3, జూన్ 2015, బుధవారం

వెలుగు నీడల నడుమ చంద్రబాబు ఏడాది పాలన

(Published in 'SURYA' telugu daily,  on 03-06-2015, Thursday)   

దాదాపు పదేళ్ళ విరామం తరువాత చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. చేజారిన అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఏ రాజకీయ నాయకుడికి అయినా ఇంతకుమించిన సంతోషం మరోటి వుండదు. అయితే ఈ ఆనందం ఈ సంతోషం  గత ఏడాదిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నారా అంటే ఆ దాఖలా కానరావడం  లేదు. ఎందుకంటే ఈసారి అధికారం లభించింది కానీ దానితోపాటే అనేకానేక సమస్యలు కూడా వెన్నంటి వచ్చాయి. కాకపొతే,  దిక్కూ దివాణం లేకుండా ఏర్పడ్డ లేదా వేరుపడ్డ ఆంధ్రప్రదేశ్ అనే కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అనే ఓ కొత్త రికార్డు  మాత్రం చంద్రబాబు ఖాతాలో చేరింది. ఇది మినహాయిస్తే ఆయన   సమస్యల అమావాస్యల్లో కూరుకుపోయిన చంద్రుడిగానే వుండిపోయారు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఆయన్ని  చుట్టుముడుతూనే వస్తోంది. ఒకదాని చిక్కుముడి విప్పేలోగా మరోటి సిద్ధం. పూర్వం అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదేళ్ళ పైచిలుకు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో,  'తన హయాములోనే ఇంతగా అభివృద్ధి చేసాను, తీర్చిదిద్దాను' అని అయన పదేపదే  చెప్పుకునే 'ఇల్లు' తనది కాకుండా పోయింది. సొంత ఇంట్లోనే కిరాయికి వుంటూ కొత్త యింటిని చక్కదిద్దుకోవాల్సిన దుస్తితి. అధికారంలోకి వచ్చిన కొత్త రోజులన్నీ పాత వాగ్దానాలను నెరవేర్చడం యెట్లా అన్న అంతర్మధనంలోనే గడిచిపోయాయి. ముఖ్యంగా రైతుల రుణ మాఫీ అంశం ఆయన సమర్ధతతకు సవాలుగా మారింది. ఈ మాట నిలబెట్టుకోవడం అంత సులువయిన పనేమీ కాదు. ఎందుకంటే పరిష్కారం ఆయన ఒక్కరి చేతుల్లో లేదు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు, రుణాలు ఇచ్చిన స్థానిక బ్యాంకులు సహకరిస్తేనే కాని కుదరని సమస్య ఇది. నిజానికి రైతులు చంద్రబాబుకు వోటు వేయడానికి ఈ వాగ్దానం ఓ మేరకు దోహదం చేసివుండవచ్చు కానీ టీడీపీ  అధికారంలోకి రావడానికి మార్గాన్ని  సుగమం చేసింది  రాష్ట్ర విభజన అంశం ఒక్కటే.  అందుకే నిరుటి ఎన్నికలకు కొన్ని వారల ముందు వరకు  దాదాపు అన్ని సర్వేల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా కూడా  అసలు ఎన్నికలు వచ్చేసరికి సీను మొత్తం మారిపోయింది. విభజన నిర్ణయం అనంతరం  ఎన్నికలు జరిగాయి. జీర్ణించుకోలేని విధంగా ఆ విభజన జరిగిందన్న ఆక్రోశంలో వున్న సీమాంధ్ర ప్రజలు, సంక్షేమ కోణాన్ని పక్కనబెట్టి 'సమర్ధత' అన్న ఒక్క అంశాన్నే పరిగణన లోకి తీసుకుని చంద్రబాబుకు పట్టం కట్టారు. తీడీపీ అధికారంలోకి వచ్చింది.


