11, నవంబర్ 2015, బుధవారం

మతాన్ని కులం జయించిందా!


అపజయం అనాధ శిశువు వంటిది, తమదని చెప్పుకోవడానికి కానీ, బాధ్యత పంచుకోవడానికి కానీ  ఎవ్వరూ ముందుకు రారు.
బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఎదురయిన  ఓటమి ఇటువంటిదే. మొన్నమొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మోడీ, అమిత్ షా ద్వయం సాధించిన ఘన విజయాలు, ఈ బీహారు పరాజయం మాటున మసకలు బారాయి. రాజకీయాల్లోనే కాదు ఈనాడు  ఏ రంగంలో అయినా సమర్ధతకు గీటురాయి విజయమే, కేవలం విజయమే అనే పరిస్తితుల్లో మనం జీవిస్తున్నాం.
పద్దెనిమిది మాసాల క్రితం అదే బీహారులో, అదే మోడీ, అదే అమిత్ షా కలిసి పార్టీని విజయపధంలో నడిపించి మొత్తం నలభయ్ లోకసభ స్థానాల్లో అక్షరాలా ముప్పయి రెండు ఎగరేసుకుపోతే, అలనాటి వారి శేముషీ వైభవాన్ని పొగడడానికి ఆదిశేషుడికి కూడా  సాధ్యం కాదన్న రీతిలో భజన బృందాలు పోటీ పడి కీర్తనలు పాడాయి. ఇప్పుడు మళ్ళీ అదే బీహారులో, అదే మోడీ, అదే అమిత్ షా ద్వయం అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడితే, ఇంతటితో వారి పని అయిపోయిందంటూ అదే నోటితో విమర్శల జడివాన మొదలయింది.
ఈ పరిస్తితికి కారణం ఎవ్వరు?
నిజం చెప్పుకోవాలంటే నిజానికి వాళ్లిద్దరే కారణం. అలనాటి ఘన విజయానికి వీళ్ళిద్దరే కారణం అని భజన బృందాలు సంకీర్తనలు అందుకున్నప్పుడు, ‘అలా కాదు, ఇది సమష్టి విజయం’ అని వారిద్దరూ నోరు విప్పి చెప్పలేకపోయారు. స్వతంత్ర భారత ఎన్నికల చరిత్రలో మున్నెన్నడూ కనీ వినీ ఎరుగని ఘన విజయానికి వాస్తవంగా వారిద్దరి కృషే ప్రధాన కారణం అయినప్పటికీ, ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలకు తగినట్టుగా పార్టీ విజయంగా అభివర్ణించి వున్నట్టయితే, ఇప్పుడీ అపజయం మూటని సొంత భుజాల మీద మోయాల్సిన దుస్తితి వచ్చేది కాదు. సమర్ధతతకు వన్నె తెచ్చేది వినయం ఒక్కటే. అది మరపున పడితే ఇటువంటి సంకట స్తితి ఎటువంటి సమర్ధుడికయినా తప్పదు.


