20, సెప్టెంబర్ 2021, సోమవారం

చీరే మేరే సప్నే - భండారు శ్రీనివాసరావు

 

నా నలభయ్ ఎనిమిదేళ్ళ వైవాహిక జీవితంలో రెండే రెండు సార్లు మా ఆవిడకు చీరెలు కొన్న సందర్భాలు వున్నాయి. అంటే ఇన్నేళ్ళుగా ఆవిడ ఆ రెండు చీరెలతోనే నెట్టుకొచ్చిందని అర్ధం కాదు. నేను మళ్ళీ ఎప్పుడూ కొనలేదని మాత్రమే దీని తాత్పర్యం. ఆ రెండు సందర్భాలు బాగా గుర్తుండి పోవడానికి కూడా కారణాలు వున్నాయి.

చాలా ఏళ్ళక్రితం ఒక బ్యాంకు తాలూకు మనిషి పనికట్టుకుని మరీ మా ఆఫీసుకువచ్చి వివరాలు అడిగి తీసుకుని పోస్టులో ఓ క్రెడిట్ కార్డు పంపించాడు. క్రెడిట్ కార్డులు అప్పుడే రంగ ప్రవేశం చేస్తున్న రోజులవి. అది నా గొప్పదనం అనుకున్నాకాని, నేను చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంటు నౌఖరీ కాబట్టి ఆ బ్యాంకు అంత ఉదారంగా ఆ కార్డు మంజూరు చేసిందన్న వాస్తవం అప్పట్లో నాకు బోధపడలేదు.

కార్డు చేతికి వచ్చింది కానీ దాన్ని వాడి చూసే అవకాశం మాత్రం వెంటనే నాకు రాలేదు. అప్పట్లో ఇప్పట్లా ఏటీఎం లు లేవు. ఏదయినా వస్తువు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కార్డు వాడే వీలుండేది. ఓసారి బెజవాడ టూర్ వెళ్ళినప్పుడు మా ఆవిడకోసం బీసెంటు రోడ్డు షాపులో అయిదారొందలు పెట్టి, ఆ క్రెడిట్ కార్డు వాడి, ఓ చీరె కొన్నాను. అంత వరకు బాగానే వుంది. మరుసటి నెల నుంచీ ఆ బ్యాంకు తాఖీదులు రావడం, ఆ కిస్తీ కట్టే బ్యాంకు ఎక్కడో సికిందరాబాదులో వుండడం, అంతంత దూరాలు పోయి ఓ వందో, యాభయ్యో చెల్లు వేసి రావడానికి సహజ బద్ధకం అడ్డం రావడం ఇత్యాది కారణాలతో నాకూ ఆ బ్యాంకుకూ నడుమ సంబంధ బాంధవ్యాలు పూర్తిగా చెడిపోయాయి. చీరె తాలూకు అప్పు మొత్తం వడ్డీలతో పేరుకు పోయి, అయిదారువేలకు చేరడం, చివరికి ఆఫీసులో పీఎఫ్ అడ్వాన్సు తీసుకుని ఆ అప్పు తీర్చి కార్డు ఒదిలించుకోవడం ఓ వ్యధాభరిత అధ్యాయం. అయిదారువందల నెల జీతగాడ్ని, పెళ్ళానికి అయిదారువేల రూపాయల (అసలు వడ్డీలతో కలిపి) చీరె కొనగలిగానన్న తృప్తితో ఆ మొదటి చీరె అంకం అలా ముగిసిపోయింది.

