10, జూన్ 2020, బుధవారం

భయం – భండారు శ్రీనివాసరావు


రోశయ్య గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కృష్ణానదికి బ్రహ్మాండమైన వరదలు వచ్చాయి. కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కర్నూలు పట్టణంలోకి వరద నీరు ప్రవేశించి పెద్ద పెద్ద భవంతులు కూడా మునిగిపోయాయి. కొన్ని అపార్ట్ మెంట్లలో రెండో అంతస్తులోకి కూడా నీళ్ళు వచ్చాయి. ఇళ్లన్నీ వరద బురదతో పేరుకుపోయాయి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్తితులు చెప్పక్కర లేదు. హైదరాబాదు  నుంచి  చూడడానికి వెళ్లాము. ఒక అధికారి చెప్పాడు, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. ఇళ్లు వదిలిపెట్టి సహాయక శిబిరాలకు రావడానికి వాళ్ళు ఓ పట్టాన ఒప్పుకోవడంలేదు
దీనికి సమాధానం ప్రజలదగ్గర నుంచే వచ్చింది. ఒకతను చెప్పాడు.
వున్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి రమ్మంటారు. ఎలా వెడతామ్. టీవీలు ఫ్రిజ్ లు చాలా ఖరీదైన వస్తువులు. మా పెద్దవాళ్ళ టైమ్ లో అయితే గోచీపాత తప్పితే యేమీ వుండేవికావు. ప్రతిసారీ వరదలు వచ్చినప్పుడల్లా వచ్చి ఖాళీ చేయమంటారు. మళ్ళీ వరదలు వస్తే మళ్ళీ ఇదే తంతు. మా బతుకులు గంగమ్మ నీడలోనే గడిచిపోతాయి. నీళ్ళను చూస్తూ పెరిగాము. నీళ్లంటే మాకు భయం లేదు. చూస్తున్నారు కదా. ఇక్కడ ఎన్ని కొంపలు వున్నాయో. ఇలా ప్రతిసారీ బోలెడు ఖర్చు పెట్టి ఖాళీ చేయించే బదులు వరద భయం లేని మెట్ట ప్రాంతాలలో మాకు ఇళ్లు కట్టించి ఇస్తే ప్రతియేడూ ఇలా తరలించే ఖర్చు ప్రభుత్వానికి కలిసి వస్తుంది కదా!
బదులు చెప్పడానికి వీలులేని సమాధానం.
రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడు వుండదు అని సామెత. భయం కూడా అంతే! భయం అలవాటు అయినకొద్దీ భయం పట్ల భయం పోతుంది.
కరోనా సంగతి చూస్తున్నాం కదా!

9, జూన్ 2020, మంగళవారం

సుశ్రవణం – భండారు శ్రీనివాసరావు

సి.ఎస్.ఎన్.శర్మ గారు. ఫోనులో మాట్లాడే తీరును బట్టి నాకంటే వయసులో పెద్దవారయివుంటారని అనిపిస్తుంది. విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం సత్యసాయి మీద వున్న భక్తి ప్రపత్తులతో పుట్టపర్తిలో భార్యతో కలిసి కొన్నాళ్లు నివాసం వున్నారు. పిల్లవాడు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అయ్యాడు. ఆయన ఉద్యోగరీత్యా శర్మగారి మకాం కూడా హైదరాబాదుకు మారింది. పుట్టపర్తిలో వుండగా సూర్య దినపత్రికలో నేను రాసే వ్యాసాలు చదివి ఒకరోజు ఫోన్ చేశారు. పుట్టపర్తి అనగానే నేను మా అన్నయ్య పర్వతాలరావు గారి గురించి చెప్పాను.

“ఆయన నాకు బాగా తెలుసు. బాబా గారి ప్రేయర్ కు వెళ్లినప్పుడు మేమిద్దరం చివరి వరసలో పక్కపక్కనే కూర్చునేవాళ్లం. వారికి అక్కడ పెద్దపెద్ద వాళ్ళందరూ బాగా తెలుసు. పోయి ముందు వరసలో కూర్చున్నా అభ్యంతర పెట్టేవాళ్లు యెవరూ వుండరు. అదే అడిగితే వారి సమాధానం ఏమిటో తెలుసాండి. చిరునవ్వు. అంతే. అలాంటి మనిషిని నేను నా జన్మలో చూడలేదు. తరవాత తరవాత వేరేవారి ద్వారా వారి గురించి సమాచారం తెలిసి ఇంకా ఆశ్చర్యపోయాను. ఆయనలా పెద్దపెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు స్వామి సేవలో వుండడం కొత్తేమీ కాదు. కానీ వారెవ్వరూ పర్వతాలరావుగారిలా నిరాడంబరంగా వుండలేరు. అది మాత్రం వాస్తవం”

శర్మగారికి బాగా చదివే అలవాటు వుంది. యెక్కడెక్కడి పుస్తకాలు సేకరించి శ్రద్ధగా చదువుతారు. చదివిన సంగతులు ఎవరితోనైనా  పంచుకోవాలని అనుకుంటారు. శర్మగారికి చాలా విషయాలు తేదీలు, పేర్లతో సహా గుర్తు. కానీ అవన్నీ చెబుతూనే వున్నట్టుండి, “మరచిపోయానండీ మళ్ళీ గుర్తు చేసుకుని ఫోన్ చేస్తాను” అని పెట్టేస్తారు.

