13, జూన్ 2015, శనివారం

ప్రమాదం అంచుల్లో ప్రజాస్వామ్యం

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 14-06-2015, SUNDAY)
ప్రజాస్వామ్య ప్రాతిపదికగా ఏర్పాటు చేసుకున్న భారత రాజ్యాంగం ప్రకారం సింపిల్ మెజారిటీతో ప్రజలెన్నుకున్న పార్టీలు అధికారంలోకి వస్తాయి. సాధారణంగా ఏ  ఎన్నికల్లో కూడా నూటికి నూరు శాతం ఓటర్లు పోలింగులో పాల్గొనరు. సగటున ముప్పయి శాతం మంది ఈ విధంగా ఓటు హక్కు వినియోగించుకోకుండా నిర్లిప్తంగా వుండిపోయిన సందర్భాలు అనేకం వున్నాయి. అంటే అర్ధం వారెవ్వరికీ ఎన్నికల్లో పోటీపడుతున్న పార్టీల పట్ల, వాటి విధానాల పట్ల  మక్కువ లేదనుకోవాలి. ఇంకా మిగిలిన డెబ్బయి శాతం వోటర్లు వేసే ఓట్లనే ఆయా పార్టీలు పంచుకుంటాయి. వీటిల్లో తమ సమీప ప్రత్యర్ధి కన్నా ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకున్న వారే విజేతలుగా ప్రకటించబడతారు. ఒక్కోసారి, పోటీపడ్డ పార్టీల నడుమ ఓట్లు భారీగా చీలిపోవడం కద్దు. ఇలాటి సందర్భాలలో  విజేతలుగా నిలిచినవారికి పడ్డ ఓట్లు, పోలింగులో పాల్గొనకుండా నిరాసక్తత ప్రదర్శించిన ముప్పయి శాతం కంటే కూడా తక్కువ కావచ్చు. కానీ రాజ్యాంగంలో పొందుపరచుకున్న నియమ నిబంధనల ప్రకారం వారే అధికార పీఠం అధిస్టిస్తారు. మరో విషయం ఏమిటంటే విజేతలుగా నిలిచిన వారికి పడిన ఓట్లు కూడా గుంపగుత్తగా  ఆయా పార్టీల వీరాభిమానులు వేసినవి కావు. తటస్తులయిన వాళ్లు, ఎవరికో ఒకరికి వేయాలి కనుక వేసి చేతులు దులుపుకునే వాళ్లు కూడా వుంటారు. యెలా అయితేనేం, ఒక్క ఓటు అధికంగా తెచ్చుకున్నా వాళ్ళే విజేతలు. రాజ్యాంగం ప్రకారం మొత్తం ఆ నియోజక వర్గానికి వాళ్ళే ప్రజాప్రతినిధులు. ఆ నియోజకవర్గంలోని ఓటర్లలో చాలామంది వ్యతిరేకించినా కూడా అయిదేళ్ళ కాలానికి వాళ్ళే చట్టసభల్లో  ప్రాతినిధ్యం వహిస్తారు.


