17, డిసెంబర్ 2016, శనివారం

వాదాలు, వాయిదాల సమావేశాలు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 18-12-2016, SUNDAY)

మొత్తం మీద పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. ముగిశాయి అని చెప్పొచ్చు కానీ, జరిగాయని చెప్పడం కష్టం. నియమావళి ప్రకారం నిర్వహించాలి కనుక  తూతూ మంత్రంగా సమావేశాలను జరిపినట్టు అనిపిస్తోంది. జరిగినన్నాళ్ళు ఏనాడూ  సభాకార్యక్రమాలు  ముందు నిర్ణయించుకున్న  విధంగా  జరిగింది లేదు, వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరాఖరుకు నిరవధికంగా వాయిదా పడడం తప్పించి.
ప్రతిపక్షాలు నిర్హేతుకంగా అడ్డుకోవడం వల్లనే ఈ పరిస్తితి తలెత్తిందని పాలక పక్షం వాదన. సభను సజావుగా నిర్వహించే చిత్తశుద్ధి పాలకపక్షంలో లోపించిందని ప్రతిపక్షాల ప్రతివాదన. మొత్తానికి ఎవరి పాత్ర వారు పోషించారు. ఆ పాత్రల్లో జీవించారు. కధను రక్తి కట్టించారు. కడకు సమావేశాలు ముగిశాయని అనిపించి చేతులు దులుపుకున్నారు.
యావత్ జాతిని ప్రభావితం చేసిన పెద్ద నోట్ల రద్దు దరిమిలా దేశంలో తలెత్తిన పరిణామాలే సమావేశాలను సయితం ప్రభావితం చేశాయి. సభ ద్వారా ప్రధాని మోడీ జాతికి సంజాయిషీ చెప్పాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పట్టుబట్టింది.సభలో తాను గొంతు విప్పితే భూకంపం వస్తుందన్న రీతిలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధి సభ ‘వెలుపల’ హెచ్చరిక చేశారు. నల్లకుబేరులపై తాను  ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రంతో అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తిపోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ సభ ‘వెలుపల’ ఎక్కడో ఒక బహిరంగసభలో వ్యాఖ్యానించారు. ఒక పక్క పార్ల మెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు వీరిరువురు సభలో కాకుండా ఇలా  ‘బయట’ మాట్లాడ్డం విడ్డూరంగా అనిపిస్తుంది. చర్చలకు, వివరణలకు అత్యున్నత వేదిక పార్లమెంటును ఒదిలిపెట్టి ‘వెలుపల’ గంభీర ప్రకటనలు చేయడం వెనుక ఉద్దేశ్యాలు ఏమైఉంటాయన్న దానిపై మీడియాలో కొత్త చర్చ మొదలయింది. ఏదిఏమైనా పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజల ఇబ్బందులపై జనం తరపున మాట్లాడే అమూల్య అవకాశాన్ని ఇటు ప్రతిపక్షాలు,  అన్ని విషయాలు సాధికారికంగా  వివరించి, ఏవైనా సందేహాలు వుంటే వాటిని  నివృత్తి చేయగలిగిన సువర్ణావకాశాన్ని అటు  పాలకపక్షం చేజేతులా జారవిడుచుకున్నాయనే చెప్పాలి.
కొత్త కోడలు కాపురం చేసే కళ కాలి మెట్టెలు చూసే చెప్పొచ్చన్నట్టు ఈ సమావేశాలు ఇలానే జరుగుతాయని మొదటి రోజునే బోధపడింది.
పెద్ద నోట్ల రద్దు గురించి ప్రధాని సభలో ఉండగానే చర్చ జరగాలని ప్రతిపక్షాలు భీష్మించాయి.
