20, ఆగస్టు 2014, బుధవారం

కోతి పైలట్



విమానం కూలిపోయింది. పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లతో సహా అందులో ప్రయాణిస్తున్నవారందరూ ఈ దుర్ఘటనలో మరణించారు, ఒక్క ఒక కోతి తప్ప. (విమానంలో కోతియేమిటంటే ఇక కధే లేదు)  

దాన్ని ఆసుపత్రిలో చేర్చారు. కాస్త కోలుకున్న తరవాత దుర్ఘటన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ఆ కోతిని విచారించడం ప్రారంభించారు. ఈ కధలో మరో  కొత్తదనం ఏమిటంటే ఆ కోతికి మనిషి భాష తెలుసు.
దర్యాప్తు ఇలా సాగింది.

అధికారి: విమానం బయలుదేరినదగ్గరినుంచి అన్ని విషయాలు చెప్పు. అసలేం జరిగింది.

కోతి: ఏముంది ఎయిర్ హోస్టెస్ నాకు పళ్ళూ బిస్కెట్లు పెట్టింది. అవి తింటూ కూర్చున్నాను.

నీ సంగతి సరే! మిగిలినవారు ఏం చేస్తున్నారు?”

సీటు బెల్టులు పెట్టుకున్నారు. మందు కొడుతూ కూర్చున్నారు

పైలట్లు ఏం చేస్తున్నారు?

 కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నారు

తరవాత?”

తరవాత ఏముంది ? ప్రయాణీకులందరూ ఫుల్లుగా మందు కొట్టి, ఎయిర్ హోస్టెస్ లు పెట్టింది తిని నిద్రలోకి జారుకున్నారు

మరి ఎయిర్ హోస్టెస్ లు ఏం చేస్తున్నారు?”

 తీరిగ్గా కూర్చుని లిప్ స్టిక్ దిద్దుకుంటూ, మేకప్ సరిచేసుకుంటున్నారు.

పైలట్లు?”

యధామాదిరి కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నారు.

అది సరే! ప్రమాదం జరగడానికి ముందు ఎవరేం చేస్తున్నారు ?”

ఎయిర్ హోస్టెస్ లు పైలట్లకు ముద్దులు  పెడుతున్నారు.

మరి  పైలట్లు ?”

 ఎయిర్ హోస్టెస్ లకు తిరిగి ముద్దులు  పెడుతున్నారు

నువ్వేం చేస్తున్నావు?”

ఒక్కత్తెను ఏం చేస్తాను,  కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నాను.



(నెట్ లో చక్కర్లుకొడుతున్న చిన్న ఇంగ్లీష్ జోకుకు స్వేచ్చానువాదం)


 NOTE: Courtesy Cartoonist)

19, ఆగస్టు 2014, మంగళవారం

సర్వేశ్వరార్పణం ......


'ఎన్నాళ్ళో వేచిన ఉదయం' -  సాయంత్రం దాకా ఆగాల్సిన అవసరం లేకుండానే  ధనలక్ష్మిగారనే ఎన్యూమరేటర్  రూపంలో ఇప్పుడే వచ్చి వెళ్ళింది. ఇంత చిన్నవిషయానికా ఇన్నాళ్లబట్టి ఇంత రభస జరిగింది అనిపించేట్టుగా ముచ్చటగా మూడు నిమిషాల్లో మొత్తం తతంగం ముగిసిపోయింది. శుభం.



(విధినిర్వహణలో ఇంటికి వచ్చిన ఆడపిల్లల ఫోటో తీయడం భావ్యం సంభావ్యం కాదనుకుని, అసలా ఉద్దేశ్యమే మానుకున్నాను. కానీ ఈలోగా తెలంగాణా ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కల్సి సర్వే ఫారం పూర్తిచేస్తున్న ఫోటో లభించింది.)

