3, అక్టోబర్ 2015, శనివారం

బీహారు ఎన్నికల్లో హామీల తిరునాళ్ళు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 04-10-2015, SUNDAY)    

కాకతాళీయం కావచ్చు కానీ బీహారు ఎన్నికలకు ముందు సుప్రీం కోర్టు ఎన్నికల వాగ్దానాల విషయంలో ఒక వింతైన తీర్పు ఇచ్చింది.
ఎన్నికల సమయంలో ఓటర్లకు గాలం  వేయడానికి వారికి ఉచితంగా కలర్ టెలివిజన్లు, ల్యాప్ టాప్ లు వగయిరా ఇస్తామని రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు ప్రజా ప్రాతినిధ్య చట్టం లోని సెక్షన్ 123  కిందకు రావని, ఆ హామీలు అవినీతి చర్యలు కావని పేర్కొన్నది. ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి  వచ్చిన తరువాత వాటిని నెరవేర్చలేని పార్టీలపై చీటింగు కేసులు పెట్టాలని కోరుతూ దాఖలయిన ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.
ఇది కూడా కాకతాళీయం కావచ్చు కాని, ఈ తీర్పు వెలువడిన కొద్ది రోజులు కూడా గడవక ముందే బీహారు అసెంబ్లీ ఎన్నికల కోసం  భారతీయ జనతా పార్టీ ఒక విజన్ డాక్యుమెంటు విడుదల చేసింది. ఆకాశమే హద్దుగా ఈ పత్రంలో అనేక హామీలను గుప్పించారు. ప్రతి దళిత కుటుంబానికి కలర్ టీవీ, భూమిలేని వారికి అయిదు గుంటల పొలం, ప్రతి పేదమనిషికి  చీరె, ధోవతి, బాగా చదువుకునే యాభయ్ వేల మంది విద్యార్ధులకు ల్యాప్ టాపులు, విద్యార్ధినులకు  స్కూటీలు, ఇలా సాగిపోయిందా హామీల జాబితా.
నిజానికి రాజకీయాల్లో ఇది కొత్త విషయమేమీ కాదు. గతంలో కూడా అనేక రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి ఇలాటి పిల్లి గంతులు అనేకానేకంగా వేసిన సందర్భాలు అనేకం వున్నాయి. నిరుడు ఫిబ్రవరిలో మన పొరుగున వున్న తమిళనాడులో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత కురిపించిన వాగ్దాన వర్షంలో ఈ ఉచిత జాబితా చాంతాడంత పొడుగయింది. మిక్సీలు, గ్రైండర్లు, ఆవులు, మేకలు ఇలాటివన్నీ పప్పులూబెల్లాల మాదిరిగా  ఉదారంగా ఉచితంగా పంచిపెడతామని ఊదరగొట్టారు. ఇక దరిద్రాన్ని కలికానికి కూడా కనబడకుండా తరిమికొడతా మనీ, ఏకంగా పదికోట్ల ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగులకు ఇస్తామనీ ఇలాటి భారీ హామీలు కూడా అన్నాడీ ఎంకే ఎన్నికల ప్రణాళికలో పొందు పరిచారు.
పొతే, విభజిత తెలుగు రాష్ట్రాల్లో నిరుడు జరిగిన ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించిన వాగ్దానాలు ఎన్నికల ప్రణాళికల రూపురేఖల్నే సమూలంగా మార్చివేశాయి. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతుల రుణాలను మాఫీ చేస్తామనీ, అంచేత రుణ బకాయిలు చెల్లించకుండా వేచి చూడమనీ ప్రలోభ పెట్టాయి. ఒక దశలో ఎన్నికల కమీషన్ కల్పించుకుని ఈ హామీలు ఎలా అమలు చేస్తారని కూడా ప్రశ్నించింది. చిత్తశుద్ధి వుంటే సాధ్యమని ఆ రోజుల్లో ఆ పార్టీలు సంజాయిషీ ఇచ్చాయి. అధికారం పీఠం ఎక్కిన తరువాత కానీ ఈ హామీల అమలు యెంత దుస్సాధ్యం అన్నది ఎరుక కాలేదు. ఎన్నో మల్లగుల్లాలు పడితే కానీ ఈ ఒక్క హామీ అమలు ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికే పదిహేను మాసాలు గడిచిపోయాయి. రుణ మాఫీ చేయగలిగారా అంటే గట్టిగా జవాబు చెప్పలేని పరిస్తితి. ఒకవేళ చేశామని చెప్పుకున్నా ఎన్నో మినహాయింపులు, మరెన్నో కత్తిరింపులు. చివరికి షరతులు లేకుండా ఇచ్చిన హామీని షరతులతో నెరవేర్చుకోవాల్సిన దుస్తితి.
వాస్తవ పరిస్తితులు ఇలా వున్న  నేపధ్యంలో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీల వాగ్దానాలకు అడ్డుకట్ట లేకుండా చేస్తోంది. ఎన్ని మాటలు చెప్పయినా సరే అధికారంలోకి రావాలనే రాజకీయ పక్షాలకు ఈ తీర్పు మంచి ఊరట ఇచ్చేదిగా వుంది. ఎందుకంటె -
“సుమతీ శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు” ఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపులేదు. అందుకే వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు. వోటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుక, మండు  వేసవిలోనైనా సరే వారి చేత చల్లని హామీల వర్షం కురిపిస్తుంది. కలర్ టీవీలు, లాప్ టాపులు, నెలసరి భత్యాలు, నగదు బదిలీలు, భూసంతర్పణలు, పట్టు చీరెలు, పసుపు కుంకాలు, ఉచిత వైద్యాలు, ఆల్  ఫ్రీ చదువులు, బంగారు తల్లులు, కరెంటు మీది, బిల్లు మాది తరహా హామీలు – ఒకటా రెండా సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న సంక్షేమ పధకాలతో దట్టించి వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపించే ఎన్నికల ప్రణాళికలు, అంతులేని వాగ్దానాలు. ప్రభుత్వ ఖర్చుతో, ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ఖజానా డబ్బులతో ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్ ప్రోఖో’ ఎత్తులకు చెక్ చెప్పడం ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు.
వాగ్దానకర్ణుల మాదిరిగా ఎడాపెడా ప్రకటిస్తున్న తాయిలాలను ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నదానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదు, ఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు. ఎన్నికల కోయిల ఇంకా సరిగ్గా కూయకముందే వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలు చూస్తుంటే అసలు మేనిఫెస్టోలో ఇంకెన్ని ఉంటాయో అన్నది జవాబులేని  భేతాళ ప్రశ్నగానే మిగిలిపోతోంది.

