27, ఏప్రిల్ 2014, ఆదివారం

ఏ నిమిషానికి ఏమిజరుగునో ........


మంథా భానుమతి గారు 'హ్యాపీ మూమెంట్స్' రాయడం మొదలు పెట్టిన తరువాత అలా అందరూ తలా ఓ చేయివేస్తే అంతా హాయిగా చదువుకోవచ్చు కదా అనిపించింది. కానీ మళ్ళీ ఆవిడే రాశారు తెలిసిన వాళ్ళెవరో పోయారు, విషాద వార్తను పంచుకోవాల్సివచ్చిందని. పోతే, మా కధ.
ఆదివారం అన్నీ లేటే! కాఫీలు టిఫిన్లు.
వంటావిడ వచ్చి చేసిన ఇడ్లీలు తిని, పొద్దున్న (ఛానళ్ళ కోసం) చదివిన పత్రికల్నే మళ్ళీ తీరిగ్గా  చదవడానికి గదిలోకి వెళ్లాను. మా ఆవిడ పూల కుండీల్లో నీళ్ళు పోశారో లేదో చూడడానికని బయటకు వెళ్ళింది. మావాడు సంతోష్  పెట్టిన టిఫిన్ చల్లారిపోతున్నా పట్టించుకోకుండా 'వాట్సప్' లో మునిగితేలుతున్నాడు.
ఇంతలో భళ్ళున చప్పుడు. తలుపులు విరిగి విసురుగా దూరాన పడ్డ శబ్దం. బయటకు వచ్చి చూస్తే వంటిల్లు రణరంగంలా వుంది. కిచెన్ ప్లాట్ ఫారం కింద గ్యాస్ క్యాబిన్ తలుపులు దూరంగా పడివున్నాయి. సిలిండర్ రెగ్యులెటర్ నుంచి మంటలు వస్తున్నాయి. మావాడు మంచినీళ్ళబాటిళ్లలోని నీళ్ళతో ఆ మంటలపై చల్లుతున్నాడు.    
అవి ఓ పట్టాన కంట్రోల్ కావడం లేదు. ఎలారా అని అనుకుంటున్న సమయంలో 'లక్కు' అనేది మాకూ , జరగబోయే బీభత్సానికి నడుమ అడ్డుగోడలా నిలిచింది. మంటలు ఆరిపోయాయి. సిలిండర్ తీసి బయట పడేశాము.
ప్రస్తుతం మా ఆవిడ పర్యవేక్షణలో సంప్రోక్షణ జరుగుతోంది.
మావాడు కిచెన్ కు సెలవు ప్రకటించాడు. బహుశా ఈ పూట మధ్యాహ్నభోజనం బయట హోటల్లోనేమో!
కధ సుఖాంతం 


26, ఏప్రిల్ 2014, శనివారం

?????????


ఈ రెండు నెలలు అసెంబ్లీని యెందుకు వుంచినట్టు. యెందుకు రద్దుచేసినట్టు. కారణం తెలియదని కాదు ఈ ప్రశ్న వేయడం. రాష్ట్రపతి పాలన విధించినప్పుడే రద్దు చేసి వుంటే ఎమ్మెల్యేల జీత భత్యాల భారం తప్పేది కదా అని.



పల్లెకు పోదాం


"Back to village"

'పల్లెకు పోదాం పదండి' అని నేను 2005 లో  రిటైర్ కావడానికి ముందే రాశాను. ఒక్క దేవినేని మధుసూదనరావు గారనే పెద్ద మనిషి వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు  మాత్రమే ఈ పని చేసి చూపించారు.  హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తికాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ,   పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నారు.  చదువులకోసమో, ఉద్యోగాలకోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా,  స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే బస్తీలమీద ఇంత భారం ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) పడదని నా వాదన. కానీ ఏం లాభం జీవితంలో ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.


(మా స్వగ్రామంలో మా ఇల్లు)


25, ఏప్రిల్ 2014, శుక్రవారం

ఏకంగా నా పోటీ జంధ్యాల మీదే!


డెబ్బయ్యవ దశకానికి ముందు మా అన్నయ్య పర్వతాలరావు గారికి ఖమ్మం నుంచి బెజవాడ బదిలీ కావడం వల్ల నేను ఎస్సారార్  కాలేజీలో,  బీ కామ్ మొదటి సంవత్సరంలో చేరాను. చేరిన కొత్తల్లోనే విద్యార్ధి సంఘం ఎన్నికల్లో భాగంగా లాంగ్వేజ్ అసోసియేషన్ ఎన్నిక జరిగింది. మా క్లాసులో శతమానం భవతి అన్నట్టు వంద మంది. అదే కాలేజీలో బీ ఎస్సీ చదువుతున్న నా మేనల్లుడు తుర్లపాటి సాంబశివరావు పూనికపై నేను కూడా పోటీ చేస్తున్నట్టు పేరు ఇచ్చాను. మాచవరం నుంచి ఇద్దరం రిక్షాలో కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులోని తెలిసిన సైక్లోస్టైల్ షాపుకు వెళ్ళి తెలుగులో అక్కడికక్కడే ఒక గేయం రాసి టైపు చేయించి కాలేజీకి  తిరిగి వచ్చి వాటిని క్లాసులో పంచిపెడుతుండగానే గంట మోగింది. వందలో నాకు పదిహేడు ఓట్లు వచ్చినట్టు జ్ఞాపకం. దండిగా ఓట్లు తెచ్చుకుని గెలిచినదెవరంటే జేవీడీఎస్ శాస్త్రి. అంటే ఎవరో కాదు మనందరి అభిమాన ఆహ్లాద సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల.