అసలే తరుగు బడ్జెట్లో పురుడు పోసుకున్న కొత్త రాష్ట్రానికి రైతుల  రుణ మాఫీ వంటి పెనుభారం మోసే పరిస్తితిలేదు. కానీ చంద్రబాబు దేన్నీ లెక్కచేయకుండా తన యావత్ శక్తియుక్తులను ఈ హామీ అమలుకే ఖర్చుచేశారు. నిజానికి వున్న వాస్తవాల్ని విడమరిచి చెబుతే ప్రజలు అర్ధం చేసుకునే పరిస్తితి మొదట్లో వుంది కూడా. అయినా ఆయన, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న రాజకీయ నాయకుడి తరహాలోనే ముందుకు పోయారుకానీ, రాజనీతిజ్ఞుడి మాదిరిగా వ్యవహరించలేదని అనిపిస్తోంది. అలవికాకపోయినా మొత్తం మీద పని అయిందనిపించారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కని చందం అయింది. ప్రభుత్వం ఎన్ని చెప్పినా ఈ వాగ్దానం అమలు అరకొర చందమే అనే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్తితే ఇంకా వుంది. అధికారంలో వున్నవాళ్ళు హరా యించుకోలేని వాస్తవం ఇది. అసలు వాస్తవాలను ప్రజలకు సరిగ్గా వివరించి వుంటే విభజన తీరుతో మానసికంగా గాయపడివున్న ప్రజలు ఖచ్చితంగా సహకరించి వుండేవారు అనే ఒక వాదన కూడా వుంది.
హుద్ హుద్ తుపాను ఉత్తరాంధ్రను ఒణికించి వెళ్ళింది కానీ, చంద్రబాబు పాలనాసమర్ధతకు కొలమానంగా నిలిచింది. ఆ తుపాను సృష్టించిన భీభత్సం నుంచి త్వరత్వరగా బాధిత ప్రాంతాలను బయటపడేసిన తీరు, పునరావాస, పునర్నిర్మాణ విషయాల్లో సత్వరం స్పందించి తీసుకున్న చర్యలు  చంద్రబాబుకు ప్రజల్లో మంచి  పేరు కట్టబెట్టాయి. వృద్ధ వికలాంగులకు పెన్షన్లు,  ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు, ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు ఇటువంటి వాటిని సంత్రుప్త స్థాయిలో పెంచుతూ తీసుకున్న  నిర్ణయాలు టీడీపీ ప్రభుత్వ ప్రతిష్టను కూడా ఇతోధికంగా పెంచాయి.
రాజధాని అంశం చంద్రబాబుకు కలిసి వచ్చిన మరో విషయం.
చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికీ రాని అపూర్వ అవకాశం చంద్రబాబు నాయుడుకి కొత్త రాజధాని విషయంలో లభించింది. కొంత వివాదాస్పదం అవుతున్నప్పటికీ ఈ విషయంలో కూడా చంద్రబాబు తన పంధాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని అవసరం కనుక ఆయన ప్రయత్నాలకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కానరాని మాట నిజమే. కాకపోతే కొత్త రాష్ట్రానికి వుండే ఇబ్బందులను ప్రజలు అర్ధం చేసుకుని సహకరిస్తున్నారు కానీ  ఇష్టపూర్తిగా కాదన్న వాస్తవాన్ని పాలకులు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం రాష్ట్ర ప్రజలకు అవసరమైన రాజధాని వంటి అతి ముఖ్యమైన విషయంలో ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకుని వుంటే మరింత హుందాగా వుండేది.
ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి తొలిరోజుల్లో అన్నీ మంచి శకునాలే. అన్నీ కలిసివచ్చిన అంశాలే. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, టీడీపీకి మిత్రపక్షం. ఇక్కడా, అక్కడా ప్రభుత్వంలో భాగస్వామి. ఢిల్లీ లో ఇతర పక్షాల కంటే టీడీపీ మాటే ఎక్కువగా చెల్లుబడి అవుతుంది. అందుకే ఏ అవకాశాన్ని ఒదులుకోకుండా పార్టీకి, రాష్ట్రానికి పనికి వచ్చే ప్రతి పనీ చేయడానికే చంద్రబాబు ఆయన అహరహం కష్టపడుతుంటారు. కష్టపడుతున్నట్టు కానవస్తారు. 'పని చేయడంతో సరిపోదు పనిచేసినట్టు కనబడాలి కూడా' అనే ఈ కాలపు రాజకీయానికి నిజానికి ఆయనే ఆద్యులు.
ఎన్ని చేస్తున్నా, ఎన్నో చేస్తున్నామని చెప్పుకుంటున్నా ఇంకా కొన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే వున్నాయి.రాజ్యం వుంది రాజధాని లేదు. ఖజానా వుంది. నిధులు లేవు. కేంద్రంలో మిత్ర ప్రభుత్వం వుంది. అయినా ఆశించిన విధంగా అక్కరకు రావడం లేదు. పాలించే ప్రజలు పొరుగు రాష్ట్రంలో. పాలించే ప్రభుత్వం ఇరుగు పొడగిట్టని పొరుగు రాష్ట్రంలో. ఇదొక విచిత్రమైన పరిస్తితి. గతంలో ఏ ప్రభుత్వానికీ ఎదురుకాని దుస్తితి.  ప్రభుత్వం మీద, పాలకుల పని తీరు మీద ప్రజల్లో విరక్తి మొదలు కావడానికి ఇవి చాలు. అయితే, ఎదురయిన ప్రతి సమస్యను తనకు అనుకూలంగా మార్చుకునే చాణక్యచాకచక్యానికి చంద్రబాబు పెట్టింది పేరు. అదేమిటో  ఈ తడవ సమస్యలే ఆయనకు అనుకూలంగా మారుతున్నాయి. నిజానికి,  ఏ సమర్ధత కారణంగా ఆంధ్ర ప్రాంతపు ప్రజలు ఆయనకు పట్టం కట్టారో ఆ సమర్ధత సమస్యల పరిష్కారానికి పనికి రావడం లేదు. అయినా కానీ,  'ఇన్ని ప్రతికూలతల నడుమ ఎవరు మాత్రం ఇంతకంటే ఎక్కువేమి చేయగలరు? కాళ్ళూ చేతులూ బంధించి పరిగెట్టమంటే సాధ్యమా?'  అనే  సానుభూతి మాత్రం ప్రజల నుంచి లభిస్తోంది. ఈ ఒక్క విషయంలో చంద్రబాబు అదృష్టవంతుడు అని చెప్పాలి.   
ప్రభుత్వానికి ప్రజలు కొమ్ము కాస్తున్నట్టు కనబడడానికి వేరే కారణాలు వున్నాయి. విభజన  జరిగిన తీరు పట్ల సీమాంధ్ర ప్రజానీకం లోలోపల ఉడికిపోతోంది. అన్యాయం జరిగిపోయిందని మధన  పడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే విభజనకు పూర్వం తెలంగాణా ప్రాంతంలో మెజారిటీ ప్రజలు ఇలాగే బాధపడుతూ వచ్చారు. అదే టీ. ఆర్.యస్. పార్టీకి, దాని నాయకుడు కేసీఆర్ కు వరప్రసాదంగా మారింది. భావోద్రేకంతో కూడిన ఆ అంశం ముందు మిగిలిన అంశాలన్నీ వెలతెలా పోయాయి. ప్రస్తుతం సీమాంధ్రలో దాదాపు అదే పరిస్తితి. తమ ఈ స్తితికి వేరెవరో కారణం అని వారు రగిలిపోతున్నారు. ప్రజల నాడిని ఒడపోసిపట్టుకునే చంద్రబాబుకు ఈ విషయం బాగా అర్ధం అయింది. అందుకే ఆయన ఏం చేసినా ఏం చేయకున్నా ఈ ఒక్క భావోద్రేకం చల్లారకుండా చూసుకుంటే చాలు. తెలంగాణాలో సరిగ్గా కేసీఆర్ ఇదే చేసి చూపించారు. ఇంకా చూపిస్తున్నారు కూడా.
అయితే ఒక విషయం పాలకులు గుర్తు పెట్టుకోవాలి. ప్రాంతీయ వైమనస్యాలు  రాజకీయంగా ఉపయోగపడవచ్చు. కానీ ఆ ప్రయోజనం తాత్కాలికం. దీర్ఘ కాలికంగా  ఉపయోగపడే రాజకీయ ఎత్తుగడ అనిపించుకోదు. పైగా రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మరింత అఘాధాన్ని. అనుమానాలను  పెంచే ప్రమాదం కూడా వుంటుంది.    
ప్రజలు, రాజ్యాంగం ఇచ్చిన అయిదేళ్ళ గడువులో ఏడాది కాలం చూస్తుండగానే కనుమరుగు అవుతోంది. సర్కారు లెక్కల ప్రకారం చేసినవి చాలా వుండవచ్చు. కానీ ప్రజల లెక్కలు వేరే వుంటాయి. ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు వున్న పరిస్తితిలో అక్కడి ప్రజలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే అవకాశం ఇచ్చి చూస్తున్నారు. కొంత కాలం పరవాలేదు. కానీ ఎల్లకాలం వాళ్ల తీరు ఇలాగే వుండక పోవచ్చు. తీరుతెన్నులు మారిపోవడానికి  హఠాత్తుగా వూడిపడే అనేక అంశాలు దోహదపడతాయి. తాడనుకున్నది పాము కావచ్చు. తాడుని చూసి పామని భ్రమిస్తే కొంత జాగ్రత్త పడవచ్చు. పాముని తాడనుకుని నిర్లక్ష్యం చేస్తేనే ప్రమాదం.
ఉదాహరణకు తెలంగాణాలో శాసనమండలి సభ్యుల ఎన్నిక వ్యవహారం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేరారంటూ ఇటు టీడీపీ, అటు టీ.ఆర్.యస్. పరస్పరం నిందారోపణలు చేసుకున్నాయి. 'చాలా దారుణం' అని ఇరుపక్షాలు అంటున్నాయి. సభలో వున్న సంఖ్యాబలానికి మించి అభ్యర్ధులను పోటీకి దింపడం అనైతికం అని టీడీపీ అంటుంటే, ఇలా కోట్లు పోసి ఒక్క ఓటు కొనే ప్రయత్నం చేయడం నీతిబాహ్యమని టీ.ఆర్.యస్. అంటోంది. అయితే ఇక్కడ ఒక విషయం  గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఎవరయినా గెలుపు కోసం ఓట్లు కొనుగోలు చేస్తారు. కానీ ఇక్కడ సీను రివర్స్ అయింది. టీ.ఆర్.యస్. ఐదో అభ్యర్ధి గెలవకుండా చూడ్డానికి బేరసారాలు జరిగాయి. టీవీల్లో కానవచ్చిన దృశ్యాల్లో, వినవచ్చిన సంభాషణల్లో ఈ విషయం ధృవపడింది.  ఈ కారణం చేతే ఈ సంఘటన జరగడానికి పూర్వం వరకు టీడీపీ  మీద వున్న సానుభూతి  ఆ తరువాత గాలికి కొట్టుకు పోయింది. టీడీపీ అంటున్నట్టు  ఇది రాజకీయ కుట్రే. కాదనలేము.  కాని ఆ కుట్రలో తనకు తానుగా  యెందుకు చిక్కుకు పోయిందని అడిగితె దానికి  టీడీపీ వద్ద సరయిన సమాధానం లేకుండా పోతోంది. అంచేతే అది నలుగురి దృష్టిలో  ముద్దాయిగా నిలబడాల్సివస్తోంది. ఎంతో రాజకీయ అనుభవం వున్న టీడీపీ అధినాయకత్వానికి ఇది స్వయంకృతమే. నవ నిర్మాణ దీక్షకు ముందు చేజేతులా అంటించుకున్న ఈ మురికిని సాధ్యమైనంత త్వరగా  ఒదుల్చుకోవాలి, అంతే కాని ప్రతిష్టకు పోయి మరింత అప్రతిష్ట మూటగట్టుకోకూడదు.  (03-06-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595 

