11, మే 2015, సోమవారం

బుక్ షెల్ఫ్ ..........


ప్రతి రాజకీయ పార్టీలో క్రమశిక్షణ లేకపోయినా క్రమశిక్షణా సంఘం అంటూ ఒకటి వుంటుంది. 'దొంగవాడికి మడిబట్టలు అడ్డమా' అన్నట్టు ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవారిని ఈ సంఘాలు ఏమీ చెయ్యలేవు. కాకపొతే పార్టీ నుంచి బహిష్కరించే వీలుంటుంది. స్వగృహ ప్రవేశం పేరుతొ ఎంచక్కా  తిరిగి పార్టీలో చేర్చుకుంటున్న రోజుల్లో, నిజం చెప్పాలంటే ఎవరికి వారే పార్టీలో తిరిగి  చేరిపోతున్నట్టు పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటున్న కాలంలో 'బహిష్కరణ వేటు' అనేది  ఏమేరకు ఉపయోగం అనేవారూ వున్నారు.
క్రమశిక్షణ పేరుతొ వేటు వేసేముందు ఆ  సంఘం వారు ఒక నివేదిక ఇస్తారు. అభియోగాలను విచారించేందుకు సీనియర్ సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. వారు దర్యాప్తు చేస్తారు. పార్టీ అధ్యక్షుడికి ఒక నివేదిక సమర్పిస్తారు. ఒక పద్దతి అంటూ సాగని  వ్యవహారాలపై విచారణ తతంగం మాత్రం  పద్దతి ప్రకారమే జరుగుతుంది. అలా నియమాలను తోసిరాజని ప్రవర్తించిన సభ్యులను పార్టీ నుంచి తొలగించాలని సంఘం చేసిన సిఫారసును పార్టీ అధ్యక్షులు ఆమోదించి తదనుగుణంగా ఆ సభ్యుడిని బహిష్కరించినట్టు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంటారు. అయితే సంఘాల నివేదికల్లో ఏమి పేర్కొన్నదీ బయట ప్రజలకి తెలియదు. పార్టీలో వారికీ తెలియదు. కానీ కొన్ని సందర్భాలలో ఆ అంశాలు బహిర్గతం అవుతుంటాయి. అలా మరుగున పడిపోయిన ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తుంటాయి.
అలాటి సందర్భం తెలుగుదేశం అధినాయకుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నకాలంలో జరిగింది. ఎన్టీఆర్ హయాములో తెలుగు దేశం పార్టీకి సుశిక్షితమైన, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని పేరుండేది. అలాటి ఆ పార్టీలో,  సీనియర్ సభ్యురాలయిన రేణుకా చౌదరిపై ఒక సారి ఇలాగే త్రిసభ్య బృందాన్ని ఏర్పాటు చేసి ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తు జరపమని స్వయానా పార్టీ అధ్యక్షులవారే ఆదేశించారు. శ్రీమతి టీ.ఎన్. సదాలక్ష్మి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రతాపరెడ్డి త్రిసభ్య కమిటీలో  సభ్యులు. సమావేశం అనంతరం  ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇలా వుంది.
"ఇది నా ఆఫీసు, ఈ సిటీ నాది. ఈ సిటీ మొత్తం మీద పెత్తనం నాది. నా అనుమతి లేకుండా నువ్వు (బుచ్చయ్య చౌదరి) ఎవడవురా రావడానికి? వాడు (ఎన్టీఆర్) ఎవడురా పంపడానికి? కొడకా! చేపలు అమ్ముకునే వెధవా? ఏం పీకుతావురా? ఇదేమన్నా గోదావరి అనుకున్నావా?" అని రేణుకా చౌదరి లంకించుకునేసరికి సమావేశాన్ని వాయిదా వేసుకుని త్రిసభ్య సంఘం వారు బయట పడ్డారు. అయినా ఆమె ఒదిలిపెట్టలేదు. తన అనుచరులకు బుచ్చయ్య చౌదరిని చేయితో చూపిస్తూ, 'డక్కా మారో సాలేకో!' అంటూ రేణుకా చౌదరి వారి వెంట పడ్డారు.
ఇంత  జరిగిన తరువాత కూడా రాజీ కుదర్చడానికి ఆఖరు నిమిషంలో పెద్ద తలకాయలే రంగంలోకి దిగాయి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా రాజీ కోసం తాము  చేసిన ప్రయత్నాలను కమిటీ సభ్యురాలు సదాలక్ష్మికి  వివరించారు. అటు రేణుకా చౌదరి ప్రతిష్ట దెబ్బతినకుండా, ఇటు   రామారావు ఆదేశాన్ని పాటించే విధంగా 'తెలియకుండా జరిగిపోయింది. క్షమించాలి' అని కోరుతూ ఒక లేఖ ఎన్టీఆర్ కి అందచేయాలని తామూ,  చంద్రబాబు నాయుడు రేణుకా చౌదరిని కోరామనీ, అందుకు ఆవిడ కూడా అంగీకరించారనీ, అయితే తెల్లారేసరికల్లా ఏం జరిగిందో కాని మొత్తం పరిస్తితి మారిపోయిందనీ సదాలక్ష్మి చెప్పారు. శ్రీ రామారావుకు ఇష్టం లేకున్నా ఆయనకు నచ్చచెప్పి ఈ రాజీ ప్రయత్నాలు చేసామని సదాలక్ష్మి తెలపడం విశేషం. ఇంత చేసినా పార్టీ నుంచి రేణుకా చౌదరి బహిష్కరణ తప్పలేదు. ఈ ఉదంతాన్ని చంద్రబాబు నాయుడికి ఓటమిగా, దగ్గుబాటి, లక్ష్మీ పార్వతి వర్గాల విజయంగా అప్పట్లో పార్టీలో పరిగణించారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ తరువాత రేణుకా చౌదరి లెక్క చేసేది ఒక్క చంద్రబాబునే. ఆమె అంటే బాబుకు కూడా అభిమానం. అందుకే రేణుక  బహిష్కరణ పట్ల ఆయన ఖిన్నులయ్యారు.
బహిష్కరణ నిర్ణయంతో రేణుకా చౌదరి ఏ మాత్రం బెదరలేదు. పైపెచ్చు సంచలన వ్యాఖ్యలు చేసారు. 'నన్ను బహిష్కరించి ఎన్టీఆర్ ఇన్నాల్టికి మగాడనిపించుకున్నాడు. థాంక్స్.' ఇదీ ఆవిడ ప్రతిస్పందన.
(తదనంతర కాలంలో వడివడిగా సాగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, రేణుకా చౌదరిని తిరిగి తెలుగు దేశం పార్తీలోకి చేర్చుకోవడం జరిగాయి.  కాని, రేణుక ఇమడ లేకపోయారు. మూడోసారి రాజ్యసభ టిక్కెట్టు ఇవ్వనందుకు బాబు వైఖరిపై కినిసి రేణుకా చౌదరి, కాంగ్రెస్ లో చేరి 1999 ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్టుపై ఖమ్మం నుంచి లోక సభకు ఎన్నికయ్యారు) 

  

(సీనియర్ జర్నలిష్ట్  ఐ. వెంకట్రావు, ఎన్టీ రామారావు పై రాసిన  'ఒకే ఒక్కడు' పుస్తకం ఆధారంగా)                   

9, మే 2015, శనివారం

స్వచ్చ భాగ్య నగరం : మంచి కార్యక్రమం

(Published in 'SURYA' telugu daily in it's edit page on 10-05-2015, SUNDAY)

నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో నాటి సోవియట్ యూనియన్ అధినాయకుడు కృశ్చెవ్ అధికార పర్యటనపై ఢిల్లీ వచ్చారు. పాలం విమానాశ్రయంలో  స్వాగతం పలకడానికి నెహ్రూ స్వయంగా వెళ్ళారు. అనంతరం విదేశీ అతిధిని వెంట బెట్టుకుని జవహర్ లాల్ నెహ్రూ కారులో నగరానికి వస్తున్నారు. మార్గ మధ్యంలో అక్కడక్కడా కొందరు పౌరులు  ముంగాళ్ళ మీద కూర్చుని కాలకృత్యాలు తీర్చుకోవడం కృశ్చెవ్ కంట పడింది. అదేమిటని అడిగిన కృశ్చెవ్  ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పడానికి నెహ్రూ గారికి తల కొట్టేసినంత పనయింది.   
అప్పటినుంచి ఇప్పటివరకు ఏళ్ళకు ఏళ్ళు గడిచిపోయాయి. పరిస్తితులు కాసింత మెరుగుపడ్డాయేమో కాని పూర్తిగా మారిపోయిందని చెప్పలేని పరిస్తితి ఈనాటికీ మిగిలివుంది.
ఇన్నేళ్ళ కాలంలో తలెత్తుకుని గర్వంగా చెప్పుకోగల అనేక ఘన విజయాలను ఎన్నింటినో స్వతంత్ర భారతం సాధించింది. అయినా కానీ, పరిసరాల పరిశుభ్రత విషయంలో ఇంకా తలదించుకోవాల్సిన స్తితిలోనే వుంది. సిగ్గుపడుతూ ఒప్పుకోవాల్సిన వాస్తవం ఇది.
విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారిని ఎవరినయినా కదిపి చూడండి. వాళ్ళు చెప్పేది ఒక్కటే.   
'నిజమే. మంచి రోడ్లు పడ్డాయి. మంచి సౌకర్యాలు వున్న భవంతులు కట్టారు. మంచి మంచి కార్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. మంచి నాణ్యత కలిగిన వస్తువులు దొరుకుతున్నాయి. అమెరికా వంటి దేశాలతో పోటీగా మంచి మంచి జీతాలు ఇచ్చే కంపెనీలకు కూడా కొదవలేదు. అంతా మంచిగానే వుంది. లేనిదల్లా స్వచ్చమైన వాతావరణం. పరిశుభ్రమైన పరిసరాలు. ఇవి గనక మన దేశంలో  వుంటే ఇక విదేశాలను పట్టుకుని బయటే  వేళ్ళాడే వాళ్ళు ఉంటారని ఎవ్వరం అనుకోవడం లేదు.'
అమెరికా వంటి దేశాల్లో స్థిరపడ్డ యువతీ యువకులు అనేకమంది స్వదేశం తిరిగి రావడానికి విముఖత చూపుతూ చెప్పే ప్రధాన కారణాల్లో ఇదొకటని తెలుసుకున్నప్పుడు  ఎంతో బాధ వేస్తుంది.  ఒకానొక కాలంలో ప్రపంచ దేశాలకు పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం ఎలాటిదో  ప్రబోధించిన ఘనత  భారత దేశానిది. ఇప్పుడదే అంశం దేశానికి తలవంపులు తెచ్చే విషయంగా మారడం యెంత విషాదం.
విదేశాల్లో స్థిరపడ్డ మన వారిని అలా వుంచండి.
'ఇక్కడికి రండి. అన్ని సదుపాయాలు కల్పిస్తాం. పరిశ్రమలు పెట్టండి' అనే నినాదంతో మన నాయకులు రోజుకోదేశం చుట్టబెడుతున్నారు.వారి ఆహ్వానాలు అందుకుని   అలా వద్దామని అనుకున్న వారికి కూడా మన దేశంలో 'చెత్త' సమస్యే ముందుగా అడ్డుపడుతోంది.
బహుశా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 'మేక్ ఇన్ ఇండియా' నినాదం ఎత్తుకోవడానికి ముందుగా 'స్వచ్చ భారత్' ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి కూడా ఇదే ప్రధాన కారణం అయివుంటుంది.
కొన్ని రోజులు హడావిడి తరువాత ఆ ఉద్యమం కాస్త సద్దుమణిగిన ఛాయలు కానవచ్చే తరుణంలో తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు దానికి కొత్త ఊపిరి ఊదే ప్రయత్నం మొదలు పెట్టారు.
హైదరాబాదును విశ్వనగరంగా తయారు చేయాలంటే ఆకాశ హర్మ్యాలు, ఆరు లేన్ల రహదారులు వుంటే సరిపోదని, కాలుష్య రహిత స్వచ్చ నగరంగా తీర్చిదిద్దినప్పుడే భాగ్య నగరానికి ఆ శోభ దక్కుతుందని గ్రహించి కాబోలు, రెండు బృహత్తర కార్యక్రమాలను కేసీఆర్ తలపెట్టారు. అందులో ఒకటి ఆదిలోనే అనేక విమర్సలకు దారి తీసింది. నగరం నడిబొడ్డున, దుర్గంధ కాసారంగా తయారయిన హుసేన్ సాగర్ సరస్సును మంచి  నీటి తటాకంగా మార్చి దానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న తెలంగాణా ముఖ్యమంత్రి అభిమతానికి అనుగుణంగా అధికారులు తక్షణ చర్యలు ప్రారంభించారు. వెనువెంటనే,  కొన్ని రాజకీయ పరమైన ఆరోపణలు, మరి కొన్ని న్యాయపరమయిన చిక్కులు ఎదురయ్యాయి. హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వానికి కొంత ఊరట,  ప్రభుత్వ ప్రయత్నాలకు కొంత బాసట దొరికింది. ఏళ్ళ తరబడి హుసేన్ సాగర్ లోకి చేరుతున్న భయంకర రసాయనిక వ్యర్ధాలను తొలగించే క్రమంలో మరింత వాతావరణ  కాలుష్యం ఏర్పడి, ప్రజల ఆరోగ్యానికి ముప్పువాటిల్లే ప్రమాదం వుండగలదని పర్యావరణ ప్రేమికుల అనుమానం. అందులో కొంత నిజం ఉండవచ్చు. కానీ రసాయనిక వ్యర్ధాలు ఇప్పటి మాదిరిగానే ఆ సరస్సులో ఇలాగే పేరుకుపోతూ వుంటే భవిష్యత్తులో ఆ సరస్సు ఉనికి మరింత ప్రమాదకారిగా మారే అవకాశాలు కూడా వుంటాయి. వ్యాధికంటే చికిత్స ప్రమాదకరం అనే వాదన వున్నా, ప్రస్తుత పరిస్తితుల్లో ప్రక్షాళనే ఉత్తమ పరిష్కారం అవుతుంది. సాధారణంగా పాలకులకు ఇటువంటి ఆలోచనలు కలగడమే అపూర్వం. అలాటి ప్రతిపాదనలను మరింత మెరుగు పరచి ఏవైనా లోపాలు వుంటే సరిదిద్దే ప్రయత్నాలు జరగాలి కానీ, అసలుకే మోసం వచ్చేలా మోకాలు అడ్డడం కూడా మంచిది కాదు. గతంలో హుసేన్ సాగర్లో గుర్రపు డెక్క సమస్య చాలామందికి గుర్తుండే వుంటుంది. నిర్విరామ కృషి కారణంగా సాగర్ కు ఆ సమస్య శాస్వితంగా తొలగిపోయింది. ఇప్పుడు హుసేన్ సాగర్ ప్రక్షాళన కూడా అదేవిధంగా పూర్తయితే జంట నగరాలకు కొత్త అందాలు అద్దినట్టు అవుతుంది.  

   

స్వచ్చ నగరంగా మార్చాలనే నే ప్రయత్నం యెంత మంచిదో ఆలోచన అంత భారీ స్థాయిలోనే వుంది. ప్రధాని మోడీ జాతికి అందించిన స్వచ్చ భారత్ నినాదానికి కేసీఆర్ తన ఆలోచనలతో మరిన్ని మెరుగులు దిద్దారు. మొత్తం తెలంగాణాను, ముందుగా రాజధాని నగరాన్ని కాలుష్య రహిత పరిశుద్ధ నగరంగా రూపొందించాలని పధకాలు తయారు చేసారు. హైదరాబాద్ నగరాన్ని ఇందుకోసం 400 విభాగాలుగా చేసి ఒక్కొక్క దానికి గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులను బాధ్యులుగా వుంచి ఒక నిర్ణీత కాలవ్యవధిలో నగరంలో పేరుకు పోతున్న చెత్త సమస్యకు శాస్వితంగా ఒక మంచి పరిష్కారం కనుగొనడం ఈ మొత్తం కసరత్తు లక్ష్యం. ఈ మహాయజ్ఞంలో స్వచ్చందంగా పాలుపంచుకోవడానికి ముందుకువచ్చే  పౌరులతో, చిన్న చిన్న బృందాలు ఏర్పాటు చేస్తారు. నగరంలోని మారు మూల ప్రాంతాలలో  పోగుపడిన చెత్తను గుర్తించే బాధ్యత ఈ బృందాలు తీసుకుంటాయి. రెండు రోజుల్లో ఈ బృందాలు  నివేదికలు ఇస్తాయి. ఈ నెల పదిహేనవ తేదీకల్లా నగర నివేదిక తయారవుతుంది. ఆ మరునాడు అంటే పదహారో తేదీన స్వచ్చ హైదరాబాదు కార్యక్రమం మొదలవుతుంది. రెండు మూడు రోజుల వ్యవధిలోనే నగరం మొత్తంలో పేరుకుపోయిన చెత్తను తొలగించడం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చెత్తను తొలగించేందుకు అవసరమైన వాహనాలను, సిబ్బందినీ  నగర పాలక సంస్థ సమకూరుస్తుంది. ఇళ్ళలో పోగుపడిన తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి  పారవేయడానికి ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను ప్రభుత్వమే అందచేస్తుంది.
విశ్వనగరంగా మార్చే  క్రమంలో హైదరాబాదును పరిశుద్ధ నగరంగా చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్   ఆలోచనను ఎవ్వరూ తప్పుపట్టలేరు. వచ్చిన చిక్కల్లా, ఆలోచనలకు, ఆచరణకు మధ్య పెరిగిపోతున్న దూరమే.  అనుభవాలు తెలియచెప్పుతున్నది కూడా ఇదే.  దీనికి తాజా ఉదాహరణ, మొన్నీ మధ్య నగరంలో అట్టహాసంగా నిర్వహించిన టీ ఆర్ ఎస్ ఆవిర్భావ సభలే. ఆర్భాటంగా నగరాన్ని గులాబీ తోరణాలతో ముంచెత్తి వేసారు. ఆ తరువాత వాటిని తొలగించే నాధుడే లేదు. చెత్త పేరుకుపోవడానికి ఇలాటివి కూడా కారణాలే అన్న సంగతి మరువకూడదు.  
గతంలో ప్రధాని నరేంద్ర  మోడీ స్వచ్చ భారత్ ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడు జరిగిన హడావిడి అందరికీ గుర్తే. వారణాసిలో ప్రధాని మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఆసేతు హిమాచలం వెల్లువలా సాగింది. ఇంకా సాగుతోంది.   కానీ ఫలితాలు ఆ స్థాయిలో లేవన్నది మాత్రం నిర్వివాదాంశం. ఖరీదయిన దుస్తులు ధరించిన నాయకులు, అధికారులు, సంఘంలో అత్యంత గౌరవ స్థానాల్లో వున్న ప్రముఖులు    చేత చీపుర్లు పట్టి వీధుల్ని శుభ్రం చేస్తున్న దృశ్యాలు కోకొల్లలుగా మీడియాలో కానవచ్చాయి. ఇళ్ళకు వెళ్ళగానే వాళ్ళందరూ తమకంటిన మురికిని ఒదిలించుకునే వుంటారు. ఆ మురికితో పాటే ఇంత  గొప్ప కార్యక్రమం కొనసాగింపు ఆలోచన  కూడా ఒదిలిపోయేవుంటుంది.
స్వచ్చ భారత్ ఉద్యమం ప్రజల భాగస్వామ్యంతో  సాగించాలనేది నేతల తలంపు. అసలీ ఉద్యమం ప్రజలనుంచి మొదలు కావాలి. అందుకు ప్రభుత్వ సహకారం కావాలి. ఎవరింటిని వారు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి చేసే కృషిలో పదోవంతు తమ పరిసరాల పరిశుభ్రత పట్ల కూడా కనబరిస్తే ఈ చెత్త సమస్య ఇంత చెత్తగా మారివుండేది కాదు.
సరే! చెత్తను తొలగించాలనే కార్యక్రమం ఏ కోణం నుంచి చూసినా మంచి కార్యక్రమమే. ఇది ఏదో మొక్కుబడిగా కాకుండా నిరంతరం జరుగుతూ పోతేనే  మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే, కంటికి కనబడే చెత్తను మాత్రమె కాదు, కనబడని  మానసిక కాలుష్యాన్ని కూడా ఏదో ఒక మేరకు తగ్గించుకోగలిగితే సమాజానికి మరింత మేలు జరుగుతుంది.   
ఉపశృతి: ఇద్దరు సన్యాసులు అడవి మార్గాన వెడుతున్నారు. దారిలో యేరు అడ్డం  వచ్చింది. కాలి గాయంతో అక్కడ కూలబడి వున్న ఓ అందమైన యువతి వారికి కనిపించింది. ఇద్దరిలో ఒకడు ఆమెను రెండు చేతులతో ఒడిసిపట్టుకుని యేరు దాటించి వొదిలివేసాడు. దగ్గరిలోవున్న  గ్రామం చేరేవరకు ఉగ్గపట్టుకుని వున్న  రెండో సన్యాసి తన మనసులో మాట బయట పెట్టాడు. 'నువ్వా అమ్మాయిని అలా మోసుకురావడం ఎందుకో నాకు అంత  మంచిగా  అనిపించ లేదు'
మొదటి సన్యాసి బదులు చెప్పాడు.
'నేనా అమ్మాయిని అప్పుడే, అక్కడే  దించి వేశాను. నువ్వే ఇంకా ఆమెను మనసులో పెట్టుకుని మోస్తున్నావు'  
(09-05-2015)  
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com,  మొబైల్: 98491 30595