(కార్టూనిష్టుకు ప్రత్యేక కృతజ్ఞతలు)
      
ఉపశృతి: ఒక రాజకీయ నాయకుడు చనిపోయిన తరువాత యమ భటులు వచ్చి పట్టుకు పోయారు. తాను ప్రముఖుల జాబితాలో వున్న  వ్యక్తిని కాబట్టి తనను స్వర్గంలోకి అనుమతించాలని పట్టుబడతాడు. అయితే తమ నిబంధనల ప్రకారం ముందు ఒక రోజు నరకంలో గడపాలని, తరువాత ఏది కోరుకుంటే అక్కడికే పంపుతామని అక్కడి దేవదూత చెబుతాడు. సరే అని, ఒక యమభటుడ్ని  వెంట బెట్టుకుని ముందు నరకానికే వెడతాడానాయకుడు. నరకాన్ని చూసి అతడికి మూర్చ వచ్చినంత పనవుతుంది. నిజానికి అది తాను  ఊహించుకున్న స్వర్గం కన్నా మిన్నగా వుంది. సుందరమైన భవంతులు, పచ్చని మైదానాలు. అప్సరసలను తలదన్నే సుందరీమణులు అక్కడి నరకలోకవాసులకు తలలో నాలుకలా మెసలుతూ సకల పరిచర్యలూ చేస్తున్నారు. అవన్నీ  చూసిన మన రాజకీయ నాయకుడికి నరకంలోనే వుండిపోవాలన్న కోరిక కలుగుతుంది. తిరిగి వెళ్ళిన తరువాత తన మనసులోని మాట దేవదూతతో చెబుతాడు. అతడి అభీష్టం ప్రకారం మళ్ళీ అతగాడిని నరకానికే తీసుకువెడతారు. అయితే ఇరవై నాలుగ్గంటల్లో దృశ్యం  మొత్తం మారిపోతుంది. కళ్ళు చెదిరే భవంతుల స్థానంలో పూరిళ్ళు. పచ్చిక మైదానాలు, సెలయేళ్ల స్థానంలో ఎండిన పొలాలు. నీటి చుక్క జాడలేని వాగులువంకలు. అప్సరల స్థానంలో వికృత రూపాలతో, ఒళ్ళు జలదరించే చేష్టలతో రాక్షస స్త్రీలు. అది చూసి, ‘అన్యాయం, నిన్న నాకు చూపించిన నరకం ఇది కాదంటూ’ వాదనకు దిగిన నాయకుడితో దేవదూత అంటాడిలా.  ‘నిజమే! నిన్న చూసింది ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాటల్లాంటి దృశ్యాలు. ఇప్పుడు చూస్తున్నది గెలిచి వచ్చిన తరువాత పరిస్తితి. రాజకీయ నాయకులకు మరింత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను’  (03-10-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
      




30, సెప్టెంబర్ 2015, బుధవారం

ఫలప్రదమైన ప్రధాని మోడీ అమెరికా పర్యటన

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 01-10-2015, THURSDAY)

ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయిల్లోని ప్రముఖులు జరిపే విదేశీ పర్యటనలు ఫలప్రదం కాకపోవడం అంటూ వుండదు. అయితే గతంతో పోల్చి చూసుకున్నప్పుడు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జరిపిన అమెరికా పర్యటన అనేక విధాలుగా ప్రత్యేకతలను, విశిష్టితలను కలిగివుందని గట్టిగా చెప్పవచ్చు. మోడీ పర్యటనకు మీడియాలో వచ్చిన ప్రచార ఉధృతి ఇందుకు నిదర్శనం. ఇది చివరకు ఏ స్థాయికి పోయిందంటే అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహించిన ఒక అపూర్వ ప్రయోగం కూడా మోడీ పర్యటన ప్రచార ప్రభంజనంలో మరుగున పడిపోయింది. ‘భవిష్యత్ మొత్తం మా దేశానిదే. భారత దేశానికి రండి, మా దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి’  అని అమెరికాలో భారత ప్రధానమంత్రి అక్కడి పారిశ్రామిక వేత్తలను అర్ధిస్తున్న సమయంలోనే, ఇక్కడ స్వదేశంలో అదే అమెరికాకు చెందిన కొన్ని ఉపగ్రహాలను, మన రోదసీ శాస్త్రవేత్తలు, పూర్తిగా  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఉపగ్రహ వాహక నౌకలో నిర్దేశిత కక్ష్యకు జయప్రదంగా చేర్చి, ప్రపంచంలో ఈ పాటవం కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత దేశాన్ని చేర్చి మన దేశానికి అఖండ ఖ్యాతిని కట్టబెట్టారు.