NOTE:  Photo Courtesy CPRO to CM   

శ్రద్ధాంజలి – కృతజ్ఞతాంజలి


మా అమ్మగారు శ్రీమతి వెంకట్రావమ్మ గారు గతించి రెండు దశాబ్దాలు గడిచాయి.   ఆమె చనిపోయిన రోజు ఇంకా కళ్ళకు కట్టినట్టు వుంది. అది శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం. ఆవిడకు వొంట్లో బాగా లేదని తెలిసి అంతా వచ్చారు. ఇంటి కోడళ్ళు అందరూ శుక్రవారం నోములకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆవిడ వారి నోములకు, వాయినాలకు ఆటంకం కలిగించకుండా అన్నీ పూర్తయ్యేవరకు వుండి ఆ తరువాత కన్ను మూసింది. దహన సంస్కారాలు పూర్తికాగానే, మా పెద్దన్నయ్య పర్వతాలరావుగారు ఆమె అపరకర్మలు కాశీలో జరపాలని ప్రతిపాదించడం, అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్లు, బావగార్లు అందరం వారణాసి వెళ్లి ఆ పవిత్ర ప్రదేశంలో గంగా తీరంలో పిండ ప్రదానాలు చేసి తర్పణాలు విడవడం అంతా ఓ కలలా జరిగిపోయింది.

(కీర్తిశేషులు భండారు వెంకట్రావమ్మ గారు)

మా నాన్నగారు రాఘవరావు గారు చనిపోయి అనేక దశాబ్దాలు దొర్లిపోయాయి. నా చిన్నతనంలోనే కన్నుమూయడం వల్ల,  ఆయన రూపం కూడా నాకు గుర్తు లేదు.  ఆయన ఆబ్దీకాలను మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు అత్యంత శ్రద్దాసక్తులతో  ప్రతియేటా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వచ్చారు. మా స్వగ్రామంలో వరుసగా నలభయ్ యాభై ఏళ్ళపాటు జరుగుతూ వచ్చిన  ఈ ఆబ్దీకాలు,  కాలక్రమంలో  వాస్తవంగా ఒక పండుగ మాదిరిగా మారిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో చుట్టపక్కాలందరూ ఓ శుభకార్యానికి వచ్చినట్టు హాజరయ్యేవారు. పిల్లలు, వారిపిల్లలు, వారి పిల్లలు  ఇలా అందరూ,  అదొక తద్దినం అనే  కన్నా కూడా నలుగురు కలిసి  ‘పెద్దల’ను సంస్మరించుకునే ఒక అవకాశంగా భావించి,  ఒకరికొకరు  కూడబలుక్కుని  ఆరోజుకల్లా అంతా ఠంచనుగా ఓ దారీతెన్నూ లేని  ఆ చిన్న పల్లెటూరు మా వూరు  చేరుకునేవారు. నిజానికి ఈ యావత్ కార్యక్రమానికి వెన్నుదన్ను మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గారు. ఆయన మా వూరు కరణీకం చేసేవారు. ప్రతియేడూ మా నాన్న తద్దినానికి పెళ్ళికి పంపినట్టు అందరికీ పేరుపేరునా  వర్తమానాలు పంపేవారు. మా నాన్న ఆబ్దీకం అంటే మా వూళ్ళో ఓ సందడి. వూరబంతి పెట్టేవాళ్ళు. మా ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళ కంటే తద్దినాలు ఘనంగా జరిగేవని చెప్పుకునేవారు.
ఇన్నేళ్ళ తరువాత కొన్ని విషయాలు చాలా బాధాకరంగా అనిపిస్తాయి. అన్ని సంవత్సరాలుగా అంత శ్రద్ధగా ఘనంగా మా అమ్మానాన్నల తద్దినాలను బాధ్యతగా  నిర్వహిస్తూ వచ్చిన మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు, మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు గారు ఈ నాడు మా మధ్యన లేకపోవడం మేమందరం  తట్టుకోలేకపోతున్న ఓ విషాద పరిణామం. మూడో అన్నయ్య ఏకంగా మా వూరిలో ‘అమ్మానాన్నల గుడి’ నిర్మించి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడా గుడి పక్కనే వారిద్దరి స్మారక చిహ్నాలు నిర్మించి మా అన్నయ్య పిల్లలు ఆయన ఋణం కొంతమేర తీర్చుకున్నారు.


