18, నవంబర్ 2013, సోమవారం

చెవిటిమేళం


ఏకాంబరానికి అనుమానం వచ్చిందే తడవుగా డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.
‘మా ఆవిడకు చెవుడు వచ్చిందని నా అనుమానం’ చెప్పాడు డాక్టర్ తో.
‘వోస్ ఇంతేనా! మా పని చెవుడు నయం చేయడమే’ అన్నాడు డాక్టర్.
‘మా ఆవిడ చెవుడు యెంత  ముదిరిందో తెలుసుకునే వీలుందా!’
‘అదేమంత పని. దీనికి చిన్న టెస్ట్ వుంది. మీరే చేసుకుని  మీకు మీరే నిర్ధారణ చేసుకోవచ్చు’
డాక్టర్ చెప్పిన చిట్కా విని ఇంటికి వెళ్లాడు ఏకాంబరం. భార్య వంట గదిలో వుంది.
డాక్టర్ చెప్పినట్టు,  కాస్త ఆమెకు దూరంగా నిలబడి,  ‘ఇవ్వాళ ఏం కూర చేస్తున్నావు’ అని అడిగాడు.
ఏదో గొణుగుతున్నట్టు పెదాలు కదిలాయి కాని ఆమె దగ్గరనుంచి సమాధానం లేదు.
ఏకాంబరం ఆమెకు మరింత దగ్గరగా జరిగి ‘ఏం కూర’ అంటూ మళ్ళీ అదే ప్రశ్న వేసాడు. అప్పుడూ ఆమెనుంచి స్పందన లేదు. ఇంకాస్త దగ్గరకు వెళ్ళి డాక్టర్ చెప్పినట్టే మళ్ళీ అదే అడిగాడు.
ఈసారి ఏకాంబరం భార్య నుంచి ఠకీమని  జవాబు వచ్చింది.
‘ఏం కూర ఏం కూర అని మూడు సార్లు అడిగారు. వంకాయ కూర అని మూడుసార్లూ  నెత్తీ నోరూ కొట్టుకుంటూ చెప్పాను. మీకేదో చెవుడు వచ్చినట్టుంది. ముందు పోయి ఏ డాక్టర్ కన్నా చూపించుకోండి’



(నెట్లో ‘జోక్కి ‘ స్వేఛ్చానువాదం)

(Courtesy image owner - 18-11-2013)

నడకే మంత్రము



విజయసాధనకు వేసే ప్రతి అడుగు విశ్వాసంతో తొణికిసలాడాలి. గందరగోళంతో కూడిన వురుకులు పరుగులకంటే నమ్మకం నిండిన నడకే ముందుగా గమ్యానికి చేరుస్తుంది. 


(Courtesy image owner)
    

సరైన తరుణం


ఇరవై ఏళ్ళ క్రితం మనం ఒక మొక్కను నాటివుంటే అది ఇప్పటికల్లా ఫలితాలను ఇస్తూ వుండేది. అయితే  అప్పుడు నాటలేదని చింతిస్తూ కూర్చోనక్కరలేదు. ఇప్పుడు కూడా ఆ పనిచేయవచ్చు. మొక్కలు నాటడానికి తరుణం మించిపోవడం అంటూ వుండదు. ఈరోజు ఒక మొక్కను నాటుతున్నాము అంటే  భవిష్యత్ తరానికి ‘పచ్చని’ ఆస్తులు పంచుతున్నట్టే లెక్క. పైగా ఈ ఆస్తులకు పన్నుల బాధాలేదు, పంపకాల ప్రయాసా వుండదు. 


(Courtesy image owner)

ఎవరు గొప్ప


సజావుగా నడవడానికి రెండు పాదాలు అవసరం. ఒక కాలు ఎత్తి ముందుకు వేస్తున్నప్పుడు రెండో కాలు వెనుకే వుండిపోతుంది. దాన్ని చూసి ముందు కాలు నవ్వుకోవడం అంటే నగుబాటు కావడమే. ఎందుకంటే రెండో కాలు ఎత్తి అడుగు ముందుకు వేసినప్పుడు మొదటి అడుగు వేసిన పాదం వెనుకే వుండిపోతుంది. కాబట్టి నేనే ముందు, నాదే ముందడుగు అని భేషజాలకు పోవడం శుద్ధ దండుగ. మానవ జీవన యానంలో అందరూ కాస్తా ముందూ వెనుకా. ఆ మాత్రానికే మిడిసిపాటు యెందుకు ?


(Courtesy image owner)



ఇబ్బందులు


కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు ఇక్కట్లు ఇవన్నీ దూది కూరిన బస్తాలవంటివి. దూరం నుంచి చూస్తే యెంత బరువో అనిపిస్తాయి. వాటిని యెలా ఎదుర్కోవాలో తెలిస్తే మాత్రం మొయ్యడం అంత భారం అనిపించదు.



