సప్తపది బాటలో బంగారు తెలంగాణా – భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సప్తపది బాటలో బంగారు తెలంగాణా – భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, జూన్ 2020, మంగళవారం

సప్తపది బాటలో బంగారు తెలంగాణా – భండారు శ్రీనివాసరావు


(ఈరోజు 02-06-2020 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)

నాకు లీలగా గుర్తు. ఉద్యమం మాంచి ఊపులో వున్నప్పుడు కేసీఆర్ ఇలా అన్నారు.
“తెలంగాణా వచ్చిన తరువాత, దాన్ని మనం కోరుకుంటున్నట్టు అభివృద్ధి చేసుకోవడానికి రోజుకు  ఇరవై నాలుగు  గంటలు కూడా  సరిపోవు”.
నిజమే. ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలంటే ఎన్నో కావాలి. మొక్కవోని దీక్ష, సడలని పట్టుదల, అనుకున్నవి అనుకున్నట్టుగా అనుకున్నసమయంలో అమలుచేసే యంత్రాంగం, సమయ పాలన. ఇన్ని కావాలి ఒక లక్ష్యాన్ని సాధించడానికి. ఇవన్నీ కలగలుపుని కేసీఆర్  సాధించిన  ఘన విజయమే కాళేశ్వరం ప్రాజెక్టు.
జూన్  రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు పూర్తయి ఏడోఏట అడుగుపెడుతోంది. ఈ ఏడాది తెలంగాణా  రాష్ట్ర అవతరణ దినోత్సవాలు అయిదు రోజులముందే మొదలయ్యాయి. మే ఇరవై తొమ్మిదో తేదీనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్న సాగరం కాళేశ్వరం ప్రాజెక్టు తుది అంకం ఆవిష్కృతం కావడంతో ఈ సంబురాలు ప్రారంభం అయ్యాయని అనుకోవచ్చు. అలనాటి భగీరధుడు గంగమ్మను ఆకాశం నుంచి భూమికి రప్పిస్తే, ఈనాటి అపరభగీరధుడు కేసీఆర్ కాళేశ్వరం గోదావరి జలాలను సముద్రమట్టానికి ఆరువందల మీటర్ల పైకి  తీసుకువచ్చి ‘నీరు పల్లమెరుగు’ అనే నానుడిని నీరుకార్చి కొండ పోచమ్మ ప్రాజెక్టును నీటితో నింపుతున్నారు. దీనితో, భారతదేశ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప ఇంజినీరింగ్ విన్యాసం సాధించిన రాష్ట్రంగా తెలంగాణా చరిత్రపుటలకు ఎక్కింది. ఈ ఒక్క ప్రాజెక్టు చాలు కేసీఆర్ పట్టుదలకు, మొక్కవోని దీక్షకు నిలువెత్తు నిదర్శనం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకే గోదావరి నీళ్ళను కొండ పోచమ్మ ప్రాజెక్టులోకి తోడి పోస్తున్నప్పుడు స్వప్నం సాకారమైందన్న సంతోషం, సంతృప్తి ఆయన కళ్ళల్లో కనిపించాయి.
కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు.
ఆయన మదిలో మెదిలే  ఆలోచనలకు అంతే లేదు. ఇంత చిన్న మనిషి అన్నన్ని పెద్ద ఆలోచనలు ఎలా చేస్తున్నారా అనే విస్మయం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు కేసీఆర్ వాటిని గురించి చెబుతుంటే.
గత ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన మరో ఘన విజయం ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా. ఉమ్మడి రాష్ట్రము విడివడితే తెలంగాణా  అంధకారబంధురం అయిపోతుందని నాడు వినవచ్చిన విమర్శలను తిప్పికొట్టాలని అనుకున్నారేమో తెలవదు కానీ ఈ విషయంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు అనిపిస్తుంది.
గత ఆరేళ్లుగా జంట నగరాల్లో కరెంటు కోతలు లేకుండాపోయాయి. రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా ఇదే పరిస్తితి. దేవులపల్లి ప్రభాకరరావు గారి సారధ్యంలో జెన్కో, ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది కలసికట్టుగా సాగించిన నిర్విరామ కృషి ఇందుకు ప్రధాన కారణం.   
తెలంగాణా ప్రజలు కోరుకున్న రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడి కూడా ఆరేళ్ళు గడిచాయి. అనుకున్నవి అనుకున్నట్టు సాగుతున్నాయని కొందరు అనుకుంటూ వుంటే, ఏదీ, ఎక్కడ అని సన్నాయి నొక్కులు నొక్కేవారు కూడా లేకపోలేదు.
అన్నం వుడికే దాకా వుడికినట్టు తెలవదు, కుతకుత శబ్దం తప్పిస్తే.
ఎవరి పరిపాలనలో అయితే పాలకులతో అవసరం లేకుండా పాలితులకు జీవితం హాయిగా  గడిచిపోతుందో ఆ పరిపాలనను సుపరిపాలనగా చాణక్యుడు అభివర్ణించారు.
ప్రస్తుతం కేసీఆర్ పాలన ఆ రీతిలో సాగుతోందని పొగడ్తలు తగవు కానీ, ‘నేనున్నాను’ అనే భరోసా మాత్రం  ప్రభుత్వం నుంచి పాలితులకు లభిస్తోందని నేను నిశ్చయంగా చెప్పగలను. (EOM)