21, ఏప్రిల్ 2014, సోమవారం

ఎన్నికల్లో ధన ప్రవాహం - దాని ప్రభావం


ఏ ఛానల్లో చూసినా ఇదే చర్చ. అసలు ఎన్నికల్లో పెట్టే ఖర్చు ఏవిధంగా వుంటుంది. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు, మీటింగులు, రోడ్డు షోలు, జనాల తరలింపులు, పత్రికల్లో టీవీల్లో ప్రకటనల ప్యాకేజీలు, ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు చూసారు అదే వోట్ల కొనుగోళ్ళు. చిత్రం ఏమిటంటే ముందు జాబితాలో  పేర్కొన్న అంశాలపై  పెట్టే ఖర్చుతో పోలిస్తే చివరి ఐటంపై పెట్టేది అంతవుండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాని కాకి గోలంతా దీని గురించే కావడం విచిత్రం.


ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు చివరివీ కావు ఇవే మొదటివీ కావు. నిజం చెప్పాలంటే మన రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుంచీ ఏవో ఎన్నికలు జరుగుతూనే వున్నాయి. ప్రతి ఎన్నికలో ఈ డబ్బు ప్రసక్తి వస్తూనే వుంది. వోటు అమ్ముకోవద్దు అనే నీతి వాక్యాలు ప్రతిసారీ వినబడుతూనే వున్నాయి. అదేదో సినిమా పాటలో చెప్పినట్టు 'మీలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి' అన్నట్టు, పైకి ఒప్పుకోకపోయినా,  ప్రతి పార్టీ వోట్ల కోనుగోలు విషయంలో ఎంతో కొంత ఖర్చు చేస్తూనే వస్తోంది.
వోటు కొనుగోలు అంటే అర్ధం ఏమిటి? డబ్బు తీసుకున్నవాడు దానికి ప్రతిఫలంగా డబ్బు ఇచ్చిన అభ్యర్దికో లేదా పార్టీకో వోటు వేయడం. అలా జరిగితే అందరూ గెలవాలి కదా! కొందరే యెందుకు గెలుస్తున్నారు. అంటే అర్ధం ఏమిటన్న మాట. ఓటుకు ఇంత అని డబ్బు తీసుకున్న ఓటరు కూడా తనకు నచ్చినవాడికే ఓటు వేస్తున్నాడు అనుకోవాలి. లేకపోతే ఎమర్జెన్సీ తరువాత ఇందిరా గాంధి ఓడిపోయేదా! ఆ తరువాత గద్దె ఎక్కిన జనతా పార్టీ కుమ్ములాటల్లో చిక్కుకుని వున్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో యెందుకు ఓడిపోయింది. ఎన్టీయార్ తెలుగుదేశం ఇందిరా ప్రభంజనాన్ని అడ్డుకుని గెలవకలిగి వుండేదా! ఆ తరువాత కొన్నేళ్లకు అదే ఎన్టీయార్ పరాజయాన్ని యెలా మూటగట్టుకున్నారు.  ఓడించిన ప్రజలతోనే తిరిగి కిరీటం యెలా పెట్టించుకోగలిగారు. చంద్రబాబు, వాజ్ పాయ్ కాంబినేషన్ కు  జనం బ్రహ్మరధం యెలా పట్టారు. తరువాత పదేళ్లు తిరక్కముందే వారిని యెలా తిప్పికొట్టారు. ఓటర్లు కేవలం డబ్బుకు ప్రలోభపడి వుంటే ఇవన్నీ సాధ్యం అయివుండేవా!
దీనర్ధం ఓట్ల  కొనుగోలును సమర్ధిస్తున్నట్టు ఎంతమాత్రం కాదు. ఎన్నికల్లో ధన ప్రవాహం వుండొచ్చు కానీ దాని ప్రభావం ఎన్నికల ఫలితాలమీద వుండకపోవచ్చు అని మాత్రమే!
మనతోపాటు స్వాతంత్రం వచ్చిన అనేక ఇరుగు పొరుగు దేశాల్లో, ఎప్పుడో ఒకప్పుడు, ఎంతో కొంత కాలం ప్రజాస్వామ్యం మరుగున పడి, అవి సైనిక నియంతృత్వ  పాలనలోకి మళ్ళిన దృష్టాంతాలు వున్నాయి. ఒక్క మనదేశంలోనే వోటరు,  ఓటుద్వారా తనకు నచ్చిన వారికి పట్టం కడుతున్నాడు. నచ్చకపోతే గద్దె నుంచి దింపుతున్నాడు. వారిలో ఎక్కువమంది నిరక్ష్యరాస్యులు వుండవచ్చు. కానీ వారి పరిణతి చాలా గొప్పది.
NOTE: Courtesy cartoonist 

