23, సెప్టెంబర్ 2015, బుధవారం

నదుల అనుసంధానం – మంచీ చెడూ

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 24-09-2015, THURSDAY)

నదుల అనుసంధానం అనే పదం దేశంలో ఇప్పుడు త్వరితగతిన ప్రాచుర్యం పొందుతోంది. అటు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇటు ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం నదుల అనుసంధాన కార్యక్రమాలకు ఇస్తూవస్తున్న ప్రాధాన్యత కూడా ఇందుకు దోహదం చేస్తుండవచ్చు.

ఈ అనుసంధాన ప్రక్రియకు ఈ నెలలోనే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అంకురార్పణ జరిగింది. గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు ఉద్దేశించిన పట్టి సీమ ప్రాజెక్టును అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద పూర్తి చేసి, గోదావరి నీళ్ళను కృష్ణలో కలిపి రికార్డు వ్యవధిలో ఆ పని పూర్తి చేశానని సగర్వంగా ప్రకటించింది. అనేకానేక బాలారిష్టాలను దాటుకుంటూ పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసినట్టు ప్రభుత్వం అయితే ఆర్భాటంగా చెప్పుకుంటోంది కాని ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి వున్నాయి. ఎవరి అనుమానాలు  వారికి వున్నాయి. ఉండడమే కాదు వాటిని బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు కూడా. చెప్పిన గడువులోగా పని పూర్తిచేసిన ఘనతను తన ఖాతాలోకి వేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం కొంత అనవసర ప్రయాస పడ్డదేమో అనికూడా అనిపిస్తోంది. తొందరగా పనిపూర్తిచేసి సకాలంలో పొలాలకు నీళ్ళు అందించే ప్రయత్నం హర్షించతగ్గదే, ములుకోల చేత  పట్టి అధికారగణాన్నీ, కాంట్రాక్టర్లను అదిలించకపోతే పనులు ముందుకు సాగని మాట వాస్తవమే. అయితే ఇటువంటి భారీ ఇంజినీరింగు వ్యవహారాల్లో కొన్ని సాంకేతికపరమైన వ్యవధానాలతో పనులు చక్కబెట్టుకోవాల్సిన అవసరం వుంటుంది. రాత్రికి రాత్రే కాలువలు తవ్వించడం వీలయినట్టు, గడువులు నిర్దేశించి ఆక్విడక్టు నిర్మాణాలు చేయడం  సాధ్యం కాకపోవచ్చు. అలా వీలు కాదని, నీళ్ళు ఒదిలిన వెంటనే  కూలిపోయిన ఆక్విడక్టు కధే చెబుతోంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనే చర్చ కన్నా, ఇటువంటివి జరగకుండా చేయడంలో బాధ్యత వహించి పనిచేయడం అనేది బాధ్యత కలిగిన ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం. కాకపొతే భారీ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో కొన్ని ఇటువంటి అవాంతర పరిస్తితులు తలెత్తడం సహజం కూడా. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోవాలి. మంత్రులు, అధికారుల మీదా, అధికారులు కాంట్రాక్టర్ల మీదా నెపాలు మోపుకుంటూ సమస్యను సాగదీయడం తగని పని. ఇక ప్రతిపక్షాలు యాగీ చేయకుండా వూరుకోవడం ఇలాటి సందర్భాల్లో అసాధ్యం. వాటికి ఆ నైతిక హక్కు లేదనడం ఒకప్పుడు ప్రతిపక్షంలో వున్నప్పుడు ఇటువంటి ఆరోపణలే చేసిన పాలక పక్షానికి తగదు. సరే! ఇప్పుడు కొత్తగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న  రాజకీయాల తీరుతెన్నులే ఆవిధంగా వున్నప్పుడు చెబితే వినేవారు ఉంటారని అనుకోవడం అత్యాశే అవుతుంది.
