8, డిసెంబర్ 2016, గురువారం

ఆలోచనాలోచనం


కాస్తో కూస్తో చదువుకున్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ఇంకా చదువుకుంటున్న వాళ్ళు, చిరు ఉద్యోగం నుంచి పెద్ద కొలువులు చేస్తున్నవారు, నిరుద్యోగులు,  బ్యాంకర్లు, లాయర్లు, లెక్చరర్లు, జర్నలిష్టులు, పండితులు, గృహిణులు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, అపారమైన జీవితానుభవం కలిగిన వయోవృద్ధులు, ఇలా సమాజంలోని అన్ని వర్గాలకు దర్పణం ఈ ఫేస్  బుక్. ఒకరకంగా మనం జీవిస్తున్న ప్రపంచానికి ఒక మీనియేచర్. బయట వుండే అభిమానదురభిమానాలు, ప్రేమలు, ఆప్యాయతలు, స్నేహాలు ఇక్కడ కూడా తొంగిచూడడం వింతేమీ కాదు. అయితే అవి హద్దులు దాటినప్పుడే ఇబ్బంది.
చిన్నప్పుడు సినిమా పోస్టర్లకు దండలు వేసేవాళ్ళు. ప్రత్యర్ధులు వాటి  మీద పేడ కొట్టేవారు. అభిమానం, దురభిమానం పెడదారి పడితేనే  ఇటువంటి విపరీత పోకడలకు దారి తీస్తాయి. వేములపాటి మాధవి గారు ఈ విషయంలో వెలిబుచ్చిన ఆవేదన దీనికి ప్రేరణ.
మనలో ఎవరికీ మోడీతో పరిచయం లేదు. రాహుల్ ఎవరో తెలియదు. చంద్రబాబు, చంద్ర శేఖర రావులతో ముఖ పరిచయం కూడా లేదు. జగన్ మోహన రెడ్డితో గట్టు తగాదాలు లేవు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీలకి నాయకులు. రాజకీయంగా అనేక మాటలు అనుకుంటారు. సిద్దాంతాలు, సూత్రాలకు సంబంధించి ఏదైనా మాట్లాడుకున్నా, వ్యాఖ్యానించినా తప్పుపట్టడానికి లేదు. వ్యక్తిగతమైన నిందలు, ఆరోపణలు అనవసరమైన మానసిక గ్లాని కలిగిస్తాయి.
అలాఅని మడిగట్టుకుని కూర్చోమని చెప్పడం లేదు. చేసే విమర్శలు హుందాగా వుండాలి. చేసే  వ్యాఖ్యలు ఏం చెప్పారురా అనేట్టు వుండాలి. మరోసారి, మరోసారి చదివించేట్టుగా వుండాలి. ఎంతోకొంత జ్ఞానాన్ని సముపార్జించుకునేలా వుండాలి.
పరవాలేదు, ఈరోజు నా స్నేహితుల నుంచి ఒక కొత్త పాఠం నేర్చుకున్నాను, ఒక కొత్త విషయం తెలుసుకున్నాను, మరపున పడ్డ ఒక గొప్ప సంగతి గుర్తు చేసుకున్నాను, రాస్తున్న దానిలో, చెబుతున్నదానిలో ఎక్కడ తప్పు దొర్లిందో స్నేహితుల నుంచి తెలుసుకుని సరిదిద్దుకోగలిగాను అనే విధంగా  మనసుకు హాయినిచ్చే భావనతో ఒకరోజు గడపగలగడం నిజంగా ఎంతటి అదృష్టం.

ఈ అవకాశం అందించిన జుకర్ బర్గ్ కి కృతజ్ఞతలు తెలుపుకోవాలా! ఎందుకయ్యా ఈ బ్రహ్మ రాక్షసిని మాకు కట్టబెట్టావు అని నిందవేయాలా!            

