2, మే 2015, శనివారం

పురుషులు : పుణ్య పురుషులు



(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY IN IT's EDIT PAGE ON 03-05-2015,SUNDAY)

ఒకానొక కాలంలో జిల్లాను  మొత్తం తమ కనుసన్నల్లో శాసించే  జిల్లా కలెక్టర్లకు తమ జిల్లాలో తిరగడానికి జీపు సౌకర్యం మాత్రమే వుండేది. అదీ టార్పాలిన్  పట్టాలు అటూ ఇటూ టపటపా కొట్టుకుంటూ వేళ్ళాడే పాతతరం జీపులు.
అలాటి కాలంలో, ఒకానొక  జిల్లాలో,  కలెక్టర్ గా పనిచేస్తున్న ఓ ఐ.ఏ.ఎస్. అధికారి జీపు తీసుకుని  ఓ రోజు ఉదయం ఏదో గ్రామానికి టూరుకు వెళ్లి తిరిగి వస్తుంటే జీపు టైరు పంక్చర్ అయింది. సెల్ ఫోన్లు లేని రోజులాయె. డ్రైవర్ పంక్చర్ వేయించుకుని రావడానికి కొన్ని మైళ్ళ దూరంలో వున్న మరో పెద్ద  వూరికి వెళ్ళాడు. కలెక్టర్ గారి వెంట వున్న బిళ్ళ బంట్రోతు, అయ్యగారికి చెట్ల నీడన వున్న ఒక మోరీ చూపించి అక్కడ కూర్చోపెట్టాడు. డ్రైవర్ రావడానికి బాగా వ్యవధి వుంది. అటూ ఇటూ చూస్తున్న  కలెక్టర్ గారి దృష్టికి దగ్గరలో ఓ వూరు జాడ కనిపించింది. కొందరు ఆడవాళ్ళు బిందెలు చంకన పెట్టుకుని వస్తూ  కానవచ్చారు. ఆయన వారిని పలకరించి, 'నీళ్ళ కోసం  ఇంత దూరం ఎందుకు పడుతూ లేస్తూ వస్తున్నారు, మీ వూళ్ళో మంచి నీటి  బావి లేదా?' అని ప్రశ్నించారు. 'నువ్వేమన్నా ఆర్చేవాడివా, తీర్చేవాడివా' వంటి చొప్పదంటు   ప్రశ్నలు వాళ్ళు వేయకుండా, 'వూళ్ళో బావులకేం చాలా వున్నాయి, కానీ మమ్మల్ని అక్కడ నీళ్ళు తోడుకోనివ్వరు' అని బదులు చెప్పారు. కలెక్టర్ సాలోచనగా తలపంకించి ఊరుకున్నారు. ఈలోగా టైరు పంక్చర్ వేయించుకుని డ్రైవర్  తిరిగివచ్చాడు. కలెక్టర్ తన మానాన తాను పొతే కధే లేదు. ఆయన అల్లాంటి ఇల్లాంటి అధికారి కాదు కాబట్టి ఏం చేయాలో వెంటనే ఆలోచించి పెట్టుకున్నాడు. డ్రైవర్ ని నేరుగా  జిల్లా కేంద్రానికి పంపించి తాను ఆ మోరీ మీదనే కూర్చుండిపోయాడు. ఈలోగా ఆయన మౌఖిక ఆదేశాలు అందుకున్న కలెక్టర్ గారి సిబ్బంది, స్థానిక తాసిల్దారు  టైప్ రైటర్లు, కలెక్టర్ గారి అధికారిక ముద్రిక తదితరాలతో సహా అక్కడికి వచ్చారు. ఊళ్ళోకి కబురు పంపి గ్రామ సర్పంచుని రప్పించారు. ఈ హడావిడి అంతా చూసి ఊరిజనం అంతా అక్కడ పోగయ్యారు. వూరి వెలుపల నుంచి మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి వారి గూడెం లోనే ఒక మంచి నీటి బావి మంజూరు చేయాలని  సర్పంచు నుంచి ఓ అభ్యర్ధన పత్రం తీసుకున్నారు. దానికి అక్కడికక్కడే స్థానిక అధికారి నుంచి ఆమోద ముద్ర వేయించారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుంటూ అందుకు అవసరమైన నిధులను తక్షణమే  మంజూరు చేస్తూ ఆ మోరీ మీదనే  కూర్చుని సంతకం చేసి, కింద స్టాంపు వేసారు.  ఆ వెనువెంటనే  కూలీలను పిలిపించారు. బావి తవ్వకానికి ఆయనే స్వయంగా గడ్డపారతో మొదటి పలుగు వేసి స్వీకారం చుట్టారు. ఝాము పొద్దెక్కక ముందే ఝామ్మని బావి  పని మొదలయింది. అంతకుముందు ఆ ఊరిజనం ఇలాటి అధికారిని చూడలేదు సరికదా కనీసం వినికూడా వుండలేదు. అందుకే అందరి మొహాల్లో నిండుకున్న నిబిడాశ్చర్యం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వారి వూరిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శుభారంభం జరిగింది. పొద్దుగూకే సమయానికి బావిలో సమృద్ధిగా జలపడింది. ఆ వూరి గూడెం జనానికి కొత్త పొద్దు పొడిచింది.
ఆ జిల్లా ఖమ్మం జిల్లా. ఆ వూరు రెబ్బారం అని అందరూ పిలుచుకునే రెబ్బవరం. ఆ కలెక్టర్ గారి పేరు ఆర్. పార్ధసారధి. ఆయన ఇప్పుడు జీవించి లేరు.  కానీ ఆ గూడెం ప్రజల మనస్సులో ఇంకా జీవించే వున్నారు.  
పురుషుల్లో పుణ్యపురుషులు వేరయా అన్నట్టు అధికారుల్లో కూడా పుణ్యమూర్తులయిన అధికారులు వుంటారు అని చెప్పడానికే ఈ సోదాహరణ.           
ఈ యాభై ఏళ్ళలో అనేక మార్పులు వచ్చాయి. జిల్లాకు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి మాత్రమె వుండే  పద్దతి మారి జిల్లాకు ముగ్గురు నలుగురు వచ్చారు. టార్పాలిన్ పట్టాలు వున్న జీపులు పోయి అధునాతన వాహన శ్రేణి వచ్చి చేరింది. జిల్లా మొత్తంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో తెలియచెప్పే సమాచార  వ్యవస్థ చేతికి అంది వచ్చింది. సిబ్బంది పెరిగారు. జనం ఇబ్బందులూ పెరిగాయి. మరీ అంతలా కాకపోయినా, రాజకీయ అవరోధాలను అధిగమించి, పదిమందికి పనికి వస్తాయని తాము అనుకున్న మంచి పనులను అనుకున్న రీతిలో చేసి పెట్టె అధికారులు కూడా మన మధ్యనే వున్నారు.

