28, జూన్ 2012, గురువారం

ఐ.సి.ఐ.సి.ఐ. నక్షత్రకులు


ఐ.సి.ఐ.సి.ఐ. నక్షత్రకులు
రాజీవ్ దంపతులు ఎక్కిన విమానం కొన్ని వేల అడుగుల ఎత్తున గాలిలో తేలిపోతోంది. తమ నలభయ్యవ వివాహ వార్షికోత్సవాన్ని ఆస్ట్రేలియాలో జరుపుకోబోతున్న సందర్భాన్ని తలచుకుంటూ ఆ దంపతులు కూడా వూహల్లో తేలిపోతున్నారు.
ఇంతలో పబ్లిక్ అడ్రెస్ సిస్టం నుంచి విమానం కెప్టెన్ గొంతు వినిపించింది. అతడి స్వరంలో తెలియని కంగారు ప్రయాణీకులకు ఇట్టే తెలిసిపోతోంది.
లేడీస్ అండ్ జెంటిల్మెన్! మీ అందరూ నిబ్బరంగా వుండాలని కోరుకుంటున్నాను. మన ఈ విమానం  ఇంజిన్లలో మరమ్మతు చేయలేని అవరోధం తలెత్తింది. అత్యవసరంగా కిందికి దింపాల్సిన అగత్యం ఏర్పడింది.  నిర్మానుష్యమయిన ఒక దీవిని కనుగొన్నాము. అక్కడ విమానాన్ని సురక్షితంగా దింపే ప్రయత్నాలు చేస్తున్నాము. అవి ఫలించాలని మనమందరం మనసారా కోరుకుందాం. కాకపోతే ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఒకసారి అక్కడ దిగడం అంటూ జరిగితే మనకు బయట ప్రపంచంతో సంబంధాలు శాశ్వితంగా తెగిపోతాయి. ఆ తరువాత మనమందరం ఆ దీవిలోనే జీవితాంతం మన బతుకులు తెల్లవార్చుకోవాలి. మనం ఎక్కడ వున్నదీ ఇక ఎవ్వరూ కనుక్కోలేని దీవిలో మనం కాలుమోపబోతున్నాం.
విమానం పైలట్లు తమ నైపుణ్యం అంతా ఉపయోగించి విమానాన్ని ఆ దీవిలో సురక్షితంగా దించగలిగారు. చీమ చిటుక్కుమంటే వినిపించే నిశ్శబ్ధం నడుమ ప్రయాణీకులందరూ బిక్కుబిక్కుమంటూ మాటామంతీ లేకుండా అందులోనే కూర్చుండిపోయారు.
ఓ గంట  గడిచింది.
రాజీవ్ పక్కకు తిరిగి భార్య చెవిలో చెప్పాడు.
ఈ నెల మనం ఐ.సి.ఐ.సీ.ఐ. బ్యాంకుకు పంపాల్సిన ఇంటి లోను వాయిదా చెక్కు పంపించావా?’
రాజీవ్ భార్యకు ముందు మొగుడు ఏం అడుగుతున్నాడో అర్ధం కాలేదు. అర్ధం అయిన తరువాత అర్ధం కానట్టు మొహం పెట్టింది. అనుకోకుండా ఎదురయిన ఈ అవాంతరం వల్ల మొగుడు ఇలా ఈ సమయంలో అర్ధం పర్ధం లేని మాటలు  మాట్లాడుతున్నాడేమో అని సరిపుచ్చుకుంది.
చెక్కు పంపలేదు. అయినా ఆ విషయం మాట్లాడుకునే సందర్భమా ఇది?’ అంటూ ఎదురు ప్రశ్న వేసింది.
పోనీబ్యాంకు క్రెడిట్ కార్డు  ఇన్ స్టాల్ మెంటు  కట్టావా! అదీ మరచిపోయి వచ్చావా?’ అంటూ రాజీవ్ ఇంకో ప్రశ్న సంధించాడు. భార్య ఖచ్చితంగా ఇది సంధిప్రేలాపనే  అని ఓపక్క  భయపడుతూనే లేదని జవాబిచ్చింది.
అది వింటూనేనలభయ్ ఏళ్లలో ఎన్నడూ ఎరగని విధంగా భార్యను గట్టిగా వాటేసుకుని  తోటి ప్రయాణీకులు ఉలిక్కిపడేలా రాజీవ్ పెద్దగా అరిచాడు.
ఇక మనమెంతమాత్రం భయపడాల్సిన పనిలేదు. ఈ దీవిలోనే కాదు అతల,సుతల,పాతాళ  లోకాల్లో ఎక్కడున్నాసరే  బ్యాంకు వాళ్లు మనల్ని కనిపెట్టితీరతారు.
(నెట్లో సంచారం చేస్తున్న ఓ ఇంగ్లీష్ జోక్కి స్వేచ్చానువాదం –రచయిత) (28-06-2012)