ఈ నేపధ్యంలో చూసినప్పుడు ఇటు తెలంగాణాలో కేసీఆర్, అటు ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు ప్రజలు ఎన్నిక చేసిన ప్రభుత్వాలకు నేతృత్వం వహిస్తున్నారు. అంచేత యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తాము ప్రతినిధులమని చెప్పుకోవడంలో అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని రకాల గౌరవాలకు వాళ్లు అర్హులు. వాళ్లని అదే స్థాయిలో గౌరవించి తీరాలి. అది ప్రజాస్వామ్య స్పూర్తి కూడా. అయితే ఇక్కడ ఒక విషయం గమనంలో వుంచుకోవాలి.  యావత్ రాష్ట్రానికి పనికివచ్చే పనుల విషయంలో, లేదా సమస్యల పరిష్కారం విషయంలో తమ విధానాలకు మొత్తం ప్రజానీకం మద్దతు వుందని చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ ప్రజాస్వామ్య విరుద్ధమైన లేదా పజాస్వామ్య విలువలను పట్టించుకోకుండా చేసే పనులకు, తమ తమ పార్టీల రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే పనికి వచ్చే పనుల విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఈ సందర్భాలలో  ప్రజలను అడ్డం పెట్టుకోవడం క్షంతవ్యం కాదు. అదే జరిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డట్టే.
ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా వున్న హైదరాబాదులో పరిస్తితులను వివరిస్తూ, తమ వాదనకు అనుకూలమైన అంశాలను జోడిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ సవివరమైన లేఖను ఇచ్చినట్టు మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యల కారణంగా రాజ్యాంగమే ప్రమాదంలో పడిపోయిందని అర్ధం వచ్చేలా కధనాలు వెలువడ్డాయి. ఉమ్మడి రాజధానిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన పని తాను సక్రమంగా చేసుకుపోవడానికి వీలులేకుండా తెలంగాణా ప్రభుత్వం తన యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ టిక్కెట్టుపై గెలిచిన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించకుండా మంత్రివర్గంలో స్థానం కల్పించారని ఆయన కేసీఆర్ పై మరో ఆరోపణ కూడా చేశారు. ఉమ్మడి రాజధానిలో  తమ ప్రభుత్వం సజావుగా పాలన సాగించడానికి వీలుగా  రాష్ట్ర విభజన చట్టం లోని సెక్షన్ ఎనిమిది ప్రకారం గవర్నర్ చర్యలు తీసుకోవాల్సివుందని కూడా ఆయన కోరారు. తమ మంత్రులు, అధికారుల ఫోన్లను నిబంధనలకు విరుద్ధంగా ట్యాప్ చేస్తున్నారనీ, దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ జరపాలని చంద్రబాబు ప్రధానిని అభ్యర్ధించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ప్రధానికి ఈ విధమైన విజ్ఞప్తి చేసారంటే దాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే చర్యలకు ఉపక్రమించడం కేంద్రం ధర్మం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ మేరకు మాత్రమే పరిమితం అయివుంటే ఏమాత్రం ఆక్షేపించాల్సిన అవసరం వుండదు. తనకున్న  భయాందోళనలను ప్రజలకు కూడా ఆపాదించారు. ఆవిధంగా ఒక చక్కని సమస్యను లేవనెత్తి కూడా దానికి రాజకీయం రంగు పులమడం వల్ల మొత్తం అంశం నీరుకారిపోయే అవకాశం ఏర్పడింది. దీనికి తోడు కొన్ని సమర్ధించుకోలేని చర్యలు కూడా తెలుగు దేశం పార్టీ అధినేత వాదనను బలహీనపరచిన మాట కూడా వాస్తవం. ఆ కారణం వల్లె, మొత్తం ప్రజల దృష్టిని కొన్ని అనైతిక సంఘటనలనుంచి మళ్లించేందుకే చంద్రబాబు ఏడాది కాలంగా పట్టించుకోని సెక్షన్ ఎనిమిది అంశాన్ని తెరపైకి తెస్తున్నారని టీఆర్ ఎస్ నాయకులు ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలో, ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతంగా పరిణమించిన కొన్ని అనైతిక చర్యలు, కేసులు,  న్యాయస్థానాల  విచారణకు, తీర్పులకు నోచుకోకుండానే రెండు పార్టీల  రాజకీయ వికృత క్రీడలకు మైదానంగా మారిపోతున్నాయి. పార్టీల నడుమ వ్యవహారం ప్రభుత్వాల మధ్య వివాదంగా మారిపోయి, ప్రస్తుతం రాజకీయ నాయకుల పుణ్యమా అని ప్రజలనడుమ లేనిపోని అనుమానాలు రేకెత్తడానికి కారణం అవుతున్నాయి. ఇదొక విషాదం. ఇరు ప్రాంతాలలోని ప్రజలు దీన్ని జాగ్రత్తగా గమనించాల్సి వుంది. లేని పక్షంలో రెండు రాష్ట్రాలకు  ఈ  పరిణామాలు పెనువిషాదాన్నే  మిగిలిస్తాయి.   
ఈ వివాదాలు సరిపోవన్నట్టు  సరికొత్తగా కృష్ణా నదీ జలాల వివాదం తోడయింది. ఉభయ రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నదీ జలాల్లో వాటాలు, లెక్కలు తేల్చాలని ఒకళ్ళు, తెల్చేదేమీ లేదని మరొకళ్ళు మాటల తూటాలు విసురుకుంటున్నారు. బజారు నల్లాల దగ్గర  అనునిత్యం జనాలకు కానవచ్చే పోట్లాటలను పోలే  దృశ్యాలను టీవీ ఛానళ్ళలో ఉచితంగా చూపిస్తున్నారు. తాడు తెగకుండా తెగలాగడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.  
దశాబ్దంన్నర  క్రితం ఇస్మాయిల్ సెరగెల్దిన్ అనే ఈజిప్టు దేశస్తుడు ఒక  జోస్యం చెప్పారు. 

ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచంలో జరిగే యుద్ధాలు దేశాలను  ఆక్రమించుకోవడం కోసమో, ముడి చమురు  వనరులకోసమో జరగవు. ముందు ముందు దేశాల నడుమ జరగబోయే యుద్ధాలకన్నింటికీ  ఒకే ఒక కారణం నీళ్ళు’.  నీటి కోసం జరిగే యుద్ధాలనే భవిష్యత్తులో జనం చూడబోతారు. అనేది అప్పట్లో అయన చెప్పిన మాట. ఆయన జోస్యం కొంత నిజం అవుతోంది. అదే భయం.
కృష్ణా జలాలపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా మంత్రుల నడుమ రాజుకుంటున్న వివాదం చినికి చినికి గాలివానగా కాదు ఏకంగా సునామీగా   మారుతున్న నేపధ్యం ఇందుకు ఉదాహరణ.
పారే నీటికి ప్రాంతం లేదు. ఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో ప్రవహించి సముద్రంలో కలిసే నదులకు ఒక రాష్ట్రం అంటూ లేదు. ఒక ప్రాంతం అంటూ లేదు. తాము పారుతూ తమ పక్కన వుండే నేలను, ఆ నేలలో వుండే  పంట పొలాలను పచ్చగా చేయడం తప్ప వాటికి ఏ స్వార్ధం తెలియదు. వచ్చిన చిక్కల్లా నీటితో రాజకీయాలు చేసే వారితోనే. వాటిని  తమ స్వార్ధానికి వాడుకోవాలని చూసే రాజకీయులతోనే. (13-06-2015)