(సురేష్ చందా)

ఇప్పుడు అలాటి ఓ మంచి అధికారి చేసిన ఓ మంచిపని గురించి రెండు రోజులుగా మీడియాలో మంచి మంచి కధనాలు వస్తున్నాయి.
సురేష్ చందా అనే ఆ అధికారి తెలంగాణా సచివాలయంలో ఒక ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో ఆరోగ్య, వైద్య సేవలు ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలా అందుతున్నాయో పర్యవేక్షించే ఐ.ఏ.ఎస్. అధికారి. యువకుడు  కావడం వల్ల కంప్యూటర్ పరిజ్ఞానం హెచ్చుగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అంచేత తన శాఖ పని తీరు మెరుగుపరుచుకోవడానికి ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని ఆయన భావించారు. తెలంగాణాలో పేరొందిన గాంధి ఆసుపత్రితో మొదలు పెట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏమూల ఏం జరుగుతున్నదో  సచివాలయంలోని తన చాంబర్ నుంచే కనిపెట్టి చూసే ఉద్దేశ్యంతో ఆ ఆసుపత్రిలో సుమారు రెండువందల నిఘా కెమెరాలను అమర్చాలని తలపెట్టారు. కిందవాళ్ళు చేసే పనులను కనిపెట్టి చూడడం ఆయన  బాధ్యతల్లో ఒకటి. కానీ, తాను  ఎలా పనిచేస్తున్నది కూడా  నలుగురికీ తెలియాలి కదా! అందుకని ఈ ప్రయోగాన్ని ఆయన తనతోనే ప్రారంభించారు. చడీచప్పుడూ కాకుండా తన కార్యాలయంలో ఒక నిఘా కెమెరాను ఏర్పాటు చేసుకున్నారు. తన గదిలో ఏం జరిగేది, తనను కలుసుకోవడానికి ఎవరెవరు వచ్చేది, ఏం మాట్లాడేది రికార్డు చేయడం కోసం ఈ కెమెరా. అయితే ఈ కెమెరా రికార్డు చేసేది తను ఒక్కరే కాకుండా ఎవరయినా సరే  చూడగలిగేలా ఇంటర్నెట్ తో దాన్ని  అనుసంధానం చేయడం ఇందులోని ఒక ప్రత్యేకత. 'సమాచార చట్టం ప్రకారం ప్రజలకు తెలుసుకునే హక్కు వచ్చింది. వాళ్ళు అడిగితె ఇవ్వడం కాకుండా అడక్కుండానే యావత్ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచితే తప్పేమిట'నేది ఈ అధికారి అభిప్రాయం. తన దృష్టికి వచ్చిన ఫైళ్ళపై తాను  రాసిన నోట్ వివరాలను కూడా వెంటవెంటనే ఆయన ఇంటర్నెట్లో పెడుతుంటారని  పత్రికల్లో చదివినవారికి ఒకింత ఆశ్చర్యం కలగడం సహజం. అవసరానికి మించిన గోప్యతను అధికారులు పాటించడం వారికో అలవాటని జనంలో ఒక అభిప్రాయం బలంగా నాటుకుని ఉండడమే ఇందుకు కారణం. తాము చెప్పినది సావకాశంగా విని, కోరిన సమాచారం ఓ మేరకయినా అధికారులు అందించగలిగితే, తమ సమస్య సగం పరిష్కారం అయిందని సంతోషించే సామాన్యుల సంఖ్య కూడా అధికమే.
'అనుమతి లేకుండా పురుగు కూడా ప్రవేశించలేని అతి శీతల గదుల్లో కూర్చుని అధికారులు ఏం చేస్తుంటారు?' అనే అనుమానం సాధారణ జనంలో వుంది. అ అధికారుల గదుల్లోకి కనీసం తొంగి చూడడానికి కూడా వీలుపడని  వారికి సురేష్ చందా అనే ఈ అధికారి చేస్తున్నది అబ్బురం అనిపించడంలో సందేహం లేదు.    
అడగగానే మెచ్చి వరాలు ఇచ్చే దేవుళ్ళకు మన పురాణాల్లో కొదవలేదు. అడగకుండానే సమాచారం ఇవ్వాలనే అభిమతం కొందరు అధికారుల్లో అయినా ఊపిరి పోసుకోవడం  అభిలషణీయం. ఆహ్వానించదగ్గ పరిణామం .
మొత్తం పరిపాలన ఇలా ప్రజల  కళ్ళ ముందు జరగడం అంటూ జరిగితే పాలకుల పట్ల ప్రజల్లో పేరుకుపోతున్న అసహనం ఓ మేరకయినా తగ్గడం కూడా  ఖాయం.   (02-05-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595

28, ఏప్రిల్ 2015, మంగళవారం

నేపాల్ భూకంపం : నేర్చుకోవాల్సిన పాఠాలు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY IN IT'S EDIT PAGE ON 30-04-2015, THURSDAY)

నేపాల్ భూకంపం మానవాళికి కొత్త పాఠం బోధిస్తోంది.
ఆధునిక విజ్ఞానం అందించిన సాధన సంపత్తితో ప్రకృతిని జయింఛామని విర్రవీగడాన్ని మించిన అజ్ఞానం మరోటి లేదని. ప్రకృతి ప్రకోపిస్తే రోదసిని దాటివేసిన అడుగులు కూడా నిరర్ధకమనీ మానవులకు నూతన సూక్తులను ప్రబోధిస్తోంది.  చంద్రుడి మీద పాదం మోపి, గగనాంతర సీమల్లో విహారాలు సలిపి, గ్రహాంతర వీధుల్లో సంచారాలు చేసి వచ్చిన మనిషి ప్రతిభాపాటవాలు  ప్రకృతి శక్తికి ఏమాత్రం దీటు రావని, సాటి కావని మరోమారు తెలియచెప్పుతోంది.