ఒకనాటి ఓ క్యూ కధ


అలనాటి సోవియట్ యూనియన్  లో కొత్తగా వెళ్ళిన మా బోంట్లకు అక్కడ చాలాకాలంగా ఉంటున్న వాళ్ళు ఓ నీతి బోధ చేసేవాళ్ళు.
‘కనబడిన క్యూలో నిలబడు. కనబడ్డ ప్రతిదీ కొనుక్కో. కొన్న వస్తువు పనికొస్తుందా రాదా అన్నది ఇంటికి వెళ్లి చూసుకో”
దీనికి కారణం వుంది. ఆ దేశంలో ప్రతిదీ బీరు నుంచి కారు వరకూ అన్నీ కారు చౌకే. లీటరు పాలు ముప్పయి కోపెక్కులు. (మన పైసల వంటివి). లీటరు పెట్రోలూ   ముప్పయి కోపెక్కులే. కార్లూ, రిఫ్రేజ్ రేటర్లు ఏవీ ఖరీదు కావు. చౌక అనే దానికి తోడు ప్రజల కొనుగోలు శక్తి కూడా అపరిమితం. దానాదీనా  జనాలు అవసరం వున్నా లేకపోయినా, అవసరానికి మించి కొనుగోళ్ళు చేసేవాళ్ళు. అంచేత వచ్చిన సరుకులు వచ్చినట్టు క్షణాల్లో అయిపోయేవి. మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు.
అవసరానికి మించి కొనుగోళ్ళు జరపడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడేది. దానితో పాటే క్యూలు పెరిగిపోయేవి. మనిషికి ఇన్నే అనే నిబంధన పెడితే అందరికీ దొరికేవేమో. కానీ ప్రజా సంక్షేమం పేరుతొ అలాంటి ఆంక్షలు ఉండేవి కావు.
ఏతావాతా జరిగింది ఏమిటంటే ఏ కొరతా లేని దేశంలో అన్నిటికీ కొరతలు ఏర్పడ్డాయి.
కొరత మాట ఎలా వున్నా ఏదీ ఖరీదు కాదు. అంచేత దొరికిందే కొనుక్కుందామని క్యూలలో కాలక్షేపం చేయడం జనాలకు అలవాటయింది. అదృష్టం బాగుంటే ఆ రోజు క్యూబా నుంచి దిగుమతి అయిన  తాజా తాజా అరటి పండ్లు డజన్ల కొద్దీ ఇంటికి తెచ్చుకోవచ్చు. అదృష్టం మరీ పుచ్చితే జర్మనీలో తయారయిన నాణ్యమైన ఎలెక్ట్రానిక్ వస్తువులు దొరకొచ్చు. ఖరీదు మాత్రం రూబులు (రూపాయ్) దాటితే గొప్ప.  

ఒకసారి ఇలానే ఓ క్యూలో నిలబడి చాలా చవగ్గా కనబడ్డది ఒకటి కొని ఇంటికి తెచ్చాను. ప్యాకెట్ మీద రష్యన్ లో ఏదో  రాసుంది. అదేమిటో తెలియక పక్కన పడేశాను. తీరా ఎవరో చెప్పారు, అది చెకొస్లవేకియాలో  కట్ గ్లాస్ తో తయారుచేసిన  విస్కీ సెట్ (డికా౦టర్) అని. మనదేశంలో దాని ఖరీదు వేలల్లో వుంటుందని. 
(ఇన్నేళ్ళ తరువాత కూడా, ఇన్ని ఇళ్ళు మారిన తరువాత కూడా అదిప్పుడు మావద్ద భద్రంగా వుంది, ఆ నాటి మా వైభవానికి ఓ తీపి గుర్తుగా)    

కొరతలు, క్యూలు. జోకే సుమా!

ఎనభయ్యవ దశకం ఉత్తరార్ధంలో నేను మాస్కోలో కుటుంబంతో కలిసి హాయిగా జీవిస్తున్న రోజుల్లో శాకాహారుల మైన మమ్మల్ని ఒకే ఒక్క కొరత బాధిస్తుండేది. సరయిన బియ్యం దొరికేవి కావు. అవి ఎక్కడ దొరుకుతాయన్నది అక్కడి తెలుగు కుటుంబాల వాళ్ళం ఒకరికొకరం ఫోన్లు చేసుకుని చెప్పుకునేవాళ్ళం.  ఆ రోజుల్లో హుషారుగా షికారు చేసిన జోకు ఇది.
“మాస్కోలోని ఇండియన్ ఎంబసీకి కొత్త అధికారి వచ్చారు. ఆయన మహా స్ట్రిక్టు. ప్రతి రోజూ ఉదయం స్టాఫ్ మీటింగు జరిగేది. ఒక్క నిమిషం ఎవరయినా ఆలస్యంగా వచ్చినా ఆయన మండిపడే వారు. ఇలా వుండగా ఒకరోజు ఒక చిన్న ఆధికారి ఆ మీటింగుకి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. పెద్ద ఆధికారి చిందులు వేస్తూ “ఎందుకీ ఆలస్యం, ఏమా కధ” అంటూ సంజాయిషీ కోరారు. బాగా  బెదిరిపోయిన ఆ  చిన్న అధికారి చిన్న గొంతుకతో మెల్లగా చెప్పాడు.
“ఆఫీసుకి వస్తుంటే దారిలో ఒక దుకాణంలో బియ్యం అమ్ముతున్నారు. క్యూలో నిలబడి కొనుక్కుని వచ్చేసరికి లేటయింది, మన్నించాలి”
అంతే!