గతంలో ప్రతిపక్షంలో వుండగా ఇలానే సభను అడ్డుకున్న బీజేపీ, గతాన్ని హాయిగా  మరచిపోయి  మొండికేసింది. పాలకపక్షం, ప్రతిపక్షం రెండూ కూడా  తమదయిన పాత్రలను తమదయిన బాణీల్లో పాత్రోచితంగా అవధులు మీరి మరీ పోషించాయి. పరిస్తితి ఈ విధంగా గాడి తప్పడానికి మీరు కారణం అంటే మీరు కారణంఅని ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకున్నారు తప్పిస్తే,  ఏఒక్కరూ, ఉమ్మడిగా ‘మనం’ కారణం అనుకోలేదు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏ దిశగా సాగుతున్నదో అర్ధం చేసుకోవడానికి ఇదొక్కటి చాలు.
చట్టసభలు సజావుగా నడవాలంటే  పాలక పక్షం ముందు బాధ్యత తీసుకోవాలి. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి. ఈ పవిత్ర కర్తవ్య నిర్వహణలో పాలక ప్రతిపక్షాల వైఫల్యమే, బాధ్యతారాహిత్యమే  పార్లమెంటు సమావేశాలు ఇలా నిరర్ధకంగా ముగియడానికి ప్రధాన కారణం. ఈ విషయం నిర్ధారించడానికి పార్లమెంటరీ నియమ నిబంధలని అపోసన పట్టక్కరలేదు. బజారున పోయే ఏ సామాన్యుడిని అడిగినా ఇదే చెబుతాడు.
నిజానికి సభ సజావుగా నడవకపోతే ప్రతిపక్షానికే  నష్టం. పాలకపక్షానికి ఒకరకంగా వెసులుబాటు. సభ జరిగేలా చూసుకుంటే పాలక పక్షం తప్పొప్పులను ఎత్తి చూపి నిలదీయడానికి ప్రతిపక్షాలకు అవకాశం లభిస్తుంది. సభ జరక్కపోతే ఏదో అప్పటికి మమఅనిపించి పాలక పక్షం బయటపడొచ్చు. అయితే సభను అడ్డుకోవడం ద్వారా లభించే ప్రచార లాభం ‘ఉభయులను’ మరోరకంగా ఆలోచింపచేస్తున్నాయి. అందుకే ఇన్ని గడబిడలు. ఇన్ని శషభిషలు.      
ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఒక పార్టీని ఓడించి మరో పార్టీకి పట్టం కడుతున్నారు అంటే ఏమిటి అర్ధం. పాత ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి, కొత్తగా వచ్చే ప్రభుత్వం అయినా కొత్త బాటలో నడవక పోతుందా అనే ఆశతో కదా!
గత  లోక సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని అక్కున చేర్చుకుని అంతటి స్థాయిలో ఆదరించడానికి దోహదం చేసిన అంశాల్లో ఇదొకటి. మార్పుకోరి వారు మోడీకి  ఓటు వేసారు. ఎన్నికలకు ముందు మోడీ కానీ, ఆయన నేతృత్వం వహించిన ఎన్డీయే కూటమి కానీ ప్రజలకు కొత్తగా చేసిన పెద్ద పెద్ద వాగ్దానాలు కూడా ఏమీ లేవు. యేవో కొన్ని నామకార్ధం చేసినా వాటిపై సామాన్యులు పెట్టుకున్న ఆశలు పెద్దగా లేవనే చెప్పాలి.  ప్రజలు మోడీకి పట్టం కట్టింది ఆయన ఏదో మార్పు తీసుకువస్తాడనే ఆశతోనే. ప్రధాని పీఠం ఎక్కిన కొత్తల్లో ఆయన ప్రదర్శించిన వ్యవహార శైలి, చెప్పిన మాటలు, చేసిన ప్రకటనలు ఈ ఆశలకు కొత్త ఊపిరిలూదాయి.
అయితే మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో అధికార పక్షం అటు సభలో, వెలుపలా గతాన్ని మరచి వ్యవహరించిన తీరు, సమర్ధించుకున్న విధానం ప్రజలు మోడీ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లాయి. గతంలో మీరు అధికారంలో వున్నప్పుడు మీ నిర్వాకం ఏమిటిఅని ఎదురు ప్రశ్నించడం,  ‘మార్పుతెస్తామన్న సర్కారుకు శోభస్కరం కాదు.
