
‘అది సరే ఇంత సన్నగా వున్నాకదా కాటిమీద లేచి కూర్చోను కదా’
‘అలా లేస్తే మరో మొద్దు మీద వేస్తా ఫికరు పడకండి’ అన్నాడతను మరింత తాపీగా.
అలా ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ వుంటే వినే వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారు.
(సూతుడు శౌనకాది మునులకు చెప్పగా విని, ఆ విన్నవాళ్ళల్లో ఒకరు చెప్పిన ‘కృష్ణ కధ’)
(ఈరోజు హైపర్ టెన్షన్ డే అంటున్నారు, కాస్త ఉల్లాసం కోసం అంతే)

‘కలం కూలీ’, ప్రముఖ పాత్రికేయులు, కీర్తిశేషులు జి.కృష్ణ గారు గొప్ప వాక్చాతుర్యం కలవారు. అంతేకాదు మంచి సంభాషణాచతురులు కూడా. హైదరాబాదు రాం నగర్ లో ఆయన అద్దెకు వున్న ఇంటికి వెళ్లి ఆయన చెప్పే కబుర్లు వినే వారిలో కేవలం పత్రికల వాళ్ళే కాకుండా విభిన్న వ్యావృత్తులకు చెందిన వాళ్ళు కూడా వుండేవారు. అలా వెళ్ళిన ఓ పెద్దమనిషిని కృష్ణ గారు ఓ కోరిక కోరారు. ఒక మనిషిని చూడాలని వుందని, చూడడమే కాదు అతడితో మాట్లాడాలని వుందని మనసులో మాట బయట పెట్టారు. ఒకపక్క ఇంతమంది కృష్ణ గారిని చూడడానికి వస్తుంటే కృష్ణ గారు చూడాలని అనుకుంటున్నదెవరా అని ఆశ్చర్యపోతుండగా కృష్ణగారు అతడి వివరాలు చెప్పేశారు. అది విని ఆ పెద్దమనిషి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. అతడెవరంటే, బన్సీలాల్ పేట శ్మశానంలో పనిచేసే కాటికాపరి.
కృష్ణ గారి కోరిక తీర్చడం మహద్భాగ్యం అనుకునే ఆ పెద్దమనిషి ఒకటి రెండు రోజుల్లోనే అతడిని వెంటబెట్టుకుని తీసుకువచ్చాడు. ఆ కాటికాపరిని చూడగానే కృష్ణ గారి కళ్ళు వెలిగి పోయాయి. అతడిని ఆప్యాయంగా తన పడక పక్కనే కూర్చోబెట్టుకుని, ‘లచ్చమ్మా!(కృష్ణ గారు భార్యను పిలిచే తీరు) మనవాడు వచ్చాడు, మంచి కాఫీ పట్రా’ అని కేకేసి అతడితో సంభాషణ ప్రారంభించారు.
‘ఇదిగో చూడవయ్యా! (అతడి పేరు గుర్తుకు రావడం లేదు) నువ్వు రోజుకు ఎన్ని శవాలు దహనం చేస్తుంటావు ఏమిటి?’
‘రోజుకు ఇన్ని అనీ లెక్కేమిటుంటాది చెప్పండి. ఎన్నొచ్చినా కాదనకుండా కాలుస్తూ పోవడమే’ అన్నాడా కాటి కాపరి.
‘సరే! నన్ను చూసావు కదా. బక్క పలచగా వున్నాను. కాస్త నొప్పితగలకుండా కాల్చడం కుదురుతుందా?’
‘అన్ని నొప్పులు వొదిలేకే కదా మా దగ్గరకు వచ్చేది. ఆ బాధేమీ వుండదు లెండి.’ అన్నాడతను తాపీగా.
‘అది సరే ఇంత సన్నగా వున్నాకదా కాటిమీద లేచి కూర్చోను కదా’
‘అలా లేస్తే మరో మొద్దు మీద వేస్తా ఫికరు పడకండి’ అన్నాడతను మరింత తాపీగా.
అలా ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ వుంటే వినే వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారు.
(సూతుడు శౌనకాది మునులకు చెప్పగా విని, ఆ విన్నవాళ్ళల్లో ఒకరు చెప్పిన ‘కృష్ణ కధ’)


