6, మార్చి 2011, ఆదివారం

వర్కింగ్ కమిటీ వాలకం – భండారు శ్రీనివాసరావు

వర్కింగ్ కమిటీ వాలకం – భండారు శ్రీనివాసరావు


(06-03-2011 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)

- సంకీర్ణం పేరిట అన్నింటా అవమానాలే

- రాష్ట్ర ఎంపీల మనో వేదన

- పార్టీ పదవులకూ భంగపాటేనా?

- కల్లలైన సీనియర్ల కలలు

- సీడబ్ల్యుసీ ప్రాధాన్యతను తగ్గించిన ‘కోర్‌ కమిటీ’

‘ధర్మము ధర్మమటంచు వితండ వితర్కము లాడదేల ఆ ధర్మము నేనెరుంగుదు’ అంటాడు శ్రీరాముడు ఆంజనేయుడితో ఓసారి తగవు పడిన సందర్భంలో. బహుశా ధర్మకోవిదుడయిన రాముడికి కూడా సంకీర్ణ ధర్మం అనే ధర్మం తెలిసి ఉండదు. ఆయనకీ తెలియని ఈ ధర్మం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకి క్రమంగా తేటతెల్లం అవుతున్నట్టుంది. ‘మన రాష్ట్రం నుంచి అక్షరాలా ముప్పయి మూడు మందిమి కాంగ్రెస్‌ పార్టీ తరపున లోక్‌ సభలో కాలు పెట్టాము. నిజానికి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నదంటే దానికి ఆక్సిజన్‌ ఇస్తోంది మా ముప్పయి మూడు మందే. కానీ మనకు దక్కిన మంత్రి పదవులెన్ని? దక్కినవాటిల్లో పనికొచ్చేవెన్ని? రైల్వే బడ్జెట్‌లో కానీ, కేంద్ర బడ్జెట్‌లో కానీ రాష్ట్రానికి ఏమాత్రం గిట్టుబాటయింది? కేవలం ఒకరిద్దరు ఎంపీలతో మద్దతిస్తున్న చిన్నా చితకా పార్టీలకు ఇస్తున్న గౌరవ మర్యాదలు కానీ, పదవుల పంపకంలో వారికి ఇస్తున్న ప్రాధాన్యతలు కానీ ఇంతమంది సభ్యులు ఉన్న మన రాష్ట్రం వారికి ఎందుకు ఇవ్వడం లేదు? ప్రభుత్వం మనదన్నమాటే కానీ మన మాట ఏమాత్రం చెల్లుతోంది? ప్రతి చిన్న పనికీ ఢిల్లీలో అందరిముందూ సాగిలపడాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది? సంకీర్ణ ధర్మం పేరుతో ఇంకా ఎన్నాళ్ళు ఈ అవమానాలు భరించాలి?’- ఢిల్లీలో మన కాంగ్రెస్‌ ఎంపీలు ప్రైవేటు సంభాషణల్లో పబ్లిక్‌గా చెప్పే మాటలు ఇవి. సరే, ప్రభుత్వ వ్యవహారాల్లో సంకీర్ణ ధర్మం పేరు చెప్పి దాటవేస్తున్నారు కానీ, పార్టీ పదవుల దగ్గర కూడా భంగపాటు తప్పకపోవడమే రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను మరింత కుంగదీస్తోంది.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ పునర్వ్యవస్థీకరణ తరవాత వారి మాటల్లో వాడీ వేడీ మరింత పెరిగింది. కానీ ఏం లాభం? అధిష్ఠానం మాటే శిరోధార్యం అని అనునిత్యం వల్లించే వారికి, తమకు జరిగిన అన్యాయం గురించి నిలదీసే హక్కు ఎక్కడ ఉంటుంది? కాకపొతే, తనదాకా వస్తేగాని తత్త్వం బోధపడదు అన్న చందంగా ఇప్పుడు వారికి అధిష్ఠానం తమ పట్ల ప్రదర్శిస్తున్న చిన్న చూపు గురించి పెద్ద మనోవ్యధ పట్టుకుంది. ఢిల్లీ పెద్దల దృష్టిలో తమ స్థానం ఏమిటో వారికి బోధపడింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ అనిశ్చితి, తెలంగాణ అంశం పార్టీలో తెచ్చిన చీలికలు, జగన్‌ మోహన రెడ్డి తిరుగుబాటు- నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని మెరుగుపరచడానికి సీడబ్ల్యుసీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం మరింత పెరగగలదని కన్న కలలన్నీ కల్లలయ్యాయి.

పునర్వ్యవస్థీకరణకు ముందు పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీలో సభ్యులుగా చక్రం తిప్పిన రాష్ట్ర నేతలు నలుగురికి కొత్త కమిటీలో మొండిచేయి చూపారు. పార్టీలో కురువృద్ధుడు అన్న ప్రాతిపదికపై దేశంలోనే అత్యున్నత పదవిపై ఆశ పెట్టుకుని అది నెరవేరకపోవడంతో నేరుగా పార్టీ అథినేత్రిపైనే నిప్పులు చిమ్మిన జి. వెంకటస్వామిని కమిటీ నుంచి తప్పించి, అవిధేయతను సహించేది లేదన్న స్పష్టమయిన సందేశాన్ని పార్టీ నాయకులకు పంపారు.

అలాగే, కె. కేశవరావు! పశ్చిమ బెంగాల్‌, అండమాన్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జ్‌గా పనిచేసిన కేకేను ఆ బాధ్యతలనుంచి తప్పించడమే కాకుండా, శాశ్వత ఆహ్వానితుడుగా కమిటీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాన్ని కూడా ఆయనకు దూరం చేశారు. తెలంగాణ కోసం సీ డబ్ల్యుసీ పదవిని తృణప్రాయంగా త్యజిస్తానని లోగడ కేకే చేసిన గర్జింపుకు ఇది అధిష్ఠానం ఇచ్చిన జవాబుగా పరిశీలకులు భావిస్తున్నారు. పోతే, ఉద్వాసనకు గురయిన మరో నాయకుడు నేదురుమల్లికి మళ్ళీ పదవి రాకపోవడానికి ఆయన వయసు అడ్డుపడి ఉండవచ్చు.

మరో సీనియర్‌ నాయకుడు కిశోర్‌ చంద్రదేవ్‌కు కూడా చోటు లభించలేదు. అందుకు కారణం రెండు మూడు నెలల్లో జరగలదని అనుకుంటున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పించాలన్న యోచనలో పార్టీ అథినాయకత్వం ఉండడమేనని చెబుతున్నారు. అధిష్ఠానం రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరి పట్ల కాస్త కరుణ చూపిందనుకోవాలి. పార్టీ కార్యదర్శులుగా ఉన్న వి.హెచ్‌. హనుమంతరావు, పి.సుధాకరరెడ్డి- లకు మరో మారు అవకాశం కల్పించారు. సుధాకర రెడ్డిని గోవాకు, హనుమంతరావును మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌, హర్యానా రాష్ట్రాల పార్టీ ఇంచార్జి బి.కె. హరిప్రసాద్‌కు సహాయకుడిగా నియమించారు.

