29, జులై 2013, సోమవారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)


పర్వతాలయ్యగారికి పెద్ద మీసాలు ఉండేవి. వెనుక జుట్టు ముడి వుండేది. సింహలలాటం మురుగులు ధరించేవారు. మిత భాషి. అయినా చమత్కారంగా మాట్లాడేవారు. సౌమ్యుడు, సాత్వికుడు. కానీ ఒక్కోసారి తీవ్రంగా కోపం వచ్చేది. ఏదీ మనసులో ఉంచుకునే తత్వం  కాదు. ఆయన చివర దశలో కాళ్ళు చచ్చుపడ్డాయి. దాదాపు పది పన్నెండేళ్ళు మంచం మీద కూర్చునే కరణీకం చేసారు. ఆయనకు ఎనిమిదవ ఏట పెళ్లయింది. అప్పుడు మా బామ్మ రుక్మిణమ్మ గారికి నాలుగేళ్ళు.



(కీర్తిశేషులు భండారు రుక్మిణమ్మ గారు)



ఆమె తండ్రి కాకరవాయి (కాకరాయి) వాస్తవ్యులు, కందిబండ చిదంబరం గారు. తల్లి చెల్లమ్మ గారు. చిదంబరంగారు చనిపోయేనాటికి మా బామ్మ ఒక్కతే  కూతురు. చెల్లమ్మగారికి అప్పటికి ఇంకా పదహారేళ్ళు కూడా నిండలేదు. భర్త పోయిన తరువాత  కొన్నాళ్ళకు చెల్లమ్మ గారు కాకరవాయి లోని తమ వాటా ఇల్లూ, పొలాలు అమ్మేసుకుని పదివేల రూపాయలు తెచ్చి మా నాన్నగారికి ఇచ్చిందట. బహుశా 1929, 1930  ప్రాంతాల్లో అయివుండవచ్చు.  ఆ సొమ్ముతోనే మా నాన్నగారు ప్రస్తుతం వున్న మా ఇల్లు కట్టారని అంటారు.చెల్లమ్మగారు అప్పటినుండి మా ఇంట్లోనే వుండేది. ఆమె భాగవతం నిత్య పారాయణ చేసేది. భారతం, భాస్కర రామాయణం, కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం కూడా చదువుతూ వుండేది. అయితే ఆమెకు రాయడం బొత్తిగా రాదు. చదువుకున్నవారికే వోటు హక్కు అని ఆరోజుల్లో ఒక రూలు వచ్చిందట. మా నాయనమ్మమ్మ చెల్లమ్మగారికి కాని, మా నాయనమ్మ రుక్మిణమ్మ గారికి కాని, మా అమ్మగారు వెంకట్రావమ్మ గారికి కాని చదవటం చక్కగా వచ్చు కాని రాయడం రాదు. అందుకని వాళ్ళందరికీ తమ పేర్లు (సంతకం) రాయడం వరకు నేర్పించారట.
మా చిన్నతనంలో చిట్టేల కోటయ్య పంతులు గారు తన దగ్గర చదువుకునే పిల్లల్ని ఇంటి దగ్గర కూడా చదివినట్టు వాళ్ళ పెద్దవాళ్ళచేత పలకపై రాయించుకుని రమ్మనేవారు. మేం చెల్లమ్మగారికి ‘చదివినాడు’ అనే పదం రాయడం నేర్పాము. ఆమె పలక మీద అదే రాసి ఇచ్చేది. సామాన్యంగా ఇంటికి వచ్చిన తరువాత మళ్ళీ పుస్తకం పట్టుకునే అలవాటు  లేదు. అది చూసి చెల్లమ్మగారు ‘ఇవ్వాళ  మీరు చదవలేదు’ అని రాస్తానని మమ్మల్ని బెదిరించేది. కాని అల్లా రాయడం ఆమెకు రాదని మాకు తెలుసు. చాలా మెత్తని మనిషి కనుక ‘చదివినారు’ అనే రాసిచ్చేది. ఆమె  దాదాపు  95 సంవత్సరాలు జీవించింది. చక్కిలాలను నమలగలిగే దంత పటిమ వుండేది. మనిషి బాగా వంగిపోయినా ఎప్పుడు నవిసిన దాఖలాలు లేవనే చెప్పాలి. ఆఖరి రోజున కూడా కాలకృత్యాలు తీర్చుకునేందుకు మనుమరాళ్ళు ప్రేమ,భారతి సాయంతో దొడ్లో చింతచెట్టు వరకు చేతి కర్ర పొడుచుకుంటూ  నడిచి వెళ్లి వచ్చింది. పండ్లు తోముకుంటూ పక్కకు వాలిపోయి   అనాయాసంగా మరణించింది. ఆమె మరో రెండు రోజులకు పోతుందనగా నాకు (భండారు పర్వతాలరావు) లా కాలేజీ తెరవడం వల్ల హైదరాబాదు ప్రయాణం అయ్యాను. ఆమెకు దండం పెట్టడానికి వెడితే ‘రెండు రోజులు తాళు (ఆగు)’ అంది. నేను ప్రయాణం మానేసాను. సరిగ్గా రెండో రోజునే  ఆమె మరణించింది. అంతకు ముందు రాత్రి కూడా రోజు మాదిరిగానే గజేంద్ర మోక్షం లోని పద్యాలు పొద్దు పోయిందాకా చదివి పండుకుంది. (మరో భాగం మరోసారి)

