20, మార్చి 2015, శుక్రవారం

శాసన సభ - కొన్ని గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలు


(Published by 'SURYA' telugu daily in it's edit page on 21-03-2015, SATURDAY)
LINK: http://www.suryaa.com/pdf/display.asp?edition=0&page=4

1958 - 59 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అంటే దాదాపు యాభై అయిదేళ్ళ కిందటి ముచ్చట.
ఒక సభ్యుడు లేచి అన్నారు. ' పన్నులన్నీ తెలంగాణపై రుద్దుతున్నారు' అని.
ఆర్ధిక మంత్రి వెంటనే  స్పందించారు, 'గౌరవ సభ్యులు వాడిన 'రుద్దుతున్నారు' అనే పదం బయట పర్వాలేదు. కానీ సభలో 'కర్ణ కఠోరం'గా  వుంటుంది'
సభ్యుడు లేచి 'అలా అన్నందుకు' విచారం వెలిబుచ్చారు.
ఆ ఆర్ధిక మంత్రి పేరు బెజవాడ గోపాల రెడ్డి.
ఆ పదం వాడి, తరువాత విచారం వ్యక్తం చేసిన  సభ్యుడు ఎవ్వరో కాదు,  తదనంతర కాలంలో యావత్ భారత దేశానికి అయిదేళ్ళ పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన పీ.వీ. నరసింహారావు.
అవీ ఆ రోజులు.
అలనాటి, అంటే ఓ నలభయ్, యాభయ్ ఏళ్ళక్రితం జరిగిన  శాసన సభ సమావేశాల్లో,  తీవ్రమైన చర్చల నడుమ వాతావరణాన్ని చల్లబరచడానికి కొన్ని  చలోక్తులు కూడా వినబడేవి.
తెలుగు పత్రికల్లో  ఈ ఛలోక్తులను  'బాక్స్' కట్టి మరీ ప్రచురించేవారు. చదువుకోవడానికి తమాషాగానే కాకుండా ఆహ్లాదకరంగా  కూడా ఉండేవవి.
1958 లో కళా వెంకటరావు గారు రెవెన్యూ మంత్రి.  రాములు అనే సభ్యుడు (ఇంటి పేరు గుర్తు రావడం లేదు) మంత్రిని  తమాషా పట్టించాలని 'మంత్రిగారు మాట్లాడుతున్నది కొండ నాలుకతోనా లేక కొన నాలుకతోనా' అని జోకబోయారు. అంటే మంత్రిగారు చెప్పేవన్నీ పై పై మాటలు, ఒక్కటీ కరెక్టు కాదు అనేది ఆ సభ్యుడి ఉద్దేశ్యం.
కళా వెంకటరావు గారు సామాన్యుడు కాదుకదా! వెంటనే తిప్పికొట్టారు.
'మనిషి అనేవాడు ఎవరయినా నాలుకతోనే మాట్లాడుతాడు. కొండ నాలుకతో ఎవ్వరూ మాట్లాడరు. మరి రాములు గారు కొండ నాలుకతో మాట్లాడుతారేమో నాకు తెలియదు'
ఆ దెబ్బతో రాములుగారు కిమ్మిన్నాస్తి. గమ్మున కూర్చుండిపోయారు.
పూర్వం ఆంద్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి గారు ఒకసారి సభలో ప్రసంగిస్తూ భారతం లోని ఒక ఘట్టాన్ని ఉదాహరించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. 1959 ఆగస్టు ఒకటో తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన సమాధానం చెబుతున్నారు. ఆరోజుల్లోనే  కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలో ఏర్పడ్డ మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన  విధించింది. దీనికి నిరసనగా ఆంద్ర ప్రదేశ్ శాసనసభలోని కమ్యూనిస్టులు సభ నుంచి వాకౌట్ చేసారు. అది సంజీవరెడ్డి గారికి నచ్చలేదు. అదే విషయం తన ప్రసంగంలో ప్రస్తావించారు. 'కేరళలో కమ్యూనిస్టులకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఆ పార్టీ ప్రజల  మన్నన పొందగలిగితే  తిరిగి అధికారంలోకి రావచ్చు. కర్నూలులో వుండగా ప్రకాశం గారి ప్రభుత్వం పోయింది. ఆ తరువాత కాంగ్రెస్ కి నాలుగు సీట్లు కూడా రావనుకున్నాము. కానీ, మళ్ళీ అధికారంలోకి వచ్చాము. ఒకసారి ఒక పార్టీ , మరొక సారి మరో పార్టీ అధికారంలోకి రావచ్చు. ఇది వేదకాలం  నుంచీ ఎరిగిన  ధర్మం. యుద్ధంలో కూడా ఏదో ఒక పక్షమే గెలుస్తుంది. తిక్కన  భారతం  ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు దుర్యోధనుడితో చెబుతాడు. '........పెనంగిన బలంబులు రెండును గెలవ నేర్తునే' అని. ఈ నీతి ఈనాడు కూడా వర్తిస్తుంది' అని చెప్పారు సంజీవరెడ్డి గారు.
1976 లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో దాదాపు నలభయ్ యాభయ్ మంది సభ్యులు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినంత సేపు ముఖ్యమంత్రి సభలో తన స్థానం నుంచి కదల లేదు. మౌనంగా సీట్లో కూర్చుని సభ్యులు ప్రస్తావించిన వివిధ అంశాలపై నోట్స్ రాసుకుంటూ పోయారు. తరువాత తన సమయం రాగానే లేచి సుమారు గంటన్నరపాటు అన్ని అంశాలను స్పృశిస్తూ సమాధానం చెప్పారు. సభలోని యావన్మందీ వెంగళరావు ప్రసంగాన్ని మెచ్చుకున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఏ పద్యం అయినా రాగయుక్తంగా కాకపోయినా ఎలాటి స్ఖాలిత్యాలు దొర్లకుండా పండిత ప్రకాండులు  మెచ్చే  విధంగా పాడగలరనేది జగమెరిగిన సత్యం. భారత భాగవతాల్లోని అనేక పద్యాలు కేసీఆర్ కి కంఠోపాఠం. దాశరధి, నారాయణ రెడ్డి వంటి కవుల గేయాలు ఆయన ప్రసంగంలో ఆశువుగా దొర్లుతుంటాయి. ఒకసారి రవీంద్ర భారతి లో జరిగిన ఒక కార్యక్రమంలో సినారె పక్కన ఉండగానే కేసీఆర్, నారాయణరెడ్డి గారు రాసిన తొలి సినిమా పాటను యధాతధంగా వినిపించి శ్రోతలను అలరించారు.  గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య గారు బహిరంగ సభల్లో కూడా పద్యం ఎత్తుకునేవారు. ఆయన ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షులుగా వున్నప్పుడు ఢిల్లీలో  సంజీవయ్య గారు వుండే బంగళా సాహిత్య గోష్టులకు వేదికగా ఉండేదని 'కలం కూలీ' జీ. కృష్ణగారు తన అనుభవాల్లో రాసారు. సరే!  ముఖ్యమంత్రిగా ఉంటూ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన   డాక్టర్ రాజశేఖర రెడ్డికి సయితం పద్యాలు వచ్చన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు ఏకంగా ఒక పద్యం మొత్తం సభలో చదివి వినిపించారు. 2001- 2002 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని, భారతంలో  తిక్కన విరచిత పద్యం - 'సారపు ధర్మమున విమల సత్యము ....' అని మొదలెట్టి ఒక పద్యం చదివి వినిపించారు.
"ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు దక్షత కలిగిన భీష్మ, ద్రోణుల వంటి వారు కూడా మౌనంగా వుండిపోయారు. అలా ఉపేక్షిస్తే అది వారికే చేటవుతుంది. కానీ ఏదో ఒకరోజున భగవంతుడే కల్పించుకుని సత్యాన్ని, ధర్మాన్ని నిలబెడతాడు. ఈ రాష్ట్రాన్ని కూడా ఆ దేవుడే కాపాడాలి"  అని ప్రసంగం  ముగించారు రాజశేఖర రెడ్డి.              
మరోసారి 2003 ఫిబ్రవరిలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో పాల్గొంటూ, దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన గేయభాగాన్ని వై.యస్.ఆర్. చదివి వినిపించారు.
'ఒక్క నిరుపేద ఉన్నంతవరకు, ఒక్క మలినాశ్రువు బిందువు ఒరిగినంతవరకు, ఒక్క శుష్క స్థన్య సన్నిధిని క్షుదార్తి ఏడ్చు పసిబాలిక ఉన్నంతవరకు, నాకు శాంతి కలుగదింక నేస్తం ..... ఈ ఆర్తి ఏ  సౌధాంతరాలకు  పయనించగలదు, ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు'  అంటూ 'పేదవాడి ఆర్తిని వినే ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రిగారు, చేయండి ముఖ్యమంత్రిగారు' అని తనదైన శైలిలో ప్రసంగం ముగించారు.    
చంద్రబాబు నాయుడు గారిది అదో తరహా. శాసన సభలో ఆయన చేసే ప్రసంగాలలో పద్యాలు, గేయాలు వుండవు. కానీ ఆర్ధిక అభ్యున్నతి గురించి, సంస్కరణలు గురించి కొందరు ప్రముఖులు ఆయా సందర్భాలలో చేసిన  కొటేషన్లు బాగా చోటుచేసుకుంటాయి. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను  చేపట్టిన వివిధ అభివృద్ధి పధకాలు గురించి ప్రతిపక్ష నాయకుడిగా చేసే ఉపన్యాసాలలో వివరించే ప్రయత్నం చేస్తారు. అలాగే, ముఖ్యమంత్రిగా సభలో మాట్లాడేటప్పుడు కూడా ఈ పధకాల వివరాలు ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్త పడతారు.   
1999  నవంబరు 16 వ తేదీన గవర్నర్ ప్రసంగంపై చర్చకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంలో కొన్ని భాగాలు ఇలా సాగాయి.
"నేను రాష్ట్రం అభివృద్ధిని కోరుకుంటున్నాను. నా పట్ల ప్రజలకున్న  అభిమానాన్నే  నమ్ముకున్నాను. అందువల్లే ఎన్నికల్లో మీ అంచనాలు తారుమారయ్యాయి. ప్రజల ఆశీర్వాదం నాకుంటుంది అని మొదటినుంచీ చెబుతున్నాను. అదే ఈనాడు నిజమైంది. కుల్  దీప్ నాయర్  మాట్లాడుతూ, 'నేను ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందించడం లేదు, ఆంద్ర ప్రదేశ్ ఓటర్లని అభినందిస్తున్నాను. ఒక విజ్ డమ్ ని వాళ్ళు వ్యక్తం చేసారు. చాలా మెచ్యూరిటీ ప్రదర్శించారు. కర్నాటక, మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఆంద్ర ప్రదేశ్ మాకు ఆదర్శం అంటున్నారు. ఇండియన్  ప్రైమ్ మినిస్టర్ ఇంకా గట్టిగా చెప్పారు. 'దేనికయినా ఆంద్ర ప్రదేశ్ కొలమానం' అని. 'అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అనుసరించాలి' అని. ఇంటర్నేషనల్ మీడియా కూడా అదే  చెబుతోంది. దేశంలో బెస్ట్ విజన్ వున్న వ్యక్తి  ఎవరంటే ఆంద్రప్రదేశ్ సీ.ఎం. అని విద్యార్ధులు కూడా చెప్పే పరిస్తితి వుంది.
'ఈ నడుమ ఒక ఎకానమిస్టు చెప్పాడు. ఆంద్ర ప్రదేశ్ లో నాయుడు కోరుకుంటున్న విప్లవం ఊహల్లో ఊహించుకునేది కాదు, చేసి చూపించగలిగేది,  అని. ఇప్పుడు దేశానికి కావాల్సిన సరయిన నాయకుడు చంద్రబాబే అని కూడా ఆయనే చెప్పారు.
'ఆంద్ర ప్రదేశ్ ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాము. స్మార్ట్ స్టేట్ అంటే అర్ధం దక్షతతో కూడిన నైపుణ్యం ఆ స్టేట్ కి దిశానిర్దేశం చేస్తుంది. పరిజ్ఞానం దానికి ఇంధనం మాదిరిగా ఉపయోగపడుతుంది. ఇక విజ్ డమ్ దాన్ని ముందుకు  నడిపిస్తుంది. అదీ మా ధ్యేయం.
'మహాత్మా గాంధీ అన్నారు. ఒకరికి ఆదర్శం బోధించాలి అంటే ఆ ఆదర్శాన్ని మనమూ పాటించాలి అని. అప్పుడే ఒకళ్ళకు చెప్పినా వాళ్ళు వినే పరిస్తితి వుంటుంది.  మా ప్రభుత్వం ఆ దరిద్రాన్ని రూపుమాపడానికి కంకణం కట్టుకుంది'
'ప్రతిపక్ష నాయకులు (వై.యస్.ఆర్.) చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే తప్పకుండా సహకరిస్తామని. వారిని మనః స్పూర్తిగా  అభినందిస్తున్నాను. వాళ్ళు సభలో వన్ తర్డ్ వున్నారు. అందుకే అందర్నీ కలుపుకుని ముందుకు పోవాలని అనుకుంటున్నాను.'
ఇలాటి జ్ఞాపకాలు ఎన్నో. అసెంబ్లీ గ్రంధాలయానికి వెళ్లి కూర్చుని చదివే ఓపిక ఉండాలే కానీ ఇలాటివన్నీ కోకొల్లలు.
(bhandarusr@gmail.com)
(21-03- 2015)