26, జూన్ 2012, మంగళవారం

అనగనగా ఓ మేక కధ


అనగనగా ఓ మేక కధ

అనగనగా ఓ వూరు. ఆ వూర్లో ఓ రైతు. ఆ రైతు దగ్గరో గుర్రం. దానికి తోడు ఓ మేక.
ఆ గుర్రానికి వున్నట్టుండి జబ్బు చేసింది. యజమాని పశువుల వైద్యుడికి కబురు చేసాడు.
అతడొచ్చి గుర్రానికి పరీక్షలు చేసాడు. జబ్బు బాగా ముదిరిందని నిర్ధారించుకున్న వైద్యుడు రైతుతో చెప్పాడు.
‘నేను మళ్ళీ రేపు వస్తాను. వరసగా మూడు రోజులు మందిస్తాను.  మూడు రోజుల్లో నేనిచ్చిన మందు పనిచేసిందా సరి లేకపోతే ఇక అది బతకడం కష్టం’ అని తేల్చి చెప్పాడు.
పక్కనే వున్న మేక ఆ సంభాషణ విన్నది. పోయి గుర్రంతో చెప్పింది.        
“నువ్వు ఎలాగో అలా ఓపిక తెచ్చుకుని మామూలుగా వుండాలి సుమా!  ఇలాగే వున్నావంటే ఇక నువ్వు ఎందుకూ పనికి రావని తీర్మానించుకుని ప్రాణాలతో వుండగానే గొయ్యి తీసి నిలువునా పాతేస్తారు. నీ ఇష్టం.”
రెండో రోజు వైద్యుడు మందిచ్చి వెళ్ళిన తరువాత కూడా గుర్రం కదలలేదు. మేక మళ్ళీ వచ్చి హిత బోధ చేసింది.
“చూడు మిత్రమా! ఎంతో కొంత ఓపిక చేసుకో. వైద్యుడు వచ్చేవేళకు కాస్త లేచి తిరుగు. లేదంటే మందు  పని చేయడం లేదనుకుని నిన్ను పాతి పెడతారు. నా మాట విను” అంది.   
వైద్యుడు మూడో రోజు కూడా వచ్చాడు. యధాప్రకారం ఇవ్వాల్సిన మందు ఆఖరి మోతాదు కూడా ఇచ్చాడు. ఇచ్చి రైతుతో చెప్పాడు.
“నేను చేయాల్సిన ప్రయత్నం చేసాను. రేపు ఉదయం మరో సారి వస్తాను. అప్పుడు కూడా ఈ పరిస్తితే వుంటే ఇక చేయగలిగింది ఏమీ వుండదు, గుర్రాన్ని గొయ్యి తీసి పూడ్చి పెట్టడం మినహా. ఎందుకంటే ఈ గుర్రానికి వచ్చింది  ఆషామాషీ రోగం కాదు. అంటు  వ్యాధి. అది ఇతరులకు సోకకుండా వుండాలంటే ఇంతకంటే మార్గం లేదు.”
వైద్యుడిని సాగనంపడానికి రైతు వెళ్ళగానే మేక వచ్చి మళ్ళీ గుర్రంతో పోరు పెట్టింది.
“ నా మాట విను మిత్రమా! నువ్వు ఇక ఎందుకూ  పనికిరావని  వీళ్ళకు అర్దమయింది. ఏదో  ఇన్నాళ్ళబట్టి ఒకరికొకరం కష్టాలు, సుఖాల్లో తోడు నీడగా ఓ చోట వుంటున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. ఏదో విధంగా ఓపిక చేసుకో. నెమ్మదిగా లేచి నిలబడు. అలాగే. అలాగే. నెమ్మదిగా ఒక్కొక్క కాలు కూడదీసుకుని నిలబడు. అమ్మయ్య నా మాట ఇన్నాల్టికి నీకు అర్ధం అయినట్టుంది. ఎలాగో అలా లేచి నిలబడ్డావు. అలాగే శక్తి కూడదీసుకుని లగెత్తి పారిపో. ఇక్కడ వున్నావంటే నీకు చావు తప్పదు. ముందు అది గుర్తు పెట్టుకో.”             
“నాకు తెలుసు. పరుగు పందెంలో నిన్ను మించిన వాడు లేడు. మొదలు పెట్టిన పరుగు ఆపకు. అలాగే పరిగెట్టు.” అని సంతోషంతో ఉత్తేజపరచసాగింది.
గుర్రం లేచి ఇంటి పెరడులో పరిగెత్తుతుండగానే రైతు తిరిగివచ్చాడు. ఆ దృశ్యం చూడగానే అతడికి మహాదానందం అనిపించింది. మృత్యు ముఖంలో ప్రవేశించిన గుర్రం లేచి పరుగులు తీస్తూ వుండడం గమనించిన  సంతోషంలో భార్యను కేకేసి చెప్పాడు.
“మందు పనిచేసింది. గుర్రం తేరుకుంది. ఈ ఆనందాన్ని ఇరుగూ పొరుగుతో కలసి పంచుకుందాం. ఈ రాత్రే విందు భోజనానికి ఏర్పాట్లు చేయి. మేకను కోసి అందరికీ వండి పెట్టు.”
ఇది విన్న మేక ప్రాణాలు పైనే పోయాయి. (26-06-2012)
        

17, జూన్ 2012, ఆదివారం

ఏవన్నా తేడా వచ్చిందా?


ఏవన్నా తేడా వచ్చిందా?
ఎందుకిలా రాస్తున్నారు అని నా బ్లాగు పాఠకులు కొందరు రాసిన పిమ్మట నేను స్వచ్ఛందంగానే కొన్నాళ్ళపాటు రాజకీయాలు రాయడం మానేసి ‘ఎందుకిలా రాస్తున్నాను?’ అన్న ప్రశ్నను నాకు నేనే వేసుకుని సమాధానం వెతుక్కున్నాను. నేను రాస్తున్నదానిలో, లేదా టీవీ ఛానళ్ళలో మాట్లాడుతున్న వాటిలో ఏదన్నా పక్షపాత ధోరణి కానవస్తున్నదేమో అని పరిశీలన చేసుకున్నాను. ఇన్నేళ్ళుగా రాస్తూ వచ్చిన విషయాలను పునశ్చరణ చేసుకుని మరోమారు బేరీజు వేసుకున్నాను.
ఈనాడు  రాష్ట్ర రాజకీయ యవనికపై మారుతున్న  దృశ్యం పరికిస్తున్నప్పుడు ఇన్నాళ్ళనుంచి నేను వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల్లో ఏదయినా తేడా వచ్చిందా? లేక నేను రాసిందే జరుగుతూ వస్తోందా ? అని పోల్చి చూసుకోవడానికే ఈ ప్రయత్నం. నా విమర్శకులను కూడా అదే అభ్యర్ధిస్తున్నాను.కాకపోతే, స్తలాభావం కారణంగా వ్యాసాలను బాగా కుదించడం జరిగింది.