ఒకప్పుడు మోడీని తమ దేశంలోకి అడుగు పెట్టనివ్వమని భీష్మించిన  అమెరికా ప్రభుత్వం  అదే మోడీ మహాశయులను సాదరంగానే కాదు సగౌరవంగా యెర్ర తివాచీ పరిచి స్వాగతం పలికింది. పైగా ఇది మొదటిసారి కూడా కాదు. ప్రధాని కాగానే మోడీ మొదటి సారి వెళ్ళినప్పుడు కూడా ఆ అగ్రదేశం ఇదే రీతిలో వ్యవహరించింది. ఆ దేశపు ఆర్ధిక రంగం అభ్యున్నతిలో భారత దేశం నుంచి వెళ్ళిన యువ మేధావుల, సాంకేతిక నిపుణుల పాత్ర ఏమిటో పూర్తిగా అర్ధం చేసుకున్న పాలకులు కాబట్టి భారత ప్రధానికి ఆ గౌరవం ఇవ్వక తప్పని పరిస్తితి. ఏడాది కాలంలోనే మోడీ ఆ అగ్రరాజ్యం అధినేత ఒబామాతో మూడు పర్యాయాలు భేటీ కావడం ఈ వాస్తవానికి అద్దం పడుతోంది.
విదేశీ పర్యటనలలో వేషభాషలకు మోడీ ఇస్తున్న ప్రాధాన్యం ఇటు స్వదేశంలో విమర్శలకు దారి తీయడంతో ఈసారి అమెరికా పర్యటనలో రూటు  మార్చి ‘తన చాయ్ వాలా గతాన్ని’ అక్కడి జనాలకు గుర్తుచేసే ప్రయత్నం గట్టిగానే చేసినట్టు కానవస్తోంది. ఎక్కడ ఏ పదాన్ని విరిచి చెప్పాలో, ఎక్కడ ఏ భావాన్ని అందరికీ అర్ధం అయ్యేలా పలికించాలో, స్వరాన్ని ఎక్కడ పెంచాలో, గొంతును ఎక్కడ తగ్గించాలో పూర్తిగా ఆపోసన పట్టిన రాజకీయ వేత్త కావడం వల్ల, అమెరికాలో మోడీ చేసిన ప్రసంగాలకు అపూర్వ ప్రతిస్పందన అమోఘంగా లభించింది. అయితే, సభికుల నుంచి హర్ష ధ్వానాల రూపంలో లభిస్తున్న ఆదరణ మైకంలో పడిన మోడీ, కొన్ని దేశ ప్రతిష్టకు పొసగని కొన్ని అంశాలను తన ప్రసంగాలలో ప్రస్తావించి, స్వదేశంలో కొన్ని రాజకీయ విమర్శలను మూటగట్టుకున్నారు. గత విదేశీ పర్యటనలలో సయితం ఇదే రకం  విమర్శలను మోడీ ఎదుర్కున్నారు. విదేశీ సభలు, సమావేశాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రసంగాలు చేయడం అన్నది భారత ప్రధానులకు నియమం కాకపోయినా ఒక ఆనవాయితీ. స్వదేశంలో రాజకీయాలు ఎలా వున్నా, అక్కడ  ఎటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నప్పటికీ, విదేశీ గడ్డపై ఒకింత సంయమనం పాటించడం అనేది  ఆ ఆనవాయితీ. మోడీ ఈ రివాజును కావాలనే ఉల్లంఘించి గత ప్రభుత్వాల వైఫల్యాలను విదేశీ ప్రసంగాలలో జొప్పిస్తున్నారన్నది ఆయన రాజకీయ ప్రత్యర్దుల అభియోగం. నిజానికి ఇలా ప్రసంగాలు చేయడం మంచి సంప్రదాయం కాదు.  విదేశాలకు అధికార పర్యటనపై వెళ్ళినప్పుడు భారత ప్రధాని అనే వ్యక్తి యావత్ దేశానికీ ప్రాతినిధ్యం వహిస్తారు. అంతేకాని,  ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడిగా కాదు. ఆయన చేసే ప్రతి ప్రసంగం భారత ప్రతినిధిగానే సాగడం మర్యాదగా వుంటుంది. అందుకే కాబోలు ఆ స్థాయి నాయకులు, ముందుగా తయారు చేసి సిద్ధంగా వుంచుకున్న ప్రసంగపాఠం చదవడం ఓ సాంప్రదాయంగా వస్తోంది.   అయితే ప్రసంగాలలో ఘనాపాటి అనిపించుకుంటున్న నరేంద్ర మోడీకి పాఠం ఒప్పచెప్పినట్టు, ఇలా రాసుకున్న ప్రతిని చదవడం రుచించక పోవచ్చు. అలా అని గత పాలకులను, వారి పరిపాలనను కించ పరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదనే చెప్పాలి. సరే! ఇదేమంత పెద్ద విషయం కాదు. సరిచేసుకోదగ్గ సంగతే.
పొతే, నరేంద్ర మోడీ ఈ సారి జరిపిన అమెరికా పర్యటన కాలాన్ని సాధ్యమైనంత సద్వినియోగం చేసుకోవడానికే ప్రయత్నించారు. భద్రతా మండలిలో భారత సభ్యత్వం అంశాన్ని సభ్యదేశాలకు మరోమారు గట్టిగా నొక్కి  చెప్పారు. అమెరికాకు చెందిన కార్పోరేట్ దిగ్గజాలతో, గూగుల్, మైక్రో సాఫ్ట్, ఫేస్ బుక్, ఆపిల్  మొదలయిన సిలికాన్ వ్యాలీ  అధినేతలతో సమావేశాలు జరిపారు. గత ముప్పయి ఏళ్లలో  అనేకమంది భారత ప్రధానులు అమెరికాలో అధికార పర్యటనలు జరిపారు. కానీ, సిలికాన్ వ్యాలీ సందర్శించి, భారత్ లో జరుగుతున్న డిజిటల్ విప్లవం గురించి అక్కడివారికి తెలియచేయడానికి ప్రయత్నించిన మొదటి ప్రధాని మోడీనే కావడం విశేషం. అంతే కాదు ‘ఫార్ట్యూన్ – 500’ జాబితాలో వున్న నలభయ్ రెండు కంపెనీల సీ.ఈ.ఓ. ల సమావేశంలో మోడీ ప్రసంగించారు. ‘భారత దేశం అంటే రెడ్ టేపిజం కాదనీ, రెడ్ కార్పెట్’ అనీ తనదయిన శైలిలో మోడీ చేసిన చమత్కార ప్రసంగం ఆహూతులను ఆకట్టుకుందని మీడియా అభివర్ణించింది. ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఆ సంస్థ అధినేత జుకర్ బర్గ్ తో ప్రధానమంత్రి మోడీ జరిపిన సమావేశం ప్రపంచవ్యాప్త ప్రచారానికి నోచుకుంది. సాంకేతిక విద్యార్హతలు ఏవీ లేకపోయినా, నూతన సాంకేతిక అంశాల పట్ల ఆ వయస్సులో నరేంద్ర మోడీ  కనబరుస్తున్న ఆసక్తి బహుశా వారిని బాగా ఆకట్టుకుని వుంటుంది.
భారత ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోడీ గత కొద్ది కాలంలోనే రికార్డు స్థాయిలో విదేశీ పర్యటనలు చేసారు. ఆయన చేసిన పర్యటనల ఫలితాలకంటే, ఆ పర్యటనల తీరు తెన్నులపై మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వెలువడిన వ్యాఖ్యలు, కార్టూన్లు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవనే అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. గతంలో  మోడీ విదేశ పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగి వస్తున్నప్పుడు, ‘ప్రధాని మోడీ స్వల్ప కాలిక పర్యటనపై రేపు భారతదేశం వస్తున్నారని’ సోషల్ మీడియాలో  ఒక వ్యాఖ్య వచ్చింది. ఇటువంటివి ప్రచారంలో వుండడం  ఆ ఆస్థాయిలో వున్న  వ్యక్తులకు శోభస్కరం కాదు.
ఏది ఏమైనా అమెరికాలో నివసిస్తున్న అశేష భారతీయులు, వారి వారి రాష్ట్రాలతో, భాషలతో, రాజకీయాలతో నిమిత్తం లేకుండా మోడీ అమెరికాలో జరిపిన పర్యటనని చక్కగా  స్వాగతించారు. అయన చేసిన ప్రతి ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. ఈ విధంగా మోడీ అక్కడి భారతీయుల మనస్సులను ఆకట్టుకోగలిగారు. ఈ కోణం నుంచి మోడీ పర్యటన అనుకున్న దానికన్నా విజయవంతం అయిందనే చెప్పుకోవాలి. (30-09-2015)

రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com మొబైల్: 98491 30595 
NOTE: Courtesy Image Owner                                                  

29, సెప్టెంబర్ 2015, మంగళవారం

సాయంత్రం ఖాళీయేనా?


