2, మే 2017, మంగళవారం

పీ ఎల్ 480 – ఓ పాత జ్ఞాపకం

అరవైయేళ్ళ క్రితం వార్తాపత్రికలు చదివే అలవాటు ఉన్న వారికి పీ ఎల్ 480 అనే పదంతో పరిచయం వుండేవుంటుంది. Public Law 480 అనే ఈ పధకం అమెరికన్ ప్రభుత్వానికి సంబంధించింది. 1954లో అప్పటి ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ హయాములో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. వ్యవసాయ, వాణిజ్య అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఈ పధకానికి 1961లో ప్రెసిడెంట్ జే.ఎఫ్. కెనెడీ, శాంతికోసం ఆహారం (Food for Peace) అనే కొత్త పేరు పెట్టారు.

ఆ రోజుల్లో అమెరికా నుంచి ఈ పధకం కింద దిగుమతి చేసుకున్న గోధుమలు, పాలపొడిని ఉచితంగా స్కూలు పిల్లలకు, గ్రామీణ పేదలకు పంపిణీ చేసేవారు. వీటిని కొందరు దళారీలు నల్ల బజారుకు తరలించి లక్షలు అక్రమంగా సంపాదించారు. కొందరు ఆ డబ్బుతో రాజకీయ రంగప్రవేశం చేసి అంచలంచెలుగా పైకి ఎదిగారు.
అమెరికా సదుద్దేశ్యంతో మొదలు పెట్టిన ఈ పధకం వల్ల నిజమైన లబ్ధిదారులకు ఏం ప్రయోజనం జరిగిందో లెక్కలు లేవు కాని, లాభం పొందాలని ప్రయత్నించినవారికి మాత్రం ఏమాత్రం నష్టం జరగలేదు.

ఆ రోజుల్లో మరో విషయం వింతగా చెప్పుకునేవారు. అమెరికాలో ధాన్యం దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన సందర్భాలలో ధరలు పడిపోయి రైతులు నష్టపోకుండా,  గోధుమలను ఓడల్లో నింపి నడిసముద్రంలో పారబోసేవారని, ఇంకా మిగులు వుంటే ఇలా ఇటువంటి పధకాలతో పేద దేశాలకు సరఫరా చేసేవారని వార్తలు ప్రచారంలో ఉండేవి.      

30, ఏప్రిల్ 2017, ఆదివారం

ఇదేమిటబ్బా!


“ఎక్కడెక్కడి విషయాలు, ఎప్పటెప్పటివో సంగతులు రాస్తుంటారు, ఏం జ్ఞాపకశక్తండీ మీది” అంటుంటారు స్నేహితులు చాలామంది.
కానీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే నాకు ఏదీ బొత్తిగా గుర్తుండదని.
“నేను రెండు మూడు ప్రశ్నలు అడుగుతాను, ఒకటి రెండింటికి సరయిన  జవాబులు చెబితే బాహుబలి సినిమాకు తీసుకు వెళ్ళమని నేను అడగను” అంటుంది మా ఆవిడ.
“కొస్చెన్ నెంబర్ వన్. రాత్రి మీరు భోజనంలో బాగుందని మెచ్చుకుంటూ తిన్న కూరేది? నెంబరు టూ ప్రశ్న. నిన్న మీరు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకువెళ్ళిన చొక్కా కలరేమిటి? చెప్పగలరా! చెప్పలేరు. మీ మొహం చూస్తేనే తెలుస్తోంది, చెప్పలేరని. అయ్యొ సంబడం. జ్ఞాపక శక్తి అట, ఈయన్ని మించిన వాళ్ళు లేరట! మళ్ళీ అనకండి, విన్న జనం మొహాన్నే నవ్విపోతారు”

“అది సరే! ఇందాక అనగా వాకింగుకు పోతూ వేడి వేడి కాఫీ కలిపి పక్కన పెట్టి వెళ్లాను. వెడుతూ చెప్పాను కూడా, ఎప్పుడూ ఆ కంప్యూటరులో తల పెట్టి టిక్కూ టిక్కూ నొక్కడం కాదు, అప్పుడప్పుడూ బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది గమనిస్తూ వుండాలని. కాఫీ వేడిగా వుంది, తాగమని చెప్పానా! చూడండి, చప్పగా చల్లారి పోయింది. ఇంతోసిదానికి అబ్బో వాళ్ళు మెచ్చుకున్నారు, వీళ్ళు మెచ్చుకున్నారంటూ ముసి ముసి నవ్వులు. మళ్ళీ కలుపుకు వస్తాను, ఈ సారయినా వేడిగా తాగండి”

28, ఏప్రిల్ 2017, శుక్రవారం

ఇదో తుత్తి.....