అలా ఈరోజు ఓ విషయం చెప్పారు.

విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేస్తున్నప్పుడు శర్మగారికి చర్ల గణపతి శాస్త్రి గారు అనే పండితుడితో పరిచయం కలిగింది. శాస్త్రిగారికి వాల్తేర్ లో చిన్న ప్రింటింగ్ ప్రెస్ వుంది. ఆయన వయసు యెనభై ఆరు సంవత్సరాలు. ఒక లూనా బండిపై    వైజాగులో తిరుగుతూ వుండేవారు. ఆధ్యాత్మిక గ్రంధాలు అనేకం రాశారు. వారు రాసిన గణపతి రామాయణ సుధ అనే గ్రంధం గురించి హిందూలో రివ్యూ వచ్చింది. అదొక చెత్త అనే అర్ధం వచ్చేట్టు వుంది ఆ రెవ్యూ. శాస్త్రిగారు అది చదివి బాధ పడతారు అనుకున్నా. కానీ ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారు. తర్వాత అదే గ్రంధానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

“వారొకసారి విశాఖపట్నం రేడియోలో మాట్లాడారు. నేను కేసెట్ పై రికార్డు చేసుకున్నాను కూడా. ఇప్పుడు కేసెట్లు లేవుకదా! రికార్డర్లు లేవు.  ఎలా అని  గుంజాటన పడుతుంటే మా వాడు పదిహేను వందలు పెట్టి వాటిల్లో కొన్నిటిని సీడీలు గా మార్పించాడు”

శర్మగారు చెబుతూనే వున్నారు . ఇంతలో “ఏమిటో అండీ! మీకు చెప్పాలని చాలా విషయాలు గుర్తు పెట్టుకుంటాను. అదేమిటో సమయానికి మరిచిపోతుంటాను”

అంత పెద్దమనిషి పెద్ద మనసుతో ఏదో చెబుతుంటే వినడమే కదా నేను చేసేది. వాళ్ళు చెప్పేది అలా వింటుంటే ఆ వయసులో వారికి అదో తృప్తి. (నిజానికి వారి వయసెంతో నాకు తెలియదు)      


8, జూన్ 2020, సోమవారం

నారాయణ నారాయణ

“ఇంట్లో వుండు, బతికిపోతావ్! బయటకి రాకు ప్రాణాలతో వుంటావ్ అన్నారు. ప్రాణభయమో యేమో తెలవదు, చాలా రోజులు జనం ఈ మాట విన్నారు.

తర్వాత తర్వాత కొద్దికొద్దిగా నిబంధనలు సడలిస్తూ వచ్చారు. ఫలితాలు ఇదిగో ఇలా! పత్రికల్లో వచ్చిన ఫోటోలు చూశారుగా.

చేపలు తినక చాలా రోజులు అయివుండొచ్చు. లేదా మృగశిర కార్తే ఆరంభంలో వచ్చే చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది అనే ఆలోచన కావచ్చు. కానీ ఇలా మందలు మందలుగా బయటకు వస్తే ప్రాణాలకు కరోనా ముప్పు వుందనుకున్నప్పుడు  ఆరోగ్యానికి మంచి చేస్తే ఎంత? చేయకపోతే ఎంత?

చిన్నప్పుడు ఓ కధ చెప్పేవారు. ఒకడు అవసాన దశలో వున్నప్పుడు అతడిచేత నారాయణ నారాయణ అనిపించాలని కుటుంబ సభ్యులు ఆరాటపడ్డారు. నారాయణ నారాయణ అంటూ చనిపోతే  స్వర్గానికి పోతాడనే నమ్మకంతో ఎంతో చెప్పిచూశారు కానీ అతగాడిచేత నారాయణ అనిపించలేకపోయారు. చివరికి వాళ్ళల్లో ఒకడు ఒక చేతిలో నారపీచు, మరో చేతిలో అణా పట్టుకుని ఇవేమిటని సైగచేశాడు. అవి చూసి అయినా నారాయణ అని అనకపోతాడా అనే ఆశతో. మంచానపడి  చావు ముంచుకొచ్చిన ఆ శాల్తీకి చావు తెలివితేటలు ముంచుకొచ్చి  వాటిని చూస్తూనే పీచు, కాసు అంటూ కళ్ళు తేలేశాడు.