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595   

11, జూన్ 2015, గురువారం

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

"Alcohol is a perfect solvent:
It dissolves marriages, families and careers." (Text Courtesy Krishna Mohan Mocherla​)



NOTE: Courtesy Image Owner 

10, జూన్ 2015, బుధవారం

సలాం రేడియో!


చిన్నప్పుడు పొద్దున్న పొద్దున్నే ఇది వింటుంటే రోజంతా హాయిగా గడిచినట్టు వుండేది. ఇప్పుడూ వినబడుతోంది. వినేవాళ్ళు తక్కువయిపోతున్నారు. వినాలనుకుంటే ఈ  లింకు ప్రయత్నించండి..
https://soundcloud.com/vjdilip/air



హితవాక్యము


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 11-06-2015, THURSDAY)

'క్రమక్రమముగా కొలువుకూటము రణకూటమగుచున్నది, పదువురుండగనే నా మాటలాలకింపుడు' అంటాడు పాండవుల పనుపున దూతగా వచ్చిన శ్రీకృష్ణుడు కౌరవసభలో ధృతరాష్ట్రుడితో.
ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ రంగం  సమరాంగణంగా మారుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు ఉవ్వెత్తుతున్నాయి. ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. మీడియాలో చర్చలు, ఎవరివాదాన్ని వారు బలంగా వినిపించే ధోరణితో పేట్రేగిపోతూ దారితప్పుతున్నాయి. ఒకరు చెప్పేది మరొకరు వినిపించుకోరు. తమ మాటే వినాలని, తమ ప్రశ్నకే జవాబు చెప్పి తీరాలని, అ సమాధానం కూడా తమకు అనుకూలంగా వుండాలని పట్టుబట్టే పెడ ధోరణే  జడలు విప్పుకుంటోంది.  ఈ వేడిలో, వాడిలో  వివేచన వెనక్కు తప్పుకుంటోంది. తప్పు మీదంటే మీదని బురద చల్లుకునే క్రమంలో తప్పు చేయడం అసలు  తప్పేకాదన్న రీతిలో భాష్యాలు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న అధినాయకులే యుద్ధరంగంలో దిగి సమర శంఖాలు పూరిస్తూ వుండడంతో కధ క్లైమాక్స్ కు చేరుతోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు అనుచర గణాలు ఈ విషయంలో  నాయకులను మించి గొంతులు పెంచి నానా యాగీ చేస్తున్నాయి. మొన్న ఒక టీవీ ఛానల్ చర్చకు వచ్చిన ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి నిస్సిగ్గుగా చెప్పాడు, 'ఈ విషయంలో జర్నలిష్టులయినా, విశ్లేషకులయినా ఎవరయినా సరే, ఏ ఒక్కర్నీ ఉపేక్షించవద్దు, గట్టిగా తిప్పికొట్టండి, మన వాదాన్ని బలంగా వినిపించండి'  అంటూ తమ నాయకుడే తమను ఆదేశించాడని. నిజానికి ఏ నాయకుడు అలా చెప్పడు. ఆ పార్టీ ప్రతినిధి అమాయకంగా చెప్పాడో, కావాలని చెప్పాడో కాని అదే  నిజమయితే ఆ పార్టీ నాయకుడికి అది యెంత అప్రదిష్ట.
రాళ్ళు కలిసిన బియ్యం వొండితే అన్నంలో రాళ్ళు పంటికి తగులుతాయి. జల్లెడ పట్టి రాళ్ళను వేరు చేస్తే వొండిన అన్నం నోటికి హితవుగా వుంటుంది. చదువూ సంధ్యాలేని గ్రామీణ ప్రాంతాల వాళ్లకు కూడా తెలిసిన ఈ నిజం నేటి రాజకీయ నాయకులు అర్ధం చేసుకోలేక పోతున్నారు. అర్ధం అయినా అవకాశం కోసం అర్ధం కానట్టు వుండిపోతున్నారు అనుకోవాలి.