గతాన్ని గమనంలోకి తీసుకుని అంచనా వేస్తే, బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎండీయే కూటమి గెలుపు నల్లేరు మీది నడకే కావాలి. ఎందుకంటే, ఆయన ప్రత్యర్ధి నితీశ్ కుమార్ అప్పటికే పదేళ్లుగా బీహారును ముఖ్యమంత్రిగా పాలిస్తూ వస్తున్నారు. ఎంతటి సమర్ధుడికయినా, నిష్కళంక నాయకుడికయినా ప్రభుత్వ వ్యతిరేకత అనేది పూర్వజన్మ సంచితంలా వెంటే వెన్నాడి వస్తుంటుంది. దీన్ని తట్టుకుని మూడో పర్యాయం ప్రజల మెప్పును పొందడం కాకలు తీరిన వారికి సయితం కత్తి మీది సామే. పైగా ప్రత్యర్ధి ఎవ్వరు? తన కీర్తి కిరీటపు ధగధగలు ప్రపంచం నలుదిక్కులా పరచుకుపోతుంటే, శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రాజకీయాకాశంలో  వెలిగిపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన్ని ఒంటరిగా నిలువరించడం అసాధ్యం అని నిర్ధారణకు వచ్చిన తరువాతనే, బీహారులోని మోడీ ప్రత్యర్ధులందరూ ఏకమై మహా కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడిన వేళా విశేషం ఏమిటో కాని, మొదటి ముద్దలోనే ఈగ పడిన చందంగా నెలలు నిండకమునుపే ఆ కూటమికి బీటలు పడ్డాయి. ఇక నిజాయితీకి నిలువుటద్దం, పుటం వేసి గాలించినా ఎలాటి అవినీతి మరకలు కానరాని నితీశ్ కుమార్ జత కట్టింది ఎవరితో. రాజకీయాల్లో ఉచితానుచితాలు పాటించని లాలూ ప్రసాద్ యాదవ్ తో. ఉత్తర దక్షిణ ధ్రువాల వంటి వీరిద్దరి కలయికతో ఏర్పడ్డ మహా కూటమి పోటీ పడింది ఎవరితో, మన దేశంలోనే కాక దేశదేశాల్లో తన కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో.
ఇన్ని వ్యతిరేక పవనాల నడుమ నితీశ్ కుమార్ సాగించిన ఈ ఎన్నికల పోరాటంలో మామూలుగా అయితే మోడీ పక్షానిది ఏక పక్షపు విజయం కావాలి. మరి జరిగిందేమిటి? సరే ఈ ప్రశ్నకు బీహారు ప్రజలు తమ తీర్పుతో జవాబు చెప్పేశారు. అయితే, ఎందుకిలా జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకాల్సి వుంది. ఈ క్రమంలో అనేకానేక విశ్లేషణలు జనం ముందుకు వస్తున్నాయి.
కొందరిది మతం మీద కులం సాధించిన విజయం అంటుంటే, మరికొందరు అదేమీ కాదు, అసహనం మీద సహనం సాధించిన గెలుపని అభివర్ణిస్తున్నారు. మోడీ అమిత్ షా జోడీ అహంభావపు మొండి వైఖరి పార్టీ కొంప ముంచిందని కొందరు గగ్గోలు పెడుతుంటే, బీహారు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మునిగిపోయే కొంపలు ఏవీ లేవని ఇంకొందరు కొట్టి పారేస్తున్నారు.
ఎన్నికల్లో ఇది సహజాతి సహజం. అందరి అభిప్రాయాలు సరయినవి కాకపోయినా ప్రతి దాంట్లోనుంచి ఏరుకుంటే ఎంతోకొంత మంచి దొరుకుతుంది. సూక్ష్మం గ్రహిస్తే వర్తమానం నుంచి భవిష్యత్తుకు బాట వేసుకోవడానికి మార్గం సులువవుతుంది.
విజయం లభించినప్పుడు సంయమనం అవసరం. అపజయం సిద్ధించినప్పుడు రాగద్వేషాలకు అతీతమైన ఆత్మావలోకనం అంతే అవసరం.
విజయంతో విర్రవీగినా చతికిల పడక తప్పదు. అపజయంతో నిస్పృహ చెంది చతికిల పడ్డా రానున్న విజయాలకు దూరం కాక తప్పదు.
ప్రజలిచ్చిన అధికారం శాస్వితం కాదు. అలాగే, ఏదో చెప్పి, ఏదో చేసి అధికారం దొరకబుచ్చుకుందామని ప్రయత్నం చేసినా అది తాత్కాలికమే అవుతుంది.
ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం వున్న రాజకీయ నాయకులు, తమ పార్టీల మంచి చెడులు గురించి కాకుండా  ప్రజల గురించి ముందు పట్టించుకోవాలి. అప్పుడు ప్రజలే ఆ పార్టీలను గురించి పట్టించుకుంటారు.
ప్రస్తుతం మెజారిటీ పార్టీలు తద్విరుద్ధంగా ఆలోచిస్తున్నాయని అనిపిస్తోంది.

బీహారు ఎన్నికల ఫలితాలు చెబుతోంది కూడా ఇదే! (11-11-2015)
NOTE: Courtesy Image Owner 

