IPS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
IPS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, డిసెంబర్ 2016, బుధవారం

నిజంగా అపురూపం


అపురూప దృశ్యాలు అనుదినం అనుభవంలోకి రావు. అవి చాలా అరుదుగా తటస్థ పడతాయి కాబట్టే అపురూపం.
నిన్న సాయంత్రం అటువంటి అనుభూతి అనుభవంలోకి వచ్చింది.
ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్  అధికారులు. ఒకానొక కాలంలో ఈ దేశాన్ని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని పాలించిన, ఒక రకంగా శాసించిన అధికారులు వాళ్ళు. నా జర్నలిష్టు జీవితంలో అనేక పర్యాయాలు వారిని కలుసుకోగల ఆవకాశం లభించింది. గంటలపాటు వెయిట్ చేసినా పని ఒత్తిడిని బట్టి కలవడానికి వీలులేని బిజీ వ్యక్తులు ఈరోజు విశ్రాంత అధికారులుగా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ హైదరాబాదులో నిన్న జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయి పాత సంగతులు నెమరు వేసుకున్నారు. డెబ్బయి ఏళ్ళ నుంచి 102 సంవత్సరాల వరకు  వివిధ వయస్సుల్లో వున్న వీరిలో చాలామంది అత్యంత ఉన్నత ఉద్యోగాలు నిర్వహించారు. కార్యదర్శులుగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా, పోలీసు డైరెక్టర్ జనరల్స్ గా పనిచేసిన వీరిలో అనేకులు నా పూర్వాశ్రమంలో వృత్తిరీత్యా పరిచయస్తులే కనుక పలకరింపులకు, పాత ముచ్చట్లకు ఆ వేదిక ఒక విడిదిగా మారింది.
ఇక సందర్భం.
ఐసీఎస్ అధికారి, ఎందరో ఐఏఎస్ అధికారులకు గురు సమానులు అయిన సీఎస్ రామచంద్రన్ శతజయంతి. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గా పదవీ విరమణ చేసిన గాయత్రీ రామచంద్రన్ తండ్రి గారు. వారు కుటుంబ స్నేహితులు కాబట్టి ఆ పరిచయంతో అందిన ఆహ్వానంతో వెళ్ళిన బయటి వారిలో అంటే ఐఏఎస్ కానివారిలో డాక్టర్ ఏపీ రంగారావు, మా అన్నయ్య రామచంద్ర రావు, డాక్టర్ బాలాజీ, జ్వాలా, నేనూ ఉన్నాము. సి ఎస్ రామచంద్రన్ గురించి ప్రచురించిన గ్రంధాన్ని 102 ఏళ్ళ వృద్ధ ఐసీఎస్ అధికారి శ్రీ వీ.కే.రావు గారు ఆవిష్కరించారు. వారు గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, డాక్టర్ నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతిగా ఉన్నకాలంలో వారికి ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. చేతి కర్ర సాయంతో నడిచి వచ్చిన ఆ శతాధిక వృద్ధ మూర్తి వేదిక ఎక్కి పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించడం నిజంగా ఒక అపురూప దృశ్యం.   

         


26, మార్చి 2016, శనివారం

ఆదివారం ఆటవిడుపు


సూటిగా......సుతిమెత్తగా.......

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 27-03-2016, SUNDAY)

జిడ్డు సీరియల్ మాదిరిగా సాగుతున్న రాజకీయాలు గురించి కాకుండా ఆదివారం ఆటవిడుపుగా వాటికి దూరంగా జరిగి కొన్ని పాత ముచ్చట్లు చెప్పుకుంటే బాగుంటుందనిపించింది. సూటిగా.....పరవాలేదు కానీ మరీ అంత సుతిమెత్తగా చెప్పడం అవసరమా అన్న ఒక మిత్రుడి ప్రశ్న కూడా ఈ వారం ఈ మార్పుకి దోహదం చేసింది. 