గతంలో మందుకోసం ఇలాగే వీధుల్లోకి బారులు  తీరారు. ఇప్పుడు చేపలకోసం గుంపులు కట్టారు. నాలుక చవిచచ్చిన వారికి చావు భయం కూడా చచ్చిపోతుందేమో మరి.

సరే! గతంలో మృగశిర అంటే గుర్తుకు వచ్చేది హైదరాబాదు చేపమందు. ఈసారి కరోనా కట్టడుల వల్ల చేపమందు ప్రసాద పంపిణీ వుండదని బత్తిన కుటుంబం వాళ్ళు ముందుగానే ప్రకటించారు. లేకపోతే ఈపాటికి హైదరాబాదు మీద మరో హైదారాబాదు వచ్చి పడేది.

లోగడ వున్నంత ఆదరణ ఈ చేపమందుకు ఇప్పుడు వుందని చెప్పలేము కానీ ఒకప్పుడు హైదరాబాదు చేపమందుకు చాలా గిరాకీ వుండేది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర  ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఈ చేపమందు పంపిణీకి అంతర్జాతీయ ఖ్యాతి వుండేది. ఆయనే స్వయంగా ఈ చేప ప్రసాదం యేటా స్వీకరిస్తూ దానికి ఓ బ్రాండు విలువ తెచ్చిపెట్టారు.

ఉత్తర భారతం వారికి ఈ చేపమందు పట్ల నమ్మకం ఎక్కువ. వాళ్ళ నమ్మకం యేమో కానీ రేడియోలో పనిచేసే మా బోంట్లకు లేని తలనొప్పులు తెచ్చిపెట్టేది. డిల్లీలోని ఆకాశవాణి డైరెక్టొరేట్ నుంచి మాకు యెన్నో అభ్యర్ధనలు వస్తుండేవి, మా బావమరది కుటుంబం వస్తోంది, మా మేనల్లుడి కుటుంబం వస్తోంది కాస్త సాయం చేయండంటూ. ఇక వాళ్ళకి వీఐపీ పాసులు, వసతికి ఏర్పాట్లు. ఇంతటితో అయితే పరవాలేదు, పోయేటప్పుడు రైలు రిజర్వేషన్లు. రైల్వే  రామ్మోహన్ కు పనిపెట్టే వాళ్ళం. ఆయన కిందా మీద పడి టిక్కెట్లు కన్ఫర్మ్ చేయించేవాడు. నిజానికి ఈ ఇబ్బందులు యెక్కువగా భరించింది మొహమాటం పాలు యెక్కువ వున్న మా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారే. నాది చిటికినవేలంత మాత్రమే.         


4, జూన్ 2020, గురువారం

దివ్యదృష్టి – భండారు శ్రీనివాసరావు


ఏకాంబరం హాల్లో పడక కుర్చీలో కూర్చుని, డిటెక్టివ్ వాలి మాదిరిగా కళ్ళు మూసుకుని టీవీ వింటున్నాడు’.
జర్మనీ నుంచి వచ్చి లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన ఏకాంబరం కొడుకు పీతాంబరం తండ్రి పక్కనే కూర్చుని టీవీ చూస్తూ రిమోట్ తో ఛానల్స్ అటూ ఇటూ మారుస్తున్నాడు.
కళ్ళు మూసుకుని వున్న ఏకాంబరం, ఛానల్ మారగానే అది పలానా ఛానల్ అని పైకి చెప్పడం పీతాంబరానికి ఆశ్చర్యం కలిగించింది. అలా సుమారు పది పదిహేను టీవీల పేర్లు ఏ తప్పు లేకుండా కళ్ళు తెరవకుండానే చెబుతూ వుండడం చూసి అతడు నివ్వెరపోయి తండ్రిని అడిగాడు, చూడకుండానే అలా ఎలా చెప్పగలుగుతున్నావని.
ఏకాంబరం ఇలా జవాబు చెప్పాడు.
ఇదేమి బ్రహ్మవిద్య కాదు. ఎలాగూ ఇంకొన్నాళ్లు ఇక్కడే వుంటావు కదా!  లాక్ డౌన్ ఎత్తేసేసరికి నీకూ ఈ దివ్య దృష్టి అలవడుతుంది. కార్యక్రమం వింటూనే అదే ఛానలో ఇట్టే చెప్పేస్తావు            