పొతే, అసలు నదుల అనుసంధానం అనే ప్రక్రియ మీదనే జాతీయ స్థాయిలో పుంఖానుపుంఖాలుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ఆహా ఓహో అని ప్రశంసిస్తూ వుంటే మరికొందరు దండగమారి వ్యవహారం అని ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరు పర్యావరణ ప్రేమికులు ఏకంగా నదుల అనుసంధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఒక వాదం మంచిదనీ, మరో వాదం చెడ్డదనీ చెప్పలేని పరిస్తితి. ప్రతి విషయంలో మంచీ చెడూ రెండూ ఉన్నట్టే ఇదీ అందుకు మినహాయింపు కాకపోవచ్చు. కాకపోతే ఈ మంచి చెడుల నడుమ పైకి కనబడని ఓ సన్నని విభజన రేఖ వుంటుంది. దాన్ని పట్టుకోగలిగితే మంచిని పెంచుకుంటూ, చెడు తీవ్రతని తగ్గించుకుంటూ మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చు.
నదులనేవిఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో పారి మరెక్కడో సుదూరాన కడలిలో  కలుస్తుంటాయి. అవి ప్రవహించే దారిలో తమ దాపున వున్న పల్లపు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ వెడతాయి. ఆ నదీ పరివాహక ప్రాంతంలో వున్న ప్రదేశాలు వాటి ఉనికికి అనుగుణంగా ప్రయోజనం పొందుతాయి. నీరు పల్లమెరుగు అనే సామెతకు తగ్గట్టుగా ఎగువ ప్రాంతాలకన్నా దిగువన వుండే ప్రాంతాలకు లబ్ది ఎక్కువ చేకూరుతుంది. ఇది ఆయా ప్రాంతాలకు ప్రక్రుతి ప్రసాదించే వరం, శాపం కూడా. అయితే తద్విరుద్ధంగా భారీ మోటార్లు వాడి పంపుల ద్వారా ఎగువ ప్రాంతాలకు కూడా నీరును తోడిపోసే సాంకేతిక ప్రక్రియలు ఉపయోగించి పట్టిసీమ వంటి ప్రయోగాలు జరుగుతున్నాయి.  
దేశంలో వున్న వేలాది నదుల్లో కొన్ని మాత్రమె జీవనదులు. చాలావరకు వర్షాధారంగా పారే నదులు. అందువల్ల వీటిని అనుసంధానం చేయడం ద్వారా ఎక్కువ ఫలితాలను సాధించవచ్చనీ, వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని పంటపొలాలకు మళ్ళించవచ్చనీ అనుసంధాన ప్రక్రియ మద్దతుదార్లు అంటున్నారు. అయితే ఇదేమీ కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన అయితే కాదు. ఎన్నో దశాబ్దాల క్రితమే కాటన్ దొర వంటి వారు దీన్ని ప్రయోగాత్మకంగానే కాదు శాశ్విత ప్రాజెక్టులు నిర్మించి మరీ రుజువు చేసారు. ఆయన హయాంలోనే గోదావరి, కృష్ణా జలాల అనుసంధానం జరిగింది. అలాగే,  గంగా కావేరీ అనుసంధానం చేయాలని  ఎన్నో ఏళ్ళ నాడే ప్రముఖ ఇంజినీరు కేఎల్ రావు తలపోసి ప్రణాళికలు కూడా సిద్ధం చేసారు.