(రోశయ్య గారితో కరచాలనం చేస్తున్న కృష్ణ. పక్కన పచ్చ చొక్కాలో నేను)



15, మే 2022, ఆదివారం

గురు దక్షిణ – భండారు శ్రీనివాసరావు


స్వాతంత్రానంతరం పంచవర్ష ప్రణాళికల ధర్మమా అని దేశంలో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో కొత్త కొత్త సర్కారు కొలువులు పుట్టుకొచ్చాయి. అప్పటి వరకు గ్రామీణులకు తెలిసిన ఉద్యోగాలు కొన్ని మాత్రమే. తహసీల్దారు, మునసబు, కరణం, పోస్టు మేష్టారు, బడి పంతులు వగైరా.
తరవాత్తరవాత బీడీవో, ఆయన కింద రకరకాల ఎక్స్ టెన్షన్ అధికారులు. పేరులో అధికారి అని వున్నా నిజానికి అవి గుమాస్తా వంటి చిన్న ఉద్యోగాలే. వాటిని తెలుగులో విస్తరణాధికారి అంటున్నారు. అలాంటి వాటిల్లో ఒక దాంట్లో మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు గారు కూడా ఖమ్మం జిల్లాలో చేరాడు. తదనంతర కాలంలో ఆయన స్టేట్ బ్యాంక్ పీవోగా సెలక్ట్ అయి ఆ బ్యాంక్ చీఫ్ జనరల్ గా రిటైర్ అయ్యారు.
గ్రాడ్యుయేషన్ కాగానే మా అన్నయ్య చేసిన ఉద్యోగాల్లో బ్లాక్ ఎస్.ఈ.వొ. ఒకటి. ఆ రోజుల్లో పంచాయతి సమితిని బ్లాక్ అనేవారు. అంతకు ముందే ఒక పెద్ద మనిషి మధిర ప్రాంతం నుంచి కొత్తగూడెం వెళ్లి అక్కడ పంచాయతీ సమితిలో ఇలాంటి ఉద్యోగంలోనే చేరారు. ఆయనే ఈ పోస్టుకు కథానాయకుడు. పేరు చేకూరి కాశయ్య. స్వయం కృషికి మారుపేరు. కొత్తగూడెం సమితిలో పనిచేసింది కొద్ది కాలమే అయినా, అయన పనికట్టుకుని ఊరూరూ తిరిగారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా స్థానికులతో చక్కటి పరిచయాలు పెంచుకున్నారు. స్వతహాగా నలుగురితో కలిసిమెలిసి తిరిగే మనస్తత్వం కావడం వల్ల అతి త్వరగా అన్ని గ్రామాల్లో కాశయ్య గారి పేరు తెలవని వాళ్ళు అంటూ లేకుండా పోయారు.
ఇంతలో పంచాయతీ సమితి ఎన్నికలు వచ్చాయి. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి సమితి ప్రెసిడెంట్ కాగలిగారు. ఇది కేవలం ఆయన స్వయం కృషి.
ఆ రోజుల్లో విల్లీస్ జీపులు ఉండేవి. జిల్లా మొత్తంలో కొద్ది మంది అధికారులకే వాహన యోగం. వారిలో ఒకరు డీ.పీ.ఆర్.వొ. కాకపొతే ఉద్యోగ అవసరాల దృష్ట్యా జీపు బదులు పెద్ద వ్యాన్ వుండేది. (మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారి కెరీర్ ఈ ఉద్యోగంతోనే మొదలయింది. తదనంతర కాలంలో అదే శాఖకు అంటే సమాచార, పౌర సంబంద శాఖకు డైరెక్టర్ అయ్యారు) మరొకరు బ్లాక్ డెవలప్ మెంటు ఆఫీసర్ (బీ.డి.వొ). ఆయన దౌరాకు బయలుదేరి జీపు ఎక్కగానే బిలబిల మంటూ కింది ఉద్యోగులు జీపు వెనక సీట్లలో సర్దుకు కూర్చొనే వారు.
