17, ఆగస్టు 2010, మంగళవారం

మ్యూజియంలో కృతజ్ఞత - భండారు శ్రీనివాసరావు

మ్యూజియంలో కృతజ్ఞత - భండారు శ్రీనివాసరావు


గూగుల్ ఇమేజ్ సెర్చ్ సర్ఫ్ చేసుంటే ఒక కార్టూన్ కనిపించింది.
 అందులో -



కంప్లెయంట్స్ (ఫిర్యాదులు), గ్రాటిట్యూడ్ (కృతజ్ఞత) అనే రెండు కౌంటర్లు వుంటాయి.
పిర్యాదుల కౌంటర్ వద్ద పెద్ద క్యూ వుంటుంది.
కృతజ్ఞతలు తెలపాల్సిన కౌంటర్ దగ్గర మాత్రం ఒక్క మనిషీ కనబడడు.

వర్తమాన ప్రపంచానికి – ముఖ్యంగా భారత దేశానికి అద్దం పట్టే కార్టూన్ అని నాకు అనిపించింది.
ఎనభయ్యవ దశకంలో నేను మాస్కోలో వున్నప్పుడు వేల సార్లు విన్న పదం – ‘స్పసీబా’ – అంటే ఇంగ్లీష్ లో ‘థాంక్స్’ – మన తెలుగులో ‘ధన్యవాదాలు’. బహుశా ఈ పదం ఇంత పెద్దగా వుండడం వల్లనో ఏమో ఇది పలకడానికి జనం కొంత సంకోచిస్తున్నారనుకోవాలి.

పదం ఏ భాషలో అయినా భావం అదే 
 
రష్యన్లు - ఆ మాటకు వస్తే ప్రపంచం లోని అనేక దేశాలవాళ్ళు కృతజ్ఞతను బాహాటంగా వెల్లడిస్తుంటారు. అది వారి జీవన విధానంలో ఒక భాగమై పోయింది. పైకి వ్యక్త పరిస్తేనే కృతజ్ఞతా భావం వున్నట్టని చెప్పడం నా వుద్దేశ్యం కాదు. తెలుగు సినిమాల్లో అన్నాచెల్లెళ్ళు ఒకరినొకరు పెనవేసుకుని ‘అన్నయ్యా ! చెల్లెమ్మా!’ అంటూ చెప్పుకునే డైలాగులు వింటే కంపరం కలుగుతుంది కానీ, వారి నడుమ వున్న ‘ఆత్మీయతా భావం ‘ అవగతం కాదు. అయితే – చేసిన మంచిని మరచిపోవడం మనుషులకు వుండాల్సిన లక్షణమని అనుకోలేము.
‘కృతజ్ఞత’ అన్న పదానికి ఈనాటి రాజకీయాల్లో స్తానం వున్నట్టులేదు. రాజకీయనాయకులకు ‘వడ్డించేవాడు’ ప్రధానం కాని ‘వడ్డించిన’ వాడు కాదు.

గతం ఘనం

పీవీ నరసింహారావుగారి విషయమే తీసుకుందాం. ప్రధానిగా వున్నంతకాలం ‘ఆహా! ఓహో!!’ అన్నారు. ఆర్ధిక సమస్యలతో పీకలలోతు మునిగిపోయివున్న దేశాన్ని నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. బొటాబొటి మెజారిటీ తో వున్న పాలక పక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠం పై వుంచిన ‘అపర చాణ క్యుడ’ని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం కావడంతోనే – ఆ నోళ్ల తోనే – ‘అధికారాంతమునందు చూడవలె ‘ అని పద్యాలు పాడడం ప్రారంభించారు. ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన వ్యక్తికి ఆయన్ని మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ ‘పదవే’ సర్వస్వమయిన వారికి ‘ఆయన భజనే’ సర్వస్వమయిపోయింది. పీవీని విమర్శించిన ‘పత్తిత్తులకు’ ఆయన చేసిన ‘మేళ్ళు’ కానరాలేదు. అయిదేళ్ళు ‘తెలుగువాడి’ లోని ‘వాడినీ – వేడినీ’ లోకానికి చాటిచెప్పిన ‘వృద్ధ రాజకీయవేత్త – న్యాయస్తానాలలో నిస్సహాయంగా ‘బోనులో’ నిలబడ్డప్పుడు ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ తెలియనట్టు ‘కళ్ళు’ మూసుకున్నారు. ప్రధానిగా పీవీ ని సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు. రాజకీయాల్లో ‘కృతజ్ఞత’ అనే పదానికి తావు లేకుండాపోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ. పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు హడావిడి ఒక విలేఖరిగా నాకు తెలుసు. ఆకాశవాణి ప్రతినిధిగా కలుసుకోవాలన్నా ఎంతో కష్టంగా వుండేది. అధికారులు, అనధికారులు, మందీ మార్భాలాలు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు – ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.

మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో వున్నప్పుడు – నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్, న్యూస్  ఎడిటర్ ఆర్వీవీ కృష్ణారావు గారు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తమ వెళ్లి - ఆ పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడం తో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని ‘ పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.

ఆలోచనా? నిర్వేదమా?

పెట్టిన తరవాత – మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేసామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము.లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయా!' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేసారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు.  అదీ  పీవీగారి గొప్పతనం. ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది – కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల – కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత – కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది.

శ్రీ అంజయ్య

అలాగే- ఎనభయ్యవ దశకంలో అంజయ్య గారిని ఇదే పరిస్థితుల్లో చూసాము. ముఖ్య మంత్రిగా ఆయన రాజీనామా చేసారు. మర్నాడు – కొత్త నాయకుడి ఎన్నిక. ఇంకా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. మేము ముఖ్యమంత్రి అధికార నివాసం ‘జయప్రజాభవన్’ ( గ్రీన్ లాండ్స్) కు వెళ్లేసరికి పొద్దు పోయింది. అంతా బోసిపోయి వుంది. మేడ మీద అంజయ్య గారు తన షరా మామూలు వస్త్ర ధారణతో అంటే - గళ్ళ లుంగీ, ముతక బనీనుతో కనిపించారు. ఏమి మాట్లాడాలో తోచలేదు. కాసేపువుండి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు. ఒక పిల్లవాడిని చూపించి ‘చూడు శ్రీనివాస్ – ఇతడికి దూరదర్శన్ లో ఏదో కాజువల్ ఉద్యోగం కావాలట. ఎవరికయినా చెప్పి చేయిస్తావా ?’ అని అడుగుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను పని చేసేది రేడియోలో అని ఆయనకు బాగా తెలుసు. అయినా తనని నమ్ముకుని వచ్చిన ఆ పిల్లవాడిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నన్ను అడిగి వుంటారు.

1983 లో విజయభాస్కరరెడ్డి గారితో ఇలాటిదే మరో అనుభవం.

శ్రీ విజయభాస్కరరెడ్డి


తెలుగు దేశం పార్టీ అఖండ విజయం తరవాత – ఆయన అధికార నివాసంలో (ఇప్పుడు దాన్ని పడగొట్టి గెస్టు హౌస్ కట్టారు) ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని కలుసుకున్నాను. ఆయన మేఘ గంభీరుడు. ఒక పట్టాన బయటపడే వ్యక్తిత్వం కాదు. జనం చాలా పలచగా వున్నారు. కాకపొతే, ఆయన మళ్ళీ కేంద్రంలో మంత్రి అవుతారన్న గ్యారంటీ నూటికి నూరుపాళ్ళు వుండడం వల్ల పరిస్తితి మరీ అంత దారుణంగా లేదు.

ఇలాటి నేపధ్యాలున్న మన రాష్ట్ర రాజకీయ రంగంలో -

శ్రీ రామారావు

అధికారం చేజారితేనే పట్టించుకోని రాజకీయ నాయకులు - ప్రాణాలు విడిచిన తమ నాయకులను పట్టించుకుంటారనుకోవడం భ్రమ. రామారావయినా, రాజశేఖరరెడ్డి అయినా అంతే.