1975 నుంచి 2017 వరకు. అంటే నలభయ్ మూడేళ్ళు.


గుర్తింపు పొందిన మీడియా సంష్టలలో పనిచేసే జర్నలిష్టులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు (ACCREDITATION CARDS) ఇవ్వడం అనేది 1975 సంవత్సరానికి పూర్వం కూడా అమల్లో వున్న విధానమే.
నేను రేడియోలో చేరింది 1975 నవంబరు  14 వ తేదీన. ఆ ఏడాది జర్నలిస్టులకి  ఇచ్చిన గుర్తింపు కార్డుల  గడువు మరో నెలన్నర రోజుల్లో ముగిసే సమయంలో అన్నమాట. ఆ కొద్ది వ్యవదానానికి ఈ గుర్తింపు కార్డు తెచ్చుకోవడం ఎంత గగనమో ఈ నాటి జర్నలిస్టులకు తెలిసిందే. అయితే  ఆనాడు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్  గా పనిచేస్తున్న పన్యాల రంగనాధ రావు తరహానే వేరు.    
నేను రాసుకున్న ‘రేడియో రోజులు’ అనుభవాల్లో ఆయన్ని గురించి రాసుకున్నది గుర్తు చేసుకోవడం అప్రస్తుతం కాబోదు.
“హైదరాబాద్ లో రేడియోలో చేరిన కొత్తల్లో ఒక రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లేసరికి రంగనాధరావు గారు ఏదో పనిచేసుకుంటూ కనిపించారు. ‘ఏం పని మీద వచ్చావ’న్నట్టు నా వైపు చూసారు. నా  మొహంలో రంగులు మారడం చూసి,ఇక్కడ మీకు పనేమిటి? మీరు రిపోర్టర్. బయట తిరిగితే కదా నాలుగు వార్తలు తెలిసేది?  రోజూ సెక్రెటేరియట్ కు వెళ్ళండి. మంత్రులో, అధికారులో  చెప్పేది వినండి. నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకు వచ్చి, తెచ్చి నా మొహాన కొట్టండి. అంతే! సింపుల్అని తేల్చేసారు. అలా అంటూనే, “ఇంతకీ ఆఫీసుకు ఎలా వచ్చారు?” అని మరో అర్ధం కాని ప్రశ్న సంధించారు. ఆటోలో వచ్చుంటారు. అవునా! అలా అయితే మీ జీతం డబ్బులన్నీ ఈ రిపోర్టర్ తిరుగుళ్ల కోసం ఆటోలకే తగలెయ్యాల్సి వుంటుంది. వార్తల సంగతి తరవాత. ముందు నేనో ఉత్తరం ఇస్తాను. దాన్ని తీసుకువెళ్ళి సమాచార శాఖలో ఇవ్వండి. అక్కడ అక్రిడేషన్ కార్డు తీసుకుని ఆర్టీసీ ఆఫీసుకు వెళ్ళండి. వాళ్ళు ఇచ్చే బస్ పాసు తీసుకున్న తరవాతే, మిగిలిన ఏ పనులయినా!  తెలిసిందాఅన్నారు. తెలియకపోవడానికి ఏముంది. కానీ ఇలాటి పైఅధికారులు కూడా వుంటారా అన్నదే అంతవరకూ తెలియని విషయం.”
అలా ఒక్క రోజులో తెచ్చుకున్న ‘అక్రిడిటేషన్’ నా విషయంలో ఇన్నేళ్ళుగా కొనసాగుతూనే వస్తోంది. (నేను మాస్కోలో వున్న కాలానికి కూడా) బహుశా నాకంటే సీనియర్లు కొంతమంది ఉండివుండవచ్చేనేమో కానీ  ఒకే ఊరిలో (హైదరాబాదు) ఒకే ఒక సంస్థ తరపున వరసగా అన్నేళ్ళు ఆ ‘గుర్తింపు’ వున్నది నేను ఒక్కడినే అని గట్టిగా చెప్పగలను.
ఈ ఏడాది ఈ కార్డు రావడం కొంచెం ఆలస్యం అయింది. సమాచార కమీషనర్ నవీన్ మిట్టల్  కు ఒక ఎస్సెమ్మెస్ పెట్టాను. వారం తిరక్క ముందే కార్డు చేతికి వచ్చింది. అంతే కాదు, జర్నలిష్టుల హెల్త్  స్కీము అర్హుల జాబితాలో నాకు నేనుగా చేరడానికి వీలుగా “USER NAME, PASSWORD” వెనువెంటనే ఎస్సెమ్మెస్ పంపారు.
తెలంగాణా ప్రభుత్వానికి, సమాచార శాఖ అధికారులకు, తెలంగాణా ప్రెస్ అకాడమీకి, వయోధిక పాత్రికేయ సంఘానికి  నా కృతజ్ఞతలు.
INDEPENDENT JOURNALIST కేటగిరీలో ఇచ్చిన ఈ కార్డు గౌరవాన్ని కాపాడడానికి నేను కష్టపడాల్సి వుంటుంది. పడతాను కూడా.  