రాజకీయ నాయకుల వేషధారణ – భండారు శ్రీనివాసరావు


ఇది రాజకీయ నాయకుల గురించే కానీ, పొలిటికల్ పోస్టు మాత్రం కాదు.
నందమూరి తారక రామారావు అనగానే ఓ రూపం కళ్ల ముందు కదలాడుతుంది. రాజకీయ నాయకుడిగా ఆయన వేషధారణ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. కాషాయ వస్త్రాలు, పెద్ద పెద్ద కళ్లద్దాలూ, ఎడమచేయి గాల్లోకి లేపి, చిద్విలాసం చిందిస్తూ.. సోదర సోదరీమణులారాఅంటూ వేదికలపై తన వాక్‌చాతుర్యంతో హోరెత్తించిన తెలుగుదేశం పార్టీ అధినాయకుడి రూపాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేం. ఇక సినిమాల్లో అయితే రాముడు, కృష్ణుడు అనగానే గుర్తుకొచ్చేది, ఎన్టీఆర్ మాత్రమే.
అయితే సినీ నటుడు కావడం వల్ల కావచ్చు రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత కూడా ఆయన అనేక సార్లు తన వేష ధారణ మార్చారు. మొదట్లో తెలుగుదేశం పార్టీ పెట్టి చైతన్య రధంపై రాష్ట్రం నలుమూలలా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నప్పుడు ఖాకీ ప్యాంటు, ఖాకీ చొక్కాతో కనిపించారు. ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే తెల్లటి ధోవతి, లాల్చీని తన ఆహార్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు వివేకానందుడి గెటప్ తో, కొన్నాళ్ళు కాషాయ వస్త్రాలతో విభిన్నంగా కనిపించారు. లక్ష్మీ పార్వతిని ద్వితీయ వివాహం చేసుకున్న తర్వాత కాషాయాన్ని వదిలేసి మళ్ళీ మల్లెపూవులాంటి ధవళ వస్త్రధారణ స్వీకరించారు. చనిపోయేవరకు అదే ఆహార్యం. మార్పులేదు.
చాలా మంది రాజకీయ నాయకులు జీవితాంతం ప్రజలకు ఒకే వస్త్ర ధారణతో గుర్తుండిపోయారు. ఉదాహరణకు మహాత్మాగాంధీ, (కొల్లాయి గుడ్డ, చేతిలో కర్ర) జవహర్ లాల్ నెహ్రూ, (ఎర్ర గులాబీ, తల మీద టోపీ లేకపోతే నెహ్రూను నెహ్రూగా గుర్తుపట్టడం కష్టం), సుభాష్ చంద్రబోస్ (మిలిటరీ దుస్తులు లేని సుభాష్ చంద్ర బోసును ఊహించడం అసాధ్యం). అలాగే, రాజగోపాలా చారి, కరుణానిధి ఈ ఇద్దరూ హమేషా పగలూ రాత్రీ తేడా లేకుండా నల్లకళ్ళ జోళ్ళతో కనిపించేవారు. నల్లద్దాల కంటి జోడు ధరించే అలవాటు ఎం.జీ. రామచంద్రన్ కు కూడా వుండేది. కాకపోతే, నెత్తిమీద ఫర్ టోపీ అదనం. జయలలిత కూడా భద్రతా పరమైన కారణాలో, ఆరోగ్యపరమైన కారణాలో తెలియదుకానీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒకేరకం ఆహార్యంతో కానవచ్చేవారు.  
రాష్ట్రపతి అయిన తర్వాత నీలం సంజీవరెడ్డి ఆహార్యం మారిపోయింది కానీ అప్పటివరకు ఏళ్ళతరబడి ఒకే రకం వస్త్రధారణ. పంచె, లాల్చీ, తలమీద గాంధి టోపీ. ఇక కాసు బ్రహ్మానందరెడ్డి. ఆయనా డిటో. తలమీద టోపీని చేత్తో కొంచెం సదురుకున్నట్టు కనిపించింది అంటే అయన ఏదో కొత్త రాజకీయ వ్యూహం పన్నుతున్నారని చెప్పుకునేవారు.
