17, అక్టోబర్ 2014, శుక్రవారం

ఓ నీతి కధ


సీ.ఈ.ఓ. ఏకాంబరం కారు దిగుతున్నాడని తెలిస్తే చాలు ఆఫీసు ఆఫీసంతా నిశ్శబ్దం. ఎవరి పనుల్లోకి వాళ్ళు దూరిపోతారు. ఎవరన్నా ఖాళీగా వున్నట్టు కనబడితే చాలు ఇక అంతే  సంగతులు. ఆఫీసులో అదే ఆఖరి రోజనుకోవాలి. ఒకరోజు ఆయన మెట్లు దిగివస్తుంటే ఒకడు వరండాలో  దిక్కులు చూస్తూ కనబడ్డాడు. ఏకాంబరం కోపం నషాళానికి అంటింది. 'నీ ఫేస్ నచ్చలేదు. నీ తరహా నచ్చలేదు. ఒక్క క్షణం ఇక్కడ వుంటానికి వీల్లేదు' అంటూ, 'నీ జీతం యెంత' అని అడిగాడు.  వాడు బిక్కు బిక్కుమంటూ 'ఐదువేలు' అన్నాడు. ఏకాంబరం  మేనేజర్ని పిలిచాడు. మూడు నెలలు జీతం పదిహేను వేలు అప్పటికప్పుడే అతడి చేతిలో పెట్టించాడు. వాడు దణ్ణాలు పెడుతూ వెళ్ళిన తరువాత అడిగాడు ఏకాంబరం- 'వాడు ఎవడు, ఏ డిపార్ట్ మెంటులో పనిచేస్తాడ'ని. వచ్చిన సమాధానం విని ఏకాంబరం బిక్కచచ్చి పోయాడు.
ఆ వచ్చిన వాడు, ఎంచక్కా పదిహేనువేలు పట్టుకెళ్ళిన వాడు అసలు ఆ ఆఫీసు ఉద్యోగే కాదు. పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వాడు.
నీతి:  "అయినచోటా  కాని చోటా వూరికే ఎగిరెగిరి పడడం అంత మంచిది కాదు"
(పార్ధసారధి గారు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ కధకు స్వేచ్చానువాదం)

శ్రమయేవ జయతే


ఊళ్ళల్లో రోడ్డు పక్కన సిగరెట్లు వగయిరా అమ్మే పాన్ డబ్బాలు కనిపిస్తాయి. ఉదయంనుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఆ బడ్డీ దుకాణాల వారు శ్రమిస్తూ వుండడం అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ చిన్న దుకాణాల మీద దాదాపు పది పదిహేను ప్రభుత్వ శాఖల ఆజమాయిషీ ఉంటుందనేది చాలామందికి తెలియవి విషయం. మునిసిపల్ కార్పోరేషన్, పారిశుధ్య శాఖ, కార్మికశాఖ ఇలా ఈ జాబితా చాలా పెద్దది. ఇలాటి దుకాణాలు పెట్టుకునేవారు పెద్ద చదువులు చదివిన వారు అయివుండరు. కలిగిన వారు అయివుండే అవకాశం లేదు. అయినా ఇన్నిన్ని శాఖల ఆజమాయిషీ వారిపై అవసరమా? ఈ ప్రశ్న అతి సహజమైనది. మనలో చాలామంది మదిలో ఈ ప్రశ్న మొలకెత్తినా ఉసూరుమని నిట్టూర్చడం తప్ప  చేయగలిగింది ఏమీ వుండదు. సందర్భం వేరయినా ఈ ప్రశ్న వేసింది, జవాబు అన్వేషించింది సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి మోడీ అవడం వల్ల పరిష్కారం దొరుకుతుందనే ఆశ ఈనాడు కలుగుతోంది.
మోడీ ప్రధాని అయిన తరువాత ఆయన ఈ దేశ భవిష్యత్తు గురించి, దేశాన్ని ఎలా తీర్చి దిద్దాలి అనే విషయం గురించీ అనేక కలలు కంటున్నారు. నాయకులకి అది సహజం. కానీ విశేషం ఏమిటంటే, మోడీ  కనే కలలు నిజం కావాలని ప్రజలు, ముఖ్యంగా చదువుకున్నవారు, యువతీ యువకులు  సయితం  కలలు కనడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఇది మరీ  స్పుటంగా కానవస్తోంది.  అంటే ఆయన మీద జాతి జనులు పెట్టుకుంటున్న ఆశలు ఏమేరకు పెరిగిపోతున్నాయో, ఆ కారణంగా ఆయన భుజస్కంధాల మీద బరువు బాధ్యతలు ఎలా పెరిగిపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమాత్రం తభావతు వచ్చినా ఆ ఆశల శిఖరం కూలిపోయి, ప్రస్తుతం వెల్లువెత్తుతున్న అభిమానం కాస్తా ఆగ్రహంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ వాస్తవం తెలిసిన రాజకీయనాయకుడు కావడం వల్లనేమో, మోడీ కూడా అంతే జాగ్రత్తగా ప్రజామోదపధకాలకు రూపకల్పన చేస్తున్నట్టుగా వుంది. బహుశా, ఈ క్రమంలోనే కావచ్చు,  ఇటు యువతకు, అటు శ్రామికులకు, మరో పక్క పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం, ఉత్సాహం కలిగించే - 'శ్రమయేవ జయతే' అనే నూతన పధకాన్ని - భారతీయ జనతా పార్టీ, బీజేపీకి, ఒకప్పటి  మాతృ సంస్థ అయిన జన సంఘ్ నాయకుడు, కీర్తిశేషులు దీన దయాళ్ ఉపాధ్యాయ పేరిట  ప్రధాని మోడీ గత గురువారం నాడు ప్రారంభించారు. 