28, జులై 2013, ఆదివారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)


పోతే, ఇంగువ వారి పూర్వీకులకు ఆశ్రయం కల్పించింది కూడా మా రామయ్య గారే. ఈరోజుల్లో ఇండ్ల స్థలాలు, పొలాలు ఇప్పించడం అనేది మంత్రులు కూడా చేయలేని పని. మంత్రివర్గం మాత్రమే   చేయగలిగే ఈ పనులను ఆ రోజుల్లో గ్రామ కరణాలు సునాయాసంగా  చేయగలిగేవారు. అదీ నోటి మాటతో.
రామయ్య, లక్ష్మయ్యగార్ల హయాం లోనే వారికీ, వారి చిన తాత రామలింగయ్య (కోర్టు తీర్పులో  లింగయ్య అనే వుంది ) కుమారుడు చిన కామయ్య గారికీ దావా నడిచింది. బెజవాడ డిస్ట్రిక్ట్ మునసబు కోర్టులో నడిచిన ఈ దావాలో వాది  చిన కామయ్య కాగా ప్రతివాదులు రామయ్య, లక్ష్మయ్యలు.  దావా పర్యవసానం ఎలా వున్నా, దానికి సంబంధించిన కోర్టు తీర్పులో మాత్రం  భండారు వంశం వారి పూర్వీకుల పేర్లు వివరంగా పేర్కొనడం జరిగింది.

రామయ్య గారి భార్య శేషమ్మ గారు. ఆమె దాదాపు ఎనభై ఏళ్ళకు  పైగా బతికింది. నాకు కూడా గుర్తే. రామయ్య గారి దంపతులకు ముగ్గురు కుమారులు. పర్వతాలయ్య, లక్ష్మీ నారాయణ, వెంకట సుబ్బారావు. కుమార్తెల సంగతి స్పష్టంగా తెలియదు. కొడుకులలో పెద్దవాడయిన పర్వతాలయ్య గారిదే కరిణీకం. చాలా కాలం అన్నదమ్ములందరూ  కలిసే వున్నారు. అప్పుడు మా ఇల్లు ఉత్తర ముఖంగా వుండేది. ప్రస్తుతం సుబ్బయ్య తాతయ్య జాగాలోకి వున్న బేస్ మట్టం, మెట్లు అప్పుడు ఇంటికి సింహద్వారం వైపు ఉండేవి.  ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి ఆహుతి కావడం వల్ల,  మా నాన్నగారు రాఘవరావు గారు ఇప్పుడున్న ఇంటిని నిర్మించారు.