నాగరీకత ధ్యాసలో మునిగి,  ఆధునికత ఆశలో కూరుకుపోయి అవివేకంగా వేస్తున్న అడుగులే సమస్త మానవాళికి ముప్పు తెస్తున్నాయన్న హెచ్చరికలను లెక్కచేయకుండా  పక్కనబెట్టి చేస్తున్న పనులే ప్రకృతి వైపరీత్యాలకు కారణభూతం అవుతున్నాయన్న ఎరుక కరువై, మనిషి  కొని తెచ్చిపెట్టుకున్న కష్టాల జాబితాలో భూకంపాలు కూడా వున్నాయి. అడ్డూ అదుపూ లేకుండా మానవులు సాగిస్తున్న ప్రకృతి విధ్వంసం, అడవుల నాశనం, చమురు వెలికితీతలు, సమతుల్యాన్ని దెబ్బతీసే తవ్వకాలు ఇలాటి   వైపరీత్యాలకు హేతువులు అవుతున్నాయి.  సుద్దులు, సూక్తులు  తలకెక్కక పోవడం వల్లనే అకారణ, అవాంఛిత మరణాలకు, ఆస్తుల విధ్వంసానికి  దారితీస్తున్నాయి.
కొన్ని ప్రకృతి వైపరీత్యాలు ముందస్తుగా చెప్పివస్తే, మరి కొన్ని పసికట్టేలోగానే తమ ప్రతాపం చూపిస్తాయి. కళ్ళు మూసి తెరిచేలోగా ఏదో విధ్వంసక శక్తి తన మంత్రం దండానికి పని చెప్పినట్టు మేడలు మిద్దెలు పేక మేడల్లా నిమిషాల్లో కూలిపోతాయి. జీవితం యెంత క్షణ భంగురమో తెలిసివచ్చేలా అంతవరకూ నీడ ఇచ్చిన ఇంటి శిధిలాల్లోనే ఇంటిల్లిపాది చిద్రం అయిపోవడం ఇటువంటి సందర్భాల్లో అనుభవైకవేద్యం. చనిపోయిన వారు పోగా ప్రాణాలతో మిగిలివున్నవారు అయినవారినందరినీ  కళ్ళముందేపోగొట్టుకున్న వేదనతో కొంతా,  మృత్యు ముఖంలోకి వెళ్ళివచ్చిన భయపు ఛాయలు వదలక మరికొంతా జీవచ్చవాలుగా మారుతారు. నేపాల్ లో జరిగిన భూకంపం కలిగించిన ఉత్పాతాన్ని కళ్ళారా చూసిన గర్భవతులయిన అక్కడి మహిళలు మానసిక ఆందోళనతో గర్భ విచ్చిత్తి పొందినట్టు వస్తున్న వార్తలు ఇందుకు తార్కాణం.
అతి చిన్న దేశానికి అతి పెద్ద కష్టం వచ్చి పడింది. అంతర్జాతీయ సమాజం పెద్ద మనసుతో తన వంతు బాధ్యత పోషిస్తోంది. ఐక్యరాజ్య సమితి స్వయంగా రంగంలోకి దిగింది. నేపాల్ కు పెద్దన్న అనే పేరు వున్న భారత దేశం ఆపన్న దేశానికి సహాయ హస్తం అందించింది. అనేక భారతీయ విమాన సంస్థలు, టెలికాం సంస్థలు, వస్తు ఉత్పత్తి సంస్థలు నేపాల్ విషయంలో కనీవినీ ఎరుగని భారీ రాయితీలు ప్రకటించాయి. జరగరానిది జరిగినప్పుడు జరగాల్సినవన్నీ యాంత్రికంగా జరిగిపోతూనే వుంటాయి. పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేకపోయినా, జరిగిన నష్టాన్ని  పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోయినా ఓ మేరకయినా సాయం అందుతుంది. అదో ఊరట. మానవత్వం ఇంకా వూపిరితోనే వుందని ఓ భరోసా.
సందర్భం కాబట్టి కొన్నేళ్ళ క్రితం జరిగిన  ఓ విషయాన్ని మననం చేసుకోవడం సందర్భోచితమే అవుతుంది. అందుకే ఈ పునశ్చరణ.
అది 2011 సంవత్సరం. అది  జపాన్ దేశం.
                             

ఉవ్వెత్తున లేచిన సముద్రపు అలలు చెలియలికట్టదాటి అంతెత్తున ఎగసిపడి మిన్నూ మన్నూ ఏకం చేస్తూ తమ ఉగ్రరూపాన్ని ప్రదర్శించినప్పుడు

ప్రకృతి ప్రకోపానికి గురయి, మానవ నిర్మిత కట్టడాలన్నీ పేకమేడల్లా కూలిపోతున్నప్పుడు,

పొంగి పొరలిన సంద్రపు నీటిలో పెద్ద పెద్ద కార్లూ, విమానాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోతున్నప్పుడు-

యుగాంతంవంటి హాలీవుడ్ సినిమాల్లో చూపించిన గ్రాఫిక్ దృశ్యాలను తలదన్నే విధంగా ప్రకృతి ప్రదర్శించిన విలయతాండవం ముందు మనిషి మరుగుజ్జుతనం మరోసారి ప్రపంచానికి వెల్లడయింది.

మూడింట రెండువంతులు నీరు ఆవరించివున్న ఈ భూమండలంలో జపాన్ అనేది అనేకానేక చిన్న చిన్న దీవుల సమూహం. ఈ దీవుల్లో హోన్షూ, షికోకు, హూక్కై దో, క్యుషూ అనేవి ప్రధానమైనవి.

అయితే బయట ప్రపంచానికి తెలిసిన జపాన్ అంటే హోన్షూ నే. ఎందుకంటె, జపాన్ అనగానే అందరికీ తటాలున గుర్తొచ్చే టోకియో, ఒసాకా,నగాయో,క్యోటో నగరాలు హోన్షూ అనే ఈ ప్రధాన భూభాగం లోనే వున్నాయి. జపాన్ జనాభాలో అత్యధిక భాగం హోన్షూ లోనే నివసిస్తూవుండడం కూడా మరో కారణం. పైగా, దేశ ఆర్ధిక వ్యవస్తకు ఇది గుండెకాయ లాటిది. విస్తీర్ణం దృష్ట్యా పెద్దదే అయినా, ప్రపంచపఠంలో చూస్తే మాత్రం హోన్షూ దీవి ఒక అరటి పండు మాదిరిగా కనిపిస్తుంది. పసిపిక్ మహా సముద్రం మధ్య వున్న ఈ దీవి, యావత్ ప్రపంచంలో ఒక సంపన్నదేశంగా జపాన్ ఆవిర్భావానికి దోహదం చేసింది. ఎలెక్ట్రానిక్, మోటారు పరిశ్రమలతో మొత్తం ప్రపంచ దేశాలలోనే పేరుపొందిన జపాన్ సునామీలు, భూకంపాలకు కూడా పెట్టింది పేరు.

వారికి మరో మంచి పేరు కూడా వుంది. అదే ఈ వ్యాసానికి ప్రేరణ. అన్ని దేశాలకు అనుసరణీయం. ఇలాటి ఉపద్రవాలపట్ల ఆ దేశం సాధించిన సంసిద్ధతే ఆ దేశానికి ఈ మంచి పేరు కట్టబెట్టింది.  ఈ విషయంలో జపాన్ కు సరితూగగల మరో దేశం ప్రపంచంలో లేదనడం అతిశయోక్తికాదు. ఎందుకంటె సునామీలు, భూకంపాలు ఆ  దేశానికి కొత్తకాదు. అక్కడి ప్రజలు వాటితో సహజీవనం చేయాల్సిన పరిస్తితి. నిజానికి సునామీ, (త్సునామీ ) టైఫూన్ అనే పదాలు జపాన్ భాషకు చెందినవేనంటారు. ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఏమి చేయాలన్నది పైనుంచి కింద దాకా అన్ని స్తాయిల్లోని వారికి కరతలామలకం.

ప్రజలందరికీ ఈ విషయంలో చక్కని అవగాహన వుంటుంది. మిన్ను విరిగి మీద పడే సందర్భాలలో సయితం నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను గురించి అతి తక్కువ స్తాయిలోని ఉద్యోగికి కూడా తెలిసివుంటుంది. ముఖ్యంగా గత అనేక  సంవత్సరాల కాలంలో అక్కడి నిపుణులు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో తక్షణం స్పందించాల్సిన తీరు గురించి శాస్త్రీయ పద్ధతుల్లో ఒక నిర్దిష్టమయిన విధానాన్ని రూపొందించుకున్నారు. ఈ  దుర్ఘటనలో జన నష్టం నివారణకు అది బాగా ఉపయోగపడిందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో వారు అధునాతన కంప్యూటర్ వ్యవస్తను కూడా చక్కగా వాడుకుంటున్నారు. ఈ కోణం దృష్ట్యా ఆలోచిస్తే, ఆ దేశం నుంచి ఇతర దేశాలు నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపిస్తోంది.