అలాటి ఆలోచనలే నేటి పాలకులు చేస్తున్నారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో నదీనదాల అనుసంధానానికి భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటి లెక్కల ప్రకారం వీటిని పూర్తి చేయడానికి అక్షరాలా పదకొండు లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా. అంచనాలే ఈ స్థాయిలో వుంటే ఈ భారీ పధకాలు పూర్తయ్యేనాటికి ఇవి ఏమేరకు పెరుగుతాయన్నది అంత సులభంగా అంచనా వేయలేని వ్యవహారం. ఇక ఈ ప్రాజెక్టు గణాంకాలు చూస్తే కళ్ళు చెదురుతాయి. నీరు సమృద్ధిగా పారే 37 హిమనదాలను నీటి లభ్యత తక్కువగా వుండే దేశంలోని ఇతర నదులతో కలిపి వాటిని కూడా స్వయం సమృద్ధ జలవనరులుగా మార్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందులో భాగంగా నదులను కలుపుతూ, యాభయ్ నుంచి వంద అడుగుల వెడల్పున్న  30 కాలువలను పదిహేను వేల కిలోమీటర్ల పొడవున తవ్వుతారు. చిన్నా పెద్దా అన్నీ కలిపి మూడువేల రిజర్వాయర్లు నిర్మిస్తారు. తద్వారా ఎనిమిది కోట్ల డెబ్బయి లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. దీనికి తోడు,  మొత్తం  34 గిగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి మార్గం వేస్తారు.  నిజంగా కళ్ళు చెదిరే ప్రాజక్టే. సరిగ్గా అమలు చేయకపోతే, అంతకంటే నిజంగా అంతంత ప్రజాధనం నీళ్ళ పాలు చేసే ప్రాజక్టే.
అయితే  ఇదొక పార్శ్వం. ఇది రంగుల కల. నిజం అయితే, నిజం చేయగలిగితే అంతకంటే కావాల్సింది లేదు.
మరో వైపు పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులు దీన్ని పీడకలగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పరిణామాలు భయంకరంగా ఉంటాయని, పూర్తి బాధ్యతా రాహిత్యంతో కూడిన ఆలోచన అనీ కొట్టిపారేస్తున్నారు.
నదులు ప్రవహించే తీరు ప్రకృతికి అనుగుణ్యంగా ఉంటుందనీ, దానికి విఘాతం కల్పించడం వల్ల తాత్కాలిక ప్రయోజనాలు సిద్ధించినప్పటికీ దీర్ఘకాలంలో ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుందనీ వారి వాదన. ఏ నదికి ఆ నది  కొన్ని ప్రత్యేకతలు కలిగి వుంటుంది. పొడవైన కాలువలు తవ్వి వాటిని కలిపే ప్రయత్నంలో నదుల నడుమ వున్న రక్షిత అటవీ ప్రాంతాలు విధ్వంసానికి గురవుతాయి. ప్రకృతికి కొన్ని సహజ లక్షణాలు వుంటాయి. వాటిని విధ్వంసం చేయాలని  చూస్తే విలయకారకమవుతాయి అనేది హెచ్చరికతో కూడిన వారి అభిప్రాయం.
జలవనరులను కాపాడుకోవడానికి నదుల అనుసంధానం ఒక్కటే మార్గం కాదు. వాటర్  షెడ్స్, వర్షాల వల్ల సమకూరే నీటిని భవిష్యత్ అవసరాలకు భద్రపరచుకోవడం, భూగర్భ జలవనరులను పెంచుకోవడం, ఇంకుడు గుంతలు, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు పండించే పద్దతుల్ల్లో మార్పులు చేసుకోవడం ఇలా అనేక ప్రత్యామ్నాయాలు వుంటాయి. వాటినన్నింటినీ పూర్తిగా వాడుకున్న తరువాతనే నదుల అనుసంధానం వంటి భారీ ప్రాజెక్టులను గురించి తలపెట్టాలన్నది వారి మనోగతం.
ప్రభుత్వాలు నడిపేవారికి వారి ఆలోచనలు వారికి వుంటాయి. సమాజ హితంతో పాటు సొంత రాజకీయ ప్రయోజనాలు కూడా చూసుకోకతప్పదు.
పర్యావరణ పరిరక్షకులకి వీటితో నిమిత్తం వుండదు. వారిది ఒకటే కోణం.
మరి మధ్యే మార్గం ఏమీ ఉండదా!
వుండే వుంటుంది.
కాకపొతే,  వెతుక్కునే ఓపిక వుండాలి. వినే  తీరిక వుండాలి. 
(23-09-2015)

రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595 

చీరే మేరే సప్నే


నా నలభయ్ అయిదేళ్ళ వైవాహిక జీవితంలో రెండే రెండు సార్లు మా ఆవిడకు చీరెలు కొన్న సందర్భాలు వున్నాయి. అంటే ఇన్నేళ్ళుగా ఆవిడ ఆ రెండు చీరెలతోనే నెట్టుకొస్తున్నదని అర్ధం కాదు. నేను మళ్ళీ ఎప్పుడూ కొనలేదని మాత్రమే దీని తాత్పర్యం. ఆ రెండు సందర్భాలు బాగా గుర్తుండి పోవడానికి కూడా కారణాలు వున్నాయి.
చాలా ఏళ్ళక్రితం ఒక బ్యాంకు తాలూకు మనిషి పనికట్టుకుని మరీ మా ఆఫీసుకువచ్చి వివరాలు అడిగి తీసుకుని పోస్టులో ఓ క్రెడిట్ కార్డు పంపించాడు. క్రెడిట్ కార్డులు అప్పుడే రంగ ప్రవేశం చేస్తున్న రోజులవి. అది నా గొప్పదనం అనుకున్నాకాని, నేను చేస్తున్నది  సెంట్రల్ గవర్నమెంటు నౌఖరీ కాబట్టి ఆ బ్యాంకు అంత ఉదారంగా ఆ కార్డు మంజూరు చేసిందన్న వాస్తవం అప్పట్లో నాకు బోధపడలేదు.
కార్డు చేతికి వచ్చింది కానీ దాన్ని వాడి చూసే  అవకాశం మాత్రం వెంటనే నాకు రాలేదు. అప్పట్లో ఇప్పట్లా ఏటీఎం లు లేవు. ఏదయినా వస్తువు కొనుగోలు చేసినప్పుడు మాత్రమె కార్డు వాడే వీలుండేది. ఓసారి బెజవాడ టూర్ వెళ్ళినప్పుడు మా ఆవిడకోసం బీసెంటు రోడ్డు షాపులో అయిదారొండలు పెట్టి,  ఆ క్రెడిట్ కార్డు వాడి, ఓ చీరె కొన్నాను.  అంత వరకు బాగానే వుంది. మరుసటి నెల నుంచీ ఆ బ్యాంకు తాఖీదులు రావడం, ఆ కిస్తీ కట్టే బ్యాంకు ఎక్కడో సికిందరాబాదులో వుండడం, అంతంత దూరాలు పోయి  ఓ వందో, యాభయ్యో చెల్లు వేసి రావడానికి సహజ బద్ధకం అడ్డం రావడం ఇత్యాది కారణాలతో నాకూ ఆ బ్యాంకుకూ నడుమ సంబంధ బాంధవ్యాలు పూర్తిగా చెడిపోయాయి. చీరె తాలూకు అప్పు మొత్తం వడ్డీలతో పేరుకు పోయి, అయిదారువేలకు చేరడం, చివరికి ఆఫీసులో పీఎఫ్ అడ్వాన్సు తీసుకుని ఆ అప్పు తీర్చి కార్డు ఒదిలించుకోవడం ఓ వ్యధాభరిత అధ్యాయం. అయిదారువందల నెల జీతగాన్ని పెళ్ళానికి అయిదారువేల రూపాయల (అసలు వడ్డీలతో కలిపి) చీరె కొనగలిగానన్న తృప్తితో ఆ మొదటి చీరె అంకం అలా ముగిసిపోయింది.
అలాగే మరోసారి ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్లి, తిరిగి వచ్చే రోజు  పాలికా బజారులో నచ్చిన చీరె సెలక్టు చేసి, వచ్చీరాని హిందీలో, గీసి గీసి బేరం చేస్తున్న సమయంలో అప్పటివరకు శుద్ధ హిందూస్తానీలో మాట్లాడుతున్న షాపు వాడు అచ్చ తెలుగులోకి తిరిగిపోయి ‘అందరికీ నూట ఇరవై, మీకొక్కరికే అరవై సాబ్’ అంటూ  నన్ను మారుమాట్లాడనివ్వకుండా  మొహమాట పెట్టి  ఆ చీరె పొట్లం చేతిలో పెట్టాడు. హైదరాబాదు వచ్చిన తరువాత ఎందుకయినా మంచిదని యాభయ్ రూపాయలకే కొన్నట్టు ఫోజు పెట్టి నా ప్రయోజకత్వాన్ని ప్రదర్శించాను. చీరె రేటు చెబుతున్నప్పుడు మా ఆవిడ ‘అలాగా’ అంటూ చిన్నగా నవ్వుకున్న సంగతి గమనించలేకపోయాను. తరువాత ఇరుగు పొరుగు ఆడంగుల మాటలు  చెవిన పడ్డప్పుడు  కానీ అసలు విషయం బోధపడలేదు. అదేమిటంటే అరవై రూపాయలకు నేను కొన్న చీరె లాంటిది, మూడు నెలసరి వాయిదాలలో నలభయ్ రూపాయలకే అమ్మే షాపులు చిక్కడపల్లిలో అయిదారు వున్నాయట.

