15, అక్టోబర్ 2016, శనివారం

ఇల్లు అలికారు, పండగ జరగాలి


సూటిగా.....సుతిమెత్తగా.....
(Published in SURYA telugu daily on 16-10-2016, SUNDAY)

జూన్ 2 2014, అక్టోబర్ 11, 2016.
ఈ  రెండు తేదీలకు తెలంగాణా చరిత్ర పుటల్లో ప్రముఖ స్థానం వుంటుంది. చారిత్రిక సందర్భాలకు  ఆనవాళ్ళుగా  మిగిలివుంటాయి.   మొదటిది  తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినం  కాగా,  రెండోది నూతన తెలంగాణా స్వరూపాన్ని మార్చిన కొత్త జిల్లాల ఆవిర్భావ దినోత్సవం.  
కొత్త జిల్లాల ఏర్పాటుతో  దసరా పండుగనాడు నవ  తెలంగాణా  నూతన  స్వరూపం  ఆవిష్కృతమైంది. పది జిల్లాల తెలంగాణా ముప్పై ఒక్క జిల్లాల తెలంగాణాగా విస్తృతమైంది. విజయదశమి పర్వదినం ఈ  వేడుకకు వేదిక అయింది. రెండున్నర ఏళ్ళక్రితం ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం   బాహ్య సరిహద్దులు మార్చుకోకుండానే అంతర్గత స్వరూపాన్ని గుర్తు పట్టలేనంతగా మార్చుకుంది. పరిపాలనను ప్రజలకు చేరువ చేయడానికి ఉద్దేశించిన ఈ కొత్త ప్రయత్నం కొత్త ఆశలను చిగురింప చేస్తోంది. ఆశలకు ఊపిరులూదాలంటే,  చేసిన దానికన్నా చేయాల్సింది ఎక్కువ వుంటుంది. ప్రభుత్వానికి నిజమైన సవాలు ఇప్పటినుంచే మొదలవుతుంది. చక్కటి ప్రయత్నం మరింత చక్కటి ఫలితాలు ఇచ్చేలా చేయాల్సిన బృహత్తర బాధ్యత కేసీఆర్ సర్కారుపై వుంది. చేసి చూపెడతాం అంటున్నారు. అంతకంటే  కావాల్సింది  ఏముంటుంది  కనుక.  
కోడలు కంటానంటే వద్దనే అత్త వుంటుందా?
ప్రజలూ అంతే! ప్రభుత్వాలు మంచి చేయాలే కానీ ఆహ్వానించి, ఆదరించే  మంచితనం వారిలో పుష్కలంగా వుంది.
సరే! యధావిధిగా రాజకీయాలు కూడా ఇందులో చొరబడ్డాయి. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం శాస్త్రీయ దృష్టి ప్రదర్శించలేదు అన్నది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ. అంతా రూల్  బుక్  ప్రకారమే చేశామన్నది ప్రభుత్వ వాదన. ఈ రెండింటిలో వాస్తవం లేకపోలేదు.
విభజన పద్దతిగా జరగలేదని, ప్రజల సదుపాయం గమనంలో పెట్టుకోలేదనీ, మండలాల చేర్పులు,కూర్పులు సవ్యంగా జరగలేదని, కొన్ని జిల్లాలను ఎక్కువ జిల్లాలను చేయడం, మరి కొన్ని పెద్ద జిల్లాలను పెద్ద మార్పులు చేయకుండా అలాగే కొనసాగించడం ఇందుకు నిదర్శనమని ప్రతిపక్షాల ఆరోపణ.
అందర్నీ సంప్రదించే చేశామని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను అడిగామని, ప్రజలనుంచి కూడా సూచనలు, సలహాలు స్వీకరించామని, భారీ కసరత్తు చేసిన తరువాతనే నిర్ణయాలు తీసుకున్నామని సర్కారు ఉద్ఘాటన. ప్రతిపక్షాలు అడిగిన రీతిలో ముందు అనుకున్నదానికంటే అదనపు జిల్లాలు ఏర్పాటు చేయడం ఇందుకు దృష్టాంతం అన్నది ప్రభుత్వ వివరణ.