భూకంపాలవంటి విపత్తులు ముంచుకొచ్చినప్పుడు ప్రతి పౌరుడు ఎలాటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించడం వల్ల ఒకరినుంచి ఆదేశాలు కానీ, సూచనలు కానీ అందుకోవాల్సిన అవసరం లేకుండా అందరూ ఎవరికివారు పరిస్తితికి తగ్గట్టుగా వెంటనే స్పందించగలిగారని ఒక ప్రత్యక్ష సాక్షి కధనం.

ప్రకృతి  వైపరీత్యం గురించిన అనుమానం తలెత్తగానే ఎవరికి వారు ముందు తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం  ఇవ్వాలనేది శిక్షణలో నేర్పే తొలి పాఠం. ఆ జాగ్రత్త తీసుకున్న తరువాత  ఆ సమాచారాన్ని ఇతరులకు తక్షణం తెలియచెప్పాలన్నది రెండో పాఠం. అదేసమయంలో తోటి వారి భద్రతకు ఏం చెయ్యాలని ఆలోచించాలి. మిన్నువిరిగి మీదపడే సందర్భాలలో సయితం ఇలా స్థితప్రజ్ఞతతో ఆలోచించగల నైపుణ్యాన్ని జనాలకు కలిగించడం ఈ శిక్షణ లక్ష్యం.

ఉదాహరణకు ఒగాకీ నగరాన్ని తీసుకుందాము. అక్కడి జనాభా లక్షా యాభయ్ వేలు. ఇంగ్లీషు మాట్లాడే దేశాలనుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పట్టుమని పాతికమంది కూడా వుండరు. అయినా ఇంగ్లీష్ అనువాదకుల జాబితా అధికారుల వద్ద సిద్ధంగా వుంటుంది. విపత్కర పరిస్తితులను ఎదుర్కోవడానికి ఈ రకమయిన సంసిద్ధత చాలా అవసరమని జపానీయులు నమ్ముతారు.

అలాగే, ఇంటర్ నెట్ ను ఇలాటి సందర్భాలలో వినియోగించుకుంటున్న తీరు కూడా అమోఘం. సాధారణంగా ఈ సదుపాయాన్ని వాడుకునే వారి సంఖ్య ఆ దేశంలో చాలా అధికం. విద్యార్ధి దశ నుంచే అక్కడి వారు దీన్ని బాగా ఉపయోగిస్తారు. అక్కడి విద్యాసంస్తలు విద్యార్ధులతో అనుసంధానం కావడానికి ప్రత్యేక పోర్టల్ ఉపయోగిస్తాయి. విద్యార్ధులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తరగతి షెడ్యూల్ సరి చూసుకోవడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని వెనువెంటనే తెలియచేయడానికి ఇది వారికి బాగా అక్కరకు వస్తోంది. ఈ పోర్టల్ లో ముందు కానవచ్చేదే ఎర్రటి పెద్ద అక్షరాలతో కూడిన హెచ్చరిక. ఈ రోజు తరగతిలో ఏఏ పాఠాలు బోధించబోతున్నారనే విషయం తెలుసుకోవడానికి ఆతృతతతో పోర్టల్ తెరిచిన విద్యార్ధులకు ఆ దుర్ఘటన జరిగిన రోజు కనబడిన హెచ్చరిక ఏమిటో తెలుసా? “తరగతి సంగతి మరచిపోండి. సునామీ విరుచుక పడబోతోంది. వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపొండి

ఈ విధమయిన ఏర్పాట్లు అన్ని కార్యాలయాలలో, సంస్తలలో వుండే విధంగా ఆ దేశంలో అనేక చర్యలు తీసుకున్నారు. అందుకే, సెకన్ల వ్యవధిలోనే సమాచారం దేశంలోని నలుమూలలకు చేరిపోయింది. జనాలను గాభరా పెట్టేందుకు కాక అప్రమత్తం చేసే ఉద్దేశ్యంతో చేసిన ఈ హెచ్చరికలు సత్ఫలితాలను ఇచ్చాయని అక్కడివారు చెబుతున్నారు.

పాట్రిక్ అనే సిస్టం ఇంజినీర్ తన అనుభవం గురించి చెప్పిన వివరాలు వింటే యుద్ధ ప్రాతిపదికఅని తరచుగా వినబడే మాటకు అసలుసిసలు అర్ధం బోధపడుతుంది.

భూకంప ప్రకంపనలకు సంబంధించిన తొట్టతొలి సూచనను గమనించిన ఆ ఇంజినీర్ పంపిన సమాచారం రెండు సెకన్ల వ్యవధిలోనే చేరాల్సిన చోటికి చేరిపోయింది. తూర్పు జపాన్ తీరానికి దగ్గరలో తీవ్రమయిన భూకంపం సంభవించిందన్న ప్రభుత్వ సమాచారం వేలమైళ్ళ దూరంలో వున్నవారికి సయితం చేరడానికి మరో రెండు సెకన్ల కంటే ఎక్కువ వ్యవధి పట్టలేదు. మరో రెండు సెకన్లలో భూకంపం సంభవించిన ప్రాంతాలతో టెలిఫోన్ సంబంధాలు తెగిపోయిన సమాచారం అందింది. అయితే, వెనువెంటనే రిమోట్ ద్వారా ఎమర్జెన్సీ కాంటాక్ట్ సదుపాయాన్ని పునరుద్ధరించిన కబురు అందింది. ఇదంతా జరగడానికి పట్టిన సమయం కేవలం తొంభయ్ సెకన్లు. మరోపక్క సహోద్యోగులు, ఇరుగుపొరుగువారి రక్షణ బాధ్యతను ఎవరికివారు స్వచ్చందంగా భుజాన వేసుకున్నారు. ఎవరు ఎక్కడ వున్నారు అన్న సమాచారాన్ని క్షణాల మీద తెప్పించుకుని వారిని అప్రమత్తం చేసారు.

ఇదేమాదిరి సన్నివేశాలు ఆ రోజు జపాన్ దేశమంతటా కానవచ్చాయంటే ఇలాటి సందర్భాలలో ఆ దేశ సంసిద్ధత ఎలావున్నదన్నది వూహించుకోవచ్చు.

ఆ ఇంజినీర్ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియచేసారు.

నేనున్న చోట ఆ రోజు భూమి కంపించడం మొదలయింది. బాగా గాలి వీస్తోంది కాబట్టి భవనం వూగుతోందని ముందు భ్రమ పడ్డాను. మా దేశం భూకంపాలకు నిలయం కనుక వాటిని తట్టుకునేలా భవనాలను నిర్మించుకోవడం ఇక్కడి పధ్ధతి. అందుకోసం ప్రచండమయిన గాలులు వీచినప్పుడు భవనాలు కదిలిపోయేలా వాటిని నిర్మిస్తారు.భూకంపాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం వీలయినంత తగ్గించడానికి ఈ విధమయిన నిర్మాణ పద్ధతులను అనుసరిస్తున్నారు.