ఇక పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఒకటే ఆహార్యం, తెల్లటి  పంచె లాల్చీ. విదేశీ పర్యటనలు, కొన్ని అధికారిక కార్యక్రమాలలో మాత్రం సూటు ధరించేవారు, రాష్ట్రపతి సంజీవరెడ్డి మాదిరిగా.
నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యేంతవరకు, ఆఖరికి గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కూడా వస్త్రధారణ పట్ల అంత శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. ప్రధాని అయిన తర్వాత మాత్రం ఒకే రకం దుస్తులు ధరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు వేషధారణ అనేక దశాబ్దాలుగా ఒకేరకంగా ఉంటూ వస్తోంది. తెల్లటి చొక్కా, తెల్లటి లుంగీ. ఏ పదవిలో వున్నా, ఏ హోదాలో వున్నా  ఇదే ఆహార్యం.
ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు దుస్తులు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేవి. వారగా భుజం మీద కప్పుకున్న శాలువా ఆయన ప్రత్యేకత. అదిలేని టంగుటూరిని గుర్తుపట్టడం కష్టం.
ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఆహార్యం విభిన్నమైన రీతిలో వుండేది. చేతిలో పొన్ను కర్ర ఓ స్పెషాలిటీ.
పొతే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఆహార్యం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండేట్టు చూసుకున్నారు. ఒకరకమైన ఖాదీ వస్త్రంతో తయారుచేసిన ప్యాంటు చొక్కాను ధరించడం మొదలుపెట్టారు. కాళ్ళకు బూట్లు ధరించడం కూడా చాలాకాలం తర్వాతనే అలవాటు చేసుకున్నారు. అదీ, ముఖ్యమంత్రిగా మొదటి విదేశీ ప్రయాణం పెట్టుకున్నప్పుడు అనుకుంటాను.
వై.ఎస్ రాజశేఖర రెడ్డి సయితం ఒకే రకం వస్త్రధారణ పట్ల మక్కువ చూపేవారు. పదహారణాల తెలుగుతనం ఉట్టిపడేలా తెల్లటి పంచె, లాల్చీ ధరించి తనకంటూ ఒక శైలిని రూపొందించుకున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు విషయానికి వస్తే  అనేక దశాబ్దాలుగా ఆయన వస్త్రధారణలో ఎలాంటి మార్పు లేదు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు. ఢిల్లీ వంటి చలి ప్రదేశాలకు పోయినప్పుడు ఏమో కానీ, కాళ్లకు చెప్పులు. ఈ మధ్య మెడచుట్టూ మడిచిన ఉత్తరీయంతో కనిపిస్తున్నారు టీవీల్లో. ఆయన ఆహార్యంలో కానవస్తున్న మార్పు ఏదైనా ఉన్నదంటే ఇదొక్కటే.   
యువతరం రాజకీయ నాయకుల్లో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన తొలిరోజుల్లో రంగు రంగుల  చొక్కాలు వేసుకున్నా, ఆ తర్వాత మోచేతుల వరకు ముడిచిన తెల్లచొక్కా, తెల్ల ప్యాంటుకు మాత్రమే పరిమితం అయ్యారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో  అనేక రకాల దుస్తులు ధరించినప్పటికీ, సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి, లాల్చీ పైజమా, గుబురుగా పెంచిన గడ్డం మీసాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు.     
          