ముళ్ళ బాటలో ముఖ్యమంత్రి  (15-12-2010)
పత్రికల్లో, మీడియాలో ఎక్కడ చూసినా ఊహాగానాలే! ఏమిజరుగుతుందో విశ్లేషించి వివరించేవారికన్నా ఏమి జరగాలని తమ అంతరాంతరాల్లో అభిలషిస్తున్నారో దాన్నే ప్రస్తుత  పరిస్తితులకు అన్వయించి భాష్యం చెప్పేవారు ఎక్కువయ్యారు. రాజకీయనాయకులకే కాదు రాజకీయ విశ్లేషకులకు కూడా మినహాయింపు లేకపోవడమే  ఇందులోని విషాదం.
నిన్న మొన్నటివరకు ప్రాంతీయ సమస్య ప్రధాన భూమిక పోషించిన రాష్ట్రంలో ఈనాడు రాజకీయమంతా ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తోంది. నిజానికి నిండా నాలుగు పదుల వయస్సు లేదు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏడాదిన్నర కూడా కాలేదు. చూడగానే ఆకట్టుకునే విగ్రహం కాదు. పట్టుమని పది నిమిషాలపాటయినా తన ప్రసంగాలతో  ప్రజలను కట్టిపడేసే చాతుర్యం ఏమయినా వుందా అంటే అదీ లేదు.
అయినా వై ఎస్ జగన్ మోహన రెడ్డి సభలకు వేలం వెర్రిగా జనం ఎందుకలా వస్తున్నారు?
ఈ ఒక్క ప్రశ్నే అందర్నీ కలవరపెడుతోంది. అయితే, ఇది సమాధానం లేని ప్రశ్న కాదు. పైపెచ్చు అనేక సమాధానాలున్న ప్రశ్న. ముందు చెప్పినట్టు ఎవరి ఉద్దేశ్యాలకు తగ్గట్టుగా వారు ఊహించుకుంటూ జవాబులు వెతుక్కుంటూ వుండడంవల్ల ఎన్నెన్నో రకాల ఊహాగానాలు ఊపిరి పోసుకుంటున్నాయి. ఏమి జరగబోతున్నదన్న దానిపై మరెన్నో రకాల వదంతులు చెలరేగుతున్నాయి. జగన్ అనుకూల, ప్రతికూల కధనాలతో  మీడియా వీటికి మరింత  ఊతం ఇస్తోంది.                                                        

ఇప్పుడున్న వాడినీ వేడినీ మరో మూడేళ్ళు పైబడి  కొనసాగించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని, ఈనాడు జగన్ కు వున్న ధన వనరులు, జన వనరులు వచ్చే ఎన్నికలకల్లా కళ్ళ ఎదుటే  కరిగిపోవడం ఖాయమన్నది వారి నిశ్చితాభిప్రాయం. అవినీతి మార్గాలలో సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి మరో మార్గంలో అధికార పీఠం అధిరోహించడం అతడి ఏకైక లక్ష్యమన్నది  గత ఏడాది పైగా సాగుతూ వస్తున్న జగన్ వ్యతిరేక ప్రచారం లోని  మరో పార్శ్వం. ఈ క్రమంలో జగన్ సానుకూల, ప్రతికూల వర్గాల నడుమ సాగిన  వాదప్రతివాదాలు ముదిరి పాకానపడి జగన్ కు జనం లో హీరో స్తాయిని కట్టబెట్టాయి. పార్టీలో పెద్దలంతా ఒకవైపు, జగన్ ఒక్కడూ ఒకవైపూ వుండి నడిపిన రాజకీయంసాధారణ జనంలో జగన్ పట్ల సానుభూతి మరింత పెరిగేలా చేసింది.

మొదటి ముద్దాయి కాంగ్రెస్ అధిష్టానం (29-12-2010)
 
ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో టీడీపీ ది ఒక ప్రత్యేక స్తానం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్  మాదిరిగానే కొద్దో గొప్పో కేడర్ కలిగిన పార్టీ. కానీ ఈ మధ్యలో బాగా పుంజుకున్న తెలంగాణా అంశం వారి ఆశలపై మరోసారి  నీళ్ళు చల్లింది.అన్ని పార్టీల మాదిరిగానే ఈ పార్టీపై కూడా తెలంగాణా క్రీనీడలు కమ్ము కున్నాయి.  
పోతే, టీ.ఆర్.యస్.
తెలంగాణా లక్ష్య సాధన కోసం, అవసరమయితే కుష్టు రోగిని సయితం కావలించుకుంటామనే  నాయకులకు కొదవ లేని పార్టీ అది. అదృష్టం ముందు పుట్టి తరువాత పుట్టిన చంద్రశేఖరరావు ఆ పార్టీ నాయకుడు.
ఇంకా పేరు పెట్టని జగన్ పార్టీ విషయం కూడా చెప్పుకోవాలి. పుటకకు ముందే ప్రకంపనలు సృష్టించి దరిమిలా నీరు కారిపోయిన ఇతర పార్టీలను ఉదాహరణగా చూపిస్తూ  కొందరు  చేస్తున్న అవహేళనల నడుమ, కొత్తగా ఈ పార్టీ పురుడు పోసుకుంటోంది.
రాష్ట్రంలో నేడు నెలకొనివున్న దుస్తితికి  అన్ని  పార్టీలకు అంతో ఇంతో బాధ్యత  వున్నప్పటికీ  ఏదో సాకు చూపి తప్పించుకోలేని ప్రధాన బాధ్యత  మాత్రం అధికార పక్షానిది.          
అయిదేళ్ళు పాలించండని అధికారం అప్పగించిన ప్రజలను వారి మానాన వారిని వొదిలి గ్రూపు తగాదాలతో   మునిగి తేలుతున్న కాంగ్రెస్ వారిని చూస్తుంటే ఆ పార్టీని మొండిగా అభిమానించే వారికి కూడా  ఏష్టత కలుగుతోంది. రెండేళ్ళ క్రితం వరకు వడ్డించిన విస్తరి లాంటి కాంగ్రెస్ పరిస్తితి ఈ రోజు కుక్కలు చింపిన విస్తరి  చందాన తయారయింది.
ముఖ్యమంత్రిని మార్చాలా! ముఖ్యమంత్రి  తీరు మారాలా!! (18-11-2011)
కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అధిష్టానం పరిగణన లోకి తీసుకున్న యువకుడు, విద్యాధికుడు అన్న రెండు అంశాలను రుజువు చేసుకోవడంలో ఆయన కొంతవరకు  వైఫల్యం చెందారనే చెప్పాలి. ఆయనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, ఏ చిన్న సంఘటన జరిగినా - తక్షణం  హెలికాప్టర్ లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది సందేహమే. కానీ, ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా వారిరువురికీ ప్రజాదరణ అనే రాజకీయ లబ్ది లభించింది. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వెంటనే స్పందిస్తారన్న నమ్మకం జనంలో ఏర్పడింది.
యువకుడయిన కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం  ఈ విషయంలో అధిష్టానం తన మీద వుంచిన భరోసాను నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి. చంద్రబాబు, వై.ఎస్.ఆర్. లకు సమర్దులయిన పేషీ అధికారులు వుండేవారు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యేలా వారు శ్రద్ధ తీసుకునేవారని, కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో ఇది మరో ప్రధానమయిన లోటని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి.
 పైగా అధిష్టానం మద్దతు ఆయనకు పూర్తిగా వుంది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికయినా ఇది గొప్ప వరం. రాజశేఖరరెడ్డి ఈ వరాన్ని సంపూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అటు ఢిల్లీ పెద్దలను మెప్పించడంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయంగానే కాక ఇతరత్రా  పునాదులు గట్టి పరచుకోవడంలో ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఎన్నెన్ని అవినీతి  ఆరోపణలు వెల్లువెత్తినా సామాన్య ప్రజలను దృష్టిలో వుంచుకుని రూపకల్పన చేసిన సంక్షేమ పధకాలు  వై.ఎస్.ను తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా నిలబెట్టాయి.
ఎటు పోతున్నాం? (22-11-2011)
ప్రత్యర్ధి పార్టీలను  నామరూపాలు లేకుండా చేయాలనుకోవడం రాజకీయ రంగంలో చాలా సహజమయిన విషయం. ఎన్నికల్లోనూ, ఇతరత్రా కూడా ఈ లక్ష్య సాధనకోసం రాజకీయ పార్టీలు పనిచేస్తూనే వుంటాయి. నైతికంగా ఇది తప్పే అయినా రాజకీయకోణం నుంచి చూస్తే వాటికి ఇది  తప్పనిసరి వ్యవహారం. అందుకే ఎన్నికల్లో తేలని విషయాలను న్యాయస్తానాల ద్వారా తేల్చుకోవాలని ప్రయత్నించడం ఈ మధ్య కాలంలో ఎక్కువయింది. ఒకరకంగా చెప్పాలంటే సివిల్ కేసుల్లో సెటిల్మెంట్ మాదిరి. ఇప్పుడిది రాజకీయ పార్టీలకు కొత్త అస్త్రంగా తయారయింది.
మొన్నటికి మొన్న జగన్ మోహన రెడ్డి పై ఇదే బాణం ఎక్కుబెట్టారు. మళ్ళీ ఈ రోజున అదే బాణం చంద్రబాబు వైపు తిరిగింది. అధికారం అండగా చేసుకుని ఆర్ధిక నేరాల ఆరోపణల్లో చిక్కుకున్న వారిపై దర్యాప్తులు జరిపి నేరం రుజువు చేస్తే తప్పుబట్టేవాళ్ళు ఎవ్వరూ వుండరు. అలా కాకుండా ఇది కేవలం రాజకీయ కక్షలను సెటిల్ చేసుకునే  క్రమంలో సాగే వ్యవహారం అయితే పరిణామాలు దారుణంగా వుంటాయి.
రాజకీయ అవినీతి (28-07-2011)
అంగట్లో అన్నీ  వున్నా అల్లుడి నోట్లో  శని అన్న సామెత చందంగా రాజకీయ అవినీతి గురించి జరిగిన దర్యాప్తులు, అవి నిగ్గు దేల్చిన నిజాలు కాలగర్భంలో కలసిపోతున్నాయి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇన్ని సంవత్సరాల కాలంలో అవినీతి, లంచగొండితనం ఆరోపణలు రుజువై శిక్ష పడ్డ రాజకీయ ప్రముఖులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. నేరానికి తగిన  శిక్ష తధ్యం అన్న భయం వున్నప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుంది. నేర ప్రవృత్తి సయితం తగ్గుముఖం పడుతుంది.
చట్టం అందరిపట్లా ఒకే  రకంగా వ్యవహరించినప్పుడే చట్టం తన పని తాను చేసుకుపోతుందిఅనే వాక్యానికి అర్ధం వుంటుంది. లేని పక్షంలో అది ఒక పనికిరాని వూతపదంగా మిగిలిపోతుంది.