ఆ రోజు నేను వున్న భవనం వూగిపోవడం మొదలుకాగానే, కిటికీ నుంచి బయటకు చూసాను. దాపున వున్న రైల్వే స్టేషన్ నుంచి ఓ రైలు బయటకు వస్తోంది. వున్నట్టుండి ఆ రైలుకు బ్రేకులు పడ్డాయి. కీచుమని శబ్దంచేస్తూ పట్టాలపై ఆగిపోయింది. బహుశా, భూకంపం గురించిన సమాచారం తెలిసినవారెవ్వరో రైలు డ్రయివర్ కు ఇంటర్నెట్ ద్వారా ఆ కబురు చేరవేసివుంటారు. అందువల్లనే రైలును వెంటనే నిలిపివేసారు. ఎందుకు ఆపాల్సి వచ్చిందో ప్రయాణీకులకు లౌడ్ స్పీకర్ల ద్వారా తెలియచేసివుంటారు. అది వేరే విషయం. ఈ దేశంలో ఇవన్నీ సర్వ సాధారణం.

గంటకు నూట యాభయ్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్న రైళ్ళు కూడా, ముందస్తు సమాచారం అందుకున్న కారణంగా ఎక్కడికక్కడ నిలచిపోయాయి. వాటిల్లో వున్న ప్రయాణీకులందరూ క్షేమంగా వున్నారు. ఇలాటి ఏర్పాట్లు సమగ్రంగా వున్నందువల్ల ఎక్కడా రైళ్ళు పట్టాలు తప్పలేదు. సునామీ సమయంలో జపాన్ రైల్వే వ్యవస్థ పనిచేసిన తీరు అమోఘం. మొత్తం మీద హోన్షూదీవిలో ప్రతిచోటా ఇదే దృశ్యం.  విమానాలు గాలిలో ఎగిరాయి. భవనాలు కూలకుండా నిలిచాయి. ప్రజాజీవనం అస్తవ్యస్తం కాలేదు.

ఒగాకీ నుంచి రైల్లో నగోవా వెడుతున్నప్పుడు అనేక కర్మాగారాలు కానవస్తాయి. వీటిల్లో చెప్పుకోదగింది బీరు తయారుచేసే ఓ కర్మాగారం. పైకి పెద్ద పెద్ద బీరు సీసాల మాదిరిగా కానవచ్చే ట్యాంకుల్లో విపరీతమయిన వొత్తిడి మధ్య బీరు నిలవచేస్తారు. ఈ ఫాక్టరీలలో ప్రమాదకరమయిన రసాయనాలు వుంటాయి. నిజానికి ట్రిగ్గర్ లేని దారుణమయిన ఆయుధాల వంటివి ఈ కర్మాగారాలు. కానీ, వీటిల్లో ఏ ఒక్కటీ పేలిపోలేదు. ఎందుకంటె, సునామీలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తట్టుకోవడానికి వీలయిన వ్యవస్తలను జపాన్ సిద్ధంచేసి పెట్టుకుంది. సమయానికి ఆ వ్యవస్తలు అనుకున్నవిధంగా పనిచేశాయి. కనీవినీ ఎరుగని విపత్తు వాటిల్లినప్పుడుకూడా లక్షలాదిమంది ప్రాణాలు నిలబడ్డాయంటే, ముందే పకడ్బందీగా నిర్మించుకున్నఈ వ్యవస్తలన్నీ అనుకున్నవిధంగా పనిచేయడమే కారణం. ఇందులో అతిశయోక్తి ఏమీలేదు. నిజంగా వ్యవస్థ పనిచేసింది. ఇది మానవ నాగరిక సమాజం సాధించిన విజయం. జపాన్ లోని ప్రతి ఇంజినీరు ఈ విపత్కర సమయంలో తన దేశం కోసం, తన తోటివారికోసం కష్టించి పనిచేసాడు. అయితే, ఇది అప్పుడే గట్టిగా పైకి చెప్పుకోలేని పరిస్తితి. ఎందుకంటే జరగాల్సినంత స్తాయిలో దారుణం జరగకుండా నిరోధించగలిగినామన్న సంతోషం మాకెవరికీ మిగలలేదు. జరగకూడనిది జరిగిపోయింది. అనేకమంది మరణించారు. ఇంకా అనేకమంది జాడ తెలియడం లేదు. వారి కుటుంబాలు రోదిస్తున్నాయి. మిగిలిన మేమందరం వారందరికీ బాసటగా నిలవాల్సిన తరుణం ఇదిఅని ఆ ఇంజినీర్ తన భావాలను పంచుకున్నాడు.

అంత నిబ్బరంగా కర్తవ్యాలను నిర్వర్తించిన జపాన్ ప్రజలు సర్వదా అభినందనీయులు. చూసినదానినుంచీ, విన్నదానినుంచీ నేర్చుకోవడాన్నే విజ్ఞానం అంటారు. లేకపోతే మిగిలేది అజ్ఞానమే. (28-04-2015)

రచయిత మొబైల్: 98491 30595, ఈమెయిలు:  bhandarusr@gmail.com

NOTE: Courtesy Image Owner  

పడిలేచిన కెరటం - హోండా




సోయ్ చిరో హోండా! ఉహు గుర్తు రావడం లేదు.
పోనీ ఉట్టి హోండా!ఓహో!  హోండానా! హోండా యెందుకు తెలవదు. హీరో హోండా. మోటారు సైకిల్.
అమ్మయ్య అలా గుర్తుకు వచ్చింది కదా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ మోటారు  సైకిళ్ళను, హోండా మోటారు వాహనాలను ఉత్పత్తిచేసే హోండా మోటారు కంపెనీ స్థాపకుడీయన.


ఈ స్థాయికి రావడానికి ఆయన ఎన్నో పాట్లు పడ్డాడు. పడడమే కాదు పడి లేచాడు. లేచి నిలబడ్డాడు. తాను నిలబడి  తన కంపెనీని నిలబెట్టాడు.
అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఈ జపానీయుడికి  చిన్నతనం నుంచి వాహనాలు అంటే ఎంతో మోజు. ఆ రోజుల్లో వాళ్ల వూరికి వచ్చే మోటారు వాహనాలను చూడడానికి, వీలుంటే ఒకసారి చేతితో తాకడానికి చాలా మోజుపడేవాడు. ఆ అవకాశం దొరక్క కేవలం ఆ మోటారు వాహనం నుంచి వెలువడే చమురు వాసన పీల్చి తృప్తిపడేవాడు. అలాటి వాడు భవిష్యత్తులో ఒక పెద్ద మోటారు వాహనాల కంపెనీ స్తాపించగలడని వూహించడానికి కూడా వీలులేని రోజులవి. బతుకు తెరువుకోసం ఓ గరాజులో పనికి కుదిరాడు. కానీ అతడి ఆరాటం బతుకు బండి నడపడం కాదు. మోటారు బండి తయారు చేయడం.