భార్య (చెప్పిన) రహస్యం


ప్రధమ కబళే మక్షికాపాతః
అంటే మొదటి ముద్దలోనే ఈగ పడింది అని అర్ధం.
ఈ శీర్షికలో ముందు బ్రాకెట్లో రాసిన పదం ‘చెప్పిన’ అని లేదు. రాసిన తరువాత చూసుకుంటే, చూడ్డం మంచిదయింది, లేకపోతే పుట్టి పూర్తిగా మునిగేది. ఆ విధంగా కలిగిన జ్ఞానోదయంతో  తెలివినపడిన వాడినై,  అర్జంటుగా ముందో  బ్రాకెట్టు పెట్టి అందులో ‘చెప్పిన’ అనే పదాన్ని యమర్జెంటుగా కూరిపెట్టి, ‘భార్య రహస్యం’ ఏవిటి?  అనే దిక్కుమాలిన అనుమానాలు తలెత్తి సంసారపు పుట్టి నిండామునగకుండా నిండుదా  జాగ్రత్త పడ్డాను.
ఇంతకీ అసలు విషయం ఏవిటంటే, మా ఆవిడ బయట వర్షం పడొచ్చనే వాతావరణ హెచ్చరికలు నమ్మినదై, బయట పెత్తనాలకు పోలేకా,  లోపల కరెంటులేని కారణంగా  టీవీ సీరియల్ చూసే అవకాశం బొత్తిగా లేకయున్నూ,  ఇత్యాది బలమైన అనేక  కారణాల కారణంగా విధిలేని స్తితిలో ఇంటిపట్టునే వుండిపోయి, తప్పనిసరై  నాతో మాటవరసకు మాటలు కలిపి వాటి మధ్యలో ఒక తూటా పెట్టి  పేల్చింది. ఆ మాట  అన్నది మా ఆవిడ కాబట్టి, ఆ సమయంలో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. అదేవిటో ఈ భార్యామణులు  ఉన్నట్టుండి తమ తమ మొగుళ్ళను ఎవరితోనో ఒకరితో పోల్చి తమ ఈగోను చల్లార్చుకుంటూ ఉంటారని ఆడవాళ్ళంటే వోర్చుకోలేని ఒకాయన ఎప్పుడో  చెప్పాడు. సాధారణంగా పక్కింటాయనతోనో, ఎదురింటాయనతోనో (వాళ్ళ సంపాదనలతో సుమా) పోల్చి ‘మీరూ వున్నారు ఎందుకూ...’ అని సన్నాయినొక్కులు నొక్కడం పరిపాటి. కానీ ఈసారి మా ఆవిడంబాళ్ళు నన్ను పోల్చి చెప్పింది అట్లాంటిట్లాంటి అల్లాటప్పా వాళ్ళతో కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తోటి. ‘ఆయనకూ   మీకూ  తేడా ఏమీ  కనబడడం లేదండీ’ అని ఉన్నట్టుండి   అనేసింది. ‘అమ్మ భడవఖానా. నన్నంటే ఏదో మొగుడుముండావాడ్ని సరిపుచ్చుకుంటాను కాని నన్ను ప్రధాన మంత్రితో పోల్చడం, కాదు కాదు సాక్షాత్తు ప్రధాన మంత్రిని నాతో పోల్చడం  ఏవిటి అసాధ్యం కూలా’ అనుకున్నాను.
ఏవిటో  అనుకున్నాకాని ఆమె లాజిక్కు ఆమెకు వుంది.
“నరేంద్ర మోడీ గారి లాగే  నేను మొండివాడ్ని(ట). కాదు, నాలాగే ఆయన మొండివాడు. ఎవరి మాటా వినడు” ఆవిడ ఉవాచ. కాదంటే కుదరని మాట.
“ఎవరు ఏమైనా  పరవాలేదు తన మాటే నెగ్గాలి అనే  తరహా ఆయన్ది, మీలానే” అని లా పాయింటు తీసింది.
“హౌరా!” అనుకున్నాను నాలో నేనే.
“అన్ని ధరలు పెరిగాయి కాస్త నెల బడ్జెట్ పెంచవయ్యా మగడా అంటే కుదరదంటే కుదరదని  మీలాగే నిక్కచ్చిగా తెగేసి చెప్పేరకం.” ఏమనడానికి ఏముంది? నిజమే కదా!
ఇంతవరకు బాగానే వుంది అనుకుంటూ వుంటే ఆఖరి తూటా పేల్చింది.
“మీరు బయట టీవీల్లో మాట్లాడ్డం తప్పిస్తే ఇంట్లో వాళ్ళతో ఓ మాటా వుండదు ఓ ముచ్చటా వుండదు. ఆయన్ని గురించి వాళ్ళ పార్టీ వాళ్ళదీ అదే గోల”
“అందుకే మీకూ ఆయనకూ తేడాలేదనేది” అనేసింది పేపరు మడిచి పక్కనపడేస్తూ.   

ఇంకేం అనను? అనాల్సింది అంతా తానేఅనేసిన తరువాత. (11-11-2015)

7, నవంబర్ 2015, శనివారం

ఓడిన వారిది నైతిక విజయం – గెలిచిన వారిది గౌరవ ఓటమి

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 08-2015, SUNDAY)

సూటిగా .....సుతిమెత్తగా........ 
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురించి వెలువడిన ఎగ్జిట్ పోల్ వివరాలపై వాదోపవాదాలకు తెర పడబోతోంది. వాస్తవ ఫలితాలు  ఆదివారం తొలి ఝాముకల్లా తెలియబోతున్నాయి.
ఈసారి బీహారు అసెంబ్లీ ఎన్నికలకు జాతివ్యాప్త ప్రాచుర్యం లభించింది. ఈ ఎన్నికల ఫలితాలపట్ల అదే స్థాయిలో ఆసక్తి పెరిగింది. ఎగ్జిట్ పోల్ నిర్వహించే సంస్థలే కాకుండా వాటికి వత్తాసుగా నిలిచే మీడియా సంస్థల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం గమనార్హం.
అటు ఆఖరి ఐదో దశ పోలింగు ముగిసిందో లేదో ఇటు దేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను  అనేక వార్తా ఛానళ్ళు పోటీపడి ప్రసారం చేయడం మొదలెట్టాయి. వాటి ఆధారంగా  జాతీయ చానళ్ళే కాకుండా పలు ప్రాంతీయ టీవీ ఛానల్లు సయితం చర్చాగోష్టులు నిర్వహించాయి. కొందరు ఇవన్నీ చూసి ఇవే నిజమైన ఫలితాలని సంబరపడితే, మరికొందరు నిరుత్సాహపడ్డారు కూడా.
బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీల సంఖ్యతో పోటీపడ్డాయా అన్నట్టుగా అనేక సర్వే సంస్థలు ఈసారి రంగంలో దిగినట్టుగా కానవచ్చింది. వీటిల్లో మెజారిటీ సర్వేలు, ‘హోరాహోరీ’ అని తేల్చాయి. ఈ పోటాపోటీలో కూడా పలు సర్వేలు ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ‘మహాకూటమి’ పట్లనే ప్రజలు కొద్దిగా మొగ్గుచూపే వీలుందని  చెప్పాయి. ఒకటి రెండు సర్వేలు మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి విజయావకాశాలు వుంటాయని పేర్కొన్నాయి. ఒక సర్వేలో ఎన్డీయే కూటమికి ఘన విజయం దక్కవచ్చని తేలింది. ఏదిఏమైనా వాస్తవ  ఫలితాలు వెలువడనున్న తరుణంలో సర్వేల మంచి చెడులు గురించిన తర్కం అనవసరం. కాకపొతే ఈ సర్వేల  అంచనాలను బట్టి ఒక విషయం స్థూలంగా అర్ధం అవుతోంది,  రెండు కూటముల నడుమ పోటీ తీవ్రంగా వున్నదని. ఎన్నికల ప్రచారంలోనే ఈ విషయం బయట పడింది కాబట్టి దానికి అంత ప్రాధాన్యత వుండకపోవచ్చు.