1981 బ్యాచ్ కి చెందిన  ఐ.పి.ఎస్. అధికారి జేవీ రాముడికి నిఖార్సయిన పోలీసు అధికారి అనే మంచి పేరుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ఆయన్ని పోలీసు డైరెక్టర్ జనరల్ గా  నియమించినప్పుడు అందరూ భేషయిన నిర్ణయం అని మెచ్చుకున్నారు.
ఆ జేవీ రాముడు మొన్నీమధ్య  ఒక మాట అన్నారు. పత్రికావిలేకరులు రాసే వార్తలకు వారే జవాబుదారి అన్నది దాని సారాంశం. మంచిమాట సెలవిచ్చారు. అంతేకాదు విలేకరులు రాసే వార్తలకు  తగిన ఆధారాలు కూడా వుండి తీరాలని ఆయన  పేర్కొన్నట్టు కూడా పత్రికల్లో వచ్చింది. నిజమే, నిరాధారమైన వార్తలు రాయడం పత్రికల వారికి కూడా తగని పని. అయితే ఆయన మరో అడుగు ముందుకు వేసి, అటువంటి వార్తలు రాసే విలేకరులపై కేసులు పెడతామని హెచ్చరించినట్టు కూడా పత్రికల్లో వచ్చింది. ఇలా అనడం తగదని  జర్నలిష్టు సంఘాలు వెంటనే ఖండించాయి. అదికాదు విషయం. డీజీపీ  హెచ్చరికకు  భయపడో, లేదా దాన్ని అడ్డు పెట్టుకునో విలేకరులు తమకు ఆ రహస్య సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఆ వార్తతో పాటు రాయడం మొదలు పెడితే మొదటికే మోసం. ఎందుకంటే మీడియాలో వచ్చే అనేక ఊహాగానాలకు ఉప్పు అందించేది ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఈ వార్త చదవగానే  రేడియోలో పనిచేస్తున్న రోజులనాటి ఓ పాత సంగతి గుర్తుకు వచ్చింది.
ఏదో కేసు విషయంలో హైకోర్టు జడ్జి పలానా తీర్పు ఇచ్చారని పీటీఐ వార్తా సంస్థ భోగట్టా. ఇలాటి అంశాలను నిర్ధారించుకోకుండా రేడియో వార్తల్లో చెప్పే వీలు లేదు. సాయంత్రం వార్తల ప్రసార సమయం దగ్గర పడుతోంది. తీర్పు ఇచ్చిన జడ్జి గారు ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడన్నీ ల్యాండ్ లైన్లు. ఫోన్ చేస్తే, జడ్జి గారు బంగ్లా లాన్ లో కూర్చుని టీ తాగుతున్నారని సమాచారం. ఫోను తీసుకుని వెళ్లి ఇవ్వడం కుదురుతుందా అని అనుమానంగానే అడిగాను. ఏ కళన ఉన్నాడో కాని బంట్రోతు ఫోను జడ్జి గారికి ఇచ్చాడు. ఫోన్లో మాటలు వినపడుతున్నాయి. ‘ఎవరది’ అని జడ్జి గారు అడుగుతున్నారు. ‘రేడియో నుంచి’ అనగానే లైన్లోకి వచ్చారు. నేను తీర్పు విషయం అడగగానే ఆయన కొంత అసహనానికి గురయ్యారు. అది సహజం కూడా. ‘ఒక న్యాయమూర్తిని ఇలా డిస్టర్బు చేయడం నేరమని తెలుసా’ అంటున్నారు. నేనన్నాను. ‘తెలియదు. కానీ ఇటువంటి వార్తను నిర్ధారించుకోకుండా ప్రసారం చేయడం మాత్రం నేరం అని తెలుసు’.  ఈ జవాబుతో ఆయన మెత్తపడి నేను కోరిన వివరణ ఇచ్చారు. అది వార్తా సంస్థ ఇచ్చిన సమాచారానికి  అనుగుణంగానే వుంది. అయినా కొన్ని సంచలన వార్తలను  ప్రసారం చేసేముందు నిజాన్ని నిర్దారించుకోవడం విలేకరిగా  నా విధి. అది నేను పాటించాను.  తప్పిస్తే ఆ వార్తాసంస్థ నిబద్ధతను అనుమానించడానికో, మరో దానికో మాత్రం కాదు.
ఇలా  ఉండేవి ఆ రోజులు. నిజంగా  ఆ రోజులే వేరు.
ఇది కూడా ఇప్పటి సంగతి కాదు. ఆరోజుల్లో రేడియో స్టేషన్ మొత్తంలో డైరెక్ట్ టెలిఫోన్ వుండేది డైరెక్టర్ తరవాత మా న్యూస్ రూంలోనే. మిగిలిన వాళ్ళను కాంటాక్ట్ చేయాలంటే ఎక్స్ టెన్షన్ నంబర్ డయల్ చేయాల్సి వచ్చేది. అందువల్ల ఎవరెవరి ఫోన్లో మాకు వస్తుండేవి. 