ఆ 'ఒక్కక్షణం' అనే  గేయం ఇలా సాగుతుంది.
"ఒక్క క్షణం తొందరపడి ఓటు వృధా చేయకు - నిప్పుకణికెలాంటిదది నిర్లక్ష్యము చేయకు - మాటలాడబోవుముందు ఒక్కసారి యోచించు - ఓటు వేయబోవుముందు కొద్దిగ ఆలోచించు - స్నేహితునకు ఇవ్వదగిన బహుమానము కాదు ఓటు - శత్రువైన సరే నీకు! అర్హతున్నవానికేయి - చేతులు కాలిన పిమ్మట ఆకులకై  వెదుకకు - మంచికైన చెడుకైన నీదే బాధ్యత మరువకు -  అర్హుడైన వాని గెలుపు నిజము సుమ్ము నీ గెలుపే"

ఎందుకో మా తరగతిలో చాలామంది నా మాట మన్నించారు. చివరి పాదంలో చెప్పినట్టు జంధ్యాలను గెలిపించారు.               

1973 లో అగ్గిపెట్టె పదిపైసలు

మా పాత డైరీల్లో రాసుకున్న పాత విషయాలు
న్యూ ఇయర్  గిఫ్ట్ లకింద జర్బలిష్టులకు యెంత ఖరీదయిన డైరీలు వచ్చినా వాటిల్లో చాలామంది (వారి భార్యలు) రాసుకునేవి కిరాణా పద్దులే. ఎందుకంటే రాసేదంతా ఆఫీసులోనే రాసి వస్తారు కాబట్టి ఇక సొంత గోల రాసుకోవడానికి ఓపికా వుండదు. రాయడానికి విషయాలు వుండవు.
అలా 1973 లో మార్చి నెల 31  వ తేదీన మా ఆవిడ డైరీలో రాసిన ఒక రోజు ఖర్చు చిట్టా ఇది. (అంటే సుమారుగా నలభయ్ ఏళ్ళకిందటి మాట)
నూనె : Rs.3-25
నెయ్యి:Rs. 2-75
పెరుగు: Rs.0-20
టమాటాలు:Rs. 0.55
అగ్గిపెట్టె: Rs. 0.10
సబ్బు: Rs.1-00
రిక్షా: Rs. 0-50
వక్కపొడి పొట్లం: Rs. 0-10
(NOTE: నూనె, నెయ్యి కూడా రోజువారీగా కొని సంసారం నడిపిందేమో తెలవదు. ఎందుకంటే జర్నలిష్టులకు ఇల్లు పట్టదు. అంతా ఐ నో సీ ఎం - ఐ నో పీఎం బాపతు)

24, ఏప్రిల్ 2014, గురువారం

యస్ సర్ నో సర్ - భండారు శ్రీనివాసరావు


ముప్పయ్ అయిదేళ్ళ క్రితం చండప్రచండుడిగా పేరు తెచ్చుకున్న ఒక ముఖ్యమంత్రిగారి పేషీలో  ఎస్.ఆర్. రామమూర్తి గారనే ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. చెప్పిన పని వెంటనే చేయకపోయినా, నలుగురిలో వుండగా ఏదయినా ఫైల్ విషయంలో కుదరదని (నో) చెప్పినా ఆయన ఎగిరిపడతారని ఆ అధికారికి బాగా తెలుసు. అందుకని ఎవరయినా పనిమీద సీఎంని కలిసి ఏదయినా అడిగితె,  అప్పటికి 'యస్ సర్' అనేవారు. తరువాత ఆ ఫైల్ సీఎం పేషీకి   వచ్చినప్పుడు ఎవరూ లేకుండా చూసి దాన్ని యెందుకు ఆమోదించకూడదో వివరంగా చెప్పి 'నో సర్' అంటూ 'నో'  చెప్పేవారట. అందులో విషయం వుందని అర్ధం చేసుకున్న ముఖ్యమంత్రి కూడా మారుమాట లేకుండా ఆ అధికారి చెప్పిన దాన్ని వొప్పుకునేవారట. అందుకని (ఎస్సార్ ) రామమూర్తి గారిని తోటి అధికారులు 'ఎస్ సర్ రామమూర్తి', 'నో సర్ రామమూర్తి' అనేవారట. (తదనంతర కాలంలో రామమూర్తి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు)    

23, ఏప్రిల్ 2014, బుధవారం

"రెండు నిమిషాలు నాకు దానం ఇవ్వండి"

పరమాచార్య పావన గాధలు - భండారు పర్వతాలరావు


"మీరందరూ నా వద్దకు అనేక కానుకలు తీసుకువస్తున్నారు. పుష్పఫలాదులు తెస్తున్నారు. ధనమిస్తున్నారు. వీటిని వేటినీ నేను కోరుకోవడం లేదు.
"దినానికి రెండు నిమిషాలు మాత్రం నాకివ్వండి. ఆ రెండు నిమిషాలు భక్తితో పరమేశ్వరుని ధ్యానించండి. అదే నాకు అత్యంత ప్రీతికరమైన కానుక.
"దినమంతా మీరు లౌకిక వ్యాపారాలతో గడుపుతారు. ఓ రెండు నిమిషాలు ఈ బీద సన్యాసికి దానమివ్వలేరా!
"నాకు కావలసింది అంతే!"
-పరమాచార్య