దాంతో బోధి చెట్టుతో అవసరం లేకుండానే తత్వం తలకెక్కింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆవిడకు చీరె కొనే ప్రయత్నం మళ్ళీ చేయలేదు.                                   

21, సెప్టెంబర్ 2015, సోమవారం

?



ఏకాంబరం  ఆఫీసు పనిలో బిజీగా వున్నప్పుడు  క్రెడిట్ కార్డు నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డెబిట్ అయినట్టు ఎలర్ట్ మెసేజ్ వచ్చింది. వెంటనే చేస్తున్న పని ఆపి భార్య సెల్ కి కాల్ చేసాడు.
‘ఏమిటి అప్పుడే తెల్లారిందా! షాపింగు కోసం ఊరిమీద పడ్డావ్. ఏం కొన్నావ్ అంత డబ్బెట్టి? పట్టు చీరెలా!’

‘కాదు. ఉల్లిపాయలు’  

20, సెప్టెంబర్ 2015, ఆదివారం

ఎందరో మహానుభావులు – వారిలో ఒకరికి నా నమస్కారం


సెప్టెంబరు  ఇరవై – ఈ రోజున అనేకమంది పుట్టివుంటారు. వాళ్ళల్లో కొందరు పెట్టి పుట్టినవాళ్ళు వుంటారు. వాళ్ళని గురించి తెలిసిన విషయాలను తెలియని వారికి చెప్పే అనేక వ్యాసాలు గట్రా అనేక పత్రికల్లో వస్తుంటాయి. కొందరికి అలాటి ప్రచారం దొరకదు. ఎందుకంటె ప్రచారం కోసం వాళ్ళు ఏపనీ చేయలేదు కనుక.
ఈ రెండో బాపతు మనిషి ఒకాయన కూడా ఎన్నో ఏళ్ళ క్రితం ఇదే రోజున పుట్టాడు. మాతామహుల గ్రామం కంభంపాడులో పుట్టినప్పటికీ ఆయన స్వగ్రామం మాత్రం ఖమ్మం జిల్లా వల్లభి. పుట్టిన తరువాత అక్కడ ఎన్నాళ్ళు ఉన్నాడో తెలవదు కానీ ఖమ్మం, హైదరాబాదు ఆపైన ఇంగ్లండు, ఇలా చదువుల నిమిత్తం, అలాగే ఉద్యోగపర్వంలో బూర్గుంపాడు, భద్రాచలం, హైదరాబాదు ఇలాగే రోజులు  గడిచిపోయాయి. ఒక ప్రభుత్వ డాక్టరుగానే జీవితం గడిపివుంటే ఆయన్ని గురించి రాయాల్సిన అవసరం ఉండేదే కాదు. వైద్య విద్యార్ధిగా తొలి పాఠం నేర్చుకున్నప్పుడే డాక్టర్లకు నేర్పే మరో నీతి పాఠాన్ని ఆయన ఒంటపట్టించు కున్నాడు.  జీవితాంతం దాన్నే పాటిస్తూ వస్తున్నాడు. ‘రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదు’ అన్నది ఆ పాఠం.

108, 104 అంటే ఏమిటో ఈరోజు తెలుగు రాష్ట్రాలలో యావన్మందికీ  తెలుసు. వాటి రూపశిల్పి ఈ డాక్టరు గారే. హైదరాబాదులో ఉంటున్నా, నెలలో చాలా రోజులు  వాళ్ళ సొంతూరు వల్లభిలో గడిపే ‘శ్రీమంతుడు’  డాక్టర్ అయితరాజు పాండు రంగారావు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.  

(డాక్టర్ ఏపీ రంగారావు)
      


ఆడవాళ్ళూ! శతకోటి దణ్ణాలు ! ( ఈ ఒక్కరోజే సుమా!)