మొన్నటికి మొన్న హైదరాబాదులో – EMRI -108- ఐదో వార్షికోత్సవం విశేషాలను మీడియాలో చూసినప్పుడు ఈ విషయాలతో కూడిన గతం నా కళ్ళ ముందు కదలాడింది.

వాహనాన్ని పరిశీలిస్తున్న శ్రీ రాజశేఖరరెడ్డి

ఈ సంస్త ప్రారంభమయిన కొద్ది సంవత్సరాలకే ఎంతో ప్రాచుర్యం పొందింది. సకాలంలో సేవలందిస్తూ ఆపన్నుల ప్రాణాలు నిలబెడుతున్న ఈ సర్వీసు విశిష్టతను అప్పటి ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి గుర్తించారు. డాక్టర్ గానే కాకుండా ఒక రాజకీయ పార్టీని రాష్ట్రంలో శాసిస్తున్న నాయకుడుగా కూడా దీని ప్రాముఖ్యతను ఆయన బాగా అర్ధం చేసుకుని ‘పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పద్దతిలో ఈ సంస్తకు ఆర్ధిక సాయాన్ని అందించారు

కుయ్ కుయ్ అంటూ 108 వాహనం సౌండ్ ని అనుకరిస్తున్న వైఎస్సార్     

. ప్రమాదాల్లో చిక్కుకున్న ప్రజల ప్రాణాలను నిలబెట్టడమే కాకుండా – ‘వోట్ బ్యాంకు’ ని తయారు చేయగల ఒక ‘ప్రజాకర్హక పదకంగా దీన్ని తీర్చి దిద్దారు. అలాగే వైద్య సేవలకు నోచుకోని పల్లె ప్రజలకోసం రూప కల్పన చేసిన ‘104’ పధకం కూడా రాజశేఖరరెడ్డి గారిని విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే గత సార్వత్రిక ఎన్నికల సభల్లో వీటికి ఆయన అదనపు ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకు వెళ్లారు.

వొదిలి వెళ్ళిన  'మంచి ఆస్తి '


వీటిని గురించి మాట్లాడేటప్పుడు మరో వ్యక్తిని కూడా స్మరించుకోవాలి. ఆయన ఆర్ధిక నేరాల ఉచ్చులో చిక్కుకుని జైల్లో వుంటున్న ‘సత్యం’ రామలింగరాజు గారు. ఈ రెండు పధకాలకు పురుడు పోసింది రాజు గారే .వీటికి జీవం పోసింది మాత్రం రాజశేఖరరెడ్డి గారు.
కానీ – EMRI- 108- ఐదో వార్షికోత్సవం లో ముఖ్య మంత్రి రోశయ్య గారు మినహా మిగిలిన వారెవ్వరూ ‘వీరిద్దరి’ ప్రస్తావన తీసుకురాలేదనీ,  స్టేజీ వెనుక అమర్చిన ‘బ్యాక్ డ్రాప్’ లో కూడా కానరాలేదనీ - అమెరికాలో వున్న నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పినప్పుడు – ‘కృతజ్ఞత’ గురించిన జ్ఞాపకాలు మరో సారి మదిలో మెదిలాయి.
బయట కానరానివాటిని 'మ్యూజియం' లోనే కదా చూసేది   


కొన్నాళ్ళ తరవాత – పిల్లలకు ‘కృతజ్ఞత’ గురించి తెలియచేప్పాలంటే – మ్యూజియం కు తీసుకు వెళ్ళాలేమో!

(16-08-2010)

NOTE:All images in the blog are copy righted to the respective owners.


15, ఆగస్టు 2010, ఆదివారం

ఒకటి పక్కన పన్నెండు సున్నాలు – భండారు శ్రీనివాసరావు

ఒకటి పక్కన పన్నెండు సున్నాలు – భండారు శ్రీనివాసరావు


పత్రికల్లో గమనించారో లేదో సంఖ్యలు కొట్టొచ్చినట్టు కనబడడానికి అంకెల్లో రాస్తుంటారు.