కాంగ్రెస్ వాకిట్లో ఆగస్టు సంక్షోభం (03-05-2012)
తాము కోరి ఎంపిక చేసుకుని నియమించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ  తమ అంచనాలకు, ఆకాంక్షలకు అందకుండా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం హస్తిన నాయకులను కలవరపెడుతోందా?
రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత రాష్ట్ర వ్యవహారాలను తిరిగి తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న అధిష్టానం  ప్రయత్నాలు బెడిసికొట్టి, 1982 నాటి చరిత్ర పునరావృతం కాబోతున్నదన్న సందేహం పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెడుతోందా?    
ఇంతకీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఇంతగా దిగజారిపోవడానికి ప్రధాన కారణం అధిష్టానం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలే. కానీ ఆ విషయం అధినాయకత్వం ముఖాన్నే  చెప్పగల, చేవ కలిగిన నాయకుడేడీ? రాష్ట్ర కాంగ్రెస్ అస్తవ్యస్త పరిస్తితికి సంబంధించి ముద్దాయి స్తానంలో వుండాల్సిన అధిష్టానం తీర్పరి పీఠంపై వుండడమే విషాదం. దీనికి తోడు - జాతీయ పార్టీ ముసుగులో పేను పెత్తనంచేయాలనే ఆభిలాష అదనం.
కానీ తప్పు దిద్దుకోవడానికి తరుణం కాదాయె. ముంగిట్లో 18 అసెంబ్లీ ఉపఎన్నికలు, ఒక లోకసభ ఉపఎన్నిక పెట్టుకుని యే నిర్ణయం తీసుకోవాలన్నా పాలుపోని పరిస్తితి.
రాష్ట్రపతి ఎన్నిక అనంతరం  ఆగస్టులో కాయకల్ప చికిత్స మొదలు పెడతారేమో! అప్పుడూ లొంగకపోతే, ఆఖరి ఔషధంగా గరళవైద్యం తప్పదేమో!
దుష్టాంగాన్ని ఖండించయినా శిష్టాంగాన్ని కాపాడమన్నారు కదా పెద్దలు.
కాకపోతే, తొలగించే అంగాలుఒకటా రెండా అన్నదే ప్రశ్న. (17-06-2012)
ఏవన్నా తేడా వచ్చిందా? మీరే చెప్పాలి.

టుడే ఫాదర్స్ డే - నాన్న చెప్పిన మాట



టుడే ఫాదర్స్ డే  - నాన్న చెప్పిన మాట

ఇన్నేళ్ళ తరువాత కూడా నా చిన్ననాటి ఈ సంఘటన నాకు బాగా గుర్తుంది.
ఆ రోజుల్లో ఇంటెడు చాకిరీతో అమ్మ ఎంతో కష్టపడుతుండేది. అయినా,  ఎన్ని పని తొందరలు వున్నా నాకిష్టమయిన చిరుతిళ్ళు మాత్రం టంచనుగా  చేసిపెడుతుండేది. చిన్నతనం వల్ల  కావచ్చు, అమ్మ చేసిన గారాబం వల్ల కావచ్చు  అమ్మ ఎంత బాగా చేసినా  ఏదో ఒక వంక పెట్టి సతాయించేవాడిని.
ఓ రాత్రి అమ్మ నాన్నకు భోజనం పెడుతుంటే చూశాను. అన్నం మాడిపోయివుంది. దానికి తోడు  చల్లారిన చారు. కానీ నాన్న మారుమాట్లాడకుండా, మారు అడిగి మరీ  భోజనం చేయడం చూసి ఆశ్చర్యపోయాను.
మర్నాడు అమ్మ నాన్నతో అంటోంది. “రాత్రి అన్నం మాడిపోయింది. మళ్ళీ చేసిపెట్టే టైం లేకపోయింది. మీరు అలానే తిని  నైట్ డ్యూటీకి వెళ్లారు. నాకెంతో బాధ వేసింది.”
అప్పుడు నాన్న చెప్పిన  జవాబు నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.
“భలేదానివే. అన్నం మాడిపోయిందని నీవనుకుంటున్నావు. నాకు మాత్రం మాడిపోయిన అన్నం చెక్కలంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ అలా మాడిపోయిన అన్నం చెక్కలపై వెన్న రాసి పెడితే ఆవురావురుమంటూ తినేవాడిని తెలుసా!”    
నాన్న మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఆ రాత్రి  అమ్మ వంటింట్లో పనిలో వున్నప్పుడు చూసి అడిగాను.
“ ఒరేయ్  నాన్నా”
నాన్న నన్ను ముద్దుగా ‘నాన్నా’ అని పిలుస్తాడు.
“అమ్మ వుదయం నుంచి రాత్రిదాకా ఎంత కష్టపడుతున్నదో రోజూ చూస్తున్నాం కదా. అప్పటికే  బాగా  అలసిపోయి వుంది. అంత రాత్రప్పుడు మళ్ళీ  ఏం వొండి పెడుతుంది చెప్పు. అయినా ఒక్క రోజు  మాడిన అన్నం తింటే ఏమవుతుంది ? కడుపు మాడదు కదా!
“ఒక మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకో. 
“జీవితంలో అన్నీ మన కిష్టమయినట్టు జరగవు.  మనం ఇష్టపడ్డ మనుషులే  మనకు తారసపడరు. అన్నీ సవ్యంగా సక్రమంగా జరగాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ సవ్యంగా జరగని వాటికి మనం ఇతరులను తప్పు పట్టటం పెద్ద తప్పు. ఆ తప్పు నువ్వెప్పుడు చేయకు. ఇంకో విషయం.  నాకు వొంట చేయడం రాదుకదా కనీసం గ్యాస్ పొయ్యి వెలిగించడం కూడా రాదు. ఇక అమ్మ చేసే  వంటకు వంక పెట్టే హక్కునాకెలా వుంటుంది చెప్పు.
“ఇన్నేళ్ళ జీవితంలో నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. ఇతరుల పొరబాట్లను మంచి మనసుతో స్వీకరించగలగాలి. అప్పుడే నలుగురితో మన సంబంధాలు బాగుంటాయి. ఆ సంబంధాలే పది  కాలాలపాటు చెక్కుచెదరకుండా వుండి జీవితాలకు శోభనిస్తాయి.
“మళ్ళీ  చెబుతున్నా విను. ఇతరులలోని మంచితనాన్ని  గ్రహించే శక్తిని భగవంతుడు నీకివ్వాలని కోరుకుంటున్నాను. అలాగే పక్కవారి తప్పులను ఎత్తిచూపే దుర్గుణం నీనుంచి దూరం కావాలన్నది కూడా నా కోరిక.
“నీ జీవితంలో ఎదురయ్యే చెడు సంఘటనలను, నీ మనసులో మెదిలే చెడు ఆలోచనలను ఆ భగవంతుడి పాదాలవద్ద వొదిలెయ్యి. నువ్వు గ్రహించిన మంచిని నీలోనే వుంచుకో. ఆ చెడ్డ విషయాల సంగతి  ఆ దేవుడే  చూసుకుంటాడు. నీ మంచి మాత్రం నిన్ను మంచి దోవలో నడిపిస్తుంది. అప్పుడు మాడిపోయిన అన్నం కూడా నీకు పరమాన్నంలా అనిపిస్తుంది.”  