అలాగే మరోసారి ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్లి, తిరిగి వచ్చే రోజు పాలికా బజారులో నచ్చిన చీరె సెలక్టు చేసి, వచ్చీరాని హిందీలో, గీసి గీసి బేరం చేస్తున్న సమయంలో అప్పటివరకు శుద్ధ హిందూస్తానీలో మాట్లాడుతున్న షాపు వాడు అచ్చ తెలుగులోకి తిరిగిపోయి ‘అందరికీ నూట ఇరవై, మీకొక్కరికే అరవై సాబ్’ అంటూ నన్ను మారుమాట్లాడనివ్వకుండా మొహమాట పెట్టి ఆ చీరె పొట్లం చేతిలో పెట్టాడు. హైదరాబాదు వచ్చిన తరువాత ఎందుకయినా మంచిదని యాభయ్ రూపాయలకే కొన్నట్టు ఫోజు పెట్టి నా ప్రయోజకత్వాన్ని ప్రదర్శించాను. చీరె రేటు చెబుతున్నప్పుడు మా ఆవిడ ‘అలాగా’ అంటూ చిన్నగా నవ్వుకున్న సంగతి గమనించలేకపోయాను. తరువాత ఇరుగు పొరుగు ఆడంగుల మాటలు చెవిన పడ్డప్పుడు కానీ అసలు విషయం బోధపడలేదు. అదేమిటంటే అరవై రూపాయలకు నేను కొన్న చీరె లాంటిది, మూడు నెలసరి వాయిదాలలో నలభయ్ రూపాయలకే అమ్మే షాపులు చిక్కడపల్లిలో అయిదారు వున్నాయట.

దాంతో బోధి చెట్టుతో అవసరం లేకుండానే తత్వం తలకెక్కింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆవిడకు చీరె కొనే ప్రయత్నం మళ్ళీ చేయలేదు.

(కింది ఫోటో:   తుర్లపాటి హనుమంతరావు బావగారి శత జయంతికి వచ్చిన దంపతులను ఇలా సింహాసనాల మీద కూర్చోబెట్టి  తీర్చుకున్న ముచ్చట)



ఆడవాళ్ళూ! శతకోటి దణ్ణాలు ! ( ఈ ఒక్కరోజే సుమా!)

 నెల అంటే ముప్పయి రోజులు అని సెలవిచ్చాడు గతంలో హైదరాబాదు వచ్చిన ఓ కేంద్ర మంత్రి. ప్రస్తుతం మాజీ అనుకోండి. అల్లాగే ఏడాదికి అక్షరాలా మూడువందల అరవై అయిదు రోజులు అంటే కాదు కాదు ఇంకా ఎక్కువే అంటున్నారు కొందరు. ఆ సంఖ్య ఎల్లాగూ మారదు కాబట్టి ఒక్కో రోజుకూ రెండో మూడో పేర్లు తగిలించేస్తున్నారు ఈ మధ్య ఆ మరికొందరు. ఆ లెక్కన ఇవ్వాళ అంటే సెప్టెంబరు ఇరవయ్యో తేదీని ‘భార్యల్ని ప్రశంసించే రోజు’ పొమ్మన్నారు.

‘ఈ ఒక్క రోజూ కట్టుకున్న ఇల్లాలిని మాటల్తో పొగిడి, మిగిలిన మూడువందల అరవై నాలుగు రోజులూ షరా మామూలుగా అష్టోత్తరాలతో వేధిస్తే పోలా’ అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. ‘ఆ మాత్రం దానికి ఈ ఒక్క రోజూ మొగుడితో పొగిడించుకుని, ఏడాది పొడుగునా అనరాని మాటలు పడుతూ వుండడం ఏమంత భాగ్యం’ అని ముక్కు చీత్తూ మధన పడే మగువలకూ తక్కువలేదు. ఇది ఇక్కడ ఒదిలి అసలు ఈ ‘కొత్త రోజు ‘కధాకమామిషూ’ ఏంటో చూద్దాం.

ఉన్నట్టుండి దిగబడ్డ ఈ భార్యల ప్రశంసాదినోత్సవ ప్రచార బాధ్యతను కొన్నేళ్ళ క్రితం తన భుజాలకు ఎత్తుకుంది. అప్పటివరకు ఇలాంటి దినం ఒకటి వుందని కూడా ఎవరికీ  తెలియదు. ఆ ప్రచార పర్వంలో భాగంగా ఆ పత్రిక  ఓ వ్యాసాన్ని ముద్రించి జనాల మీదకు వదిలింది. మక్కికి మక్కి కాకుండా తెలుగులో సాగదీస్తే అది ఇలా సాగుతుంది.