20, ఏప్రిల్ 2014, ఆదివారం

అన్యోన్య 'డాం'పత్యం


(మహీధర్ వల్లభనేని గారు ఇంగ్లీష్ లో షేర్ చేసిన దానికి స్వేచ్చానువాదం)
భార్యాభర్తలు ఒక మాట అనుకుని దానిమీద చిత్తశుద్దితో నిలబడితే అన్యోన్య దాంపత్యం అసాధ్యం కాదన్నది ఏకాంబరం అభిప్రాయం.
యెలా అన్నది లంబోదరం సందేహం.
ఇలా అన్నది ఏకాంబరం వివరణ.
పెళ్ళయిన కొత్తల్లోనే ఏకాంబరం ఆయన భార్య ఒక అంగీకారానికి వచ్చేసారు. బాధ్యతలు పద్దతిగా  పంచుకోవాలని. అలా పంచుకున్న వాటిలో రెండో వారి జోక్యం యెంత మాత్రం వుండరాదని.
ఎంతయినా మొగుడు ముండావాడిని  కదా పెద్ద నిర్ణయాలు తనకు వొదిలెయ్యాలని ఏకాంబరం కోరాడు. చిన్న విషాయాలు అన్నీ భార్యకు అప్పచేప్పేసాడు.
'ఏం కొనాలి ఏం తినాలి సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాలి  నెలవారీ ఇంటి ఖర్చులు ఎలావుండాలి  పనిమనిషిని పెట్టుకోవాలా అక్కరలేదా ఇలాటి చిన్నాచితకా బాధ్యతలన్నీ భార్యవి.
ఇక-
ఇరాక్ ఇరాన్ యుద్ధం వస్తే ఎవరి పక్షం వహించాలి,  ఎన్నికల తరువాత పొత్తులు అవసరం అయితే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఎవరిని కలుపుకు పోవాలి ఇలాటి కీలక అంశాల్లో ఏకాంబరం చెప్పేదే ఫైనల్. భార్య తాను ఏం చెబితే దానికి వొప్పుకుని తీరాలి'
ఇలా గీసుకున్న గీతను ఇద్దరిలో ఎవ్వరూ దాటకపోవడం వల్ల వారి దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతోందని ఏకాంబరం ఉవాచ 
ప్రలోభమనగానేమి?
"ఓటర్లని ప్రలోభపెడితే ఏడాది జైలు"
వీనుల విందైన మాట చెప్పారు సీ.యీ.సీ. సంపత్ గారు.
ప్రలోభపెట్టడం అంటే పూర్తి వివరణ పత్రికల్లో రాలేదు. అర్ధం అయినంతవరకు అది ఓటర్లని డబ్బుతో ఆకట్టుకోవాలని ప్రయత్నించడం అని బోధపడుతోంది.


అయితే,
'పేద ఆడపిల్లల్ని బడికి పంపిస్తే తల్లి ఖాతాలో నెలనెలా వెయ్యి రూపాయలు'
'ఇరవై వేలకోట్ల రూపాయల డ్వాక్రా రుణాల మాఫీ'
'ఆడపిల్లలందరికీ సెల్ ఫోన్లు'
'ఇంటింటికీ ఉచితంగా ఇరవై లీటర్ల మంచి నీళ్ళు'
'లక్ష రూపాయల వరకు రుణాల రద్దు'
'ఆడపిల్ల పుడితే ఎకరం పొలం'
'రెండు పడక గదుల ఇళ్ళు'
-ఇవన్నీ ప్రలోభాలు కాదా! పైగా వీటికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వ ఖజానా మీద పడేది.
అభ్యర్దులు సొంత డబ్బుతో జనాలను ఆకట్టుకోవడం ప్రలోభమా?
పార్టీలు ప్రజల డబ్బుతో పధకాలు ప్రకటించడం ప్రలోభమా?
విజ్ఞులకే తెలియాలి.

ఎండా వానకు పెళ్ళంట!