ఎర్రబడ్డ మొహంతో బాస్ గదిలోనుంచి బయటకు వచ్చింది.
“బుద్ధిలేని మనిషి, ఆడవాళ్ళతో ఇలాగానేనా మాట్లాడేది”
“లోపల ఏం జరిగిందేవిటి?”
“ఈ సాయంత్రం ఖాళీగా వుంటావా? వేరే ఏదన్నా పని ఉందా?’ అని అడిగాడు”
“నువ్వేమన్నావు”
“ఖాళీ గానే వుంటాను అని చెప్పాను”
“అతనేమన్నాడు?”
“ఏవన్నాడు? ఇవిగో ఈ కాగితాలన్నీ చేతికి ఇచ్చి టైప్ చేయమన్నాడు”


NOTE: Courtesy Image Owner

నోటికి తాళం


పెదవి దాటిన  మాట పృధివి దాటుతుందంటారు.
అందుకే ఏదయినా ఒక మాట అనేముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని పెద్దలంటారు.
దీనికి ఉదాహరణగా ఇంగ్లీష్ లో ఓ  కధ నెట్  సంచారం చేస్తోంది.
అదేమిటంటే-
అనగనగా ఒక పెద్దమనిషి. వూళ్ళో నలుగురి గురించీ నాలుగు రకాలుగా వ్యాఖ్యానాలు చేయడం ఆయనకో అలవాటు. నిజమో కాదో నిర్ధారణ చేసుకోకుండా అందరి మీదా నీలాపనిందలు మోపడం ఆయనకో  హాబీ. అందులో భాగంగా, ‘పక్కింటి కుర్రాడు దొంగ’ అంటూ తేలిగ్గా అతడిపై  ఓ నెపం మోపాడు. అంతటితో ఆగకుండా వైనవైనాలుగా ప్రచారాలు చేసి ‘ఆ కుర్రవాడు నిజంగానే నిజం దొంగ’ అని నలుగురు నమ్మేలా చేసాడు. పోలీసులు కూడా అది నిజమని నమ్మి ఆ కుర్రాడిని పట్టుకుని జైల్లో వేసారు. శిక్ష అనుభవించి తిరిగొచ్చిన తరువాత ఆ కుర్రాడు సదరు పెద్దమనిషిపై పరువునష్టం దావా వేసి కోర్టుకు లాగాడు.
పోతే, న్యాయమూర్తి ముందు ఆ పెద్దమనిషి మాట మార్చాడు. తానేదో ఉబుసుపోకకు అన్న మాటలే కాని ఆ కుర్రాడు దొంగ కాదన్నాడు. అతడిని బాధ పెట్టే  ఉద్దేశ్యం లేదన్నాడు.
జడ్జి అంతా విని, అతగాడికి ఓ కాగితం ఇచ్చి ఆ కుర్రాడిని గురించి లోగడ అన్న మాటలన్నీ దానిమీద రాయమన్నాడు. ఆ కాగితాన్ని ముక్కలుగా చించి ఇంటికి వెళ్ళే దారిలో విసిరేసి మర్నాడు కోర్టుకు రమ్మన్నాడు.
ఆ పెద్దమనిషి న్యాయమూర్తి చెప్పినట్టే చేసి మరునాడు కోర్టులో జడ్జి ముందు బోనులో నిలబడ్డాడు.
న్యాయమూర్తి తీర్పుచెప్పబోయేముందు,  విసిరేసిన కాగితం ముక్కలు తనకు చూపించమన్నాడు.  ‘ఇంకా అవెక్కడున్నాయి. ఎప్పుడో గాలికి  కొట్టుకుపోయాయి’ అని పెద్దమనిషి జవాబు చెప్పాడు.
అప్పుడు న్యాయమూర్తి ఇలా అన్నాడు.
వేళాకోళంగా అనే మాటలు కూడా చింపిపారేసిన కాగితం ముక్కలు లాంటివే.  గాలికి కొట్టుకుపోయిన వాటిని తిరిగి తేలేనట్టే చెడుపు చేసే మాటల్ని  కూడా. అవి అవతలి వ్యక్తికి  చేసే అపకారాన్ని గురించి కాసేపు ముందే ఆలోచిస్తే అలాటి మాటలు అనడానికి కాస్త సంకోచిస్తాము. ఏదో మాటే కదా! అన్నంతమాత్రానికే   ఏమవుతుంది అనుకుంటే ఒక్కోసారి ఇలాగే అవుతుంది. ఎదుటివాడిని గురించి మంచి చెప్పలేనిపరిస్తితే వుంటే అప్పుడు కనీసం  అసలేమీ చెప్పకపోవడం మంచిది.
మన నాలికకి మనమే యజమానులం. మనం చెప్పినట్టే అది మాట్లాడాలి. అది మాట్లాడినట్టల్లా మనం తలాడించకూడదు. ఆడిస్తే ఇలాగే తల దించుకోవాల్సిన పరిస్తితి ఎదురవుతుంది.
ముగించాడు న్యాయమూర్తి మందలింపుగా.