ఈ క్రమంలో అతడి ఆలోచనలనుంచి రూపుదిద్దుకున్న పిస్టన్ అతడి బతుకు బాటను ఓ మలుపు తిప్పింది. అంతా ఓ గాట్లో పడుతోందని అనుకుంటున్న సమయంలో వచ్చిన భూకంపంలో అతడి ఫాక్టరీ సర్వనాశనం అయింది. కధ మళ్ళీ మొదటికి వచ్చింది. భూకంపం అతడి ఫాక్టరీని ద్వంసం చేయగలిగింది కాని అతగాడి పట్టుదలను కాదు కదా! అందుకే అతడు కధ మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి మరింత కసిగా.
అతడి కృషితో ఫాక్టరీ తిరిగి ఉత్పత్తి మొదలు పెట్టింది. అంతా సజావుగా సాగుతోంది. ఆర్డర్లు పెరుగుతున్నాయి. కంపెనీ కోలుకుంటోంది. ఈ దశలో మళ్ళీ కోలుకోలేని డెబ్బ తగిలింది. రెండో ప్రపంచయుద్ధం పుణ్యామా అని హోండా ఫాక్టరీ మూతపడింది.
యుద్ధం ముగిసింది. హోండా మళ్ళీ నడుం  బిగించాడు. పట్టుదలే అతడి పెట్టుబడి. అంతకంటే మించిన పెట్టుబడి మరి ఏముంటుంది. అందుకే అతడి కల ఫలించింది. వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఇక రాలేదు. కంపెనీ అప్రతిహతంగా   అభివృద్ధి పధంలో పురోగమించింది. దేశదేశాల్లో హోండా పేరు మారు మోగింది. విశ్వవ్యాప్తంగా హోండా కార్లకు ఆదరణ పెరిగింది. మోటారు వాహనాల రంగంలో హోండా పతాకం వినువీధులకు ఎగిరింది.

పడిలేచిన కెరటంఅంటే ఇదేనేమో! 

NOTE : Courtesy Image Owner 

26, ఏప్రిల్ 2015, ఆదివారం

నాకు నచ్చిన నా రచన




రామారావును నేను చిన్నప్పటినుంచీ ఎరుగుదును.

చిన్నతనంలో బొద్దుగా ముద్దుగా వుండేవాడు. వున్న వూళ్ళో స్కూలు సదుపాయం లేకపోవడంతో  పట్నంలో బావ గారింటికి చేరాల్సివచ్చింది. వేసవి సెలవులివ్వగానే సొంతూరు మీద గాలి మళ్ళేది. అంతే. బస్సెక్కి తుర్రున వాళ్ల వూరు బయలుదేరేవాడు. ఆ రోజుల్లో బస్సు టిక్కెట్టు- అందులో అరటిక్కెట్టాయె - నాలుగణాలు పోను అక్కయ్య ఇచ్చిన రూపాయిలో ఇంకా ముప్పావలా జేబులో మిగిలేది. బస్సు దిగగానే, ఓ అణా పెట్టి కట్టె మిఠాయి, ఇంకో అణా పెట్టి జీళ్ళు కొనుక్కుని కాలవ గట్టెక్కేవాడు. ఇక అక్కడినుంచి ఒకటే పాటలు, పద్యాలు. టైం తెలిసేది కాదు. మాయాబజారులో 'వివాహ భోజనంబు' పాట పదమూడోసారి ఎత్తుకునేలోపల ఊరొచ్చేసేది. మూడు మైళ్ళు మూడంగల్లో దాటి వచ్చిన ఫీలింగు. 'ఆహా' అనుకునేవాడు. తన గొప్పే అనుకునేవాడు. చూసి నవ్వుకునేవాడిని.

పల్లెటూళ్ళో రాజభోగం. వేడి వేడి అన్నం. వెన్న కాచిన నెయ్యి. అరచేతిమందాన  మీగడ. ముద్దపప్పు. వూటలూరే కొత్తావకాయ. ఓహో ఏమి రుచి. రాళ్ళు తిని హరాయించుకునే ఆరోగ్యం తనదని మురిసి ముక్కచెక్కలయ్యేవాడు. రామారావుని చూసి జాలితో నవ్వుకునేవాడిని.

రామారావు పెరిగాడు. ఎదిగాడు. సన్న గీత గీసినట్టు మీసకట్టు. నిగనిగలాడే జుట్టు. ఎగదువ్విన క్రాఫు. ఎవరో అచ్చు నాగేశ్వర్రావులా వుంటావన్నారు. నిజమే కాబోలనుకున్నాడు. నవ్వుకోవడం నా వంతయింది.

రామారావుకు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. అయినా చిన్న కుర్రాడిలానే వున్నాడు. తోటివారిలా బొజ్జ రాలేదు. బరువు పెరగలేదు. జుట్టు నెరవలేదు. బట్ట తల రాలేదు. కంటి చూపు తగ్గలేదు. ముప్పయ్యేళ్ళ క్రితం ఎలావున్నాయో ముప్పయి రెండు పళ్ళు అలాగే గట్టిగా పటిష్టంగా వున్నాయి. నాది 'పెగ్గుల లెక్క కాదు జగ్గుల లెక్క' అంటూ మూడు సీసాలు ఆరు సోడాల మాదిరిగా 'సాయంకాలక్షేపాలు' చేసేవాడు. 'చూశారా నా స్పెషాలిటీ' అన్నట్టు రొమ్ము విరుచుకు తిరిగే వాడు. రామారావుని చూస్తుంటే నాకిక నవ్వు రావడం లేదు. జాలి కలుగుతోంది.

రామారావుకు మెల్లమెల్లగా వయసు మీద పడుతోంది. కొంచెం కొంచెంగా వెంట్రుకలు చెప్పాపెట్టకుండా రాలిపోతున్నాయి. వెనుకనుంచి చూసేవారికి జుట్టు మధ్యలో గచ్చకాయ మందంలో ఖాళీ కనబడుతోంది. నెలల తేడాలోనే బెల్ట్ సైజ్ పెరిగింది. ముందు పొట్ట కనబడి తరువాత రామారావు కనబడుతున్నాడు. దళసరి కళ్ళజోడు మొహం మీద చేరింది. మరీ ముదుసలిలా కాకపోయినా ముడుతలు కనబడుతున్నాయి. కానీ, ఎవరో అతికించినట్టు ఎప్పటిలాగానే పెదాలపై చెరగని చిరునవ్వు. అయితే అందులో జీవమేదీ ?


రామారావుకు క్రమంగా సృష్టి రహస్యం అర్ధం అవుతోంది. శాశ్వితం అనుకుంటున్నవేవీ నిజానికి శాశ్వితం కాదు. ఈ నిజం తెలుసుకున్న రామారావుని చూసినప్పుడు నాకు నవ్వు రాలేదు. జాలీ వెయ్యలేదు. గర్వంగా అనిపించింది.