మన రాష్ట్రానికి సంబంధించినంతవరకూ మరో ప్రధానమయిన మార్పు వీరప్ప మొయిలీని ఇంచార్జిగా తప్పించి ఆ స్థానంలో గులాం నబీ ఆజాద్‌ను నియమించడం. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలన్నీ ఆయనకు కొట్టినపిండి. గతంలో ఈ బాధ్యతను ఆజాద్‌ చాలా విజయవంతంగా నిర్వహించిన రికార్టు ఉంది. పార్టీని పట్టి కుదుపుతున్న జగన్‌ అంశం, తెలగాణ వాదంతో కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర పార్టీని ఆజాద్‌ తన వ్యూహ చతురతతో గట్టెక్కించగలరనే నమ్మకంతోనే అధినాయకత్వం ఈ మార్పు చేసి ఉంటుందని భావిస్తున్నారు.

ఇక ఈ మార్పు చేర్పులన్నింటినీ అధిష్ఠానం దృష్టితో పరికిస్తే చాలా ముందు చూపుతోనే పునర్వ్యవస్థీకరణ కసరత్తును అది పూర్తి చేసిందనుకోవాలి. మరో మూడేళ్లదాకా ఎన్నికలు లేని ఆంధ్ర ప్రదేశ్‌ పై దృష్టి సారించడం దండుగ అన్న భావనలో అధిష్ఠానం ఉండి ఉండవచ్చు. అందువల్ల అనవసరం అనుకున్న వారిని తప్పించేందుకు దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ఉండవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి వీరి అవసరంకూడా పార్టీకి ఉండకపోవచ్చు. కొన్ని విషయాలలో అధిష్ఠానాన్ని తప్పు దోవ పట్టించారన్న అనుమానం ఢిల్లీ పెద్దలకు కలిగి ఉండవచ్చన్న వాదన కూడా కొట్టిపారవేయతగినది కాదు. అలాగే పార్టీ అధినేత్రిపై గానీ, అధిష్ఠానం పై గానీ లేనిపోని వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్న హెచ్చరిక కూడా ఇందులో దాగి ఉండవచ్చు.

కాంగ్రెస్‌ పార్టీ నియమావళి ప్రకారం వర్కింగ్‌ కమిటీ అనేది అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థ. అయితే, కోర్‌ కమిటీ పేరుతొ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేసుకున్న మరో ప్రత్యామ్నాయ వ్యవస్థ సీడబ్ల్యూసీ ప్రాధాన్యాన్ని కొంతవరకు తగ్గించిందనే చెప్పాలి. వచ్చే ఎన్నికల అనంతరం రాహుల్‌ గాంధీని ప్రధానిగా ప్రతిష్ఠించాలనే లక్ష్యం నెరవేరడానికి సీడబ్ల్యూసీలో చేసిన ఈ మార్పులు, చేర్పులు ఏమాత్రం సహకరిస్తా యో చెప్పడం కష్టం. కొత్త కమిటీలో రాహుల్‌కు రెండు ప్రధాన బాధ్యతలు అప్పగించినప్పటికీ, యువతరాన్ని ఆకర్షించేవిధంగా దానిపై ఆయన ముద్ర లేదన్నది మరో అభిప్రాయం. అనుభవానికే పెద్ద పీట వేసి, కొత్త రక్తాన్ని పార్టీకి ఎక్కించడంలో అధినాయకత్వం అంతగా శ్రద్ధ చూపలేదని పరిశీలకుల ఉవాచ.

ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాలలో రాహుల్‌ గాంధీ ప్రయోగం సత్ఫలితాలను ఇవ్వకపోవడం కూడా ఇందుకు కారణం అయి ఉండవచ్చు. కొత్త కమిటీలో స్థానం సంపాదించుకున్న వారందరూ వయసు మళ్లినవారే కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. తలపండిన పెద్దల అనుభవ సారాన్ని ఉపయోగించుకుంటూ పార్టీని పటిష్ఠం చేయడం అన్న ఒక్క విషయమే అధినాయకత్వం ముందున్న ప్రాధాన్యం అయి ఉండాలి.రోజురోజుకూ చీమల పుట్టల్లా అనేక అవినీతి కుంభకోణాలు వెలుగు చూస్తూ, పార్టీ అస్తిత్వానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్న దశలో ఉడుకు నెత్తురు కంటే, అనుభవాన్ని నమ్ముకోవడమే మంచిదన్న నమ్మకానికి అధిష్ఠానం వచ్చి ఉంటుంది!



3, మార్చి 2011, గురువారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు-పద్దెనిమిదో భాగం) – భండారు శ్రీనివాసరావు

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు-పద్దెనిమిదో భాగం) – భండారు శ్రీనివాసరావు