ఉదాహరణకు వర్షాలు వరదల కారణంగా లక్ష మంది నిరాశ్రయులయ్యారు అని రాయడానికి 100000 మంది అని పేర్కొంటారు.అలాగే ప్రభుత్వ పక్షం వారు అసెంబ్లీకి సమర్పించే గణాంకాల్లో కూడా ఈ చమత్కారాలు తొంగి చూస్తుంటాయి. అల్లర్లలో అరెస్టులు గురించి చెప్పాలంటే – యాభయ్, వందా అని క్లుప్తంగా లాగించేస్తారు. బలహీనవర్గాలకు ఇళ్ళ పంపిణీ గురించి చెప్పేటప్పుడు 30 00000 మందికి ఇచ్చాం అని ఘనంగా ఉద్ఘాటిస్తారు.ఇక ప్రతిపక్షాలు – ‘మృతుని కుటుంబానికి 1000000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాల’ని డిమాండ్ చేస్తాయి.

ఈ విషయాలు పక్కనబెట్టి అసలు విషయానికి వద్దాం.

సున్నా స్వగతం : పక్కన నేనున్నప్పుడే కదా ఎవరికయినా విలువ ? 

ఒకటి పక్కన పన్నెండు సున్నాలు అంటే ఇంగ్లీష్ లో ‘ట్రిలియన్’ అంటారు. సంఖ్యలని లెక్కపెట్టడానికి మిలియన్, బిలియన్, ట్రిలియన్ ఇలా లెక్కించే విధానం పాశ్చాత్య దేశాల్లో అమల్లో వుంది. నాలుగు ట్రిలియన్లు అంటే నాలుగు పక్కన పన్నెండు సున్నాలు పెట్టాలి. 2008 లో ప్రపంచ దేశాలలోని జనాలు పరస్పరం పంపుకున్న ‘ఎస్ ఎం ఎస్’ లకు ఇది సమానం.

ఇదొక లెక్కమాత్రమే. అసలు లెక్క ఇంకాస్త ఎక్కువే కానీ ‘సున్నాల’ గందరగోళం ఎక్కువై అసలు ‘విషయం’ గుండు సున్నా అవుతుందేమోనని ఇవ్వడం లేదు. ఈ రెండేళ్లలో ఇంకా ఎంతకు పెరిగివుంటుందో వూహించుకోవచ్చు.

పల్లెటూళ్ళకు కూడా పాకిన ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల కధాకమామిషూ ఏమిటో ఓసారి చూద్దాం.
లోకం చుట్టిన వీరుడు


ఈ శతాబ్దంలో అత్యంత వేగంగా నేలనాలుగు చెరగులనూ చుట్టబెట్టిన ఏకైక ఆధునిక పరికరం ఏమిటంటే సెల్ ఫోన్ అని ఇట్టే చెప్పెయ్యొచ్చు. ఓ ఇరవయ్యేళ్ళ క్రితంవరకూ ఎవరికీ తెలియని ఈ ‘బుల్లి పరికరం’ ఈనాడు ‘హస్తభూషణం’ గా తయారయి కూర్చుంది. ‘ఇంటికి ఒక్క ఫోనే’ అబ్బురమనుకునే దేశంలో – ఇంట్లోవున్న నలుగురూ ‘నాలుగు ఫోన్లు – ఎనిమిది రింగులుగా ‘ కాలక్షేపం చేసే కాలం వచ్చేసింది. కుటుంబ సభ్యుల నడుమ మాటా మంచీ తగ్గిపోయి – ముక్కూ మొహం తెలియని వారితో మాటా మంతీ పెరిగిపోయింది.



- 635 510 000-
 అంటే ఫోన్ నెంబర్ అనుకునేరు – ఒక లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి మన దేశంలోని మొబైల్ ఫోన్ ల సంఖ్య ఇది. అమెరికాలో వాడే సెల్ ఫోన్లకంటే రెండు రెట్లు ఎక్కువ.