ఎందుకంటె నా పేరు వయస్సుకనుక. (10-06-2011)


(నాలుగేళ్ల క్రితం రాసిన ఈ రచన నాకు నచ్చిన నా రచన. మరో విషయం ఏమిటంటే కొంత కల్పన ఉన్నప్పటికీ 'ఆ రామారావుని కూడా నేనే! - భండారు శ్రీనివాసరావు)
NOTE: Courtesy Image Owner 

25, ఏప్రిల్ 2015, శనివారం

కళ్ళు తెరిస్తే అదే పదివేలు

  
(Published by 'SURYA' telugu daily in it's edit page on 26-04-2015, SUNDAY)

రాజకీయ దిగజారుడుతనానికి పతాక సన్నివేశాన్ని గత బుధవారం నాడు  జాతి యావత్తూ మౌనంగా వీక్షించింది. టీవీ ఛానళ్ళ ద్వారా ప్రసారం అయిన  ఒక రైతు ఆత్మహత్యా దృశ్యానికి సమస్త ప్రజానీకం ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ విషాద సంఘటన రైతుల సమస్యలపై సాగుతున్న చర్చను మరో మలుపు 
తిప్పింది.

 
అసామాన్యులు అధిక సంఖ్యలో నివసించే ఢిల్లీ రాష్ట్రాన్ని  పాలిస్తున్న సామాన్యుడి పార్టీ 'ఆప్' నేతృత్వంలో  రైతు సమస్యలపై నిర్వహించిన ర్యాలీలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం మరో విషాదం. ఈ ర్యాలీకి ఢిల్లీ చుట్టుపక్కలనుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. వారి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో ఓ పక్క నేతల ప్రసంగాలు సాగిపోతూ ఉండగానే,  ఆ సమస్య తీవ్రతను మరింత సుష్పష్టం చేసే రీతిలో   రాజస్తాన్ కు చెందిన గజేంద్ర సింగ్ అనే రైతు మరో పక్క ఓ చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని వేదికమీద వున్న నాయకుల సాక్షిగా తన ఉసురు తీసుకున్నాడు. వ్యవసాయంలో వచ్చిన వరుస నష్టాల కారణంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు గజిబిజిగా గిలికికినట్టు రాసిన ఓ చిన్న ఉత్తరం మృతుడి వద్ద పోలీసులకు లభించింది.
దేశ రాజధాని నడిబొడ్డున జరిగిన ఈ సంఘటనకు విశేష ప్రాచుర్యం లభించడం ఆశ్చర్యమేమీ కాదు. జాతీయ టీవీ ఛానళ్ళు ఈ సంఘటనకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చి వరుస కధనాలతో హోరెత్తించాయి. ప్రధాన మంత్రి మోడీ తక్షణం స్పందించారు. రాజస్తాన్  రైతు మరణం తన మనసును  కలచివేసిందని ఆయన ట్వీట్ చేసారు. తాము ఒంటరివారమని రైతులెవ్వరూ ఏ దశలోనూ భావించరాదని ఆయన అన్నారు. రైతులకు ఉజ్వల భవితవ్యం కోసమే తామంతా ఉన్నామని భరోసా ఇచ్చారు.
దాదాపు రెండుమాసాల అజ్ఞాతం నుంచి ఇటీవలే బయటకు వచ్చి, వచ్చీ రావడంతోనే మోడీ ప్రభుత్వంపై బాణాలు సంధిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, అందివచ్చిన ఈ అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు భౌతిక కాయం వుంచిన ఆసుపత్రికి హుటాహుటిన బయలుదేరి వెళ్ళారు. జరిగిన సంఘటనకు కేంద్ర ప్రభుత్వం, కేజ్రీ వాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారు బాధ్యత వహించాలని అన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల కారణంగానే రైతుల ఆత్మ హత్యలు పెరిగిపోతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతుల ఉసురు తీసే భూసేకరణ చట్టం సవరణకు చేస్తున్న మొండి  ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని పనిలో పనిగా ఓ  సలహా ఇచ్చారు.  ఇక ఢిల్లీలో 'ఆప్', బీజేపీల నడుమ రగులుతున్న రాజకీయ వైరం ఈ సంఘటనతో కొత్త రంగు పులుముకుంది. ఢిల్లీ పీఠం పోగొట్టుకున్న బాధలో  వున్న బీజేపీ నాయకులకు, 'ఆప్' తమకు అంటిస్తున్న రైతు వ్యతిరేక ముద్ర సుతారమూ నచ్చడం లేదు. దాంతో ఆ పార్టీ నాయకులు, శ్రేణులు రైతు ఆత్మహత్యకు 'ఆప్' దే బాధ్యత అంటూ ఎదురుదాడికి దిగాయి. ఇక 'ఆప్' బృందం కూడా ఆలస్యం చేయకుండా  ప్రతిదాడి మొదలు పెట్టింది. ఆత్మహత్య చేసుకున్న రైతు గజేంద్ర సింగ్ అంత్యక్రియలు స్వగ్రామంలో ముగియడమే తరువాయి రాజకీయ సెగలు పొగలు కమ్ముతూ మిన్నంటాయి. ఢిల్లీ సంఘటన నుంచి ఏమేరకు రాజకీయ లబ్ది పొందాలి అన్న దిశగా విమర్శలు, ప్రతి విమర్శలు రాజుకుంటున్నాయి.
సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ చేసిన ప్రకటన 'ఆప్' నాయకులను మరింత ఆత్మరక్షణలో పడవేసింది. 'ఆత్మహత్య చేసుకున్న గజేంద్ర సింగ్  ను ఆ ప్రయత్నం నుంచి ఆపకుండా పైపెచ్చు చప్పట్లు చరుస్తూ అతడ్ని రెచ్చగొట్టి ఆత్నహత్యకు ప్రేరేపించార'ని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు కూడా అవే పలుకులు 'ఎఫ్.ఐ.ఆర్.' లో నమోదు చేసారు. కేంద్ర హోం మంత్రి ప్రకటన తప్పుదోవపట్టించేదిగా వుందని, తమ  ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వుందని 'ఆప్' నాయకుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. అటు బీజేపీ ఇటు 'ఆప్'  ఈ రెండింటినీ సంఘటనకు బాధ్యుల్ని చేస్తూ కాంగ్రెస్ వ్యాఖ్యానాలు సాగాయి. కేంద్రం కనుసన్నల్లో  పనిచేసే ఢిల్లీ పోలీసులు చేసే దర్యాప్తుపై 'ఆప్' ప్రభుత్వానికి ఎటూ నమ్మకం వుండదు కనుక, ఈ సంఘటనపై  హైకోర్టు న్యాయమూర్తితో విచారణ  జరిపించడం సముచితంగా ఉంటుందని ఆ పార్టీ నాయకుడు అజయ్ మాకెన్ సూచించారు. ఇవి కొంతవరకు రాజకీయ పరమైన వ్యాఖ్యలుగా తీసుకున్నప్పటికీ  మరికొందరు 'ఆప్' నాయకులు స్పందించిన తీరు విమర్సలకు గురయింది. మొత్తం ఉదంతాన్ని ఎద్దేవా చేసే రీతిలో మాట్లాడడానికి ప్రయత్నించి వారు  అభాసుపాలయ్యారు.
ఒక విషాద సంఘటన దరిమిలా సాగిన ఈ విమర్శలు, ప్రతి విమర్శల స్థాయి చూసి జనం ముక్కు మీద వెళ్ళేసుకోవాల్సి వచ్చింది.  నోళ్ళు జారిన నాయకులు చివరికి నాలుకలు కరుచుకోవాల్సివచ్చింది.        
ఒక వ్యక్తి  మరణం, అందులోనూ ఇలాటి ఆత్మ హననం గురించి ఒక్క  ఢిల్లీ లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చలు జరిగాయి. గాలిలో కలిసి పోయిన ప్రాణానికి ధర కట్టినట్టు  ప్రభుత్వాలు, పార్టీలు  ఎంతో కొంత సాయం ప్రకటించి చేతులు దులుపుకున్నాయి.
ఢిల్లీ సంఘటన రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు కేంద్ర బిందువుగా మారినప్పటికీ, దేశంలో సాగిన చర్చల సరళి రైతాంగం పరిస్తితులపై  దృష్టి సారించేందుకు   దోహదపడ్డాయి. ఎన్నోనాళ్ళుగా జనాల మెదళ్లలో సుళ్ళు తిరుగుతున్న పలు సందేహాలను తెరపైకి తీసుకువచ్చాయి.
'భారత దేశం ప్రధానంగా వ్యవసాయిక దేశం' అంటూ  బొడ్డూడని  ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాటలు వినీ  వినీ,  జనాల చెవులకు తుప్పుపట్టింది. పార్టీలతో నిమిత్తం లేకుండా ఏ రాజకీయ నాయకుడయినా చెప్పే ఇంకో మాట ఒకటుంది. 'తానూ రైతు కుటుంబం నుంచి వచ్చాననీ, వాళ్ళు పడే ఇబ్బందులన్నీ తనకు కరతలామలకమని'. అయితే ఇవన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి కాని చేతల వరకు రావడం లేదని అందరికీ తెలిసిన విషయమే. 'అందరికీ తెలిసిన విషయమే'  అని తెలిసికూడా వాళ్ళు ఆ మాట పదే పదే  చెప్పడానికి మాత్రం  ఏమాత్రం నామోషీ పడరు.
నిజానికి రైతుల సమస్యలు వారి స్వయంకృతం కాదు. పొలం దున్ని విత్తునాటిన నుంచీ ఫలితంకోసం ప్రకృతి మీదనో, ప్రభుత్వాల మీదనో ఆధార పడాల్సిన దుస్తితి వారిది. ఒకరకంగా చూస్తె వారివి తీర్చలేని పెద్ద సమస్యలు ఏవీ కావు. తరుణం మించి పోకుండా నేలలో విత్తనం పడాలి. తరుణంలో ఎరువులు దొరకాలి. పండించిన పంటకు తరుణం మించి పోకుండా గిట్టుబాటు ధర లభించాలి. ప్రభుత్వాలు తలచుకుంటే ఈ సమస్యలను తీర్చడం వాటికో లెక్క కాదు.
పొతే, అటు రైతుల చేతులో, ఇటు ప్రభుత్వాల చేతుల్లో లేని మరో సమస్య వుంది. సమయానికి వానలు పడకపోయినా, పడిన వానలు అవసరానికి మించి పడ్డా రైతుకు ఇబ్బందే. అతివృష్టి, అనావృష్టి వల్ల కలిగే నష్టాలను ఏ ప్రభుత్వం భర్తీ చేయలేని మాటా నిజమే. అయితే, 'అందిస్తాం' అన్న సాయాన్ని ఆలస్యం లేకుండా అందించకలిగితే, అరకొర సాయం అయినా రైతులు అదే పదివేలని తృప్తి పడతారు. కాకపోతే నిబంధనల పేరుతొ సాగే కాలయాపన వల్ల ప్రభుత్వాలు అందించే సాయం కూడా వారికి  అక్కరకు రాకుండా పోతోంది. అతివృష్టితో కోతకు వచ్చిన పంట వరదల్లో కొట్టుకు పోయి రైతుకు కడుపుకోత మిగిలిస్తుంది. అనావృష్టితో విత్తిన గింజ నేలలోనే నిదురపోయి రైతు కంటికి నిద్ర లేకుండా చేస్తుంది. సరే! అన్నీ సమకూరాయి. పంటలు దండిగా పండాయి. రైతుల ఇంట్లో గాదెలు నిండాయి అనుకుందాం.  అదేం చిత్రమో, అప్పటివరకు ఆకాశంలో వున్న పంటల ధరలు అమాంతం నేలచూపులు చూస్తాయి. పంటలు బాగా పండాయన్న రైతు సంతోషం ఆవిరి అయిపోతుంది. మరో చిత్రం. చేసిన అప్పులు తీర్చడానికి పండిన పంటను అయినకాడికి అమ్ముకున్న మరుసటి రోజునుంచే ధరలు ఆకాశంలోకి మళ్ళీ  ఎగబాకుతాయి. అవసరార్ధం తక్కువ ధరలకు అమ్ముకున్న తిండి గింజల్నే తిరిగి అధిక ధరలకు రైతులు కొనుక్కోవాల్సి రావడం మరో విషాదం.
ఏటేటా ఎదురవుతున్న ఈ సమస్యలకు ఒక నిర్దిష్టమైన పరిష్కార విధానం రూపొందించి సక్రమంగా అమలుచేయగలిగితే, ఆత్మహత్యలకు రైతులను ప్రేరేపిస్తున్న కొన్ని కారణాలకు సమాధానం దొరుకుతుంది.
 దీనికి కావాల్సింది కోట్ల రూపాయల నిధులు కాదు, కాసింత చిత్తశుద్ధి.
అదేమిటో, ప్రకృతి వైపరీత్యాల వంటి కారణాలు ఏవీ లేకుండానే దేశంలో చిత్తశుద్ధికి తీవ్రమైన  కొరత ఏర్పడుతోంది.
ఎవరయినా విదేశాలవాళ్ళు వచ్చి 'చిత్తశుద్ది' కర్మాగారాలు ఏర్పాటు చేయాలేమో!
 (25-04-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595