ఒక విషయంలో మాత్రం రెండు పక్షాల మధ్య ఏకాభిప్రాయం వుంది. అదేమిటంటే కొత్త జిల్లాల అవసరాన్ని ఉభయులు కాదనడం లేదు. కొత్త  జిల్లాల ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించడం లేదు. సమస్య అల్లా విభజన చేసిన తీరు పట్లనే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా ఇదే ప్రశ్న తలెత్తింది. అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే  రాష్ట్ర  విభజనకు రాజ్యాంగ సవరణ అవసరం. జిల్లాల ఏర్పాటుకు అంతటి సంక్లిష్ట ప్రక్రియ అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవచ్చు. తీసుకున్న నిర్ణయాలను మార్చుకోవచ్చు. కాబట్టి నిర్ణయంలో మంచి చెడులే తప్పించి జరిగిన తీరు పట్ల అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిర్ణయాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఇక పెద్దగా తర్కవితర్కాలు అనవసరం.
పొతే, జిల్లాలు అధిక సంఖ్యలో ఏర్పాటు చేయడం వల్ల పరిపాలనకు సంబంధించి వెసులుబాట్లు పెరుగుతాయి. జిల్లా, మండల కేంద్రాలు సుదూరంగా వుంటే, ప్రభుత్వంతో తమ పనులు చక్కబెట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్ళు తమ రోజువారీ పనిపాట్లను పక్కన బెట్టి ఎక్కువ దూరాలకు వెళ్లి రావాల్సిన ప్రయాస తగ్గుతుంది. అలాగే  ప్రభుత్వ అధికారులు కూడా  ప్రజల అవసరాలను దగ్గర నుంచి గమనించి వ్యవహారాలను సరిదిద్దడానికి వీలుంటుంది. ప్రత్యేకించి, సంక్షేమ పధకాల అమలు తీరును సమర్ధవంతంగా పర్యవేక్షించడానికి వీలుచిక్కుతుంది. అధికారులు అందుబాటులో వుండడం అనేది ప్రజలకు కలిసి వచ్చే విషయమే. శాంతి భద్రతల  పరిరక్షణ విషయంలో కూడా చిన్న జిల్లాల సూత్రం ప్రయోజనకారిగా వుంటుంది.
కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయానికి అంతటి సానుకూల స్పందన రావడానికి ఈ కారణాలు దోహదం చేశాయని చెప్పవచ్చు.           
పది జిల్లాలను ముప్పయ్యొక్క జిల్లాలను చేస్తూ నిర్ణయం తీసుకోవడం సులభం కావచ్చేమో కాని, దాన్ని అమలుచేయడం అనేది అంత తేలిక కాదు. తగినంత మంది అధికారులు కావాలి, వారికి తగినంత మంది సిబ్బంది కావాలి,  అవసరమైన కార్యాలయ భవనాలు కావాలి, వసతులు కావాలి, వాహనాలు కావాలి. ఇలా ఈ ‘కావాలి’ అనే జాబితా చాలా పెద్దది. ఇందుకు ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సుముహూర్తం నిర్ణయించారు. అప్పటికల్లా విధుల్లో చేరడానికి జిల్లా కలెక్టర్లను ఎంపిక చేశారు. కొత్త కమీషనరేట్లకు పోలీసు కమీషనర్లు,  జిల్లా పోలీసు కార్యాలయాలకు ఎస్పీలు, జాయింటు కలెక్టర్లు, మండల స్థాయిలో  తహస్లిల్దారు స్థాయి అధికారులను   పోస్టింగులతో సహా సిద్ధం చేశారు. కార్యాలయ భవనాలు, వాహనాలు ఇతర సదుపాయాలు అనుకున్న ఘడియకు అనుకున్న చోట ఏర్పాటు చేసారు. ఇవన్నీ జరగాలంటే రాజకీయ సంకల్పానికి బ్యూరోకాట్ల సహకారం కావాలి. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ చక్కటి సమన్వయంతో చేసిన కృషి వల్లనే ఇది సాధ్యపడింది.  
అయితే, ఇల్లలుకగానే పండుగ కాదన్నట్టు, కొత్త జిల్లాల ఏర్పాటుతోనే సుపరిపాలన ప్రజల ముంగిట్లోకి వచ్చినట్టు కాదు. అధికారులు ప్రజలకు దగ్గరగా వుండడంతోటే సామాన్యుల  సమస్యలు తీరవు. పరిపాలన వికేంద్రీకరణతో పాటు అధికార వికేంద్రీకరణ కూడా జరగాలి. తగిన అధికారాలు లేని అధికారి యెంత దగ్గరగా వుంటేమాత్రం ప్రజలకు  ఏం లాభం?
ప్రజా ప్రభుత్వాలు, వాటి అధినేతలు గమనంలో వుంచుకోవాల్సిన కఠోర వాస్తవం ఇది. (15-10-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595