పాలయినా పెట్రోలయినా ఒకటే ధర

ఎముకలు కొరికే చలిలో ఏమి చెయ్యాలనిపిస్తుంది ? నాకయితే ఇంట్లో కూర్చుని వేడి వేడి పకోడీలు తింటూ రేడియోలో పాత పాటలు వినాలనిపిస్తుంది. కానీ రష్యన్లు చలి ముదురుతున్న కొద్దీ చల్లటి బీరు తాగాలనో, ఇంకా చలచల్లటి ఐస్ క్రీములు తినాలనో ఉత్సాహపడతారు. మంచుకురిసే వేళలో – ఆపాదమస్తకం ఉన్ని దుస్తులు ధరించి ఐస్ క్రీములకోసం ఆడామగా, పిల్లాపెద్దా తేడాలేకుండా వీధి దుకాణాల ముందు ఆరుబయట బారులుతీరి నిలబడే రష్యన్లను చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆనాటి మాస్కోలో ఎక్కడికిపోయినా ముందు కనిపించేవి పెద్ద పెద్ద క్యూలే. ఆఖరికి పాలుకొనాలన్నా, పెరుగుకొనాలన్నా క్యూలను తప్పించుకోలేము. ధరాభారం లేకపోవడంవల్లనో, మళ్ళీ ఈ చలిలో బయటకు రావడం ఎందుకనో, అవసరంవున్నా లేకపోయినా ప్రతివస్తువును దొరికినప్పుడే కొనుక్కోవడం మంచిదనో కారణం ఏదయితేనేమి కానీ ప్రతిచోటా పెద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తాయి. ఉత్పాదక వ్యయంతో నిమిత్తం లేకుండా ప్రజల అవసరాలనుబట్టి ధరలను బాగా అదుపులో వుంచడంవల్ల కొనుగోలు శక్తి బాగా పెరిగిపోయి, వారు చేసే అనవసర కొనుగోళ్ళతో కృత్రిమ కొరతలు ఏర్పడి, ఏది ఎప్పుడు దొరుకుతుందో తెలియని పరిస్తితి ఏర్పడిందని మాస్కోలో చాలా కాలం నుంచి వుంటున్న మా తోటి ఉద్యోగులు చెబుతుండేవారు. మాటవరసకు పాల విషయమే తీసుకుందాం. ప్రతి నివాసానికి చేరువలోనే పాలు, పాల ఉత్పత్తులు అమ్మే ‘ప్రోదుక్తి’ దుకాణం వుంటుంది. పాలు లీటరు ముప్పయి కోపెక్కులు. ఇంత చలిలో మళ్ళీ ఏం వస్తామనుకునే బద్దకస్తులు అవసరానికి మించి కొనుగోలుచేసేవారు. వాడకానికి పోను మిగిలిన పాలను డస్ట్ బిన్ లో పారేసి మర్నాడు మళ్ళీ కొనుక్కునేవాళ్లను చూసాము. ధర బహు తక్కువగా వుండడం వల్ల ఇలా దుబారా జరుగుతోందని చెప్పుకునేవాళ్ళు. అలాగే పెట్రోలు. లీటరు పాల ధర, లీటరు పెట్రోలు ధర ఒకటే విధంగా వుండడం ఆ దేశంలోనే చెల్లు. ట్యాంకు నిండిన తరవాత పెట్రోలు లీటర్లకు లీటర్లు కారిపోతున్నా చోద్యం చూస్తూ నిలబడేవాళ్ళు, ఒకటో రెండో రూబుళ్ళు అదనంగా విదిలిస్తే పోలా అనుకునేవాళ్ళు అక్కడే కానవస్తారు.

అక్కడ ప్రతివారు ఒక చేతి సంచిని సిద్ధంగా దగ్గరవుంచుకుంటారు. వీధిలోకి వెడితే ఎప్పుడు ఏది దొరుకుతుందో తెలవదు. క్యూ పొడుగ్గావుంటే చాలు అక్కడ ఏమి అమ్ముతున్నారన్నదానితో నిమిత్తం లేకుండా వెంటనే అందులో దూరిపోతారు. జనం బాగా వున్నారంటే క్యూబానుంచి దిగుమతి చేసుకున్న అరటి పండ్లో లేక ఇంకా అపురూపమయిన టమాటాలో అక్కడ అమ్మకానికి పెట్టారనుకోవచ్చు. టమాటాలు కనబడితే కిలోలకు కిలోలు కొనేస్తారు. వాటిని ఇంటికి చేర్చడానికి పడే ప్రయాస ఆ క్షణంలో ఎవరికీ గుర్తు వుండదు.ఎందుకంటె అవి ఏడాది పొడుగునా దొరికేవికావు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ తో పాటు పెద్ద పెద్ద డీప్ ఫ్రిజ్ లు కూడా వుంటాయి. ఇలా కొనుక్కొచ్చిన టమాటాలను వాటిల్లో భద్రం చేస్తుంటారు. అవి గట్టిపడి రాళ్ళ మాదిరిగా తయారవుతాయి. టమాటాలు దొరకని రోజుల్లో వాటిని బయటకు తీసి వేడి నీటిలో ఉడకపెట్టుకుని వంటల్లో వాడుకుంటూ వుంటారు.

ఇక ఇండియన్లకు, ప్రత్యేకించి దక్షిణాది శాకాహారులకు సంబంధించి ప్రధాన సమస్య రోజూ తినే బియ్యం. రష్యన్ బియ్యం బాగా మొద్దుగా వుంటాయి. చూడడానికి ఇంపుగా వుండకపోవడమే కాకుండా వాటితో వండిన అన్నం నోటికి హితవుగా వుండదు. అందుకే ఏ షాపులోనయినా ఇండియా నుంచి వచ్చిన బియ్యం అమ్ముతున్నారని తెలిస్తే అందరూ ఒకరికొకరు ఫోన్లు చేసుకుని ఆ షాపుపై ఎగబడేవారు.దీనికి సంబంధించి ఒక జోకు ప్రచారంలో వుండేది. మాస్కోలోని బారత రాయబారి కార్యాలయానికి కొత్తగా ఓ ఉన్నతాధికారి వచ్చారు. ప్రతి రోజూ ఉదయం జరిగే అధికారుల సమావేశానికి ఒకరు ఆలస్యంగా వచ్చారు. కొత్త అధికారి పాత అధికారిని ఆలస్యానికి కారణం అడిగారుట. దోవలో ఒక షాపులో బియ్యం అమ్ముతున్నారని తెలిసి అక్కడ ఆగడం వల్ల ఆలస్యం అయిందని ఆయన వివరణ ఇచ్చారుట. అంతే, ఆ మీటింగులో ఒక్కరు వుంటే ఒట్టు. అందరూ ఒక్క పెట్టున లేచి పొలోమని ఆ దుకాణం వైపు పరిగెత్తారట.(03-03-2011)

2, మార్చి 2011, బుధవారం

క్రెడిట్ కార్డు మోసాలు – బ్యాంకుల బాధ్యత - భండారు శ్రీనివాసరావు

క్రెడిట్ కార్డు మోసాలు – బ్యాంకుల బాధ్యత - భండారు శ్రీనివాసరావు


ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదు కానీ, ఓ నలభయ్ ఏళ్ళ క్రితం ప్రతి హోటల్ ముందు ఒక బోర్డు వేలాడదీసేవారు. “మీ సైకిళ్ళకు మా పూచీ లేదు. మీ సొంత బాధ్యతపై పెట్టుకోవాలి-ఇట్లు హోటల్ యాజమాన్యం” అని దానిపై రాసివుండేది.

అలాగే ఇప్పుడు క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు కూడా ఇదే పరిస్తితి. ఏది జరిగినా మీదే బాధ్యత. ఎందుకంటె ఎలాటి అవకతవకలు జరిగినా ఆ క్రెడిట్ కార్డులు జారీ చేసిన బ్యాంకులు  ఆ విషయంలో ఏమాత్రం బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేవు.