(దాదాపు వందేళ్ళ క్రితం తిరిగి నిర్మించిన ఇప్పటి ఇల్లు) 

ప్రమాదంలో కొంత కాలిన దూలాలను కొన్నింటిని కొత్త ఇంటి నిర్మాణంలో వాడారు. అ ఇల్లు కట్టినప్పుడు మా తాతగారు పర్వతాలయ్య గారు బతికే వున్నారు. తరువాత  అన్నదమ్ములు ముగ్గురు వేర్లు పడ్డారు. లక్ష్మీనారాయణ గారు మా ఇంటికి దగ్గరలోనే  కొండారెడ్డి జాగా కొనుక్కుని వేరే ఇల్లు కట్టుకున్నారు. సుబ్బయ్య గారు మా ఇంటి పక్కనే ఒక పూరిల్లు వేసుకుని వుంటూ వుండేవారు. ఆ రోజుల్లో ఊళ్ళోకి తాసిల్దారు  రావడం అంటే ఎంతో  గొప్ప విషయం. వూరికి వచ్చిన తాసీల్దారు వూరికే కూర్చోకుండా   పొలాల వెంట తిరుగుతూ,  అడంగల్ లో రాసిన విధంగా పంటలు వాస్తవంగా వేసేరో  లేదో ప్రత్యక్షంగా తనిఖీ చేసేవాడట. అందుకోసం ఆయన దర్జాగా మేనాలో వెడుతుంటే  కరణం, మునసబులు ఆ మేనాకు చెరో వైపు,  వెంట పరిగెత్తుతూ పంటల వైనం,  సర్వే నెంబర్లు వివరించేవారట. అప్పుడు అందరికీ గుర్రాలు ఉండేవి. ప్రయాణాలు ఎక్కువభాగం కాలినడకనా, గుర్రాలమీదా సాగేవి. ఆడవాళ్ళు  మేనాలో గాని ఎద్దు బండ్ల పైగాని ప్రయాణం చేసేవారు.(నాటి మేనా ఒకటి ఇటీవలి కాలం వరకు మా ఇంట్లో వుండేది) మోతుబరులు, కరణాలు గుడిసె బండ్లలో వెడితే, సంసారులు(రైతులు) జల్ల బండ్లలో వెళ్ళేవాళ్ళు. బండ్ల ప్రయాణంలో ముందు జీతగాళ్ళు తాళ్ళు పట్టుకుని  నడుస్తుంటే వెనుక వెట్టివాళ్ళు (ఇప్పటికి వాళ్ళు గ్రామోద్యోగులయినా వెట్టివాళ్ళనే  పేరు పోలేదు. ఒకప్పుడు వాళ్ళు వెట్టి చాకిరీ చేస్తూ బతికేవాళ్ళు. మోతాదు, వెట్టివాడు అని పిలిచేవాళ్ళు.  మా నాన్నగారి వద్ద  అలాటివాళ్ళు ముగ్గురు వుండేవాళ్ళు). ప్రయాణంలో వొడ్డేరకాలు (ఎత్తుపల్లాలు) వచ్చినప్పుడు బండి పడిపోకుండా ఛట్రం పట్టుకుని  బరువానేవాళ్ళు.  వానాకాలం ఒక్కొక్క బండికి రెండేసి జతల ఎడ్లను తాగాడిగాళ్లు కట్టేవాళ్ళు. అసలా రోజుల్లో కరణాలు తప్ప ఎవరూ  బండ్లు కట్టి ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. వ్యవసాయప్పని చెడుతుందని కొంతా, ఎడ్లు దెబ్బతింటాయని కొంతా, వారి  భయం.  (మరో భాగం మరో సారి)       

27, జులై 2013, శనివారం

రాష్ట్రాన్ని గాలికి వొదిలి గాలిలో చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్ నేతలు


రాష్ట్రాన్ని గాలికి వొదిలి గాలిలో చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్ నేతలు




Courtesy: Raju Cartoonist 

(27-07-2013)



భండారు వంశం (నిన్నటి తరువాయి)


ఆరోజుల్లో  పుట్టి ధాన్యం రూపాయకో, రెండుకో అమ్ముడయ్యేది. పంటలన్నీ వర్షాధారం. ధరలు లేవు. దానితో చాలామంది రైతులు శిస్తు కట్టలేక పొలాలు వొదిలేసి వెళ్లిపోయారట.  అప్పటి నిబంధనల ప్రకారం ఆ శిస్తు తాను  చెల్లించి ఆ పొలాలను రామయ్య గారు తీసుకున్నారట.

