8, ఏప్రిల్ 2014, మంగళవారం

అమెరికన్ కాకమ్మ కధ


కాకమ్మ కధలు చెప్పేవాళ్ళు అమెరికాలో కూడా వుంటారు. అలాటి ఒక కధే ఇది.
కధ కాబట్టి, అందులోను అమెరికా కధ కాబట్టి  వూరికూరికే డౌట్లు అడక్కూడదు.
అనగనగా ఓ చదువుకోని నిరుద్యోగి మైక్రోసాఫ్టు ఆఫీసులో బంట్రోతు పనికోసం వెళ్ళి అక్కడి హెచ్ ఆర్ మేనేజర్ని కలిసాడు. (మైక్రోసాఫ్టు లాంటి సంస్థలో  బంట్రోతు ఉద్యోగం ఏమిటి అనే చొప్పదంటు ప్రశ్నలు మధ్యలో అడగరాదన్నది ఈ కాకమ్మ కధ చెప్పేవాడి కండిషన్.)
హెచ్ ఆర్ మేనేజర్ మనవాడి ఈ మెయిల్ అడిగాడు. 'పూటకు ఠికానా లేదు నాకో  కంప్యూటర్ పైగా ఓ ఈ మెయిల్ ఐడీ కూడానా' అని మనవాడు జవాబు చెప్పాడు. మేనేజర్ ఆశ్చర్యపోయాడు. 'నీకు  ఈమెయిల్ ఐడీ  కూడా లేదా. అదికూడా లేకుండా అమెరికాలో యెలా బతుకుతున్నావు?' అని ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంటే మనవాడు మొహం తిప్పుకుని బయట పడ్డాడు.
బయట పడ్డాడే కాని జీవితం పెట్టిన పరీక్ష నుంచి యెలా బయటపడాలో తెలియలేదు. అల్లా నడుచుకుంటూ వెడుతుంటే ఆదివారం సంత (?) కనబడింది. జేబులో పది డాలర్లు వున్నాయి. అవ్వే ఈనెలకు, కాదు  కాదు మొత్తం ఈ ఏడాదికీ మిగిలిన ఆఖరు మొత్తం. వెళ్ళి ధైర్యం చేసి పది డాలర్లు పెట్టి పది కిలోల టమాటాలు కొన్నాడు. ఓ సంచీలో వేసుకుని ఇల్లిల్లు తిరిగి అమ్మాడు. సాయంత్రం చూసుకుంటే ఇరవై డాలర్లు లాభం. ఓహో డబ్బు సంపాదించడం అంటే ఇదా అనుకున్నాడు. మళ్ళీ ఆ డబ్బులన్నీ పెట్టి టమాటాలు కొని మళ్ళీ వాటిని ఇంటింటికీ తిరిగి అమ్మాడు. పొద్దున  జేబులో వున్న పది డాలర్లు రాత్రికి ఇంటికి చేరేసరికి పిల్లలు పెట్టి  అరవై అయ్యాయి. తిరుగుడు, శారీరక శ్రమ తప్ప వేరే పెట్టుబడి లేదు. అతడికి తత్వం బోధపడింది. ఇక వెనుతిరిగి చూడలేదు.
నెల తిరిగేసరికల్లా బండి కొన్నాడు. మరోనెలకల్లా ట్రక్కు కొన్నాడు. మూడు నెలల్లో టోకు దుకాణం తెరిచాడు. ఐదేళ్ళల్లో ఏకంగా దేశంలో ఒక పెద్ద చైన్ సంస్థగా ఎదిగాడు. లక్షలకొద్దీ ఆదాయం, వేలకొద్దీ సిబ్బంది.
కుటుంబం కోసం ఏదయినా చేయాలనిపించి  ఒక ఇన్స్యూరెన్స్ సంస్థని సంప్రదించాడు. అతడు అడిగిందే భాగ్యం అనుకుని ఆ కంపెనీ తమ  మార్కెటింగ్ చీఫ్ నే అతడి ఇంటికి పంపింది.  అతగాడు వివరాలు తీసుకుంటూ యధాలాపంగా మనవాడి  ఈ మెయిల్ అడిగాడు. అలాటిదేదీ లేదన్నాడు. ఇన్స్యూరెన్స్ వాడు బిత్తరపోయాడు. ఇన్ని బిలియమ్ల టర్నోవర్ వున్న ఇంత భారీ సంస్థకు అధిపతి అయివుండి ఈ మెయిల్ కూడా లేకుండా ఇన్నిన్ని  వ్యాపారాలు యెలా చేయగలుగుతున్నారని అడుగుతూ అది కూడా వుంటే మీరు మరిన్ని కోట్లకు పడగలేట్టేవాల్లేమో అని నసిగాడు.
మనవాడు నవ్వాడు. అవతల మార్కెటింగు చీఫ్ గుండె పగిలేలా బిగ్గరగా నవ్వాడు.
నవ్వి అన్నాడు.
'అవును ఈ మెయిల్ అవీ వుండి వుంటే నేను ఈ పాటికి మైక్రోసాఫ్టు సంస్థలో ఆఫీసు బాయ్ గా వుండి  వుండేవాడిని'         
ఇలాటి కాకమ్మ కధలు బొచ్చెడు తెలుసంటారా? నాకు ఈ కధ చెప్పిన వాడితో నేనూ అదే అన్నాను.
(ఇంగ్లీష్ లో ఈ కధను పీవీవీజీ స్వామి గారు  నాకు మెయిల్ చేశారు. నేను దాన్ని ఇష్టం వచ్చినట్టు తెలుగులో చెక్కేసాను. షరా మామూలుగా స్వామిగారికి కృతజ్ఞతలు)