(కంభంపాడులో మా అన్నయ్య కట్టించిన 'అమ్మానాన్నల గుడి)


(మా పెద్దన్నయ్య, మూడో అన్నయ్యల స్మారక చిహ్నాలు)



పోతే, చావంటే ఏమిటో తెలియని రోజుల్లోనే తండ్రిని పోగొట్టుకుని, తద్దినం అంటే ఏమిటో అర్ధం కూడా తెలియని స్తితిలో పెరుగుతూ వచ్చిన నేను,  వూహ తెలిసే నాటికే తద్దినం పెట్టే కర్త  తమ్ముడి పాత్రలో వొదిగిపోయాను. మా రెండో అన్నయ్య  రామచంద్రరావు గారు దత్తు పోవడం వల్ల, చివరికి మిగిలింది నేనే కావడం వల్ల ఏటా మా అమ్మానాన్నల తద్దినాలు కర్తగా కూర్చుని  పెట్టే అవకాశం – ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి – నాకు లభించింది. దాదాపు కాపురానికి వచ్చింది లగాయతు మా పెద్ద వొదినె గారు శ్రీమతి  సరోజినీ దేవి, రెండో వొదినెగారు శ్రీమతి  విమలాదేవి, మూడో వొదినెగారు శ్రీమతి  అరుణా దేవి మడికట్టుకుని  తడిబట్టలతో ఎంతో శ్రద్ధతో  ఈ పవిత్ర కార్యానికి తోడ్పడుతూ వచ్చారు. గత కొన్నేళ్ళుగా ఈ బాధ్యతను  మా ఆవిడ నిర్మలాదేవి నెత్తికెత్తుకుంది.


(అమెరికాలో అమ్మ తద్దినం)

దాదాపు  అరవై ఏళ్ళుగా  మా నాన్నగారి ఆబ్దీకం, సుమారు రెండు దశాబ్దాలుగా మా అమ్మగారి తద్దినం   క్రమం తప్పకుండా నిర్వహించే భాగ్యం   నా పూర్వజన్మ సుకృతం.  నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు కూడా మా పెద్దవాడు సందీప్  పూనుకుని ఏర్పాట్లు చేయడం వల్ల అక్కడ కూడా ఏలోటూ రాకుండా ఈ పవిత్ర కార్యాన్ని నిర్వర్తించగలిగాను. అందుకే అందరికీ కృతజ్ఞతాంజలి. గతించిన పెద్దలకు శ్రద్ధాంజలి. – భండారు శ్రీనివాసరావు  (17-08-2013)

నిబిడాశ్చర్యంలో నేను


అదేవిటో పదకొండవుతున్నా సర్వేవాళ్ళు రాలేదు. ఠంచనుగా పోవాల్సిన కరెంటు పోలేదు.


ఇప్పుడు తెలుస్తోంది


కంపల్సరీగా ఇంటిపట్టునే వుండాల్సిన పరిస్తితి.
అనుభవానికి వస్తే కాని అర్ధం కాదంటారు. నిజమే.

మరి, చాలామంది ఆడవాళ్ళు 'ఇంటి బందిఖానాని' ఏళ్లకు ఏళ్ళుగా యెలా భరిస్తూ వస్తున్నారో ఏవిటో!


(NOTE:Courtesy Image Owner)

17, ఆగస్టు 2014, ఆదివారం

దటీజ్ బాపు. బాపు ది గ్రేట్.


ముళ్ళపూడివారి 'కోతికొమ్మ'చ్చికి  ఆయన అభిమాన బృందం  అభిమాన  పురస్సర  కొనసాగింపే 'కొసరు కొమ్మచ్చి' పుస్తకం.   వెల కేవలం రెండువందలు. కేవలం ఎందుకంటున్నానంటే - ఇందులో అక్షరలక్షలు విలువ చేసే బాపూగారి  'రమణా నేనూ, మా సినిమాలు' అనే ముందుమాట వుంది.(ప్రతులకు నవోదయా) ఎదుటివాడిమీద  జోకులేసి నవ్వుకోవడం కాదు, మన మీద మనమే జోకులేసుకుని నవ్వించే గుణం వుండాలి అనే బాపూ గారి మానసిక ఔన్నత్యానికి ఇదిగో ఒక మచ్చు తునక:
బాపూ గారి ఉవాచ:
"శంకరాభరణం ఎనభయ్ మూడోమాటు చూడ్డానికి దియేటర్ కు వెళ్ళినపుడు ఇంటర్ వెల్ లో ఇద్దరు కాన్వెంటు పాపలు పరుగునవచ్చి బుల్లి మఖమల్ అట్ట పుస్తకం ఇచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. 'పెన్ను లేదమ్మా' అన్నా. ఓ పాప బ్యాగ్ లోంచి కంపాస్ బాక్స్ తీసి అందులోనుంచి పెన్సిల్ తీసి ఇచ్చింది. నేను సంతకం పెడుతుంటే చూసి, 'మీరు విశ్వనాద్ గారు కారా'  అనడిగింది. 'కాదమ్మా' అన్నా. ఆటోగ్రాఫ్ పుస్తకం లాక్కుని,  ఫ్రెండుని 'ఒసే. బాక్సులో లబ్బరు వుంటుంది ఇలా తే' అంది"
దటీజ్ 