ఏవిషయం వచ్చినా, ఏ  సమస్య వచ్చినా ముందు రాజకీయం అనే రక్కసి అందులో చేరి  పడగలు విప్పుతోంది. దాంతో ప్రతిదీ రాజకీయమయం అయిపోతోంది. ఎవడో ఒకడు ఒక నేరం చేస్తాడు. లేదా చట్టాన్ని ఉల్లంఘిస్తాడు. అతడు ఏదో ఒక పార్టీవాడు అయితే ఇక అంతే సంగతులు.  ఆ  పార్టీ అతడికి  కొమ్ము కాస్తుంది. వెంటనే ఎదుటి పక్షం  తన పల్లవి తాను అందుకుంటుంది. ఇలా రాజకీయం రంగ ప్రవేశం చేయడంతో ఆ మనిషి చేసిన నేరం కాస్తా  నేపధ్యంలోకి వెళ్ళిపోతుంది. ఇలాటి విషయాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రతి పార్టీ చేసే పని ఇదే. నేరం చేసిన వాడు పరాయి వాడు అయితే, 'చట్టం తన పని తను చేసుకు పోతుంది, చట్టానికి ఎవరూ అతీతులు కారు'  అంటూ బుడిబుడి రాగాలు తీస్తారు.  తమవాడే  అయితే 'చట్టం పాలకుల చేతిలో చుట్టం' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. తప్పుచేసిన వాడిని పోలీసులు విచారిస్తే, అది సరికాదు, సీబీ  సీ ఐ డీ దర్యాప్తు కోసం గగ్గోలు పెడతారు. సీబీ సీ ఐ డీ విచారణ చేస్తుంటే, అది ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ, సీ బీ ఐ దర్యాప్తు అంటారు. సేబీఐ పరిస్తితీ ఇంతే, అది కేంద్రం చేతిలో ఆటబొమ్మ అంటారు. ఇలా వ్యవస్థలను భ్రష్టుపట్టించే అసంబద్ధ ఆరోపణలు చేస్తూ విచారణను నీరుకారుస్తారు. నేరారోపణలు ఎదుర్కున్న వ్యక్తులు కొన్నాళ్ళ తరువాత  హాయిగా జనం మధ్యే తిరుగుతుంటారు. ఇదీ కొన్నేళ్లుగా జరుగుతున్న కధ. ఇప్పుడు నడుస్తున్న కధ కూడా దానికి పొడిగింపే.        
ముందు చెప్పినట్టు బియ్యంలో రాళ్ళు కలగలసిపోయినట్టు ఈ నాడు నేరాలు, రాజకీయాలు జమిలిగా ముడి పడిపోయాయి. వీటిని విడదీసే జల్లెడలు లేవు. వున్నా రాజకీయ పార్టీలకి వాటి అవసరం లేదు. వాళ్లకి కావాల్సిందల్లా తమ వాళ్ళను కాపాడుకోవడం, వాళ్లు నేరస్తులయినా ఒకటే, కాకపోయినా ఒకటే. ఎదుటివాడయితే చేతిలో వున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు పెట్టడం. మనవాడయితే వాటినుంచి బయటపడవేయడం. ఇదే నేటి రాజకీయ ధర్మం. 'ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంద'ని ఉవాచ. రాజకీయ పార్టీలు కూడా తాము నమ్మిన 'ఆ  ధర్మమే' తమను కాపాడుతుందని భావిస్తూ  తాము పెంచి పోషిస్తున్న  'అధర్మాన్నే' సదా కాపాడుతూ పోతుంటారు.
అందుకే, ఈనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల నడుమ తీవ్రం అవుతున్న వివాదాలు, వాటిపై అధినాయకుల సవాళ్లతో కూడిన ప్రకటనలు విన్నప్పుడు , వాటిపై టీవీల్లో  చర్చిస్తున్నప్పుడు చాలా బాధ వేస్తోంది. ఆ బాధ ఇప్పుడు భయంగా పరిణమిస్తోంది. ఏ ఒకరిద్దరికో కాదు, ఉభయ ప్రాంతాల్లో ఈ విధంగా ఆవేదన చెందుతున్న వారి సంఖ్య గణనీయంగానే వుంది. ఉభయ పక్షాలు ఇది గమనంలో పెట్టుకుని వ్యవహరించాలి.