27, ఏప్రిల్ 2017, గురువారం

మారింది రోజులా! మనుషులా!!


తన రంగంలో క్రమంగా నిలదొక్కుకుని, జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన ఒక కళాకారుడిని ఇంటర్వ్యూ చేస్తూ అడిగాడు విలేకరి.
“జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూసారు. లేని రోజులకు, ఉన్న రోజులకు తేడా ఏమైనా కనిపిస్తోందా’ అని.
“హస్తిమశకాంతరం’ జవాబు వచ్చింది వెంటనే.
“లేని రోజుల్లో లేనిడబ్బు ఒక్కటే సమస్య. ఇప్పుడో డబ్బు తప్ప అన్నీ సమస్యలే”
“అదెలా?”
“ఆ రోజుల్లో డబ్బు లేకపోయినా మనుషుల నడుమ ఆప్యాయతలు, అనురాగాలు ఉండేవి. స్నేహితుల సంగతి చెప్పక్కర లేదు. ఎవరు ఎవరి మీద పడి  తింటున్నాడో ఎవరికీ పట్టేది కాదు. ఇప్పుడలా కాదు. అన్నిటికీ లెక్కే. అవసరానికి ఎవరినైనా ఏదైనా అడిగితే ఆ అవసరం వెనుక ఏదైనా మర్మం ఉందా అనే శోధింపు ఎక్కువైంది. ఇతరుల గురించి కాదు, నేను చెప్పేది. నేనైనా అంతే! ఈ తేడా ఎలా వచ్చిందో ఏమిటో మరి!”
“.........”
“రేపెలా గడుస్తుంది అనే అ రోజుల్లో రేపటి గురించిన బెంగ ఎవ్వరికీ  వుండేది కాదు. ఏపూటకాపూట హాయిగా గడిచిపోయేది. వున్నవాళ్ళు, లేనివాళ్ళు వున్నదా౦తోనే గడుపుకునేవాళ్ళు. లేదనే లోటు వుండేది కాని, లేదన్న మనాది ఉండేది కాదు”       
“......”
“మరో విషయం చెప్పనా! కష్టాలు తెప్పించే కన్నీళ్లు కళ్ళల్లో తిరిగేవేమో కాని, మొహంలో చిరునవ్వులు మాత్రం చెరిగేవి కావు. తరాలకు సరిఅడే ఆస్తులు పోగుపడ్డాయి కానీ, ఆ నాటి సంతృప్తి కలికానికి కూడా మిగల్లేదు”

విలేకరి దగ్గర అడగడానికి ప్రశ్నలు లేవు, నోట మాటలూ  లేవు. 


(COURTESY: IMAGE OWNER)

26, ఏప్రిల్ 2017, బుధవారం

మరుగున పడిన ‘మణిరత్నం’