     







11, అక్టోబర్ 2016, మంగళవారం

కొత్త రూపంలో కొత్త రాష్ట్రం


నవ  తెలంగాణా  నూతన  స్వరూపం  ఆవిష్కృతమైంది. పది జిల్లాల తెలంగాణా ముప్పై ఒక్క జిల్లాల తెలంగాణాగా విస్తృతమైంది. విజయదశమి పర్వదినం ఈ  వేడుకకు వేదిక అయింది. రెండున్నర ఏళ్ళక్రితం ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం   బాహ్య సరిహద్దులు మార్చుకోకుండానే అంతర్గత స్వరూపాన్ని గుర్తు పట్టలేనంతగా మార్చుకుంది. పరిపాలనను ప్రజలకు చేరువ చేయడానికి ఉద్దేశించిన ఈ కొత్త ప్రయత్నం కొత్త ఆశలను చిగురింప చేస్తోంది. ఆశలకు ఊపిరులూదాలంటే,  చేసిన దానికన్నా చేయాల్సింది ఎక్కువ వుంటుంది. ప్రభుత్వానికి నిజమైన సవాలు నేటి నుంచి మొదలవుతుంది. చక్కటి ప్రయత్నం మరింత చక్కటి ఫలితాలు ఇచ్చేలా చేయాల్సిన బృహత్తర బాధ్యత కేసీఆర్ సర్కారుపై వుంది.
కోడలు కంటానంటే వద్దనే అత్త వుంటుందా?
ప్రజలూ అంతే! ప్రభుత్వాలు మంచి చేయాలే కానీ ఆహ్వానించి, ఆదరించే  మంచితనం వారిలో పుష్కలంగా వుంది.

శుభం భూయాత్! 

8, అక్టోబర్ 2016, శనివారం

ఈ ఆలోచన ఎలా వుంది?


1987లో రేడియో మాస్కోలో  పనిచేయడానికి నేను కుటుంబంతో కలిసి మాస్కో  వెళ్ళాను. అంటే దాదాపు 29 ఏళ్ళు. అప్పటికే ఆ నగరంలో అన్నీ  బహుళ అంతస్తుల భవనాలే. ఊలిత్స వావిలోవాలో మేమున్న నివాసం వున్నది పద్నాలుగు అంతస్తుల భవనం. ప్రతి ఫ్లోర్ లో వుండేవాళ్ళు ఎవ్వరూ ఇంట్లో చెత్త పారేయడానికి కిందికి వెళ్ళాల్సిన అవసరం వుండేది కాదు. పై నుంచి కింది వరకు లిఫ్ట్ ఏర్పాటుకు వుండే వెంట్ మాదిరిగా ఒక గొట్టం వుండేది. ఏ అంతస్తులో వాళ్ళు ఆ అంతస్తులోనే పొడి చెత్త, తడి చెత్త విడివిడిగా బ్యాగుల్లో నింపి ఆ గొట్టానికి వున్న తలుపులాంటిది తెరిచి అందులో వేసేవాళ్ళు. ఆ చెత్తంతా భవనం అడుగు భాగంలో ఏర్పాటుచేసిన ట్రాలీల్లోకి చేరేది. చెత్తను తీసుకువెళ్ళే మునిసిపల్ వాహనం వాటిల్లోని చెత్త సంచులను యంత్రాలతో తీసి పట్టుకు వెళ్ళేది. ఈ మొత్తం వ్యవహారం అంతా తెల్లవారేసరికి జరిగిపోయేది.  రోడ్ల పక్కన చెత్త కుండీలు కనబడేవి కావు. బయట ఎక్కడా చెత్తాచదారం కంట పడేది కాదు.

మన దగ్గర కూడా భవన నిర్మాణ సమయంలోనే ఇటువంటి ఏర్పాట్లు ఖచ్చితంగా చేసి తీరాలని నిబంధన విధిస్తే ఎలా వుంటుంది? అధికారులూ ఆలోచించండి.        