2, జూన్ 2015, మంగళవారం

నోటుకు ఓటు - ఓటుకు నోటు



అనైతికం అని ఇరుపక్షాలు అంటున్నాయి. వున్న బలానికి మించి అభ్యర్ధులను పోటీకి దింపడం అనైతికం అని టీడీపీ అంటుంటే, ఇలా కోట్లు పోసి ఒక్క ఓటు కొనే ప్రయత్నం చేయడం నీతిబాహ్యమని టీ ఆర్ యస్ అంటోంది. అయితే ఇక్కడ ఒక విషయం  గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఎవరయినా గెలుపు కోసం ఓట్లు కొనుగోలు చేస్తారు. కానీ ఇక్కడ సీను రివర్స్ అయింది. టీ ఆర్ యస్ ఐదో అభ్యర్ధి గెలవకుండా చూడ్డానికి బేరసారాలు జరిగాయి. ఈ కారణం చేతే ఈ సంఘటన జరగడానికి పూర్వం వరకు టీడీపీ  మీద వున్న సానుభూతి  ఆ తరువాత గాలికి కొట్టుకు పోయింది. టీడీపీ అంటున్నట్టు  ఇది రాజకీయ కుట్రే. కాదనము.  కాని ఆ కుట్రలో తనకు తానుగా  యెందుకు చిక్కుకు పోయిందని అడిగితె దానికి  టీడీపీ వద్ద సరయిన సమాధానం లేకుండా పోతోంది. అంచేతే అది నలుగురి దృష్టిలో  ముద్దాయిగా నిలబడాల్సివస్తోంది. ఎంతో రాజకీయ అనుభవం వున్న టీడీపీ అధినాయకత్వానికి ఇది స్వయంకృతమే. నవ నిర్మాణ దీక్షకు ముందు చేజేతులా అంటించుకున్న ఈ మురికిని ఒదుల్చుకోవాలి, అంతే కాని ప్రతిష్టకు పోయి మరింత అప్రతిష్ట మూటగట్టుకోకూడదు. 