మొత్తం మీద ఉభయ రాజకీయ కూటములు బీహార్ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని తేటతెల్లం అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలుపెపెరగని ప్రచారం చేసి లెక్కకు మిక్కిలి ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఇదంతా బయట నుంచి గమనించేవారికి, జరిగిన పోటీ మోడీ, నితీష్ నడుమనా అన్న సందేహం కలిగినా ఆశ్చర్యం లేదు. బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో  గెలుపు అనేది  ప్రధాని మోడీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి కావచ్చేమో కానీ ఓటమి సంభవిస్తే అందువల్ల ఆయన ప్రతిష్టకు వాటిల్లే నష్టం ఏమీ లేదు. దిగంతాలకు పాకుతున్న ఆయన వ్యక్తిగత ప్రభలకు కొంత ఛాయ తగ్గవచ్చేమో కానీ అంతకు మించి ఏమీ జరగదు. బ్రహ్మాండమయిన మెజారిటీతో కేంద్రంలో అధికార చక్రం తిప్పుతున్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఇప్పట్లో ముప్పేమీ వుండదు. ఆయనకు కానీ, ఆయన కూటమికి కానీ రాజకీయంగా తూట్లు పడే వ్యవహారం కాదు. కాకపొతే, మోడీ కీర్తికిరీటపు ధగధగలు  ఒకింత మసకబారవచ్చు.  అంతకు మించి ఇప్పట్లో వాటిల్లే ముప్పేమీ వుండదు.  2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళ వ్యవధానం వుంది. ఆ నాటికి  నాటికి కాలు కూడతీసుకునే వీలున్నది. పొతే, మరోవైపు నితీష్ విషయం కూడా అంతే. పదేళ్ళ పాలన అనంతరం ప్రభుత్వ వ్యతిరేకత కానరాకుండా చేసుకోవడం ఎంతటి కాకలు తిరిగిన నాయకుడికి కూడా సాధ్యం కాదు. ఆయనకు వ్యక్తిగతంగా సచ్చీలుడనే మంచి పేరు యెంత వున్నప్పటికీ ఆయన కూటమిలోని కొన్ని మిత్రపక్షాల నాయకులకు అంతటి మంచి పేరు లేదు సరికదా, చెడ్డ పేరు వాళ్ళ ఖాతాలో బాగా పేరుకుపోయి వుంది. అలాటివారి నీడన వుండడం నితీష్ వంటి మచ్చలేని నాయకుడికి అంత శోభ ఇవ్వదు. అయితే కుల రాజకీయం అనేది మారుపేరుగా మారిన బీహార్ వంటి రాష్ట్రంలో ఇటువంటి విభిన్న, వైరుధ్య కలయికలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయన్నది ముందుగా చెప్పడం కష్టం. అది పడగనీడా కావచ్చు, కొండొకచో పందిరి నీడా కావచ్చు.
పదేళ్ళ పాలనాకాలంలో పేరుకు పోయిన ప్రభుత్వ వ్యతిరేకత, లాలూ వంటి వారితో పొత్తు, సాక్షాత్తు దేశ ప్రధానమంత్రే స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని తన భుజానికి ఎత్తుకోవడం - ఇలాటి అంశాలన్నీ నితీష్ నాయకత్వంలోని మహా కూటమికి ప్రతికూలమైనవే. అంచేత ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ లో వెల్లడయిన విధంగా ఆ స్థాయిలో పోటీ ఇవ్వగలగడం అంటే అది  నిజంగా గొప్ప విషయమే. ఆ కోణంలో నుంచి చూసినప్పుడు, ఒకవేళ ఆయన పరాజయం పాలయినా ఒకరకంగా ఆయనకది నైతిక విజయం కిందే లెక్క.