  

5, మే 2015, మంగళవారం

కావాల్సింది పట్టుదల- పంతాలు కాదు


(Published by 'SURYA' telugu daily in it's edit page on 07-05-2015, THURSDAY)

మొన్నీమధ్య కారులో  వెడుతున్నప్పుడు  హైదరాబాదులో నిర్మాణంలో వున్న మెట్రో ని గమనిస్తూ డెబ్బయ్యవ పడిలో పడ్డ ఒక పెద్దమనిషి, తన జ్ఞాపకాలను ఇలా నెమరు వేసుకున్నారు.
"అత్యంత పొడవైన  పీవీ నరసింహారావు హైవే నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళినప్పుడల్లా ఈ హైవే నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు దానిమీద ప్రయాణం చేద్దామా అనే కోరిక దారిపొడుగునా  నాలో సుళ్ళు తిరుగుతూ వుండేది. చూస్తుండగానే అది పూర్తికావడం, ఆ మార్గంలో అనేక వందల సార్లు ప్రయాణించడం జరిగిపోయింది.
"అల్లాగే ఔటర్ రింగ్ రోడ్డు. అదీ అంతే. ఇంత  పెద్ద ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేస్తారో, ఎప్పుడు చూస్తానో అనుకునేవాడిని. ఆ కోరికా తీరిపోయింది. ఇక ఈ మెట్రో. రేపో మాపో ప్రారంభం అని వార్తలు వింటున్నాను.


(చాలా ఏళ్ళ కిందట హుస్సేన్ సాగర్ మొత్తం ఇలా  గుర్రపు డెక్కతో నిండి వుండేది) 