NOTE: Courtesy Image owner   

కాలర్ ఎగరేద్దాం రండి!



ఇండియా దట్ ఈజ్ భారత్ - మేరా భారత్ మహాన్ - నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము - అని పాడుకోవాలని అనిపిస్తే ఈ ఫోటోలు చూడండి.


(Lotus Temple)


(Modern Jaipur)


(Mumbai Airport)


(Visakha Novotel Hotel)


(Andaman) 


(Fly Over in Chennai)



(Delhi - Agra Express Way)




ఇవన్నీ మన దేశం లోనివే. ఢిల్లీ ఆగ్రా నడుమ యమునా ఎక్సప్రెస్ వే, చెన్నై ఫ్లై ఓవర్, ముంబై ఎయిర్ పోర్ట్,  విశాఖపట్నం నోవాటెల్ హోటల్ -  ఇవన్నీ చూసిన తరువాత మనమూ ఎవరికీ తీసిపోమని అనిపిస్తోంది కదా!    

(Photo Courtesy PVVG Swamy)

31, మే 2015, ఆదివారం

అమెరికా అధ్యక్షులు - అందరికీ తెలియని కొన్ని సంగతులు


అబ్రహాం లింకన్ పేరు తెలియని వాళ్లు వుండరు. దేశం కాని దేశంలో కూడా ఆయన ఫోటో గుర్తుపడతారు. అయితే ఆయన గురించి చాలామందికి తెలియని విషయం ఒకటుంది. అదేమిటంటే - ఆ బక్క పలచటి మనిషి గట్టి మల్ల యోధుడు. గోదాలోకి దిగారంటే చాలు ఎంతటివారయినా సరే మట్టి కరవాల్సిందేనట.


అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళలో జాన్ టైలర్ ఒకరు. మరి వీరి గొప్పతనం ఏమిటంటే టైలర్ గారు ఏకంగా పదిహేనుమంది పిల్లకు తండ్రి. వైట్  హౌస్ కాబట్టి సరిపోయింది.  ఆయన ఇద్దరు మనుమలు ఇంకా  జీవించే వున్నారట.