ఇక మోడీ. బీహార్ ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పడానికి సందేహించనక్కరలేదు. ఎన్నికల గోదాలోకి దిగడానికి పూర్వం నుంచే ఆయన బీహారు ఎన్నికల్లో గెలిచి తీరాలనే వ్యూహంపై కన్నేసి వుంచారని చెప్పడానికి ప్రధాని ఆ రాష్ట్రం పై కురిపించిన వరాల జల్లులను గుర్తుచేసుకోవచ్చు. ఒక రకంగా మోడీ, అమిత్ షా జోడీ , బీహార్ అసెంబ్లీ ఎన్నికలను త్వరలో రాబోయే ఇతర అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావడానికి ఒక పరీక్షా వేదికగా భావించారేమో తెలియదు. బీహార్ వ్యూహం ఫలిస్తే ముందు ముందు యావత్ భారతంలో తమ పార్టీని పటిష్ట పరచి, దక్షిణ భారతంలో కూడా బీజేపీ విజయ పతకం ఎగిరేలా చేయడానికి ఉద్దేశించిన భవిష్యత్ ప్రణాళిక అమలుకు బీహారును ఒక ప్రయోగశాలగా ఎంచుకుని ఉండవచ్చు. అవసరమైన పక్షంలో ఓటమికి కూడా సిద్ధపడి, సొంతంగా పార్టీ ఉనికిని సుస్థిర పరచుకునేందుకు మునుముందు సాధించబోయే విజయలక్ష్యాల సాధనకు బీహారు అసెంబ్లీ  ఎన్నికలను కేంద్ర బిందువుగా చేసుకుని ఉండవచ్చు. బీహారులో అనుసరించిన ఎన్నికల వ్యూహం ఒకరకంగా కొన్ని వర్గాలనుంచి వ్యతిరేకతను కట్టబెట్టినా, రానున్న కాలంలో తమ పార్టీకి మెజారిటీ ప్రజల మద్దతు కూడగట్టుకునే వ్యూహంలో భాగంగా దాన్ని  భావించవచ్చు.
ఏదిఏమైనా బీహారులో నితీష్ కూటమి, ఎగ్జిట్ పోల్స్ లో తేలిన విధంగా రవంత తేడాతో గెలుపొందినా అది మోడీ కూటమికి తలవంపులు తెచ్చే పరాజయం కాబోదు. ఒకరకంగా గౌరవప్రదమైన ఓటమే అవుతుంది. అలాగే , కొన్ని సర్వేలు చెప్పిన విధంగా మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించినా, అంతటి ప్రతికూల పరిస్తితుల్లో కూడా ఆ విధమైన గట్టి  పోటీ ఇవ్వగలిగిన నితీష్ కుమార్ కు అది నైతిక విజయమే అని చెప్పవచ్చు.   
ఇక చివరగా చెప్పేది ఏమిటంటే అటు మోడీకి, ఇటు నితీష్ కు సామాన్య జనంలో ఒక వ్యక్తిగతమైన గౌరవం  వుంది. ఈ ఇద్దరు నాయకులు తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయం చేస్తారనేది చదువుకున్న యువతీ యువకుల్లో ప్రచారంలో వుంది.
మరి, ఎగ్జిట్ పోల్స్ సంకేతాలకు తగ్గట్టుగా ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు అవసరమయ్యే సంఖ్యాబలాన్ని   బొటాబొటిగా తమకిస్తే, అప్పుడు  వీళ్ళు ఏం చేస్తారనే దానిపై  ఒక చర్చ సాగుతోంది. సాధారణ రాజకీయ పార్టీల  మాదిరిగా ఏదో విధంగా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కుతారా, లేక ప్రజాస్వామ్య ప్రియులుగా అధికారానికి దూరం జరిగి కొత్త బాట పడతారా? వేచి చూడాలి.
పీఎస్: పొతే ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి ఓ మాట. వీటికి శాస్త్రీయమైన ప్రాతిపదిక వుందని నిర్వాహకులు చెప్పే మాటల్ని అత్యధిక జనం నమ్మడం లేదు. ఈ సర్వేల విశ్వసనీయతపై ఈ సర్వే సంస్థలే స్వయంగా ఒక సర్వే నిర్వహిస్తే బాగుంటుందని సూచన. రానున్న రోజుల్లో ఇటువంటి ఎన్నికల సర్వేలు, క్రికెట్  బెట్టింగుల మాదిరిగా వికృత పోకడలకు దారితీయకుండా ముందు జాగ్రత్తగా ఒక చట్టం తీసుకువస్తే మరింత బాగుంటుంది. (07-11-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595 
NOTE: COURTESY IMAGE OWNER                                   