హల్లో! ఎలా వున్నావు. మీ ఆవిడ ఎలా వుంది?’

మా ఆవిడా! ఓకేరా!’

ఏమిటీ జస్ట్ ఓకేనా! అంతేనా!’

‘..........’

చాలా ఆశ్చర్యంగా వుందే! ఆవిడ అంటే ఎవరనుకున్నావు. నీ అర్ధాంగి. మీ ఇంటి దీపం. ఉదయం అందరికంటే ఇంట్లో ముందు నిద్ర లేచేది ఆవిడే. ఇంట్లో అందరూ నిద్ర మంచం ఎక్కిన తరువాత అన్నీ సర్దుకుని నిద్రపోయే మనిషి కూడా ఆవిడే! నువ్వు తొడుక్కునే చొక్కా సైజు కూడా నీకు తెలవదు. ఆవిడ కొంటే తప్ప నీకు దిక్కులేదు. పిల్లలు ఏం తింటారో తెలవదు. వాళ్ళ పుట్టిన రోజులు కూడా నీకు జ్ఞాపకం వుండవు. అన్నీ కంప్యూటర్ లాగా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా ఆవిడే తేవాలి. పోపులడబ్బా ఎక్కడుందో కూడా నీకు తెలవదు. సరుకులు ఉన్నాయా నిండుకున్నాయా జవాబు చెప్పమంటే నీకు పడేవి నిండు సున్నా మార్కులే. ఈ విషయంలో ఆవిడని మించిన ఇన్వెంటరీ ఉంటుందా చెప్పు. చెప్పు అంటే జ్ఞాపకం వచ్చింది. ఆవిడ వెంట వుండి కొనిపెట్టకపొతే నీ చెప్పు సైజు కూడా నీకు తెలవదు. పిల్లల స్కూలెక్కడో, వాళ్ళేం చదువుతున్నారో, అసలు చదువుతున్నారో లేదో మీ ఆవిడ చెబితే కానీ తెలవదు. నీకు  సినిమా ఇష్టమో, ఏ కూర ఎలా చేస్తే నువ్వు ఎంతగా  ఇష్టపడతావో ఆవిడకు తెలిసినంతగా నీకు బొత్తిగా తెలవదు. అల్లాంటి మనిషి ఎల్లా వుందంటే సింపుల్ గా ‘ఓకే’ అంటావా! అడిగేవాడు లేక. ఆయ్!!’ అంటూ ఫోనులో గయ్యిమని లేచాడు.

కాబట్టి మొగుడు మిత్రాస్! (ఏవిటో నాకూ సోషల్ నెట్ వర్క్ భాష పట్టుబడుతోంది). ఒక్క రోజే కదా! మీరు మీరు కాదనుకుని, మీ ఆవిడ మీ ఆవిడే అనుకుని ఎంచక్కా నాలుగు మంచి మాటలు ఆవిడతో మాట్లాడండి. ఈరోజు ఆవిడ చేత  వంట చేయించకుండా ఏదైనా హోటల్ కు తీసుకువెళ్ళి, ‘ఛా! ఈ కూరా ఒక కూరేనా, నువ్వు వండితే ఆ రుచే వేరు’ అంటూ కాకమ్మ కబుర్లు కమ్మగా చెప్పండి. ఆడవాళ్ళు నమ్ముతారని నమ్మకం నాకయితే లేదు కానీ, ఆడవాళ్ళ గురించి నాకో బలమైన నమ్మకం వుంది. వాళ్ళు అల్ప సంతోషులు. కనీసం మిమ్మల్ని నమ్మించడం కోసమైనా వాళ్ళు మీ మాటలు నమ్మినట్టు కనిపిస్తారు.

ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు నాలుగు మాటలు తప్ప.

 (ఆపత్రిక అంటే అప్పుడు రాసింది కానీ ఇప్పటికీ సెప్టెంబరు ఇరవయ్యో తేదీని భార్యల ప్రశంసా దినోత్సవంగా పాటిస్తున్నారో లేదో నాకు తెలవదు)



19, సెప్టెంబర్ 2021, ఆదివారం

టీటీడీ కొత్త కమిటీ – భండారు శ్రీనివాసరావు

రాజకీయ పార్టీలు రాజకీయ నిర్ణయాలే తీసుకుంటాయని గతంలో ఓ తలపండిన రాజకీయవేత్త చెప్పారు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో సాగే ఏ ప్రభుత్వమైనా రాజకీయ నిర్ణయాలకే పెద్ద పీట వేస్తుంది. ఇది నిర్వివాదాంశం. కాకపొతే, కొందరు మాంసం తింటున్నామని ఎముకలు మెళ్ళో వేసుకోరు, కొందరికి ఆ పట్టింపు కూడా వుండదు.

కాబట్టి, టీటీడీ కొత్త జంబో బోర్డు నిర్ణయం కూడా అదే బాపతు అనుకోవాలి.
రాజకీయ పార్టీలే కాదు బ్యూరోక్రాట్లు కూడా అవసరాలకు (ఇక్కడ తమ అవసరాలకు తగ్గట్టుగా అని అర్ధం) హోదాలు పెంచుకుంటూ పోయిన సందర్భాలు వున్నాయి. ఆ నిర్ణయాలు ప్రభుత్వానివి అని సమర్థించుకుంటే చేసేది ఏమీ లేదు. రాజకీయ నాయకుల్ని కనీసం అయిదేళ్లకోసారి మార్చే వెసులుబాటు అన్నా వుంది.
పూర్వం అంటే 1970 ప్రాంతాల్లో మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి కలిపి, నంబియార్ అని ఒకే ఒక పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ వుండేవారు. ఇప్పుడు ఎంతమంది వున్నారు అంటే చప్పున చెప్పలేము. అప్పుడు డీజీ అనే పోస్టే లేదు. మరి ఇప్పుడో. అలాగే చీఫ్ సెక్రెటరీ హోదా కలిగిన వాళ్ళ సంఖ్య ఎంత పెరిగిందో కూడా చెప్పలేము.
గతంలో అంటే నలభయ్ ఏళ్ళ క్రితం ఆరణాల కూలీగా ప్రసిద్ధి చెందిన టి. అంజయ్య గారు తన మంత్రివర్గాన్ని అరవై మందితో విస్తరించినప్పుడు ఇలాగే నొసళ్ళు నొక్కుకున్నారు. జంబో మంత్రివర్గం అంటూ పత్రికలు ఎద్దేవా చేసాయి. అసమ్మతి వర్గం ఈ అంశాన్ని అధిష్టానం దగ్గర తమకు అనుకూలంగా మార్చుకుని అంజయ్య గారు దిగిపోయేదాకా నిద్ర పోలేదు. సరే. ఆయన నిష్క్రమణకు రాజీవ్ గాంధి వ్యవహార శైలి కూడా దోహదం చేసింది అనుకోండి.
ముఖ్యమంత్రి అంజయ్యకు భోలా మనిషి అనే పేరు. ఏదీ కడుపులో దాచుకునే రకం కాదు. ఆయనే స్వయంగా నాతొ అన్నమాటలు ఇవి.
“చూసావా శ్రీనివాసూ. ఒక జిల్లాలో ఇద్దరు ముగ్గురు ఐ.ఏ.ఎస్. అధికారులు ఉండవచ్చు. కానీ ఒక జిల్లాలో ఇద్దరు మంత్రులు వుండకూడదు అంటున్నారు. ఇదెక్కడి న్యాయం”
రాజకీయాల్లో న్యాయం ప్రసక్తి ఏముంటుంది?
ఇక టీటీడీ విషయానికి వస్తే,
ఆ జంబో బోర్డు సభ్యులకు ఓ విజ్ఞప్తి.
“మీ మొట్టమొదటి సమావేశంలోనే ఓ తీర్మానం చేయండి. మీ మీద వచ్చిన నీలాపనిందలు అన్నీ తొలగిపోతాయి.
“మేము సభ్యులుగా వుండగా మా చుట్టపక్కాలకు కానీ, అనుచర వర్గాలకు కానీ, స్వామి దర్శనం కోసం సిఫారసు లేఖలు ఇచ్చే అధికారాన్ని స్వచ్చందంగా వదులుకుంటున్నాము. మా పరిధిని కేవలం దేవస్థానం అభివృద్ధికి, యాత్రీకుల సేవల అభివృద్ధికి మాత్రమే పరిమితం చేసుకుని వ్యవహరిస్తాము”
ఆ చేత్తోనే మరో తీర్మానం చేసి పుణ్యం కట్టుకోండి.
“దేవాలయ పరిసరాల్లో టీవీ కెమెరాలను అనుమతించం. రాష్ట్రపతి వంటి పెద్దలు వస్తే ఎలాగూ ఎస్వీ ఛానల్ చూసుకుంటుంది.”