ఇక ఫ్రాంకిలిన్ పియర్స్ - వీరికి గుర్రపు స్వారీ ఇష్టం. అయితే అలా పియర్స్ మహాశయులు గుర్రమెక్కి షికారు చేస్తుంటే ఆ గుర్రం ఒక మహిళను తొక్కుకుంటూ వెళ్ళింది. తొక్కుతూ  వెళ్ళింది గుర్రం అయినా స్వారీ చేస్తోంది పియర్స్ కాబట్టి ప్రెసిడెంటు అనికూడా చూడకుండా పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి కేసు పెట్టారు. కాకపొతే సరయిన సాక్ష్యం లేని కారణంగా కోర్టులో ఆ కేసు వీగి పోయింది. అది వేరే కధ.
ఆండ్రూ జాన్ సన్ ప్రెసిడెంటు కాక  మునుపు దర్జీ పనిచేస్తూ దర్జాగా బతికేవాడు.వైట్  హౌస్ లో ప్రెసిడెంటుగా వున్నకాలంలో కూడా అయన తన కుట్టుపని మరిచిపోకుండా తన కోట్లు సూట్లు తానే కుట్టుకునేవాడు.
జేమ్స్ బుచానన్. ఈ మహాశయుడిది మరో తరహా. ప్రెసిడెంటుగా వున్నప్పుడు వాషింగ్ టన్ డీసీలో బానిసల్ని కొనుగోలు చేసేవాడు. వారిని గుట్టుచప్పుడు కాకుండా పెనిసుల్వేనియా చేర్చి అక్కడ వారికి బానిసత్వం నుంచి విముక్తి కల్పించేవాడు.
రూధర్ ఫోర్డ్. అల్లూరి సీతారామరాజు సినిమా గుర్తొస్తోందా! ఆయన వేరు ఈ రూధర్ ఫోర్ట్ వేరు. ఈయన కూడా ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంటే. అంతరుధ్యం కాలంలో గాయపడ్డ ఏకైక అమెరికా అధ్యక్షుడు ఈయన. ఒకసారి కాదు నాలుగు సార్లు గాయపడడం  ఇంకో ప్రత్యేకత.
విలియం టఫ్ట్. 'బిగ్ బిల్' అని ముద్దు పేరు. ముద్దు పేరుకు తగ్గట్టే మొద్దు శరీరం. అమెరికా ప్రెసిడెంట్లు అందరిలో ఇంతటి భారీ కాయం వున్న వాళ్ళు మరొకరు లేరు. ఒకసారి స్నానం చేద్దామని వైట్  హౌస్ లోని ఓ బాత్ టబ్ లోకి దిగి మళ్ళీ పైకి లేవలేకపోయాడట. ఆయన్ని బయటకు తీయడానికి సర్వెంట్లని పిలవాల్సివచ్చిందట.
హెర్బర్ట్ హూవర్. ఈయనా అమెరికా ప్రెసిడెంటే. ఈయనగారితో ఏ చిక్కూలేదు కాని ఈ ప్రెసిడెంటు గారి కొడుక్కి మొసళ్ళ పిచ్చి. రెండు మొసళ్ళను వైట్ హౌస్ లో పెంచేవాడు. అవి ఆ శ్వేత భవనంలో స్వేచ్చగా తిరుగాడుతుంటే అక్కడి సిబ్బంది గుండెలు చిక్కబట్టుకుని విధులు నిర్వహించేవారు.
చెస్టర్ ఆర్ధర్. పెద్ద పెద్ద మీసాలు. పెద్ద అందగాడేమీ కాదు. కాకపొతే చక్కటి దుస్తులు  ధరించి చూపరుల మార్కులు కొట్టేసేవాడు. ఎలిగెంట్ ఆర్ధర్ అని ఆయనకు నిక్  నేమ్ కూడా  వుండేది. ప్రెసిడెంటుగా వున్నప్పుడు చాలామంది అమ్మాయిలు ఆయనంటే  మోజుపడేవారట. పదవిలో వున్నప్పుడు సరే.  అధ్యక్షపదవి నుంచి దిగిపోయే ఆఖరు రోజున కూడా నలుగురు అతివలు ఆయన వద్ద పెళ్లి ప్రస్తావనలు తెచ్చారట.
జేమ్స్ గార్  ఫీల్డ్. గ్రీక్ అండ్ లాటిన్ అంటాము  చూడండి. అంటే ఒక్క ముక్కా అర్ధం కాకపోతే మనవైపు అనేమాట. కానీ ఈ ఫీల్డ్ గారికి  ఆ రెండు భాషలు కొట్టిన పిండి. ఈయన గారు కుడి చేత్తో గ్రీకు భాషలో రాస్తూ, ఎడం చేత్తో లాటిన్ భాషలో రాస్తూ పోయేవాడట.
బెంజమిన్ హారిసన్ వైట్ హౌస్ లో ప్రెసిడెంటుగా పాదం మోపేవరకు ఆ భవనంలో నూనె దీపాలే గతి.  ఆయన హయాములోనే  శ్వేత భవనానికి  కరెంటు భాగ్యం కలిగింది. అయితే అప్పటివరకు కరెంటు అంటే ఏమిటో తెలియని హారిసన్ గారికి  కరెంటు అంటే ఎక్కడలేని భయం. విద్యుత్ దీపం వెలిగించాలంటే ఎక్కడ షాక్ కొడుతుందో అని హారిసన్  గారు హడిలిపోయేవారట.
కాల్విన్ కూలిడ్జ్ .  ఈయనది మరో తరహా.  కూలిడ్జ్ గారు కూల్ గా వైట్  హౌస్ లోని అధ్యక్ష కార్యాలయం ఓవల్ ఆఫీసులో కూర్చుని, ఆ  భవనం మొత్తంలో వినబడేట్టు ఏర్పాటుచేసిన ఎమర్జెన్సీ  బెల్స్ మోగించేవాడు. సిబ్బంది కంగారు పడి అటూ ఇటూ పరిగెడుతుంటే ఆయనగారు విలాసంగా ఆనందించేవాడు. సిబ్బంది పనిచేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఇలా చేస్తున్నానని ముక్తాయింపు ఇచ్చేవాడు.

 ప్రెసిడెంట్ టాడీ రూజ్ వెల్ట్ వ్యవహారం మరీ విడ్డూరం. అయన ఒక సభలో ప్రసంగిస్తున్నారు.
"మీరు గమనించారో లేదో తెలియదు కాని, ఇప్పుడే ఓ దుండగుడు నన్ను తుపాకీతో కాల్చాడు" అంటూ ప్రసంగం కొనసాగిస్తూ పోయాడు. ఆయన చెప్పేది నిజమో అబద్దమో సభికులకు అర్ధం కాలేదు. అల్లా ఆయన గంటన్నర మాట్లాడుతూ పోయాడు. ప్రసంగం ముగిసిన తరువాత చూస్తే నిజంగానే ఆయన ఛాతీలో బుల్లెట్ దిగబడివుంది.

(మరికొన్ని ముచ్చట్లు తరువాత)

My weekly TV schedule from 1st June 2015


(With ref. to some friends' requests)
Every Monday from 7.30 am to 8 am - I News


Every Tuesday  from 7 am to 7.45 am - Maha News

Every Wednesday  from 7.30 am to 8.30 am - 6 TV


Every Thursday  from 7 am to 8 am - 10 TV


Every Friday from  8.30 am to 9.30 am - 99 TV


Every Saturday   from 7-30 am to  8.30 am - Express TV


Every Sunday from 7.30 am to 8.30 am - TV 5


(Evening debates flexible, no fixed dates and timings)  


NOTE: Courtesy Image Owners 

30, మే 2015, శనివారం

తెలంగాణా, శత కోటి ఆశల ఖజానా

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 31-05-2015,SUNDAY)
http://www.suryaa.com/pdf/display.asp?edition=0&page=4
(జూన్ రెండో తేదీ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా) 
తెలంగాణా పంచాయతీ రాజ్,  ఐ.టీ. శాఖల మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు, తండ్రి కేసేఆర్  లాగే చక్కని మాటకారి.  హైదరాబాదు ప్రెస్ క్లబ్  ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఒక మాటన్నారు, కోటి  ఆశలు, కోటి  అనుమానాల నేపధ్యంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణా  ఆవిర్భవించిందని. నిజమే. తెలంగాణ కోరుకున్నవారు కోటి  ఆశలు పెట్టుకున్నారు. కోరుకోనివారు కోటి  అనుమానాలు పెంచుకున్నారు. ఆశలు, అనుమాలాల సంగతేమో కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం మాత్రం జరిగిపోయింది. నీటి  మీద రాత కాకుండా  రాతి మీద గీత మాదిరిగా  తెలంగాణా అనేది ఇప్పుడు  ఒక చెరగని నిజం. చెరపలేని సత్యం. ఎదురుగా నిలబడి, కనబడుతున్న ఓ వాస్తవం.  
తెలంగాణా రాగానే కొత్త రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకు పోతుందని అనుకున్నవారు వున్నారు. కరెంటు కొరతతో కొత్త రాష్ట్రం చీకటిమయం  అవుతుందని  అంచనాలు కూడా వేసారు.  ఏడాది గడిచిపోయింది కానీ వారనుకున్నట్టు మాత్రం  జరగలేదు. పైపెచ్చు,  కనీవినీ ఎరుగని విధంగా ఈ వేసవిలో రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారయినా కూడా అధికారిక   కోతలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రత్యర్ధులు కూడా పరోక్షంలో అంగీకరిస్తున్న కేసీఆర్ సాధించిన అద్భుతం ఇది.
సమస్యలు అన్నింటికీ తెలంగాణా ఏర్పాటు ఒక్కటే సర్వరోగనివారిణి అనీ,  తెలంగాణా రాగానే ఏళ్ళతరబడి పేరుకునివున్ననీళ్ళూ, నిధులూ, ఉద్యోగాల వంటి ఈ ప్రాంతపు  సమస్యలన్నీ  మంత్రం వేసినట్టు  మాయం అయిపోతాయని  అనుకున్నవారూ వున్నారు. అప్పుడే  ఏడాది గడిచి పోయింది. అయితే,  వారనుకున్నట్టూ జరగలేదు. రాత్రికి రాత్రే  సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోలేదు.
అంటే ఏడాదిలో ఏమీ జరగలేదా  అంటే, జరుగుతుందని 'చాలామంది' భయపడ్డ ఒక విషయం మాత్రం జరగలేదు. హైదరాబాద్ ప్రత్యేకత ఏదీ చెరిగిపోలేదు, అదొక్కటే ఊరట కలిగించే విషయం. ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక  వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ  వ్యతిరేకి. కరడుగట్టిన  సమైక్యవాది. తన మనస్సులోని ఈ మాటని అయన ఏనాడూ  దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు  తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత  అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.  'డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి  అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యెక ఆకర్షణ, శోభ, సౌందర్యం  ఇవేవీ చెరిగిపోలేదు. ఇవన్నీ చరిత్ర పుటల్లో చేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ  పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో  పేర్కొన్నారు.
సంజయ్ బారు  చెప్పినట్టు భయాలు, అనుమానాలు, సందేహాలు అన్నీ కాకపోయినా కొన్నయినా తొలగిపోయాయి. అయితే తెలంగాణాపై తెలంగాణా  ప్రజలు  పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా? తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ చెప్పిన మాటలు ఏమిటి? చేస్తున్న ఆలోచనలు ఏమిటి? అసలు ఏడాది కాలంలో  చేసింది ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  
'అన్నీ ఆలోచనలేనా? ఆచరణలో ఏవీ?' అని అడిగే సందేహాస్పదులు కూడా వుంటారు. ఇలాటి వారందర్నీ రాజకీయ ప్రతికక్షులుగా పరిగణించి తేలిగ్గా  కొట్టిపారేయడం తగదు. ఎన్నికలకు  ముందు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ, ఏడాదిగా చేసిన పనులను మననం చేసుకుంటూ, అడగాలని అనుకుని అడగలేని బడుగులు కూడా తమను ఎన్నుకున్న జనాల్లో  ఉంటారని ఏలికలు గుర్తుపెట్టుకోవాలి. వీరికి జవాబు చెప్పనక్కరలేదు. వీరిని గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుపెట్టుకున్నట్టు కనిపిస్తే మాత్రం  కుదరదు. ఎందుకంటే అయిదేళ్ళు కాగానే అన్నీ గుర్తు పెట్టుకునే గుణం వారిలో వుంది.
'ఏడాదిగా ఏం చేస్తున్నారు' అనే ప్రశ్నకి జవాబు సర్కారు వద్ద సిద్ధంగా వుంది. 'బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏం చేయాలో అవన్నీ ఆలోచిస్తున్నాము' అనేది అ జవాబు. 'ఆలోచనలు ఆచరణలోకి రావడానికి ఇక ఎంతో కాలం పట్టదు' అనేది దానికి ముక్తాయింపు. కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు. 