ఈమధ్య ఒక సర్వే జరిపారు. క్రెడిట్ కార్డు భద్రత విషయంలో భారత దేశంలోని బ్యాంకులు  ఏవిధమయిన ముందస్తు చర్యలు తీసుకోవడం లేదన్నది ఆ సర్వే సారాంశం. కార్డు వినియోగదారులు బ్యాంకులకు తెలియచేసే వ్యక్తిగత సమాచారం సమాచారాన్ని గోప్యంగా వుంచే విషయంలో కూడా బ్యాంకులు  ఏరకమైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని ఆ సర్వేలో వెల్లడయింది. క్రెడిట్ కార్డుల లావాదేవీల భద్రత పట్ల కూడా బ్యాంకులు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని  ఆ సర్వే ద్వారా తెలియవచ్చింది.

‘క్రెడిట్ కార్డు మోసాలు’ గురించి అనేకరకాల వార్తలు ప్రతిరోజూ బయటపడుతున్న నేపధ్యంలో – మన దేశంలోని చాలా బ్యాంకులు - కార్డు భద్రతతకు సంబంధించి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని – ఈ సర్వే నిర్వహించిన సంస్తలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వ సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో భారత డేటా కౌన్సిల్, కేపీఎంజి సంయుక్తంగా ఈ సర్వే జరిపాయి. దేశంలోని ఇరవై ప్రభుత్వ రంగ బ్యాంకులు, వాటికి సంబంధించిన ప్రధాన సమాచార భద్రతను పర్యవేక్షించే  అధికారులను  ఈ సర్వే నిర్వహించినవారు ప్రశ్నించి వివరాలు  రాబట్టారు.

మోసాలకు ఆస్కారమిచ్చే పాత, కాలం చెల్లిన విధానాలనే భారతీయ బ్యాంకులు  ఇంకా అనుసరిస్తున్నాయని సర్వే తెలిపింది. క్రెడిట్ కార్డుల మోసాల్లో ముఖ్యంగా ప్రధాన భూమిక వహించే సీ వీ వీ నెంబర్లు, కార్డుల చెలామణీ ముగిసిపోయే తేదీల వివరాలను భద్రపరిచే విషయంలో బ్యాంకులు అనుసరిస్తున్న పద్ధతులు ప్రామాణికంగా లేవని సర్వే వెల్లడించింది. కార్డు భద్రతకు సంబంధించి అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా లేవని తేల్చిచెప్పింది.

అయితే, చాలాబ్యాంకులు - కార్డుపై లావాదేవీ జరిగిన వెంటనే ఆ వివరాలను ఆయా ఖాతాదారులకు వెనువెంటనే ఎస్ ఎం ఎస్ ద్వారా తెలియచేస్తూ వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నప్పటికీ, ఇది ఒక్కటీ ఎంతమాత్రం సరిపోదన్నది సర్వే తాత్పర్యం.

ఎందుకంటె, ఎలెక్ట్రానిక్ కార్డు పేమెంట్ సిస్టం ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు వినియోగదారుడికి చెందిన  వ్యక్తిగత సమాచారం సర్వీసు ప్రొవైడర్లకు, లేదా లావాదేవీలతో సంబంధంవున్న ఇతర భాగస్వామ్య వ్యాపార సంస్తలకు నేరుగా చేరే అవకాశం వుంటుంది. కాకపొతే ఇటువంటి సమీకృత విధానం లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ వుండడంవల్ల వినియోగదారులు వీటిల్లో వుండే ‘రిస్క్’ ను గురించి అంతగా పట్టించుకోవడం లేదు. ఖాతాదారులకు తెలియకుండా ఖాతాల్లోని డబ్బును వేరే ఖాతాలకు మళ్ళించుకోవడానికి ఈ సమాచారం చాలా చక్కగా వుపయోగపడుతుంది.

ఖాతా ప్రారంభించిన వెంటనే పాస్ వర్డు మార్చుకోవడం, ఖాతాను వినియోగదారుడి అభ్యర్ధనపై తాత్కాలికంగా స్తంభింప చేయడం, ఆన్ లైన్ బ్యాంకింగు లో ఖాతాదారులు వాడుకునే సమయాన్ని కుదించడం మొదలయిన కొన్ని చర్యలు భారతీయ బ్యాంకులు  ఇప్పటికే అమలుచేస్తున్నాయి. ఒక నిర్దిష్ట వ్యవధి తరవాత పాస్ వర్డులను మార్చాల్సిన  అవసరాన్ని గురించి వినియోగదారులను జాగృతం చేయాల్సిన అవసరం వుందని సర్వే పేర్కొంటోంది. అధ్యయనం చేసిన బ్యాంకుల్లో ముప్పయ్యేడు శాతం బ్యాంకులు ఎక్స్ టర్నల్ అప్లికేషన్లను, మొబైల్ కోడ్ లను డౌన్ లోడ్ చేసుకునే వ్యవస్తలను ఏర్పాటు చేసుకోలేదని, వీటివల్ల మోసాలను అరికట్టే అవకాశాలను ఈ బ్యాంకులు దూరం చేసుకుంటున్నాయని సర్వే అభిప్రాయపడింది.

ఆన్ లైన్ బ్యాంకింగ్ లో భద్రతను పరిరక్షించడం అన్నది తమకు సవాలుగా మిగిలిపోతోందని సర్వే లో సమాధానాలు ఇచ్చిన బ్యాంకుల సమాచార భద్రతాధికారులు చెప్పారు. అలాగే, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కకుండా చూడడం అనేది మరింత క్లిష్టంగా వుంటోందని కూడా వారు అభిప్రాయపడ్డారు.

వ్యక్తిగత సమాచార గోప్యతకు సంబంధించి - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ చట్టం – 2008 లో అనేక నిబంధనలు పొందుపరచడం జరిగింది కానీ, వాటికి సంబంధించి నిర్దిష్టమయిన వ్యవస్తలను అనేక బ్యాంకులు ఇంకా ఏర్పాటుచేసుకున్న దాఖలాలు లేవు. సర్వే చేసిన బ్యాంకుల్లో దాదాపు ఎనభయ్ శాతం బ్యాంకుల్లో సమాచార గోప్యతకు సంబంధించి విడిగా ఏవిధమయిన ఏర్పాట్లు లేని విషయం ఈ సర్వేలో తేలింది. నాలుగింట మూడువంతుల బ్యాంకుల్లో సెక్యురిటీ టీముల్లో పనిచేసేవారి సంఖ్య పదికంటే తక్కువగావుంది.

అత్యంత ఆధునికమయిన వ్యవస్తీకృత పద్ధతులతో బ్యాంకులను మోసంచేసే ప్రమాదకర పరిస్తితిని బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కుంటోందని సర్వే తెలిపింది. అలాగే, వినియోగదారులు సయితం ఆన్ లైన్ బ్యాంకింగ్ విధానం లో తమ డబ్బు ఏపాటి సురక్షితం అన్న ఆందోళనతో వున్నట్టు సర్వే సూచిస్తోంది.