అప్పటిదాకా కాశయ్య గారు కూడా అలా ఎగబడి తోసుకుని వెనక సీట్లో ఇరుక్కుని కూర్చుని ప్రయాణాలు చేసిన వారే. కానీ ఆయన ఇప్పుడు సమితి ప్రెసిడెంటు. ఆ హోదాలో ఆయన సీటు ముందుకు మారింది. ఆయన ఎంత నిరాడంబరజీవి అంటే ఇటువంటి విశేషాలన్నీ ఆయనే తన సహచరులతో పంచుకునేవారు.
ఇక తర్వాత జిల్లా మొత్తానికి జిల్లా పరిషద్ చైర్మన్ అయ్యారు. తర్వాత ఎమ్మెల్యే. ఇలా అనేక మెట్లు ఎక్కినా ఆయన తన మూలాలని మరచిపోలేదు. తనతో కలిసి పనిచేసిన, లేదా తనకు పరిచయం వున్న ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకునేవారు. మనిషి మొహం చూసి బాగున్నారా అని పలకరించడం కాకుండా పేరు పెట్టి పిలిచి మరీ ఆత్మీయత చూపేవారు.
ఉద్యోగ పర్వంలో అనేక ప్రాంతాలు తిరుగుతూ చెన్నై స్టేట్ బ్యాంక్ సీ జీ ఎం గా వెళ్ళిన మా అన్నయ్య ఒకసారి ఓ వివాహ వేడుక కోసం ఖమ్మం వచ్చారు. ఆ సమయంలో రైల్వే ప్లాటు ఫారం మీద కాశయ్య గారు కనబడ్డారు. ఆయన గబగబా దగ్గరకు వచ్చి ఏం రామచంద్ర రావు గారు, ఎలా వున్నారు, ఇప్పుడు మద్రాసులో ఉన్నారట కదా!’ అని పలకరించేసరికి మా అన్నయ్య ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. పేరు గుర్తు ఉండడమే కాదు, తాను ప్రస్తుతం ఏ వూళ్ళో వున్నది తెలిసింది అంటే తన పరిచయస్తులను గురించి ఆయన కనుక్కుంటూ ఉంటారని ఆయనకు అర్ధం అయింది. ఉన్నత స్థానాలకు ఎదిగిన మనుషుల్లో ఇది చాలా అరుదనేది మా అన్నయ్య అభిప్రాయం.
కొన్నేళ్ళ క్రితం ఖమ్మం వెళ్ళాను, డాక్టర్ ఏ.పీ. రంగారావు గారెతో కలిసి 104 పని మీద. ఖమ్మం వచ్చాము కదా అని ఫోన్ చేస్తే కాశయ్య గారు వెంటనే మేమున్న గెస్ట్ హౌస్ కు వచ్చారు. మమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్లి, ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్డు అంటారేమో, దాన్ని దాటి వెళ్లి, నిర్మాణంలో వున్న గురు దక్షిణ ప్రాంగణాన్ని చూపించారు. చాలా విశాలంగా చాలా బాగా నిర్మిస్తున్నారు. అక్షరం ముక్క నేర్పి సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చి దిద్దిన గురువులకు దక్షిణగా వారి శేష జీవితం సుఖ ప్రదంగా వుండడం కోసం కాశయ్య గారు తలపెట్టిన బృహత్ పధకం అది.
ఆ వయసులో కూడా ఆయన పడుతున్న తపన, శ్రద్ధ చూస్తే ముచ్చటేసింది.
స్వయం కృషితో తాను అనుకున్నది సాధించి, ఎన్ని ఎత్తులకు ఎదిగి కూడా పాదాలను ఆన్చిన తల్లి నేలను మాత్రం మరచిపోని కాశయ్య గారికి ఆయన ప్ధధమ వర్ధంతి సందర్భంగా నివాళి



మనమే దేవుడి సమస్య – భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha on 15-05-2022, SUNDAY today)

దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.