ఒకరోజు ఆర్టీసీ ఆఫీసునుంచి ఫోన్.  చైర్మన్ లైన్లోకి వచ్చారు.  ఆదివారం మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. ఆయనతో వున్న పరిచయంతో – ‘ఇంకా ఎవరెవరు వస్తున్నార’ని మాటవరసకు అడిగాను. “ఎవరూ లేరు, మీరూ, మీతో పాటు మీ దగ్గర రైతుల ప్రోగ్రాములు అవీ చూస్తూవుంటారే అదే – నిర్మలా వసంత్, విజయకుమార్ – వాళ్ళల్లో ఎవరినయినా ఒక్కసారి ఫోను దగ్గరికి పిలిస్తే వాళ్ళకు కూడా చెబుతాను.” అన్నారాయన. అప్పుడు లైటు  వెలిగింది. ఆయన ఫోను చేసింది వాళ్ళకోసం. భోజనానికి పిలుద్దామని అనుకుంది కూడా వాళ్లనే. ముందు ఫోన్ రిసీవ్ చేసుకున్నాను కనుక, విలేకరిగా తెలిసినవాడిని కనుక - మర్యాదకోసం నన్ను కూడా పిలిచివుంటారు. 
ఆయన ఎవరో కాదు సీనియర్ కాంగ్రెస్ కురువృద్ధుడు, ఇందిరాగాంధీ హయాంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎం. సత్యనారాయణరావు. 
ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే - రేడియోలో పనిచేసే కళాకారులు ఎవరో బయటకు తెలియకపోయినా , వారి స్వరాలే వారిని నలుగురికీ సుపరిచితుల్ని చేస్తాయని చెప్పడానికి. ఆ తరవాత కాలంలో సత్యనారాయణరావుగారిని నేను కలిసిన ప్రతి సందర్భంలోనూ, వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటూ మాట్లాడేవారు. ఒకసారి ఢిల్లీలో సత్యనారాయణ రావు గారిని వారి ఇంట్లోనే కలిసాను. ఆయన పక్కనే చిన్న ట్రాన్సిస్టర్  రేడియో తన దారిన తాను ప్రోగ్రాములు వినిపిస్తోంది. అది చూసి ఒక రేడియో మనిషిగా ఎంతో సంతోషం పడ్డాను. ‘రేడియో పెడితే చాలు, పాలూ పేడా తప్ప ఇంకేముంటాయి’ అని హేళనగా మాట్లాడుకునే రోజులవి.  నిజానికి  ఇలాటి వారు చెప్పే మాటలే ఆ కళాకారులకు నూతన జవసత్వాలను ఇచ్చేవని ఇప్పటికీ  అనుకుంటుంటాను. 
ప్రతిరోజూ మధ్యాహ్నం హైదరాబాదు కేంద్రం నుంచి వెలువడే ప్రాంతీయవార్తలు ముగియగానే వ్యవసాయదారుల కార్యక్రమం మొదలయ్యేది. రైతులకు సంబంధించిన అనేక అంశాలను వారికి పరిచితమయిన యాసలో వారిద్దరూ వివరించే తీరు జనరంజకంగా వుండేది. ఏదో సర్కారు ఉద్యోగమేకదా అనుకుంటే వారలా ఆ కార్యక్రమానికి అంతగా కష్టపడి జీవం పోయాల్సిన అవసరం వుండేదికాదు. సత్యనారాయణరావుగారి వంటి వారే కాదు, వారి కార్యక్రమం అంటే చెవికోసుకుని వినేవారెందరో వుండేవారు.
అలాగే మరో సంగతి.