నీతి: నోటికి ఇలా  తాళం వేసుకోలేకపోయినా నాలుకను సంభాలించుకోవడం ఉత్తమం.
NOTE: Courtesy Image Owner 


26, సెప్టెంబర్ 2015, శనివారం

ఉద్యమ దీక్షలు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 27-09-2015, SUNDAY)

ఆమరణమా, నిరవధికమా అన్న విషయం పక్కన పెడితే ఆంద్ర ప్రదేశ్ నూతన రాష్ట్రానికి ప్రత్యెక హోదా సాధనకోసం వై.ఎస్.ఆర్.సి.పీ . అధ్యక్షుడు జగన్ మోహన రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్ష ప్రస్తుతం మీడియాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, కోర్టు నుంచి సానుకూల ఆదేశాలు తెచ్చుకోవడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడం, ఇక చేసేది లేక దీక్ష తేదీలను మార్చుకోవాల్సిరావడం ఇవన్నీ రాజకీయంగా ఆ పార్టీకి కొన్ని తలనొప్పులు తెచ్చే మాట వాస్తవమే. ‘వై.సీ.పీ. కి ఇదొక పరాజయం’ అంటూ  టీడీపీ శ్రేణులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. టీవీ ఛానళ్లలో కూడా విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఒక దురదృష్టకర పరిణామం ఏమిటంటే, ఏ అంశం తీసుకున్నా అది చివరకు టీడీపీ, వై.ఎస్.ఆర్.సీ.పీ. అనే ఓ రెండు పార్టీల నడుమ వ్యవహారంగానే మలుపులు తీసుకోవడం, రంగులు  మారడం జరుగుతోంది.  నిజానికి ఇది ఎంతమాత్రం వాంఛనీయం కాదు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఉద్యమం చేయడాన్ని టీడీపీ రాజకీయ ఎత్తుగడగానే భావిస్తోంది. చేస్తున్న ఆందోళన ఫలితం టీడీపీకి రాజకీయంగా నష్టం కలిగించే విధంగా వుండాలని వైఎస్ ఆర్ సీపీ భావిస్తున్నట్టు వుంది. ప్రత్యెక హోదా అనేది యావత్ ఆంద్ర ప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడేది అన్న భావం కనుమరుగయి, ఈ రెండు  పార్టీల మధ్య వాతావరణం యుద్ధాన్ని  తలపించేదిగా తయారవుతోంది. ‘అనుమతి లేకపోయినా దీక్ష జరిపి తీరుతాం’ అంటూ వై.ఎస్.ఆర్.సీ.పీ. నాయకులు మొదట చేసిన ఆర్భాటపు  ప్రకటనలు, ‘చావడానికి ఎవరయినా అనుమతి ఇస్తారా?’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఈ పరిస్తితికి అద్దం పడుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి తలపెట్టింది ఆమరణ దీక్ష అనీ, అందుకే పోలీసులు అనుమతి ఇవ్వకపోయి వుండొచ్చని టీడీపీ వాదనగా వుంటే, అది నిరవధిక దీక్ష అని వైసీపీ నాయకులు వివరణ ఇస్తున్నారు. దీక్ష ఉద్దేశ్యం రాష్ట్ర ప్రయోజనాలకోసం అయినప్పుడు అనుమతి ఇవ్వకుండా అడ్డుపడడం ఎందుకని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. గతంలో ప్రతిపక్షంలో వున్నప్పుడు  చంద్రబాబు నాయుడు చేసిన నిరవధిక దీక్షలను ఎత్తి చూపుతోంది. ముందే చెప్పినట్టు ఆ తెలుగు రాష్ట్రం చేసుకున్న దురదృష్టం ఏమిటో కానీ పాలక పక్షం టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం, ఏకైక ప్రతిపక్షం అయిన వైసీపీ రెండూ ఉప్పూ నిప్పూ తరహా పోరులో నిత్యం మునిగి తేలుతున్నాయి. ‘నిరవధిక నిరాహార దీక్ష చేస్తే ప్రత్యెక హోదా వచ్చే అవకాశం లేద’ని టీడీపీ అంటుంటే, ‘ఎలా వచ్చినా, ఎవరివల్ల వచ్చినా అది రాష్ట్రాన్ని పాలిస్తున్న టీడీపీకి మాత్రమే  కలిసివచ్చే అంశం అయినప్పుడు, ప్రతిపక్షంగా తాము చేస్తున్న ఉద్యమానికి అధికార  పార్టీ అడ్డుతగలడం ఎంతవరకు సబబ’న్నది జగన్ మద్దతుదారులు లేవదీస్తున్న పాయింటు. ఇటువంటి వ్యవహారంలో ఏ పార్టీది బాధ్యతారాహిత్యం అయినా కూడా చివరికి నష్టపోయేది రాష్ట్ర ప్రయోజనాలే అన్న ఎరుక ఆ రెండు పార్టీల్లో కానరావడం లేదు. ‘ఈ ఇరుపక్షాల  పోరు ఏ మలుపు తీసుకుంటుంది, ఎప్పుడు తీసుకుంటుంది?’ అన్నది ఇక కాలమే తేల్చాలి.
పొతే ఈ నిరాహార దీక్షల కధాకమామిషూ ఓసారి పరిశీలిద్దాం.
ఒక రకంగా రామాయణ కాలంలోనే ఈ నిరాహార దీక్షలకు తొలి బీజం పడింది. పితృవాక్యపరిపాలన కోసం రాముడు రాజ్యాన్ని విడిచి అడవి బాట పట్టినప్పుడు, రాముని తమ్ముడు భరతుడు, అన్నగారు వున్న అరణ్యానికి వెళ్లి ఆయన్ని కలుసుకుని  తిరిగి రాజ్యాధికారం స్వీకరించమని పరిపరి విధాల వేడుకుంటాడు. అతడి అభ్యర్ధనని  రాముడు నిరాకరించడంతో నిరాశకు గురయిన భరతుడు,  అక్కడికక్కడే దర్భలు పేర్చుకుని ఆమరణ నిరాహార దీక్షకు సంసిద్ధుడౌతాడు. చివరకు రాముడే నచ్చచెప్పడంతో భరతుడు దీక్ష విరమించి రాముని పాదుకలు తీసుకుని మరలిపోతాడు. ఇదొక ఐతిహ్యం.
పొతే, నిరాహార దీక్షకు పూనుకుని ప్రాణాలు ఒదిలిన సంఘటనలు చరిత్రలో రెండే రెండు నమోదయ్యాయి.  ఆంద్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు, 1952 లో మద్రాసులోని మహర్షి బులుసు సాంబమూర్తి నివాసంలో   ప్రా యోపవేశానికి పూనుకుని యాభయ్ ఎనిమిది రోజుల తరువాత కన్ను మూసి అమరజీవి అయిన  ఉదంతం వీటిల్లో ఒకటి కాగా, స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలకులతో పోరాడిన విప్లవ వీరుడు జతిన్ దాస్, నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు ఒదిలిన సంఘటన మొట్ట మొదటిది. 1929 లో   లాహోర్ జైల్లో నిర్బంధించబడిన రోజుల్లో,  భారత స్వతంత్ర యోధులకు కూడా యూరోపు రాజకీయ ఖయిదీలకు ఇచ్చే సదుపాయాలు కలుగచేయాలని కోరుతూ ఆమరణ దీక్ష మొదలు పెట్టి, 63 రోజుల తరువాత జతిన్ దాస్  కన్నుమూసిన సంగతి చరిత్ర పుటల్లో వుంది. ఇక నిరాహార దీక్షల విషయంలో  మహాత్మా గాంధీ రికార్డు ఎన్నతగింది. మరో గొప్ప రికార్డు, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు  మాస్టర్ తారాసింగ్ ఖాతాలో వుంది. పంజాబీ సుబా సాధన కోసం  1961 లో ఆయన 48 రోజులు నిరాహార దీక్ష జరిపారు. ఆయన అడుగు జాడల్లోనే సంత్ ఫతే సింగ్, పంజాబీ మాట్లాడేవారికి ప్రత్యెక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ అనేక పర్యాయాలు నిరాహారదీక్షలు జరిపారు. 1965 ఆగస్టు 16 న దీక్ష మొదలు పెడతాననీ, సెప్టెంబర్ ఇరవై అయిదు ఉదయం తొమ్మిది గంటలలోగా ప్రత్యెక రాష్ట్రం ఏర్పాటు  గురించిన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని గడువు విధించి మరీ  దీక్ష ప్రారంభించాడు. అయితే, భారత పాక్  సరిహద్దుల్లో చెలరేగిన సైనిక సంఘర్షణల నేపధ్యంలో సంత్ ఫతేసింగ్ తన దీక్షా యోచన విరమించుకున్నారు. భారత ప్రధానమంత్రిగా పనిచేసిన కురు వృద్ధుడు మొరార్జీ దేశాయ్ కూడా డెబ్బయ్యవ దశకంలో రెండు పర్యాయాలు నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. గతంలో టీడీపీ అధినాయకుడు, కీర్తిశేషులు ఎన్టీ రామారావు కూడా టాంక్ బండ్ పై దీక్షకు కూర్చున్నారు. తెలంగాణా సాధన కోసం టీ.ఆర్.ఎస్. అధినేత కే.చంద్రశేఖర రావు జరిపిన నిరాహార దీక్ష కూడా బహుళ ప్రాచుర్యం పొందింది. 1969 తెలంగాణా ఉద్యమానికి తొలి బీజం, ఖమ్మం పట్టణంలోని  గాంధీ చౌక్ లో రవీంద్రనాథ్ అనే విద్యార్ధి  చేసిన నిరాహారదీక్షలో పడింది.    
పొతే విశాఖ ఉక్కు కర్మాగారం కోసం అమృతరావు అనే పెద్ద మనిషి అనేక పర్యాయాలు మొదలు పెట్టి విరమించిన నిరాహార దీక్షలు, ప్రజలకు వాటిపట్ల చులకన భావం కలిగేలా చేసాయి.
ఇలా చరిత్రలో ఎన్నో సంఘటనలు. కొన్ని నిరాహార దీక్షలు ఫలితాలు ఇచ్చాయి. మరికొన్ని ప్రచారార్భాటాలుగా మిగిలిపోయాయి. (26-09-2015)

రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com మొబైల్: 98491 30595                            

25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

నిఖార్సయిన పోలీసు అధికారి


(ఈరోజు అనుకోకుండా  మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్, తమిళనాడు  మాజీ గవర్నర్  శ్రీ పీ ఎస్ రామమోహన రావు గారిని కలుసుకోవడం జరిగింది. బహుశా దశాబ్దానికి పై చిలుకు మాటే వారిని కలిసి. ఎంతో ఆప్యాయంగా పలకరించి పాత సంగతులు గుర్తు చేసుకున్నారు. తన పక్కన వున్న  పెద్దమనిషికి  నన్ను పరిచయం చేస్తూ, ‘ఇతడు శ్రీనివాసరావు, హెల్మెట్  ఫేం ‘ అన్నారు సరదాగా. ఇంటికి వచ్చిన తరువాత రామ్మోహన రావు గారి గురించి  మదిలో మెదిలిన పాత  జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు) 



అసలు సిసలు పోలీసు అధికారి పీ ఎస్ రామమోహన రావు గారితో కొన్ని మరచిపోలేని అనుభవాలు వున్నాయి. నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఆయన డీజీపీ. అప్పటికే కొందరం జర్నలిస్టులం మొదలు పెట్టిన యాంటీ హెల్మెట్ ఉద్యమంతో సీనియర్ పోలీసు అధికారులు మా పట్ల మనస్తాపంతో వున్నారు. నన్ను అరెస్టు చేయడం, ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా దర్యాప్తు కోసం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటుచేయడం, ఆ వెంటనే నా మాస్కో ప్రయాణం - మా నడుమ సత్సంబంధాలలో పైకి కనబడని తేడా తీసుకువచ్చాయి. మాస్కో వెళ్ళబోయేముందు డీజీపీ రామమోహన రావు గారిని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసాను. చాలా ఆప్యాయంగా పలకరించి క్షేమ సంచారాలు కనుక్కుని వీడ్కోలు చెబుతూ ఒక మాట అన్నారు. ‘మాస్కోలో పోలీసులతో జాగ్రత్త. మన దగ్గరలా హెల్మెట్ల విషయంలోలా ఠలాయిస్తే కుదరదు.’
వయసు అలాటిది మరి. నేనూ అలానే జవాబు చెప్పాను. ‘మాస్కో చాలా చలి ప్రదేశం అని విన్నాను. మంచు కురిసే రోడ్లపై ‘టూ వీలర్స్ ఎలౌ చేయరనుకుంటాను’
రామమోహన రావుగారు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్నప్పుడు ఖమ్మం బస్ స్టాండులో ఒక ఉద్యోగితో సీటు రిజర్వేషన్ విషయంలో పేచీ వచ్చింది. హైదరాబాదు రాగానే ఘాటుగా ఓ పిర్యాదు రాసి పంపించాను. మూడు రోజుల తరువాత అనుకుంటాను అదే ఉద్యోగి మా మేనల్లుడిని వెంటబెట్టుకుని హైదరాబాదు వచ్చాడు.
ఏదో తెలియక చేసాడు, ఇప్పుడు ఎమ్డీ గారు నీ పిర్యాదు మీద చాలా దూరం ట్రాన్సఫర్ చేశారు, నాకు బాగా తెలిసిన వాళ్లు. నువ్వే మళ్ళీ ఏదో సర్ది చెప్పి బదిలీ క్యాన్సిల్ చేయించు’ ఇదీ మా వాడి రాయబారం.
సరేనని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసి విషయం చెప్పాను. అప్పుడాయన ఇలా అన్నారు.
మీరు కంప్లయింటు ఇచ్చారు. మీ మీద గౌరవం కొద్దీ విచారణ కూడా జరపకుండా బదిలీ చేసాను. అదీ నేను చేసిన పొరబాటు. ఇప్పడు మీ మాట విని మరో పొరబాటు చేయడం ఇష్టం లేదు. బదిలీ క్యాన్సిల్ చేయడం చిటికెలో పని. కాని సంస్థలో డిసిప్లిన్ మాటేమిటి. ఎమ్డీ ట్రాన్స్ఫర్ చేస్తే నాకొక లెక్కా! ఒక్క రోజులో మళ్ళీ క్యాన్సిల్ చేయించుకున్నానని అందరితో చెప్పుకుంటాడు. క్రమశిక్షణ దెబ్బతింటుంది. ముందు పోయి వేసిన చోట జాయిన్ కమ్మని చెప్పండి. ఓ ఆరు నెలల తరువాత మళ్ళీ వెనక్కు వేస్తాను’
దట్ ఈజ్ రామ్మోహనరావు గారు!