పరిస్థితులు ఇలా వున్నప్పటికీ,  మోసం జరిగిన సంగతిని కస్టమర్లు, లేదా సిబ్బంది తెలియచేసిన తరవాతనే తదనంతర చర్యలకు ఉపక్రమించే స్తితిలో చాలా  బ్యాంకులు వుండడం విషాదకరమని సర్వే పేర్కొన్నది. మోసం జరిగిన వెంటనే దాన్ని తమంత తాముగా కనుక్కునే యంత్రాంగాన్ని బ్యాంకులు ఏర్పాటు చేసుకోలేదని సర్వే తెలిపింది.  

ఈనాటి డిజిటల్ యుగానికి తగినట్టుగా, బ్యాంకులు అంతర్గత నిర్వహణ వ్యవస్తలను మేరుగుపరుచుకోలేదన్న విషయం కూడా ఈ సర్వేలో వెల్లడయింది. సెక్యూరిటీ విషయంలో ఉదాసీనంగా వుండడంవల్లనే, బ్యాంకుల్లో తరచుగా ఆర్ధిక పరమయిన మోసాలు జరుగుతున్నాయని సర్వే అభిప్రాయపడింది.

సమాచార భద్రత అన్నది తమకు సంబంధించిన అంశంగా భారతీయ బ్యాంకులు భావించడం లేదనీ, అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన విషయంగా పక్కనపెడుతున్నాయని సర్వే పేర్కొన్నది. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ వ్యవస్తలు అనుసరిస్తున్న విధానానికి ఇది వ్యతిరేకమని సర్వే అభిప్రాయపడింది. అయితే, సర్వే మొత్తంలో ఒక్క మంచి విషయం కూడా లేదని అనుకోనక్కరలేదు. బ్యాంకుల నడుమ డబ్బు బదిలీ విషయంలో భారతీయ బ్యాంకులు తగిన సెక్యూరిటీ పద్ధతులు పాటిస్తున్నాయని చక్కటి కితాబు ఇచ్చింది.

కార్డు నెంబర్లను, ఇతర వ్యక్తిగత రహస్య సమాచారాన్ని భద్రపరిచే సందర్భాల్లో బ్యాంకులు కోడింగ్ విధానాన్ని పాటిస్తున్నాయి. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం గట్టిగా నొక్కిచేబుతున్న డాటా భద్రత ప్రాధాన్యం గురించిన అవగాహన లోపం బ్యాంకుల్లో కానవస్తోందని ఐ టీ మంత్రిత్వశాఖకు చెందిన డిఎస్ సీఐ సీ.ఈ.ఓ. డాక్టర్ కమలేష్ బజాజ్ చెప్పారు.

పటిష్టమయిన భద్రతా వ్యవస్తలను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకులకు నిధుల కొరత లేదు. వీటిపట్ల దృష్టి సారించకపోవడానికి ప్రధాన కారణం, వాటి నడుమ వున్న పోటీ తత్వం. ఏదోవిధంగా కష్టమర్లకు సులభమయిన, సుఖప్రదమయిన బ్యాంకింగ్ సర్వీసులను అందచేయడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవడం ఒక్కటే వాటి ముందు వున్న ప్రధాన లక్ష్యం. అందువల్ల భద్రతకు సంబంధించి ఎంతో కొంత రాజీ పడాల్సిన పరిస్తితి. భద్రత పేరుతొ బ్యాంకింగ్ లావాదేవీలను మరింత క్లిష్టం చేస్తే సంతోషించే కష్టమర్లు వుండరన్నది వాటి అభిప్రాయం కావచ్చు. అయినప్పటికీ, తమ ఖాతాదారులకు భద్రతా ప్రమాణాల ప్రాధాన్యతను వివరించి, నచ్చచెప్పి, ఒప్పించాల్సిన బాద్యత బ్యాంకులపై వుందని సర్వే సలహా ఇచ్చింది.ఇప్పటికే, కొన్ని బ్యాంకులు ఆన్ లైన్ బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు వీలుగా  వినియోగదారులను జాగృతం చేసే దిశగా ప్రచారం చేస్తున్న విషయాన్ని సర్వే పేర్కొన్నది. దీన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరాన్ని ఆ సర్వే  ప్రస్తావించింది. (02-03-2011)



26, ఫిబ్రవరి 2011, శనివారం

రైల్వే బడ్జెట్ – భండారు శ్రీనివాసరావు


రైల్వే బడ్జెట్ – భండారు శ్రీనివాసరావు


ఏ బడ్జెట్ అయినా – అది సార్వత్రిక బడ్జెట్ కానివ్వండి లేదా రైల్వే బడ్జెట్ కానివ్వండి అది రెండురకాలుగా కనిపిస్తుంది. అధికార పక్షం వారికి ‘ఆహా ఓహో’ బడ్జెట్ అయితే ప్రతిపక్షం వారికి ‘అంకెల గారడీ’ బడ్జెట్. కానీ ఈ రెండు కళ్ళే కాదు ‘మూడో కన్ను’ మరోటి వుంది. అది ప్రజలది.

మొన్నటికిమొన్న అసెంబ్లీలో ఆర్ధికమంత్రి రామనారాయణరెడ్డి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోనే కొత్త పన్నులువేసే పద్ధతికి ఏనాడో ప్రభుత్వాలు స్వస్తి చెప్పేశాయి కనుక, రాష్ట్ర బడ్జెట్ గురించి గతంలో వున్న ఆసక్తి ఈనాడు జనంలో లేనట్టే లెక్క. అయినా ప్రభుత్వ, ప్రతిపక్ష నాయకులందరూ తమ విద్యుక్త ధర్మానుసారం బడ్జెట్ మంచిచెడ్డలు గురించి వ్యాఖ్యానాలు గుప్పించారు.ముందే చెప్పినట్టు అధికార పక్షం వాళ్ళు బడ్జెట్ ‘అద్భుతం’ అన్నారు. విపక్షంవాళ్ళు ‘కొత్త సీసాలో పాతసారా’ వంటి పాతపల్లవులనే సరికొత్తగా వినిపించారు. అయితే, విద్యార్ధుల ఫీజు రీ ఇంబర్స్ మెంట్ వంటి సంక్షేమ పధకాలకు బడ్జెట్ లో అరకొరగా చేసిన కేటాయింపుల విషయం సమర్ధించుకోవడానికి ప్రభుత్వ పక్షాన మీడియాతో మాట్లాడిన వాళ్ళు తలలు పట్టుకోవాల్సివచ్చింది.