3, అక్టోబర్ 2016, సోమవారం

మీడియా ఆత్మశోధన – చర్చ


(2010లో రాసిన వ్యాసం)
అంజయ్యగారు ముఖ్యమంత్రిగా  వున్నప్పుడు పత్రికలవారిపట్ల ప్రత్యేక అభిమానం ప్రదర్శించేవారనేది  బహిరంగ సత్యం.  పత్రికల యజమానులే  కాకుండా అనుదినం వార్తలు సేకరించే సాధారణ విలేకరులతో  కూడా ఆయన సంబంధాలు ఆదరణ పూర్వకంగా ఉండేవి. చక్కటి తెలంగాణా పలుకుబడితో కూడిన ఆయన మాటలు వినసొంపుగా ఉండేవి. సునిశితమయిన  హాస్యంతో  అంజయ్యగారు చేసే వ్యాఖ్యలు, విలేకరులకు వండివార్చిన 'సిద్దాన్నం' మాదిరిగా వార్తల ముడిసరుకుగా మారిపోయేవి. మరునాడు పత్రికల్లో తను చెప్పిన విషయాలను చదువుకుని 'ఇంత చక్కగా మాట్లాడానా' అని  అమాయకంగా మురిసిపోయేవారు.  ఆ రోజుల్లో తెలుగు పత్రికారంగంలోకి దూసుకువచ్చిన ఒక దినపత్రిక మాత్రం,  కొత్త  బాణీ  కనిపెట్టి అంజయ్యగారి భాషను యధాతధంగా ప్రచురించడం మొదలుపెట్టింది. అందుకు ఆయన నొచ్చుకున్న దాఖలాలు లేవు కానీ, ఆ పత్రిక తీరు ముఖ్య మంత్రి స్తాయికి తగినట్టుగా లేదని జర్నలిష్టు వర్గాలలోనే  కొందరు గుస గుసలాడుకున్న మాట నిజం.  వున్నది వున్నట్టు రాయడంతోపాటు, అన్నది అన్నట్టు రాసే పత్రికా సంప్రదాయానికి అప్పుడే బీజం పడినట్టువుంది. 

రాష్ట్ర రాజకీయ యవనికపై  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో, అప్పటివరకు వార్తలకోసం కాంగ్రెస్ పార్టీ వర్గ రాజకీయాలపై ఆధారపడిన పత్రికలకు కొత్త వనరు దొరికినట్టయింది.
ఏరోజుకారోజు  పత్రికలలో వచ్చిన వార్తలను పరిశీలించి అదే రోజు మధ్యాన్నం ఒక పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితేరెండో పార్టీ అదే రోజు సాయంత్రం పెట్టేది. ఒకరి కామెంట్లు మరొకరికి చేరవేసే బాధ్యతను అత్యుత్సాహం కలిగిన కొందరు విలేకరులు భుజానికి ఎత్తుకునేవారు. ఇందులో వారికి యేవో స్వార్ధ ప్రయోజనాలు వున్నాయని సందేహించనక్కర లేదు. వార్తకు వార్త తెగులు అన్నట్టు ఏదో కొత్త వార్త పట్టుకెళ్లాలన్నదే  వాళ్ళ ఆరాటం. దీన్ని ఆయా రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకునేవి. ఈ క్రమంలో సంబంధ అనుబంధాలు క్రమేపీ బలపడేవి. తాము చెప్పదలచుకున్న మాటలను తమనోటితో కాకుండా, తాము  బయటపడకుండా, తమ చేతికి మసి అంటకుండా పత్రికలలో ప్రచురింపచేసుకునే విధానం రూపుదిద్దుకుంది.ఒక వార్త పత్రికల్లో వచ్చేలా చేసి అదే వార్తను తామే మర్నాడు ఖండించేలా వీలుకల్పించే ఈ నూతన వొరవడి, తమ రాజకీయ ప్రత్యర్ధుల  పీచమణచడానికి కొందరికి బాగా ఉపయోగపడుతూ వచ్చింది. ఈ పరిణామ క్రమమే తదనంతరకాలంలో వార్తల స్తానంలో వార్తా కధనాల ఆవిర్భావానికి  మార్గం  వేసింది.