5, నవంబర్ 2015, గురువారం

ఏమీ సేతురా లింగా!


ఉదయం గడ్డం చేసుకుంటూ వుంటే సెల్లు మోగింది.
‘ఏకాంబరం గారా మాట్లాడేది?’
‘అవునండీ ఏకాంబరాన్నే! చెప్పండి ఎవరు మీరు?’
‘రచయిత ఏకాంబరం గారేనా ‘
‘అవునండీ ఆయన్నే విషయం చెప్పండి’
‘పొద్దున్న పేపర్లో సహనం ఎలా అలవరచుకోవాలో చాలా విశదంగా రాసారు. మొత్తం విడవకుండా చదివాను. బాగా రాశారండీ!’
‘చాలా  థాంక్స్ అండీ’
స్నానానికి పోతుంటే మళ్ళీ ఫోను.
‘ఏకాంబరం గారా మాట్లాడేది?’
‘అవునండీ!’
‘రచయిత ఏకాంబరం గారేనా’
‘అవునండీ ఆయన్నే నేను. ఏమిటి సంగతి?’
‘సహనం, దాని ఆవశ్యకత గురించి మీరు రాసిన వ్యాసం చదివానండీ! భలేగా  నచ్చింది నాకు’
‘అలాగా చాలా సంతోషం అండీ’
భోజనం ముందు మళ్ళీ ఫోను
‘ఏకాంబరం గారా మాట్లాడేది?’
‘అవునండీ!’
‘సహనం గురించి యెంత బాగా రాసారండీ. నిజానికి ఇలాటి వ్యాసాలు ఇంకా ఇంకా రావాలండీ’
‘మరేనండీ రాయాలనే వుంది, కానీ ఓపిక చచ్చి పోతోంది’
‘మీరే అల్లా అంటే ఎల్లా, ఎల్లాగో అల్లా  ఓపిక తెచ్చుకుని రాయాలి, అంతే కాని  అలా కలం పారేస్తే ఎలా చెప్పండి’
ఆ కాల్ కట్ చేయగానే మరో ఫోను, మీ సహనం ఆర్టికిల్ చాలా  బాగుందంటూ.
ఏకాంబరానికి సహనం చచ్చిపోయింది.

సెల్లు ఆఫ్ చేసి తల పట్టుకున్నాడు. 


(COURTESY IMAGE OWNER)