(Courtesy image owner)

17, నవంబర్ 2013, ఆదివారం

ఎవరీ అంకుల్ టామ్ ? - 3


ఎవరీ అంకుల్ టామ్ ? అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే. 


(శ్రీ తోట భావనారాయణ)

రేటింగ్స్ లెక్కింపు విధానం
టీవీ ప్రేక్షకులందరూ ఏయే ఛానల్స్ ఏ సమయంలో ఎంతసేపు చూస్తున్నారన్నది నేరుగా తెలుసుకోవడం సాధ్యమయ్యేపని కాదు. ఎన్నికల సర్వే తరహాలో ఇక్కడ కూడా ఒక శాంపిల్ సర్వే మాత్రమే నిర్వహించడం కుదురుతుంది. ఒక శాంపిల్ సైజ్ నిర్ధారించుకుని, వాళ్లు ఎంతసేపు ఏ ఛానల్ చూస్తున్నారో లెక్కించి, ఆ ఫలితాలను మొత్తం ప్రేక్షకులకు వర్తింపచేయటమే రేటింగ్స్ పని. శాంపిల్ గా ఎంచుకున్న ప్రేక్షకుల ఇళ్లలో టీవీ మీద మీటర్లు పెట్టి, అన్ని మీటర్లలోని సమాచారాన్ని ఆయా ఛానల్స్ ప్రసారం చేస్తున్న కార్యక్రమాల డేటాకు జత చేసి ఏ కార్యక్రమాన్ని ఎవరు ఎంతసేపు చూశారో విశ్లేషిస్తారు. Nielsen సంస్థ  అమెరికాలో 5 వేల ఇళ్లను శాంపిల్ గా తీసుకుంది. నిజానికి అమెరికాలో పదికోట్ల టీవీలు ఉన్నప్పటికీ 5 వేల శాంపిల్స్ మాత్రమే తీసుకోవటం చాలా తక్కువగానే కనిపిస్తుంది. అయితే  ఆ ఐదువేల ఇళ్లు మొత్తం జనాభాకు ప్రాతినిధ్యం వహించేందుకు వీలుగా ఉన్నాయని నీల్సన్ సంస్థ  తమ ఎంపికను సమర్ధించుకుంటోంది.

ఈ మీటర్ వలన ఏ ఛానల్ ఎంత సేపు చూశారన్నదే తెలుస్తుంది. ఎవరు చూశారో తెలియదు. ఏ వయోవర్గానికి చెందిన వారు చూశారో, వారు పురుషులో, స్త్రీలో తెలియదు. అందుకే ఈ సమాచారం కోసం మరో ఏర్పాటు అనివార్యమయింది. ఈ ఇళ్లలో టీవీల దగ్గర మరో చిన్న బాక్స్ అమర్చాల్సి వచ్చింది ఎవరు చూడటం మొదలెట్టినా ఆన్ బటన్ నొక్కాలి. కుటుంబ సభ్యులందరికీ వేరు వేరుగా ఆన్, ఆఫ్  బటన్స్ ఉంటాయి. అందువలన ఎవరు టీవీ చూడబోతుంటే వాళ్లు వెళ్లి టీవీ ఆన్ చేసి కూర్చుంటారు. చూడటం ఆపేసి వెళ్లాలనుకున్నప్పుడు ఆఫ్ చేసి వెళ్తారు. ఆ విధంగా ఆ కుటుంబంలోని ఫలానా సభ్యుడు ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు టీవీ చూసినట్లు నమోదవుతుంది. దీని ఆధారంగా వివిధ వయోవర్గాల వారు టీవీ చూసిన సమయాన్ని లెక్కగడతారు.
ఇదంతా ఒక వంతయితే ఫోన్ సాయంతో సమాచారం సేకరించడం మరో వంతు. Nielsen సంస్థ వేలాది మంది ఇళ్లకు ఫోన్ చేసి ఆ సమయంలో వాళ్లు టీవీ చూస్తున్నారా, చూస్తుంటే ఏ కార్యక్రమం చూస్తున్నారు అనే సమాచారం సేకరిస్తుంది. ఈ సమాచారాన్ని తమ మీటర్ల సమాచారంతో సరిపోల్చుకోవటం కూడా గమనించవచ్చు. ఈ సమాచారాన్ని విశ్లేషించి ప్రతి ఛానల్ లో ప్రతి కార్యక్రమాన్ని ఎవరెవరు ఎంత సేపు చూశారో ఒక నివేదిక తయారుచేస్తారు.  ఇందులో మొదటి దశలో ప్రాథమిక సర్వే జరుగుతుంది. ఇది కొంత భారీ స్థాయిలోనే జరుగుతుంది. దీని వలన రేటింగ్స్ కు సరిపడే ప్రతినిధులు ఎవరనే విషయం తేలుతుంది. ఆ తరువాత, ప్రాతినిధ్యపు టీవీ యజమానుల ఇళ్లకు వెళ్లి, వాళ్లకు నచ్చజెప్పి, సర్వేకు సహకరించాల్సిందిగా  కోరతారు. వాళ్ల ఇంట్లో మీటర్, దానికి అనుసంధానంగా ఒక టెలిఫోన్ సెట్ పెట్టుకునేందుకు కూడా అనుమతి తీసుకుంటారు. అలా ఏర్పాటు చేసిన మీటర్, టెలిఫోన్ సాయంతో కేంద్ర కార్యాలయానికి ఏరోజుకారోజు పూర్తిస్థాయిలో డేటా అందుతుంది. అదే సమయంలో టీవీ కేంద్రాల వారి కార్యక్రమాల వివరాలు కూడా కేంద్ర కార్యాలయం అందుకుంటుంది. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఏ కార్యక్రమాన్ని ఎవరెవరు ఎంత సేపు చూశారో లెక్కించి, దాన్ని మొత్తం ప్రేక్షకులకు వర్తింపచేసి సమగ్ర సమాచారాన్ని టీవీ సంస్థల కంప్యూటర్లకు అందజేయటం ఆఖరి దశ.