ఆయనకు కరిణీకం చేసినందుకు లభించే జీతం నెలకు మూడో నాలుగో రూపాయలు. (పూర్తిగా వెండి తో తయారు చేసిన వీటిని 'విచ్చు రూపాయలు' అనే వాళ్ళు). అవేం చేయాలో తెలిసేది కాదు.  వస్తువులు అన్నీ గ్రామంలోనే  లభించేవి. దాంతో జీతం రూకలను గూట్లో గిరవాటు వేసేవారట. అలా గూట్లో పడివున్న రూపాయలు,  శిస్తు కట్టలేని రైతుల పొలాలు కొనుక్కోవడానికి అక్కరకు వచ్చాయట.


(మా వూళ్ళో మా ఇల్లు - ఇటీవలి చిత్రం) 

రామయ్య గారు చాలామందికి ఆశ్రయం కల్పించారు.  ఒకసారి ఆయన వాకిట్లో అరుగు మీద కూర్చుని మొహం కడుక్కుంటూ వుంటే  వేరే వూరు రైతు ఒకరు అటుగా  వచ్చాడట. ‘ఎక్కడికి’ అని అడిగితే  ‘ఎక్కడ పని దొరికితే అక్కడికి’ అని అన్నాడట. ‘నీకెంత పొలం కావాలో తీసుకో ఇప్పిస్తా. ఇక్కడే వుండిపో ‘ అన్నాడట రామయ్య గారు. ఆ రైతు ఎవ్వరో కాదు ప్రస్తుతం వూరి మోతుబరుల్లో ఒకరయిన  శ్రీ బండి సత్యనారాయణ (బండి సత్యం)పూర్వీకుడు.


(శ్రీ బండి సత్యం బియ్యేతో నేనూ,  మా రెండో అన్నయ్య శ్రీ భండారు రామచంద్రరావు, రిటైర్డ్ సీజీఎం, ఎస్.బీ.ఐ., -ఇటీవలి చిత్రం)    


శ్రీ సత్యనారాయణ,  నేనూ (భండారు పర్వతాలరావు) మా వూరిలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్లం. నేను చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాల్లో కుదురుకుపోయాను. బండి సత్యం, బియ్యే  మాత్రం వ్యవసాయం చేసుకుంటూ ఊళ్లోనే ఉండిపోయాడు. అది వేరే కధ.
అలాగే వేమిరెడ్డి వారికి ‘మీరెంత అడవి కొట్టుకుంటే  అంత పొలం ఇస్తానని’ చెబితే వాళ్ళు అడవి నరికి పొలం చేసుకుంటూ కంభంపాడులోనే వుండిపోయారు.   ప్రస్తుతం వేమిరెడ్డి వంశం వాడయిన ఓబుల్ రెడ్డి( నరిసిరెడ్డి దత్తత కుమారుడు) చామర్తి వీరభద్ర రావు గారు, భండారు కామాక్షమ్మ గారు, భండారు రామకృష్ణయ్య గార్ల ఇండ్ల స్థలాలన్నీ రామయ్యగారివే. భండారు సీతారామయ్య గారు తన కూతురు రాజమ్మ గారిని, మా పెద్ద  మేనమామ, బెజవాడలో ప్రముఖ న్యాయవాది అయిన  కొండపల్లి శ్రీ రామచంద్రరావుగారికి  భార్య చనిపోతే,  రెండో సంబంధం ఇచ్చారు.   తరువాత కంభంపాడులోని పొలాలు, ఇళ్ళ స్థలం అమ్మేసుకున్నారు. ప్రస్తుతం మా ఇంటికి ఐ మూలగా ఓబులరెడ్డి ఇల్లున్న స్థలం రామయ్య గారిదే. ఓబులరెడ్డి పినతండ్రి కొడుకు పేరు కూడా ఓబులరెడ్డే. వేమిరెడ్డి కిష్టారెడ్డి ఏకైక కుమారుడు. మా మూడో తమ్ముడు భండారు వెంకటేశ్వర రావు (తదనంతర కాలంలో మా వూరు కరణంగా పనిచేశాడు, ఇంట్లో వెంకప్ప అని పిలిచేవారు)కు మంచి స్నేహితుడు. మాకు ఎదురిల్లు. తినడానికి, పడుకోవడానికి మినహా రోజంతా మా ఇంట్లోనే ఉండేవాడు. అసలు పేరు ఓబులరెడ్డి అయినా అందరు కోటిరెడ్డి (కోటయ్య) అనే వాళ్ళు. చదువు ఎలిమెంటరీ స్థాయి దాటకపోయినా, మంచి ఇంజినీరింగు స్కిల్స్ ఉండేవి. సొంతంగా ఇంట్లోనే రేడియోలు, టీవీలు తయారుచేసేవాడు. తాలూకా మొత్తంలో ఎక్కడా లేనప్పుడే మా వూళ్ళో కేబుల్ టీవీ నడిపేవాడు) దురదృష్టం. ఆ చిన్ననాటి స్నేహితులిద్దరూ (కోటయ్య, మా తమ్ముడు వెంకప్ప) చిన్న వయస్సులోనే కన్నుమూశారు. (మరో భాగం మరోసారి)