సహనావతు

  (PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 05-11-2015, THURSDAY)
వేదకాలం నుంచి వినవస్తున్న హితోక్తి ఇది. ఎల్లకాలం మననం చేసుకుంటూ ఆచరించాల్సిన మహా సూక్తి. దీన్ని గుర్తు చేయాల్సిన పరిస్తితి దాపురించడమే ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా మీడియాలో సహనం, అసహనం అనే రెండు పదాల చుట్టూ చర్చోపచర్చలు సాగిపోతున్నాయి. ‘సహనం పాటించండి’ అని నోటితో ఓపక్క చెబుతూనే, నొసటితో అసహనం ప్రదర్శించడం ఇందులోని విషాదం.
సహనం గురించి సాధారణ జనాలు అసహనానికి గురయ్యే విధంగా చర్చలు, వాదోపవాదాలు సాగిపోతున్న నేపధ్యంలో తొమ్మిది మాసాలక్రితం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు వేర్వేరు సందర్భాలలో విడివిడిగా చేసిన ఉద్బోధలు గుర్తు చేసుకోవడం అవసరమనిపిస్తోంది.
ప్రధాని ప్రసంగం సాగిన తీరు పత్రికల్లో ఇలా వచ్చింది.
'మతపరమైన హింసపై కఠినంగా వ్యవహరిస్తాము. మత విద్వేషం ప్రేరేపించేవారు ఎవరయినా సరే సహించేది లేదు. ఈ దేశంలో ఎవరయినా తమకు నచ్చిన మత విశ్వాసాలను పాటించేందుకు పూర్తి స్వేచ్చ వుంది. ఈ విషయంలో ఎలాటి వొత్తిళ్లు పనిచేయవు. మెజారిటీ వర్గం అయినా, మైనారిటీ వర్గం అయినా బాహాటంగా కాని, చాటుమాటుగా కాని అన్య మతానికి వ్యతిరేకంగా విద్వేషానికి పాల్పడినా, కుట్రలు చేసినా సహించేది లేదు. అలాటి చర్యలను ఉక్కు పాదంతో అణచి వేస్తాము'
ప్రధాని ప్రసంగ సందర్భం ఢిల్లీలో క్రైస్తవ మతాధికారుల సమావేశం. ప్రధాని హోదాలో వున్న వ్యక్తి అలాటి సదస్సుల్లో  ఏవిధంగా మాట్లాడుతారో మోడీ గారి ప్రసంగం అదే విధంగా సాగిపోయింది.
మన దేశానికి చెందిన కురియా కోస్  అలియాస్ చవర, మదర్ యాప్రేసియాలకు సెయింట్ హుడ్ ప్రకటించిన సందర్భంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కాబట్టి దానికి అనుగుణంగానే ప్రధాని ప్రసంగించారు. అంతకుముందు  ఢిల్లీలో క్రైస్తవులకు చెందిన చర్చీల మీద జరిగిన దాడుల నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకున్నవాళ్లకు,  ప్రధాని వ్యక్తపరచిన ఈ అభిప్రాయాల ప్రాముఖ్యం అర్ధం అవుతుంది. ఈ విషయంలో ఆయన మొదటిసారి పెదవి విప్పారని అనుకోవాలి. మోడీ భారతీయ జనతా పార్టీకి నాయకుడు అయినప్పటికీ, మొత్తం దేశానికీ ఆయన ప్రధాన మంత్రి. అంచేత అటువంటి సమావేశాల్లో వేరే విధంగా మాట్లాడే అవకాశం లేదు.
మత ఘర్షణలు జరక్కుండా చూడడానికి, మతం పేరుతొ ఉగ్రవాదులు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందనీ, అటువంటి అనాగరిక చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామనీ ప్రతి ప్రధానమంత్రి నొక్కివక్కాణించడం  ఒకరకంగా పరిపాటిగా మారిపోయింది. సరే. అదలా వుంచితే, లౌకిక రాజ్యంగ  వ్యవస్థను ఎంచుకున్న భారత దేశాన్ని పాలించేవారికి దేశంలోని మైనారిటీ ప్రజల్లో అభద్రతా భావాన్ని దూరం చేయడం కూడా ఒక కర్తవ్యమే. ఆవిధంగా ప్రధాన మంత్రి మోడీ మాటలవల్ల అలాటి ఫలితాలు వస్తే అంతకంటే కావాల్సింది లేదు. అయితే ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే అడుగులు ఆ విధంగా పడుతున్న లక్షణాలు కానరావడం లేదు.
ఇక రెండో సందర్భం కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్ధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జరిపిన  మాటా మంతీ.
దేశ ప్రధమ పౌరుడు భావి పౌరులతో ముచ్చటిస్తూ తన మనసులోని మాట విప్పి చెప్పారు. దశాబ్దాల రాజకీయ అనుభవసారాన్ని మొత్తం రంగరించి మరీ చెప్పారు. పాలకపక్షం వారికీ, ప్రతిపక్షం వారికీ అందరికీ పనికొచ్చే పసిడి ముక్కలు చెప్పారు. ప్రస్తుత పరిస్తితులను అవగాహన చేసుకుని ఆవేదనతో కూడిన హితబోధ చేశారు.
చురుక్కుమనిపించేలా  మాత్రమే కాదు,  ఆలోచింపచేసేలా కూడా  వున్నాయి ఆయన మాటలు. ఆ హితవచనాలు విని ఆచరించగలిగితే అది జాతి హితానికి ఎంతో  మంచిదనిపించేలా కూడా వున్నాయి.
ప్రస్తుతం దేశాన్ని పాలిస్తోంది భారతీయ జనతాపార్టీ. పేరుకు సంకీర్ణ ప్రభుత్వం. కానీ , ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో, ఆయన పేరుతొ ఎదురులేకుండా సాగిపోతున్న  ప్రభుత్వం అది.  శ్రీ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికయింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో. ప్రస్తుతం ఆ పార్టీలోకసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్తితిలో వుంది. ప్రధాని మోడీకి, ఆయన పార్టీ అయిన బీజేపీకి కాంగ్రెస్ అంటేనే చుక్కెదురు. ఇలాటి నేపధ్యంలో రాష్ట్రపతి తనకున్న పరిమితుల్లోనే హితబోధ చేశారు. జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, జరగాల్సిన విధి విధానాలను విశ్లేషించారు.  అలాగని ఆయన ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఎవ్వరు నొచ్చుకునే విధంగా మాట్లాడలేదు. ఒక కుటుంబ పెద్ద తన కుటుంబ విషయాలను తనవారితో యెలా మాట్లాడతాడో ఆవిధంగానే సాగింది రాష్ట్రపతి ప్రసంగం.
ప్రతిపక్షం యెలా వ్యవహరించాలో, పాలక పక్షం యెలా నడుచుకోకూడదో శ్రీ ప్రణబ్ ముఖర్జీ అన్యాపదేశంగా ప్రస్తావించారు. ప్రజల ద్వారా ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన చట్టసభల్లో కనబరుస్తున్న ప్రవర్తనను  ఆయన ప్రశ్నించారు. ఒకరకంగా చెప్పాలంటే యావద్దేశ పౌరుల మనస్సుల్లో కదలాడుతున్న అంశాలనే రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి తమ ప్రసంగాలలో చెప్పిన మాటల్ని తొమ్మిది నెలల తరువాత గుర్తు చేయాల్సిన అవసరం, గుర్తుంచుకోమని చెప్పాల్సి రావడం బాధాకరం. 
ముందు చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం దేశంలో సహనం, అసహనాలు గురించిన చర్చ సాధారణ జనం  సహనం కోల్పోయే స్థాయిలో అనంతంగా సాగిపోతోంది. తమ మాట వినమని చెప్పే వాళ్ళే కాని ఎదుటివారు చెప్పేది వినిపించుకునే ఓపిక ఎవ్వరికీ  లేకుండా పోతోంది.
పార్టీలకు అతీతంగా సమాజ హితాన్ని కోరుకునే వారి మనసులను కలవర పరుస్తున్న అంశం ఇదే.
(04-11-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
  



3, నవంబర్ 2015, మంగళవారం

ఆధునిక సీతాపహరణం (పేరా నాటిక, రెండే పాత్రలు)