            

19, మార్చి 2015, గురువారం

శాసన సభలో ఛలోక్తులు


శాసన సభలో చలోక్తులా? ఇది నమ్మే విషయమేనా అని అనుకోకండి.
ఓ నలభయ్, యాభయ్ ఏళ్ళక్రితం తెలుగు పత్రికల్లో 'బాక్స్' కట్టి మరీ ఈ ఛలోక్తులు ప్రచురించేవారు. చదువుకోవడానికి తమాషాగానే కాకుండా ఆహ్లాదంగా కూడా ఉండేవి.
1958 లో కళా వెంకటరావు గారు రెవెన్యూ మంత్రి. రాములు అనే సభ్యుడు (ఇంటి పేరు గుర్తు రావడం లేదు) మంత్రిని  తమాషా పట్టించాలని 'మంత్రిగారు మాట్లాడుతున్నది కొండ నాలుకతోనా లేక కొన నాలుకతోనా' అని జోకబోయారు. అంటే మంత్రిగారు చెప్పేవన్నీ పై పై మాటలు, ఒక్కటీ కరెక్టు కాదు అనేది ఆ సభ్యుడి ఉద్దేశ్యం.
కళా వెంకటరావు గారు సామాన్యుడు కాదుకదా! వెంటనే తిప్పికొట్టారు.
'మనిషి అనేవాడు ఎవరయినా నాలుకతోనే మాట్లాడుతాడు. కొండ నాలుకతో ఎవ్వరూ మాట్లాడరు. మరి రాములు గారు కొండ నాలుకతో మాట్లాడుతారేమో నాకు తెలియదు'
ఆ దెబ్బతో రాములుగారు కిమ్మిన్నాస్తి. గమ్మున కూర్చుండిపోయారు.  


NOTE: Courtesy Image Owner 

18, మార్చి 2015, బుధవారం

యెంత తేడా?


1958 - 59 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అంటే దాదాపు యాభై అయిదేళ్ళ కిందటి ముచ్చట.
ఒక సభ్యుడు లేచి అన్నారు. ' పన్నులన్నీ తెలంగాణపై రుద్దుతున్నారు' అని.
ఆర్ధిక మంత్రి వెంటనే  స్పందించారు, 'గౌరవ సభ్యులు వాడిన 'రుద్దుతున్నారు' అనే పదం బయట పర్వాలేదు. కానీ సభలో 'కర్ణ కఠోరం'గా  వుంటుంది'
సభ్యుడు లేచి 'అలా అన్నందుకు' విచారం వెలిబుచ్చారు.
ఆ ఆర్ధిక మంత్రి పేరు బెజవాడ గోపాల రెడ్డి.
ఆ పదం వాడి, తరువాత విచారం వ్యక్తం చేసిన  సభ్యుడు ఎవ్వరో కాదు,  తదనంతర కాలంలో యావత్ భారత దేశానికి అయిదేళ్ళ పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన పీ.వీ. నరసింహారావు.


(బెజవాడ గోపాలరెడ్డి)


(పీ.వీ. నరసింహారావు)

అవీ ఆ రోజులు.
'యెంత తేడా' అంటూ దేనితో పోల్చానని మాత్రం  అడగొద్దు,  ప్లీజ్.

(18-03-2015)         

17, మార్చి 2015, మంగళవారం

ఆసక్తి కలిగించే 'అదృశ్యాలు'

(Published in 'SURYA' telugu daily in it's edit page on 19-03-2015, THURSDAY)