                 
ఉప్త్పత్తి రంగం తీసుకున్నా, తయారీ రంగం తీసుకున్నా అక్కడ పరిస్తితులు సజావుగా సాగాలంటే అటు పెట్టుబడి పెట్టే యజమానులు, ఇటు శ్రమను పెట్టుబడిగా పెట్టే  శ్రామికులు, ఒక కాడికి రెండు ఎడ్లు మాదిరిగా సమన్వయంతో సాగాలి. ప్రభుత్వం అనేది వీరిద్దరి మీదా పెత్తనం చేసే పెత్తందారీ వ్యవస్థ కాకుండా దారి చూపే దిక్సూచి మాదిరిగా వ్యవహరించాలి. మోడీ తన ప్రసంగంలో చెప్పింది అదే. ఏదయినా వ్యాపారం పెట్టాలన్నా, పరిశ్రమ స్తాపించాలన్నా, ఫాక్టరీ నెలకొల్పలన్నా అనేక రకాల ఫారాలు, అనేక రకాల దరఖాస్తులు, అనేక రకాల అనుమతులు. ఇన్నిన్ని  అవసరమా? అన్నది ఆయన వేసిన ప్రశ్న. అందుకే, ఒకే ఒక ధరఖాస్తుతో  అన్ని రకాల అనుమతులు, ఏక గవాక్ష విధానం ద్వారా కాలయాపన లేకుండా  మంజూరు చేయాలనేది ఆయన ఆలోచన.   
ఈ సందర్భంలోనే, పారిశ్రామికవేత్తలకు కొంత అనుకూలంగా, పనిచేసే కార్మికులకు, విశేషించి కార్మిక సంఘాలకు  మరి కొంత ప్రతికూలంగా కానవచ్చే నిర్ణయాలను ప్రధాని ప్రకటించారు. ఫాక్టరీలను, పారిశ్రామిక విభాగాలను, వ్యాపార సంస్థలను కార్మిక శాఖకు చెందిన ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడూ తనిఖీ చేసి, లోటుపాట్లను ఎత్తి చూపుతుంటారు. అయితే ఈ విధానంలో పారదర్శకత లోపించి, లాలూచీ వ్యవహారాలు సాగడానికి కూడా అవకాశం వుంది. యజమానులను అయిన దానికీ, కాని దానికీ అధికారులు వేధిస్తున్నారని వారి నుంచి ఆరోపణలు కోకొల్లలుగా వస్తూ వుండడం కొత్తేమీ కాదు. అందుకే ఈ మొత్తం తనిఖీ వ్యవస్థను పారదర్శకం చేయాలని మోడీ తలపెట్టారు. ఇకనుంచి కార్మిక శాఖకు చెందిన ఇన్స్పెక్టర్ ఏదయినా ఫాక్టరీకి వెళ్లి తనిఖీ చేయాలని అనుకుంటే ఇప్పటిమాదిరిగా తన ఇష్టం వచ్చిన ఫాక్టరీకి తన ఇష్టం వచ్చిన సమయంలో వెళ్లి తనిఖీ చేయడానికి కుదరదు. ఏ  ఇన్స్పెక్టర్  ఏ ఫాక్టరీకి వెళ్ళాలన్నది కంప్యూటర్ లో లాట్లు తీసి   నిర్ణయిస్తారు. అలా తనిఖీకి వెళ్ళిన అధికారి డెబ్బయ్ రెండు గంటల్లోగా  తన నివేదికను ఆన్ లైన్ లోనే పై అధికారికి పంపాల్సివుంటుంది. ఇటువంటి తరహా పద్దతులు ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ ప్రమేయాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం వీలుపడగలదని మోడీ మహాశయుల ఉద్దేశ్యం. వ్యాపారాలు సులువుగా చేసుకోగల పరిస్తితి వుంటే, అవినీతికి ఆస్కారం తగ్గి, నాణ్యతలో పోటీపడడానికి  వీలుంటుంది అన్నది ఆయన భావన. పాలన గరిష్ట స్థాయిలో వుండి ప్రభుత్వ పెత్తనం కనిష్ట స్థాయిలో వుండాలని ఆయన మొదటినుంచీ చెబుతూ వస్తున్నదే. అయితే,  ప్రధాని ప్రకటించిన కొన్ని నిర్ణయాలను పారిశ్రామికవేత్తలు హర్షించి ఆహ్వానిస్తే, అనేక కార్మిక సంఘాలు కొన్ని అంశాల పట్ల నిరసన తెలిపాయి. కాలక్రమంలో ఇటువంటి విధానాలు యజమానులకు లాభదాయకంగా, కార్మిక లోకానికి నష్టదాయకంగా పరిణమిస్తాయని, కార్మికులను తమ ఇష్టం వచ్చినట్టు తొలగించుకునే  అధికారం యజమానులకి దఖలు పడుతుందనీ కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ఏ.ఐ.టీ.యూ.సీ.  ఒక అడుగు  ముందుకు వేసి, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు  నిరసనగా డిసెంబరు  అయిదో తేదీన అఖిల భారత బంద్ కు పిలుపు ఇచ్చింది.       
కార్మికులకు ప్రయోజనం వుండే మరో విధాన ప్రకటన కూడా ప్రధాని  చేసారు. అది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు సంబంధించినది. కార్మికులు, ఉద్యోగులు తమ సంస్థను లేదా కంపెనీని వొదిలి వెళ్ళాల్సిన  సందర్భాలు తటస్తించినప్పుడల్లా ఈ ఖాతాను బదిలీ చేసుకోవడం వారికి దుస్తరంగా  మారుతోంది. దీన్ని అధిగమించడానికి పీ.ఎఫ్. ఖాతా నెంబరు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే నెంబరు కేటాయించే విధానం అమల్లోకి తెస్తారు. ఖాతా వివరాలను వారు ఎప్పటికప్పుడు వారి మొబైల్ ఫోన్ల ద్వారా తెలుసుకోగల వెసులుబాటు కూడా  వుంటుంది.
సరే! ఇవన్నీ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా అందుబాటులోకి తెచ్చుకోగల ప్రయోజనాలు. కానీ, కార్మిక లోకం తలెత్తుకుని తిరిగే రోజులు రావాలనీ, వారిలో ఆత్మ న్యూనతను కూకటివేళ్ళతో పెకలించి వేయాలనీ కూడా ప్రధాని కోరుకుంటున్నారు. ఇది నిజంగా ఆహ్వానించతగ్గ ఆలోచన. ఏ అభివృద్ధి చెందిన  దేశంలో అయినా పనివారికి సమాజంలో తగిన గౌరవ ప్రపత్తులు వుంటాయి. మన దగ్గర మాదిరిగా 'వైట్ కాలర్' ఉద్యోగాలు, 'కాలర్' మాసిన ఉద్యోగాలు అనే తేడాలు వుండవు. జీతాన్ని బట్టి కాకుండా పనికి గౌరవం లభించే విధానం రావాలనీ, అదే జీవన విధానం కావాలనీ కోరుకునే పాలకుల ప్రయత్నాలు హర్షణీయం. మోడీ  శ్రామికులను 'శ్రమయోగులు'గా అభివర్ణించారు. చక్కటి ఆలోచనే. అయితే, ఇన్నాళ్ళుగా రాజకీయ నాయకుల ఆలోచనలు అంతరిక్షంలోను,  ఆచరణ అధః పాతాళంలోను ఉండడమే ప్రజలకు తెలుసు. అందుకే వారు చెప్పే  మాటల  పట్ల, చేసే వాగ్దానాల పట్ల జనాలకు  అనేక సందేహాలు. అనేకానేక అనుమానాలు. కాబట్టి మాటలు చేతల్లో కనబడేలా అడుగులు పడినప్పుడే రాజకీయుల ఆలోచనలకు  విశ్వసనీయత లభిస్తుంది. సార్వజన ఆమోదం లభిస్తుంది.
ఇలాటి ఆలోచనలు మెండుగా చేస్తున్న ప్రధాని మోడీ 'అందరిలో ఒకరా, కొందరిలో ఒకరా' అనేది కాలమే తేలుస్తుంది.
విదియనాడు కనబడని చంద్రుడు తదియనాడు తానే కనబడతాడని సామెత.