డోర్ బెల్  మోగుతుంది. ఇంట్లో ఒంటరిగా వున్న ఆడమనిషి  వెళ్లి తలుపు తీస్తుంది.
‘అమ్మా! ఆకలి. ఏదైనా వుంటే పెట్టండి, మీ పేరు చెప్పుకుని తింటాను’
‘అయితే లోపలకు రా అన్నం పెడతాను’
‘లేదు, మీరే బయటకు రండి’
‘అయితే ఓకే!’
‘హ!హ! నా చేతికి చిక్కావ్. నేనెవర్నో తెలుసా? లంకాధిపతి రావణుడిని’
‘హ!హ! నేను సీతని కాను, వాళ్ళింట్లో పనిమనిషిని’
‘హ!హ! పనిమనిషివా? మరీ మంచిది. సీతను పట్టుకెడితే మందోదరికి కోపం వస్తుంది. పనిమనిషిని తెచ్చానని చెబితే ఎంతో సంతోషిస్తుంది. పాత పనిమనిషి మానేసినప్పటి నుంచి బాగా ఇబ్బందిగా వుంది’
‘హ!హ! నేను సీతను అయితే నా కోసం రాముడు ఒక్కడే వెతుక్కుంటూ నీ వెంట పడతాడు. నన్ను ఎత్తుకెళ్ళావని తెలిసిందంటే హోల్ మొత్తం అపార్ట్ మెంటులోని జనాలందరు వెతకడానికి బయలుదేరతారు, జాగ్రత్త!’
‘అలానా! అయితే వస్తా!’
(నువ్వు హ! హ!! అంటే నేనూ హ! హ!! అంటా)
నెట్లో చక్కర్లు కొడుతున్న ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం – భండారు శ్రీనివాసరావు


NOTE: Courtesy Image Owner
   
Top of Form


2, నవంబర్ 2015, సోమవారం

ఇంగిలీషు ఆడ జోకులు


ఇంగిలీషు పురుషులు రాసిన ఆడ జోకులు ఇలాగే వుంటాయి. వ్యంగం పాలు కూసింత ఎక్కువయిందని అనిపించినా అనిపించవచ్చు. మనది కేవలం అనువాదం మాత్రమే కనుక,  అసలు ఓనరు ఎవరో తెలియదు కనుక, కోపం వస్తే ఝాడించడానికి కానీ,  నవ్వొచ్చి నవ్వుకున్నా కానీ,  రోషం వచ్చి విసుక్కున్నా కానీ మన పూచీ ఎంతమాత్రమూ లేదనన్నీ మనవి చేసుకోవడం అయింది. కావున గమనించగలరు.
ఇందులో కొన్ని ఇప్పటికే   ఇంగ్లీష్ భాషలో  సాంఘిక  మాధ్యమాల్లో షికారు చేస్తున్నాయి. కాబట్టి ఎక్కడో, ఎప్పుడో చదివామని అనిపిస్తే నవ్వుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే నేనూ అదే చేశాను.
ఇప్పుడు మీరు ట్రై చేయండి.
“వివాహం అనేది బాలుర వసతి గృహంలో బాతు రూము లాంటిది. బయట వున్నవారు లోపల దూరాలని ఆత్రపడుతుంటే, లోపల వున్నవాళ్ళు బయట పడాలని అంతే లెవల్లో ఆదుర్దా పడుతుంటారు”

డాక్టరు : “ ఏమయ్యా ఎలా వుంది నీ తల నొప్పి. నిన్నటి లాగే ఉందా, ఏమన్నా తగ్గిందా?"
రోగి: "ఇప్పుడు లేదండీ, మా ఆవిడ నిన్ననే పుట్టింటికి వెళ్ళింది”

“ఆడది తాదాత్మ్యం గా కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నదీ అంటే, ఆమె మనోఫలకంపై ఆమె మనోహరుడు ఒక్కడే కానవస్తున్నాడని అనుకోవాలి. మగవారి విషయంలో ఇది మరో రకంగా ఉండొచ్చు. వాళ్ళ మనస్సులో స్లైడ్ షో మొదలయ్యే అవకాశం హెచ్చు”

“మహిళలు ఒక విషయంలో నిష్ణాతులు. తిమ్మిని బొమ్మ చేసి నమ్మించగలరు. అంతటి మెజీషియన్లు వాళ్ళు. ఇది తేల్చుకోవాలంటే  వాళ్ళతో మాట్లాడి చూడండి. మీకు తెలియకుండానే సంభాషణను వాదులాట లోకి మార్చేస్తారు”

“ఈ లోకంలో మగవాళ్ళు మూడు రకాలు. మొదటి రకం ఆడతోడు లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తుంటారు. రెండోరకం మగ రాజులు స్నేహితురాలితో  కాలక్షేపం చేస్తూ, ఏదైనా అద్భుతం జరక్కపోతుందా అని ఎదురు చూస్తుంటారు. మూడో రకం మగపురుషులు  పెద్దలు కుదిర్చిన సంబంధం ఒప్పుకుని, వాళ్ళు నిర్ణయించిన  అమ్మాయినే పెళ్ళాడి, ఆ మరునాటి నుంచి ఏం జరిగిందన్న విషయాన్ని ఆలోచిస్తూ రోజులు దొర్లిస్తుంటారు’

యావత్ మగజాతిలో ఈ మూడో బాపతు వాళ్ళే ఎక్కువని గణాంక పురుషుల ఉవాచ.
ఇతి వార్తాః 
NOTE: Courtesy Image Owner