NOTE: Courtesy Image Owner

(19-09-2021)

సోషల్ మీడియా పౌరులకు ఓ విజ్ఞప్తి

 కల్లోల కడలిలో పడవ ప్రయాణం

సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణ వంటి ప్రయత్నం చేయడం నిజంగా కత్తి మీది సామే. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో. ఎందుకంటే జుకర్ బర్గ్ సృష్టించిన  ఈ కృత్రిమ సమాజం, బయట మనం జీవిస్తున్న సమాజం కంటే వేయి రెట్లు ఎక్కువగా విభజితమై వుంది, పార్టీల వారీగా, నాయకుల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా. ఆఖరికి దేవుళ్లవారీగా.

నేను ఈ ఈ మీడియాలో రాయడం మొదలు పెట్టి ఏళ్ళు గడిచాయి. మొదట్లో ఏ అంశంపై అభిప్రాయం రాయాలన్నా ఎలాటి ఇబ్బంది వుండేది కాదు. ఇప్పుడలా కాదు, నచ్చని అభిప్రాయాన్ని ఖండఖండాలుగా ఖండించడం నిత్యకృత్యమై పోయింది. దీన్ని కూడా  తప్పు పట్టాల్సిన పనిలేదు. అందరి అభిప్రాయాలు ఒకే మాదిరిగా వుండాలని రూలేమీ లేదు.

ఎవరైనా రాసిన దానిలో కొన్ని విషయాలు మనం మనసులో అనుకునే వాటికి దగ్గరగా ఉండవచ్చు. మరి కొన్ని నచ్చనవి ఉండవచ్చు. ఒక కుటుంబంలోని వారే అనేక విషయాల్లో విభిన్నంగా ఆలోచిస్తూ వుంటారు. వ్యక్తిగతమైన అభిరుచులు, రాజకీయపరమైన  ఆలోచనలు వేర్వేరుగా వుండే అవకాశాలు మెండుగా  వుంటాయి. అక్కడ సర్దుకుపోయే మనుషులు ఇక్కడ అందుకు విముఖత చూపుతారు. అదేమి చిత్రమో!

నా అభిప్రాయాలతో పొసగని వ్యాఖ్యలను కూడా ఆహ్వానిస్తాను. కొన్నిసార్లు తెలిసో తెలియకో చేసే పొరబాట్లు దిద్దుకోవడానికి కూడా ఈ మీడియా చక్కని అవకాశం ఇస్తోంది. అది ఒక కారణం.

ఈ సందర్భంలో నాదొక మనవి.