23, సెప్టెంబర్ 2015, బుధవారం

నదుల అనుసంధానం – మంచీ చెడూ

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 24-09-2015, THURSDAY)

నదుల అనుసంధానం అనే పదం దేశంలో ఇప్పుడు త్వరితగతిన ప్రాచుర్యం పొందుతోంది. అటు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇటు ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం నదుల అనుసంధాన కార్యక్రమాలకు ఇస్తూవస్తున్న ప్రాధాన్యత కూడా ఇందుకు దోహదం చేస్తుండవచ్చు.

ఈ అనుసంధాన ప్రక్రియకు ఈ నెలలోనే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అంకురార్పణ జరిగింది. గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు ఉద్దేశించిన పట్టి సీమ ప్రాజెక్టును అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద పూర్తి చేసి, గోదావరి నీళ్ళను కృష్ణలో కలిపి రికార్డు వ్యవధిలో ఆ పని పూర్తి చేశానని సగర్వంగా ప్రకటించింది. అనేకానేక బాలారిష్టాలను దాటుకుంటూ పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసినట్టు ప్రభుత్వం అయితే ఆర్భాటంగా చెప్పుకుంటోంది కాని ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి వున్నాయి. ఎవరి అనుమానాలు  వారికి వున్నాయి. ఉండడమే కాదు వాటిని బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు కూడా. చెప్పిన గడువులోగా పని పూర్తిచేసిన ఘనతను తన ఖాతాలోకి వేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం కొంత అనవసర ప్రయాస పడ్డదేమో అనికూడా అనిపిస్తోంది. తొందరగా పనిపూర్తిచేసి సకాలంలో పొలాలకు నీళ్ళు అందించే ప్రయత్నం హర్షించతగ్గదే, ములుకోల చేత  పట్టి అధికారగణాన్నీ, కాంట్రాక్టర్లను అదిలించకపోతే పనులు ముందుకు సాగని మాట వాస్తవమే. అయితే ఇటువంటి భారీ ఇంజినీరింగు వ్యవహారాల్లో కొన్ని సాంకేతికపరమైన వ్యవధానాలతో పనులు చక్కబెట్టుకోవాల్సిన అవసరం వుంటుంది. రాత్రికి రాత్రే కాలువలు తవ్వించడం వీలయినట్టు, గడువులు నిర్దేశించి ఆక్విడక్టు నిర్మాణాలు చేయడం  సాధ్యం కాకపోవచ్చు. అలా వీలు కాదని, నీళ్ళు ఒదిలిన వెంటనే  కూలిపోయిన ఆక్విడక్టు కధే చెబుతోంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనే చర్చ కన్నా, ఇటువంటివి జరగకుండా చేయడంలో బాధ్యత వహించి పనిచేయడం అనేది బాధ్యత కలిగిన ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం. కాకపొతే భారీ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో కొన్ని ఇటువంటి అవాంతర పరిస్తితులు తలెత్తడం సహజం కూడా. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోవాలి. మంత్రులు, అధికారుల మీదా, అధికారులు కాంట్రాక్టర్ల మీదా నెపాలు మోపుకుంటూ సమస్యను సాగదీయడం తగని పని. ఇక ప్రతిపక్షాలు యాగీ చేయకుండా వూరుకోవడం ఇలాటి సందర్భాల్లో అసాధ్యం. వాటికి ఆ నైతిక హక్కు లేదనడం ఒకప్పుడు ప్రతిపక్షంలో వున్నప్పుడు ఇటువంటి ఆరోపణలే చేసిన పాలక పక్షానికి తగదు. సరే! ఇప్పుడు కొత్తగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న  రాజకీయాల తీరుతెన్నులే ఆవిధంగా వున్నప్పుడు చెబితే వినేవారు ఉంటారని అనుకోవడం అత్యాశే అవుతుంది.
పొతే, అసలు నదుల అనుసంధానం అనే ప్రక్రియ మీదనే జాతీయ స్థాయిలో పుంఖానుపుంఖాలుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ఆహా ఓహో అని ప్రశంసిస్తూ వుంటే మరికొందరు దండగమారి వ్యవహారం అని ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరు పర్యావరణ ప్రేమికులు ఏకంగా నదుల అనుసంధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఒక వాదం మంచిదనీ, మరో వాదం చెడ్డదనీ చెప్పలేని పరిస్తితి. ప్రతి విషయంలో మంచీ చెడూ రెండూ ఉన్నట్టే ఇదీ అందుకు మినహాయింపు కాకపోవచ్చు. కాకపోతే ఈ మంచి చెడుల నడుమ పైకి కనబడని ఓ సన్నని విభజన రేఖ వుంటుంది. దాన్ని పట్టుకోగలిగితే మంచిని పెంచుకుంటూ, చెడు తీవ్రతని తగ్గించుకుంటూ మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చు.
నదులనేవిఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో పారి మరెక్కడో సుదూరాన కడలిలో  కలుస్తుంటాయి. అవి ప్రవహించే దారిలో తమ దాపున వున్న పల్లపు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ వెడతాయి. ఆ నదీ పరివాహక ప్రాంతంలో వున్న ప్రదేశాలు వాటి ఉనికికి అనుగుణంగా ప్రయోజనం పొందుతాయి. నీరు పల్లమెరుగు అనే సామెతకు తగ్గట్టుగా ఎగువ ప్రాంతాలకన్నా దిగువన వుండే ప్రాంతాలకు లబ్ది ఎక్కువ చేకూరుతుంది. ఇది ఆయా ప్రాంతాలకు ప్రక్రుతి ప్రసాదించే వరం, శాపం కూడా. అయితే తద్విరుద్ధంగా భారీ మోటార్లు వాడి పంపుల ద్వారా ఎగువ ప్రాంతాలకు కూడా నీరును తోడిపోసే సాంకేతిక ప్రక్రియలు ఉపయోగించి పట్టిసీమ వంటి ప్రయోగాలు జరుగుతున్నాయి.  