ఇక కాంగ్రెస్ విషయం తీసుకుంటే, గత ఎన్నికల తరువాత ఆ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. ఒకప్పుడు దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీకి లోకసభలో ప్రధాన ప్రతిపక్షం హోదాకు సరిపడనంతగా అతి తక్కువ స్థానాలు కట్టబెట్టి ఓటర్లు ఆ పార్టీపై తమ కసి ప్రదర్శించారు. ఆ స్థాయిలో పరాజయం మూటగట్టుకున్న ఆ పార్టీ నేతల నోళ్ళు చాలా రోజులు మూగనోము పట్టాయి. కానీ ఆ నోళ్ళు మళ్ళీ పెగలడానికి కారణం కాంగ్రెస్  పార్టీ నాయకత్వం ప్రతిభ ఎంతమాత్రం కాదు. ఈ పుణ్యమో, పాపమో ఆ చలవ పూర్తిగా మోడీ ప్రభుత్వానిదే. ఇందుకు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి రుణపడివుండాలి.
ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు మనకు రేపటి గురించి ఆలోచించే  రాజనీతిజ్ఞులు లేరు. అందరూ ఈరోజు గురించి తపన పడే  రాజకీయ నాయకులే.  
పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత రాజకీయ ప్రయోజనమో, లేదా మీడియా ప్రచారమో సంపాదించుకుని ఉండవచ్చు. కానీ అంశం ఎలాటిదయినా, అందులోని తీవ్రత ఎంతటిదయినా సభ జరగకుండా అడ్డుకోవడం విజ్ఞత అనిపించుకోదు. గతంలో ఇదేమాదిరిగా సభను అడ్డుకుకున్న బీజేపీ తీరును గుర్తుచేసి, ఆ పార్టీ గతాన్ని ఎండగట్టడంవరకు పరిమితమై, సభను నడపడంలో సహకరించి వుంటే కాంగ్రెస్ లోని మార్పునుప్రజలు గమనించేవారు.
హుందాగా ప్రవర్తించకపోవడం ద్వారా,  మీడియా ప్రచారాన్ని మించిన ప్రజాదరాన్ని బీజేపీ, కాంగ్రెస్ రెండూ దారుణంగా కోల్పోయాయి.
పార్లమెంటు సమావేశాలకు అయ్యే ఖర్చు నిమిషానికి రెండున్నర లక్షలు, రోజుకు ఆరుకోట్లు, ఇన్ని రోజులకు వెరసి ఇన్ని వందల కోట్లు అంటూ గణాంకాలు చెబుతుంటారు. మరి సభ జరక్కుండా చేసి ఎదుటివారి మీద నిందలు మోపుతున్న ఈ రాజకీయ పార్టీలు ఇంతటి స్థాయిలో ప్రజాధనం దుబారా కావడానికి  యేమని సమాధానం చెబుతాయి. ఆయా పార్టీలనుంచి ఈ డబ్బును  తిరిగి వసూలు చేసే విధంగా  రాజ్యాంగ సవరణ చేయాలని ఎవరయినా కోరుకుంటే తప్పేమిటి?           
పొతే, పార్లమెంటు సమావేశాల తీరుతెన్నులపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బీజేపీ కురు  వృద్ధుడు లాల్ కిషన్ అద్వానీ అసహనం వ్యక్తం చేశారు. సామాన్యుడి మనసులోని మాటనే వారు తమ నోట పలికారు.  ప్రజాస్వామ్య వేదికలు ఒత్తిళ్లకు గురవుతున్నాయని చర్చావేదికగా ఉండాల్సిన పార్లమెంటు యుద్ధ క్షేత్రంగా మారిపోయిందన్న రీతిలో  ఆవేదన వెలిబుచ్చారు. సామాన్యుడి మాటను రాజకీయ నాయకులు ఎటూ చెవిన పెట్టరు. దేశ రాజకీయాల్లో తలపండిన పెద్దమనుషులు, అనేక (రాజకీయ) యుద్దముల ఆరితేరినవారు అయిన ప్రణబ్  ముఖర్జీ, అద్వానీలు, ‘సభను హుందాగా నడిచేట్టు చూడండి’ అంటూ   ఇచ్చిన సలహా అయినా కనీసం చెవికెక్కించుకుంటారేమో చూడాలి.    
తోక టపా: సరే! శీతాకాల సమావేశాలు ముగిశాయి. పార్లమెంటు సమావేశాలు మళ్ళీ జరుగుతాయి కదా! అవెలా సాగుతాయి అనే ప్రశ్నకు జవాబు చెప్పడానికి జ్యోతిష్యం తెలిసివుండనక్కరలేదు.  (17-12-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595