"గతంలో హుసేన్ సాగర్ తటాకం గుర్రపు డెక్క మొక్కలతో మొత్తం పచ్చగా పాచిపట్టినట్టు అసహ్యంగా కానవచ్చెది. అధికారులు ఎన్ని సార్లు ఎన్ని తాత్కాలిక ప్రయత్నాలు చేసినా, గుర్రపు డెక్క మాత్రం ఖండించిన రావణాసురుడి శిరస్సుల మాదిరి తిరిగి మొలుచుకు వచ్చేది. దరిమిలా ఆ కార్యక్రమాన్ని ఒక యుద్ధప్రాతిపదికపై తలకెత్తుకున్న తరువాత ఆ  గుర్రపు డెక్క పీడ హుస్సేన్ సాగర్ కి శాస్వితంగా తొలగిపోయింది. ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, హుసేన్ సాగర్ ను మంచి నీటి సరస్సుగా మార్చి దానికి పూర్వ వైభవం తీసుకురావాలనే బృహత్తర ప్రయత్నం మొదలు పెట్టారు. అది సాకారం అయి అది కూడా చూడగలిగితే ఎంతో అదృష్టం అనుకుంటాను.
"పొతే,  'అమరావతి' (ఆంద్ర ప్రదేశ్ కొత్త రాజధాని) ని  కూడా కళ్ళారా చూడాలనే కోరిక నాలో నానాటికీ  పెరుగుతోంది'
నిజానికి ఇదేమంత తీరని కోరికేమీ కాదని  నాకప్పుడు  అనిపించింది. ఎందుకంటె ఈ రోజుల్లో నిర్మాణ రంగంలో వచ్చిన పురోగతి అలాటిది.  ప్రభుత్వాలకు, పాలకులకు  పట్టుదల, చిత్తశుద్ధి ఉండాలే కాని సాధ్యం కానిది ఏదీ లేదు. చైనాలో కేవలం పదిహేను రోజుల్లో ముప్పై అంతస్తుల భవనం నిర్మించినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, గతంలో మాదిరిగా ప్రతి పైసాకు వెతికి చూసుకోవాల్సిన పరిస్తితులు ప్రభుత్వాలకు ఈనాడు లేవు. అన్నీ 'బీవోటీ' (బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్)  అనే కొత్త పారిభాషిక పదం   చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. సక్రమంగా ప్రణాళిక తయారు చేసి, పారదర్శకంగా టెండర్లు పిలిచి పనులు ఒప్పచెప్పడమే తరువాయి మిగిలిన పనులన్నీ  వాళ్ళే చూసుకుంటారు. యెంత పెద్ద ప్రాజెక్టు అయినా సరే కాంట్రాక్టుకు తీసుకున్న కంపెనీలే మొత్తం భారాన్ని  తమ నెత్తికి ఎత్తుకుంటాయి. ఇప్పుడు మన కళ్ళెదుట కానవస్తున్న మెట్రో రైలు మార్గం, ఔటర్ రింగు రోడ్డు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, దేవుడు మేలు చేస్తే రేపో మాపో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో సాకారం కాబోతున్న అనేకానేక ప్రాజెక్టులు, ఇవన్నీ ప్రత్యక్ష తార్కాణాలు.  కాకపొతే లాభం లేని పనులు చేయడానికి  ఏ వ్యాపారీ ముందుకు రాడు అన్న నిజం తెలిసికూడా ప్రభుత్వాలు ఈ మార్గాన్నే ఎంచుకోవడానికి కారణం  తమపై ఎలాటి ఆర్ధిక  భారం లేకపోవడమే. ఇంతంత గొప్ప నిర్మాణాలను ఇంత  తక్కువ వ్యవధిలో ప్రభుత్వాలు ఇంత చక్కగా ఎలా చేయగలుగుతున్నాయి  అని ఎవరయినా అమాయకంగా అనుకుంటే,  ఆ   'ఖ్యాతి' కూడా అప్పనంగా వాటి  ఖాతాలోనే పడిపోతోంది.  కాకపొతే ఆ నిర్మాణ వ్యయాన్ని వడ్డీతో సహా వినియోగదారులనుంచి 'టోల్ టాక్సు' పేరుతొ అనేక సంవత్సరాలపాటు ఆ కంపెనీలు ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటాయి. గుడారంలో కాళ్ళు చాపుకోవడానికని చెప్పి మొత్తం ఆక్రమించిన ఎడారి ఒంటె కధ గుర్తుకువస్తే చేయగలిగింది లేదు.   అదే వేరే కధ. ఆ వ్యధతో ఏ ప్రభుత్వాలకీ నిమిత్తం వుండదు.
ఆంద్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి వచ్చే నెలలో శంకుస్థాపన జరగబోతోందని సమాచారం. ఇప్పటికే ఆలస్యం అయిందని అనుకుంటున్న ఈ కార్యక్రమానికి శుభారంగం జరగబోవడం ఆహ్వానించతగిన పరిణామం. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలతో కొత్త రాజధాని నిర్మాణం జరపాలని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తలపోస్తున్నారు. ఆయన ఆలోచనలన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా క్షేత్ర స్థాయిలో ఒక స్వరూపానికి వస్తే ప్రపంచపటంలో కొత్త రాష్ట్రానికి సరికొత్త స్థానం దొరకడం ఖాయం. అయితే ఆలోచనలు ఆకాశం,లో ఆచరణ అఘాధంలో అంటూ వెల్లువెత్తుతున్న విమర్శలను తిప్పికొట్టాలంటే కేవలం మంత్రులు అప్పుడప్పుడూ ఇస్తున్న హామీ  ప్రకటనలు ఎంతమాత్రం సరిపోవు. ఆ దిశగా వడివడిగా అడుగులు పడాలి. అవీ త్వరత్వరగా.
ఈ సందర్భంలో కొన్ని రాజధానుల నిర్మాణం గురించి చరిత్ర చెప్పే వాస్తవాలను వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.
మన దేశం ఎల్లలు దాటి కొత్త దేశాల్లో కొత్తగా కాలుమోపేవారు ముందు కళ్ళార్పకుండా చూసేది అక్కడి భవన నిర్మాణ కౌశలాన్ని. మన  దేశానికి యాత్రీకులుగా వచ్చే విదేశీయులు సయితం అత్యంత  ఆసక్తిగా గమనించేది కూడా, చూడాలని తాపత్రయ పడేది  ఎప్పుడో పూర్వకాలంలో  రాజులు, నవాబుల హయాములో  నిర్మించిన తాజ్ మహల్ వంటి నిర్మాణాలనే  అనే నిజాన్ని గమనంలో వుంచుకోవాలి. ఇవన్నీ ఒక్క రోజులో నిర్మించినవి కావు. ఏళ్ళతరబడి కష్టపడి, చెమటోడ్చి  నిర్మిస్తేనే వాటికి ఒక ఆకారం వచ్చింది.
ఉదాహరణకు దేశ రాజధాని కొత్త ఢిల్లీ నగరం తీసుకుంటే అక్కడి నిర్మాణాలు, రహదారులు, ఉద్యానవనాలు ప్రపంచంలో ఏ నగరానికీ తీసిపోనంత ఘనంగా వుంటాయి. ఇది చాలామందికి తెలిసిన విషయమే.
కాసేపు  చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తె -
1911 డిసెంబరు 12 న  ఢిల్లీ దర్బార్ జరిగింది. కొత్త ఢిల్లీ నగర నిర్మాణానికి బ్రిటిష్ చక్రవర్తి అయిదో జార్జి శంకుస్థాపన చేసారు. అప్పటివరకు కలకత్తాలో వున్న దేశ రాజధానిని ఢిల్లీకి తరలిస్తున్నట్టు ఆయన ప్రకటన చేసారు. బ్రిటిష్ నిర్మాణ శిల్పులు సర్ ఎడ్విన్ లుటేన్స్, సర్ హర్బర్ట్ బెకర్ కొత్త రాజధాని నమూనా తయారు చేసారు. నగర నిర్మాణ కాంట్రాక్ట్ ను సర్ శోభాసింగ్ కు ఒప్పచెప్పారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం వంటి కారణాలవల్ల నిర్మాణంలో ఆలస్యం జరిగింది. దాదాపు ఇరవై ఏళ్ళు సాగిన రాజధాని నిర్మాణం ఎట్టకేలకు  1931లో పూర్తయింది. అదే ఏడాది ఫిబ్రవరి నెలలో అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభోత్సవం చేసారు. రాష్ట్రపతి భవన్ (వైస్రాయ్ నివాస భవనం)  వంటి కళ్ళు చెదిరే కట్టడాలు, అద్భుతమైన రహదారులు, సుందర ఉద్యానవనాలతో కూడిన కొత్త రాజధాని కళ్ళెదుట నిలిచింది. ప్రపంచపటంలో తనకంటూ ఒక సుస్థిర స్థానం దక్కించుకుంది.       
1926 లో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నిర్మాణం ఒకే ఒక్క ప్లాటుఫారంతో మొదలయింది. కనాట్ ప్లేస్ పేరుతొ అధునాతన షాపింగ్ ప్లాజా నిర్మాణాన్ని నాలుగేళ్ల కాలవ్యవధిలో పూర్తిచేశారు.
ఆంద్ర ప్రదేశ్ నూతన రాజధాని 'అమరావతి'  నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని ముందు పేర్కొన్న పెద్దమనిషి ఎదురుచూస్తున్నట్టే,  కొత్త రాష్ట్రంలో కోట్లాది ప్రజలు కూడా  ఎదురు చూస్తున్నారు. వినాయకుడి పెళ్ళికి వేయి విఘ్నాలు అన్నట్టుగా ఈ ప్రయత్నానికి ఆదిలోనే ఎన్నెన్నో అడ్డంకులు, అవరోధాలు. కొన్ని వచ్చి పడ్డవి. కొన్ని తెచ్చి పెట్టుకున్నవి.
రాజధాని కూడా లేకుండా ఆవిర్భవించిన నూతన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అతి త్వరగా పూర్తిచేయాల్సిన అవసరం ఎంతయినా వుంది. దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. ఇది రాజకీయ అవసరం. అంతకు మించి ప్రజల అవసరం.  నిర్మాణ ప్రాంతంలో వందలాదిమంది రైతులు వేలాది ఎకరాల పంట భూములను స్వచ్చందంగా ప్రభుత్వానికి ఒప్పగించారని సర్కారు గణాంకాలు తెలుపుతున్నాయి. అయినా అక్కడ అక్కడక్కడా సమీకరణకు సంబంధించి తలనొప్పులు తప్పడం లేదు. ఒక పెద్ద ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు ఇలాటివన్నీ అతి సహజం. ఒంటిపైన వస్త్రం ముళ్ళ కంచెకు తగిలినప్పుడు ఒడుపుగా ముళ్ళను తప్పించే ఓర్పు కావాలి. ప్రతి పక్షాలు అనవసర యాగీ చేస్తున్నాయని ప్రత్యారోపణలు చేస్తూ పోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట పెరగదు. సరికదా అనుభవశాలి చెప్పాల్సిన మాటలు కాదని సామాన్య ప్రజలు కూడా సందేహించే ప్రమాదం పొంచి వుంటుంది.
ఈ సందర్భంలో పాలకులకు కావాలిసింది గట్టి పట్టుదల. అంతే  కాని అనవసరమైన 'పట్టుదలలు, పంతాలు' కాదు.
(05-05-2015)

రచయిత ఈమెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

2, మే 2015, శనివారం

పురుషులు : పుణ్య పురుషులు



(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY IN IT's EDIT PAGE ON 03-05-2015,SUNDAY)

ఒకానొక కాలంలో జిల్లాను  మొత్తం తమ కనుసన్నల్లో శాసించే  జిల్లా కలెక్టర్లకు తమ జిల్లాలో తిరగడానికి జీపు సౌకర్యం మాత్రమే వుండేది. అదీ టార్పాలిన్  పట్టాలు అటూ ఇటూ టపటపా కొట్టుకుంటూ వేళ్ళాడే పాతతరం జీపులు.
అలాటి కాలంలో, ఒకానొక  జిల్లాలో,  కలెక్టర్ గా పనిచేస్తున్న ఓ ఐ.ఏ.ఎస్. అధికారి జీపు తీసుకుని  ఓ రోజు ఉదయం ఏదో గ్రామానికి టూరుకు వెళ్లి తిరిగి వస్తుంటే జీపు టైరు పంక్చర్ అయింది. సెల్ ఫోన్లు లేని రోజులాయె. డ్రైవర్ పంక్చర్ వేయించుకుని రావడానికి కొన్ని మైళ్ళ దూరంలో వున్న మరో పెద్ద  వూరికి వెళ్ళాడు. కలెక్టర్ గారి వెంట వున్న బిళ్ళ బంట్రోతు, అయ్యగారికి చెట్ల నీడన వున్న ఒక మోరీ చూపించి అక్కడ కూర్చోపెట్టాడు. డ్రైవర్ రావడానికి బాగా వ్యవధి వుంది. అటూ ఇటూ చూస్తున్న  కలెక్టర్ గారి దృష్టికి దగ్గరలో ఓ వూరు జాడ కనిపించింది. కొందరు ఆడవాళ్ళు బిందెలు చంకన పెట్టుకుని వస్తూ  కానవచ్చారు. ఆయన వారిని పలకరించి, 'నీళ్ళ కోసం  ఇంత దూరం ఎందుకు పడుతూ లేస్తూ వస్తున్నారు, మీ వూళ్ళో మంచి నీటి  బావి లేదా?' అని ప్రశ్నించారు. 'నువ్వేమన్నా ఆర్చేవాడివా, తీర్చేవాడివా' వంటి చొప్పదంటు   ప్రశ్నలు వాళ్ళు వేయకుండా, 'వూళ్ళో బావులకేం చాలా వున్నాయి, కానీ మమ్మల్ని అక్కడ నీళ్ళు తోడుకోనివ్వరు' అని బదులు చెప్పారు. కలెక్టర్ సాలోచనగా తలపంకించి ఊరుకున్నారు. ఈలోగా టైరు పంక్చర్ వేయించుకుని డ్రైవర్  తిరిగివచ్చాడు. కలెక్టర్ తన మానాన తాను పొతే కధే లేదు. ఆయన అల్లాంటి ఇల్లాంటి అధికారి కాదు కాబట్టి ఏం చేయాలో వెంటనే ఆలోచించి పెట్టుకున్నాడు. డ్రైవర్ ని నేరుగా  జిల్లా కేంద్రానికి పంపించి తాను ఆ మోరీ మీదనే కూర్చుండిపోయాడు. ఈలోగా ఆయన మౌఖిక ఆదేశాలు అందుకున్న కలెక్టర్ గారి సిబ్బంది, స్థానిక తాసిల్దారు  టైప్ రైటర్లు, కలెక్టర్ గారి అధికారిక ముద్రిక తదితరాలతో సహా అక్కడికి వచ్చారు. ఊళ్ళోకి కబురు పంపి గ్రామ సర్పంచుని రప్పించారు. ఈ హడావిడి అంతా చూసి ఊరిజనం అంతా అక్కడ పోగయ్యారు. వూరి వెలుపల నుంచి మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి వారి గూడెం లోనే ఒక మంచి నీటి బావి మంజూరు చేయాలని  సర్పంచు నుంచి ఓ అభ్యర్ధన పత్రం తీసుకున్నారు. దానికి అక్కడికక్కడే స్థానిక అధికారి నుంచి ఆమోద ముద్ర వేయించారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుంటూ అందుకు అవసరమైన నిధులను తక్షణమే  మంజూరు చేస్తూ ఆ మోరీ మీదనే  కూర్చుని సంతకం చేసి, కింద స్టాంపు వేసారు.  ఆ వెనువెంటనే  కూలీలను పిలిపించారు. బావి తవ్వకానికి ఆయనే స్వయంగా గడ్డపారతో మొదటి పలుగు వేసి స్వీకారం చుట్టారు. ఝాము పొద్దెక్కక ముందే ఝామ్మని బావి  పని మొదలయింది. అంతకుముందు ఆ ఊరిజనం ఇలాటి అధికారిని చూడలేదు సరికదా కనీసం వినికూడా వుండలేదు. అందుకే అందరి మొహాల్లో నిండుకున్న నిబిడాశ్చర్యం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వారి వూరిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శుభారంభం జరిగింది. పొద్దుగూకే సమయానికి బావిలో సమృద్ధిగా జలపడింది. ఆ వూరి గూడెం జనానికి కొత్త పొద్దు పొడిచింది.
ఆ జిల్లా ఖమ్మం జిల్లా. ఆ వూరు రెబ్బారం అని అందరూ పిలుచుకునే రెబ్బవరం. ఆ కలెక్టర్ గారి పేరు ఆర్. పార్ధసారధి. ఆయన ఇప్పుడు జీవించి లేరు.  కానీ ఆ గూడెం ప్రజల మనస్సులో ఇంకా జీవించే వున్నారు.  
పురుషుల్లో పుణ్యపురుషులు వేరయా అన్నట్టు అధికారుల్లో కూడా పుణ్యమూర్తులయిన అధికారులు వుంటారు అని చెప్పడానికే ఈ సోదాహరణ.           
ఈ యాభై ఏళ్ళలో అనేక మార్పులు వచ్చాయి. జిల్లాకు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి మాత్రమె వుండే  పద్దతి మారి జిల్లాకు ముగ్గురు నలుగురు వచ్చారు. టార్పాలిన్ పట్టాలు వున్న జీపులు పోయి అధునాతన వాహన శ్రేణి వచ్చి చేరింది. జిల్లా మొత్తంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో తెలియచెప్పే సమాచార  వ్యవస్థ చేతికి అంది వచ్చింది. సిబ్బంది పెరిగారు. జనం ఇబ్బందులూ పెరిగాయి. మరీ అంతలా కాకపోయినా, రాజకీయ అవరోధాలను అధిగమించి, పదిమందికి పనికి వస్తాయని తాము అనుకున్న మంచి పనులను అనుకున్న రీతిలో చేసి పెట్టె అధికారులు కూడా మన మధ్యనే వున్నారు.