కొత్తగా వచ్చిన పెద్ద అధికారి, లేటుగా వచ్చిన చిన్న అధికారి తప్ప అక్కడ ఎవరూ లేరు. ఒక్కసారిగా  అందరూ మాయం అయిపోయారు.  బియ్యం దొరుకుతున్న షాపుకు పరిగెత్తుకు పోయారు.           

7, డిసెంబర్ 2016, బుధవారం

ముల్లు గుచ్చుకుంది కానీ రక్తం కారడం లేదు

ఇబ్బందులనుంచి  ఉపశమనం రెండు విధాలుగా లభిస్తుంది. పరిష్కారం మొదటిది కాగా వాటికి  అలవాటు పడిపోవడం రెండో పద్దతి. చాలా సందర్భాలలో  సామాన్యులకు  రెండోదే ఊరట ఇస్తోంది.

ఇదీ సుపరిపాలన....రచయిత పరిచయం


సరిగ్గా పాతికేళ్ళ తరువాత పునరావృతం.
1989 లో జరిగిందిది. మళ్ళీ 2014లో.
కాకపోతే అప్పుడు కాకలు తీరిన రాజకీయ యోధుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆ వ్యక్తిని తనకుతానుగా ఎంపిక చేసుకున్నారు. ఇన్నేళ్ళకు మళ్ళీ, తెలంగాణా స్వప్నాన్ని సాకారంచేసుకుని ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ కూడా అదే వ్యక్తిని, అదే పదవికి ఎంపిక చేసుకోవడం కాకతాళీయం కావొచ్చేమో కాని అంత సులభం కాదు. అయితే, ఇలా జరగడానికి మాత్రం మార్కులు వేయాల్సి వస్తే అవన్నీ పూర్తిగా ఆ వ్యక్తికే వెయ్యాలి. అతడే జ్వాలా నరసింహారావు.
కేవలం ప్రతిభ కారణంగానే పదవిని పొందడం అనేది జ్వాలాగా చిరపరిచితుడైన వనం జ్వాలా నరసింహారావుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ ప్రతిభను పసికట్టే ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తన వద్ద పీఆర్వోగా జ్వాలాను స్వయంగా ఎంపిక చేసి నియమించుకుంటే, ఇప్పుడు తిరిగి తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావు గారు అదే ఉద్యోగానికి మరింత పదోన్నతి కల్పించి తన పేషీ నుంచి పౌర సంబంధాలను ఆజమాయిషీ చేసే ప్రధాన అధికారిగా గురుతర భారాన్ని ఆ జ్వాలాకే అప్పగించారు.
ఒకనాడు చేసిన ఉద్యోగమే కాని అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. మీడియా విస్తరణ, మాధ్యమాల నిర్వహణ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రాష్ట్రం రెండుగా విడిపోయింది. కొత్త సవాళ్ళ మధ్య కొత్త ప్రభుత్వం కొత్త తెలంగాణలో కొలువు తీరింది. ఈ నేపధ్యంలో పౌర సంబంధాలను, పేరుకు పౌర సంబంధాలు కానీ నిజానికి పత్రికా సంబంధాలు అనడమే సముచితం, సజావుగా నిర్వహించడం ఎవరికయినా కత్తి మీద సామే. అయితే పూర్వం సముపార్జించుకున్న అనుభవమే ఆయనకు శ్రీరామ రక్షగా అక్కరకు వస్తుంది. వస్తోంది కూడా.
సార్ధక నామధేయుడు
`పిల్లల్ని కంటాం కానీ, వాళ్ల రాతల్ని కనలేము కదా' అని బోలెడు, బారెడు నిట్టూర్పులు విడుస్తుంటారు కొందరు నిరాశావాదులు.
కానీ `జ్వాలా' తలితండ్రులు ఈ బాపతు కాదు. అందుకే అతడి స్వభావాన్ని ముందే గుర్తించి, భవిష్యత్తుని ముందే ఊహించి, తమ ఇష్టదైవంతో ముడిపెట్టి `జ్వాలా' అనే పదాన్ని బారసాల నాడే అయన పేరుకి జోడించారు. ఇన్నాళ్ళుగా ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులకు `జ్వాలా' అనే సంక్షిప్త నామం కూడా ఎంతో కొంత దోహదం చేసి వుంటుందనే నా నమ్మకం! అలాగే ఆయన ‘మాటల్లోని వాడి, చేతల్లోని వేడి' జ్వాలా అనే ఈ పేరు పుణ్యవేునని మా బోంట్ల మరో నమ్మకం!
డెబ్భయ్యవ దశకం నుంచి ఈ నాటి వరకూ, `జ్వాలా' జీవితం `గ్రాఫు' గమనిస్తే పరమపద సోపాన పఠం గుర్తుకు వస్తుంది.
ఎంత ఎత్తుకి ఎదిగాడో. అంత కిందకు జారాడు. ఎన్ని నిచ్చెనలు ఎక్కాడో, అన్ని పాముల నోట్లో పడ్డాడు. అయినా, విసుగు చెందని విక్రమార్కుడిలా, పడిలేచిన కెరటంలా, మళ్లీ అంతకు మించిన, అతనికి మించిన ఎత్తులకి ఎగబ్రాకాడు. ఇంకా ఎక్కాల్సిన `శిఖరాల' కోసం అన్వేషిస్తున్నాడు. 