దీని ఆధారంగా మొత్తం ప్రేక్షకులలో ఎంత శాతం మంది ఏ ఛానల్ చూస్తున్నారో కూడా లెక్కగట్టే వీలుంది. ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉన్నట్టు తేలిన కార్యక్రమాలకు ఎక్కువ ప్రకటనలు వస్తాయి. ఎక్కువ ప్రకటనలు వచ్చే కార్యక్రమాన్ని మరింత నాణ్యంగా రూపొందించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుంది. రేటింగ్స్ ఆధారంగానే ఛానల్ యజమానులు ఆయా కార్యక్రమాల్లో ఇచ్చే ప్రకటనలకు రేట్లు నిర్ణయించి వసూలు చేస్తారు. (ఇంకావుంది)

16, నవంబర్ 2013, శనివారం

ఎవరీ అంకుల్ టామ్ ? - 2


(ఎవరీ అంకుల్ టామ్ ? అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే. అంటే కింద ఫోటోలో కనిపిస్తున్న తోట భావనారాయణ గారివే)

  

ఎ.సి నీల్సన్ కంపెనీ ( AC Nielsen Company ) : రేటింగ్స్ మాట వినగానే గుర్తుకొచ్చేది ఎ.సి.నీల్సన్ కంపెనీ. ఈ సంస్థ నీల్సన్ మీడియా రీసెర్చ్ పేరుతో మార్కెట్ విశ్లేషణ మీద దృష్టి సారించింది. 1923లో ప్రారంభమైనప్పటికీ,  1930 తర్వాతే ప్రేక్షకుల మీద అధ్యయనం మొదలెట్టింది. అప్పట్లో రేడియో శ్రోతలతో దీన్ని
మొదలుపెట్టింది. ఏ ఫ్రీక్వెన్సీని శ్రోతలు ఎంతసేపు వింటున్నారో సర్వే చేయటం ద్వారా కార్యక్రమ నిర్వాహకులకూ, ప్రకటన కర్తలకూ ఈ సమాచారాన్ని అందజేయటం దీని పని. అయితే పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు విడివిడిగా ఎవరు వింటున్నారో తెలుసుకునే సౌకర్యం మాత్రం లేదు. అప్పటివరకు కొంత మంది శ్రోతలకు డైరీ ఇచ్చి, వాళ్ళచేత నమోదు చేయించే విధానం అమలులో ఉంది. శ్రోతల ఆసక్తి, నిజాయితీ, అందుబాటు అనే మూడు ప్రధాన అంశాల మీద ఆధారపడి రేటింగ్ నిర్ణయించడం కన్నా ఆటోమేటిక్ గా ఏ ఫ్రీక్వెన్సీ ఎంతసేపు ఆన్ చేసి ఉందో తెలుసుకోవడమే మెరుగైన, కచ్చితమైన విధానమనే అభిప్రాయం కలగడానికి నీల్సన్ సంస్థ దోహదం చేసింది.
కొద్దిపాటి పరిశోధన, మార్పుల అనంతరం Nielsen Audi meter సిద్ధమైంది. అమెరికా తూర్పు ప్రాంతంలోని 800 ఇళ్లను శాంపిల్ గా తీసుకుని సర్వే చేపట్టారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రేడియోల వినియోగంతో పాటు శాంపిల్ సైజ్ కూడా గణనీయంగా పెరిగింది.  1949  నాటికి 97 శాతం అమెరికన్ రేడియో శ్రోతలకు ప్రాతినిధ్యం వహించే సరైన శాంపిల్ సైజ్ తయారయింది. అదే సమయంలో మరో పోటీ సంస్థ రేడియో రేటింగ్స్ రంగం నుంచి తప్పుకుంది. దీంతో Nielsen సంస్థకు డిమాండ్ మరింత పెరిగ చందాదారులు ఎక్కువయ్యారు. చందాదారులు  చెల్లించే డిపాజిట్లు ప్రధాన ఆదాయ వనరు కావడంతో కొత్త డిపాజిట్ల ఫలితంగా Nielsen శాంపిల్ సైజ్ ఇంకా పెంచుకోగలిగింది. మరోవైపు టెలివిజన్ రంగం విస్తరించడం ఎక్కువైంది. రేడియోను పక్కనపెట్టి టీవీ మీద దృష్టి సారించిన నీల్సన్ సంస్థ  1964 నాటికి రేడియోను పూర్తిగా వదులుకుంది.