నెల అంటే ముప్పయి రోజులు అని సెలవిచ్చాడు గతంలో హైదరాబాదు వచ్చిన ఓ కేంద్ర మంత్రి. ప్రస్తుతం మాజీ అనుకోండి. అల్లాగే ఏడాదికి అక్షరాలా మూడువందల అరవై అయిదు రోజులు అంటే కాదు కాదు ఇంకా ఎక్కువే అంటున్నారు కొందరు. ఆ సంఖ్య ఎల్లాగూ మారదు కాబట్టి ఒక్కో రోజుకూ రెండో మూడో పేర్లు తగిలించేస్తున్నారు ఈ మధ్య ఆ మరికొందరు.  ఆ లెక్కన ఇవ్వాళ అంటే సెప్టెంబరు ఇరవయ్యో తేదీని ‘భార్యల్ని ప్రశంసించే రోజు’ పొమ్మన్నారు. దానికి సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ‘ఈ ఒక్క రోజూ కట్టుకున్న ఇల్లాలిని మాటల్తో పొగిడి, మిగిలిన మూడువందల అరవై నాలుగు రోజులూ షరా మామూలుగా  అష్టోత్తరాలతో వేధిస్తే పోలా’ అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. ‘ఆ మాత్రం దానికి ఈ ఒక్క రోజూ మొగుడితో పొగిడించుకుని, ఏడాది పొడుగునా అనరాని మాటలు పడుతూ వుండడం ఏమంత భాగ్యం’ అని ముక్కు చీత్తూ మధన పడే మగువలకూ తక్కువలేదు. ఇది ఇక్కడ ఒదిలి అసలు ఈ ‘కొత్త రోజు ‘కధాకమామిషూ’ ఏంటో చూద్దాం.
ఒక ఆంగ్ల దినపత్రిక ఈ ‘దినం’ అనగా ‘భార్యల్ని ప్రశంసించే దినం’  ప్రచార బాధ్యతని తన భుజాలకు ఎత్తుకుంది. మక్కికి మక్కి కాకుండా తెలుగులో సాగదీస్తే అది ఇలా సాగుతుంది.
‘హల్లో! ఎలా వున్నావు. మీ ఆవిడ ఎలా వుంది?’
‘మా ఆవిడా! ఓకేరా!’
‘ఏమిటీ జస్ట్ ఓకేనా! అంతేనా!’
‘..........’
‘చాలా ఆశ్చర్యంగా వుందే! ఆవిడ అంటే ఎవరనుకున్నావు. నీ అర్ధాంగి. మీ ఇంటి దీపం. ఉదయం అందరికంటే ఇంట్లో ముందు నిద్ర లేచేది ఆవిడే. ఇంట్లో అందరూ నిద్ర మంచం ఎక్కిన తరువాత అన్నీ సర్దుకుని నిద్రపోయే మనిషి కూడా ఆవిడే! నువ్వు తొడుక్కునే చొక్కా సైజు కూడా నీకు తెలవదు. ఆవిడ కొంటే తప్ప నీకు దిక్కులేదు. పిల్లలు ఏం తింటారో తెలవదు. వాళ్ళ పుట్టిన రోజులు కూడా నీకు జ్ఞాపకం వుండవు. అన్నీ కంప్యూటర్ లాగా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా ఆవిడే తేవాలి. పోపులడబ్బా ఎక్కడుందో కూడా నీకు తెలవదు. సరుకులు ఉన్నాయా నిండుకున్నాయా జవాబు చెప్పమంటే నీకు పడేవి నిండు సున్నా మార్కులే. ఈ విషయంలో ఆవిడని మించిన ఇన్వెంటరీ ఉంటుందా చెప్పు. చెప్పు అంటే జ్ఞాపకం వచ్చింది. ఆవిడ వెంట వుండి కొనిపెట్టకపొతే నీ చెప్పు సైజు కూడా నీకు తెలవదు. పిల్లల స్కూలెక్కడో, వాళ్ళేం చదువుతున్నారో, అసలు చదువుతున్నారో లేదో మీ ఆవిడ చెబితే కానీ తెలవదు. నీకీ సినిమా ఇష్టమో, నీకు ఏ కూర ఎలా చేస్తే యెంత ఇష్టమో ఆవిడకు తెలిసినంతగా నీకు బొత్తిగా తెలవదు. అల్లాంటి మనిషి ఎల్లా వుందంటే సింపుల్ గా ‘ఓకే’ అంటావా! అడిగేవాడు లేక. ఆయ్!!’             
కాబట్టి మొగుడు మిత్రాస్! (ఏవిటో నాకూ సోషల్ నెట్  వర్క్ భాష పట్టుబడుతోంది). ఒక్క రోజే కదా! మీరు మీరు కాదనుకుని, మీ ఆవిడ మీ ఆవిడే అనుకుని ఎంచక్కా నాలుగు మంచి మాటలు ఆవిడతో  మాట్లాడండి. ఆదివారం వంట పని పెట్టుకోకుండా ఏదైనా హోటల్ కు తీసుకువెళ్ళి, ‘ఛా! ఈ కూరా ఒక కూరేనా, నువ్వు వండితే ఆ రుచే వేరు’  అంటూ కాకమ్మ కబుర్లు కమ్మగా చెప్పండి. ఆడవాళ్ళు నమ్ముతారని నమ్మకం నాకయితే లేదు కానీ, ఆడవాళ్ళ గురించి నాకో బలమైన నమ్మకం వుంది. వాళ్ళు అల్ప సంతోషులు. కనీసం మిమ్మల్ని నమ్మించడం కోసమైనా వాళ్ళు మీ మాటలు నమ్మినట్టు కనిపిస్తారు.

ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు నాలుగు మాటలు తప్ప. 


(NOTE: Image Courtesy: RotteneCARDS)
   

19, సెప్టెంబర్ 2015, శనివారం

రాజకీయం ఒక రక్షరేఖ



దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు  తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో, వొంట్లో పుష్కలంగా వున్న ఖామందులు, శ్రీమంతులు, నటులు, కళాకారులు, చివరాఖరుకు జర్నలిస్టులు అందరూ వున్నారు. వీరిలో కొందరికి వారి వారి తాహతునుబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక  సదుపాయాలూ, సామాజిక గౌరవాలూ ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులతో పోలిస్తే అవి తక్కువే.
లక్షల్లో అభిమానులూ, కోట్లల్లో డబ్బు సంచులూ  వున్న సినీనటులు కూడా రాజకీయ రంగు పూసుకోవడం  కోసం  వెంపర్లాడేది అందుకే. కోట్లకు పడగెత్తిన శ్రీమంతులు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడాబాబులూ తాము సంపాదించుకున్నదాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం అనే రక్షరేకు తమకు  వుండి తీరాలి అనే నిర్ధారణకు వస్తున్నారు.  రాజకీయం, ప్రజాసేవ అనే పదాలు పొసగని వాళ్లు కూడా, డబ్బు వెదజల్లయినా  ఏదో ఒక నామినేటేడ్ పదవిలోకి  దూరిపోవాలని దూరాలోచనలు చేసేది అందుకే.
ఒక సినీ నటుడు వుంటాడు. ఏవిధంగా చూసినా కొదవలేని జీవితం. సంఘంలో గౌరవం. ఎక్కడకు వెళ్ళినా పరపతి.  ఒక్కసారి నోరారా  పలకరించినా చాలు, ఊరూరా  పులకరించిపోయే జనాలు. కానీ ఏం లాభం ? ఆదాయపుపన్ను శాఖకు చెందిన చిరుద్యోగి ఇంటికివచ్చినా చిరుచెమటలు పట్టాల్సిందే.
ఒక వ్యాపారవేత్త వుంటాడు. నేల నాలుగు చెరగులా విస్తరించిన వ్యాపారాలు. ఎక్జిక్యూటివ్ తరగతిలో విమాన ప్రయాణాలు, స్టార్ హోటళ్ళలో బసలు, నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటూ తనని కంటికి రెప్పలా కనిపెట్టుకునే  సొంత  సిబ్బంది.  ఏం సుఖం?  పనిమీద సచివాలయానికో, ప్రభుత్వ కార్యాలయానికో వెడితే పదివేల ఉద్యోగికి కూడా తీసికట్టే.
ఒక స్మగ్లర్ వుంటాడు. ప్రాణానికి వెరవని వందల మంది  గూండాలు వెంటనే  వుంటారు. ఏ కుక్కని కొట్ట కుండానే  డబ్బు రాశులు రాసులుగా  రాలిపడుతుంది. ప్రపంచంలోని సుఖాలన్నీ కాళ్ల చెంత వుంటాయి. ఏం ప్రయోజనం? రోడ్డు మీద పోలీసు కనబడితే భయపడే పరిస్తితి.