నిత్యం మీడియాలో కనబడాలని రాజకీయ నాయకులు అనుకోవడం కద్దు. కనబడకపోయినా అది ఒక వార్తగా మారి సంచలనం కావడం కూడా కొత్తేమీ కాదు.
కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ ఈ మధ్య చెప్పాపెట్టకుండా ఎటో వెళ్లిపోయారని వార్త గుప్పుమంది. అలిగివెళ్ళారని కొన్ని వార్తలు చెబుతుంటే ఏకంగా హిమాలయాలకు వెళ్ళారని మరికొన్ని వదంతుల సారాంశం. అలిగి వెళ్ళిన మాట నిజం కాకపోవచ్చు. హిమాలయాలకు వెళ్ళిన మాటలో కూడా వాస్తవం లేకపోవచ్చు. కానీ కనబడకుండా వెళ్ళిన మాట నిజం. రోజుల తరబడి ఆయన ఎవ్వరికీ దర్శనం ఇవ్వని మాటా నిజం. ఆ మాటకు వస్తే పార్లమెంటు సమావేశాలు మొదలై ఇన్ని రోజులు గడుస్తున్నా రాహుల్ గాంధీ మాత్రం ఒక్క రోజుకూడా చట్టసభ గుమ్మం తొక్కిన జాడలేదు. కనబడకుండా పోయిన ఈ యువనేత గురించి ట్విట్టర్ వంటి ఆధునిక ప్రసార మాధ్యమాల ద్వారా మాత్రమె సంగతులు తెలుసుకోవాల్సి వస్తోంది. ఇదొక చిత్రం.
రాహుల్ గాంధీ అనామకుడు కాదు. ఆయన్ని గురించి తెలిసిన వారు ఎక్కువ. పటిష్టమైన వ్యక్తిగత భద్రత కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఎక్కడకు వెళ్ళాలన్నా క్షణాలమీద బందోబస్తు ఏర్పాట్లు జరిగిపోతాయి. చుట్టూ అంగరక్షకులు నిరంతరం కాపలాగా వుంటారు. వారి చేతుల్లోని వాకీ టాకీలు రాహుల్ రాకపోకల్ని ఎప్పటికప్పుడు తెలియచేస్తుంటాయి. గతంలో టీవీల్లో రాహుల్ భద్రతాఏర్పాట్లు చూసిన వారికి రాహుల్ అదృశ్యం వార్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయన అంగరక్షకులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. కనబడకుండా పోయిన ఈ యువనేత, అనుక్షణం తన వెంటవుండి తనని కంటికి రెప్పలా కాపాడాల్సిన  'బాడీ గార్డుల'ని  కూడా వెంటబెట్టుకు పోయాడా లేదా తెలియదు. రాహుల్ అదృశ్యం గురించి రకరకాల వ్యాఖ్యానాలు మాత్రం అనుదినం మీడియాలో వస్తుంటాయి. సోషల్ మీడియా సంగతి చెప్పనక్కరలేదు. ఆయన ఆనుపానులు కనుక్కోవాలంటే పోలీసులకు నిమిషాల్లో పని. మీడియాకు కూడా ఇదేమంత కష్టమైన పనికాదు. అయినా కానీ, అదృశ్యం గురించిన వ్యాఖ్యానాలు, విరుపులతో కూడిన సమాచారమే కాని రవంత అదనంగా ఎవ్వరూ ఏ సమాచారం ఇవ్వని పరిస్తితి. ఒక మాజీ ప్రధాన మంత్రి కుమారుడు ఏకంగా కొన్ని రోజులపాటు కనబడకుండా పొతే ఇదా పరిస్తితి అనుకోవాల్సి వస్తోంది. 'ఇదొక చిత్రం' అన్నది అందుకే.
సరే! రాహుల్ కనబడడం లేదు. ఇంట్లో లేరు. బయట లేరు. ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయి కాబట్టి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి విచారించడం మరో సంచలన వార్త అయింది. వెళ్ళిన పోలీసులు 'అదృశ్యం' గురించి వాకబు చేశారంటే అదీ లేదు. వెళ్ళిన సందర్భం కంటే అడిగిన సమాచారం మరింత సంచలనం అయింది.  వెళ్లి ఎలాటి సమాచారం అడిగారు? 'రాహుల్ యెంత ఎత్తు ఉంటాడు? కళ్ళ రంగు ఏమిటి? కాలిజోడు కొలతలు ఏమిటి?'
రాజకీయాల్లో సీరియస్ నెస్ తగ్గించడం కోసం ఇలా కాస్త 'హ్యూమరసం' వొలకబోశారేమో అని సమాధానపడేలోగా పోలీసులే సందేహ నివృత్తి చేసారు. అత్యంత ప్రముఖుల వివరాలను సేకరించి తమవద్దవున్న సమాచారంతో సరిపోల్చుకుని  వాటిని  తాజాగా సవరించుకునే పనిలో వెళ్ళారని అధికారిక  వివరణ. ఇది కొత్తేమీ కాదని, ప్రముఖుల వివరాలను సేకరించడం 'అనాది'గా వస్తున్న ఆచారమే అని దానికి ముక్తాయింపు. అంతటితో ఆగితే ఏ పేచీలేదు. 1991 లో తమిళనాడులోని శ్రీపెరంబదూరు ఎన్నికల సభలో శ్రీలంక ఉగ్రవాది మానవ బాంబుగా మారి రాజీవ్ గాంధీని పొట్టనబెట్టుకున్న  దుర్ఘటనలో ఆ పేలుడు  ధాటికి యువ గాంధీ శరీరం తునాతునకలు అయినప్పుడు, 'రాజీవ్' ఆనాడు ధరించిన కాలిజోడు సాయంతోనే ఆయన  ఆనవాళ్ళు పోల్చుకున్న 'చరిత్ర'ను  ఓ కేంద్ర  మంత్రి గుర్తు చేయడం ఈ యావత్ 'ఎపిసోడు'కి కొసమెరుపు.
ఇంతకీ రాహుల్ ఎక్కడ వున్నట్టు? త్వీట్ చేయగలగాలంటే  అది కారడువుల్లోనో, హిమాలయ సానువుల్లోనో కుదిరేపని కాదు. ఆయన ఆనుపానులు కనుక్కోలేనివేమీ కావు. అయినా, సరే ఆచూకీ తప్ప ఆయన గురించిన  అన్ని విషయాలు మీడియాలో వస్తుంటాయి. 'చిత్రం' అని అన్నది ఇందుకే.