16, డిసెంబర్ 2016, శుక్రవారం

కళ్ళనీళ్ళ పెళ్లి


1971 డిసెంబరు 15 వ తేదీ   రాత్రి  మద్రాసు నుంచి అంబాసిడర్ కారులో తిరుపతి ప్రయాణం. దారిలో భోరున వాన. అట్లా ఇట్లా కాదు, ఉరుములు, మెరుపులుపిడుగులు. మధ్యమధ్యలో ఆగుతూ తెల్లారేలోపునే తిరుమల చేరాము. ఎస్వీ కాటేజీలో పైన గదులు తీసుకున్నాము. పురోహితుడు ఎలా దొరికాడో తెలవదు.  మా ఆవిడ పిన్నివసుంధర కొన్న నీలం రంగు ఫారెన్ నైలెక్స్ చీరె పెళ్లి చీరె. నేను ధోవతి కట్టుకున్నానో, ప్యాంటు షర్టు తో పెళ్లి చేసుకున్నానో గుర్తు రావడం లేదు. ఎందుకంటే సందర్భం, సన్నివేశం అలాంటివి.  తొమ్మిదీ పది గంటల  నడుమ పెళ్లి జరిగిపోయింది. వెంటనే వెళ్లి బాలాజీ దర్శనం చేసుకున్నాము. ఇప్పట్లోలా క్యూ లైన్లు లేవు. కొండ దిగి వచ్చి భోజనం చేసి వచ్చిన కారులోనే మళ్ళీ మద్రాసు వెళ్ళాము. మా ఆవిడ స్నేహితులు  టీ నగర్ హోటల్లో విందు ఇచ్చారు. అటునుంచి మా మామగారి వద్దకు వెళ్లాం. కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. నీకు ఏం తక్కువ చేస్తానని అనుకుని ఇలా పెళ్లి చేసుకున్నావని మా ఆవిడను అడిగారు. కన్నీళ్ళే జవాబు.
రిజర్వేషన్ల గొడవ లేని రోజులు. అంచేత  16 వ తేదీ రాత్రి బయలుదేరి రైల్లో మర్నాడు ఉదయం బెజవాడ చేరుకున్నాము.  మా పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళాము. మా అమ్మగారు కూడా అక్కడే వుంది. మమ్మల్ని  చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కాళ్ళకు దణ్ణం పెట్టగానే దగ్గరకు తీసుకుని మనసారా ఆశీర్వదించింది.
పెళ్లోద్దు పెళ్ళాం కావాలిఅనే నా మొండి పట్టుదల ఫలితం మా పెళ్లి. ఇరువైపుల పెద్దల చేత కళ్ళనీళ్ళు పెట్టించింది కూడా. బహుశా అదే ఆఖరిసారి  కావచ్చు.
మా పెళ్ళికి పెద్దల ఆమోదం లభించింది అన్న సంతోషంలో ఆంద్ర జ్యోతి ఆఫీసుకు వెళ్లి ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలుసుకుని మా పెళ్లి వృత్తాంతం తెలియచేశాము. ఆయన మా ఇద్దర్నీ మెచ్చుకోలుగా చూస్తూ, ‘రోజూ ఎన్నో ఆదర్శాలు వల్లె వేస్తుంటాము.  నువ్వు చేసి చూపించావు. వెళ్ళండి. హాయిగా కాపురం చేసుకోండి. మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరుతున్నాను, అని చెప్పేవరకు నీకు సెలవు ఇస్తున్నాను. ఇదే మీకు నా పెళ్లి కానుక’ అన్నారాయన.   

తోకతపా: ఇలాంటి పెళ్లిళ్లకు ఫోటోలు వుండవు, జ్ఞాపకాలు తప్ప.
(16-12-2016)

15, డిసెంబర్ 2016, గురువారం

లవ్ శాల్యూట్!