వున్నాడని నమ్మేవాళ్ళంటారు.

దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు.

దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు.

వీరుకాక మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా దేవుడ్ని పూర్తిగా నమ్మేవారు రెండో రకం. వీరు కూడా భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని వుంచుకుంటారు. కానీ, నమ్మకం లేని ఆ భగవంతుడూ నమ్మని వీళ్ళను కనుక్కోడు. నమ్మిన ఆ దేవుడూ నమ్మేవాళ్లను పట్టించుకోడు. హీనపక్షం టీవీ ఛానళ్ళ కూడా వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటె వారి రేటింగులకు కావాల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడికోసం పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.

దేవుడున్నాడో లేదో తెలియదు కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు.

తొక్కితే రాయి, మొక్కితే సాయి. అంతా నమ్మకం.

దేవుడ్ని నమ్మడం ఎంత నమ్మకమో నమ్మకపోవడం కూడా అంతే నమ్మకమని నా నమ్మకం.

దేవుడు పేరు చెప్పి మోసం చేయడం ఎంత ద్రోహమో దేవుడు లేడంటూ పనికిమాలిన చర్చలు లేవదీయడం కూడా అంతే దారుణం. ఎందుకంటె దేవుడనే వాడు నా దృష్టిలో వ్యక్తిగతం. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు వారు నాస్తికులయినా సరే భగవంతుడనే సర్వ శక్తిమంతుడు మరొకడు వుండేవుంటాడని అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు ‘కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.

దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ)

నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటాన’ని ఎంత మొత్తుకున్నా వినేదెవరు?

చెట్టులో,పుట్టలో అంతటా నేనే’ అన్నా విన్నదెవరు? చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారు.

మా చిన్నప్పుడు వంటింట్లో గోడమీద ఎర్రగా ఓ చదరంలో వేంకటేశ్వర స్వామి నామాలు వుండేవి. అదే అందరికీ పూజాగృహం. స్నానం చేసిన తరువాత అక్కడ నిలబడి ఓ దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడో! ‘పూజ రూమ్ వుందా?’ అన్నది ఫ్లాట్ కొనేముందు అడిగే మొదటి ప్రశ్న.

పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత, ఇలా ఏదో ఒక పేరుతొ  అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!

దేవుడ్ని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని తమవరకే పరిమితం చేసుకోవాలి.

నమ్మని వాళ్లు అదేదో అంతర్జాతీయ సమస్య అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు. బాధాసర్పద్రష్టులను ఉద్దరించడానికి ఇంకా సవాలక్ష మార్గాలున్నాయి. దేవుడ్ని నమ్మేవారిని వారి మానానికి వొదిలేసి తమ పని తాము చూసుకుంటే సగం వాతావరణ (శబ్ద) కాలుష్యం తగ్గిపోతుంది.

సమాజం ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు ఎన్నో వున్నాయి. వాటి ముందు దేవుడు ఒక సమస్యే కాదు. నిజానికి మనమే ఆయనకు సమస్య.

14, మే 2022, శనివారం

పునరావృతం కానివ్వం – భండారు శ్రీనివాసరావు

 గుంటూరు ప్రభుత్వ వైద్య శాలలో ఆరేండ్ల చిన్నారి ఆరాధ్య  వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకుందని ఆ అమ్మాయి తలితండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన చాలా దురదృష్టం పునరావృతం కానివ్వం అనే ప్రకటనలు వెలువడ్డాయో లేదో తెలియదు.

ఈ నేపధ్యంలో 2015లో అదే ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఓ దుర్ఘటన గుర్తుకు వస్తోంది.