26, జులై 2013, శుక్రవారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)


భండారు  వీరేశం గారికి నలుగురు కొడుకులు. కూతుళ్ళ సంగతి వంశవృక్షం గాని, కోర్టు తీర్పులు కాని చెప్పడం లేదు.  కొడుకులు: రాజయ్య(రాజన్న).అప్పయ్య, రామలింగయ్య (లింగయ్య), బసవయ్య.
రాజయ్యగారికి కనకయ్య (ఈయనకు వీరేశలింగం అనే పేరు కూడా వుంది). రాజయ్య (రాజన్న) అని ఇద్దరు కొడుకులు. వారిద్దరూ అవివాహితులుగా, నిస్సంతుగా చనిపోయారని కోర్టు తీర్పులో వివరించారు. 

అప్పయ్యగారికి చాలాకాలం సంతానం లేదు. దానిపై ఆయన,  శ్రీశైలం వెళ్లి అక్కడ మల్లిఖార్జున దేవాలయ ప్రాంగణంలో వున్న సంతానవృక్షానికి ప్రదక్షిణాలు చేసి వచ్చారట. తరువాత ఆయనకు ఒక కుమారుడు కలిగాడు.  ఆయనకు శ్రీ పర్వతం (శ్రీ శైలం) పేరిట పర్వతాలయ్య అని పేరు పెట్టుకున్నారు. ఈయనే పర్వతాలయ్య -1 (కోర్టు తీర్పులో పర్వతాలు అనే వుంది). ఈయన కంభంపాడు గ్రామ కరిణీకం చేస్తూ వచ్చారు. ఆయనకూ, గ్రామంలోని కమ్మ రైతు పెద్దలకు ఒకసారి  కచేరిసావిడిలో కొంత వాగ్వాదం జరిగిందట. అప్పుడు అంతా బొడ్లో పేష్ కప్ (ఒకరకం చిన్న చాకు) పెట్టుకుని, తలపాగాలు చుట్టుకుని వచ్చేవారట. పర్వతాలయ్య గారు  ఈక కలంతో ఏదో రాసుకుంటున్నారు.  ఏదో మాటామాటా వచ్చి ‘మా కత్తి గొప్పా, నీ కలం గొప్పా’అని  అడిగారుట. ఆయన ‘నా కలమే గొప్ప’ అనడంతో మాటకు మాట  పెరిగింది. సరసం విరసం అయింది. వాళ్ళు ఇళ్ళకు వెళ్లి, వరిగడ్డి, కుండల్లో చద్దన్నాలు బండ్లలో పెట్టించుకున్నారట.  ఆ పళాన వెళ్లి,  అర్ధరాత్రి పర్వతాలయ్య గారిని లేపి, దొడ్లో చింతచెట్టు కిందకి తీసుకుని వెళ్లి, కత్తితో  పొడిచి హత్య చేసారు. ముఖ్యంగా కుడి చేతిపైనా,  నాలికపైనా పొడిచారట.  కొనవూపిరితో వుండగా ఎవరయినా వచ్చినా  తమ  పేర్లు చెప్పకుండా ఉండడానికి అలా చేశారుట.  తరువాత బండ్లు కట్టుకుని పొరుగున వున్న నైజాంలోకి పారిపోయారుట. జరిగిన ఘోరం చూసి ఆయన భార్య (పేరు వెంకమ్మగారని గుర్తు) ఏడుస్తుంటే పర్వతాలయ్యగారు ఆ నెత్తురుతోనే,  ‘నా’ , ‘కా;  అనే అక్షరాలు రాశారుట. ‘నా’ అంటే నారాయణ అనీ, ‘కా’ అంటే కామయ్య అనీ అందరికీ అర్ధం అయింది. కాని, పోలీసులు వచ్చి అడిగితే పర్వతాలయ్యగారి భార్య ఎవరి పేరు చెప్పలేదట. (బహుశా  చెబితే వాళ్ళు పగబట్టి  పిల్లలకు హాని తలబెడతారన్న భయంతో  కావచ్చు) ‘ఎవరి పాపాన వాళ్ళే  పోతారు. నాకేం తెలియదు. చీకటి.  ఎవరూ కనబడలేదు’ అన్నదట. అప్పుడామెకు ఇద్దరు కొడుకులు.  రామయ్య, లక్ష్మయ్య.  రామయ్యకు పన్నెండేళ్ళు.  అయినా,  ‘మీ తండ్రి కరణీకం ఇస్తా చేస్తావా?’  అని తాసీల్దారు అడిగితే,  ‘చేస్తాన’ని దస్త్రం  తీసుకున్నాడట.   ఆరోజుల్లో కరిణీకం ఉద్యోగానికి  మేజరయి ఉండాలన్న నియమం  లేదన్నమాట.