(సురేష్ చందా)

ఇప్పుడు అలాటి ఓ మంచి అధికారి చేసిన ఓ మంచిపని గురించి రెండు రోజులుగా మీడియాలో మంచి మంచి కధనాలు వస్తున్నాయి.
సురేష్ చందా అనే ఆ అధికారి తెలంగాణా సచివాలయంలో ఒక ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో ఆరోగ్య, వైద్య సేవలు ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలా అందుతున్నాయో పర్యవేక్షించే ఐ.ఏ.ఎస్. అధికారి. యువకుడు  కావడం వల్ల కంప్యూటర్ పరిజ్ఞానం హెచ్చుగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అంచేత తన శాఖ పని తీరు మెరుగుపరుచుకోవడానికి ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని ఆయన భావించారు. తెలంగాణాలో పేరొందిన గాంధి ఆసుపత్రితో మొదలు పెట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏమూల ఏం జరుగుతున్నదో  సచివాలయంలోని తన చాంబర్ నుంచే కనిపెట్టి చూసే ఉద్దేశ్యంతో ఆ ఆసుపత్రిలో సుమారు రెండువందల నిఘా కెమెరాలను అమర్చాలని తలపెట్టారు. కిందవాళ్ళు చేసే పనులను కనిపెట్టి చూడడం ఆయన  బాధ్యతల్లో ఒకటి. కానీ, తాను  ఎలా పనిచేస్తున్నది కూడా  నలుగురికీ తెలియాలి కదా! అందుకని ఈ ప్రయోగాన్ని ఆయన తనతోనే ప్రారంభించారు. చడీచప్పుడూ కాకుండా తన కార్యాలయంలో ఒక నిఘా కెమెరాను ఏర్పాటు చేసుకున్నారు. తన గదిలో ఏం జరిగేది, తనను కలుసుకోవడానికి ఎవరెవరు వచ్చేది, ఏం మాట్లాడేది రికార్డు చేయడం కోసం ఈ కెమెరా. అయితే ఈ కెమెరా రికార్డు చేసేది తను ఒక్కరే కాకుండా ఎవరయినా సరే  చూడగలిగేలా ఇంటర్నెట్ తో దాన్ని  అనుసంధానం చేయడం ఇందులోని ఒక ప్రత్యేకత. 'సమాచార చట్టం ప్రకారం ప్రజలకు తెలుసుకునే హక్కు వచ్చింది. వాళ్ళు అడిగితె ఇవ్వడం కాకుండా అడక్కుండానే యావత్ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచితే తప్పేమిట'నేది ఈ అధికారి అభిప్రాయం. తన దృష్టికి వచ్చిన ఫైళ్ళపై తాను  రాసిన నోట్ వివరాలను కూడా వెంటవెంటనే ఆయన ఇంటర్నెట్లో పెడుతుంటారని  పత్రికల్లో చదివినవారికి ఒకింత ఆశ్చర్యం కలగడం సహజం. అవసరానికి మించిన గోప్యతను అధికారులు పాటించడం వారికో అలవాటని జనంలో ఒక అభిప్రాయం బలంగా నాటుకుని ఉండడమే ఇందుకు కారణం. తాము చెప్పినది సావకాశంగా విని, కోరిన సమాచారం ఓ మేరకయినా అధికారులు అందించగలిగితే, తమ సమస్య సగం పరిష్కారం అయిందని సంతోషించే సామాన్యుల సంఖ్య కూడా అధికమే.
'అనుమతి లేకుండా పురుగు కూడా ప్రవేశించలేని అతి శీతల గదుల్లో కూర్చుని అధికారులు ఏం చేస్తుంటారు?' అనే అనుమానం సాధారణ జనంలో వుంది. అ అధికారుల గదుల్లోకి కనీసం తొంగి చూడడానికి కూడా వీలుపడని  వారికి సురేష్ చందా అనే ఈ అధికారి చేస్తున్నది అబ్బురం అనిపించడంలో సందేహం లేదు.    
అడగగానే మెచ్చి వరాలు ఇచ్చే దేవుళ్ళకు మన పురాణాల్లో కొదవలేదు. అడగకుండానే సమాచారం ఇవ్వాలనే అభిమతం కొందరు అధికారుల్లో అయినా ఊపిరి పోసుకోవడం  అభిలషణీయం. ఆహ్వానించదగ్గ పరిణామం .
మొత్తం పరిపాలన ఇలా ప్రజల  కళ్ళ ముందు జరగడం అంటూ జరిగితే పాలకుల పట్ల ప్రజల్లో పేరుకుపోతున్న అసహనం ఓ మేరకయినా తగ్గడం కూడా  ఖాయం.   (02-05-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595

28, ఏప్రిల్ 2015, మంగళవారం

నేపాల్ భూకంపం : నేర్చుకోవాల్సిన పాఠాలు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY IN IT'S EDIT PAGE ON 30-04-2015, THURSDAY)

నేపాల్ భూకంపం మానవాళికి కొత్త పాఠం బోధిస్తోంది.
ఆధునిక విజ్ఞానం అందించిన సాధన సంపత్తితో ప్రకృతిని జయింఛామని విర్రవీగడాన్ని మించిన అజ్ఞానం మరోటి లేదని. ప్రకృతి ప్రకోపిస్తే రోదసిని దాటివేసిన అడుగులు కూడా నిరర్ధకమనీ మానవులకు నూతన సూక్తులను ప్రబోధిస్తోంది.  చంద్రుడి మీద పాదం మోపి, గగనాంతర సీమల్లో విహారాలు సలిపి, గ్రహాంతర వీధుల్లో సంచారాలు చేసి వచ్చిన మనిషి ప్రతిభాపాటవాలు  ప్రకృతి శక్తికి ఏమాత్రం దీటు రావని, సాటి కావని మరోమారు తెలియచెప్పుతోంది.