శ్రీరాముడితో పోల్చి వోటు వేయాలంటే 'NOTA'నే గతి!


" ఓటేసే ముందు ప్రతి అభ్యర్ధికీ రాముడి లక్షణాల లిట్మస్ పరీక్ష పెట్టాలి. శ్రీరాముడితో పోలిస్తే ఎవరికెన్ని మార్కులొస్తాయో లెక్కగట్టి పక్కాగా అంచనా వేసుకోవాలి" - వోటర్లకు ఈ నాటి 'ఈనాడు' సలహా!

" అలా పోల్చి వోటు వేయాలంటే వోటర్లకు ఒక్క అభ్యర్ధీ కలికానికి కూడా దొరకడు. ఇక అప్పుడు 'NOTA' నే శరణ్యం!    

7, ఏప్రిల్ 2014, సోమవారం

రెండు లీటర్లు చాలు


ఏకాంబరం కారు డ్రైవ్ చేసుకుంటూ ఢిల్లీ రోడ్ల మీద తిరుగుతూ పార్లమెంటు భవనం వైపు వెళ్లాడు. అక్కడ అంతా గందరగోళంగా వుంది.
విండో కిందికి దించి అడిగాడు ఏం జరుగుతోందని.
'టెర్రరిష్టులు భవనంలో జొరబడి సభ్యులనందరినీ బంధించారు. విడిచిపెట్టడానికి వెయ్యి కోట్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే వారినందరినీ పెట్రోలు పోసి తగలబెడతామని బెదిరిస్తున్నారు. అందుకని చందాలు అడుగుతున్నాం.'
'యెంత ఇమ్మంటారేమిటి' ఏకాంబరం అడిగాడు పర్సు తీస్తూ.
'తలా రెండు లీటర్లు ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నాం'
(నెట్లో కనబడ్డ ఇంగ్లీష్ జోక్కి స్వేచ్చానువాదం)