23, ఏప్రిల్ 2015, గురువారం

పాయింట్ బ్లాంక్ - బ్లాంకు పాయింట్


మగవాళ్ళు  ఏ పాయింటు మీద అయినా రెండు గంటలు ఏకధాటిగా మాట్లాడగలరు.  జన్మతః అది వారికి  అబ్బిన నైపుణ్యం.

ఆడవాళ్ళు ఏ పాయింటూ లేకుండానే రెండుగంటలు గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలరు. అది వారికి దేవుడిచ్చిన వరం.  

(NOTE: Courtesy Image Owner)

షాపింగ్ సిండ్రోం

'భోంచేసి వచ్చారా ..'
'నువ్వు భోంచేశావా?'
'నేను అడుగుతున్నాను. భోంచేసివచ్చారా అని'
'నేనూ అడుగుతున్నాను, భోంచేశావా అని'
'అంటే ఏమిటర్ధం నేనన్నమాటే మళ్ళీ అంటారా!'
'నేననేది అదే. నేను ఏది చెబితే అదే చెబుతావా'
'ఓహో అలాగా నేను ఏది చెబితే మీరు అదే అంటారా అలా అయితే అడుగుతాను చెప్పండి. చీరెల  షాపింగుకి వెడదామా ?'
కాసేపు నిశ్శబ్దం తరువాత మొగుడి జవాబు

'నేను భోంచేసే వచ్చాను' 

(Note: Courtesy Image Owner)