దేశంలో వున్న వేలాది నదుల్లో కొన్ని మాత్రమె జీవనదులు. చాలావరకు వర్షాధారంగా పారే నదులు. అందువల్ల వీటిని అనుసంధానం చేయడం ద్వారా ఎక్కువ ఫలితాలను సాధించవచ్చనీ, వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని పంటపొలాలకు మళ్ళించవచ్చనీ అనుసంధాన ప్రక్రియ మద్దతుదార్లు అంటున్నారు. అయితే ఇదేమీ కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన అయితే కాదు. ఎన్నో దశాబ్దాల క్రితమే కాటన్ దొర వంటి వారు దీన్ని ప్రయోగాత్మకంగానే కాదు శాశ్విత ప్రాజెక్టులు నిర్మించి మరీ రుజువు చేసారు. ఆయన హయాంలోనే గోదావరి, కృష్ణా జలాల అనుసంధానం జరిగింది. అలాగే,  గంగా కావేరీ అనుసంధానం చేయాలని  ఎన్నో ఏళ్ళ నాడే ప్రముఖ ఇంజినీరు కేఎల్ రావు తలపోసి ప్రణాళికలు కూడా సిద్ధం చేసారు.
అలాటి ఆలోచనలే నేటి పాలకులు చేస్తున్నారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో నదీనదాల అనుసంధానానికి భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటి లెక్కల ప్రకారం వీటిని పూర్తి చేయడానికి అక్షరాలా పదకొండు లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా. అంచనాలే ఈ స్థాయిలో వుంటే ఈ భారీ పధకాలు పూర్తయ్యేనాటికి ఇవి ఏమేరకు పెరుగుతాయన్నది అంత సులభంగా అంచనా వేయలేని వ్యవహారం. ఇక ఈ ప్రాజెక్టు గణాంకాలు చూస్తే కళ్ళు చెదురుతాయి. నీరు సమృద్ధిగా పారే 37 హిమనదాలను నీటి లభ్యత తక్కువగా వుండే దేశంలోని ఇతర నదులతో కలిపి వాటిని కూడా స్వయం సమృద్ధ జలవనరులుగా మార్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందులో భాగంగా నదులను కలుపుతూ, యాభయ్ నుంచి వంద అడుగుల వెడల్పున్న  30 కాలువలను పదిహేను వేల కిలోమీటర్ల పొడవున తవ్వుతారు. చిన్నా పెద్దా అన్నీ కలిపి మూడువేల రిజర్వాయర్లు నిర్మిస్తారు. తద్వారా ఎనిమిది కోట్ల డెబ్బయి లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. దీనికి తోడు,  మొత్తం  34 గిగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి మార్గం వేస్తారు.  నిజంగా కళ్ళు చెదిరే ప్రాజక్టే. సరిగ్గా అమలు చేయకపోతే, అంతకంటే నిజంగా అంతంత ప్రజాధనం నీళ్ళ పాలు చేసే ప్రాజక్టే.
అయితే  ఇదొక పార్శ్వం. ఇది రంగుల కల. నిజం అయితే, నిజం చేయగలిగితే అంతకంటే కావాల్సింది లేదు.
మరో వైపు పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులు దీన్ని పీడకలగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పరిణామాలు భయంకరంగా ఉంటాయని, పూర్తి బాధ్యతా రాహిత్యంతో కూడిన ఆలోచన అనీ కొట్టిపారేస్తున్నారు.
నదులు ప్రవహించే తీరు ప్రకృతికి అనుగుణ్యంగా ఉంటుందనీ, దానికి విఘాతం కల్పించడం వల్ల తాత్కాలిక ప్రయోజనాలు సిద్ధించినప్పటికీ దీర్ఘకాలంలో ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుందనీ వారి వాదన. ఏ నదికి ఆ నది  కొన్ని ప్రత్యేకతలు కలిగి వుంటుంది. పొడవైన కాలువలు తవ్వి వాటిని కలిపే ప్రయత్నంలో నదుల నడుమ వున్న రక్షిత అటవీ ప్రాంతాలు విధ్వంసానికి గురవుతాయి. ప్రకృతికి కొన్ని సహజ లక్షణాలు వుంటాయి. వాటిని విధ్వంసం చేయాలని  చూస్తే విలయకారకమవుతాయి అనేది హెచ్చరికతో కూడిన వారి అభిప్రాయం.
జలవనరులను కాపాడుకోవడానికి నదుల అనుసంధానం ఒక్కటే మార్గం కాదు. వాటర్  షెడ్స్, వర్షాల వల్ల సమకూరే నీటిని భవిష్యత్ అవసరాలకు భద్రపరచుకోవడం, భూగర్భ జలవనరులను పెంచుకోవడం, ఇంకుడు గుంతలు, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు పండించే పద్దతుల్ల్లో మార్పులు చేసుకోవడం ఇలా అనేక ప్రత్యామ్నాయాలు వుంటాయి. వాటినన్నింటినీ పూర్తిగా వాడుకున్న తరువాతనే నదుల అనుసంధానం వంటి భారీ ప్రాజెక్టులను గురించి తలపెట్టాలన్నది వారి మనోగతం.
ప్రభుత్వాలు నడిపేవారికి వారి ఆలోచనలు వారికి వుంటాయి. సమాజ హితంతో పాటు సొంత రాజకీయ ప్రయోజనాలు కూడా చూసుకోకతప్పదు.
పర్యావరణ పరిరక్షకులకి వీటితో నిమిత్తం వుండదు. వారిది ఒకటే కోణం.
మరి మధ్యే మార్గం ఏమీ ఉండదా!
వుండే వుంటుంది.
కాకపొతే,  వెతుక్కునే ఓపిక వుండాలి. వినే  తీరిక వుండాలి. 
(23-09-2015)

రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595