సరే! ఇదేదో మన దేశానికి మాత్రమే ప్రత్యేకం అని అనుకోవడానికి వీల్లేకుండా సరిగ్గా ఈ సమయంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాడలేకుండా పోయారు. ఆయనేమీ చిన్నా చితకా మనిషి కాదు. నిన్నమొన్నటి దాకా అంతర్జాతీయ రాజకీయ గూఢచర్యంలో అందెవేసిన చెయ్యి అనిపించుకున్న 'కేజీబీ' పుట్టిన దేశానికి సాక్షాత్తు అధ్యక్షుడు. తొంభయ్యవ దశకం పూర్వార్ధంలో రాజకీయాల్లోకి రావడానికి ముందు 'కేజీబీ' సంస్థలో పుతిన్ పదహారేళ్ళపాటు సీనియర్ అధికారిగా పనిచేశారు కూడా. అయినా పదిరోజులపాటు 'అదృశ్యం' అయిపోయిన  పుతిన్ అచూకీ మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఊహాగానాలు మాత్రం ఆరున్నొక్క రాగం అందుకున్నాయి.  క్రమంగా ముదిరి పాకానపడి వదంతులుగా రూపాంతరం చెందాయి. పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఓ పుకారు షికారు చేస్తే,  కాదు అసలు ప్రాణాలతోనే లేడని మరో పుకారు పురుడు పోసుకుంది. సైనిక కుట్ర  జరిగి నిర్బంధంలో ఉన్నాడని మరో వదంతి వచ్చి దానికి  జత చేరింది. ఇవేవీ కావు  పుతిన్ అదృశ్యానికి అసలు కారణం ఆయన ప్రేయసి అని, విదేశంలో బిడ్డకు జన్మ ఇస్తున్న ఆమెను చూడడానికి రెక్కలు కట్టుకుని వెళ్ళాడని  ఇంకో ఊహాగానం రెక్కలు విప్పుకుంది. ఇలా రోజుకో పుకారు ప్రాణం  పోసుకుంటూ వుంటుంటే, సరిగ్గా పదిరోజుల తరువాత పుతిన్ అజ్ఞాతాన్ని వీడి తనపై వస్తున్న వదంతులకు తనే స్వయంగా  తెర దించాడు. తన ఆకస్మిక అదృశ్యానికి  మాత్రం ఏ కారణం చెప్పకుండా, వస్తున్న ఊహాగానాలను మాత్రం కొట్టిపారేసే ప్రయత్నం చేసారు. 'పుకార్లు లేకపోతే జీవితం రొటీన్ గా మారి విసుగు పుడుతుంది'. ఇదీ చివరకు ఆయన చిరు మందహాసంతో విలేకరులకు ఇచ్చిన వివరణ. బహుశా ఏ నల్ల సముద్ర  తీరంలోనో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, మీడియాలో తనపై వస్తున్న వదంతులను ఆస్వాదిస్తూ పది రోజులూ  పది నిమిషాల్లా గడిపి ఉంటారని అనుకోవాలి. నిజంగానే  'చిత్రం' అనిపిస్తోంది కదూ.
ఇలాటి అదృశ్య సంఘటనలు  చాలా దేశాల్లో దేశాల్లో జరిగాయి. ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా వున్న క్సీ జిన్పింగ్ (విదేశీ పేర్లను ఇష్టం వచ్చినట్టు రాసుకునే స్వేచ్ఛ ఉందన్న భావం బలపడుతున్న కాలం ఇది. లోగడ ఇలాటి పేర్లు రాయాల్సి వచ్చినప్పుడు ఆలిండియా రేడియో ఇంగ్లీష్ వార్తలు విని రాయమని పాత రోజుల్లో ఎడిటర్లు చెప్పేవాళ్ళు) అధ్యక్ష పదవికి నామినేట్ అయిన కొద్ది రోజులకే కనిపించకుండా పోయారు. రాడార్ కూడా పసికట్ట లేనంతగా ఆయన 'అదృశ్యం' అయ్యారని అప్పట్లో మీడియా కోడై కూసింది. సరే మళ్ళీ బయటకు వచ్చి ఆ దేశపు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అది వేరే విషయం. కానీ కనబడకుండా అన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారన్న గుట్టు ఇప్పటికీ బయటకు రాలేదు.
కాకపోతే, కనబడకుండా పోయిన ఇలాటి సంచలన రాజకీయ నాయకులు మనకు చరిత్రలో అనేకమంది కానవస్తారు. 
హ్యూగో చావెజ్ ఆషామాషీ నాయకుడు కాదు. దక్షిణ అమెరికాలోని వెనిజులా దేశాధ్యక్షుడిగా వున్నప్పుడు ఏకంగా ఓ నెల రోజులపాటు ఎవ్వరి కంటికీ కనిపించకుండా పోయి సంచలనం సృష్టించారు. 2011 జూన్ నెలలో ఇది జరిగింది. అప్పుడు అయన అనారోగ్యం గురించిన వార్తలే సంచారం చేసాయి. అనుదినం టీవీ తెరలపై కానవస్తూ, ట్విట్టర్లో దర్శనం ఇచ్చే ఛావెజ్, అన్ని రోజులు కనబడకుండా పోవడం ఆ రోజుల్లో పెద్ద వార్తగా తయారయింది. ఆయనపై వెలువడిన వదంతులను ఖండించడానికి ఆయన ప్రభుత్వం చాలా శ్రమ పడింది. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో తో కలిసి ఛావెజ్ వాహ్వ్యాళి గా నడిచివెడుతున్న ఫోటోలను పత్రికలకు విడుదల చేసినా కూడా  పుకార్ల 'పటిమ' ఏమాత్రం తగ్గలేదు.
అమెరికాకు చెందిన మరో రాజకీయ నాయకుడిది నిజానికి సాధారణ సమస్యే. కాని అయన దాన్ని దాచిపెట్టి తన అదృశ్యానికి వేరే కారణాలు చెప్పడమే అసలు సమస్య అయి కూర్చుంది. సౌత్ కరోలినా గవర్నర్ మార్క్ సాన్ ఫర్డ్  2009 జూన్ లో వున్నట్టుండి నాలుగు రోజులపాటు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. 'మా ఆయన ఏదో పుస్తకం రాయడానికి  వెళ్ళాడు, ఇంట్లో పిల్లల గోలతో ఆయనకు  రాసుకునే  ప్రశాంతత కరువై అజ్ఞాతంలోకి వెళ్ళార'ని మార్క్ సాన్ ఫర్డ్  భార్య కూడా  ఏవేవో సాకులు చెప్పింది. కానీ ఈలోగా ఆయనే బయట పడి తన మనసులో మాట కూడా  బయటపెట్టాడు. 'నేను నా భార్యకు ద్రోహం చేసాను. నాకెంతో ప్రాణప్రదం అయిన నా ప్రియురాలితో గడపడానికి ఇలా అజ్ఞాతం లోకి  వెళ్లాన'ని చెప్పి ఆయనే తన తప్పు ఒప్పుకుని లెంపలు వేసుకున్నాడు.  అయితే ఆయన 'బుద్ది'  ఏడాది తిరక్కుండానే  మరో వంకర తిరిగింది. మొదటి ఎపిసోడుతో చిన్నబుచ్చుకున్న మొదటి భార్య విడాకులు తీసుకుంది. దాంతో మరింత ధైర్యం పుంజుకున్న  సాన్ ఫర్డ్ దొరవారు మళ్ళీ కనబడకుండా పోయారు. అలా మాయమై పోయిన మనిషి  తన వారసుడిగా వచ్చిన కొత్త  గవర్నర్ ప్రమాణ స్వీకార  కార్యక్రమంలో హఠాత్తుగా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారు. అంతే కాదు, నలుగురు చూస్తుండగానే అక్కడ కనబడ్డ  తన మాజీ భార్య బుగ్గపై ముద్దు పెట్టుకుని తనలో దాగున్న 'ప్రబంధ నాయకుడి'ని మరోమారు ప్రపంచానికి  ప్రదర్శించి చూపారు.
మరి 'చిత్రం ' అనిపించకుండా ఎలా వుంటుంది చెప్పండి.
(bhandarusr@gmail.com)