కొంతకాలం వేచి చూడడం వల్ల పోయేదేమీ వుండదు. పైగా వోపిక అనేది భారతీయుల రక్తంలో వుంది అని కదా  చెబుతారు.  (17-10-2014)            

16, అక్టోబర్ 2014, గురువారం

మరపురాని మనుషులు

మరపురాని మనుషులు
తురగా కృష్ణ మోహన రావు పేరిట ఉత్తమ జర్నలిష్ట్ అవార్డ్ స్వీకరించిన సందర్భంలో నా ప్రసంగ పాఠం   
"తురగా కృష్ణ మోహన రావుగారు.
"ఎందుకో ఆయన కూడా ఈ వేదిక మీద వున్నట్టే నాకనిపిస్తోంది. నిన్న పోతే రేపటికి మూడు అనుకునే ఈ పాడులోకంలో కృష్ణ మోహనరావుగారు చనిపోయి ఒకటా రెండా మరో  ఒకటిరెండేళ్ళలో నలభై ఏళ్ళు కావస్తోంది. అయినా, ఇన్నేళ్ళ తరువాత కూడా  ఆయన్ని స్మరించుకుంటూ ఇంతమంది ఇక్కడకు వచ్చారంటే -  ఏ లెక్కన చూసుకున్నా నా దృష్టిలో   ఆయన బతికున్నట్టే లెక్క. అంత గొప్ప మనిషి కాబట్టే ఆయన పేరుమీద ఇస్తున్న ఈ అవార్డ్ తీసుకోవడానికి గర్వపడుతున్నాను. అందుకే జానకీరాణి గారు ఫోను చేసి చెప్పినప్పుడు కాదనలేకపోయాను. కాకపొతే, ముసలితనంలో వసంతం అన్నట్టుగా రిటైర్ అయి ఎనిమిదేళ్ళు పూర్తి అవుతుంటే ఇప్పుడు ఉత్తమ జర్నలిస్టో, అలాటిదో ఈ  అవార్డ్ ఏమిటి చెప్పండి.  కానీ రేడియోలో పనిచేసిన మా బోంట్లకు జానకీరాణి గారంటే భయంతో కూడిన గౌరవం ఏం చేస్తాం? కాదనే ధైర్యం ఎక్కడిది ?
"జానకీరాణి గారు అంటే గౌరవం. ఆవిడ వయస్సు కొంతా, ఆవిడ కలివిడితనం కొంతా కలిపి గౌరవం ఆవిడంటే. భయం దేనికంటే- నేనే గలగలా మాట్లాడుతానని అంతా అంటారు. జానకీరాణి గారు గలగలా మాత్రమే కాదు దడ దడలాడిస్తూ దడదడా కూడా మాట్లాడతారు.
"ఇక అసలు విషయానికి వస్తే నేను చదువుకుండే రోజుల్లో ఆంధ్ర పత్రిక వారపత్రికలో రాజధాని కబుర్లుఅనే శీర్షిక వచ్చేది. ప్రవీణ్ అనే ఆయన రాస్తుండేవారు. ఆ రాసే విధానం నాకు బాగా నచ్చేది. ఎప్పుడయినా హైదరాబాదు వెడితే ఆయనగారిని కలవాలని అనుకునేవాడిని. ఆయన  అంటే ఎందుకో ఇష్టం. ఆయనే తురగా  కృష్ణ మోహన రావు గారని చాలాకాలం తరువాత తెలిసింది. నాకు వారితో మరో బాదరాయణ సంబంధం కూడా వుంది. కృష్ణ మోహన రావుగారు అకాల మృత్యువాత పడిన తరువాత వారు చేసిన రేడియో విలేకరి ఉద్యోగంలోకే నేను ప్రవేశించాను. అది చిన్న ఉద్యోగం కావచ్చు.  అయినా అంత పెద్ద మనిషి చేసిన ఉద్యోగం కాబట్టి నాకది పెద్ద ఉద్యోగమే.
"కృష్ణ మోహన రావుగారు మంచి హాస్య రచయిత. అంటే నా అర్ధం మంచి హాస్యం రాస్తారని. ఆహ్లాదకరమైన హాస్యం రాస్తారని. ఆరోగ్యకరమైన హాస్యం రాస్తారని. ఆయన రచనలు  చదివిన అనుభవంతో నేను ఈ మాట  చెబుతున్నాను.
"తురగా వారు చిలికించిన  హాస్యం లాంటి హాస్యం  ఈ నాటి సమాజానికి ఎంతో  అవసరం. జనంలో  నవ్వుచచ్చిపోతోందేమో అని నాకు ఒక్కోసారి చచ్చేంత భయం వేస్తుంటుంది. నవ్వుతూ మాట్లాడేవాళ్ళతో మాట్లాడిచూడండి. కోపాలు తాపాలు మాయమైపోతాయి. బీపీలు గట్రా తగ్గిపోతాయి. దురదృష్టం ఏమిటంటే అలా నవ్వేవాళ్ళు, నవ్వించే వాళ్ళు  బాగా తగ్గిపోతున్నారు. ఇదొక విషాదం.
మరి ఏమిటి శరణ్యం. వుంది.  ఇదిగో కృష్ణ మోహనరావు గారు రాసిన ఈ మాట కచ్చేరీమొదలుపెట్టండి. పుస్తకం చదువుతూ మీరేమో ముసిముసినవ్వులు. ఆ నవ్వుల్ని చూస్తూ మీ ఆవిడ కూడా ఏమిటీ నవ్వేది మా ఆయనేనాఅని అనుమానంతో కూడిన నవ్వులు. ఇక ఆ ఇంట్లో ఒకటే నవ్వులవాన. మళ్ళీ మాట్లాడితే నవ్వుల తుపాన్.
"ఒక విషయం నేను గట్టిగా చెప్పగలను.
ఈనాడు మనం అనుభవిస్తున్న అన్ని రకాల రుగ్మతలకీ నవ్వే చక్కటి ఔషధం. కాణీ ఖర్చులేని ఆరోగ్య శ్రీ
"రేడియోలో పనిచేసే రోజుల్లో నా బల్ల మీద అద్దం కింద ఒక కాగితం మీద రాసిపెట్టుకున్నాను.
మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి.
"పుట్టగానే ఏడిస్తేనే బతికినట్టు లెక్క. బతికివున్నప్పుడు నవ్వితేనే బతికున్నట్టు లెక్క. ఈ లెక్క కుదరాలంటే తురగా కృష్ణ మోహనరావు గారి రచనలు  చదవండి. వాటిని  ఆస్వాదించండి. అన్ని లెక్కలు, అన్ని తిక్కలు ఇట్టే కుదిరిపోతాయి.
"ఎనీ డౌట్ ?  నాకయితే లేదు.
"ఇది సగర్వంగా  నేనిస్తున్న సర్టిఫికేట్"



(నిరుడు 'తురగా అవార్డు'కు నన్ను ఎంపిక చేసిన తురగా జానకీరాణి గారు ఈ లోకం నుంచే తప్పుకున్న ఈ రోజు ఆవిడను మరో సారి ఇలా గుర్తు చేసుకుంటున్నాను - భండారు శ్రీనివాసరావు) 

15, అక్టోబర్ 2014, బుధవారం

తురగా జానకీ రాణి గారు ఇకలేరు


"నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము...."
ఈ పద్యపాదానికి నిలువెత్తు ఉదాహరణ మా జానకీ రాణి గారు.