నూతన ఆర్ధిక సంస్కరణల అమలుతో అన్ని రంగాలలోమాదిరిగానే పత్రికారంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి.పత్రికల ముద్రణలో రంగు, హంగులు పెరిగిపోయాయి. పెద్ద స్తాయిలో పెట్టుబడులు ప్రవహించాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళ ప్రవేశంతో జర్నలిజం రంగానికి 'గ్లామరు' తోడయింది. సిబ్బంది జీతభత్యాలు కలలో ఊహించలేనంతగా పెరిగిపోయాయి. ఆహ్వానించదగిన ఈ పరిణామాలన్నీ పవిత్రమయిన పత్రికా రంగంలో స్వార్ధ శక్తులు  చొరబడడానికి  కొంతమేరకు తోడ్పడ్డాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల అమోఘమయిన శక్తి యుక్తులున్న ఈ రంగంపై రాజకీయుల కన్ను పడడంలో ఆశ్చర్య పడాల్సినది ఏమీ లేదు. అలాగేరాజకీయ నిర్ణయాలను తమకు  అనుకూలంగా మార్చుకోవడానికి బడా పారిశ్రామికవేత్తలు కూడా ఈ రంగాన్ని ఎంచుకోవడంలో వింతేమీ లేదు. ఈ రెండు బలవత్తర శక్తులూ మీడియాను తమ కనుసన్నల్లో ఉంచుకోవడానికి   చేస్తున్న ప్రయత్నాల  పర్యవసానంగానే నిప్పుకు చెదలంటుకున్నాయని చెప్పాలి. 

మీడియా విశ్వసనీయతపై  ఇన్నాళ్ళుగా కదలాడుతున్న నీలినీడలు  ఇటీవలి కాలంలో  కారుమబ్బులుగా మారి ఒక  పెద్ద ప్రశ్నను  మీడియా ముందుకు తెచ్చాయి. 

ఫలితంగా,  మంచికో చెడుకో  మీడియాపై  ఒక చర్చ మొదలయింది. పత్రికలంటే పన్నెత్తి మాట్లాడడానికి జంకే వాళ్ళందరూ ఈ నాడు మీడియా నీతీ నిజాయితులగురించి నిలదీస్తున్నారు. నిరాధార వార్తలను ప్రసారం చేసే టీవీ ఛానళ్ళను మూసివేయాలని నిగ్గదీస్తున్నారు. బాధ్యతతో మెలగాలనీ, నిజానిజాలను ప్రసారానికి ముందే నిర్దారించుకోవాలనీ నీతి బోధలు చేస్తున్నారు. ఒకరికి దిశానిర్దేశనం  చేయాల్సిన   మీడియా, ఒకరితో చెప్పించుకోవాల్సిన దుస్తితిలో పడిపోయింది.
వీటికి తోడు అవినీతి ఆరోపణలు, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలూ వెలుగులోకి వచ్చి అసలే మసకబారుతున్న మీడియా విశ్వసనీయతను మరింత ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. 

అందుకేమీడియా  ఆత్మ శోధన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇతరుల తప్పులు ఎన్నడంతో సరిపుచ్చుకోక, తమ దగ్గర  తప్పు ఎక్కడ జరుగుతున్నదోఎలా జరుగుతున్నదో  తెలుసుకుని దిద్దుబాటు చర్యలు మొదలుబెట్టుకోవాలి.  పత్రికల్లో, మీడియాలో వస్తున్న వార్తలపై, వార్తాకధనాలపై  చదువరులనుంచి, వీక్షకులనుంచి విమర్శలు, అభిప్రాయాలు స్వీకరించి సరయినవాటిపై స్పందించి  భేషజాలకు పోకుండా తగు మార్పులు చేసుకోవాలి. రేటింగులలో పోటీ తగ్గించుకుని నవ్యత్వంతో కూడిన కార్యక్రమాల రూపకల్పనలో పోటీ పెంచుకోవాలి. సొంత కట్టుబాట్లుస్వీయ నియంత్రణ ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్తలో మిగిలిన అన్ని స్తంభాలు  శిధిలమవుతున్నప్పుడు  సరిదిద్దడానికి నేనున్నానంటూ మీడియా సన్నద్ధంగా నిలబడాలి. పూర్వ వైభవాన్నీవెనుకటి ఔన్నత్యాన్నీ, విలువలతో కూడిన పత్రికా సంప్రదాయాలనూ పునరుద్ధరించుకోవాలి. 
కానీఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో ఇది నెరవేరే కలేనా?