(18-03-2015)

14, మార్చి 2015, శనివారం

బడ్జెట్లు వరమా? భారమా?


(Published by 'SURYA' telugu daily in it's edit page on 15-03-2015, SUNDAY)

ఒక టీవీ ఛానల్ చర్చలో  నాతొపాటు పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు, గతంలో బడ్జెట్ రోజుకు ముందుగానే దుకాణాల్లో సిగరెట్లు, అగ్గిపెట్టెలు, పాలపొడి డబ్బాలు మాయమై పోయేవని. కొత్తగా  పన్నులు వేస్తే,  పాత రేటుకు కొన్న సరకుల్నే  హెచ్చు ధరలకు  అమ్ముకుని లాభాలు సంపాదించవచ్చని వ్యాపారులు అలా చేసేవాళ్ళు. మార్కెట్ మీద ప్రభుత్వాలకు పట్టు వున్న కాలమది. ఇప్పుడో, మార్కెట్ శక్తులే ప్రభుత్వాలని శాసిస్తున్న రోజులాయె!
అందుకే బడ్జెట్లు ఈనాడు ఓ తంతుగా ముగిసే ప్రభుత్వ  కార్యక్రమాలు అయ్యాయి. వాటి మీద మీడియాకు తప్ప మామూలు జనాలకు ఆసక్తి లేకుండా పోతోంది. లోగడ కేంద్ర బడ్జెట్ అంటే రేడియో పెట్టుకుని వినేవారు. గ్యాస్  సిలిండర్  ధరలు, పెట్రోలు రేట్లు ఏవన్నా పెరిగాయా, కుక్కర్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీల  ఖరీదులు కొండెక్కి కూర్చున్నాయా లేదా తెలుసుకోవాలనే  ఆసక్తితో. ఇప్పుడు బడ్జెట్లకు, ధరల పెరుగుదలకు వున్న  లంకె తెంపేసారు. వేటి దోవ వాటిదే. 'కోడి గుడ్డు ధర' మాదిరిగా, ఏరోజు రేటు ఆ రోజుదే!