(కీర్తిశేషులు శ్రీమతి తురగా జానకీ రాణి)

చేరడేసి కళ్ళు, వాటికి కొట్టొచ్చినట్టు ఇంతేసి కాటుక. దూరం నుంచే చూసి చెప్పొచ్చు జానకీ రాణి గారు వస్తున్నారని. ఆ సంప్రదాయాలు, కట్టూ బొట్టూ అన్నీ అంతవరకే. మనసూ, ఆలోచనలు, సిద్దాంతాలు, సూత్రాలు అన్నీ రాబోయే తరానివి. ఆధునిక మహిళ ఆలోచనలు ఎలావుండాలో, ఎలా ఉంటాయో  ఆవిడని కలుసుకుని ఓమారు మాట్లాడితే ఇట్టే అర్ధం అవుతుంది. ఆ మాటలు వింటుంటే చూస్తున్న జానకీ రాణి గారు,ఆ మాటలు  చెబుతున్న జానకీరాణి గారు ఒకరేనా అన్నంత సందేహం కలగడం తధ్యం.
ఆమె రాకను మరో విధంగా కూడా కనుక్కోవచ్చు. ముందు ఆవిడ మాట వినబడుతుంది. తరువాత ఆవిడ కనబడతారు. చిన్నగా పొందికగా వుండే ఆ మనిషిది   ఏళ్ళు మీద పడుతున్నా వాటిని కనబడనివ్వని శారీరక తత్వం. ముందే చెప్పినట్టు మాట కొండొకచో చురుక్కు. ఎక్కువసార్లు చమక్కు.  అంత చక్కగా, శ్రావ్యంగా మాట్లాడుతారని తెలిసే బహుశా రేడియోలో ఉద్యోగం ఇచ్చి ఉంటారని అనుకునే అభిమానులు కూడా ఆవిడగారికి కోకొల్లలు. అలాటి మనిషి ఇక కనబడదనీ, అలాటి పలుకు ఇక వినబడదనీ తలచుకుని దుఃఖపడడమే ఇక మిగిలింది.
ఏవిటో కష్టాలు కట్టగట్టుకుని వస్తాయంటారు. ఈ మధ్యనే అల్లుడు ఒక రకంగా కొడుకూ అయిన నరేందర్ అందర్నీ వొదిలి వేరే లోకానికి తరలిపోయాడు. భర్త పోయిన దుఖం అనాలో, అతడ్ని మరచిపోలేని బాధ అనాలో తెలియక తల్లడిల్లుతున్న  ఉషారమణికి తల్లి పోవడం మరో విషాదం.
ఉషకు, శోభకు ధైర్యం చెప్పే ధైర్యం నాకు లేదు.
అందుకే ఈ నాలుగు మాటలు.

ప్రకృతి ప్రకోపాలు - పాలకులు నేర్వాల్సిన పాఠాలు

(Published by 'SURYA' Telugu Daily in its Edit Page on 16-10-2014, Thursday)