నాగరీకత ధ్యాసలో మునిగి,  ఆధునికత ఆశలో కూరుకుపోయి అవివేకంగా వేస్తున్న అడుగులే సమస్త మానవాళికి ముప్పు తెస్తున్నాయన్న హెచ్చరికలను లెక్కచేయకుండా  పక్కనబెట్టి చేస్తున్న పనులే ప్రకృతి వైపరీత్యాలకు కారణభూతం అవుతున్నాయన్న ఎరుక కరువై, మనిషి  కొని తెచ్చిపెట్టుకున్న కష్టాల జాబితాలో భూకంపాలు కూడా వున్నాయి. అడ్డూ అదుపూ లేకుండా మానవులు సాగిస్తున్న ప్రకృతి విధ్వంసం, అడవుల నాశనం, చమురు వెలికితీతలు, సమతుల్యాన్ని దెబ్బతీసే తవ్వకాలు ఇలాటి   వైపరీత్యాలకు హేతువులు అవుతున్నాయి.  సుద్దులు, సూక్తులు  తలకెక్కక పోవడం వల్లనే అకారణ, అవాంఛిత మరణాలకు, ఆస్తుల విధ్వంసానికి  దారితీస్తున్నాయి.
కొన్ని ప్రకృతి వైపరీత్యాలు ముందస్తుగా చెప్పివస్తే, మరి కొన్ని పసికట్టేలోగానే తమ ప్రతాపం చూపిస్తాయి. కళ్ళు మూసి తెరిచేలోగా ఏదో విధ్వంసక శక్తి తన మంత్రం దండానికి పని చెప్పినట్టు మేడలు మిద్దెలు పేక మేడల్లా నిమిషాల్లో కూలిపోతాయి. జీవితం యెంత క్షణ భంగురమో తెలిసివచ్చేలా అంతవరకూ నీడ ఇచ్చిన ఇంటి శిధిలాల్లోనే ఇంటిల్లిపాది చిద్రం అయిపోవడం ఇటువంటి సందర్భాల్లో అనుభవైకవేద్యం. చనిపోయిన వారు పోగా ప్రాణాలతో మిగిలివున్నవారు అయినవారినందరినీ  కళ్ళముందేపోగొట్టుకున్న వేదనతో కొంతా,  మృత్యు ముఖంలోకి వెళ్ళివచ్చిన భయపు ఛాయలు వదలక మరికొంతా జీవచ్చవాలుగా మారుతారు. నేపాల్ లో జరిగిన భూకంపం కలిగించిన ఉత్పాతాన్ని కళ్ళారా చూసిన గర్భవతులయిన అక్కడి మహిళలు మానసిక ఆందోళనతో గర్భ విచ్చిత్తి పొందినట్టు వస్తున్న వార్తలు ఇందుకు తార్కాణం.
అతి చిన్న దేశానికి అతి పెద్ద కష్టం వచ్చి పడింది. అంతర్జాతీయ సమాజం పెద్ద మనసుతో తన వంతు బాధ్యత పోషిస్తోంది. ఐక్యరాజ్య సమితి స్వయంగా రంగంలోకి దిగింది. నేపాల్ కు పెద్దన్న అనే పేరు వున్న భారత దేశం ఆపన్న దేశానికి సహాయ హస్తం అందించింది. అనేక భారతీయ విమాన సంస్థలు, టెలికాం సంస్థలు, వస్తు ఉత్పత్తి సంస్థలు నేపాల్ విషయంలో కనీవినీ ఎరుగని భారీ రాయితీలు ప్రకటించాయి. జరగరానిది జరిగినప్పుడు జరగాల్సినవన్నీ యాంత్రికంగా జరిగిపోతూనే వుంటాయి. పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేకపోయినా, జరిగిన నష్టాన్ని  పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోయినా ఓ మేరకయినా సాయం అందుతుంది. అదో ఊరట. మానవత్వం ఇంకా వూపిరితోనే వుందని ఓ భరోసా.
సందర్భం కాబట్టి కొన్నేళ్ళ క్రితం జరిగిన  ఓ విషయాన్ని మననం చేసుకోవడం సందర్భోచితమే అవుతుంది. అందుకే ఈ పునశ్చరణ.
అది 2011 సంవత్సరం. అది  జపాన్ దేశం.
                             

ఉవ్వెత్తున లేచిన సముద్రపు అలలు చెలియలికట్టదాటి అంతెత్తున ఎగసిపడి మిన్నూ మన్నూ ఏకం చేస్తూ తమ ఉగ్రరూపాన్ని ప్రదర్శించినప్పుడు

ప్రకృతి ప్రకోపానికి గురయి, మానవ నిర్మిత కట్టడాలన్నీ పేకమేడల్లా కూలిపోతున్నప్పుడు,

పొంగి పొరలిన సంద్రపు నీటిలో పెద్ద పెద్ద కార్లూ, విమానాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోతున్నప్పుడు-

యుగాంతంవంటి హాలీవుడ్ సినిమాల్లో చూపించిన గ్రాఫిక్ దృశ్యాలను తలదన్నే విధంగా ప్రకృతి ప్రదర్శించిన విలయతాండవం ముందు మనిషి మరుగుజ్జుతనం మరోసారి ప్రపంచానికి వెల్లడయింది.

మూడింట రెండువంతులు నీరు ఆవరించివున్న ఈ భూమండలంలో జపాన్ అనేది అనేకానేక చిన్న చిన్న దీవుల సమూహం. ఈ దీవుల్లో హోన్షూ, షికోకు, హూక్కై దో, క్యుషూ అనేవి ప్రధానమైనవి.

అయితే బయట ప్రపంచానికి తెలిసిన జపాన్ అంటే హోన్షూ నే. ఎందుకంటె, జపాన్ అనగానే అందరికీ తటాలున గుర్తొచ్చే టోకియో, ఒసాకా,నగాయో,క్యోటో నగరాలు హోన్షూ అనే ఈ ప్రధాన భూభాగం లోనే వున్నాయి. జపాన్ జనాభాలో అత్యధిక భాగం హోన్షూ లోనే నివసిస్తూవుండడం కూడా మరో కారణం. పైగా, దేశ ఆర్ధిక వ్యవస్తకు ఇది గుండెకాయ లాటిది. విస్తీర్ణం దృష్ట్యా పెద్దదే అయినా, ప్రపంచపఠంలో చూస్తే మాత్రం హోన్షూ దీవి ఒక అరటి పండు మాదిరిగా కనిపిస్తుంది. పసిపిక్ మహా సముద్రం మధ్య వున్న ఈ దీవి, యావత్ ప్రపంచంలో ఒక సంపన్నదేశంగా జపాన్ ఆవిర్భావానికి దోహదం చేసింది. ఎలెక్ట్రానిక్, మోటారు పరిశ్రమలతో మొత్తం ప్రపంచ దేశాలలోనే పేరుపొందిన జపాన్ సునామీలు, భూకంపాలకు కూడా పెట్టింది పేరు.

వారికి మరో మంచి పేరు కూడా వుంది. అదే ఈ వ్యాసానికి ప్రేరణ. అన్ని దేశాలకు అనుసరణీయం. ఇలాటి ఉపద్రవాలపట్ల ఆ దేశం సాధించిన సంసిద్ధతే ఆ దేశానికి ఈ మంచి పేరు కట్టబెట్టింది.  ఈ విషయంలో జపాన్ కు సరితూగగల మరో దేశం ప్రపంచంలో లేదనడం అతిశయోక్తికాదు. ఎందుకంటె సునామీలు, భూకంపాలు ఆ  దేశానికి కొత్తకాదు. అక్కడి ప్రజలు వాటితో సహజీవనం చేయాల్సిన పరిస్తితి. నిజానికి సునామీ, (త్సునామీ ) టైఫూన్ అనే పదాలు జపాన్ భాషకు చెందినవేనంటారు. ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఏమి చేయాలన్నది పైనుంచి కింద దాకా అన్ని స్తాయిల్లోని వారికి కరతలామలకం.

ప్రజలందరికీ ఈ విషయంలో చక్కని అవగాహన వుంటుంది. మిన్ను విరిగి మీద పడే సందర్భాలలో సయితం నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను గురించి అతి తక్కువ స్తాయిలోని ఉద్యోగికి కూడా తెలిసివుంటుంది. ముఖ్యంగా గత అనేక  సంవత్సరాల కాలంలో అక్కడి నిపుణులు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో తక్షణం స్పందించాల్సిన తీరు గురించి శాస్త్రీయ పద్ధతుల్లో ఒక నిర్దిష్టమయిన విధానాన్ని రూపొందించుకున్నారు. ఈ  దుర్ఘటనలో జన నష్టం నివారణకు అది బాగా ఉపయోగపడిందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో వారు అధునాతన కంప్యూటర్ వ్యవస్తను కూడా చక్కగా వాడుకుంటున్నారు. ఈ కోణం దృష్ట్యా ఆలోచిస్తే, ఆ దేశం నుంచి ఇతర దేశాలు నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపిస్తోంది.

భూకంపాలవంటి విపత్తులు ముంచుకొచ్చినప్పుడు ప్రతి పౌరుడు ఎలాటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించడం వల్ల ఒకరినుంచి ఆదేశాలు కానీ, సూచనలు కానీ అందుకోవాల్సిన అవసరం లేకుండా అందరూ ఎవరికివారు పరిస్తితికి తగ్గట్టుగా వెంటనే స్పందించగలిగారని ఒక ప్రత్యక్ష సాక్షి కధనం.

ప్రకృతి  వైపరీత్యం గురించిన అనుమానం తలెత్తగానే ఎవరికి వారు ముందు తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం  ఇవ్వాలనేది శిక్షణలో నేర్పే తొలి పాఠం. ఆ జాగ్రత్త తీసుకున్న తరువాత  ఆ సమాచారాన్ని ఇతరులకు తక్షణం తెలియచెప్పాలన్నది రెండో పాఠం. అదేసమయంలో తోటి వారి భద్రతకు ఏం చెయ్యాలని ఆలోచించాలి. మిన్నువిరిగి మీదపడే సందర్భాలలో సయితం ఇలా స్థితప్రజ్ఞతతో ఆలోచించగల నైపుణ్యాన్ని జనాలకు కలిగించడం ఈ శిక్షణ లక్ష్యం.

ఉదాహరణకు ఒగాకీ నగరాన్ని తీసుకుందాము. అక్కడి జనాభా లక్షా యాభయ్ వేలు. ఇంగ్లీషు మాట్లాడే దేశాలనుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పట్టుమని పాతికమంది కూడా వుండరు. అయినా ఇంగ్లీష్ అనువాదకుల జాబితా అధికారుల వద్ద సిద్ధంగా వుంటుంది. విపత్కర పరిస్తితులను ఎదుర్కోవడానికి ఈ రకమయిన సంసిద్ధత చాలా అవసరమని జపానీయులు నమ్ముతారు.