ఏడాది గడిచింది రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి. రెండింటిలో పూర్తి సంఖ్యాబలం కలిగిన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. నాయకుల సమర్ధతను గీటు రాయిగా తీసుకుని  ఆయా రాష్ట్రాల ప్రజలు  రెండింటికీ, ఇద్దరు ముఖ్యమంత్రులకు అధికారం అప్పగించారు.  కొత్తగా పురుడు పోసుకున్న రెండు కొత్త రాష్ట్రాలను మొత్తం దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతామని రెండు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు  మొదట్లో ప్రకటించినప్పుడు 'పరవాలేదు మంచి రోజులు రాబోతున్నాయి' అన్న ఆనందం అందరి గుండెల్లో నిండింది. అది ఏడాది గడవక ముందే ఇలా ఆవిరి అయిపోతుందని అప్పుడు ఎవరూ అనుకోలేదు. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా కొంపలు మునగవు. అయితే వారిని మెప్పించడానికి వారి అనుచరగణాలు అత్యుత్సాహంతో బుల్లితెర చర్చల్లో చేసే విపరీత వ్యాఖ్యానాలు  జనంలోకి చేరిపోయి వారు కూడా  రెచ్చిపోతేనే అసలు సమస్య. ఏదైనా వివాదం వచ్చినప్పుడు పూర్తిగా ఒక వాదననే సమర్ధించడం అంటే సమస్యను మరింత జటిలం చేయడమే. పడిన ముళ్లు, లేదా తగిలించుకున్న ముళ్లు  మరింత బిగిసిపోకముందే ఉభయ ప్రాంతాల నాయకులు కళ్ళు తెరవాలి.  వ్యవహారాలు చేయిదాటిపోనివ్వకూడదు. నిజానికి ఇది బాధ్యతతో కూడిన కర్తవ్యం.  రెండు ప్రాంతాలలో వాతావరణం తేలిక పడే విధంగా వారి అడుగులు పడాలి. పోరాటాలు రెండు రాజ్యాల మధ్య జరగడం చరిత్రలో చదివాము. రెండు రాష్ట్రాల మధ్య కాదు. విజ్ఞతతో కూడిన సంయమనం నేటి అవసరం.  నచ్చినా నచ్చకపోయినా రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులకు నా విజ్ఞప్తి ఇదే. (10-06-2015)


(చెడు వినకు, కనకు, మాట్లాడకు)
మహానుభావులు, కీర్తిశేషులు 'బాపు' గారికి కృతజ్ఞతలతో 

9, జూన్ 2015, మంగళవారం

విజ్ఞప్తి

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల నడుమ తీవ్రం అవుతున్న వివాదాలు, వాటిపై అధినాయకుల సవాళ్లతో కూడిన ప్రకటనలు విన్నప్పుడు , వాటిపై టీవీల్లో  చర్చిస్తున్నప్పుడు చాలా బాధ వేస్తోంది. ఆ బాధ ఇప్పుడు భయంగా పరిణమిస్తోంది. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రెండింటిలో పూర్తి సంఖ్యాబలం కలిగిన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రెండింటికీ సమర్ధత ప్రాతిపదికా తీసుకుని ఆయా రాష్ట్రాల ప్రజలు ఇద్దరు ముఖ్యమంత్రులకు అధికారం అప్పగించారు.  కొత్తగా పురుడు పోసుకున్న రెండు కొత్త రాష్ట్రాలను మొత్తం దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతామని రెండు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు  మొదట్లో ప్రకటించినప్పుడు 'పరవాలేదు మంచి రోజులు రాబోతున్నాయి' అన్న ఆనందం అందరి గుండెల్లో నిండింది. అది ఏడాది గడవక ముందే ఇలా ఆవిరి అయిపోతుందని అప్పుడు ఎవరూ అనుకోలేదు. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా కొంపలు మునగవు. అయితే వారిని మెప్పించడానికి వారి అనుచరగణాలు అత్యుత్సాహంతో బుల్లితెర చర్చల్లో చేసే విపరీత వ్యాఖ్యానాలు  జనంలోకి చేరిపోయి వారు కూడా  రెచ్చిపోతేనే అసలు సమస్య. ఏదైనా వివాదం వచ్చినప్పుడు పూర్తిగా ఒక వాదననే సమర్ధించడం అంటే సమస్యను మరింత జటిలం చేయడమే. పడిన ముళ్లు, లేదా తగిలించుకున్న ముళ్లు  మరింత బిగిసిపోకముందే ఉభయ ప్రాంతాల నాయకులు కళ్ళు తెరవాలి.  వ్యవహారాలు చేయిదాటిపోనివ్వకూడదు. నిజానికి ఇది బాధ్యతతో కూడిన కర్తవ్యం.  రెండు ప్రాంతాలలో వాతావరణం తేలిక పడే విధంగా వారి అడుగులు పడాలి. పోరాటాలు రెండు రాజ్యాల మధ్య జరగడం చరిత్రలో చదివాము. రెండు రాష్ట్రాల మధ్య కాదు. విజ్ఞతతో కూడిన సంయమనం నేటి అవసరం.  నచ్చినా నచ్చకపోయినా రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులకు నాది ఇదే విజ్ఞప్తి.