2014 అక్టోబరు 12. 
కాకతాళీయం కావచ్చు కానీ 'అంతర్జాతీయ విపత్తుల అదుపు దినం' - అక్టోబర్ 13 వ తేదీకి ఒక్క రోజు ముందరే  'హుద్ హుద్' తుపాను విశాఖ తీరాన్ని తాకింది.
'హుద్ హుద్' అనేది ఆరబ్ పదం. ఇది ఒక పక్షి పేరు. ముస్లిం ల పవిత్ర గ్రంధం 'ఖుర్ ఆన్' లో కూడా ఈ పక్షి ప్రసక్తి వుంది. అండమాన్ సముద్రజలాల్లో అక్టోబర్ ఆరో తేదీన పొడసూపిన ఈ తుపానుకు, నిండా తొంభయ్ గ్రాముల బరువు తూగని ఈ పక్షి -  'హుద్ హుద్' పేరును, అంతర్జాతీయ నియమావళి ప్రకారం  ఒమన్ దేశం సూచించింది.  అల్పపీడనంగా పురుడుపోసుకున్న ఈ సముద్ర రాకాసి మరునాటికల్లా  తీవ్ర రూపాన్ని ధరించి  రెండు రోజుల వ్యవధిలోనే అత్యంత  తీవ్రమైన పెను  తుపానుగా తయారయింది. అమెరికా రోదసీ పరిశోధనా సంస్థ  'నాసా' సయితం ఈ తుపాను తీవ్రతను గుర్తించి హెచ్చరికలు  జారీచేయడంతో -  తరువాతి కొద్ది రోజుల్లో ఈ తుపాను  సృష్టించబోయే విలయం ఏ స్థాయిలో వుంటుందో అర్ధం చేసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, యుద్ధ ప్రాతిపదికపై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. అధునాతన ఉపగ్రహ  పరిజ్ఞానం పుణ్యమా అని వెనుకటి రోజుల్లో మాదిరిగా కాకుండా తుపాను కదలికలను ముందస్తుగా, అదీ అతి ఖచ్చితంగా తెలుసుకోగల  అవకాశం వుండడం వల్ల ప్రభుత్వయంత్రాంగం అప్రమత్తమై తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలతో   ప్రాణ నష్టాన్ని దాదాపు పూర్తిగా తగ్గించగలిగారని చెప్పవచ్చు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన ప్రభుత్వ అధికారులు అభినందనీయులు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న వేలాదిమందిని నచ్చచెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికోసం శిబిరాలు ఏర్పాటు చేసారు. బస్సులు, రైళ్ళు ఆఖరికి విమాన సర్వీసులను కూడా నిలిపివేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. టీవీలు, రేడియో, మొబైల్ ఫోన్లు, ఇంటర్ నెట్ ఇతర ఆధునిక ప్రసార సాధనల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చారు.  తుపాను తీవ్రతను, కదలికలను జనాలకు తెలియచేసారు. ఈ చర్యలన్నీ ప్రాణ నష్టం నివారణకు బాగా దోహదం చేసాయి. వీటికి మించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఎప్పటికప్పుడు చర్చించుకుని చర్యలు తీసుకోవడం కూడా చక్కగా ఉపకరించింది. తుపాను  తీరం దాటిన  వెంటనే తీరిక చేసుకుని విశాఖకు వచ్చి క్షేత్ర స్థాయిలో విషయాలను అధ్యయనం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆంద్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభినందించిన తీరు ఇందుకు నిదర్శనం.
అనుకున్న విధంగానే, అనుకున్న రీతినే, అనుకున్న రోజునే, అనుకున్న ప్రదేశంలోనే పెనుగాలులతో కూడిన  ఈ భయంకర తుపాను తీరాన్ని తాకింది. వర్షం వల్ల కంటే కూడా పెనుగాలులు సృష్టించిన ప్రళయమే ఉత్తరాంధ్రను ఎక్కువ  వణికించింది. ఎన్నో దశాబ్దాలుగా చరిత్రకు సాక్షీభూతాలుగా నిలచిన వందలాది  పెను వృక్షాలు నేలకొరిగాయి. ఇక మానవ నిర్మితమైన కరెంటు స్తంభాలు, మేడలూ మిద్దెలూ లెక్కాజమా లేకుండా నేలమట్టం అయ్యాయి. ప్రాణనష్టం నివారించగలిగామన్న అధికారుల ఆనందం, తుపాను కలిగించిన అపార ఆస్తి నష్టంతో   ఆవిరైపోయింది.