2, జూన్ 2020, మంగళవారం

సప్తపది బాటలో బంగారు తెలంగాణా – భండారు శ్రీనివాసరావు


(ఈరోజు 02-06-2020 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)

నాకు లీలగా గుర్తు. ఉద్యమం మాంచి ఊపులో వున్నప్పుడు కేసీఆర్ ఇలా అన్నారు.
“తెలంగాణా వచ్చిన తరువాత, దాన్ని మనం కోరుకుంటున్నట్టు అభివృద్ధి చేసుకోవడానికి రోజుకు  ఇరవై నాలుగు  గంటలు కూడా  సరిపోవు”.
నిజమే. ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలంటే ఎన్నో కావాలి. మొక్కవోని దీక్ష, సడలని పట్టుదల, అనుకున్నవి అనుకున్నట్టుగా అనుకున్నసమయంలో అమలుచేసే యంత్రాంగం, సమయ పాలన. ఇన్ని కావాలి ఒక లక్ష్యాన్ని సాధించడానికి. ఇవన్నీ కలగలుపుని కేసీఆర్  సాధించిన  ఘన విజయమే కాళేశ్వరం ప్రాజెక్టు.
జూన్  రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు పూర్తయి ఏడోఏట అడుగుపెడుతోంది. ఈ ఏడాది తెలంగాణా  రాష్ట్ర అవతరణ దినోత్సవాలు అయిదు రోజులముందే మొదలయ్యాయి. మే ఇరవై తొమ్మిదో తేదీనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్న సాగరం కాళేశ్వరం ప్రాజెక్టు తుది అంకం ఆవిష్కృతం కావడంతో ఈ సంబురాలు ప్రారంభం అయ్యాయని అనుకోవచ్చు. అలనాటి భగీరధుడు గంగమ్మను ఆకాశం నుంచి భూమికి రప్పిస్తే, ఈనాటి అపరభగీరధుడు కేసీఆర్ కాళేశ్వరం గోదావరి జలాలను సముద్రమట్టానికి ఆరువందల మీటర్ల పైకి  తీసుకువచ్చి ‘నీరు పల్లమెరుగు’ అనే నానుడిని నీరుకార్చి కొండ పోచమ్మ ప్రాజెక్టును నీటితో నింపుతున్నారు. దీనితో, భారతదేశ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప ఇంజినీరింగ్ విన్యాసం సాధించిన రాష్ట్రంగా తెలంగాణా చరిత్రపుటలకు ఎక్కింది. ఈ ఒక్క ప్రాజెక్టు చాలు కేసీఆర్ పట్టుదలకు, మొక్కవోని దీక్షకు నిలువెత్తు నిదర్శనం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకే గోదావరి నీళ్ళను కొండ పోచమ్మ ప్రాజెక్టులోకి తోడి పోస్తున్నప్పుడు స్వప్నం సాకారమైందన్న సంతోషం, సంతృప్తి ఆయన కళ్ళల్లో కనిపించాయి.
కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు.
ఆయన మదిలో మెదిలే  ఆలోచనలకు అంతే లేదు. ఇంత చిన్న మనిషి అన్నన్ని పెద్ద ఆలోచనలు ఎలా చేస్తున్నారా అనే విస్మయం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు కేసీఆర్ వాటిని గురించి చెబుతుంటే.
గత ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన మరో ఘన విజయం ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా. ఉమ్మడి రాష్ట్రము విడివడితే తెలంగాణా  అంధకారబంధురం అయిపోతుందని నాడు వినవచ్చిన విమర్శలను తిప్పికొట్టాలని అనుకున్నారేమో తెలవదు కానీ ఈ విషయంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు అనిపిస్తుంది.
గత ఆరేళ్లుగా జంట నగరాల్లో కరెంటు కోతలు లేకుండాపోయాయి. రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా ఇదే పరిస్తితి. దేవులపల్లి ప్రభాకరరావు గారి సారధ్యంలో జెన్కో, ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది కలసికట్టుగా సాగించిన నిర్విరామ కృషి ఇందుకు ప్రధాన కారణం.   
తెలంగాణా ప్రజలు కోరుకున్న రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడి కూడా ఆరేళ్ళు గడిచాయి. అనుకున్నవి అనుకున్నట్టు సాగుతున్నాయని కొందరు అనుకుంటూ వుంటే, ఏదీ, ఎక్కడ అని సన్నాయి నొక్కులు నొక్కేవారు కూడా లేకపోలేదు.
అన్నం వుడికే దాకా వుడికినట్టు తెలవదు, కుతకుత శబ్దం తప్పిస్తే.
ఎవరి పరిపాలనలో అయితే పాలకులతో అవసరం లేకుండా పాలితులకు జీవితం హాయిగా  గడిచిపోతుందో ఆ పరిపాలనను సుపరిపాలనగా చాణక్యుడు అభివర్ణించారు.
ప్రస్తుతం కేసీఆర్ పాలన ఆ రీతిలో సాగుతోందని పొగడ్తలు తగవు కానీ, ‘నేనున్నాను’ అనే భరోసా మాత్రం  ప్రభుత్వం నుంచి పాలితులకు లభిస్తోందని నేను నిశ్చయంగా చెప్పగలను. (EOM)

29, మే 2020, శుక్రవారం

జగన్ ఓ సీతయ్య...ఎవరిమాటా వినడు – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 30-05-2020, Saturday)