సాధారణంగా న్యాయస్థానాలు భావోద్వేగాలకు అతీతంగా తామరాకుమీది నీటి బొట్టు మాదిరిగా వ్యవహరిస్తాయి. అయితే మానవ హక్కుల కమిషన్ ఒక కేసు విషయంలో వెలువరించిన అభిప్రాయాలు, వ్యక్తపరచిన విధానం ఆ కేసులోని తీవ్రతను తేటతెల్లం చేస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పసికందును ఎలుకలు కొరికి చంపిన దారుణ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కమిషన్ జారీ చేసిన ఆదేశాల్లో ఉపయోగించిన పదజాలం తెలుపుతోంది. మామూలుగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కమిషన్ స్పందించి, సంబంధిత అధికారులకు జారీ చేసే ఆదేశాలు, ఇంగ్లీష్ భాషలో, ఒక నిర్దిష్ట పద్దతిలో, ఒక రకంగా చెప్పాలంటే పడికట్టు పదాలతో, ఒకే మూసలో వున్నట్టు కానవస్తాయి. కానీ గుంటూరు సంఘటన విషయంలో మానవ హక్కుల కమిషన్ స్పందించిన తీరు, ఈ సాంప్రదాయక విధానానికి భిన్నంగా వుంది. ఈ సారి కమిషన్ ఆదేశాలు సరళమైన తెలుగులో, ఉద్వేగ పూరిత భావజాలంతో, అదీ చేతిరాతతో వెలువడ్డాయి.

నిర్లక్ష్యం కమ్ముకున్న ఈ వ్యవస్థలో ..ఆ తల్లికి బిడ్డను తెచ్చి ఇవ్వగలమా? దీనికి బాధ్యులు ఎవ్వరు ?’ అని కమి షన్ ప్రశ్నించింది. వైద్యులను ప్రాణదాతలుగా కొలిచే సమాజంలో వాళ్ళు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటని చీవాట్లు వేసింది. అంతేకాదు, పసికందును ఎలుకలు పీక్కు తిన్నాయని తెలిసినప్పుడు నిర్ఘాంతపోయిన యావత్ సభ్య సమాజం మాదిరిగానే మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయిందన్న విషయం ఆదేశాల్లో పొందుపరచిన అతిలోతయిన భావాలు చదివితే అర్ధం అవుతుంది.

అమ్మా! నేను ప్రపంచంలోకి వస్తున్నా! నాకు భావి పౌరుడిగా ఎదగాలని వుంది. ఎందుకమ్మా నన్ను ఈ ఆసుపత్రికి తీసుకువచ్చావ్?’ అని ఎలుకలు తన మీద దాడి చేస్తున్నప్పుడు ఆ శిశువు యెంత మూగవేదన అనుభవించి వుంటుందో’ అంటూ కమిషన్ అచ్చ తెలుగులో వ్యక్తపరచిన భావాలు సమస్య తీవ్రత పట్ల ఎంతగా కమిషన్ స్పందించి వుంటుందో అనే వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నాయి.

మనిషిని మనిషి కాటేసే సంఘంలో తామేమీ తీసిపోమని చాటిచెప్పేలా గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు ఆ పసి కందుపై దాడిచేశాయి. అవి కొరుకుతుంటే ఆ పసి ప్రాణం ఎంతగా విలవిలలాడిపోయిందో. ఈ ఘటన మన భాషకు, భావాలకు అందనంత హృదయ విదారకమైనది’ అంటూ కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొన్నది.

దవాఖనాలు దెయ్యాల ఖానాల మాదిరిగా మారిపోయి పసివాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కలు పసికందుల్ని పీక్కుతిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ఎలా సరిదిద్దుతాం ?’ అన్నది కమిషన్ సంధించిన ప్రశ్న.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందును ఎలుకలు అత్యంత పాశవికంగా కొరుక్కు తినడం వల్ల ఆ శిశువు మరణించిన వార్తపై విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్ తనకు తానుగా సంకల్పించి సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

కమిషన్ స్వయంగా పేర్కొన్నట్టు ఆ పసికందు ప్రాణాలు తిరిగి తేవడం అసాధ్యం. కానీ ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సింది ఏమిటన్నది ప్రధాన ప్రశ్న.