పోతే, నిన్నటికి నిన్న మమతా బెనర్జీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ద్వారా - కన్నతల్లి ‘బెంగాల్ మాత’ పాల రుణం తీర్చుకున్నారు. ఆమె కళ్ళకు బెంగాల్ తప్ప మరోటి కనిపించదన్న అపవాదును మోయడానికే ఆమె సిద్ధపడ్డారు. నిజానికి ఆమె చూపు రానున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలమీదా, వాటిల్లో గెలుపు సాధించడం ద్వారా దక్కించుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి పీఠం మీదా వుందన్న నిజాన్ని ఆమె దాచిపెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే ఈసారి రైల్వే బడ్జెట్ ను ‘తూర్పు వెళ్ళే రైలు’ ఎక్కించడానికి మమతా బెనర్జీ ఎంతమాత్రం సంకోచించలేదు. ఆ రాష్ట్రంలో గత 34 ఏళ్లుగా అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్న ‘ఎర్రదండు’ పాలనకు శ్రీమతి బెనర్జీ ఎర్ర జెండా చూపగలదేమో అన్న ఆశతో వున్న యుపీఏ నాయకులు కూడా ఆవిడ ప్రతిపాదించిన బెంగాల్ బడ్జెట్ కు పచ్చజెండా వూపినట్టుగా అనుకోవాల్సి వస్తున్నది. శుక్రవారం నాడు బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆమె చేసిన గంటన్నర ప్రసంగంలో పశ్చిమ బెంగాల్ పై వరాలవర్షం కురిపించి అందరూ ఆశ్చర్యంతో ‘హౌరా’ అని నోళ్ళు వెళ్ళబెట్టేట్టు చేసారు. మధ్యలో అడ్డుతగిలిన మాజీ రైల్వే మంత్రి లాలూపై ఆడపులిలా తిరగబడ్డారు. పైపెచ్చు బెంగాల్ చెందినందుకు నేనెంతో గర్వపడుతున్నానని ప్రకటించి విమర్శకుల నోళ్లకు తాళం వేసారు. సింగూరులో మెట్రో కోచ్ ఫాక్టరీ, డార్జిలింగ్ లో సాఫ్ట్ వేర్ ఎక్సేలెన్సీ సెంటర్, కోల్ కతాకు ఇంటిగ్రేటెడ్ సబర్బన్ నెట్ వర్క్, అక్కడి మెట్రో కు 34 కొత్త సర్వీసులు – ఇలా వరాల వాన కురిపించారు. లోగడ రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ – తన అధికారాన్ని ఉపయోగించి అత్తవారి వూరికి ఏకంగా ఒక రైలును వేయగాలేనిది ఇప్పుడు తాను చేసిన దాంట్లో తప్పు పట్టాల్సింది ఏముంది అన్న రీతిలో మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ను రూపొందించి పుట్టింటిపై  ప్రేమను బాహాటంగా ప్రదర్శించి చూపారు. సొంత రాష్ట్రానికి, సొంత జనానికి ఏమి చేస్తే ఏమి తప్పుపడతారో అని సంకోచించే నిత్య శంకితులకు ఇది కనువిప్పే.

ఇక, లోకసభలో 32 మంది అధికారపక్ష సభ్యులున్న ఆంధ్ర ప్రదేశ్ కి రైల్వే బడ్జెట్ లో దక్కిన వాటా ఎంత అని ఆలోచించుకుంటే, కడుపుచించుకుంటే కాళ్ళమీద పడ్డట్టయిందన్న చందానవుంది.

ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు అన్నట్టు లోక సభ సభ్యుడు ఎవరయినా రైల్వే మంత్రిని కలిసినప్పుడు, తన నియోజక వర్గం సమస్యలు తీర్చాలని మాత్రమే మహజరులు సమర్పిస్తారు. ఇవి ఎక్కువగా, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు గురించో, లేక ఫలానా స్టేషనులో ఫలానా రైలుకు ‘స్టాప్’ ఏర్పాటు చేయాలనో – ఇలా చాలావరకు స్తానిక సమస్యలపైనే వుంటాయి. మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కలగచేసుకుని ముందుగా తమ అవసరాలను రైల్వే మంత్రికి తెలియచేసుకోవాల్సి వుంటుంది. నిజానికి ఈ విషయంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా తమ కోరికల చిట్టాలను ఏటా రైల్వే మంత్రికి అందచేస్తూనే వుంటారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కిందటి నెలలోనే ఢిల్లీ లో మమతాబెనర్జీ ని కలుసుకుని కొన్ని కీలక ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రానికి కొత్తగా 35 రైళ్ళు కావాలని కోరారు. వీటిలో పదిహేడు ఎక్స్ ప్రెస్ రైళ్ళు వున్నాయి. కానీ, రైల్వే మంత్రి వాటికి మొండి చేయి చూపారు. కాకపొతే, పాసింజర్ రైళ్ళు, ఎం ఎం టి ఎస్ రైళ్ల విషయంలో ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనలను చాలావరకు మమతా బెనర్జీ మన్నించినట్టే కానవస్తున్నది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో గద్వాల-మాచర్ల, కొండపల్లి-కొత్తగూడెం, ప్రొద్దుటూరు-కంభం ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కోరినా, బడ్జెట్ లో వీటి ప్రస్తావన లేదు. అలాగే, సర్వే కూడా పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రస్తావించారు కానీ, రైల్వే మంత్రి వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రానికి సంబంధించి ఈసారి బడ్జెట్ లో ప్రతిపాదించిన కొన్ని ప్రాజెక్టులు నిజానికి పదేళ్ళనాటివి. వాటినే ఇప్పుడు కొత్త ప్రాజెక్టులుగా బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రస్తావించారు.

ఏదిఏమయినా, ఈసారి రాష్ట్రానికి అనుకున్న రీతిలో రైల్వే మంత్రి న్యాయం చేయకపోయినా కిందటిసారి మాదిరిగా పూర్తిగా అన్యాయం చేసారని చెప్పలేము. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, రోజురోజుకూ మారిపోతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, అధికార పార్టీలోనే వినిపిస్తున్న ధిక్కార స్వరాలూ, కారణాలు ఏమయినా రైల్వే బడ్జెట్ పై ఎంతోకొంత ప్రభావం చూపాయనే అనుకోవాలి. అందువల్లే మమతా ఎక్స్ ప్రెస్ రవంతసేపు రాష్ట్రంలో ఆగిన అనుభూతిని రైల్వే మంత్రి ప్రసంగం మనకు మిగిల్చింది.

సికింద్రాబాద్- విశాఖల నడుమ వారానికి మూడుసార్లు నడిచే దురంతో ఎక్స్ ప్రెస్, పుణే – సికింద్రాబాదుల మధ్య రోజూ నడిచే శతాబ్ది ఎక్స్ ప్రెస్ వంటి అనేక కొత్త రైళ్లకు బడ్జెట్ లో ప్లాట్ ఫారం దొరికింది. టీవీ స్క్రోలింగ్ లలో కనబడ్డ ఈ కొత్త రైళ్ల న్నీ పట్టాలు ఎక్కినప్పుడే జనాలకు వూరట.