వై.ఎస్. జగన్ మోహన రెడ్డి గురించి తెలియనివాళ్ళు చెప్పుకునే మాట ఇది.  దీనికి కారణం ఆయన్ని గురించి పూర్తిగా తెలిసినవాళ్ళు లేకపోవడమే. చుట్టూ చాలామంది వుంటారు. కానీ ఎవర్నయినా అడిగి చూడండి. ఒకటే మాట, ‘ఆయన చాలా లోతయిన మనిషి.  జనం చెప్పేది  తప్ప పరిజనం మాట  ఆయనకు పట్టదు”.
ఒక నిజం చెప్పుకుందాం. ఎవరి మాటయినా వినాల్సిన అవసరం ఏముంది? ఆయనకు తన గమ్యం తెలుసు. వెళ్ళాల్సిన మార్గం తెలుసు. కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి సొంత పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి ఏమి చేయాలి? ఎలా చేయాలి అనే విషయంలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఆయన సిద్ధంగా ఉంచుకుని ముందుకు సాగుతున్నట్టు ఆయన వ్యవహార శైలి గమనించిన వారికి అర్ధం అవుతుంది.
జగన్ మోహన రెడ్డి జనాలకు కొన్ని వాగ్దానాలు చేశారు. ప్రజలు నమ్మి అధికారం అప్పగించారు. వాటిలో చేయగలిగినవి ఏమిటి? చేయలేనివి ఏమిటి అని ఆయనే ఆలోచించుకుని ఒక కాల పట్టిక తయారు చేసుకుని పలానా రోజులోగా ఈ పనులు చేయాలి అని వాటిని చేసుకుంటూ, చేసిన వాటిని టిక్కు పెట్టుకుంటూ, చేయాల్సిన వాటిని ఎప్పుడు చేసేది ప్రజలకు చెప్పుకుంటూ పాలన సాగిస్తున్నారు. ఇక తనకూ ప్రజలకూ నడుమ ఎవరూ లేరని, వారికి తానే జవాబుదారుననీ అనుకుంటూ ముందుకు పోతున్నారు. ఇక ఒకరి మాట వినాల్సిన అవసరం ఏమిటనే ధీమా ఆయన్ని సీతయ్యని చేసివుంటుంది.
గుర్తుండే వుండాలి. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న తొలిరోజుల్లో ఆయన ధోరణి కూడా అచ్చు ఇదే విధంగా వుండేది.  ప్రజలకు తప్ప ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అగత్యం తనకు లేదనే పద్దతిలో శ్రీ రామారావు వ్యవహరించేవారు. నిజానికి ప్రజల అభిమానంతో విజయాలను మూటగట్టుకున్న ఏ రాజకీయ నాయకుడి తరహా అయినా ఇదే విధంగా వుంటుంది. జరిగే తప్పులకీ, ఒప్పులకీ తనదే బాధ్యత అనే తీరులో వుంటుంది. గతంలో ఇందిరా గాంధీ, ప్రస్తుత కాలంలో నరేంద్ర మోడీ కేవలం తమ వ్యక్తిగత ఆకర్షణతో, ప్రతిభతో, ప్రజాభిమానంతో గద్దె ఎక్కారు. తమను నమ్ముకున్న ప్రజానీకానికి ఏది మేలు చేస్తుందని వాళ్ళు నమ్ముతారో అదే చేస్తూ పోతారు. ఈ విషయంలో ఏవిధమైన శషభిషలకు, సమాలోచనలకు తావు లేదనే దోవ వారిది.
ఇప్పుడు జగన్ మోహన రెడ్డిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేవారు ఈ కోణంలో ఆలోచించాలి. అప్పుడే ఆయనలో తెలియని కోణాలు తెలుసుకోగల అవకాశం లభిస్తుంది.
సరే! ఇదొక కోణం.
చెప్పిన వాటిలో తొంభయ్ శాతం పూర్తి చేశాను అనేది ఫుల్ పేజి పత్రికాప్రకటనలకు పనికొస్తుంది. ఏడాది పాలనలే కాదు, వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భాలలో కూడా పాలకులు గతంలో ఇలాంటి ప్రచార ఆర్భాటాలే చేసారు. అది కాదు విషయం. ప్రభుత్వ పధకాల వల్ల ప్రయోజం పొందేవారికి మళ్ళీ ఇలా ప్రకటనల ద్వారా చెప్పుకోవాల్సిన పనిలేదు. వాళ్లకి ప్రభుత్వ పనితీరే కొలమానం. సాధారణ ప్రజలకు నిత్యం ప్రభుత్వంతో పని పడని పాలన అందించ గలిగిన ప్రభుత్వం ఉత్తమ ప్రభుత్వం అవుతుందని చాణక్యుడు ఏనాడో చెప్పాడు.
గత ఏడాది పాలనలో జగన్ మోహన రెడ్డి తలెత్తుకుని చెప్పుకోగల పనులు  కొన్ని చేసారు. తల బొప్పికట్టే పనులు కూడా చేసారు. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయి. రాజకీయ నాయకుల  నిర్ణయాలు రాజకీయ కోణంలో వుంటాయి. కోర్టు తీర్పులు న్యాయశాస్త్ర పరిధికి లోబడి వుంటాయి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాబట్టి రాజకీయులు తమ చర్యలు ధర్మ బద్ధం అనుకుంటారు. కానీ ఒక్కోసారి అవి చట్టబద్ధం కాకపోవచ్చు. ఇలాంటి తేడాలే వ్యవస్థల నడుమ ఘర్షణలకు దారితీస్తాయి.  ఇది ఒక్క జగన్ ప్రభుత్వానికి మాత్రమే పరిమితంకాదు. ఇందిరాగాంధీ, మోడీ, కేసీఆర్ వంటి వారికి సైతం ఈ తలనొప్పులు తప్పలేదు. అయితే ఒకేరోజు అనేక వ్యతిరేక తీర్పులు కోర్టులు వెలువరించిన రికార్డు జగన్ మోహన రెడ్డి ఖాతాలో చేరడం వల్లనే  ఈ అంశానికి ఇంతటి ప్రాధాన్యం. 