అలాగే, ఇంటర్ నెట్ ను ఇలాటి సందర్భాలలో వినియోగించుకుంటున్న తీరు కూడా అమోఘం. సాధారణంగా ఈ సదుపాయాన్ని వాడుకునే వారి సంఖ్య ఆ దేశంలో చాలా అధికం. విద్యార్ధి దశ నుంచే అక్కడి వారు దీన్ని బాగా ఉపయోగిస్తారు. అక్కడి విద్యాసంస్తలు విద్యార్ధులతో అనుసంధానం కావడానికి ప్రత్యేక పోర్టల్ ఉపయోగిస్తాయి. విద్యార్ధులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తరగతి షెడ్యూల్ సరి చూసుకోవడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని వెనువెంటనే తెలియచేయడానికి ఇది వారికి బాగా అక్కరకు వస్తోంది. ఈ పోర్టల్ లో ముందు కానవచ్చేదే ఎర్రటి పెద్ద అక్షరాలతో కూడిన హెచ్చరిక. ఈ రోజు తరగతిలో ఏఏ పాఠాలు బోధించబోతున్నారనే విషయం తెలుసుకోవడానికి ఆతృతతతో పోర్టల్ తెరిచిన విద్యార్ధులకు ఆ దుర్ఘటన జరిగిన రోజు కనబడిన హెచ్చరిక ఏమిటో తెలుసా? “తరగతి సంగతి మరచిపోండి. సునామీ విరుచుక పడబోతోంది. వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపొండి

ఈ విధమయిన ఏర్పాట్లు అన్ని కార్యాలయాలలో, సంస్తలలో వుండే విధంగా ఆ దేశంలో అనేక చర్యలు తీసుకున్నారు. అందుకే, సెకన్ల వ్యవధిలోనే సమాచారం దేశంలోని నలుమూలలకు చేరిపోయింది. జనాలను గాభరా పెట్టేందుకు కాక అప్రమత్తం చేసే ఉద్దేశ్యంతో చేసిన ఈ హెచ్చరికలు సత్ఫలితాలను ఇచ్చాయని అక్కడివారు చెబుతున్నారు.

పాట్రిక్ అనే సిస్టం ఇంజినీర్ తన అనుభవం గురించి చెప్పిన వివరాలు వింటే యుద్ధ ప్రాతిపదికఅని తరచుగా వినబడే మాటకు అసలుసిసలు అర్ధం బోధపడుతుంది.

భూకంప ప్రకంపనలకు సంబంధించిన తొట్టతొలి సూచనను గమనించిన ఆ ఇంజినీర్ పంపిన సమాచారం రెండు సెకన్ల వ్యవధిలోనే చేరాల్సిన చోటికి చేరిపోయింది. తూర్పు జపాన్ తీరానికి దగ్గరలో తీవ్రమయిన భూకంపం సంభవించిందన్న ప్రభుత్వ సమాచారం వేలమైళ్ళ దూరంలో వున్నవారికి సయితం చేరడానికి మరో రెండు సెకన్ల కంటే ఎక్కువ వ్యవధి పట్టలేదు. మరో రెండు సెకన్లలో భూకంపం సంభవించిన ప్రాంతాలతో టెలిఫోన్ సంబంధాలు తెగిపోయిన సమాచారం అందింది. అయితే, వెనువెంటనే రిమోట్ ద్వారా ఎమర్జెన్సీ కాంటాక్ట్ సదుపాయాన్ని పునరుద్ధరించిన కబురు అందింది. ఇదంతా జరగడానికి పట్టిన సమయం కేవలం తొంభయ్ సెకన్లు. మరోపక్క సహోద్యోగులు, ఇరుగుపొరుగువారి రక్షణ బాధ్యతను ఎవరికివారు స్వచ్చందంగా భుజాన వేసుకున్నారు. ఎవరు ఎక్కడ వున్నారు అన్న సమాచారాన్ని క్షణాల మీద తెప్పించుకుని వారిని అప్రమత్తం చేసారు.

ఇదేమాదిరి సన్నివేశాలు ఆ రోజు జపాన్ దేశమంతటా కానవచ్చాయంటే ఇలాటి సందర్భాలలో ఆ దేశ సంసిద్ధత ఎలావున్నదన్నది వూహించుకోవచ్చు.

ఆ ఇంజినీర్ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియచేసారు.

నేనున్న చోట ఆ రోజు భూమి కంపించడం మొదలయింది. బాగా గాలి వీస్తోంది కాబట్టి భవనం వూగుతోందని ముందు భ్రమ పడ్డాను. మా దేశం భూకంపాలకు నిలయం కనుక వాటిని తట్టుకునేలా భవనాలను నిర్మించుకోవడం ఇక్కడి పధ్ధతి. అందుకోసం ప్రచండమయిన గాలులు వీచినప్పుడు భవనాలు కదిలిపోయేలా వాటిని నిర్మిస్తారు.భూకంపాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం వీలయినంత తగ్గించడానికి ఈ విధమయిన నిర్మాణ పద్ధతులను అనుసరిస్తున్నారు.

ఆ రోజు నేను వున్న భవనం వూగిపోవడం మొదలుకాగానే, కిటికీ నుంచి బయటకు చూసాను. దాపున వున్న రైల్వే స్టేషన్ నుంచి ఓ రైలు బయటకు వస్తోంది. వున్నట్టుండి ఆ రైలుకు బ్రేకులు పడ్డాయి. కీచుమని శబ్దంచేస్తూ పట్టాలపై ఆగిపోయింది. బహుశా, భూకంపం గురించిన సమాచారం తెలిసినవారెవ్వరో రైలు డ్రయివర్ కు ఇంటర్నెట్ ద్వారా ఆ కబురు చేరవేసివుంటారు. అందువల్లనే రైలును వెంటనే నిలిపివేసారు. ఎందుకు ఆపాల్సి వచ్చిందో ప్రయాణీకులకు లౌడ్ స్పీకర్ల ద్వారా తెలియచేసివుంటారు. అది వేరే విషయం. ఈ దేశంలో ఇవన్నీ సర్వ సాధారణం.

గంటకు నూట యాభయ్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్న రైళ్ళు కూడా, ముందస్తు సమాచారం అందుకున్న కారణంగా ఎక్కడికక్కడ నిలచిపోయాయి. వాటిల్లో వున్న ప్రయాణీకులందరూ క్షేమంగా వున్నారు. ఇలాటి ఏర్పాట్లు సమగ్రంగా వున్నందువల్ల ఎక్కడా రైళ్ళు పట్టాలు తప్పలేదు. సునామీ సమయంలో జపాన్ రైల్వే వ్యవస్థ పనిచేసిన తీరు అమోఘం. మొత్తం మీద హోన్షూదీవిలో ప్రతిచోటా ఇదే దృశ్యం.  విమానాలు గాలిలో ఎగిరాయి. భవనాలు కూలకుండా నిలిచాయి. ప్రజాజీవనం అస్తవ్యస్తం కాలేదు.

ఒగాకీ నుంచి రైల్లో నగోవా వెడుతున్నప్పుడు అనేక కర్మాగారాలు కానవస్తాయి. వీటిల్లో చెప్పుకోదగింది బీరు తయారుచేసే ఓ కర్మాగారం. పైకి పెద్ద పెద్ద బీరు సీసాల మాదిరిగా కానవచ్చే ట్యాంకుల్లో విపరీతమయిన వొత్తిడి మధ్య బీరు నిలవచేస్తారు. ఈ ఫాక్టరీలలో ప్రమాదకరమయిన రసాయనాలు వుంటాయి. నిజానికి ట్రిగ్గర్ లేని దారుణమయిన ఆయుధాల వంటివి ఈ కర్మాగారాలు. కానీ, వీటిల్లో ఏ ఒక్కటీ పేలిపోలేదు. ఎందుకంటె, సునామీలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తట్టుకోవడానికి వీలయిన వ్యవస్తలను జపాన్ సిద్ధంచేసి పెట్టుకుంది. సమయానికి ఆ వ్యవస్తలు అనుకున్నవిధంగా పనిచేశాయి. కనీవినీ ఎరుగని విపత్తు వాటిల్లినప్పుడుకూడా లక్షలాదిమంది ప్రాణాలు నిలబడ్డాయంటే, ముందే పకడ్బందీగా నిర్మించుకున్నఈ వ్యవస్తలన్నీ అనుకున్నవిధంగా పనిచేయడమే కారణం. ఇందులో అతిశయోక్తి ఏమీలేదు. నిజంగా వ్యవస్థ పనిచేసింది. ఇది మానవ నాగరిక సమాజం సాధించిన విజయం. జపాన్ లోని ప్రతి ఇంజినీరు ఈ విపత్కర సమయంలో తన దేశం కోసం, తన తోటివారికోసం కష్టించి పనిచేసాడు. అయితే, ఇది అప్పుడే గట్టిగా పైకి చెప్పుకోలేని పరిస్తితి. ఎందుకంటే జరగాల్సినంత స్తాయిలో దారుణం జరగకుండా నిరోధించగలిగినామన్న సంతోషం మాకెవరికీ మిగలలేదు. జరగకూడనిది జరిగిపోయింది. అనేకమంది మరణించారు. ఇంకా అనేకమంది జాడ తెలియడం లేదు. వారి కుటుంబాలు రోదిస్తున్నాయి. మిగిలిన మేమందరం వారందరికీ బాసటగా నిలవాల్సిన తరుణం ఇదిఅని ఆ ఇంజినీర్ తన భావాలను పంచుకున్నాడు.