(ఆరోజుల్లో గుర్రాలను వొదిలేస్తే అవి మేసినంత మేర కరణం గారి పొలాలని చెప్పుకునేవాళ్ళట. అలాటిది ఇవ్వాళ ఒక్కపూటలో పొలాలు, తోటలు తిరిగివస్తున్నారు) 


రామయ్యగారి హయాంలో కుటుంబం ఆస్తి బాగా పెరిగింది. వూళ్ళో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన పోయేసరికి మూడువందల ఎకరాల పొలం వుండేది.


తన తమ్ముడు లక్ష్మయ్యను ఆయన రాజయ్యకు దత్తు ఇచ్చారు.  లక్ష్మయ్య కొడుకు నాగభూషణం కాశీకి వెళ్లి అక్కడ గతించాడు.  అప్పుడు మళ్ళీ తన రెండవ  కొడుకు లక్ష్మీనారాయణను   ఆయన భార్య చుక్కమ్మగారికి దత్తు ఇచ్చారు. కొందరు బంధువులు  నాగభూషణం  మృతి విషయమై అనుమానాలు వ్యక్తం చేశారట. అవన్నీ తరువాత సమసిపోయాయి. (మరో భాగం మరో సారి)

భండారు వంశం

(నిన్నటి తరువాయి)

కానీ వీటిని బట్టి వూరి చరిత్ర తెలుసుకునే వీలు తక్కువ. అయితే చాలా ఏళ్ళుగా వున్న  గ్రామం అని చెప్పవచ్చు.  ‘స్తంభము ప్రోలు’ అన్నది కంభం పాడు  అన్న పేరుకు మూలం కావచ్చు. లేదా ‘స్థంభం పహాడ్’ కాలక్రమంలో కంభంపాడు కావచ్చు. కానీ ఈ గ్రామానికి సమీపంలో స్థంభం కానీ, పహాడ్ కానీ లేవు. ఇక్కడ లోగడ ఏదయినా ‘జయస్థంభం’ లాంటిది వుంటే, స్థంభం ప్రోలు లేక కంభంపాడు అనే పేరు వచ్చి ఉండవచ్చు.  ఆ రోజుల్లో ఇలాటి జయ స్తంభాలను చాలాచోట్ల నెలకొల్పి వుంటారు. కనుక కంభంపాడు అన్న పేరుతొ చాలా గ్రామాలు కనిపిస్తాయి. మధిర దగ్గర ఒకటి, తిరువూరు దగ్గర ఒకటి, అమరావతి దగ్గర వైకుంఠ పురం దగ్గర మరోటి వున్నాయి. గ్రామ చరిత్రను తెలుసుకోవాలంటే బందరు వెళ్లి జిల్లా కలెక్టర్ ఆఫీసులో పురాతన పత్రాలను శోధించాల్సి వుంటుంది.