నా వ్యాసాలతో విబేధించే విభిన్న వ్యాఖ్యలకు కూడా నేను లైక్ కొడతాను. వీలయితే, అదీ అవసరం అనుకుంటే ఓ చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలా కాకుండా, తమకు పొసగని వ్యక్తుల ప్రస్తావన వచ్చిన సందర్భాలలో కొందరు వారిని ఉద్దేశించి వాడు, వీడు అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటారు. వాటిని నేను పట్టించుకోను అనడానికి ఒకటే సంకేతం. అదేమిటంటే, ఆ వ్యాఖ్యలకు నానుంచి ఎలాంటి స్పందనా వుండదు. కనీసం చూసినట్టు లైక్ కూడా వుండదు.

ఒక పక్క రాజకీయ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు చేస్తాము. మరి ఆ చేత్తోనే ఇలాంటి మాటలు రాస్తే వారిని విమర్శించే హక్కు మనం కోల్పోయినట్టే కదా!

సద్విమర్శకు, ఉడుకుమోతు వ్యాఖ్యలకు ఉన్న తేడా గమనించి మసలుకుంటే అపార్థాల సీన్లు రావు.

ప్రసిద్ధ సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, ‘అప్పుడు - ఇప్పుడు’ అనే పేరుతొ, కీర్తిశేషులు, ప్రముఖ పత్రికా రచయిత శ్రీ జీ. కృష్ణ రచించిన గ్రంధానికి ముందుమాట రాస్తూ, ఒకానొక సందర్భంలో కృష్ణ గారు నుడివిన వ్యాఖ్యను అందులో ఇలా ప్రస్తావించారు.
“ స్వాతంత్ర్యానంతరం మన రాజకీయ నాయకులు నేర్చుకున్నదేమిటి? కృష్ణగారు అంటారు – ‘రెండే రెండు విద్యలు. ఒకటి గుడ్డిగా పొగడడం, రెండు గుడ్డిగా వ్యతిరేకించడం’.

ఇప్పుడది కాఫీ డికాక్షన్ లాగా ఈ వేదికలోకి కూడా దిగిపోయినట్టుంది.

తప్పదు, మా అభిప్రాయాలు మావి. మా భాష  మాది అనుకుంటే, ఎలాగూ మీ గోడ మీకు ఉండనే వుంది. రాస్తుండండి. నేను కూడా చదువుతూ వుంటాను.

ఇదొక వివరణ లాంటి విజ్ఞప్తి.  



(19-09-2021)

   

18, సెప్టెంబర్ 2021, శనివారం

బీదరికంలో మరణించిన మొదటి దళిత ముఖ్యమంత్రి

 (దామోదరం సంజీవయ్య శత జయంతి సంవత్సరం పురస్కరించుకుని)

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు చక్రపాణి గారు ఒక సందర్భంలో చెప్పిన ఒక పాత విషయం స్పురణకు వస్తోంది.

అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రి.

ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆ పదవికి రాజీనామా చేసారు. ఆయన స్థానంలో దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రూ నిర్ణయించారు. అగ్రకులాల ఆధిపత్యం అధికంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు ఒక దళితుడు ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు. సంజీవయ్య అవినీతిపరుడని, అక్రమంగా లక్షలాది రూపాయలు కూడబెట్టారని అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సంజీవయ్య నీతి, నిజాయితీ తెలిసిన నెహ్రూ ఆ ఫిర్యాదులను కొట్టి పారేశారు. అయినా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు.

నెహ్రూ ఓ నాయకుడిని ఆంధ్రాకు వెళ్లి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువనాయకుడు చక్రపాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు. సంజీవయ్య గారి గూర్చి బాగా తెలిసిన చక్రపాణిగారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు. కానీ ప్రధాని ఆదేశం. చేసేది లేక ఢిల్లీ నాయకుడిని వెంటబెట్టుకుని కారులో సంజీవయ్య గారి గ్రామానికి వెళ్లారు. గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి. ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యిపై మట్టి కుండతో అన్నం వండుతున్నది. పొగగొట్టంతో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది. "ఏమిటి ఇక్కడ ఆపారు?" ప్రశ్నించాడు ఢిల్లీ నేత.