రేడియోలో పనిచేసేవారు ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేయాల్సి వస్తుంది. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన  వీ.వీ. శాస్త్రి (వేమూరి విశ్వనాధ శాస్త్రి) చెప్పిన ఆసక్తికర ఉదంతం ఇది.
ఆయన భోపాల్ లో పనిచేసేటప్పుడు  జవహర్ లాల్ నెహ్రూ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన  సీనియర్ ఐ.సీ.ఎస్. అధికారి  కె.పీ.ఎస్. మీనన్ ఏదో కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆ నగరానికి రావడం జరిగింది. ఆయన వద్ద గతంలో పనిచేసిన సంగ్లూ అనే అధికారి అప్పుడు భోపాల్ రేడియో కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆయన పూనికపై  వీ.వీ. శాస్త్రి వెళ్లి   మీనన్ ను కలుసుకుని  రేడియో కేంద్రానికి ఆహ్వానించారు. నిజానికి ఆయన మరునాడు విదేశీ ప్రయాణం పెట్టుకున్నారు. అయినా, రేడియో మీది గౌరవంతో, సంగ్లూ మీది అభిమానంతో తన ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఆరోజు  రేడియో స్టేషన్ కు వచ్చిన మీనన్, మాటల సందర్భంలో తన అనుభవాలు కొన్ని చెప్పారు.
మీనన్ గారు  ఆరోజు చెప్పిన విషయాల్లో  ఒకటి మన రాష్ట్రానికి సంబంధించింది  కావడం వల్ల శాస్త్రి గారికి బాగా  గుర్తుండిపోయింది.
“ భారత దేశానికి  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  అనేక సంస్థానాలను  ఇండియన్ యూనియన్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నిజాం నవాబు ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎలాటి చర్య తీసుకోవాలనే విషయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్న ఆ సమావేశం గంటల తరబడి కొనసాగింది. అర్ధరాత్రి కావొస్తోంది. సర్దార్ పటేల్ మగత నిద్రలోకి జారిపోయినట్టు కళ్ళు మూసుకుని వున్నారు. భారత సైన్యాలను  హైదరాబాదు పంపే విషయంలో  సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. కళ్ళు మూసుకుని అంతా వింటున్న సర్దార్ పటేల్ లేచి ఒక్కసారిగా  ఇలా అన్నారట.
‘ ఇండియన్  ఆర్మీ  ఇప్పటికే హైదరాబాదు చేరిపోయింది. మేజర్ జనరల్ చౌదరి అక్కడే వున్నాడు.’
పటేల్ మాటలు విని అక్కడివారంతా మ్రాన్పడిపోయారు.
నెహ్రూ సంగతి చెప్పక్కర లేదు.


రేడియోకి సంబంధించినదే  మరో ముచ్చట.  రావూరి భరద్వాజ అంటే చాలు పరిచయం చేయాల్సిన అవసరం లేని మనిషి. ఆయన రేడియోలో పనిచేసే రోజుల్లో నేనూ అక్కడే విలేకరిగా వున్నాను. రేడియో మీడియం ని అంతగా ఆపోసన పట్టిన వ్యక్తి మరొకరు నాకు తారసపడలేదు.  రేడియో శ్రవణ మాధ్యమం కాబట్టి అందుకు తగ్గట్టుగా,   మాట్లాడుతున్నట్టు అనిపించే విధంగా  రాయడంలో ఆయనకు ఆయనే సాటి. 
" భరద్వాజ  గారికి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించినప్పుడు ప్రముఖ జర్నలిష్టు రెంటాల జయదేవ్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేసారు. అది ప్రజాశక్తిలో వచ్చింది.  మనసు ఆర్ద్రం అయ్యే ఒక జవాబు చెప్పారు భరద్వాజ గారు. 
"ఆకాశవాణిలో ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది?” ఇదీ  రెంటాల గారి ప్రశ్న.
భరద్వాజ గారు ఉద్వేగానికి గురవుతూ ఇచ్చిన  సమాధానం ఇది.
"కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి నేను, నా భార్య, నా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన సంస్థ – ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే చాలా ఎక్కువ. హైదరాబాద్‌ ఆకాశవాణిలో నాకు ఉద్యోగ రావడానికి కారణమైన రచయిత త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే అవకాశం  ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా…) నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ… నేను చనిపోయాక, నా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో ఆకాశవాణిలో ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!" (రెంటాల గారికి కృతజ్ఞతలు)

ఉపశృతి: జీవితంలో కొన్ని విషయాలు ఎల్లకాలం గుర్తు పెట్టుకునేవి వుంటాయి. మరికొన్ని వెంటనే మరచిపోవాల్సినవీ వుంటాయి. ఎప్పుడో చదివిన సంగతి ఒకటి గుర్తుకొస్తోంది. ఒక ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుకునే వారిని ఒక ప్రశ్న అడిగేవాడట, మిమ్మల్ని ఎవరయినా యెట్లా గుర్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారని. ఇప్పుడు జవాబు చెప్పకపోతే ఇబ్బంది లేదు, ముప్పై నలభయ్ ఏళ్ళ తరువాత కూడా జవాబు చెప్పలేకపోతే మీ జీవితం సార్ధకం కాలేదని అర్ధం అని ఆయనే ముక్తాయింపు ఇచ్చేవాడు. ఒక అర్ధర్ కాటన్ ను, ఒక సి.పీ,బ్రౌన్ ను, ఒక వీరేశలింగాన్ని, ఒక గురజాడను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము ? అనేది ఆయన మనసులోని మాట.     