సుఖంగా పెరిగి కష్టాలు పంచుకోవడం యెంత కష్టమన్నది కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగిన వారికి ఓ పట్టాన అర్ధం కాదు. అందుకే నన్ను కట్టుకుని మా ఆవిడ పడ్డ కష్టాలు నాకెన్నడూ తెలవదు. తెలిసినా అది ఆమె బాధ్యత అనుకున్నాను, బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు ఉదాహరణ అయిన నేను.
మా కాపురానికి  ఈ రోజుతో నలభయ్ అయిదేళ్ళు. మా ప్రేమ వివాహం  కాలపరీక్షను తట్టుకుని నిలిచిందని కాలరు ఎగరేయొచ్చేమో.
నా కారణంగా కష్టాలు పడ్డా, అరవై అయిదేళ్ళ వయస్సులో మా ఆవిడను కన్నసంతానం మాత్రం సుఖపెడుతూనే వున్నారు. నా వల్లఆమెకు జరిగిన మేలు ఇదొక్కటేనేమో!.
అదేమిటో చిత్రం! 
అదృష్ట, దురదృష్టాలు రెండూ పోటీ పడి నన్ను వరించాయి.


ఈ సందర్భంగా ఒక అసందర్భ ప్రలాపం.     
జర్నలిష్టు కురువృద్ధుడు వీ.హనుమంతరావు గారి గురించి రాస్తూ సాక్షి పత్రికలో నేను రాసిన వ్యాసంలో కొన్ని వాక్యాలను ఎక్కడెక్కడినుంచో చాలామంది  మహిళలు ఫోను చేసి మరీ  మెచ్చుకున్నారు. అవే ఇవి:
“గొప్ప జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం  ఆ జర్నలిష్ట్ భార్యకి మాత్రమే. అనుభవంతో చెబుతున్న మాట ఇది. ప్రపంచం బాధ్యత తప్ప ఇంటి బాధ్యత పట్టని గొప్ప జర్నలిష్టులు నాకు చాలామంది తెలుసు. జీ కృష్ణ గారు వారిలో అగ్రగణ్యులు. అలాటి విశిష్ట వ్యక్తులను గౌరవించేటప్పుడు విధిగా వారిని భరించిన భార్యలను కూడా గుర్తుపెట్టుకుని, గుర్తించి గౌరవించాలి. ఆ విధంగా హనుమంతరావు గారికి లభించిన గౌరవ ప్రతిపత్తుల్లో న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన సగంవాటా నిస్సంశయంగా ఆయన అర్ధాంగి సరళ గారికే దక్కాలి”

(16-12-2016)

పలుకే బంగారమాయెరా! బాపూ నీ పలుకే......


(ఈరోజు బాపూ గారి జయంతి)
Srinivasulu Bhattaram గారని నాకొక ఇంటర్ నెట్ మిత్రులు వున్నారు. చక్కని రాయసకాడు. సున్నితమైన హాస్యం ఆయన రచనల్లో చిప్పిల్లుతూ వుంటుంది. ఆయన  నాలాగే బాపూ రమణలవీరాభిమాని. బాపూ గారితో వ్యక్తిగత సన్నిహిత పరిచయం వున్న అదృష్టవంతులు కూడా.  ఆయన ఇంటిపేరు తెలుగులో ఎలారాస్తే యేమో అని యధాతధంగా ఇంగ్లీష్ లోనే ఇవ్వాల్సివస్తోంది. బాపూ గారి గురించి ఆయన ఒక మెయిల్ పంపారు. బాపూ అభిమానులందరూ చదవాల్సిన  విషయాలు అందులో  వున్నాయి.  కానీ శ్రీనివాసులు  గారికి ఓ అలవాటు. ఆయన అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్ లోనే పంపుతారు. అంచేత మూడే మూడు పంక్తులు, వారి అనుమతి వుంటుందనే విశ్వాసంతో,  కింద ఇస్తున్నాను.

నిన్న (25-08-2013) మాటీవీలో ప్రసారమయిన ఫిలిం ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో బాపు గారికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇవ్వడం చూసాను. దర్శకుడు రాఘవేంద్రరావు ఆయనకు అవార్డ్ అందచేసారు. అవార్డ్ ఇచ్చాక ...యాంకర్స్ ఆనవాయితీగా బాపుగారిని కొన్ని మాటలు చెప్పమన్నారు. ఆయన చెప్పిన మాటలు....అక్షరాలా ....కొన్ని మాటలు....’ “
(26-08-2013నాటి నా బ్లాగునుంచి)