'హుద్ హుద్' తుపానుకు ముందు, ఆ తరువాత అన్నట్టుగా, విశాఖ నగరం పరిస్తితి తారుమారయింది. ప్రభుత్వానికి అసలయిన పరీక్షాసమయం మొదలయింది. విశాఖవాసులకే కాదు, యావత్ దేశానికీ ఈ తుపాను కంటి మీద కునుకు లేకుండా చేసింది. సమర్ధతతకు మారుపేరుగా పేరు గాంచిన ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికీ, ఆయన ప్రభుత్వానికీ తుపాను తీరం దాటిన తర్వాతి  పరిణామాలు  పెనుసవాలుగా మారాయి. కూలిన చెట్లూ, వాలిన కరెంటు స్తంభాలు, కొట్టుకుపోయిన రోడ్లూ, కోతకోసిన సముద్రపు వొడ్లూ,ధ్వంసం అయిన రైలు మార్గాలు,  నేలమట్టమయిన ఇళ్లూ, మేట వేసిన పొలాలు, తెగిపోయిన చెరువులూ, పోటెత్తిన నదులూ, నీట మునిగిన పొలాలు, గాలికి లేచిపోయిన పైకప్పులూ, ఇలా ఆస్తి నష్టం పలు  రూపాలలో ఆవిష్కృతమైంది. నష్టం తొలి అంచనాలు వేయడంలో అధికారులు కాలయాపన చేయలేదు. నివేదికలు తయారయాయి. సుమారు రెండు వేల కోట్ల రూపాయల   సాయం చేయాలని ముఖ్యమంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేసారు. రెండు రాష్ట్రాల ఎన్నికల్లో తలమునకలుగా వున్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా హుటాహుటిన విశాఖ పట్నం చేరుకున్నారు. హెలికాప్టర్ లో తిరిగి తుపాను సృష్టించిన భీభత్సాన్ని కళ్ళారా చూసారు. తన పర్యటనను కేవలం 'ఏరియల్ సర్వే' కి మాత్రమె పరిమితం చేసుకోకుండా అధికారులతో మాట్లాడి, తుపాను బాధిత ప్రదేశాల్లో కలయ తిరిగి  వాస్తవ పరిస్తితులను స్వయంగా గమనించి  ఒక అంచనాకు వచ్చారు. తుపాను సహాయక చర్యలకు, పునరుద్ధరణ కార్యక్రమాలకు తక్షణం వెయ్యి కోట్ల కేంద్ర ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనాలకు ఊరట కలిగించే ప్రయత్నం చేసారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఎలాటి సమయం వృధా చేయలేదనే చెప్పాలి. విశాఖ సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకే కాదు, పాలకులకు కూడా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. 'ప్రతి దుర్ఘటన పాలకులకు ఒక పాఠం. ప్రతి అనుభవం భవిష్యత్తులో ఇలాటి సంఘటనలు పునరావృతం అయినప్పుడు గుర్తుంచుకుని వ్యవహరించేలా ఒక శాశ్విత విధానాలను రూపొందించు కోవాలి' అని ప్రధాని హితబోధ చేసారు.
నిజమే కదా! తుపాను కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టి ప్రాణ నష్టం నివారించడంలో విశేష ప్రతిభ కనబరచిన వారు, తుపాను తీరం దాటిన  తరువాత ఏర్పడబోయే సంక్షోభం నుంచి ప్రజలను వొడ్డున పడేసే ముందస్తు చర్యలపై అంతగా దృష్టిపెట్టినట్టులేదు. తీరం దాటిన  తరువాత కుంభ వృష్టి కురుస్తుందనీ తెలుసు. ప్రచండమయిన వేగంతో పెను గాలులు  వీస్తాయని తెలుసు. పెద్ద పెద్ద వృక్షాలే కూకటి వేళ్ళతో కూలిపోయే ముప్పు  పొంచివుందని ముందుగా తెలిసినప్పుడు కరెంటు స్తంభాలు ఆ ఉధృతానికి ఏపాటి. అవి నేలకొరిగితే,  రోజుల తరబడి విద్యుత్  సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందనీ తెలుసు. తుపాను తీరం దాటేది పట్టణ ప్రాంతం అని తెలిసినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు వేరేగా వుంటాయి. బియ్యం పప్పు, ఇతర పచారీ సామాను కంటే, వారి అవసరాలు భిన్నంగా వుంటాయి. పాలు, నీళ్ళు కొరత లేకుండా, రాకుండా చూడాల్సిన అవసరం వుంటుంది. కరెంటు లేకపోవడం వల్ల   అపార్ట్ మెంట్లల్లో మోటార్లు పనిచేయవు. నీళ్ళు పైకి ఎక్కవు. రోడ్డు రవాణా  దెబ్బతినడం వల్ల పెట్రోలు, డీసెలు సరఫరాకు ఆటంకం ఎట్లాగు తప్పదు. ఈ విషయాలను అధికారులు గమనంలో వుంచుకున్నట్టు లేదు. ఒకవేళ గుర్తుపెట్టుకున్నా ఏర్పాట్లు సరిపడా చేసి వుండరు. ఫలితం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. చెవులారా వింటున్నాం.
ఇలాటి పరిమాణంలో ఒక ప్రకృతి విపత్తు వచ్చిపడ్డప్పుడు  ఎలాటి లోటుపాట్లు లేకుండా సహాయ కార్యక్రమాలు అమలు చేయడం అన్నది ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. అలా జరగాలని ఆశించినా అది అత్యాశే అవుతుంది. కానీ, అలాగని, కొంత ముందు చూపు ప్రదర్శించకపోతే ఎలా వుంటుంది? అన్నదానికి విశాఖపట్నం, తదితర ఉత్తరాంధ్ర ప్రాంతాల దుస్తితే అద్దం పడుతోంది.
వీటినుంచే పాలకులు పాఠం నేర్చుకోవాలి.
మంచి చేసినప్పుడు వెల్లువెత్తిన ప్రశంశలను స్వీకరించినట్టే ఈ రకమైన సద్విమర్శలను కూడా ఔదలదాల్చగల ఔదార్యం వున్న పాలకులు చరిత్రలో మిగిలిపోతారు.(15-10-2014)         