      

16, ఆగస్టు 2014, శనివారం

ప్రత్యేకతలతో సాగిన ప్రధాని ప్రసంగం


(17-08-2014 - ఆదివారం సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్దాల కాలంలో ప్రతియేటా ప్రతి ప్రధానమంత్రి దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోట బురుజులపై నుంచి  పంద్రాగస్త్ట్ ప్రసంగాలు చేస్తూ వస్తూనే వున్నారు. ఇది కొత్తవిషయమేమీ కాదు. కానీ ఈసారి  ప్రధాని హోదాలో తొలిసారి త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన తరువాత నరేంద్ర మోడీ  చేసిన ప్రసంగంలో అనేకానేక  విలక్షణ  లక్షణాలు  కానవచ్చాయి. గతంలోని జవహర్ లాల్ నెహ్రూ సాదాసీదా రోజుల్ని గుర్తుకు తెచ్చాయి. విచిత్రం ఏమిటంటే మోడీ  మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా నెహ్రూ ప్రస్తావన తీసుకురాకపోవడం. పైపెచ్చు ఆయన కాలంలో ఏర్పడ్డ  ప్రణాలికా సంఘానికి కాలం చెల్లి పోయిందంటూ  ప్రత్యామ్నాయ వ్యవస్థ ప్రతిపాదన తెర మీదకు తీసుకు రావడం. మళ్ళీ అదే సమయంలో మహాత్మా గాంధీ,  వల్లభాయ్  పటేల్ వంటి కాంగ్రెస్ అగ్రనాయకుల పేర్లు సంస్మరించుకోవడం. అంతే కాకుండా భారత దేశం ఇంతవరకు  సాధించిన అభివృద్ధిలో మునుపటి  ప్రభుత్వాల  పాత్ర వుందంటూ ప్రసంశల వర్షం కురిపించడం.