1, అక్టోబర్ 2016, శనివారం

పాక్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు మెరుస్తాయా కురుస్తాయా

  
గత శుక్రవారం తెల్లవారినప్పటినుంచి  జాతి వ్యాప్తంగా  జనులు మాట్లాడుకుంటోంది ఒకే  విషయం. పాక్ ఆక్రమిత  కాశ్మీర్  భూభాగంలోకి భారత సైనికులు చొరబడి అక్కడి ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు (సర్జికల్ స్త్రైక్స్) జరిపి తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి  చేయడం గురించే. కుల,మత, ప్రాంత, రాజకీయ విబేధాలు పక్కనబెట్టి ప్రజానీకం యావత్తూ  భారత సైనికులపై  ప్రశంసలు కురిపిస్తూ వుండడం అనేది  భారతీయుల్లో జీర్ణించుకుని వున్న ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే విశిష్ట లక్షణాన్ని ప్రస్పుటంగా ఎత్తిచూపుతోంది. మనల్ని మనం భుజం చరుచుకుని పరస్పరం అభినందించుకోవాల్సిన శుభ తరుణం ఇది. అలాగే ఒప్పజెప్పిన బృహత్తర లక్ష్యాన్ని అనుకున్న వ్యవధిలో, అనుకున్న విధంగా జయప్రదంగా సాధించిన  భారత సైనిక కమాండోలకు జాతి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. ఈ  విజయానికి ఇటువంటి అపూర్వ స్పందన రావడానికి ఓ నేపధ్యం వుంది.
ఇటీవలే పాక్  ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్ లోకి జొరబడి భారత సైనిక శిబిరంపై దొంగదెబ్బ తీశారు. పందొమ్మిదిమంది ప్రాణాలను పొట్టన బెట్టుకున్నారు. ఆ ముష్కర చర్యతో దేశం యావత్తు దిగ్భ్రాంతి చెందింది. మనమేమీ చేయలేమా అనే  ప్రశ్న తలెత్తింది. గతంలో కూడా ఆ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి జరిపారు. ఖచ్చితంగా ఆ చర్య పొరుగు దేశంపై యుద్ధం చేయడమే, అలా ఆ స్థాయిలో తెగించినవారిపై గట్టి చర్య తీసుకునివుంటే ఇప్పుడీ పరిస్తితి తలెత్తేది కాదు అనే భావన ప్రజల్లో పెరుగుతోంది. ఉరీ సంఘటన జరిగినప్పుడు కూడా మన దేశ నాయకులు ‘ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తామనే భారీ  ప్రకటనలు చేసారు. అవి షరా మామూలు ఊకదంపుడు ప్రకటనలనే విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం మేకతోలు గాంభీర్యం ప్రదర్శిస్తోందని అన్నవారూ వున్నారు. అలా అన్న పక్షం రోజుల్లోనే భారత సైనికులు ఈ మెరుపు దాడి చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని అయిదు ఉగ్రవాద స్థావరాలపై దెబ్బతీసి తమ ఆధిక్యతను అద్భుతంగా ప్రదర్శించారు. దేశ గౌరవాన్నిఅంతర్జాతీయ స్థాయిలో  నిలబెట్టారు.  కాశ్మీర్ లోని ఉరీలో ఉగ్రవాదుల చర్యకూ, శుక్రవారం రాత్రి భారత్ కమాండోల చర్యకూ ఒక స్థూలమైన బేధం వుంది. ఉరీ సంఘటనకు బాధ్యులైన వాళ్ళు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు. వాళ్ళు దొంగచాటుగా మన దేశంలోకి చొరబడి పందొమ్మిదిమంది సైనికులను బలితీసుకున్నారు. ఇందుకు ప్రతిగా భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలను దెబ్బతీయడానికే వ్యూహ రచన చేసింది. మూలంపై దెబ్బ కొట్టడం ద్వారా ఉగ్రవాదులకు ముకుతాడు వేసే ప్రయత్నం చేసింది. వారికి మద్దతు ఇస్తున్న పాకీస్తాన్ కు కూడా ఈ విధంగా గట్టి హెచ్చరికతో కూడిన సంకేతం ఇచ్చింది. అదే సమయంలో అక్కడి సాధారణ పౌరులకు ఈ మెరుపుదాడుల వల్ల హాని కలగకుండా కేవలం లక్ష్యబేధనే గురిగా ఎంచుకుంది. ఇలా చేయడానికి ఎన్నో ముందస్తు చర్యలు పకడ్బందీగా తీసుకోవాలి. మెరుపు దాడులు చేయడానికి  తగిన  శిక్షణ పొందిన, అనుభవం కలిగిన  కమాండోలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. కటిక చీకట్లో కూడా చూడగలిగిన కంటి పరికరాలను, గురి చూసి కొట్టగలిగిన ఆధునిక ఆయుధాలను వారికి సమకూర్చాలి. అన్నింటికంటే ప్రధానం లక్ష్య నిర్దేశం. శత్రువు స్థావరాన్ని ఎలాటి పొరబాటుకు అవకాశం లేకుండా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవడం, అలాగే ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా లక్ష్యాన్ని చేరుకోవడం. ఈ విషయంలో  భారత సైన్యం ఎంతో కసరత్తు చేసింది. భారత ఉపగ్రహాల సాయం తీసుకుని ఉగ్రవాద స్థావరాల ప్రాంతాన్ని ముందుగానే గుర్తించింది. అంచేతే,  అర్ధరాత్రి తమ కదలికలను ఎవరూ గుర్తుపట్టకుండా వెళ్లి, ఒప్పగించిన బాధ్యతను నూటికి నూరు పాళ్ళు పూర్తి చేయగలిగింది.                
భారత సైన్యం జరిపిన మెరుపుదాడి పూర్వాపరాలను గురించి అనేక ఆసక్తి కరమైన కధనాలు వెలువడుతున్నాయి. సైన్యం ఎంతవరకు చేయాలో అంతవరకే తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. ఆ కర్తవ్య పాలన గురించి ఎంతవరకు చెప్పాలో అంతవరకే అధికారులు చెబుతారు. అంచేత జరిగినదాన్ని గురించి పలు కధనాలు మీడియాలో, ప్రత్యేకించి  సోషల్ మీడియాలో  వస్తున్నాయి. అయితే ఇవన్నీ పూర్తిగా ఆధార రహితం అని చెప్పేందుకు కూడా వీలులేదు.
ఆ శుక్రవారం రాత్రి జరిగిన దాన్ని గురించి, ముఖ్యంగా ఆంగ్ల పత్రికల్లో వస్తున్న వార్తలు వింటుంటే, యుద్ధ నేపధ్యం కలిగిన  ఒక అద్భుతమైన చలన చిత్రం చూస్తున్న అనుభూతి కలుగుతుంది.   
ఈ సందర్భంలోనే సర్జికల్ స్త్రైక్స్ అనే అంశం గురించి కూడా ఆసక్తికరమైన చర్చ మీడియాలో సాగుతోంది. ఎవరికి తోచిన అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు.
సర్జికల్ అనే పదం వైద్య శాస్త్రానికి సంబంధించినది. దేహంలో  ప్రాణాంతక వ్యాధి కారకమైన కణం ఎక్కడ వున్నా, మిగిలిన శరీర  భాగాలకు ఇసుమంత  హాని కూడా  కలగకుండా, శస్త్రచికిత్స ద్వారా  ఆ కణాన్ని మాత్రమే తొలగించే లాప్రోస్కోపిక్ ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. ఈ సర్జికల్ స్త్రైక్స్ లక్ష్యం కూడా  అలాంటిదే.
మహాభారతం పౌస్తిక పర్వంలో కూడా ఇటువంటి అస్త్ర శస్త్రాల ప్రసక్తి కానవస్తుంది. భారత యుద్ధం ముగిసిన తరువాత, తన ప్రభువైన సుయోధనుడి పరాజయాన్ని,  పాండవుల చేతిలో తన తండ్రి ద్రోణుడి మరణాన్ని జీర్ణించుకోలేని అశ్వద్ధామ, పాండవ వంశనాశనానికి శపధం చేస్తాడు. పాండవులు లేని సమయంలో వారి శిబిరంలో ప్రవేశించి ద్రుష్టద్యుమ్నుడితో సహా ఉపపాండవులను ఊచకోత కోస్తాడు. తదనంతరం అర్జునుడు, అశ్వద్ధామ పరస్పరం తలపడతారు. ద్రోణనందనుడు ఒక గడ్డి పరకను చేతిలోకి తీసుకుని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఆవాహన చేసి ‘అపాండవం భవతు’ అంటూ దానికి లక్ష్య నిర్దేశనం చేసి ప్రయోగిస్తాడు. అందుకు ప్రతిగా అప్పుడు అర్జునుడు కూడా, కృష్ణుడి ప్రేరణపై అదే