అలాగే 17 కొత్త రైల్వే లైన్లు సర్వే చేయడానికి అనుమతి లభించింది. హైదరాబాద్ ఎం ఎం టి ఎస్ రెండోదశకు పచ్చ జెండా వూపారు. మూడు కొత్త రైల్వే లైన్లు రాష్ట్రానికి మంజూరు చేసారు. రైలు ప్రమాదాలను నివారించడానికి ఉద్దేశించిన ‘యాంటీ కొలిజన్ డివైజ్’ ను దక్షిణ మధ్య రైల్వే లో కూడా ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సగం ఖర్చు భరించే పద్ధతిలో, మూడువేల మూడువందల కోట్ల రూపాయల అంచనా వ్యయం కలిగిన నాలుగు కొత్త ప్రాజెక్టులను ఈ బడ్జెట్ లో మంజూరు చేసారు. అలాగే, ఎన్నేళ్ళబట్టో అంతా ఎదురుచూస్తున్న కాజీపేట వాగన్ ఫాక్టరీ.

ముందే చెప్పినట్టు ఈ బడ్జెట్ ని ప్రజల దృక్కోణంలో నుంచి పరిశీలిస్తే ఒకింత వూరట కలిగించే పద్ధతిలో వుందనే చెప్పాలి. వాళ్ళమీద కొత్త భారాలేవీ మోపలేదు. టిక్కెట్ల ధరను వరసగా మూడో ఏడు కూడా పెంచకపోవడం హర్షనీయం. అలాగే కొద్దో గొప్పో తగ్గించిన రిజర్వేషన్ చార్జీలు. సీనియర్ సిటిజన్ లకు ఇచ్చే రాయితీని 30 నుంచి 40 శాతానికి పెంచడం. ఆ చేత్తోనే, మహిళలకు 58 ఏళ్ళ నుంచే ఈ సదుపాయం వర్తింప చేయడం. రాజధాని,శతాబ్ది వంటి రైళ్ళలో కూడా వికలాంగులకు రాయితీ తో కూడిన ప్రయాణ సదుపాయం, పోస్ట్ ఆఫీసుల్లో కూడా టికెట్ రిజర్వేషన్ కౌంటర్లు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన కూడా ఆహ్వానించదగ్గదే. పాసింజర్ రైళ్ల సంఖ్యను పెంచడంవల్ల ప్రయోజనం పొందేది సామాన్యులే అన్నది కూడా ఇక్కడ గమనంలో వుంచుకోవాలి. ఎందుకంటె రైల్వే లకు మొదటి రూపాయి చెల్లించేది సాధారణ ప్రయాణీకులే.

‘ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ ‘ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా లేదా అనే డౌటు’ ప్రయాణీకులకు లేకుండా చేయగలిగితే ఆ బడ్జెట్ సార్ధకమైనట్టే లెక్క. (26-02-2011)





23, ఫిబ్రవరి 2011, బుధవారం

వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు


వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు

“నిద్రపోతూ కలలు కనడం అన్నది జీవితంలో సాధారణ విషయం. కన్న కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం శ్రమించడం సాధకుల జీవితం.”


“బాల్యంలో ఒక్క చెమట చుక్కను ధారపోసినా అది ముసలితనంలో పది కన్నీటి చుక్కలు రాలకుండా చేస్తుంది.”


“నన్ను ద్వేషించే వాళ్ళను ద్వేషించే వ్యవధానం నాకు లేదు. ఎందుకంటే నన్ను ప్రేమించే వాళ్ళను ప్రేమించడానికే ఎక్కడి సమయం సరిపోవడం లేదు.”


“సంకుచిత మనస్కులు ఇరుగుపొరుగువారిని గురించి మాట్లాడుకుంటారు. పెద్దమనసున్న వాళ్ళు ఇరుగుపొరుగు ఎదుర్కునే సమస్యల పరిష్కారం గురించి మాట్లాడుకుంటారు.”


“సానుకూల దృక్పధం కలిగినవారిని ఎలాటి విషం ఏమీచేయలేదు. ప్రతికూల మనస్తత్వం వున్నవారిని ఏ వైద్యుడు బాగుచేయలేడు.”


“మీ జీవితంలో మీరు ఎక్కువ సమయం గడిపేది ఎవరితోనో తెలుసా? అదెవరో కాదు. మీరే.”


“అదృష్టం అన్నది మీ చేతుల్లో వుండదు. కానీ పని చేయడం అనేది మీ చేతుల్లోనే వుంటుంది. మీరు చేసే పనివల్ల మిమ్మల్ని అదృష్ట దేవత పలకరించవచ్చు. కానీ అదృష్టం మాత్రం మీరు చేయాల్సిన పని ఎన్నటికీ చేయలేదు.”


“ఈ ప్రపంచంలో రెండే రెండు విలువయిన ప్రదేశాలు వున్నాయి. ఒకరి ఊహల్లో లేదా ఆలోచనల్లో మనం వుండగలగడం జరిగితే అంతకంటే మధురమయిన ప్రదేశం మరోటి వుండదు. అల్లాగే ఒకరి హృదయంలో మనం వున్నామంటే దానికంటే భద్రమయిన స్తానం ఇంకొకటి వుండదుగాక వుండదు.”


“జీవితంలో విషాదం ఏమిటంటే అది అంత త్వరగా ముగిసిపోవడం. దాన్ని తిరిగి మొదలుపెట్టడానికి ఎంతో కాలం వేచివుండాల్సిరావడం కూడా అంతే విషాదం.”


“ఒక్క క్షణం ఆగ్రహాన్ని అణచి పెట్టుకోగలిగితే, ఆ తర్వాత వంద రోజుల దుఃఖాన్ని దూరం చేసుకోగలుగుతాం.”

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

‘ఇంక్రెడిబుల్ ఇండియా’ - భండారు శ్రీనివాసరావు

‘ఇంక్రెడిబుల్ ఇండియా’ - భండారు శ్రీనివాసరావు


‘ఇంక్రెడిబుల్ ఇండియా’ (నమ్మ శక్యం కాని భారత దేశం) అని టూరిజం శాఖ వాల్ పోస్టర్లలో ప్రముఖంగా కానవస్తుంటుంది. ఒక విధంగా ఇది పచ్చినిజమేనేమో అనిపిస్తుంది ఈ మధ్య అందుకున్న ఒక ఎస్ ఎం ఎస్ ని చదివిన తరవాత. దాంట్లో ఏముందంటే:

ఈ దేశంలో-
అవసరమై ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో ఎవరూ చెప్పలేరుకాని పిజ్జా ఆర్డర్ చేస్తే మాత్రం ఆఘమేఘాలమీద ఇంటికి చేరుతుంది.