 ఈ విజయాల్లో, జ్వాలా నరసింహారావు పడిన కఠోర శ్రమా, వేసిన పథకాలూ, చేసిన ఆలోచనలూ, అంతకు మించి, ఆయన రక్తంలో జీర్ణించుకుపోయిన ‘అయాం ఆల్వేస్‌ రైట్‌' అనే తత్వం పునాదులుగా నిలిచాయి. ఆయన వ్యక్తిత్వాన్ని నిండుగా మలిచాయి. విశ్రాంతి ఎరుగని, విరామం కోరని, ఫలితం ఆశించని, పనిచేసుకుంటూ పోయే మనస్తత్వమే జ్వాలాని పరిపూర్ణ పురుషుడిగా తీర్చిదిద్దింది.
ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం మీ చేతుల్లో వున్న ఈ పుస్తకమే. నేను చెప్పిన దాంట్లో ఏవన్నా అనుమానాలు వుంటే ఇది చదవగానే తొలగిపోతాయి. అందుకు నాది గ్యారంటీ.
పొతే…..
ముఖ్యమంత్రి కార్యాలయం అంటేనే బిజీ. అందులో పనిచేసే ప్రధాన పౌరసంబంధ అధికారి మరీ బిజీ. ఇరవై నాలుగ్గంటల టీవీ ప్రసారాలు వచ్చాక ఆ ఉద్యోగం కాలంతో పరిగెత్తే బిజీ బిజీ ఉద్యోగంగా మారిపోయింది. ఓ పక్క ఆ కొలువు చేస్తూనే, మరో పక్క ఇంతటి బృహత్తర రచనా వ్యాసంగం నెరపాలంటే ఆ మనిషి సవ్యసాచి అయివుండాలి. అతి కొద్దికాలంలో ఇన్నిన్ని వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రచురణకు నోచుకున్నాయంటే అవి రాయడానికి ఎంత శ్రమ పడివుండాలి. ఊహకు అందని విషయం.
‘పనిచేసేది సీఎమ్ ఆఫీసులో కదా, ఏది రాసినా పత్రికల్లో వస్తుంది’ అని తేలిగ్గా అనేవాళ్ళు ఎలాగూ వుంటారు. ఎవరేది రాసినా, మొహమాటానికి పోయి పత్రికలు ప్రచురిస్తారనేది కేవలం అపోహ మాత్రమే. ప్రామాణికత లేని రచనలు ప్రచురణకు నోచుకోవడం ఆషామాషీ కాదు. విభిన్న పత్రికల్లో ఈ వ్యాసాలు అచ్చయిన తీరు గమనిస్తే రచయిత ‘చేయితిరిగినతనం’ ఎంతటిదో బోధ పడుతుంది.
అలాగే, ఏదో కాలక్షేపం రాతలు అయితే అనుకోవచ్చు. అలా కాదే. ఒక హోదాలో వుండి రాసే ప్రతి అంశానికి సాధికారిత వుండి తీరాలి. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి, బాధ్యత కలిగిన ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం. ఎలాంటి తభావతు వచ్చినా మెడకు చుట్టుకునే వ్యవహారం. అలాంటిదాన్ని ఎవరికీ మాట రాకుండా, ఎవరితో మాట పడకుండా ఈ అక్షర చండీ యాగాన్ని నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. ఈ యజ్ఞాలకు ముగింపులు వుండవు. పూర్ణాహుతులు వుండవు. ఇవి సతతం కొనసాగేవే. నిరంతర శ్రమజీవి అయిన జ్వాలా నుంచి ఇటువంటివి మరికొన్ని కోరుకునేవాళ్ళకు ఆయన ఆశాభంగం కలిగించడనేది నా నమ్మకం. 
 ‘తెలంగాణా ఆవిర్భావం తరువాత దాన్ని బంగారు తెలంగాణాగా ఎలా ఆవిష్కరింపచేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కంటున్న కలలకు ఇది అక్షర రూపం. ఆయన వివిధ సందర్భాలలో వెలిబుచ్చిన అభిప్రాయాలను, రచిస్తున్న ప్రణాళికలను, రూపొందిస్తున్న పధకాలను ఒక్క చోట చేర్చి, గుదిగుచ్చిన సాధికారిక సంకలనం. తెలంగాణా గురించి పరిశోధన చేసేవారికి ఉపయుక్తంగా వుండేంత గొప్ప సమాచారం, గణాంకాలు ఇందులో పొందుపరచడం మరో వైశిష్ట్యం. 
 ముఖ్యమంత్రికి ప్రధాన పౌర సంబంధ అధికారి కాబట్టి కేవలం ప్రశంసాపూర్వక పద విన్యాసాలే వుంటాయని అనుకోవడం సహజం. సహజంగా తెలంగాణా అభిమాని కాబట్టి కేసీఆర్ స్వప్నాల సాకారత విషయంలో ఆయనకూ ఆశలు వున్నాయి. అడియాసలు లేవు. అంచేతే కేసీఆర్ ఆలోచనలను వివరించేటప్పుడు అతిశయోక్తులు దొర్లకుండా మంచి పరిణతి, విజ్ఞత ప్రదర్శించారు.
పొతే, ఈ పుస్తకానికి, ‘ఇదీ సుపరిపాలన” అంటూ జ్వాలా పెట్టిన పేరు గురించి ఓ చిన్న ముచ్చట చెప్పుకోవాలి.
“సుపరిపాలన అంటే ఇలావుండాలి, అదే కేసీఆర్ పాలన” అనే అర్ధం, ఇందులో వుంది. అంతేకాని, “ఇదే సుపరిపాలన” అనలేదు. అంటే భజన అయ్యేది. కానీ అలా చేయకపోవడమే జ్వాలా కలంలోని చమత్కారం. 
ఇక, ఒక తుది పలుకు కూడా అడగకుండానే జత చేయాల్సి వస్తోంది.
అదేమిటంటే, రచయిత గురించి ఈ కొద్ది మాటలు రాయడానికి నేను పడ్డ కష్టం.
ఇందులో అంత శ్రమ ఏమిటి అనిపించవచ్చు.
పరిచయం అవసరం లేని జ్వాలా నరసింహారావును పరిచేయడం అంటే మాటలా మరి!
- భండారు శ్రీనివాసరావు
98491 30595