"సంజీవయ్య గారి ఇల్లు ఇదే. ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు. కారు దిగండి" అన్నారు చక్రపాణి. నాయకుడు నివ్వెరపోయాడు. చక్రపాణి ఆమెకు నమస్కరించి "అమ్మా...ప్రస్తుతం మంత్రి గా ఉన్న మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు" అన్నారు.

ఆమె చెమటలు తుడుచుకుంటూ "అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా నాయనా! ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం కష్టంగా ఉంది. ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు" అన్నది.

నాయకుడి నోట్లోంచి మాట రాలేదు. "సార్.. గ్రామం లోకి వెళ్లి విచారణ చేద్దామా?" అడిగారు చక్రపాణి. "అవసరం లేదు. కారును హైద్రాబాద్ కు పోనీయండి" అన్నాడు నాయకుడు.

ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయ్యారు.

సంజీవయ్య గారిది కర్నూలు జిల్లా కల్లూరు మండలం లోని పెద్దపాడు గ్రామం.

ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒకసారి తల్లిని చూడడానికి స్వగ్రామానికి వెళ్ళారు.

తిరిగివస్తూ ఓ వందరూపాయల నోటు ఖర్చులకు వాడుకోమని ఇచ్చారు.

నాకు సరే నువ్వున్నావు, డబ్బులు ఇవ్వడానికి, కానీ ఎలాంటి ఆసరాలేని  బీదా బిక్కీ సంగతేమిటి అని ఆమె అనడం సంజీవయ్య గారిలో ఆలోచనలు రేకెత్తించింది.

ఫలితమే ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన వృద్ధాప్య పింఛను పధకం. 

నిశ్శబ్దం రాజ్యమేలిన ముఖ్యమంత్రి సభ

ఈ విషయం చెప్పే ముందు దీంతో సంబంధం ఉన్న మరో విషయంతో మొదలు పెడతాను.

మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ స్థాయికి చేరడానికి ముందు ఎక్కిన అనేకానేక నిచ్చెన మెట్లలో నెలకు పాతిక రూపాయల ‘విలేకరి కొలువు’ కూడా వుంది.

ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజీ ఎన్ ఆర్ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తిచేశారు. రామ్మోహనరావు గారు ఆ కాలేజీలో లెక్చరర్. వారి నాన్నగారికి పత్రికల ఏజెన్సీ కూడా వుంది. అప్పట్లో ఆ ఏజెంట్లే పత్రికా విలేకరుల పాత్ర కూడా పోషించేవారు. మా అన్నయ్యకు తెలుగులో ఉన్న ప్రావీణ్యం గమనించి ‘నెలకు ఓ పాతిక ఇస్తాను, నీకు పాకెట్ మనీగా పనికి వస్తుంది, నువ్వు ఆంద్రజ్యోతి పత్రికకు వార్తలు రాస్తుండు. వాళ్ళు వేస్తె వేస్తారు, లేకపోతే లేదు, కానీ నీకు మంచి కాలక్షేపంగా వుంటుంది’ అని ప్రోత్సహించడంతో మా అన్నయ్య ఒప్పుకున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తాను.

నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు అయింది. అప్పటికే జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ రెండు వర్గాలుగా విడిపోయివున్నారు. జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి వంటి అతిరధులు కలిగిన ప్రధాన వర్గం అప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ రెడ్డికి అనుకూలం. మరో వర్గం సంజీవయ్య వైపు. దీనికి మాకు బాబాయి వరుస అయిన బొమ్మకంటి సత్యనారాయణ నాయకులు. ఖమ్మం జిల్లాకు సంబంధించినంతవరకు ఆయన ముఖ్యమంత్రి సంజీవయ్యకు కుడి భుజం. సంజీవయ్యకు సంఘీభావం తెలిపేందుకు గోకినేపల్లిలో జిల్లా దళిత మహా సభ ఏర్పాటు చేశారు. ఈ సభను కవర్ చేయడానికి పాతిక రూపాయల విలేకరి అయిన మా అన్నయ్యను పురమాయించారు రామ్మోహన రావు గారు.