   
ఆకాశ హర్మ్యాలు, ఆరు లేన్ల రహదారులు, హరితహారాలు, ప్రతి గడపకు  నల్లా నీళ్ళు, ప్రతి పొలానికీ సాగు నీళ్ళు, కనురెప్పపాటు కూడా పోని  కరెంటు, గొడ్డూ గోదాతో ఇంటిల్లిపాదీ హాయిగా కాపురం వుండే చక్కటి చిన్నారి లోగిళ్ళు, చదువుకునేవారికి దమ్మిడీ  ఖర్చులేని చదువు, చదువయిన వారికి కొలువు, చదువంటని వారికి తగిన ఉపాధి, ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి .......ఒకటా రెండా? ఇవన్నీ చదువుతున్నప్పుడు, వీటన్నిటి గురించి వింటున్నప్పుడు ఒక బక్కపలచటి మనిషి  మనస్సులో ఇన్నిన్ని  ఆలోచనలా! యెంత విడ్డూరం అనిపిస్తుంది. బంగరు తెలంగాణా తప్ప ఈ మనిషి కేసీఆర్ కు  వేరే ఏ ఇతర ఆలోచలు లేవా? రావా? అనికూడా అనిపిస్తుంది. ఇవన్నీ నెరవేరితే తెలంగాణా బంగారం కాకుండా ఉంటుందా! ఈ కలలు కల్లలు కాకూడదని కోరుకోనివారు తెలంగాణా గడ్డ మీద ఎవరయినా ఉంటారంటారా?
'స్వచ్చ తెలంగాణా! స్వచ్చ హైదరాబాదు' అసలు ఈ ఆలోచన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిది. అయినా  దానికి కొత్త మెరుగులు దిద్ది ఓ ఉద్యమంలా అమలు పరుస్తున్న తీరు చూస్తె, చెప్పిన ప్రతి పనీ చేసి చూపే సత్తా కేసీఆర్ కి వున్నదని ఆయన  ప్రత్యర్ధులు సయితం అంగీకరించే స్తితి. ఇది జాతీయ కార్యక్రమం. అయినా, దాన్ని ఓ వినూత్న పద్దతిలో అమలు చేస్తున్న తొలి రాష్ట్రం మాత్రం కేసీఆర్  నేతృత్వం వహిస్తున్న తెలంగాణాయే అన్నది సుస్పష్టం.
పుష్కర కాలం పైచిలుకు తన సారధ్యంలో సాగిన వేర్పాటు ఉద్యమం పుణ్యమా అని కేసీఆర్ రాజకీయాల్లో రాటు తేలారు. సమస్యలని తనకు అనుకూలంగా మలచుకునే విద్యను పుణికిపుచ్చుకున్నారు. ఉద్యమ మూల స్వభావం మారకుండా ఎప్పటికప్పుడు పరిస్తితులను బేరీజు వేసుకుని తదనుగుణంగా విధి విధానాల్లో, వ్యూహ ప్రతివ్యూహాల్లో మార్పులు చేసుకుంటూ కడకంటా లాక్కువచ్చారు. ఎంతో ఓపిక, ఎంతో ఏకాగ్రత వుంటే కానీ ఇది సాధ్యం కాని విషయం. ఈ పట్టుదలతోనే, అందరూ  అసాధ్యం అనుకున్న తెలంగాణా స్వప్నాన్ని  సుసాధ్యం చేసి కొత్తగా ఏర్పడ్డ ఇరవై తొమ్మిదో రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తన కలను కూడా సాకారం చేసుకోగలిగారు. వాస్తవానికి తెలంగాణా ఏర్పాటుకావడంలో  సోనియా గాంధీది కీలకమైన పాత్ర  అయినప్పటికీ, ఆ మొత్తం ఖ్యాతి తన ఖాతాలో పడేలా రాజకీయ చాతుర్యం ప్రదర్శించి ప్రత్యర్ధులను ఖంగు తినిపించారు. తనదయిన బాణీలో పాలన సాగించే క్రమంలో  ఎదురయిన ఎదురు దెబ్బలను ఒడుపుగా తనకు అనుకూలంగా మలచుకుంటూ, తెలంగాణా వాదం బలహీన పడకుండా ఎప్పటికప్పుడు దాన్ని ఎగదోస్తూ మొత్తం తెలంగాణాకు ఎదురులేని నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే,  ఈ క్రమంలో, బంగారు తెలంగాణా సాధన కోసం ఆయన నిశ్శబ్దంగా, నిరవధికంగా  చేస్తున్న ప్రయత్నాలకన్నా పార్టీని, ప్రభుత్వాన్ని స్తిరంగా, బలంగా ఉంచడానికి రాజకీయంగా  ఆయన అమలుచేస్తున్న వ్యూహ ప్రతివ్యూహాలే జనాలకు, ప్రత్యేకించి మీడియాకు కొట్టవచ్చినట్టు కానవస్తున్నాయి. రాజకీయ నాయకులకి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులకి ఇవన్నీ తప్పనిసరే. కాదనము. కాకపొతే, ఇవే ప్రముఖంగా కనబడి, అసలు కనబడాల్సిన ఇతర అభివృద్ధి అంశాలు నేపధ్యంలోకి వెళ్ళిపోవడం దీర్ఘకాలంలో ఏ పార్టీకి అంత మేలు చేసే విషయం కాదు. ఇది చరిత్ర చెప్పే సత్యం.          
ఆంధ్ర ప్రదేశ్ అంటే హైదరాబాదు అని జనం నమ్మేలా చేసి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పొరబాటు చేసారు. కాకపొతే, అభివృద్ధి యావత్తూ ఒకే నగర కేంద్ర బిందువుగా  జరగడంవల్ల హైదరాబాదుకు మంచి మేలే జరిగింది. విశ్వ నగరంగా అది దేశ విదేశాల్లో కొత్త ప్రాచుర్యం పొందింది. ఎక్కడెక్కడి దేశాలవారికీ హైదరాబాదు ఒక గమ్యస్థానంగా మారింది. బయటి పెట్టుబడులకు చక్కని స్థావరంగా తయారయింది.  సంజయ్ బారు చెప్పినట్టు పాతకాలంలో కూడా  హైదరాబాదుకు మంచి పేరే వుండేది. చక్కటి వాతావరణం. భాషాబేధాలు లేకుండా  కలిసిమెలిసి వుండే  ప్రజలు.   అయితే అప్పట్లో  కొన్ని పరిధులు, మరికొన్ని పరిమితులు. ఇప్పుడలా కాదు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకదానిగా పేరు తెచ్చుకుంది. పెట్టుబడుల ఆకర్షణకు ఈ కొత్త పేరు చాలా వరకు ఉపయోగపడింది.   అయితే వికేంద్రీకరణ విషయంలో  కొన్ని జాగ్రత్తలు తీసుకోని కారణంగా అది ప్రాంతీయ భావాలు పెచ్చరిల్లడానికి, ప్రాంతీయ అసమానతలు పెరగడానికి  కూడా దోహదం చేసింది.
ఇప్పుడు మళ్ళీ టీ.ఆర్.యస్. సర్కారు సయితం అదే పొరబాటు చేయబోతున్నదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. హైదరాబాదు అంటే రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాలు మాత్రమే అని చంద్రబాబు చేసిన ప్రయోగం మంచికంటే చెడు ఎక్కువ చేసింది. అభివృద్ధి యావత్తూ ఒకచోటే కేంద్రీకృతమై మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి ఫలాలకు దూరంగా వుండిపోయాయి. రాష్ట్ర విభజన అత్యంత క్లిష్టంగా మారడానికి దోహదం చేసిన అంశాలలో ఇదొకటి.  కేసీఆర్ మరో రెండు మూడు జిల్లాలు కలిపి హైదరాబాదు నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసే ఆలోచనలు చేస్తున్నారు. హెచ్.ఎం.డీ.ఏ. పరిధిని విస్తరించాలని అనుకుంటున్నారు. అయితే ఈ ప్రయత్నం  మరో 'షో కేస్' ప్రయోగం కాకూడదు. విశ్వ నగరం నమూనాను ప్రపంచానికి చూపి హైదరాబాదును మార్కెట్ చేయడానికి ఈ ఆలోచన పనికి వస్తుందేమో కాని మొత్తం వెనుకబడిన తెలంగాణాను బంగారు తెలంగాణాగా మార్చడానికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. భవిష్యత్తులో అసమానతలకు చోటిచ్చే విధంగా సాగే ఏ రకంయాన అభివృద్ధి, సమతూకంతో, సమన్యాయంతో  కూడిన పురోగతి అనిపించుకోదు. ఈ వాస్తవాన్ని టీ.ఆర్.యస్. అధినాయకత్వం గుర్తెరిగి అడుగులు వేయడం మంచిది.
ఎన్నికలకు ముందు చెప్పినవి అన్నీ చేసి చూపించడం మానవ మాత్రులకు సాధ్యం కాని పని. కానీ, అన్నీ కాకపోయినా కొన్ని అయినా చేసి చూపించడం రాజకీయ పార్టీల ధర్మం. లేని పక్షంలో రాజకీయ నాయకుల వాగ్దానాలపట్ల ప్రజల్లో విశ్వాసం కుదురుకోవడం కష్టం. ఇది ప్రజాస్వామ్యానికి మేలు చేయదు.        
చూస్తుండగానే ఏడాది పుణ్యకాలం చరిత్ర పుటల్లోకి చేరిపోతోంది. చరిత్రలో నిలబడి పోవాలంటే చేయాల్సినవి చాలా వున్నాయి. ప్రజలు తమ తీర్పు ద్వారా అప్పగించిన సమయంలో మిగిలివున్న వ్యవధానం నాలుగేళ్లే.
పరిష్కారం కాకుండా వున్న తెలంగాణా సమస్యలు అన్నింటికీ పాత పాలకుల పాపమే కారణం అన్న వాదన ఇన్నేళ్ళు జనంలో చాలామంది నమ్మారు. ఇంకా కొన్నాళ్ళు నమ్ముతారు. మరి కొన్నాళ్ళ తరువాత నమ్మేవాళ్ళు తగ్గిపోవచ్చు. అసలు మిగలకపోవచ్చు.
ఏ రంగంలో అయినా   శాశ్వతంగా నిలదొక్కుకోవాలి అంటే నిజాయితీ, నిబద్దత, విశ్వసనీయత చాలా ముఖ్యం. రాజకీయాలకి ఈ సూత్రం మరింత బాగా అన్వయిస్తుంది.
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, విమానాశ్రయాలు కాదు, మొత్తం ప్రజానీకం అభివృద్ధి చెందడమే నిజమైన అభివృద్ధి అని కేసీఆర్ చెబుతుంటారు. ఆయన అదృష్టం ఏమిటంటే చెప్పింది చేసి చూపెట్టగల అధికారం, అవకాశం  ఆయన చేతుల్లోనే వున్నాయి. చూడాలి ఏం చేస్తారో! (30 - 05 - 2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
NOTE: COURTESY IMAGE OWNER