యెంత దగ్గరో - అంత దూరమూ


మొబైల్ ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడానికే కాదు, సందేశాలు కూడా పంపుకోవడానికి కూడా వీలు వుండడంతో వీటి గిరాకీ మరింత పెరిగిపోయింది. ఈ ఫోన్లు రంగప్రవేశం చేసిన తొలినాళ్ళలో ఈ సౌకర్యం వుండేది కాదు. మొదట జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఈ దిక్కుగా ఆలోచించాయి. ఆ దేశాల ఫోన్ కంపెనీలు చేసిన కృషి ఫలితంగా – 1992 డిసెంబర్ మూడో తేదీన మొట్ట మొదటి ‘ఎస్ ఎం ఎస్ ‘ ఇంగ్లండ్ లోని నీల్ పాప్ వర్త్ అనే ఒక వ్యక్తి నుంచి వొడా ఫోన్ ద్వారా వెళ్ళింది.


’హ్యాపీ క్రిస్మస్’ అనేది ఆ మొట్టమొదటి ‘ఎస్ ఎం ఎస్’


  అప్పటినుంచి ఈ చిట్టి పొట్టి సందేశాల ‘సాంకేతిక పిట్ట’ ప్రయాణం ఎదురులేకుండా సాగిపోయింది. అన్నిరకాల మొబైల్ ఫోన్ పరికరాలకు పనికివచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో – ‘ఎస్ ఎం ఎస్’ ల విశ్వవిహారం మొదలయింది. ఇంగ్లండ్ లో 2006 డిసెంబర్  లో క్రిస్మస్ పండుగ సందర్భంగా – ఒకే ఒక్కరోజున - యిరవై కోట్ల పైచిలుకు ‘ఎస్ ఎం ఎస్’లు - పండుగ  శుభాకాంక్షలు తెలుపుతూ - ‘ఫోన్లు మారాయి.’

ఈ లెక్కన ఈ లెక్కలు ఇప్పటికి ఎంతగా పెరిగాయన్నది లెక్కలు కట్టాల్సివుంది.

కానీ ఇలాటి లెక్కలు తీ సేవాళ్ళు చెప్పిన ఒక లెక్క ప్రకారం – 2006 నాటికే ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా ఎనభై బిలియన్ డాలర్లు దాటిపోయింది.

అమెరికా లాంటి దేశాల్లో వినియోగదారుల నుంచి ఒక్కొక్క ‘ఎస్ ఎం ఎస్’ కు పదకొండు సెంట్లు వసూలు చేస్తున్నారు. మరి ఈ ‘వసూలు రాజాల’ కు ఇందుకయ్యే ఖర్చు ‘చిల్లి సెంటు’ కూడా వుండదు. దీన్ని నిలువు దోపిడీ అనాలా లేక అదనపు సదుపాయం కల్పిస్తున్నందుకు వసూలు చేస్తున్న ‘అదనపు’ చార్జీ అనాలా! బియ్యం మిల్లు యజమానులకు ‘తవుడు’ అప్పనంగా మిగిలినట్టే, ఈ కంపెనీలకు ఇదొక అదనపు ఆదాయం.

ఇందులో ‘ఇంత’ వుంది కాబట్టే – ఈ ‘ఎస్ ఎం ఎస్ ‘ ల పేరుతొ ఇన్నిన్ని స్కీములు, ఇన్నిన్నిగేములు.

 వినియోగదారుల్ని వల వేసి పట్టుకుందుకు ఇన్నిన్ని ' గేలాలు' 

పేలాలు పంచి పప్పులు దంచుకునేందుకు ఇంకెన్నో టక్కు టమారాలు.

‘పట్టుకుంటే పట్టు చీరె’ నుంచి ‘ఆటాడుకుందాం రా’ వరకు అన్నే ‘ఎస్ ఎం ఎస్’ గేములే.

ప్రతి టీవీ చానల్ లో ప్రతి అంశం మీదా ‘ప్రజాభిప్రాయసేకరణలే. ‘ఎస్ ఎం ఎస్’ లు పంపాలని కోరని చానల్ తెలుగునాట కలికానికి కూడా కానరావడం లేదు.