      

14, అక్టోబర్ 2014, మంగళవారం

వయసు నవ్వింది




రామారావును నేను చిన్నప్పటినుంచీ ఎరుగుదును.

చిన్నతనంలో బొద్దుగా ముద్దుగా వుండేవాడు. వున్న వూళ్ళో స్కూలు లేక పట్నంలో బావ గారింటికి చేరాల్సివచ్చింది. వేసవి సెలవులివ్వగానే సొంతూరు మీద గాలిమళ్ళేది. అంతే. బస్సెక్కి తుర్రున వాళ్ల వూరు బయలుదేరేవాడు. ఆ రోజుల్లో బస్సు టిక్కెట్టు- అందులో అరటిక్కెట్టాయె - నాలుగణాలు పోను అక్కయ్య ఇచ్చిన రూపాయిలో ఇంకా ముప్పావలా జేబులో మిగిలేది. ఓ అణా పెట్టి కట్టె మిఠాయి, ఇంకో అణా పెట్టి జీళ్ళు కొనుక్కుని కాలవగట్టెక్కేవాడు. ఇక అక్కడినుంచి ఒకటే పాటలు, పద్యాలు. టైం తెలిసేది కాదు. మాయాబజారులో వివాహభోజనంబు పాట పదమూడోసారి ఎత్తుకునేలోపల ఊరోచ్చేసేది. మూడు మైళ్ళు మూడంగల్లో దాటి వచ్చిన ఫీలింగు. ఆహా అనుకునేవాడు. తన గొప్పే అనుకునేవాడు. చూసి నవ్వుకునేవాడిని.