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image Owner             



1, మే 2013, బుధవారం

రేడియో రోజులు


(ఈరోజు ఫేస్ బుక్ లో అమెరికా నుంచి నరిసెట్టి ఇన్నయ్య గారు పోస్ట్ చేసిన మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ పీ ఎస్ రామమోహన రావు గారి ఫోటో చూసిన తరువాత మదిలో మెదిలిన జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు) 
అసలు సిసలు పోలీసు అధికారి పీ ఎస్ రామమోహన రావు గారితో నాకూ కొన్ని మరచిపోలేని అనుభవాలు వున్నాయి. నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఆయన డీజీపీ. అప్పటికే కొందరం జర్నలిస్టులం మొదలు పెట్టిన యాంటీ హెల్మెట్ ఉద్యమంతో సీనియర్ పోలీసు అధికారులు మనస్తాపంతో వున్నారు. నన్ను అరెస్టు చేయడం, ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా దర్యాప్తు కోసం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటుచేయడం, ఆ వెంటనే నా మాస్కో ప్రయాణం - మా నడుమ సత్సంబంధాలలో పైకి కనబడని తేడా తీసుకువచ్చాయి. మాస్కో వెళ్ళబోయేముందు డీజీపీ రామమోహన రావు గారిని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసాను. చాలా ఆప్యాయంగా పలకరించి క్షేమ సంచారాలు కనుక్కుని వీడ్కోలు చెబుతూ ఒక మాట అన్నారు. ‘మాస్కోలో పోలీసులతో జాగ్రత్త. మన దగ్గరలా హెల్మెట్ల విషయంలోలా ఠలాయిస్తే కుదరదు.’
వయసు అలాటిది మరి. నేనూ అలానే జవాబు చెప్పాను. ‘మాస్కో చాలా చలి ప్రదేశం అని విన్నాను. మంచు కురిసే రోడ్లపై ‘టూ వీలర్స్ ఎలౌ చేయరనుకుంటాను’
రామమోహన రావుగారు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్నప్పుడు ఖమ్మం బస్ స్టాండులో ఒక ఉద్యోగితో సీటు రిజర్వేషన్ విషయంలో పేచీ వచ్చింది. హైదరాబాదు రాగానే ఘాటుగా ఓ పిర్యాదు రాసి పంపించాను. మూడు రోజుల తరువాత అనుకుంటాను అదే ఉద్యోగి మా మేనల్లుడిని వెంటబెట్టుకుని హైదరాబాదు వచ్చాడు.
‘ఏదో తెలియక చేసాడు, ఇప్పుడు ఎమ్డీ గారు నీ పిర్యాదు మీద చాలా దూరం ట్రాన్సఫర్ చేశారు, నాకు బాగా తెలిసిన వాళ్లు. నువ్వే మళ్ళీ ఏదో సర్ది చెప్పి బదిలీ క్యాన్సిల్ చేయించు’ ఇదీ మా వాడి రాయబారం.
సరేనని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసి విషయం చెప్పాను. అప్పుడాయన ఇలా అన్నారు.
‘మీరు కంప్లయింటు ఇచ్చారు. మీ మీద గౌరవం కొద్దీ విచారణ కూడా జరపకుండా బదిలీ చేసాను. అదీ నేను చేసిన పొరబాటు. ఇప్పడు మీ మాట విని మరో పొరబాటు చేయడం ఇష్టం లేదు. బదిలీ క్యాన్సిల్ చేయడం చిటికెలో పని. కాని సంస్థలో డిసిప్లిన్ మాటేమిటి. ఎమ్డీ ట్రాన్స్ఫర్ చేస్తే నాకొక లెక్కా! ఒక్క రోజులో మళ్ళీ క్యాన్సిల్ చేయించుకున్నానని అందరితో చెప్పుకుంటాడు. క్రమశిక్షణ దెబ్బతింటుంది. ముందు పోయి వేసిన చోట జాయిన్ కమ్మని చెప్పండి. ఓ ఆరు నెలల తరువాత మళ్ళీ వెనక్కు వేస్తాను’
దట్ ఈజ్ రామ్మోహనరావు గారు!

(01-05-2013)