29, మే 2015, శుక్రవారం

కలిసిన ధృవాలు


ఆయనకు రామారావు సినిమాలు ఇష్టం. ఆవిడకు నాగేశ్వర్రావంటే పిచ్చి. ఆయనకు రంగనాయకమ్మ రచనలు ఇష్టం. ఆవిడ పొద్దస్తమానం యద్దనపూడి పుస్తకాలు ముందేసుకు కూర్చుంటుంది. ఆయనకు ఉల్లిపాయ పకోడీలు ఇష్టం. ఉల్లిపాయ పేరు చెబితే ఆమెకు వాంతి. ఆయనకు పేపర్లు ముద్దు. ఆవిడకి టీవీ సీరియళ్లు తప్ప వార్తలు పట్టవు. ఆయనకు ఐస్ క్రీం పడదు. కొంకర్లు పోయే చలికాలంలో కూడా ఐస్ క్రీం తినడం ఆవిడకి ఇష్టం.   తీర్ధయాత్రలు చేయాలని ఆవిడ కోరిక. సాయంకాలపు  'తీర్ధ'యాత్రలు తప్ప పుణ్య క్షేత్రాల గొడవ ఆయనకు పట్టదు. ఇలా వారి అభిరుచులు, అభిప్రాయలు ఒకదానికొకటి పొసగవు. ఇద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం. అయినా సరే వారి దాంపత్య జీవితం ఎలాటి ఒడిదుడుకులు లేకుండా యాభయ్ ఏళ్ళుగా  సాగిపోతోంది.

అద్భుతాలు చూడాలంటే హాలీవుడ్ సినిమాలే కాదు, అప్పుడప్పుడూ జీవితాల్లోకి కూడా తొంగి చూస్తుండాలి సుమా!  


NOTE : COURTESY IMAGE OWNER