ఈ దేశంలో –
ఎనిమిది శాతం వడ్డీపై కారు రుణం ఇవ్వడానికి అన్ని బ్యాంకులు బారులు  తీరి నిలబడతాయి. అదే పిల్లల పైచదువులకోసం రుణం కావాలంటే అవే బాంకులు పన్నెండు శాతం వడ్డీ ముక్కు పిండి వసూలు చేస్తాయి.

ఈ దేశంలో-
ఓ కిలో ఉల్లిపాయల ధర ఇరవై నాలుగు రూపాయలు. సెల్ ఫోన్ లో వేసుకునే సిమ్ కార్డ్ మాత్రం పూర్తిగా ‘ఉచితం’

ఈ దేశంలో –
జీవకారుణ్యం గురించి గంటలు గంటలు మాట్లాడే వాళ్ళు ఎక్కడబడితే అక్కడ కానవస్తారు. కానీ, తల్లి గర్భంలో ప్రాణం పోసుకున్న శిశువు ఆడదని తెలిస్తే మాత్రం అరనిమిషం కూడా ఆలోచించకుండా కడుపులో పిండాన్ని కడుపులోనే చిదిమేయాలని అనుకుంటారు.

ఈదేశంలో -
ఒలింపిక్ పోటీల్లో పసిడి పతకం సాధించిన ‘షూటర్’ ను ప్రభుత్వం మూడు కోట్ల రూపాయల నగదు బహుమతితో సత్కరిస్తుంది. అదే, టెర్రరిస్టులను షూట్ చేసి ఆ పోరాటంలో అసువులుబాసిన అమరవీరుల కుటుంబాలకు లక్ష రూపాయలు ఇవ్వడానికి ముందూ వెనకా చూస్తుంది.
మరి నిజంగా ఇది-
– ‘ఇంక్రెడిబుల్ ఇండియా’ – ఔనా!





12, ఫిబ్రవరి 2011, శనివారం

విశ్వాసమా! విలీనమా! - భండారు శ్రీనివాసరావు

విశ్వాసమా! విలీనమా! - భండారు శ్రీనివాసరావు


ఎన్నికల సీజనులో అవసరార్ధం ‘తోక పార్టీలు’ పుట్టుకొస్తుంటాయి. ఒక్కోసారి అసలు పార్టీలకన్నా ఈ తోక పార్టీల హవా ఎక్కువగా వుంటుంది. తోక పదం బాగాలేదనుకున్నారో ఏమో కానీ ఈ మధ్య వీటిని బ్రాంచ్ ఆఫీసులని పిలుస్తున్నారు. కాంగ్రెస్ ను మధ్య పెట్టుకుని, టీ ఆర్ ఎస్, టీ డీ పీ నడుమ సాగిన ఈ బ్రాంచ్ ఆఫీసుల గొడవ మీడియా పుణ్యమా అని గంటల్లోనే ముదిరిపోయి, చివరకి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మెడకు చుట్టుకునేలావుంది.

కాంగ్రెస్, టీ ఆర్ ఎస్ నడుమ లోపాయకారీ వొప్పందం వున్నట్టు తెలుగుదేశం నాయకుడు ఒకరు చేసిన ఆరోపణ- టీ ఆర్ ఎస్ అధినేతను ఎక్కడ తాకకూడదో అక్కడే తాకింది. టీ ఆర్ ఎస్ పార్టీ, కాంగ్రెస్ కు బ్రాంచ్ ఆఫీసుగా తయారయిందని టీ డీ పీ చేసిన ఆరోపణనీ, చిరంజీవి తరహాలోనే టీ ఆర్ ఎస్ కూడా కాంగ్రెస్ లో కలిసిపోతుందని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు పదేపదే చేస్తున్న ప్రకటనలను ఆయన జీర్ణించుకోలేకపోయారు. మాటల తూటాలు పేల్చడంలో చంద్రశేఖరరావుని మించిన రాజకీయ నాయకుడు రాష్ట్రంలో మరొకరు లేరు. తనదయిన తరహాలోనే ఆయన తెలుగుదేశం పార్టీకి ఓ సవాలు విసిరారు. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయి, సీమాంధ్రలో జగన్ కు చెక్ పెట్టడానికీ, ఇటు తెలంగాణా వాదాన్నిదెబ్బతీయడానికీ లోపాయకారీ వొప్పందం కుదుర్చుకున్నారని ప్రత్యారోపణ చేసారు. వచ్చేవారం మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాల్లో, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెడతామని, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా చెప్పుకుంటున్న టీ డీ పీకి ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా ఆ తీర్మానాన్ని సమర్ధించాలంటూ చంద్రశేఖరరావు బంతిని మళ్ళీ టీడీపీ కోర్టులోకే గిరాటు వేసారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీ డీ పీ కి ఈ సవాలుతో గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రధాన ప్రతిపక్షంగా దాన్ని సమర్ధించాల్సి వస్తుంది. టీడీపీ మద్దతు వుంటే తీర్మానం నెగ్గడం ఖాయం. నెగ్గితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం మరింత ఖాయం. ప్రభుత్వం పడిపోయి రాష్ట్రపతి పాలన వొచ్చినా, లేక మరికొన్నాళ్లకు మధ్యంతర ఎన్నికలు వచ్చినా దానివల్ల ఇటు తెలుగు దేశానికి కానీ, అటూ కాంగ్రెస్ కు కానీ ఒరిగేదేమీ వుండదు. ఆ పార్టీలనుంచి ఎన్నికయిన వారెవ్వరూ ఇంత త్వరగా మరో మారు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. ఎన్నికలంటూ వస్తే కొద్దో గొప్పో ఉపయోగం జగన్ పెట్టబోయే పార్టీకి కానీ, తెలంగాణలో టీ ఆర్ ఎస్ కు కానీ వుంటుంది. ఇవన్నీ గ్రహించిన టీడీపీ నాయకులు నష్ట నివారణ ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే టీ ఆర్ ఎస్ కు కనీసం ముప్పయి మంది శాసన సభ్యుల బలం వుండాలని, కేవలం పదకొండుమంది సభ్యులను పెట్టుకుని చేతకాని సవాళ్లు విసురుతోందనీ వాళ్ళు ఎదురుదాడి ప్రారంభించారు. ఈ వాద ప్రతివాదాలు ప్రకటనల వరకే పరిమితం అయితే పరవాలేదు. కానీ, అసెంబ్లీ దాకా చేరినప్పుడు పరిణామాలు ఆసక్తికరంగానే కాకుండా, అనూహ్యంగా కూడా వుండే అవకాశం వుంటుంది.(12-02-2011)