కస్తూరి రామచంద్ర మూర్తి. ఈ పేరు ఎవ్వరికీ తెలియదు. జర్నలిష్టు మిత్రుడు దివాకర్  కు స్వయానా మేనల్లుడు. కాకపొతే వయస్సులో కాస్త పెద్దవాడు. పుణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సు రెండో బ్యాచ్ . గోల్డ్ మెడలిష్ట్. అక్కడ కట్ చేస్తే...
ఏడిద నాగేశ్వరరావు (మా రేడియో సహచర ఉద్యోగి, నాటక ప్రియుడు ఏడిద గోపాల రావుకు స్వయానా అన్నగారు) విశ్వనాద్ దర్శకత్వంలో  శంకరాభరణం సినిమా మొదలు పెట్టారు. బాలు మహేంద్ర సినిమాటోగ్రాఫర్. మొదటి షెడ్యూలు అయిందో లేదో తెలవదు, బాలూ మహేంద్రకి మొదటిసారి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. చేసేది విశ్వనాద్ గారి సినిమా. వదిలిపెట్టాలంటే కష్టమే. చివరికి విశ్వనాద్ గారే కల్పించుకుని, డైరెక్షన్ చేసే ఛాన్సు అరుదుగా వస్తుంది కాబట్టి బాలూ మహేంద్రకి ఆ అవకాశం వాడుకోమని చెప్పి పంపేశారు. అంతవరకూ శంకరాభరణం సినిమాకి ఆపరేటివ్  కెమెరామన్  గా పనిచేస్తున్న కస్తూరి రామచంద్ర మూర్తికి మొత్తం బాధ్యత అప్పగించారు. సినిమా టైటిల్స్  లో మాత్రం బాలూ మహేంద్ర పేరునే వుంచేసారు. కాకపోతే విశ్వనాద్ తరువాత సినిమా శుభోదయం అనుకుంటా, దానికి సినిమాటోగ్రాఫర్  గా కస్తూరి రామచంద్ర మూర్తినే పెట్టుకున్నారు. ఆ రెండూ ఘన విజయం సాధించాయి కానీ కస్తూరి వారికి రావల్సినంత పేరు రాకపోగా అవకాశాలు కూడా రాలేదు.
సినిమాలు తీసేటప్పుడు కెమెరామన్ల జేబులో ఒక చిన్న పరికరం వుంటుంది. (ఏదో మీటర్ అంటారు) దాన్ని నటుడి మొహం మీద పెట్టి లైటింగుని సరిచేస్తారు (ట). అయితే మన కస్తూరి రామచంద్ర మూర్తి మాత్రం మొహం మీద అరచేయి అడ్డుగా పెట్టి లైటింగు సరిచేస్తారట, పూర్వకాలంలో వైద్యులు నాడిపట్టుకు చూసి రోగనిర్ధారణ చేసినట్టు.  తన రంగంలో అంతటి ఘనుడామూర్తిగారు.  
సినిమా రంగంలో ప్రతిభ వుంటే సరిపోదు, అదృష్టం కూడా వుండాలి అంటారు.

అందుకు కస్తూరివారు ఒక మంచి ఉదాహరణ.        

అవార్డుకే అవార్డు వచ్చింది


మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లో, హనుమాన్  వ్యాయామ శాలకు దగ్గర్లో, కందస్వామి లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి  వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీ, ఆ హాల్లో కర్టెన్లు, కుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయని, అంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడు, సినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు)    సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతం, పాటలు, హీరోయిన్ కి మాటలే లేవు, యేవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు ముక్కలు తప్ప. (జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడు, నాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే)  ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది, తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు.
ఆశ్చర్యంగా రెండో వారం నుంచే మంచి టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.
కొన్ని రోజులు పోయాక, విలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ వేశారు. నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటు, కాకీ షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చుని, కన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్  లో మళ్ళీ ఈ లోకంలో పడడానికి ఆయనగారికి కొంత వ్యవధి పట్టింది. అంతా లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.
ఇవ్వాళ మళ్ళీ వెళ్లి ఆ దాదా సాహెబ్ ఫాల్కే  అవార్డు గ్రహీతను అభినందించాలని అనిపించింది. కానీ తర్వాత తట్టింది.

ఆయన్ని అభినందించాలా! ఆ అవార్డుని అభినందించాలా!      

ఫస్ట్ డే..ఫస్ట్ షో.....


“అన్ని సినిమాలు ఇలానే చూస్తుంటారా మీరు?”
“అబ్బే అలా ఎలా చూస్తానండి. నా అభిమాన హీరో ఉంటేనే మొట్ట మొదటి ఆటకు వెడతాను”
“అంటే మీ ఫేవరెట్ హీరో లేకపోతె ఆ సినిమా చూడరా!”
“నాకునచ్చిన హీరోయిన్ వుంటే హీరో గురించి పట్టించుకోను. అలాగే, మంచి దర్శకుడు వుంటే హీరో, హీరోయిన్లు నచ్చకపోయినా చూస్తాను. ఒక్కోసారి కధ నచ్చితే ఈ ఫేవరెట్ల సంగతి పక్కన పెట్టి ఆ సినిమాకి వెడతాను”

“నాకర్ధం అయింది ఏమిటంటే, ఏతావాతా మీరు విడుదల అయిన అన్ని సినిమాలు నాగా పెట్టకుండా ఫస్ట్ డే...ఫస్ట్ షో చూసేస్తారని. అదీ టిక్కెట్టు కొనుక్కుని. మీరు నిజంగా కళల్ని పోషించే రాయలవారి టైపండి మహా ప్రభో!”