సభ బాగా జరిగింది. ముఖ్యమంత్రి ప్రసంగించడానికి మైకు ముందు నిలబడ్డారు. సంజీవయ్య స్వతహాగా మంచి వక్త. ఆయన ప్రసంగం మొదలు పెట్టారు.

నన్ను బాధ పెడుతున్న, నా మనసును కలచి వేస్తున్న ఓ విషయాన్ని మీకు చెప్పదలచుకున్నాను. ఇక్కడ పైనా కిందా కూర్చున్న మనుషులం అందరం ఒకే తీరున ఉన్నాము. ఒంట్లో పారే రక్తం రంగు అందరికీ ఎరుపే. కానీ మనలో చాలామందిమి సాటి మనిషిని మనిషిగా చూస్తున్నామా అంటే అనుమానమే. డబ్బున్న ఖామందులు పెంపుడు బొచ్చు కుక్క పిల్లల్ని తమ పక్కలపై పడుకోబెట్టుకుంటారు. ముద్దు చేస్తారు. అదే సాటి మనిషిని తాకడానికి కూడా వారికి అస్పృశ్యత అనే అనాచారం అడ్డం వస్తుంది. కుక్కలపాటి చేయరా ఈ మనుషులు? ఎందుకీ వ్యత్యాసం? ఎందుకీ వివక్ష?’

రెండు చేతులూ గట్టిగా గాలిలో ఊపుతూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్వరం బొంగురుపోయింది. పైకిలేపిన చేతులను అలాగే వుంచి ఆయన కాసేపు మౌనంగా వుండిపోయారు.

సభకు హాజరై ప్రసంగం వింటున్న యావన్మంది చేష్టలు ఉడిగి వుండిపోయారు. అంతటా నీరవ నిశ్శబ్దం.

సరే! ఆ రోజు సభ ముగిసింది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి దామోదరం సంజీవయ్య అంబాసిడర్ కారు ఎక్కారు. ఆయన పక్కనే మా బాబాయి బొమ్మకంటి సత్యనారాయణ. ముందొక పోలీసు జీపు, వెనక మరో జీపు. అదీ ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆ రోజుల్లో.

మా అన్నయ్య ఖమ్మం చేరుకున్న వెంటనే తన రిపోర్ట్ రాసి మర్నాడు పోస్టులో పంపారు. ఆ మరునాడు అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది.

ముఖ్యమంత్రి దళిత సభలో రాజ్యమేలిన నిశ్శబ్దం’.

వార్తతో పాటు మా అన్నయ్య పెట్టిన హెడ్డింగ్ కూడా యధాతధంగా పత్రికలో రావడం కొసమెరుపు.

జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధి మంత్రి వర్గాల్లో పనిచేసిన దామోదరం సంజీవయ్య గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

ఇన్ని పదవులు నిర్వహించిన సంజీవయ్య గారెకి చివరికి మిగిలిన ఆస్తి కేవలం వాళ్లూరులో వున్న ఆస్బెస్టాస్ రేకుల ఇల్లు. 1921 ఫిబ్రవరి 14 న మునిదాస్, సుంకులమ్మ దంపతులకు జన్మించిన సంజీవయ్య,

1972 మే ఏడవ తేదీన మరణించారు. అదే రోజు ఆయన పెళ్లి రోజు కావడం మరో విషాదం.

తోకటపా :  2018 లో కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధి కర్నూలు పర్యటనలో భాగంగా కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి దామోదరం ఒకప్పుడు నివసించిన గృహాన్ని సందర్శించడం ఓ విశేషం



(2021)