ఇక గత ఏడాదిగా జగన్ మోహన రెడ్డి ప్రభుత్వ సాఫల్య, వైఫల్యాల జాబితా వేస్తే అది ఇలా వుంటుంది.
విజయాలు: తాను ప్రజలకు వాగ్దానం చేసిన నవరత్నాల అమలుపై పూర్తి దృష్టి పెట్టడం. ఇంతవరకు ఏ రాష్ట్ర చరిత్రలో ఎరుగని గ్రామ సచివాలయ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడం. విద్య, వైద్య రంగాల్లో నాడు నేడు పధకం ద్వారా గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం, పెన్షన్లను ఖచ్చితంగా ప్రతినెలా నిర్దిష్టమైన తేదీన బట్వాడా చేయడం, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో మొహల్లా క్లినిక్ ల పద్దతిలో క్లినిక్కులు ఏర్పాటు చేయడం, స్కూలు పిల్లలకు మధ్యాన్న భోజన పధకంలో నాణ్యతకు ప్రాధాన్యత లభించేలా చూడడం, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన బాధితులకు కనీ వినీ ఎరుగని ఉదార పరిహారాన్ని ప్రకటించి అందచేయడం, సమీక్షల పేరుతొ పొద్దుపోయేవరకు అధికారుల సహనానినికి పరీక్షలు పెట్టకపోవడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పేదల ఇళ్ళ స్థలాలకోసం భూసేకరణ విషయంలో వచ్చిన కొన్ని ఆరోపణలు మినహాయిస్తే పెద్ద పెద్ద కుంభకోణాలు వెలుగు చూడకపోవడం   మొదలైనవి వున్నాయి.
మైనస్ పాయింట్ల జాబితా కూడా చిన్నదేమీ కాదు.
పార్టీ మార్పిళ్ళకు సంబంధించి తొలి రోజుల్లో చేసిన గంభీరమైన ప్రకటనకు కట్టుబడి వ్యవహరించడం లేదేమో అన్న అనుమానాలు కలగడం, అల్లాగే అసెంబ్లీ నిర్వహణలో గత అనుభవాలు పునరావృతం కావని సభాముఖంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండకపోవడం,  గడప దాటిన ముగ్గురు ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో జగన్ మోహనరెడ్డి అనుసరించిన వైఖరి సాంకేతికంగా తప్పుపట్టలేనిది కావచ్చేమోకానీ నైతికంగా సమర్ధించుకోలేని పరిస్తితి తలెత్తడం, అధికారులకు సముచిత స్థానాలు కల్పించడంలో ఒక సామాజికవర్గానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలకు సరయిన రీతిలో సమాధానం చెప్పలేని స్తితిలో వుండడం,  రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి ఆసక్తిని అధికారంలోకి వచ్చిన తర్వాత కనబరచకపోవడం, ఇలా అనేకం. ముందే చెప్పినట్టు ఈ జాబితా కూడా పెద్దదే.
జగన్ మోహన రెడ్డికి  గతంలో అధికార పీఠానికి దగ్గరగా మెసలగలిగిన అనుభవం వుంది. కానీ అధికార పీఠం అధిష్టించిన సందర్భం కానీ అవకాశం కానీ లోగడ లేదు. అంచేత కొన్ని పొరబాట్లు దొర్లడం సహజం. కాబట్టి, కాసేపు ఆగి, నిలబడి, వెనక్కి తిరిగి చూసి, విషయాలను సాకల్యంగా పునః సమీక్ష చేసుకుని  మళ్ళీ ముందుకు సాగడానికి ఇది చక్కటి అవకాశం. పొరబాట్లు తప్పులుగా, తప్పులు తిరిగి సరిదిద్దుకోలేని  ఘోర తప్పిదాలుగా మారకముందే జాగ్రత్త పడడానికి కూడా ఇదొక మహత్తర అవకాశం.    
జగన్ మోహన రెడ్డి 2014లో ఓటమి అంటే ఏమిటో రుచి చూసారు. అదే జగన్ మోహన రెడ్డి 2019లో ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. పరాజయం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో విజయాన్ని సాధించారు. విజయం నేర్పే పాఠాలను కూడా ఒంటబట్టించుకుంటే మరో విజయం సాధ్యం అవుతుంది. రాజకీయ పార్టీ అన్నాక రాజకీయం తప్పదు. కానీ రాజకీయమే సర్వస్వం కాకూడదు.
చివరిగా ఒక మాట.
అనుభవాన్ని మించిన సలహాదారుడు ఈ లోకంలో వుండరు. (EOM)