పొతే, ఈసారి మరో విశేషం ఏమిటంటే - రెండు తెలుగు రాష్ట్రాలు, మూడు రోజుల వ్యవధిలో మూడు బడ్జెట్లు.
పది జిల్లాల తెలంగాణా రాష్ట్రానికి లక్షా పదిహెను వేల  కోట్ల రూపాయల బడ్జెట్. పదమూడు జిల్లాల ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి లక్షా పదమూడు వేల కోట్ల  రూపాయల బడ్జెట్. 'ఇదేమిటి' అనే ప్రశ్న వస్తుందనుకున్నారేమో, మరునాడే ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం 'వ్యవసాయం'  పేరుతొ ఇంకో  ప్రత్యెక బడ్జెట్ సభకు సమర్పించి మరో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కలిపి, బడ్జెట్  అంచనాల్లో, కేటాయింపుల్లో తానూ  తక్కువ తినలేదు అనిపించింది.
ఉమ్మడి రాష్ట్రంలో లక్షలతో మొదలయిన బడ్జెట్ అంచనాలు కాలక్రమంలో పెరిగి పెరిగి లక్షల కోట్లల్లోకి చేరుకున్నాయి. ప్రతియేటా పెరుగుతూ  పోవడం తప్పనిసరిగా తయారయింది. ఆర్ధిక ప్రగతికి ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక కొలమానంగా పరిగణిస్తున్నాయి. బడ్జెట్ మొత్తం యెంత గొప్పగా వుంటే అభివృద్ధి కూడా ఆ స్థాయిలో ఉంటుందని నమ్మే రోజులు వచ్చాయి.
వాస్తవానికి  ప్రతి ప్రభుత్వం, అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా సరే, ప్రతి ఏటా బడ్జెట్ పై గట్టి కసరత్తే చేస్తుంది. తమ విధానాలకు అనుగుణంగా ప్రాధాన్యతాక్రమంలో  కేటాయింపులు చేస్తుంది. యెంత ఖర్చు చేయాలన్నా ఎంతో కొంత రాబడి వుండాలి. ఖజానాలో చేరే రూపాయలు తగ్గిపోయి పెట్టె ఖర్చు పెరిగిపోతే అదనపు ఆదాయ వనరుల అన్వేషణ తప్పనిసరి అవుతుంది. ఇందుకోసం అప్పులన్నా చేయాలి. లేదా పన్నులన్నా వేయాలి. మొదటిది అంటే అప్పు దొరకడం కష్టం. దొరికినా సవాలక్ష నిబంధనలు. షరతులు. ఇక రెండో వెసులుబాటు పన్నులు వేయడం. ఇది  తేలికే కాని, రాజకీయ కోణాల దృష్ట్యా కొంత ఇబ్బందికర  వ్యవహారం. కాబట్టి, అంచనాలు పెంచుకుంటూ పోయి వాటికోసం  దొరికినంత అప్పులు చేయడం, విధి లేకపోతే పన్నులు వేయడం ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారింది. దీనికి కూడా రానురాను ' రామ్ రామ్' చెబుతున్నారు. బడ్జెట్లో పన్నులు వేయడం అన్న పద్దతికి స్వస్తి పలుకుతున్నారు. ఏడాది పొడుగునా వేయగల వీలూ చాలూ  వున్నప్పుడు వాటిని బడ్జెట్లో చూపించి లేని తలనొప్పులు కొని తెచ్చుకోవడం ఎందుకన్న నిర్ధారణకు ప్రభుత్వాలు  వచ్చేసాయి.
సరే! రెండు రాష్ట్రాలలోని రెండు ప్రభుత్వాలు వచ్చే నెల నుంచి మొదలయ్యే ఆర్ధిక సంవత్సరానికి జమాలెక్కలు శాసన సభలకి సమర్పించి చేతులు దులుపుకున్నాయి. ప్రతి పక్షాలు కూడా తమ శక్త్యానుసారం ప్రభుత్వ పద్దుల్ని దులపరించి,  తమ విధి తాము అవధులు మించి నిర్వర్తించాయి. దేవుడు మేలు చేసి నాలుగేళ్ల తరువాత జరిగే ఎన్నికల్లో జనం తమ తల రాత మారిస్తే అప్పుడు  ఆ పార్టీలు  ఇప్పుడు చెప్పిన వాటిని మరిచిపోయి,  కాదన్న వాటినే చేసి చూపిస్తాయి. పాత్ర  మారితే,  ప్రస్తుత ప్రభుత్వాలు కూడా మారిన పాత్రలో ఒదిగిపోయి ఇప్పుడు ప్రతిపక్షాలు చెబుతున్న మాటల్నే అక్షరం పొల్లుపోకుండా వల్లె వేస్తాయి. ఇదొక  విష చక్రభ్రమణం. ఎన్ని ఏళ్ళుగానో ఏటేటా మీఎదియాలో  చూస్తున్న, పత్రికల్లో చదువుతున్న సంగతులే ఇవి.           
బడ్జెట్ అంచనాలు లక్షలు కోట్లు అంటున్నారు. చిన్న అంకెలు పాలకుల కంటికి ఆనడం లేదు. మిగులు రాష్ట్రం అయిన తెలంగాణాలో అంచనాలు అధికంగానే కానవస్తున్నాయి. తరుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో కూడా అంకెలు కొట్టొచ్చినట్టు పెద్దవిగానే కనబడుతున్నాయి. ప్రాధాన్యతల దగ్గరే పాలక ప్రతిపక్షాలకు శ్రుతి కుదరడం లేదు. 'అంకెల గారడీ' అని విపక్షాలు విమర్శిస్తుంటే వాటి మాటల్ని 'అవగాహనారాహిత్యం'గా పాలక పక్ష సభ్యులు కొట్టి పారేస్తున్నారు. 'చెప్పింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? సరయిన వనరులు లేకుండా  ఈ అరకొర కేటాయింపులతో ఏవి సాధిస్తారు' అని ప్రతిపక్షాల ప్రశ్న. 'మనసుంటే మార్గం  వుంటుంది' అని సర్కారు వారి షరా మామూలు జవాబు.  ఇటు ఈ రాష్ట్రంలో, అటు ఆ రాష్ట్రంలో ఇదే వరస. ఇదే బాణీ. ఎక్కడో ఎప్పుడో ఈ మాటలే తామే చెప్పినట్టు అనిపించినా అవి పట్టించుకోవు.  వినేవారికి చెప్పేవారు లోకువ అంటారు. కానీ ఈ నానుడి తిరగబడింది. తమ మాటలతో, తమ పధకాలతో జనాలను ఊహాలోకాల్లో తిప్పి చూపించేవారికి చూసే జనాలు లోకువ.
రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల్లో బడ్జెట్ పై చర్చలు ఎలా సాగుతాయో తెలియదు కానీ, టీవీ ఛానళ్ళలో మాత్రం చర్చోపచర్చలు అనుదినం సాగిపోతూనే వున్నాయి. నిన్న ఉదయం కాబోలు 'అసలు బడ్జెట్ అంటే ఏమిటి?' అని ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అడిగారు. నిజానికి బడ్జెట్లు రూపొందించి, ఆమోదించే  సభలో ఆయన సభ్యుడు.
బడ్జెట్ అంటే కొన్ని ఆలోచనలు, ఆలోచనలకు తగ్గ అంచనాలు, అంచనాలకు తగిన కేటాయింపులు. అంతటితో బడ్జెట్ పని పూర్తి చేసామని చెప్పుకోవచ్చు. అయితే, కేటాయింపులకు అనుగుణంగా  ఆ నిధులను  సకాలంలో విడుదల చేసి  ఖర్చు చేస్తున్నారా అంటే  అవునని చెప్పడం ఏ ప్రభుత్వానికయినా కష్టమే. ఆర్ధిక సంవత్సరం ముగియవచ్చే తరుణంలో హడావిడిగా నిధులు ఇబ్బడిముబ్బడిగా విడుదల చేయడం, సకాలంలో వాటిని ఖర్చు చేయలేక మురగబెట్టడం ఓ ఆనవాయితీగా మారిపోయింది.  ఖర్చు చేయనిదానికి కేటాయింపులు చేయడం ఎందుకు? కేటాయింపులు చేయలేదని, లేదా సరిగా చేయలేదని ప్రశ్నించడం ఎందుకు? అటు చూసినా, ఇటు చూసినా, అటుఇటు చూసినా అంతా  రాజకీయమే!
బడ్జెట్ ప్రసంగం పేరుతొ ప్రతి ఆర్ధికమంత్రి యాభయ్, అరవై పేజీల పుస్తకం శాసన సభలో చదవడం రివాజు. మరో రెండు పేజీలు  అదనంగా జతచేసి, నిరుడు బడ్జెట్లో, కనీసం కొన్ని ప్రధాన రంగాలకు యెంత కేటాయించారు, వాటిల్లో యెంత ఖర్చు పెట్టారు అనే వివరాలు జోడిస్తే - లక్షల కోట్ల బడ్జెట్లకు అంకెల అలంకారంతో పాటు కొంత విశ్వసనీయత దానికి అబ్బుతుంది.        
ఉపశ్రుతి:
చాలా కాలం నాటి ముచ్చట.
తెలుగు దేశం పార్టీ  వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు మహేంద్రనాథ్ అనే ఓ పెద్దమనిషి ఆర్హ్దిక మంత్రిగా వుండేవారు. వారికి వినికిడి సమస్య. చెవిలో చిన్న యంత్రం అమర్చుకుని బడ్జెట్ ప్రసంగ పాఠం నెమ్మదిగా, చిన్న గొంతుకతో చదువుకుంటూ పోయేవారు. బడ్జెట్ పై చర్చలో ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తుంటే ఆయనగారు నెమ్మదిగా చెవిలోని వినికిడి యంత్రం తీసేసి నిరాసక్తంగా తన సీటులో కూర్చుండిపోయేవారు.  (14-03-2015)

(bhandarusr@gmail.com)

NOTE: Courtesy Image Owner

12, మార్చి 2015, గురువారం

బతికి పోయాను సుమా!