(భండారు శ్రీనివాసరావు)

(NOTE:Courtesy Image Owner)

8, జూన్ 2015, సోమవారం

మిడిసిపాటు -


తెలుగులో నాకున్న కొద్దిపాటి  పాండిత్యం నలుగురిలో నాకొక పెద్ద  గుర్తింపు తెచ్చిపెట్టింది. నిజానికి నా తెలుగు అంతంత మాత్రమే. కానీ ఏమీ లేనిచోట ఆముదపు మొక్క మాదిరిగా అమెరికాలో నేనొక తెలుగు పండితుడన్న పేరు తెచ్చుకోవడానికి అది అడ్డం కాలేదు. చిన్నప్పుడు అప్పయ్య మాస్టారు బట్టీ వేయించిన తెలుగు పద్యాలనే కాస్త అటూ ఇటూ తిప్పి సందర్భం అసందర్భం అని చూసుకోకుండా అందరి నడుమ   ప్రయోగించే నా తెంపరితనాన్ని  నలుగురు నాలుగు రకాలుగా మెచ్చుకుంటూ వుండడంతో తెలుగు పండితుడన్న బిరుదు, దేశం కాని దేశంలో నాకు  స్తిరపడిపోయింది. దానితో ఆటా, తానా సభల్లో నేను ఆడింది ఆట పాడింది పద్యం అయిపోయింది.
అసలే ఎన్.ఆర్.ఐ. అనే మూడక్షరాలే  నా వొంట్లో పొగరును బాగా పెంచాయి. వీటికి తోడు ఈ మధ్య గ్రీన్ కార్డుఅనేది మరొకటి జత కలిసింది. ఇంకేముంది అసలే కోతి, కల్లు తాగింది కధలో మాదిరిరిగా పొగరుకు విగర్తోడయింది. ఇండియా వచ్చినప్పుడల్లా తెలుగు పుస్తకాలు భారీగా కొనుక్కుని వెళ్లి  అమెరికాలో తెలుగువారికి  పంచి పెడుతూ నా పేరును సార్ధకం చేసుకునే కొత్త భారాన్ని నెత్తికెత్తుకునేలాచేసింది.
ఈ సొంత గోల ఆపి అసలు విషయానికి వస్తాను.
ఈ మధ్య ఇండియా వచ్చి తిరిగివెళ్ళబోయేముందు తెలుగు పుస్తకాలు కొందామని వెళ్లాను. నేను అంతకు ముందు ఆ షాపుకు వెళ్ళలేదు. చాలా పెద్ద దుకాణం. కొనేవారికి సాయపడేందుకు సహాయకులను కూడా పెట్టారు. నాకు సాయంగా వచ్చిన అమ్మాయికి ఇరవై లోపే వయసు.  అందవికారంగా వుంది. వేసుకున్న దుస్తులు కూడా ఆమెకు నప్పలేదు. అసలే చింపిరి జుట్టు,  సరిగా దువ్వుకోకుండా ముడేసుకుంది.
మీరు ఏరకమైన పుస్తకాలు ఇష్టపడతారని మామూలుగా  అడిగింది. ఆమె ముందు నా పాండిత్యం వొలకబోయాలన్న దుర్బుద్ధి కలగడంతో  అద్వైతం గురించిన గ్రంధాలేమయినా వున్నాయా వుంటే చూపించుఅన్నాను, నిజానికి ద్వైతాద్వైతాలగురించి నాకు ఎలాటి  అవగాహన లేకపోయినా. అడిగినదే తడవుగా ఆ అమ్మాయి కొన్ని గ్రంధాలు తీసి చూపించింది.
నా తెలివిని మరింత ప్రదర్శించడానికి అద్వైతం అంటే నీకు ఏమాత్రం తెలుసు. పురాణ వాజ్మయంలో నీకున్న అవగాహన ఏపాటిది?’ అని అడిగాను.
ఆ ఆమ్మాయి చెప్పిన జవాబుతో నా కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. నా అజ్ఞానం ఏస్థాయిలో వున్నదో  అర్ధం అయింది.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు  అద్వైతాక్షర మాలిక అనే అనువాద గ్రంధాన్ని 2003 లో  ప్రచురించారు. భాగవతుల కుటుంబరావు గారు అనువాదం చేశారు. గ్రంధ సంపాదకులు పుల్లెల రామచంద్రుడు గారు. చూస్తుంటే  అద్వైతం పట్ల మీకు ఆసక్తి వున్నట్టుంది. వ్యవధానం వున్నట్టయితే  కొన్ని విషయాలు చెబుతాను.
చాలా సంవత్సరాలకిందట కొందరు పండితులు సంస్కృతంలో 51  వ్యాసాలు   రాశారు.  1945 లో   కుంభకోణంలో జరిగిన అద్వైత సభ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర స్వామి వారి ఆశీస్సులతో ఈ గ్రంధాన్ని ప్రచురించారు.  
పోతే, పురాణ వాజ్మయం గురించి అడిగారు కదా. వేదవ్యాసులవారు తొలుత బ్రహ్మ నుంచి వేదాలను గ్రహించారు. వాటిని నాలుగు భాగాలుగా విభజించి తన శిష్యులయిన పైల, వైశంపాయన, జైమిని, సుమంతులకు ఉపదేశించారు. వారు వారి శిష్యులకు, వారు తమ అనుయాయులకు పరంపరగా అందించారు.
ఇక వేదాల విషయంలో కూడా మన తెలుగు పండితులు విశేష కృషి చేశారు. సంస్కృతంలో వ్యాస విరచిత వేద వాజ్మయాన్ని దాశరధి రంగాచార్య గారు 70 ఏళ్ళ వయస్సులో అయిదు వేల  పేజీల్లో  తెలుగులోకి అనువదించారు.  ఇందులో ఒక భాగమయిన శుక్ల యజుర్వేదాన్ని ఎమెస్కో ఆర్షభారతి వారు రెండువేల సంవత్సరంలో ఆవిష్కరించారు.  
వేద వాజ్మయాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు సాయణాచార్యుడి ప్రసక్తి అనివార్యం. ఎందుకంటే ఆయన అచ్చ తెలుగువాడు. భారద్వాజగోత్రుడు. అనేక ప్రకాండులను సమకూర్చుకుని అనేకమయిన వేద వ్యాఖ్యానాలు రచించాడు.
సాయణాచార్యులవారు మరికొన్నింటికి కూడా వ్యాఖ్యలు రాశారు.
తైత్తిరేయ బ్రాహ్మణము,  ఆర్షేయ బ్రాహ్మణము, దేవాధ్యాయ బ్రాహ్మణము, ఉపనిషద్ బ్రాహ్మణము, సంహితోపనిషద్ బ్రాహ్మణము  వీటిల్లో ముఖ్యమయినవి.
ఈ గ్రంధాల్లో కొన్ని దొరుకుతున్నాయి. కొన్ని లభ్యం కావడం లేదు. ఆదరించేవారు తక్కువ కావడం ప్రధాన కారణం. అమెరికాలో వుంటూ కూడా ఇలాటి ప్రాచీన భారతీయ  సాహిత్యం  పట్ల మీవంటి వారు చూపుతున్న ఆసక్తే, చనిపోతున్న ఈ సాహిత్యాన్ని  బతికించాలి.
అప్పటికే సిగ్గుతో సగం చచ్చిపోయి వున్నానేమో ఆ అమ్మాయి మాటలకు ఏం జవాబు చెప్పగలనో మీరే చెప్పండి.