మరొకడు వుంటాడు. అతడు కళాకారుడు కాదు. విద్యావంతుడు కాదు. డబ్బున్నవాడు కాదు. పేరున్నవాడు కాదు. కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకే కాదు, ముఖ్యమంత్రి ఆఫీసుకే కాదు, ఆఖరుకు సాధారణ జనాలు గడప తొక్కడానికి సందేహించే పోలీసు ఠాణాలకు సైతం వేళాపాళా లేకుండా వెళ్ళగలడు. కింది స్తాయినుంచి పై స్తాయి అధికారి వరకు తలుపులు తోసుకుని వెళ్ళగలడు. తాను  వచ్చిన చెప్పి, అప్పటికప్పుడే  ఆ పనిచేసి తీరాలని పట్టుపట్టగలడు. ఒక్క మనిషికి  కూడా అధికారిక ప్రవేశం లేని చోట్లకు పదిమందిని వెంటేసుకు వెళ్ళగలడు. అతడే రాజకీయ నాయకుడు.
చట్టం తనపని తాను చేసుకుపోతుందనేది పడికట్టుమాట. చట్టం ఎవరిపట్ల యెలా తన పని చేయాలో నిర్దేశించే మీట మాత్రం  రాజకీయనాయకుల చేతిలో వుంటుంది. అతడు బిగువు  వొదిలితే చట్టం పనిచేసే వేగం కుందేలు పరుగులా పెరుగుతుంది. పగ్గం బిగిస్తే చట్టం తాబేలు నడకలా మందగిస్తుంది. అదీ రాజకీయానికి వున్న పవర్. ఎందుకని అడిగేవాడు లేడు.
చట్టం చేతులు చాలా పొడుగు అనే పొడుగాటి డైలాగులు రాజకీయ నాయకులకు వర్తించవు. వారిజోలికి వెళ్ళడానికి పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు రప్పించడానికి వుండే నియమాలు, నిబంధనలు రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్, హుష్ కాకీ. అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే  వస్తే వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషినయితే, ‘ఒంట్లో బాగాలేదా నాయనా, బాగు చేయిస్తాం రా’ అని పోలీసు  స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడిచే  పోలీసులు, రాజకీయ  నాయకుల విషయం వచ్చేసరికి  వారి నిబంధనలూ, ఖాకీ దర్పాలూ అన్నీ  కట్టగట్టుకుని  గాలికి ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద  వుంటే చాలు ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క.
ఉపశృతి: ప్రసిద్ధ సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, ‘అప్పుడు - ఇప్పుడు’ అనే పేరుతొ, కీర్తిశేషులు, ప్రముఖ పత్రికా రచయిత శ్రీ జీ. కృష్ణ రచించిన గ్రంధానికి ముందుమాట రాస్తూ, ఒకానొక  సందర్భంలో కృష్ణ గారు నుడివిన వ్యాఖ్యను ఇలా ప్రస్తావించారు.
“ స్వాతంత్ర్యానంతరం మన రాజకీయ నాయకులు నేర్చుకున్నదేమిటి? కృష్ణగారు అంటారు – ‘రెండే రెండు విద్యలు. ఒకటి గుడ్డిగా పొగడడం, రెండు గుడ్డిగా వ్యతిరేకించడం’.
(19-09-2015)


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595       

16, సెప్టెంబర్ 2015, బుధవారం

490 490


నాలుగు లక్షల తొంభయ్ వేల నాలుగువందల తొంభయ్.

నేటితో (16-09-2015) పూర్తయిన నా బ్లాగు http://bhandarusrinivasarao.blogspot.in/  విజిటర్ల సంఖ్య