ఒక పక్క పెటపెట లాడించే వేసవి ఎండ. మరో పక్క అదేసమయంలో జనం తడిసి ముప్పందుం అయ్యేలా రాజకీయుల వాగ్దాన వర్షాలు.  ఇదీ స్థూలంగా  ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణ పరిస్తితి.


నామినేషన్ల పర్వం ముగియడంతో నేతలు చెలరేగిపోతున్నారు. నోటికి వచ్చిన వాగ్దానాలను జనంమీద జడివానలా కురిపిస్తున్నారు. నరం లేని నాలుకతో కల్లబొల్లి కధలు చెబుతున్నారు. అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. ఈరోజు చెప్పిన మాటలు కనీసం ఈ సాయంత్రానికి గుర్తుంటాయో లేదో ఆ పరాత్పరుడికే ఎరుక.

19, ఏప్రిల్ 2014, శనివారం

మరో బ్రేకొస్తే ఏమవుతుందో!


యాంఖర్ : ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ చర్చాకార్యక్రమం మొదలు పెట్టేముందు, ఈనాడు హాజరయిన అతిధుల్లో పలానా వారు పలానా పార్టీ అని పరిచయం చేసాము. అయితే ఇంతకుముందు బ్రేక్ ఇచ్చిన సమయంలో వారు పార్టీ మారి వేరే పార్టీలో చేరుతున్నట్టు తెలియచేసారు. ఈ మార్పు గమనించ ప్రార్ధన.

తిక్క కుదురుతుంది


"ఎండ పొడ అంటే ఏమిటో తెలియని నాయకులు ఇలా ఎండనపడి తిరుగుతూ, దోవలో బట్టలు ఇస్త్రీ చేస్తూ, మిర్చి బజ్జీలు వేయిస్తూ, కొబ్బరి బోండాలు కొడుతూ, గడ్డాలు చేస్తూ చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ మీడియాలో దర్శనం ఇస్తుంటే ఏమనిపిస్తుంది?"
"నిజంగా నిజం చెప్పమంటారా! ఈ ఎలక్షన్లు ఇలా మరో ఆరునెలలు పెడుతూ పోతే బాగుంటుందని"

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

పరమాచార్య పావనగాధలు

కుర్రవానిలో గురుదర్శనం
(ఆదిశంకరాచార్యుల తరువాత అంతటి భగవదంశ కలిగిన మహానుభావుడు కంచి కామకోటి పీఠానికి 68 వ ఆచార్యుడయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి. 'నడిచే దేవుడి'గా ప్రసిద్దులయిన వారి గురించి మా అన్నయ్య, కీర్తిశేషులు  భండారు పర్వతాలరావు గారు 'పరమాచార్య పావనగాధలు' పేరుతొ ఒక చిరు పొత్తం రచించారు. ఆ పుస్తకం ఆధారంగా అందిస్తున్న పావన గాదాశతి ఇది)


"స్వామినాధన్ తమిళనాడులో దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విలుప్పురం గ్రామంలో 1894 మే 20న జన్మించారు. తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి. తల్లి మహాలక్ష్మి.  స్వామినాధన్ చిన్నతనంలో వారింటికి శాస్త్రి గారి స్నేహితుడు వచ్చారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా ప్రవృత్తిరీత్యా జ్యోతిష్యుడు. పిల్లవాడి  జాతకాన్ని పరిశీలిస్తూ ఆయన,  తల్లిని ఓ చెంబుతో నీళ్ళు తెమ్మని అడిగారు. తెచ్చిన నీళ్ళతో ఆయన,  స్వామినాధన్  కాళ్ళు కడిగి సాష్టాంగ నమస్కారం చేయడం చూసి తలిదండ్రులు నిర్ఘాంతపోయారు. శాస్త్రి గారు ఆశ్చర్యం నుంచి తేరుకుని 'అదేం పని! పెద్దవాడివి నువ్వు. పిల్లవాడిముందు సాగిలపడడం ఏమిటి?' అని మందలిస్తున్నట్టు అన్నారు. అప్పుడా న్యాయవాది నవ్వుతూ, 'నేనెంత! ఈ ప్రపంచం అంతా ఈ చిన్నవాడి పాదాలకు ప్రణమిల్లే రోజు రాబోతోంది. కానీ అప్పటికి నేనుంటానో, వుండనో తెలియదు కదా! అందుకని ఈ రోజే ఆ పనిచేసి తరించా' అన్నాడు.

ఆయన జోస్యమే నిజమయింది.