గమనిక: పుస్తక ప్రేమికులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు ఇంగ్లీష్ లో వాషింగ్టన్ పోస్ట్ విలేఖరి రాసిన ఓ అద్భుత వ్యాసాన్ని నాకు మెయిల్లో పంపారు. తమిళనాడు నేపధ్యంలో సాగిన రూపొందిన రచన అది. కొన్ని మార్పులను చేసి ఆ వ్యాస భావం చెడకుండా రాయడానికి చేసిన ప్రయత్నం ఇది. భండారు శ్రీనివాసరావు  (10-12-2012)

NOTE: Courtesy Image Owner 

తల రోటిలోనే వుంచండి




తప్పనిసరయి ఇక తప్పదురా అనుకున్నప్పుడు అనుభవించి ఆనందించమని ఇంగ్లీష్ లో ఓ సామెత వుంది.
మంచికో చెడుకో టీవీ అనేది ఇప్పుడు నెసిసరీ ఈవిల్గా తయారయిందన్నది మాత్రం నిజం. తిట్టుకుంటూ అయినా చూడక తప్పని అవసరంగా మారిందన్నది మరో నిజం. కాదనలేని ఈ నిజాల దృష్ట్యా - తిట్టుకోవడం కూడా మానేసి 'టీవీని చూస్తూపోతూవుంటే నష్టపోయేదేమీ వుండదు కరెంటు ఖర్చు తప్ప' అన్నాడో టీవీ విప్లవకవి.

వెనుకటి రోజుల్లో, 'ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది' అంటే దూరదర్శన్ లో అనేవారు నవ్వుతాలుగా. కానీ ఇప్పడు యిరవై నాలుగ్గంటల న్యూస్ చానళ్ళు వచ్చేసిన తరువాత మొదలయిన ఊకదంపుడు చర్చలు చూస్తునప్పుడు 'ఆ పేడా పిడకలే నయమ'నే వారు ఎక్కువయ్యారు. వార్తల అధారంగా వ్యాఖ్యలు, వ్యాఖ్యల ఆధారంగా వార్తలు, మళ్ళీ వీటి ఆధారంగా చర్చలు, వాటిపై తిరిగి ఫోన్ ఇన్ లు’, మధ్యమధ్యలో విలేకరుల విరుపులు, యాంకర్ ల విన్యాసాలు, ‘లక్ష వొత్తుల నోములులక్ష సార్లు నోచుకోవాల్సిన న్యూస్ ప్రెజెంటర్ల మూకుమ్మడి తెలుగు భాషా హత్యాప్రయత్నాలు, బుల్లి తెర నిండుగా ఇప్పుడే అందిన ఎప్పటివో వార్తలు’, తాబేలు, కుందేలు మాదిరిగా డేకుతూ, పాకుతూ వెళ్ళే స్క్రోలింగులు, పంటికింది రాళ్ళలా యాడ్ లు ‘ - ఒకటా రెండా యేమని చెప్పుదు ఆ టీవీల లీలలు. యేమని వర్ణింతునూ ఆ ఛానళ్ళ సొగసులు అన్నాడో వికటకవి.