14, డిసెంబర్ 2016, బుధవారం

నిజంగా అపురూపం


అపురూప దృశ్యాలు అనుదినం అనుభవంలోకి రావు. అవి చాలా అరుదుగా తటస్థ పడతాయి కాబట్టే అపురూపం.
నిన్న సాయంత్రం అటువంటి అనుభూతి అనుభవంలోకి వచ్చింది.
ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్  అధికారులు. ఒకానొక కాలంలో ఈ దేశాన్ని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని పాలించిన, ఒక రకంగా శాసించిన అధికారులు వాళ్ళు. నా జర్నలిష్టు జీవితంలో అనేక పర్యాయాలు వారిని కలుసుకోగల ఆవకాశం లభించింది. గంటలపాటు వెయిట్ చేసినా పని ఒత్తిడిని బట్టి కలవడానికి వీలులేని బిజీ వ్యక్తులు ఈరోజు విశ్రాంత అధికారులుగా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ హైదరాబాదులో నిన్న జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయి పాత సంగతులు నెమరు వేసుకున్నారు. డెబ్బయి ఏళ్ళ నుంచి 102 సంవత్సరాల వరకు  వివిధ వయస్సుల్లో వున్న వీరిలో చాలామంది అత్యంత ఉన్నత ఉద్యోగాలు నిర్వహించారు. కార్యదర్శులుగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా, పోలీసు డైరెక్టర్ జనరల్స్ గా పనిచేసిన వీరిలో అనేకులు నా పూర్వాశ్రమంలో వృత్తిరీత్యా పరిచయస్తులే కనుక పలకరింపులకు, పాత ముచ్చట్లకు ఆ వేదిక ఒక విడిదిగా మారింది.
ఇక సందర్భం.
ఐసీఎస్ అధికారి, ఎందరో ఐఏఎస్ అధికారులకు గురు సమానులు అయిన సీఎస్ రామచంద్రన్ శతజయంతి. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గా పదవీ విరమణ చేసిన గాయత్రీ రామచంద్రన్ తండ్రి గారు. వారు కుటుంబ స్నేహితులు కాబట్టి ఆ పరిచయంతో అందిన ఆహ్వానంతో వెళ్ళిన బయటి వారిలో అంటే ఐఏఎస్ కానివారిలో డాక్టర్ ఏపీ రంగారావు, మా అన్నయ్య రామచంద్ర రావు, డాక్టర్ బాలాజీ, జ్వాలా, నేనూ ఉన్నాము. సి ఎస్ రామచంద్రన్ గురించి ప్రచురించిన గ్రంధాన్ని 102 ఏళ్ళ వృద్ధ ఐసీఎస్ అధికారి శ్రీ వీ.కే.రావు గారు ఆవిష్కరించారు. వారు గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, డాక్టర్ నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతిగా ఉన్నకాలంలో వారికి ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. చేతి కర్ర సాయంతో నడిచి వచ్చిన ఆ శతాధిక వృద్ధ మూర్తి వేదిక ఎక్కి పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించడం నిజంగా ఒక అపురూప దృశ్యం.   

         