(కంభంపాడులో మా ఇల్లు - పెరడు వైపునుంచి)


కంభంపాడుకు  భండారు వారు రావడం గురించి వంశ వృక్షంలో కాని, కోర్టు తీర్పులో కాని, వివరాలు అంటే తేదీలు వగయిరా  పేర్కొనలేదు. వాడేల రామరాజు గారని ఒకరుండేవారు. ఆయన భార్య బుచ్చమ్మ. వారికి మగపిల్లలు లేరు. ఒక్కతే  కుమార్తె. ఆమెను కంచెల గ్రామంలో భండారు వీరేశలింగం గారికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరేశలింగంగారు కంభంపాడుకు వచ్చి స్థిర పడ్డారు. (ఒకరకంగా ఇల్లరికం అన్నమాట) లక్ష్మీనారాయణగారు రాయించిన వంశ  వృక్షం ఆయనను వీరేశలింగంగా  పేర్కొంటోంది. సుబ్బారావుగారు రాయించిన దానిలో వీరేశం అనే వుంది. (కోర్టు తీర్పులో కూడా ఇంటి పేరు ‘బండారు’ అనే వుంది  కాని ‘భండారు’ అని లేదు. అయితే ఇది రాయసకాని పొరబాటు అని అనుకోవచ్చు. ఇంచుమించు అదే కాలంలో భండారు లక్ష్మయ్య కులకర్ణి గారు రాసిన ఒక అర్జీలో  ఇంటి పేరును స్పష్టంగా  ‘భండారు’ అనే రాసారు.) కనుక భండారు వీరేశం లేక భండారు వీరేశలింగం అనే ఆయన కంభంపాడులో భండారు వారికి మూలపురుషుడు అనడంలో సందేహం లేదు. కంచెల గ్రామంలో కాని, వేములపల్లిలో గాని ఎవరయినా వంశ వృక్షాలు రాయించి దాచి  వుంటే వీరేశం గారి పూర్వీకుల గురించి తెలుసుకునే వీలువుంటుంది. అయితే వేములపల్లిలోని వంశ వృక్షాలను  గురించి కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  అగ్రహారం పంపకాలలో కోర్టు కెక్కి అక్కడివారు తమ తమ సానుకూలాన్ని బట్టి వంశ వృక్షాలు రూపొందించి ఉంటారని కొందరి వూహ. వేములపల్లి భండారు వారు లింగాలను ధరించారు. అయితే కంచెల, పల్లగిరి భండారు వారు, వారివలె  లింగధారులు  కారు. ఆరువేల నియోగులు. స్మార్తులు. యజుస్మాఖాధ్యాయులు. ఆపస్తంభ సూత్రులూను. (మరో భాగం మరోసారి)
(26-07-2013)

25, జులై 2013, గురువారం

1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు? ఐతరేయ బ్రాహ్మణమా?


ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినప్పుడు – నా పుట్టిన తేదీ ప్రకారం అప్పటికి నా వయస్సు కొంచెం అటూ ఇటుగా పదకొండేళ్లు. అప్పటి విశేషాలు  గుర్తుండే వీలు లేదు కాబట్టి నాటి పరిస్తితులను సింహావలోకనం చేయడానికి వీలుగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ఆరు మాసాలముందు ఆంధ్ర పత్రిక దినపత్రిక ఏప్రిల్ నాలుగో తేదీన మొదటి పుటలో ప్రధాన శీర్షికతో ప్రచురించిన వార్తను యధాతధంగా అక్షరం పొల్లు పోకుండా కింద ఇవ్వడం జరిగింది. రాష్ట్ర విభజన గురించి ఆందోళనలు, చర్చోపచర్చలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ఆ నాటి స్తితిగతులను ఓమారు స్పురణకు తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో మరో రకం ఆలోచనకు తావివ్వరాదని నా అభ్యర్ధన.
సంపుటం - 43  సంచిక - 4  బుధవారం   4-4-1956   6 పేజీలు  1 అణా
‘ఆంధ్ర ప్రదేశ్’ అనే పేరుకు తెలంగాణా నాయకుల సమ్మతి   
కోస్తా జిల్లాలకోసం గుంటూరు లో హైకోర్టు బెంచి నెలకొల్పే నిర్ణయం
అక్టోబర్ లోగా విలీనం మినహా కార్యాలయాల తరలింపు అసాధ్యం అని డాక్టర్ బూర్గుల ప్రకటన
(ఆంధ్ర పత్రిక ప్రతినిధి)
కర్నూలు, ఏప్రిల్ 3
‘ఆంధ్ర ప్రదేశ్’ అని నూతన రాష్ట్రానికి పేరు పెట్టడానికే చివరికి ఆంధ్ర – తెలంగాణా నాయకులు తీర్మానించారు.
ఆంధ్ర ప్రాంత న్యాయవాదుల ప్రాబల్యానికి హైదరాబాద్ న్యాయవాదులు భయపడుతున్న కారణం వల్ల- రాయలసీమపై న్యాయ విచారణాధికారాన్ని హైదరాబాదు కోర్టుకు ఒప్పగించి, కోస్తా జిల్లాలకోసం గుంటూరులో హై కోర్టు బెంచి నెలకొల్పాలని కూడా ఉభయ ప్రాంతాల నాయకులు నిర్ణయించారు.
ఆంధ్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో –ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాద్ రెవిన్యూ మంత్రి శ్రీ కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, హైదరాబాద్ వ్యవసాయ మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జె.వి. నరసింగరావు, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, పూర్వ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం, విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పాల్గొన్నారు.
నూతన రాష్ట్ర నామకరణం విషయమై కొంత దీర్ఘ చర్చ జరిగింది.
హైదరాబాద్ నాయకుల్లో శ్రీ రంగారెడ్డి, శ్రీ చెన్నారెడ్డి, శ్రీ నరసింగరావు – ‘తెలుగు ప్రదేశ్’ అని కానీ, ‘తెలంగాణా’ అని కానీ కొత్త రాష్ట్రానికి పేరు వుంచాలని దీర్ఘవాదం చేశారు.
ఆంధ్ర లో దోషం లేదు
తదితరులు, హైదరాబాద్ ముఖ్యమంత్రి తో సహా – ఆంధ్ర అనే పదంలో దోషం ఏమీ లేదని వాదించారు.
‘ఆ పేరు ఉపనిషత్తుల కాలం నుంచి వ్యవహారంలో వుంది. ఆ పేరు ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. ఆంధ్ర పితామహ, శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషానిలయం – ఈ మొదలయిన ప్రఖ్యాత వ్యవహార నామములు బట్టి చూచినట్టయితే – ఆంధ్ర ప్రజలకు, తెలంగాణా ప్రజలకు భేదం కనబడదు. అందరినీ ఆంధ్ర అనే పదం తోనే వ్యవహరించారు’
చివరికి ‘ఆంధ్ర ప్రదేశ్’ అనే నూతన రాష్ట్రానికి పేరు వుంచాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
ముస్లిం అవసరాలు
సమావేశానికి ముందు హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు ‘ఆంధ్ర పత్రిక’ ప్రతినిధితో ప్రసంగిస్తూ – ‘తెలంగాణా’ అనే పేరు రెవిన్యూ అవసరాలకోసం ముస్లిం పరిపాలకులు వ్యవహారం లోనికి తెచ్చినదన్నారు. ‘ఆంధ్ర ప్రదేశ్’ అనే పేరే అందరికీ సమ్మతం కాగలదన్నారు.
(విషయసేకరణకు తోడ్పడిన అనేకమందికి ధన్యవాదాలు – భండారు శ్రీనివాసరావు,