ఇదో కధ అనుకుంటే ఇందులోని నీతి:
జీవితంలో  మీరు  కలిసే వారెవరో, మీకు తారసపడేవారెవరో కాలమే నిర్ణయిస్తుంది.
మీరు  కోరుకునే వ్యక్తులను మీ  మనసే నిర్ణయిస్తుంది.
కానీ జీవితంలో మీ వెంట నడిచే వ్యక్తులెవరన్నది మీ  ప్రవర్తనే నిర్ణయిస్తుంది.

ఇతరుల తప్పిదాలను తేలిగ్గా తీసుకుని, ఇతరులతో విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు నడిస్తే  ఇతరులతో మీ  సంబంధాలు శాశ్వితం అవుతాయి. జీవితం పూల పానుపు అవుతుంది. లేకపోతే ముళ్ళ కంపగా మారుతుంది. (17--06-2012)

16, జూన్ 2012, శనివారం

మంచి మనుషులు – మంచి మనసులు



మంచి మనుషులు – మంచి మనసులు

మంచి మనుషుల్ని కలుసుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్ళాలి. మంచి మనసుల్ని తలచుకోవడానికి ఎంత గతంలోకి అయినా వెళ్ళాలి. అందుకే ఓ ఎనభయ్ ఏళ్ళు వెనక్కు పోదాం.

కలకత్తా మునిసిపల్ కార్పొరేషనుకు ‘ఆయన’ మొట్టమొదటి మేయర్ గా ఎన్నికయ్యారు. తన వద్ద పనిచేసేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారిని కాదని, నిండా పాతికేళ్ళు కూడా నిండని ఓ భారతీయుడిని కార్పొరేషన్ సీ. ఈ. వో. గా ఎంచుకున్నారు. మేయర్ నిర్ణయాన్ని అప్పటి ప్రభుత్వం సయితం వ్యతిరేకించలేదు. సరికదా, ప్రజలచేత ఎన్నికయిన మేయర్ నిర్ణయాన్ని ఔదలదాల్చింది. ఈ నాటి స్వతంత్ర భారతంలో ఇలాటి దృష్ట్యాంతం ఒక్కటి చూపగలమా. సందేహం అక్కరలేదు. లేదుఅని బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు.

సరే, ఆ కుర్రాడు కొన్నాళ్ళు పని చేసాక  బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే రిపోర్టులు రావడంతో అతగాడిని ఉద్యోగం నుంచి అర్ధాంతరంగా  తొలగించారు. అంతటితో ఆగలేదు, అతడిని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. కానీ మన మేయర్ గారున్నారే,  ఆయన అలాటిలాటి అల్లాటప్పా  రాజకీయ నాయకుడు కాదు. కనుకనే, ఆ నాటి ప్రభుత్వంతో పోరాడి అతడిని జైలు నుంచి  విడిపించారు. ఆయన గొప్పతనం కొలిచేందుకు కొలమానాలు లేవు సరే. మరి అంతటి ఉదాత్త వైఖరి ప్రదర్శించిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని పొగిడేందుకు వేయి నాలుకలు సరిపోతాయా. అంటే ఏమిటి? స్తానిక సంస్తలకు అలనాటి  బ్రిటిష్ పాలకులు ఇచ్చిన ప్రాధాన్యత అలాటిదన్నమాట. అలాటి విశాల తత్వాన్ని ఈనాటి స్వతంత్ర భారతంలో మన  పాలకులనుంచి ఆశించగలమా?

ఆ మేయర్ మహాశయుల పేరు స్మరించుకుందాం.  దేశబంధు బిరుదు పొందిన స్వాతంత్య్ర సమర యోధుడు  చిత్తరంజన్ దాస్. ఆ కుర్ర అధికారి ఎవరో వూహించగలరా. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో హింసా మార్గం అవలంబించినా  తప్పులేదని భావించి అజాద్ హింద్ ఫౌజ్ స్తాపించిన అమరవీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. (షుబాషు చంద్రబోషూ అని ఉచ్చరించాలని గూగుల్ సెర్చ్ ఉద్ఘాటిస్తోంది.)
(ఈనెల పదహారో తేదీ చిత్తరంజన్ దాస్ వర్ధంతి)

11, జూన్ 2012, సోమవారం

మైండ్ బ్లాంక్ కావడమంటే!