'చాలా సార్లు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఎందుకో ఏమిటో చేసుకోలేదు. బ్రహ్మచారిగానే వుండిపోయాను' - నోయెల్ కవార్డ్

'ఒకటిమాత్రం నిజం. ఏ పురుషుడికయినా పెళ్లి చేసుకున్న తరువాతనే అతడి జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది. మరో నిజం ఏమిటంటే, పరిపూర్ణత లభిస్తుంది కానీ, పెళ్ళితో అతగాడి పాత్ర ముగిసిపోతుంది' - జ్సా జ్సా గబర్



'ఇంటి పని, వంటపని వీటిల్లో నేను మొనగాడిని. విడాకులు తీసుకున్న ప్రతిసారీ ఈ పనులన్నీ నామీదే పడేవి. దాంతో వాటిల్లో రాటు తేలిపోయాను' - జ్సా జ్సా గబర్


'ఆవిడ చాలా చాలా మంచిది. ఆమెకు చక్కటి భర్త దొరకాలి. అలాటివాడు ఎవరన్నా ఆవిడకు తటస్థపడేలోగా ఆవిడను పెళ్ళాడిన వాడు అదృష్ట వంతుడు' - ఆస్కార్ లెవంట్


'అమెరికాలో ఎనభై శాతం మంది మగవాళ్ళు ఆడవాళ్ళను మోసం చేసేవాళ్ళే. మిగిలిన ఇరవై శాతం యూరోపులో వుంటారు' - జాకీ మాసన్


'వివాహం అనేది ఓ పంజరం లాంటిది. బయట వున్న పక్షులేమో ఎప్పుడెప్పుడు లోపల దూరదామా అని చూస్తుంటాయి.  లోపల వున్న పక్షులు ఎలా బయట పడాలా అని ఆలోచిస్తుంటాయి' - మాంటేన్


'పెళ్లి తరువాత మొగుడూ పెళ్ళాం ఇద్దరూ ఒకే నాణేనికి బొమ్మా బొరుసులుగా మారతారు. కలిసే వుంటారు కాని, విడివిడిగానే మిగిలి పోతారు'- హేమంత్ జోషి


'పెళ్లి చేసుకోవడం మాత్రం మానకండి. ఎందుకంటె మంచి భార్య దొరికింది అనుకోండి హాయిగా సుఖపడతారు. పెళ్ళాం గయ్యాళిది అయిందనుకోండి. ఎంచక్కా  నాలా వేదాంతిగా తయారవుతారు. ఇంతకంటే జీవితానికి  ఏం కావాలి చెప్పండి?' - సోక్రటీసు


'తెలివయిన మగవాడు భార్య ఖర్చుకు మించి సంపాదిస్తాడు. తెలివయిన ఆడది అలాటి మగవాడినే మొగుడిగా చేసుకుంటారు'  - లానా టర్నర్

'భార్యలు ఓ పట్టాన అర్ధం కారు. మా ఆవిడ చూడండి. పెళ్లి కాగానే పట్టుబట్టి పోరి పోరి నా పాత అలవాట్లన్నీ మానిపించింది. ఇప్పుడేమో పెళ్లి చేసుకున్నప్పటి మనిషి కాదని నస పెడుతోంది.' - సగటు మొగుళ్ళలో తొంభయ్ శాతం మంది మనసులో మాట.



NOTE: Courtesy 'Cartoon a Day.com'

11, మార్చి 2015, బుధవారం

బడ్జెట్లు


ఒక టీవీ చానల్ డిబేట్ లో నాతొ పాటు పాల్గొన్న ప్రొఫెసర్ హర గోపాల్ చెప్పారు. గతంలో బడ్జెట్ రోజుకు ముందుగానే దుకాణాల్లో సిగరెట్లు, అగ్గిపెట్టెలు, పాల పొడి డబ్బాలు మాయమై పోయేవని. కొత్త పన్నులు పడితే పాత రేటుకు కొన్న సరకులు కొత్త రేట్లకు అమ్ముకుని లాభాలు సంపాదించవచ్చని వ్యాపారులు అలా చేసేవాళ్ళు. మార్కెట్ మీద ప్రభుత్వాలకు పట్టు వున్న రోజులవి. ఇప్పుడో, మార్కెట్ శక్తులే ప్రభుత్వాలని శాసిస్తున్న రోజులాయె!
అందుకే బడ్జెట్లు ఈనాడు ఓ తంతుగా ముగిసే ప్రభుత్వ  కార్యక్రమాలు అయ్యాయి. వాటి మీద మీడియాకు తప్ప మామూలు జనాలకు ఆసక్తి లేకుండా పోతోంది. లోగడ కేంద్ర బడ్జెట్ అంటే రేడియో పెట్టుకుని వినేవారు. గాస్ సిలిండర్  ధరలు, పెట్రోలు ధరలు ఏవన్నా పెరిగాయా, కుక్కర్లు, ఫ్రిజ్  ల ఖరీదులు పెరిగాయా అనే ఆసక్తితో. ఇప్పుడు బడ్జెట్లకు, ధరల పెరుగుదలకు లంకె తెంపేసారు. వేటి దోవ వాటిదే. 'కోడి గుడ్డు ధర' మాదిరిగా, ఏరోజు రేటు ఆ రోజుదే!


లక్షలు కోట్లు అంటున్నారు. చిన్న అంకెలు పెద్ద ప్రభువులకు ఆనడం లేదు. మిగులు రాష్ట్రం కనుక కొన్నేళ్ళు పరవాలేదేమో. కానీ, తింటూ కూర్చుంటే కొండలు కూడా తరిగిపోతాయని అంటారు. కాస్త కళ్ళెం బిగబట్టడం అవసరమేమో.  (11-03-2015)