రామోజీరావు మొదటి ఓటమి


(నిన్న హైదరాబాదులో మరణించిన వెటరన్ జర్నలిస్ట్  శ్రీ వి.హనుమంతరావు రాసిన జర్నలిస్ట్ అంతర్వీక్షణంపుస్తకం నుంచి కొన్ని భాగాలు- 2012లో నా బ్లాగులో రాసింది. సుమారు పదివేలమంది స్పందన చూరగొన్న రచన. ఆ గొప్పతనం ఆయనదే)
యు.ఎన్.ఐ. నుంచి రాజీనామా చేసి హైదరాబాదులో కొత్తగా ప్రారంభించిన ఈనాడుఎడిషన్ లో చేరాను. నాతో  కలిపి మరో ముగ్గురు ఎడిటర్లు ఏబీకే ప్రసాద్, పొత్తూరి వేంకటేశ్వర రావు, టీవీ కృష్ణ పనిచేసేవారు. రామోజీ రావు చీఫ్ ఎడిటర్. వ్యాసాలూ, సంపాదకీయాలు రాయటం రాకపోయినా, ‘ఈనాడుఅన్ని ఎడిషన్లు చదివి ఆయనకు తప్పు అని తోచినవన్నీ ఎర్ర పెన్సిల్ తో మార్క్ చేసేవారు. ప్రముఖ ఇంగ్లీష్ పత్రికల్లో  వచ్చే ఆసక్తికరమయిన వ్యాసాలను అనువాదం చేయించి ఈనాడులో ప్రచురించేవారు. హిందూ పత్రిక స్తాయిలో తెలుగులో పత్రిక తేవడం తన లక్ష్యం అని చెప్పుకునేవారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చేవరకు  ఒకరకంగా బాగానే వుందనిపించేది. ఆ తరవాత రామారావును, తాజాగా చంద్రబాబును భుజాన వేసుకుని పత్రికను నడిపించిన వైనం పాఠకులకు చిరపరిచితమే.”  
ఈనాడులో ఉద్యోగం అంటే ఎన్నాళ్ళు వుంటుందో ఎప్పుడు వూడుతుందో తెలవదు. హైదరాబాదులో నలుగురు పాత్రికేయులు ఎక్కడయినా కలిస్తే అందులో ఇద్దరు ఈనాడుమాజీలు. వ్యాపార రీత్యా ఆయన (రామోజీరావు) యెంత ప్రతిభ చూపించారో, ఉద్యోగుల విషయంలో అంత కాఠిన్యం ప్రదర్శించారు. వేజ్ బోర్డు సిఫారసులను అమలుచేయాలని కోరుతూ కార్మికులు ఇచ్చిన విజ్ఞప్తిని వారి ఎదుటే చెత్తబుట్టలో పడేసారు. సిబ్బంది సమ్మెతో ఇరవై మూడు రోజులు ఈనాడుపత్రిక  ప్రజల ముఖం చూడలేదు. సుప్రీం కోర్టు -  సమ్మె చట్ట బద్ధమే అని ఇచ్చిన తీర్పుతో రామోజీ రావు సుమారు కోటి రూపాయలు చెల్లించుకోవాల్సివచ్చింది. రామోజీ రావుకు అది మొదటి  ఓటమి.
పత్రికల్లో ప్రచురించే వార్తను అనుకూలంగాను, ప్రతికూలంగాను మలచి ప్రచురించవచ్చు. కాబట్టి పాఠకులకో చిన్న హెచ్చరిక. నల్లటి అక్షరాలన్నీ నిజాలని నమ్మకండి. పూర్తిగా అబద్ధమనీ అనుకోవద్దు.
పత్రిక ప్రకటనల వ్యవహారాలు చూసే మేనేజర్ ఇంకో గంటలో పత్రిక అచ్చవుతుందనగా వెళ్లి, అరపేజీ,లేదా పావు పేజి వ్యాపార ప్రకటన ప్రచురించి తీరాలి అంటే, సంపాదక వర్గం ఆ మేరకు వార్తలు తీసేసి ఆ వ్యాపార ప్రకటనను ప్రచురించి తీరాలి.
నేను ఈ వృత్తి (జర్నలిజం) లో ప్రవేశించినప్పటి ఆర్ధిక పరిస్థితులు ఇప్పడు తలచుకుంటే నవ్వొస్తుంది. బస్తా బియ్యం ఎనిమిది రూపాయలు. అణాకు నాలుగు ఇడ్లీలు. ముప్పై కిలోమీటర్ల బస్సు ప్రయాణానికి నాలుగణాలు. పూటకూళ్ళమ్మ హోటల్లో మూడుపూటల నెల భోజనానికి నాలుగున్నర రూపాయలు.