మైండ్ బ్లాంక్ కావడమంటే!
“ఛీ! ఛీ!! పాడుకొంప పాడుకొంపనీ- ఇల్లు ఇరకటం ఇల్లాలు మర్కటం అంటే ఇదే కాబోలు. సమయానికి ఒక్కటీ కనబడి చావదు. పాడు కొంప పాడుకొంపనీ ....”
                  “ఏమండీ మిమ్మల్నే! ఇందాకటినుంచి గొంతుచించుకుని పిలుస్తుంటే వినిపించుకోరేం! ఏమిటా పరధ్యానం. ఆఫీసులో టైపిస్టు పిల్ల గుర్తొచ్చిందా ఏమిటి?”
“అబ్బెబ్బే ....ల్లే ల్లే ల్లే ల్లే ల్లేదు లేవే”
                 “ఇంటెడు చాకిరితో ఇవతల నేనల్లాడి పోతుంటే అవతల మీరు ఎవరెవర్నో తలచుకోడాలు, మురిసిపోడాలు. సిగ్గు లేకపోతే సరి. సరే దోభీ వచ్చాడు. నాకేమన్నా పది చేతులా! ముందా పద్దు సంగతి చూడండి.”
“స్సస్సస్సస్సరి లేవే! ఆ! చెప్పవయ్యా!! చీరెలెన్ని? లంగాలెన్ని?”

                       “ప్యాంట్లు మూడు – బనీన్లు రెండూ”