ఆ రోజుల్లో పత్రికలు ఈ దుర్ఘటనపై  పుంఖానుపుంఖాలుగా కధనాలు రాశాయి. మీడియా  గగ్గోలు పెట్టింది.

ఇది జరిగి ఏడేళ్లు దాటుతోంది. ఇన్నేళ్ళుగా ఆ కన్నతల్లి కడుపుకోత గురించి కానీ, ఆ శిశువు కుటుంబం పడ్డ వేదన గురించి కానీ ఎవరూ పట్టించుకున్న దాఖలా లేదు.

గుంటూరు ఆసుపత్రి సంఘటనపై జరిగిన విచారణ ఫలితం ఏమిటన్నది ఎవరికీ పట్టదు. కొన్నాల్తికే జనమే ఈ విషయం మరచిపోతారు. ఎలకలు కొరుక్కు తిన్న ఆ పసిపాప చిట్ట చివరి దైన్యపు చూపు నేతల జ్ఞాపకాల్లో రూపుమాసిపోతుంది. కడుపుకోతతో విలవిలల్లాడే ఆ మాతృమూర్తి వేదన అరణ్య రోదనే అవుతుంది.

ఇటువంటి సంఘటనలు పునరావృతం కావంటూ నాయకులు చెప్పే హామీలు మాత్రం పునరావృతం అవుతూనే వుంటాయి. ఇదొక విష చక్ర భ్రమణం. ఈ భ్రమణంలో చోటుచేసుకున్న మరో విషాదమే చిన్నారి ఆరాధ్య మరణం.

తోకటపా:

సంఘ విద్రోహ, ఆరాచక శక్తుల్లో ఎక్కడా కానరాని అవగాహన వుంటుంది. ఒకరినొకరు కాపాడుకోవడం, ఆపదలో పడ్డప్పుడు ‘సర్ప మూషిక న్యాయాన్ని’ పాటించడం వాటికి వెన్నతో పెట్టిన విద్య. అయితే వాటి నడుమ ఈ దోస్తీ కొంత మేరకు మాత్రమే. ఒక స్థాయి వరకే.

ఒక పాము, ఒక ఎలుక సమయం కలిసిరాక ఒకే బుట్టలో ఇరుక్కుపోయాయి. పాముకు ఎలక ఆహారం. తినేస్తే ఒక పనయిపోతుంది. కానీ బుట్ట నుంచి బయట పడక పొతే అంతే సంగతులు. అంచేత ఆ పాము యుక్తిగా ఎలకకు ఓ సలహా చెబుతుంది. తన పొడ గమనించి ప్రాణభయంతో గడగడలాడిపోతున్న ఎలకకు హామీ ఇస్తుంది. ‘నావల్ల నీకు ఎలాటి ప్రమాదం వుండదు. ముందు నీ దంతాలతో ఈ బుట్టకు ఓ రంధ్రం చెయ్యి. ఇద్దరం తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుందాం’

ఎలక బతుకు జీవుడా అనుకుంటూ బుట్టకు రంధ్రం చేస్తుంది. వెంటనే పాము ఆ ఎలకని ఎంచక్కా నమిలి మింగేసి, తరువాత ఎలక చేసిన ఆ రంధ్రం ద్వారా బయట పడుతుంది.

ఈ సర్ప మూషిక న్యాయం ప్రకారం పరస్పర ఆధారిత స్వార్ధపర శక్తులు ఒకమేరకు తమలో తాము సహకరించుకుంటాయి. ఒక స్థాయికి చేరిన తరువాత తమ స్వార్ధానికి, తమ స్వప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. సామాన్యులు మాత్రం ఇందులో శలభాలుగా మారతారు.

(14-05-2022)