“1955  మధ్యంతర ఎన్నికలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నడుమ అతి భీకరంగా జరిగాయి. కమ్యూనిష్టులు అధికారంలోకి వచ్చేస్తున్నారు; పుచ్చలపల్లి సుందరయ్య ముఖ్యమంత్రి, రాజేశ్వర రావు హోం మంత్రి అనే వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. కాని, చివరకు కమ్యూనిష్టులు ఓడిపోయారు. రాష్ట్రంలో పార్టీ పత్రిక విశాలాంధ్ర తప్ప మిగతా పత్రికలన్నీ కాంగ్రెస్ కొమ్ము కాశాయి. ప్రముఖ సంపాదకుడు నార్ల వేంకటేశ్వర రావు సంపాదకత్వంలో ఆంధ్రప్రభ ముందు వరసలో నిలబడి కమ్యూనిష్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. విశాలాంధ్ర, ఆంధ్రప్రభల మధ్య కార్టూన్ల యుద్ధం హోరాహోరీగా నడిచింది. ప్రతి కార్టూనుకు  జవాబుగా మరో కార్టూన్ ప్రభలో వచ్చేది. అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్రంలో పత్రికల సత్య నిష్ఠ గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్ర ప్రభ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనుకూలంగా రాస్తే, దాని తమిళ్ ఎడిషన్ దానికి వ్యతిరేకంగా రాసేది. ఇదంతా పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమే.
హైదరాబాదులో  (యు.ఎన్.ఐ.) వార్తా సంస్థలో నాకు ముందు పనిచేసిన డి. సీతారాం కు వున్న  కాంటాక్టులు (పరిచయాలు) అన్నీ ఇన్నీ కావు. నేను బాధ్యతను స్వీకరించిన తరువాత ఒక రాత్రి ఎవరో ఫోను చేసి ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానం వచ్చిందని చెప్పి ఫోను పెట్టేసారు. బహుశా నా పాత మిత్రుడి (సీతారాం) కాంటాక్ట్ అయివుంటుంది. మరుసటి రోజు బ్యాంకుల జాతీయకరణ వార్త పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఆ రోజున రాష్ట్రపతి సికిందరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో బస చేసి వున్నారు. అంటే సంతకం కోసం విమానంలో ప్రత్యేక దూత వచ్చాడన్న మాట.
 “రాజకీయ నాయకులకు పత్రికలతో చాలా అవసరం వుంది. దానికోసం  జర్నలిష్టుల ప్రాపకం కావాలి. అందుకోసం ఏం చేయాలన్న చేస్తారు. ఫ్లాట్లు, స్కూటర్లు, కార్లు, మందు  సీసాలు ఏదీ కాదనర్హం. యాభయ్యవ దశకంలో నేను ఢిల్లీ లో విలేఖరిగా పనిచేసేటప్పుడు ఒక విదేశీ రాయబార కార్యాలయం ప్రతినెలా ఒక స్కాచ్ బాటిల్  ని  ఎంపిక చేసుకున్న జర్నలిష్టుల ఇళ్లకు పంపేది. అందుకు ప్రతిఫలంగా ఏమీ అడిగే వారు కాదు. కొన్ని నెలలు గడిచిన తరువాత తమకు ఫలానా ప్రభుత్వ సమాచారం కావాలని మెల్లగా బయట పెట్టేవారు. సీసాలు సీసాలు పట్టించిన తరువాత కాదనే ధైర్యం ఎవరికి వుంటుంది?”
(జర్నలిష్ట్ అంతర్వీక్షణం పాత్రికేయ జీవితంలో ఆరు దశాబ్దాల అనుభవాలు అనుభూతులు రచన : శ్రీ వి.హనుమంత రావు  ప్రచురణ : డేటా న్యూస్ ఫీచర్స్, హైదరాబాద్  500 084)
07-07-2012.


ధన్యత


గొప్పవాళ్ళను గురించి రాయడంలో వున్న గొప్పతనం ఈ ఉదయం బోధపడింది. సుప్రసిద్ధ జర్నలిష్టు వి.హనుమంతరావుగారి పై ‘సాక్షి’ దినపత్రికలో ఈరోజు నేను రాసిన వ్యాసంపై స్పందన గమనించిన తరువాత నాకీ సంగతి తెలిసింది. తెలుగు రాష్ట్రాలలోని మొత్తం ఇరవై మూడు జిల్లాలనుంచి అసంఖ్యాకంగా ఫోన్లు వస్తూనే వుండడం చూసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. గొప్ప మనుషులనుగురించి రాయగలగడం కూడా ఒక రకంగా అదృష్టమే.
బెజవాడ నుంచి తుర్లపాటి కుటుంబరావు గారు ఫోను చేసి చెప్పారు. జర్నలిజంలో ఓనమాలు నేర్చుకున్నది నేను  ఆయన దగ్గరే.
“ఈ వ్యాసం చదివిన తరువాత నువ్వు నా శిష్యుడవని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను” అన్నారాయన.

సాక్షి రామచంద్ర మూర్తి గారికి కృతజ్ఞతలు.