అస్త్రాన్ని స్మరించి, ‘గురుపుత్రుడైన  ఆశ్వద్దామకు హానిచేయకుండా, ప్రత్యర్ధి అస్త్రానికి లక్ష్యమైన మా సోదరులను రక్షించాలని తన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ మహాస్త్ర శస్త్రాల ధాటికి ముల్లోకాలు తల్లడిల్లడంతో వ్యాస, నారద మహర్షులు జోక్యం చేసుకుని అస్త్ర ఉప సంహారానికి విజ్ఞప్తులు చేస్తారు. అర్జునుడు అంగీకరించినా,  బ్రహ్మ శిరోనామకాస్త్రం ఉపసంహార ప్రక్రియ ఆశ్వద్దామకు తెలియక పోవడం వల్ల, ఆ అస్త్రలక్ష్యాన్ని పాండవ వంశీయుల గర్భ విచ్చిత్తికి మళ్ళించి లోక నాశనాన్ని తప్పించారని బొమ్మకంటి వెంకట సుబ్రమణ్య శాస్త్రి గారు రచించిన శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహా భారతంలో పేర్కొన్నారు.  
ఇక ప్రస్తుత కాలానికి సంబంధించి కూడా  ఓ చక్కటి ఉదాహరణ వుంది.
1976 లో ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని పాలస్తీనా ఉగ్రవాదులు దారి మళ్ళించి దాన్ని ఉగాండాలోని ఎంటెబే విమానాశ్రయంలో బలవంతంగా దింపేశారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెలీ ప్రయాణీకులందరినీ చంపేస్తామని బెదరించారు. నాటి ఉగాండా నియంత ఇదీ అమీన్ ఆ హైజాకర్లకు వత్తాసు పలకడంతో బందీలను కాపాడడం అన్నది ఒక  పెద్ద ప్రశ్నార్ధకమైంది. అప్పుడు ఇజ్రాయెలీ సైన్యాధికారులు ఇప్పటి భారత సైన్యం  మాదిరిగానే పకడ్బందీ వ్యూహం రచించి, రెండు రవాణా విమానాల్లో కమాండోలను తరలించారు. ఆ విమానాలు దాదాపు రెండువేల మైళ్ళు ప్రయాణించి నిర్దేశిత ప్రాంతానికి వెళ్లి, మెరుపు దాడి చేసి, ఉగాండా సైనికులను, విమానం దారిమళ్లించిన హైజాకర్లను వధించి, బందీలను విడిపించి తమ దేశానికి తీసుకువెళ్ళారు. థందర్ బోల్ట్ అనే గుప్త నామం కలిగిన ఈ యావత్తు ఆపరేషన్ ప్రక్రియను ఇజ్రాయెలీ కమాండోలు తొంభయ్ నిమిషాల వ్యవధిలో విజయవంతంగా పూర్తి చేసారు. పాలస్తీనా హైజాకర్లను, ఉగాండా సైనికులను తప్ప వాళ్ళు ఎవ్వరికీ హాని చేయలేదు.
పొతే, భారత పాకీస్తాన్ సరిహద్దుల్లో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి మెరుస్తున్నాయి. అవి కురుస్తాయా లేదా అనేది కాలమే చెప్పాలి. (01-10-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్ : 98491 30595                          

  

28, సెప్టెంబర్ 2016, బుధవారం

రేడియో

https://www.youtube.com/watch?v=MioiJOEZh0s&feature=share&list=UUfiN9LVu6amzjETTGmYfnkg

రెండేళ్ళు అవుతోంది మితృడు సతీష్, టీవీ 9 తన జర్నలిష్టు డైరీలో రేడియో మీద ఒక ప్రత్యేక ప్రోగ్రాం చేసి. ఈరోజు ట్విట్టర్ లో దొరికింది. నాతో రెండు ముక్కలు మాట్లాడించాడు కూడా. నా పేరుకు 'రేడియో కార్మికుడు' అనే ట్యాగ్ లైన్ కూడా తగిలించాడు. అతడికి ధన్యవాదాలు.

27, సెప్టెంబర్ 2016, మంగళవారం

హైదరాబాదులో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు సాధ్యమేనా?

హైదరాబాదులో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు  సాధ్యమేనా? మహా న్యూస్ ఛానల్ లో మంగళవారం ఉదయం న్యూస్  అండ్  వ్యూస్ ప్రోగ్రాంలో చర్చ.
https://www.youtube.com/watch?v=-Edf_Ux0fbU&feature=youtu.be