అంత నిబ్బరంగా కర్తవ్యాలను నిర్వర్తించిన జపాన్ ప్రజలు సర్వదా అభినందనీయులు. చూసినదానినుంచీ, విన్నదానినుంచీ నేర్చుకోవడాన్నే విజ్ఞానం అంటారు. లేకపోతే మిగిలేది అజ్ఞానమే. (28-04-2015)

రచయిత మొబైల్: 98491 30595, ఈమెయిలు:  bhandarusr@gmail.com

NOTE: Courtesy Image Owner  

పడిలేచిన కెరటం - హోండా




సోయ్ చిరో హోండా! ఉహు గుర్తు రావడం లేదు.
పోనీ ఉట్టి హోండా!ఓహో!  హోండానా! హోండా యెందుకు తెలవదు. హీరో హోండా. మోటారు సైకిల్.
అమ్మయ్య అలా గుర్తుకు వచ్చింది కదా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ మోటారు  సైకిళ్ళను, హోండా మోటారు వాహనాలను ఉత్పత్తిచేసే హోండా మోటారు కంపెనీ స్థాపకుడీయన.


ఈ స్థాయికి రావడానికి ఆయన ఎన్నో పాట్లు పడ్డాడు. పడడమే కాదు పడి లేచాడు. లేచి నిలబడ్డాడు. తాను నిలబడి  తన కంపెనీని నిలబెట్టాడు.
అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఈ జపానీయుడికి  చిన్నతనం నుంచి వాహనాలు అంటే ఎంతో మోజు. ఆ రోజుల్లో వాళ్ల వూరికి వచ్చే మోటారు వాహనాలను చూడడానికి, వీలుంటే ఒకసారి చేతితో తాకడానికి చాలా మోజుపడేవాడు. ఆ అవకాశం దొరక్క కేవలం ఆ మోటారు వాహనం నుంచి వెలువడే చమురు వాసన పీల్చి తృప్తిపడేవాడు. అలాటి వాడు భవిష్యత్తులో ఒక పెద్ద మోటారు వాహనాల కంపెనీ స్తాపించగలడని వూహించడానికి కూడా వీలులేని రోజులవి. బతుకు తెరువుకోసం ఓ గరాజులో పనికి కుదిరాడు. కానీ అతడి ఆరాటం బతుకు బండి నడపడం కాదు. మోటారు బండి తయారు చేయడం.

ఈ క్రమంలో అతడి ఆలోచనలనుంచి రూపుదిద్దుకున్న పిస్టన్ అతడి బతుకు బాటను ఓ మలుపు తిప్పింది. అంతా ఓ గాట్లో పడుతోందని అనుకుంటున్న సమయంలో వచ్చిన భూకంపంలో అతడి ఫాక్టరీ సర్వనాశనం అయింది. కధ మళ్ళీ మొదటికి వచ్చింది. భూకంపం అతడి ఫాక్టరీని ద్వంసం చేయగలిగింది కాని అతగాడి పట్టుదలను కాదు కదా! అందుకే అతడు కధ మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి మరింత కసిగా.
అతడి కృషితో ఫాక్టరీ తిరిగి ఉత్పత్తి మొదలు పెట్టింది. అంతా సజావుగా సాగుతోంది. ఆర్డర్లు పెరుగుతున్నాయి. కంపెనీ కోలుకుంటోంది. ఈ దశలో మళ్ళీ కోలుకోలేని డెబ్బ తగిలింది. రెండో ప్రపంచయుద్ధం పుణ్యామా అని హోండా ఫాక్టరీ మూతపడింది.
యుద్ధం ముగిసింది. హోండా మళ్ళీ నడుం  బిగించాడు. పట్టుదలే అతడి పెట్టుబడి. అంతకంటే మించిన పెట్టుబడి మరి ఏముంటుంది. అందుకే అతడి కల ఫలించింది. వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఇక రాలేదు. కంపెనీ అప్రతిహతంగా   అభివృద్ధి పధంలో పురోగమించింది. దేశదేశాల్లో హోండా పేరు మారు మోగింది. విశ్వవ్యాప్తంగా హోండా కార్లకు ఆదరణ పెరిగింది. మోటారు వాహనాల రంగంలో హోండా పతాకం వినువీధులకు ఎగిరింది.

పడిలేచిన కెరటంఅంటే ఇదేనేమో! 

NOTE : Courtesy Image Owner 

26, ఏప్రిల్ 2015, ఆదివారం

నాకు నచ్చిన నా రచన




రామారావును నేను చిన్నప్పటినుంచీ ఎరుగుదును.

చిన్నతనంలో బొద్దుగా ముద్దుగా వుండేవాడు. వున్న వూళ్ళో స్కూలు సదుపాయం లేకపోవడంతో  పట్నంలో బావ గారింటికి చేరాల్సివచ్చింది. వేసవి సెలవులివ్వగానే సొంతూరు మీద గాలి మళ్ళేది. అంతే. బస్సెక్కి తుర్రున వాళ్ల వూరు బయలుదేరేవాడు. ఆ రోజుల్లో బస్సు టిక్కెట్టు- అందులో అరటిక్కెట్టాయె - నాలుగణాలు పోను అక్కయ్య ఇచ్చిన రూపాయిలో ఇంకా ముప్పావలా జేబులో మిగిలేది. బస్సు దిగగానే, ఓ అణా పెట్టి కట్టె మిఠాయి, ఇంకో అణా పెట్టి జీళ్ళు కొనుక్కుని కాలవ గట్టెక్కేవాడు. ఇక అక్కడినుంచి ఒకటే పాటలు, పద్యాలు. టైం తెలిసేది కాదు. మాయాబజారులో 'వివాహ భోజనంబు' పాట పదమూడోసారి ఎత్తుకునేలోపల ఊరొచ్చేసేది. మూడు మైళ్ళు మూడంగల్లో దాటి వచ్చిన ఫీలింగు. 'ఆహా' అనుకునేవాడు. తన గొప్పే అనుకునేవాడు. చూసి నవ్వుకునేవాడిని.

పల్లెటూళ్ళో రాజభోగం. వేడి వేడి అన్నం. వెన్న కాచిన నెయ్యి. అరచేతిమందాన  మీగడ. ముద్దపప్పు. వూటలూరే కొత్తావకాయ. ఓహో ఏమి రుచి. రాళ్ళు తిని హరాయించుకునే ఆరోగ్యం తనదని మురిసి ముక్కచెక్కలయ్యేవాడు. రామారావుని చూసి జాలితో నవ్వుకునేవాడిని.

రామారావు పెరిగాడు. ఎదిగాడు. సన్న గీత గీసినట్టు మీసకట్టు. నిగనిగలాడే జుట్టు. ఎగదువ్విన క్రాఫు. ఎవరో అచ్చు నాగేశ్వర్రావులా వుంటావన్నారు. నిజమే కాబోలనుకున్నాడు. నవ్వుకోవడం నా వంతయింది.

రామారావుకు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. అయినా చిన్న కుర్రాడిలానే వున్నాడు. తోటివారిలా బొజ్జ రాలేదు. బరువు పెరగలేదు. జుట్టు నెరవలేదు. బట్ట తల రాలేదు. కంటి చూపు తగ్గలేదు. ముప్పయ్యేళ్ళ క్రితం ఎలావున్నాయో ముప్పయి రెండు పళ్ళు అలాగే గట్టిగా పటిష్టంగా వున్నాయి. నాది 'పెగ్గుల లెక్క కాదు జగ్గుల లెక్క' అంటూ మూడు సీసాలు ఆరు సోడాల మాదిరిగా 'సాయంకాలక్షేపాలు' చేసేవాడు. 'చూశారా నా స్పెషాలిటీ' అన్నట్టు రొమ్ము విరుచుకు తిరిగే వాడు. రామారావుని చూస్తుంటే నాకిక నవ్వు రావడం లేదు. జాలి కలుగుతోంది.

రామారావుకు మెల్లమెల్లగా వయసు మీద పడుతోంది. కొంచెం కొంచెంగా వెంట్రుకలు చెప్పాపెట్టకుండా రాలిపోతున్నాయి. వెనుకనుంచి చూసేవారికి జుట్టు మధ్యలో గచ్చకాయ మందంలో ఖాళీ కనబడుతోంది. నెలల తేడాలోనే బెల్ట్ సైజ్ పెరిగింది. ముందు పొట్ట కనబడి తరువాత రామారావు కనబడుతున్నాడు. దళసరి కళ్ళజోడు మొహం మీద చేరింది. మరీ ముదుసలిలా కాకపోయినా ముడుతలు కనబడుతున్నాయి. కానీ, ఎవరో అతికించినట్టు ఎప్పటిలాగానే పెదాలపై చెరగని చిరునవ్వు. అయితే అందులో జీవమేదీ ?


రామారావుకు క్రమంగా సృష్టి రహస్యం అర్ధం అవుతోంది. శాశ్వితం అనుకుంటున్నవేవీ నిజానికి శాశ్వితం కాదు. ఈ నిజం తెలుసుకున్న రామారావుని చూసినప్పుడు నాకు నవ్వు రాలేదు. జాలీ వెయ్యలేదు. గర్వంగా అనిపించింది.

ఎందుకంటె నా పేరు వయస్సుకనుక. (10-06-2011)


(నాలుగేళ్ల క్రితం రాసిన ఈ రచన నాకు నచ్చిన నా రచన. మరో విషయం ఏమిటంటే కొంత కల్పన ఉన్నప్పటికీ 'ఆ రామారావుని కూడా నేనే! - భండారు శ్రీనివాసరావు)
NOTE: Courtesy Image Owner