10, జూన్ 2012, ఆదివారం

స్టాక్ హోం సిండ్రోం


స్టాక్ హోం సిండ్రోం

‘కొట్టిన చెయ్యే  కోరు’ అని పాత సినిమాలో ఒక పాట వుంది.
1973 లో స్వీడన్ లోని స్టాక్ హోం లో బ్యాంకు దోపిడీ జరిగింది. ఈ సందర్భంలో దోపిడీ దొంగలు కొంతమంది సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. తమని చంపేస్తారేమోనని ముందు బందీలు భయపడ్డా దొంగలు వారిని ఏమీ చేయలేదు. బందీలుగా వున్న రోజుల్లో వారికీ వీరికీ నడుమ ఒకరకమయిన ఆత్మీయ బంధం ఏర్పడింది. ఆరు రోజుల తరువాత వారిని విడిచిపెడతామన్నా బందీలు అంగీకరించలేదు. పైపెచ్చు,  తమని బందీలుగా పట్టుకున్న దొంగలనే  వారు సమర్ధించారు. వారిపై పెట్టిన కేసు ఖర్చులను కూడా భరించడానికి  సిద్ధపడ్డారు. అంతేకాదు, బందీల్లో వున్న ఒక అమ్మాయి బందిపోటు దొంగల్లో ఒకడిపై మనసు పారేసుకుని అతడినే ఆ తరువాత మనువాడింది కూడా. ఈ రకమయిన మనస్తత్వానికి తదుపరి రోజుల్లో ‘స్టాక్ హోం సిండ్రోం’ అనే పేరు స్తిరపడింది.
ఈ విషయం గుర్తు చేసుకోవడానికి పూర్వరంగం ఒకటుంది.         
‘మేధావులు తమకు తెలిసింది చెబుతారు. సామాన్యులు తమ మనసులోని మాట చెబుతారు. సామాన్యుల  మాటలు -  రంగూ రుచీ వాసన లేని స్వచ్ఛమయిన నీటిలాటివి’
ఒక టీవీ చర్చలో పాల్గొంటూ నేను చెప్పిన ఈ మాటతో  నాతోపాటు ఈ కార్యక్రమానికి హాజరయిన  ఒక విశ్లేషకుడు ఏకీభవించలేదు.
మేధావులు, చదువుకున్నవాళ్ళు - తమకున్న పరిజ్ఞానంతో 'అది' లేని వారికి విషయం విడమరచి చెప్పి  సరయిన తీరులో వాళ్ళు  కూడా ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. కాకపొతే మా ఇరువురి నడుమా ఈ  సంభాషణ ‘బ్రేక్’ టైం లో సాగింది.
ఆయన అభిప్రాయం కూడా కొట్టిపారేసేది కాదు. కాని మేధావి అంటే ఎవరు? ఒక మేధావి చెప్పింది మరో మేధావి ఒప్పుకునే పరిస్తితి వుందా? అలా వుంటే మేధావి ఎలా అవుతాడు?
సరే! మా సంభాషణ సాగుతుండగానే లైవ్ షో మొదలయింది. నా అభిప్రాయాన్ని సమర్ధించుకుంటూ నేను ఓ అనుభవాన్ని ఉదహరించాను.
ఎనభయ్యవ దశకం ఆఖరులో నేను మాస్కోలో వున్నప్పుడు టీవీలో ఒక టాక్ షో చూసాను. భాష అర్ధం కాకపోయినా భావం అర్ధం అయ్యేలా ఆ షో నడిచింది. ఆ టాక్ షోలో పాల్గొనాల్సివున్న పెద్దమనిషి సమయానికి రాకపోవడంతో అక్కడ పనిచేసే లైట్ బాయ్ ని పెట్టి ఆ షో నడిపిస్తారు. అతడు దాన్ని యెంత సమర్ధంగా నడిపిస్తాడంటే ప్రేక్షకులు అతడికి బ్రహ్మరధం పడతారు. అవకాశం వచ్చినప్పుడు సామాన్యులు కూడా తమ లోని ప్రతిభను బయట పెడతారని అతగాడు రుజువు చేస్తాడు.
ఇది చెప్పి, టీవీ ఛానళ్ళవాళ్లు కూడా సామాన్యుల అభిప్రాయాలతో కార్యక్రమాలు రూపొందిస్తే జనసామాన్యం అభిప్రాయాలు మరింత బాగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని  నా అభిప్రాయం వెల్లడించాను.
అసలింతకీ విషయం  ఏమిటంటే, సమాజంలో నానాటికీ విస్తరిస్తున్న అవినీతి భూతాన్ని  సామాన్యులు  అంతగా పట్టించుకోవడం లేదని, వారి నిర్లిప్తత వల్ల ఎంతో అనర్ధం జరుగుతుందని ఈనాడు అనేకమంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో వారిని జాగృతం చేయాల్సిన బాధ్యత వివేకులు, విజ్ఞానులు, మేధావులు తీసుకోవాలని వారి డిమాండు. అయితే, ఇతరులని అవినీతిపరులని ముద్ర వేస్తున్న వాళ్లు సయితం  ఏమీ తక్కువ తిన్నవాళ్ళు కాకపోవడం వల్లనే  ప్రజలు అవినీతిపట్ల అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న సంగతిని వాళ్లు మరచిపోతున్నారేమో అనిపిస్తున్నది. ఆరోపణలు చేసేవారికి విశ్వసనీయత అడుగంటడమే ఈ పరిస్తితికి దారితీసింది. అందరూ అవినీతిపరులే అన్న భావన ప్రజల్లో ప్రబలిన తరువాత ఈ నీతివాక్యాలు వారి చెవులకు సోకడం లేదు. ఈ నేపధ్యంలో ప్రజలు కొద్ది రోజుల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో ఇవ్వబోయే తీర్పు తమకు అనుకూలంగా లేకపోతే వారు అవినీతికి కొమ్ము కాసేవాళ్లని అనుకున్నా తప్పులేదని తీర్మానించడం  కూడా ప్రజాతీర్పును చిన్నబుచ్చినట్టే అవుతుంది.
రాజకీయాల్లో వున్నవారు ఓ పదవికి ఆశపడితే అది ధర్మం. సామాన్యులు వోటు కోసం ఏదయినా కోరుకుంటే అది అధర్మం. కనీస అవసరాలు కనుక్కునేవారికి మద్దతుగా నిలబడితే ‘బిస్కెట్లకు’ ఆశపడేవారిగా ముద్ర.  రాజకీయులు ఏదయినా ఓ పార్టీకి కొమ్ముకాస్తూ తమ పనులు చక్కబెట్టుకుంటే అది నైతికత. సమాజం మొత్తం అవినీతిరహితంగా వుంచగలిగితే అందరూ సంతోషిస్తారు. అంతేకాని పక్కవానికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అని అంటే కుదరదు.  
రాజకీయ నాయకులు, ఆ మాటకు వస్తే సమాజంలో ఎంతోకొంత పలుకుబడి కలిగిన వాళ్లందరూ  తమ స్వప్రయోజనాలకు పెద్ద పీట  వేస్తున్నప్పుడు, తమ విషయంలోనే ఈ పెద్దలు సుద్దులు నూరిపోయడం సామాన్యులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. అందుకే, కనీవిని ఎరుగని స్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని గ్రహించినందువల్లనే కాబోలు, ఆర్ధిక కారణాలతోనే ప్రజలు అవినీతిపరులుగా ముద్ర పడినవారి పట్ల అభిమానం చూపిస్తున్నారని కొత్త గగ్గోలు మొదలయింది.
పూర్వం ఓ మహారాజు పెద్దమనసుతో ప్రతిరోజూ అన్నార్తులకు అన్నదానం చేస్తుండేవాడు. ఎంతో పుణ్యం చేసుకుంటూ స్వర్గంలో మంచి స్థానాన్ని ఇప్పటినుంచే సంపాదించుకుంటున్నాడని అంతా వేనోళ్ళ చెప్పుకునేవారు.అయితే అలా దానం చేస్తున్న అన్నం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ‘ఎంగిలి’ అవుతోందన్న విషయం ఆ రాజు గారికి తెలియదు. కాని ఈయనగారు ఇలా నిత్యాన్నదానం కొనసాగిస్తూవుంటే, మరో పక్క నరకంలో ‘ ఆ ఎంగిలి కూడు’ ఓ కొండలా పెరగడం మొదలయింది. త్రిలోక సంచారి అయిన నారదుడు ఈ కొండ విషయం గమనించి ఆ విషయాన్ని భూలోకానికి వచ్చినప్పుడు ఆ రాజుగారి చెవిన వేసాడు. రాజు కంగారు పడిపోయి తరుణోపాయం కోరాడు. అప్పుడు నారదుడు ఇచ్చిన సలహా రాజుగారికి నచ్చకపోయినా గత్యంతరం లేక అమలు చేసాడు. నారద ముని సూచన మేరకు ఓ ఒంటిస్థంభం మేడ కట్టించి అందులో యుక్తవయస్సులో వున్న తన ఏకైక కుమార్తెను ఒంటరిగా  వుంచాడు. ప్రతిరోజూ సాయం సంధ్యవేళలో  ఆ భవనానికి వెళ్లి కుమార్తె పడకగది బయట తెల్లవారేవరకు ఆమెకు తెలియకుండా గడిపి తిరిగి రాజభవనం చేరుకునేవాడు. రాజుగారి ఈ వ్యవహారం ఆ నోటా ఈనోటా పడి చివరకు ప్రజలు చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. సొంత కుమార్తెతో రాజు గారికి అక్రమ సంబంధం అంటగట్టి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. భూలోకంలో  రాజుగారికి వ్యతిరేకంగా అపనిందల ప్రచారం పుంజుకుంటున్నకొద్దీ అక్కడ నరకంలో రాజుగారి ‘ఎంగిలి కొండ’ క్రమంగా తరిగిపోవడం మొదలయింది.
త్రిలోక పూజ్యుడయిన నారద మునీంద్రులు రాజుగారి పాప ప్రక్షాళన కోసం ఇచ్చిన సలహా మహిమ  అది.            
‘మాదోరి పాప. ఆదోరి  బయ్యాలి’ అని కన్నడంలో ఒక సూక్తి. అంటే ఒకరు చేసిన పాపాన్ని వేరొకరు అదేపనిగా చెబుతుంటే ఆ పాపంలో వాటా వాళ్ల ఖాతాలోకి కూడా చేరుతుంది. (09-06-2012)