టీవీల్లో చూపించే చర్చలని చూస్తూ, ఆ చర్చలపై మళ్ళీ  చర్చోపచర్చలు చేసేవాళ్ళని చూస్తూవుంటాము. బుల్లి తెరలపై కానవచ్చే విశ్లేషణ కర్తలే- భుజాలపై శంఖు చక్రాలు పొడిపించుకుని, ‘భుజకీర్తులుతగిలించుకున్న భజన బృందగాన బృందావన విహారులుగా చెలరేగిపోతున్నప్పుడు మేము మాత్రం తీసిపోయామా అన్నట్టు చూసేవాళ్ళు కూడా సినీహీరోల వీరాభిమానుల మాదిరిగా చీలిపోయి, ఆయా రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులను కూడా మించిపోయి శృతి మించి రాగాలుఅందుకుంటున్న తీరుతెన్నులు గమనించేవారికి బ్రోచే వారెవరురా అన్న కీర్తన జ్ఞాపకం వచ్చి- ప్రకటితమో అప్రకటితమో కరెంటు కోతఒక్కటే తమను ఈ సజీవ హింస నుంచి కాపాడగలగలదని గజేంద్ర మోక్షంపద్యాలను తిరగేసి అరగదీస్తుంటారంటూ - ఇవా ఈనాడు జనానికి కావలసినవి? ఇదా ఈ రోజు జనం కోరుకుంటున్నది?’అని బోలెడు బోలెడు  ఆవేశపడిపోయాడో వికటాట్ట కవి.

కానీ, ఇక్కడే కరెక్టుగా పైన చెప్పిన సామెత అక్కరకు వస్తుంది. అన్ని వేలుపోసి టీవీలు కొనుక్కున్నదెందుకు? వున్న చీకాకులను మరచిపోయి హాయిగా కాలక్షేపం చేసేందుకు. అంతేకానీ, ఇలా అడ్డమయిన చర్చల్లో తలదూర్చి లేని తలనొప్పులు తెచ్చుకునేందుకు కాదుకదా. అందుకని తెలివయిన వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే టీవీ రోట్లో పెట్టిన తలను రోట్లోనే వుంచేసి రోకటి పోటుని ఆహ్వానించి ఆస్వాదించడం ఒక్కటే శరణ్యం  అంటూ సెలవిస్తున్నాడో ఉచిత సలహా కవి.
అందుకాయన ఇస్తున్న ఉదాహరణలను సోదాహరణంగా గమనించండి.
ముఖ్యమంత్రి గారు ఢిల్లీ బయలు దేరారు'
ముఖ్యమంత్రిగారు శంషాబాదు విమానాశ్రయం చేరుకున్నారు'
'ముఖ్యమంత్రిగారు ఢిల్లీ విమానం ఎక్కారు'
'ముఖ్యమంత్రిగారు కొద్దిగంటల్లో ఢిల్లీ చేరుకుంటారు'
'ముఖ్యమంత్రిగారు మరి కాసేపటిలో ఢిల్లీ చేరుకుంటారు' (ఢిల్లీ విమానం ఎక్కిన వాళ్లు వెళ్ళేది ఢిల్లీయేకదా,  డెహ్రాడూన్  వెళ్ళరు కదా అనే పిచ్చి అనుమానాలు పెట్టుకోకండి. నిజంగా పిచ్చెక్కవచ్చు)
ఎంతో ఆసక్తిని రగిలిస్తున్న ఈ అంశాలపై మేము అంటే మా ఛానల్ మాత్రమే నిర్వహిస్తున్న చర్చను మా ఛానల్ లోనే - ఈ రోజే, ఇప్పుడే చూడండి.

వంటా వార్పూ కార్యక్రమంలో ఇలా చేసి మాడండితరహాలో వెలువడే ఈ రకం ప్రకటనలు వింటుంటే నవ్వు రావడం లేదా? ఇంతటి హాస్యాన్ని ఇరవై నాలుగ్గంటలపాటు ఇంటింటికీ పంచుతున్న తెలుగు టీవీ ఛానళ్ళ నిర్విరామ, నిస్వార్ధ, నిర్వికార సేవా నిరతిని కొనియాడడానికి మీకు మాటలు రావడం లేదా? అయినచో మీకు నిష్కృతి యెట్లు?  మీబోటి బోంట్లకు అదే సరయిన మార్గం. తలను రోటిలోనే వుంచండి. రోకటి పోటుకు వెరవకండి. శేష జీవితానందాన్ని ఆ రోట్లోనే వెతుక్కోండి. శుభం భూయాత్! (Still,  I am proud to be called a media man)



NOTE: Courtesy Image Owner