Courtesy Shri Vanam Jwala Narasimha Rao 

5, డిసెంబర్ 2016, సోమవారం

అమ్మయ్య ఫస్టు గడిచింది

మా వలలి (వలలుడు అంటే వంటవాడు, వలలి అంటే వంటమ్మాయి అనేది కొత్త నిర్వచనం) కూడా ఆన్ లైన్ లో నెల జీతం తీసుకోవడానికి ఒప్పుకుని బ్యాంకు ఖాతా నెంబరు ఇచ్చింది. పాల వాడు, పేపరు వాడు నసిగారు. వచ్చే నెల రెండూ కలిపి ఇవ్వండి పోనీ అంటూ ఓ ఆఫరు ఇచ్చారు. పనిమనిషి, వాచ్ మన్ జీతాలు మాత్రం మేమే సర్దేసాము. సరుకులు, కరెంటు బిల్లు  ఎట్లాగూ ఆన్ లైనే. కూరగాయలు ఒక్కటే ఇక మిగిలిన సమస్య. మొత్తానికి ‘అమ్మో ఫస్టు తారీఖు’ గండం గడిచినట్టే. మళ్ళీ నెలతర్వాత కదా!

నందో రాజా భవిష్యతి!    

ఈ దేశంలోనే సాధ్యం



సామాన్య జనాలు పచారీ సామాన్లు, కూరగాయలు కొనుక్కోవడానికీ పనికి రాని రద్దయిన నోట్లు, ప్రభుత్వాలకు పన్ను బకాయిలు చెల్లించడానికి, దేవుడి హుండీల్లో వేసి మొక్కులు తీర్చుకోవడానికి ఎలా పనికి వస్తాయో అర్ధం కాని విషయం.