పల్లెటూళ్ళో రాజభోగం. వేడి వేడి అన్నం. వెన్న కాచిన నెయ్యి.అరచేతిమందాన  మీగడ. ముద్దపప్పు. వూటలూరే కొత్తావకాయ. ఓహో ఏమి రుచి. రాళ్ళు తిని హరాయించుకునే ఆరోగ్యం తనదని మురిసి ముక్కచెక్కలయ్యేవాడు. రామారావుని చూసి జాలితో నవ్వుకునేవాడిని.

రామారావు పెరిగాడు. ఎదిగాడు. సన్న గీత గీసినట్టు మీసకట్టు. నిగనిగలాడే జుట్టు. ఎగదువ్విన క్రాఫు. ఎవరో అచ్చు నాగేశ్వర్రావులా వుంటావన్నారు. నిజమే కాబోలనుకున్నాడు. నవ్వుకోవడం నా వంతయింది.

రామారావుకు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. అయినా చిన్న కుర్రాడిలానే వున్నాడు. తోటివారిలా బొజ్జ రాలేదు. బరువు పెరగలేదు. జుట్టు నెరవలేదు. బట్ట తల రాలేదు. కంటి చూపు తగ్గలేదు. ముప్పయ్యేళ్ళ క్రితం ఎలావున్నాయో ముప్పయి రెండు పళ్ళు అలాగే గట్టిగా పటిష్టంగా వున్నాయి. నాది పెగ్గుల లెక్క కాదు జగ్గుల లెక్క అంటూ మూడు సీసాలు ఆరు సోడాల మాదిరిగా సాయంకాలక్షేపాలు చేసేవాడు. చూశారా నా స్పెషాలిటీ అన్నట్టు రొమ్ము విరుచుకు తిరిగే వాడు. రామారావుని చూస్తుంటే నాకిక నవ్వు రావడం లేదు. జాలి కలుగుతోంది.

రామారావుకు మెల్లమెల్లగా వయసు మీద పడుతోంది. కొంచెం కొంచెంగా వెంట్రుకలు చెప్పాపెట్టకుండా రాలిపోతున్నాయి. వెనుకనుంచి చూసేవారికి జుట్టు మధ్యలో గచ్చకాయ మందంలో ఖాళీ కనబడుతోంది. నెలల తేడాలోనే బెల్ట్ సైజ్ పెరిగింది. ముందు పొట్ట కనబడి తరువాత రామారావు కనబడుతున్నాడు. దళసరి కళ్ళజోడు మొహం మీద చేరింది. మరీ ముదుసలిలా కాకపోయినా ముడుతలు కనబడుతున్నాయి. కానీ, ఎవరో అతికించినట్టు ఎప్పటిలాగానే పెదాలపై చెరగని చిరునవ్వు. అయితే అందులో జీవమేదీ ?


రామారావుకు క్రమంగా సృష్టి రహస్యం అర్ధం అవుతోంది. శాశ్వితం అనుకుంటున్నవేవీ నిజానికి శాశ్వితం కాదు. ఈ నిజం తెలుసుకున్న రామారావుని చూసినప్పుడు నాకు నవ్వు రాలేదు. జాలీ వెయ్యలేదు. గర్వంగా అనిపించింది.


ఎందుకంటె నా పేరు వయస్సుకనుక. (10-06-2011)
NOTE: Courtesy Image Owner

13, అక్టోబర్ 2014, సోమవారం

వాసంతి కాదుకదా! వాసంతేనేమో!


ఏకాంబరం ఆఫీసులో వున్నప్పుడు సెల్ మోగింది.
'ఏమండీ ఏకాంబరం గారేనా మాట్లాడేది' ఒక ఆడ గొంతు పలకరించింది.
'అవునండీ. ఇంతకీ ఎవరండీ మీరు' ఏకాంబరం ఆసక్తిగా అడిగాడు.
'నా పిల్లల్లో ఒకరి తండ్రి మీరు. అని మా రికార్డుల్లో వుంది. అతడి విషయం చెప్పడానికే ఫోను చేస్తున్నాను'
ఏకాంబరం గుండెల్లో పిడుగు పడింది. 'ఒక్క నిమిషం' అంటూ ఆఫీసు బయటకు వచ్చి అడిగాడు.
'మీరు వాసంతి కాదుకదా'
'-----------'
'అయితే తప్పకుండా మాధురి అయివుంటారు'
'నాపేరు అది కాదండీ, నేను మీ అబ్బాయి ...'
'ఆగండాగండి కొంపతీసి మీరు వైజాగులో మేమున్నప్పుడు మా పక్కింట్లో వున్న వరూధిని అయి వుంటారు'
'కాదు కాదు నేను..'
'ఇప్పుడు గుర్తొస్తోంది. ఢిల్లీ టూరు మీద వచ్చినప్పుడు హోటల్లో పరిచయమైంది - ఆ ఆ - వైదేహి కదా మీ పేరు'
'నాపేరు వైదేహి కాదు, వరూధిని కాదు, మాధురి వాసంతిని అంతకన్నా కాదు. నేను మీ అబ్బాయి క్లాసు టీచర్ని. క్లాసులోవున్న నలభై మందిలో మీ వాడొక్కడే అన్నిట్లో సున్నా. ఒకసారి స్కూలుకు రండి మాట్లాడాలి'




(నెట్లో ఒక మిత్రుడు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ జోక్కి స్వేచ్చానువాదం)