ప్రధానమంత్రి ప్రసంగంలో మాత్రమే కాకుండా ప్రసంగించిన తీరులో కూడా వైవిధ్యం కనబరిచారు. దశాబ్దాల తరబడి ప్రజా ప్రతినిధులను ప్రజలనుంచి వేరు చేస్తున్న సెక్యూరిటీ విధానాలకు స్వస్తి చెప్పి, బుల్లెట్ ప్రూఫ్ అద్దాల అడ్డుగోడలను తొలగించారు. ఎర్రకోట మీద నుంచి మాట్లాడుతున్నది తమలో ఒకడే అనే భావన జనాల్లో కలిగేలా తన వేషధారణ విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. అధికారులు రాసి ఇచ్చిన ప్రసంగం ప్రతిని వల్లె వేసే పాత పద్దతికి భరతవాక్యం పలికి ఆశువుగా ప్రసంగించడం మరో విశేషం. 'ప్రధాన మంత్రిగా కాదు, ప్రజాసేవకుడిగా మీముందుకు వచ్చాను' తరహా మాటలతో ప్రజానీకం మనసులను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.
ప్రధానమంత్రిగా తన ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు  వివరించే సంప్రదాయాన్ని ఒక పక్క పాటిస్తూనే, ప్రధాని హోదా కలిగి వ్యక్తి  -  స్వాతంత్ర దినోత్సవం వంటి సందర్భాలలో చేసే అధికారిక సందేశ ప్రసంగంలో  ఇంతటి అత్యల్ప స్వల్ప విషయాలను కూడా ప్రస్తావిస్తారా  అని పరిశీలకులు ముక్కు మీద వేళ్ళు వేసుకునే రీతిలో -   'కుటుంబాల్లో ఆడపిల్లల్ని  ఆడామగా తేడా లేకుండా వారిని ఎలా పెంచాలి?'  అనే అంశాలను కూడా జోడించడం  మరో ప్రత్యేకత. మహిళల సమస్యలను ప్రస్తావిస్తూ, 'ఆడశిశువులను గర్భంలోనే చిదిమివేసే దుష్ట సంస్కృతికి మంగళం పాడాల'ని ఆయన తలితండ్రులకు విజ్ఞప్తి చేసిన తీరు  మరీ   ప్రత్యేకతను సంతరించుకుంది.  ఆడపిల్లల ఆత్మాభిమానాన్ని, శారీరక ఆరోగ్యాన్ని  వారి విద్యార్జనతో ముడిపెడుతూ 'ప్రతి పాఠశాలలో మరుగు దొడ్ల సౌకర్యం' ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఒక్క ఏడాదికాలంలో ఈ కార్యక్రమాన్ని  అమలుచేయడానికి వీలైన రోడ్ మ్యాప్ కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు.  ఇందుకోసం ప్రతి పార్ల మెంటు సభ్యుడు తన నియోజకవర్గం అభివృద్ధి నిధులనుంచి తగిన మొత్తాలను ఖర్చు  చేయాలని సూచించారు. ఇంటిని శుభ్రం చేసుకోవడంలో చూపే శ్రద్ధను, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో కూడా చూపితే 'పరిశుద్ధ భారతం'గా దేశాన్ని  తయారుచేయడం అసాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి చిన్న చిన్న అంశాలు కూడా ప్రధాని స్వతంత్ర దినోత్సవ సందేశంలో  చోటుచేసుకోవడం సహజంగానే ఆయన రాజకీయ ప్రత్యర్ధులకు ఒక విమర్శనావకాశాన్ని అందించినట్టయింది.
'అతి సాధారణ అంశాలకు పరిమితం అయిన ప్రధాని ప్రసంగంలో దార్శనికత కొరవడింద'ని కాంగ్రెస్ నాయకులు మనీష్ తివారీ  ప్రభ్రుతులు పెదవి విరిచారు. 'ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తే పధకాలను  అమలుచేసేది ఎవరు,  పర్యవేక్షించేది ఎవర'ని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి  ఆక్షేపించారు.
ఎవరెన్ని విమర్శలు చేసినా, బీజేపీయేతర   రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం మోడీ ప్రసంగం, మంచి  ఉత్సాహాన్ని ఇచ్చి వుంటుంది. సమాఖ్య స్పూర్తిని గౌరవించాలన్న ఆయన పలుకులు వారికి కర్ణపేయంగా వినబడివుంటాయి. ప్రభుత్వాలకు   మెజారిటీ వున్నాకూడా  అందరినీ కలుపుకుపోతూ ఏకాభిప్రాయాన్ని సాధించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకుని   సత్ఫలితాలను  సాధించవచ్చని  మోడీ   చెప్పారు. తద్వారా  కేంద్రం అత్తగారి పెత్తనానికి  తన హయాంలో  కాలం చెల్లిపోయినట్టే అన్న అభిప్రాయం  కలిగించారు. అధికారమనేది  రాజకీయాలకు వేదిక కాదనీ, జాతి నిర్మాణ సాధనకు అది ఒక మార్గమనీ మోడీ హితవు పలికారు.
'నేను పనిచేస్తాను, మీరూ పనిచేయండి' అని ప్రభుత్వ అధికారులకు దిశానిర్దేశం  చేసారు. నూటపాతిక కోట్లమంది జనం చేయీ చేయీ కలిపి పనిచేస్తే  ప్రపంచంలో భారత దేశానికి ఇక తిరుగే ఉండదని అన్నారు.
కొంత రాజకీయ కోణం ప్రధాని  ప్రసంగంలో కానవచ్చినప్పటికీ, మొత్తం మీద ప్రజలను ఆకట్టుకునే రీతిలోనే సాగిందని చెప్పవచ్చు. మోడీ ప్రసంగిస్తున్నప్పుడు వినవచ్చిన చప్పట్లే  దీనికి  నిదర్సనం.
యావత్ ప్రపంచం గుర్తింపు పొందే విధంగా బ్రాండ్ ఇండియా తయారుచేయాలన్న మోడీ లక్ష్యం నెరవేరే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తె ప్రజలకు కావాల్సింది ఇంకా  ఏముంటుంది.