ఆన్ చేయడం, ఆఫ్ చేయడం మొదలుకుని టీవీ ఛానల్స్ మారుస్తూ ఉన్నప్పుడు సైతం సమగ్రంగా సమాచారం నమోదు చేయగలిగే పరికరాన్ని రూపొందించడంతో సంస్థ విజయం సాధించింది. ఈ సమాచారన్ని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి పంపేందుకు ప్రత్యేకమయిన టెలిఫోన్ లైన్లు కూడా లీజుకు తీసుకోవడం మరో ప్రత్యేకత. నీల్సన్ బ్లాక్ బాక్స్  ( Nielsen Black Box ) పేరుతో ప్రసిద్ధమైన ఈ మీటర్లు టెలివిజన్ రేటింగ్ లెక్కగట్టడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చాయి. అయితే ఏ టీవీ కార్యక్రమాలు ఎంతసేపు చూస్తున్నారన్న విషయాలు మాత్రమే ఇందులో నమోదయ్యే అవకాశం ఉండగా ఏయే వర్గం వారు ఆ కార్యక్రమాలు చూస్తున్నారు? వారిలో స్త్రీలెంత మంది? పురుషులెంత మంది? అనే విషయాలు మాత్రం స్పష్టంగా తెలిసే అవకాశం లేకపోవటం ఒక లోటుగా కనిపించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డైరీలు వాడటం మొదలెట్టారు.
కొంత మంది ప్రేక్షకుల ఇళ్లలో ఈ డైరీలు ఉంచి అందులో వివరాలు నమోదు చేయాలని కోరేవారు. టీవీ ఆన్ చేసిన ప్రతిసారీ ఏ ఛానల్ ఎంతసేపు ఎవరెవరు చూసారో అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది యంత్రసాయంతో జరిగేది కాదు గనుక శాంపిల్ సైజు చాలా తక్కువగా ఉంటుంది. పైగా అందరూ శ్రద్ధగా నమోదు చేయకపోతే ప్రయోజనం ఉండదు.

సామాన్య ప్రేక్షకులకు వీరు ప్రతినిధులు కాకపోవచ్చుననేది మరో వాదన. ఈ విధానం లోపభూయిష్టమైనదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు కారణం నీల్సన్ సంస్థ వారి పీపుల్స్ మీటర్స్ ఇచ్చిన డేటాకు, డైరీల డేటాకు పొంతన లేకపోవటమే. సహజంగానే పరిశ్రమలో ఇదొక వివాదాస్పద అంశంగా మారింది. రేటింగ్స్ ఆధారంగానే ప్రకటనల రేట్లలో బేరసారాలు జ
రుగుతాయి కనక ఇందులో తేడాల వలన చాలా ఇబ్బందులొచ్చిపడ్డాయి. ఏమైనప్పటికీ ఈ వివాదాల మధ్యలో రేటింగ్స్ ఇచ్చేందుకు మరికొన్ని చిన్నాచితకా సంస్థలు ముందుకొచ్చినా ఈ రంగంలో ఒక్కరే ఉండటం సమంజసమని, అన్ని టీవీలూ అదే సంస్థ రేటింగ్స్ ను ప్రామాణికంగా తీసుకోవడం మంచిదనే విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఆ విధంగా నీల్సన్ వారి పీపుల్స్ మీటర్ విధానానికే అమెరికన్ ఛానల్స్ పట్టం కట్టాయి.  Nielsen Television Index ( NTI )  పేరుతో ఇస్తున్న రేటింగ్స్ అక్కడ ప్రామాణికంగా మారాయి. (ఇంకా వుంది)
(16-11-2013)