ఉభయతారకం

పొత్తులతో కుదేలవుతున్న పార్టీలకి  ఓ చిన్న చిట్కా.
A పార్టీ B పార్టీకి పొత్తులో భాగంగా  పలానా స్థానాలు ఇవ్వడానికి అంగీకరించింది. పలానా రెండో పార్టీ పలానా మొదటి పార్టీకి పలానా పలానా స్థానాలు వొదులుకోవడానికి సిద్ధపడింది. కానీ ఆ పలానా పలానా స్థానాల్లో పాతుకుపోయిన వాళ్లకు యెలా సర్ది చెప్పేట్టు. అందుకే ఈ చిట్కా.
అలా పాతుకుపోయివున్న పాతవారికి పొత్తు కుదుర్చుకునే కొత్త పార్టీ కండవా కప్పేసి ఆ కొత్త పార్టీచేత బీ ఫారం వారిచేతిలో పెట్టించాలి. పొత్తు కుదుర్చుకున్నట్టు వుంటుంది. తమ పార్టీ వాళ్ళకే టిక్కెట్టు ఇప్పించినట్లు వుంటుంది. ఉభయతారకం. ఏమంటారు?    

సరికి సరి


"మా పార్టీ ప్రకటించిన అభ్యర్ధుల్లో మూడో వంతు మంది మీ పార్టీనుంచి వచ్చి చేరిన వాళ్ళే! తెలుసా"
"అలాగా! మా పార్టీ తరపున పోటీచేస్తున్న వాళ్ళల్లో మూడో వంతు మీ పార్టీ వాళ్ళే!"




మనవాడే అయ్యుంటాడు

అంజయ్య గారి భోలాతనం గురించి ఆ రోజుల్లో ఓ కధ చెప్పేవాళ్ళు. నిజంగా ఇది కధే. నిజంగా నిజం కాదు. ఆయన ఓ సారి మంత్రివర్గాన్ని భారిగా విస్తరించారు. జంబో క్యాబినెట్ అనేవాళ్ళు. ఇప్పుడంటే అవి మామూలయిపోయాయి. ఒకరోజు కొత్తమంత్రి ఒకరు ముఖ్యమంత్రి అంజయ్య గారిని కలవడానికి వచ్చారు. ఆయన్ని చూడగానే అంజయ్య గారు నొచ్చుకుంటూ - ఈ సారి నిన్ను తీసుకోవడం కుదరలేదు. మళ్ళీ ఎప్పుడయినా మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు నిన్ను తప్పకుండా చేర్చుకునే పూచీ నాది'అన్నారు. మంత్రివర్గంలో ఎవరెవరు వున్నారో ఆయనకే తెలియదని ఆ రోజుల్లో హాస్యోక్తిగా అనుకునేవారు. ఇప్పుడు మళ్ళీ అలాగే వుంది. ఎన్నికలముందు ఎవరు ఏ పార్టీలోకి వెడుతున్నారో తెలవదు. వెళ్ళిన వాళ్లు అక్కడ ఎన్నాళ్ళు వుంటారో తెలవదు. ఏ పార్టీనుంచి ఏ గుర్తుమీద పోటీ చేస్తున్నారో తెలవదు. ప్రచారానికి పోయినప్పుడు పాత పార్టీని తిట్టాలో తెలియదు. కొత్త పార్టీని పొగడాలో తెలియదు. ఫలితాలు వెల్లడయిన తరువాత కూడా గెలిచినవాడు మనవాడేనా కాదో తెలియదు. ఇన్ని అయోమయాల మధ్య జరుగుతున్న ఎన్నికల్ని మనం చూడబోతున్నాం.

ఈ ప్రశ్నకు బదులిది


వోటేసి రావడానికి వాళ్ల వూరు వెళ్ళిన పనిమనిషి కుటుంబం తిరిగొచ్చింది.
'కొత్త రాజధాని ఎక్కడ అనుకుంటున్నారు' యాదాలాపంగానే అడిగాను.
'బిల్దింగులూ, రోడ్లు, మెట్రో రైళ్ళూ అన్నీ కలిగినోళ్ళకి. మాకిట్లా నాలుగువేళ్ళు నోట్లోకి పోతే చాలు'

'?'