పైగా ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల కు వసూలు చేసే చార్జీ ఒకటికి నాలుగు రెట్లు ఎక్కువ. కానీ తియ్యటి నీటికి చేపలు ఎగబడే చందంగా – ఎవరికివారు పోటీలు పడి తమ ‘మొక్కుబళ్ళు’ చెల్లించుకుంటున్నారు. ఎవరి బాగుకోసం ఇదంతా. ఎవర్ని బాగుచేయడం కోసం ఇదంతా.

బహుళ జాతి కంపెనీల మీద నిలువెత్తున ఎగిరిపడే వాళ్ళు కూడా – చాపకింద నీరులా వ్యాపిస్తూ, సామాన్యుల నడ్డి విరుస్తున్న ఈ ‘ఎస్ ఎం ఎస్’ – వ్యాపార ధోరణులపై ఎందుకు చూపు సారించడం లేదో ఆలోచించాల్సిన విషయం.

టీవీ చానళ్ళు సయితం ఈ సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తూ వున్నాయో, ఇందులోని వ్యాపార ‘మర్మం’ ఏమిటో వెల్లడి చేస్తే బాగుంటుంది.

కానీ ఇది జరిగే పనేనా!

‘తప్పులెన్నువారు తమ తప్పులు ఒప్పుకుంటారా!’

NOTE: All images in this blog are copy righted to the respective owners

14, ఆగస్టు 2010, శనివారం

స్వయంకృతాపరాధాలు - భండారు శ్రీనివాసరావు

 స్వయంకృతాపరాధాలు  - భండారు శ్రీనివాసరావు

యోగి వేమన

‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నాడు వేమన. అలాగే - ‘విభక్తుల్లో సంబోధనా ప్రథమా విభక్తి’ తరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కాలవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ‘ఒసే’ అనడం - తండ్రిని ‘ఒరే’ అనడం ఈ మధ్య సినిమాల్లో షరా మామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగా, వడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతుంది.



  

బాపుగారికి క్షమాపణలతో

వెనుకటి రోజుల్లో పిల్లలు ఒకర్నొకరు సరదాగా ‘గురూ-గురూ’ అని పిల్చుకుంటూ ఉంటే విని పెద్దలు గుర్రుమనే వారు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి - బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది.ఇంట్లో అమ్మా అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం అమ్మగారూ అంటూ గౌరవంగా చెప్పుకునే వారు. ఉత్తరాలు రాసేటప్పుడు - గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి అనో, పూజ్యులైన తాతయ్యగారికి అనో వినమ్రత కనబరిచే వారికి వినయాన్ని సంస్కారంగా, విధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునేవారు. సభ్యతా, సంస్కారాలక్కు అదే కొలమానంగా భావించేవారు.


ఇక, పత్రికల్లో వాడే భాష, సినిమాల్లో వినిపించే సంభాషణలు, చట్టసభల్లో జరిగే చర్చలు, చాలా వరకు పరిధులకు, ప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలు, వార్తలు గిరి గీసుకుని, మడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానంగా చెబుతాయన్న నింద తప్ప - సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు.

కోరికలే జిరాఫీలయితే

కానీ, కాలం ఒక్క తీరుగా ఉండదు కదా!జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టి, తరాలను బట్టి మారిపోతుంటాఅయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడం, అమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత ‘వేగవంతం’ చేయడంలో ఈనాటి ‘ఎ టూ జెడ్’ చానెళ్ళు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.
ఓరి భడవా?
తరాలు మారుతున్నప్పుడు - వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు - రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి.

 మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే - ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతోంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వైరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను 'ఒసే' అనడం, నాన్నను 'ఒరే' అనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్ళకు, పత్రికలకు, పుస్తకాలకు, చట్టసభలకు విస్తరించి - సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు - చెప్పే మాటల్లో, ప్రవచించే పలుకుల్లో, రాసే రాతల్లో - సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు - ఈనాటి సినిమాలే! ఈనాటి ఛానళ్ళే! ఈనాటి పత్రికలే! ఈనాటి పుస్తకాలే! ఈనాటి చట్ట సభలే!
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళుండరు.రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్ళు మిగలరు
పాలితులను బట్టే పాలకులు- పాఠకులను బట్టే పత్రికలు - ప్రేక్షకులను బట్టే సినిమాలు - వీక్షకులను బట్టే ఛానెళ్ళు.


ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

NOTE: All images in this blog are copy righted to respective owners

మాట్లాడడం అంటే మాటలు కాదు - భండారు శ్రీనివాసరావు

మాట్లాడడం అంటే మాటలు కాదు - భండారు శ్రీనివాసరావు

'మౌనమే నీ భాష ఓ మూగవదనా!'

నిజానికి అరవై నాలుగు కళల్లో ఇది ఒకటి.ఇది నిజమో కాదో తెలియకపోయినా ఇలాంటి స్టేట్మెంట్లని అలవోకగా, ఘంటాపధంగా ఇవ్వగల కళలో ఆరితేరినవరే గట్టి వక్తలుగా పేరు తెచ్చుకోగలుగుతారు. పెళ్ళిళ్ళల్లో -పబ్బాల్లో నలుగుర్ని చేరదీసి- అంతకు ముందు అందరూ చదివేసిన పేపర్లలోని వార్తలూ, విశేషాలూ అన్నీ తనకే ముందు తెలిసినట్టుగా రంగులద్ది చెప్పడం ఇంకో కళ. దీన్నే సంభాషణా చాతుర్యం అని కూడా అందురు. ఐతే, ఈ కళ ద్వారా ఆకట్టుకోగల శ్రోతల సంఖ్య పరిమితం. రాగల పేరూ, ప్రఖ్యాతలు కూడా ఆ పాళ్ళలోనే వుంటాయి. వేదికలెక్కి ఉపన్యాసాలు దంచగల స్ఠాయికి ఎదగగలిగితే అభిమానుల సంగతి అటుంచి ఎదో కొంత గిట్టుబాటుగా కూడా వుంటుంది. సభా నిర్వాహకులు సయితం తమ తమ విభవాన్నిబట్టి చదివించుకుంటూ వుంటారు. సాధారణంగా అవార్డులూ-సత్కారాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఈ రకం వక్తలకు కొంత గిరాకీ వుంటుంది. పొగడడం మినహా మరో అంశానికి ప్రాధాన్యం వుండదు కాబట్టి మాట్లాడడం కూడా అంత శ్రమ అనిపించదు. అవార్దులు తీసుకునేవారూ, ప్రేక్షకులూ ప్రతిసారి మారిపోతుంటారు కావున ప్రసంగాల్లో పునరుక్తి దోషాలు ఎన్ని దొర్లినా ఎలాంటి ఇబ్బంది ఇసుమంత కూడా వుండదు. అతిశయోక్తులు దట్టించి ఎలా పొగడాలో తెలుసుకోవడానికి ప్రత్యేక శిక్షణా తరగతుల అవసరమే లేదు. ప్రోగ్రాం కంపీర్ అనో, వ్యాఖ్యాత అనో ఎదో ఒక పేరుతో మైకు ముందు నిలబడే శాల్తీ- సభకు వచ్చిన అతిధుల్నీ, అభ్యాగతుల్నీ(శ్రోతల్నీ) అదే పనిగా ఎలా పొగుడుతున్నారో కొద్దిగా గమనిస్తే చాలు సరిపోతుంది.
 
'మైకేరియాసురుడు'

ఈ మధ్య ఒక సభకు వెళ్ళాను. బయట బాగా ఎండగా వుండడం వల్ల, సభా మందిరం ఏసీ హాలు కావడం వల్లా లోపల జనం నిండుగానే వున్నారు. భజంత్రీల్లో ఎవరో రాకపోవడంతో నన్ను మాట్లాడమన్నారు. ససేమిరా అన్నాను. ఒక్కసారి స్టేజి ఎక్కి మాట్లాడడం మొదలు పెడితే ఆ మత్తులో పడిపోతానేమోనని భయం. పైగా మొగమాటాలకు పోయి అనేక సభలకి హాజరైన అనుభవం వుంది. వేదికమీద వున్న, సారీ- వేదికను అలంకరించిన- ఇంకో సారి సారీ- (రంగురంగుల పూలతో, కాగితాలతో వేదికను అలంకరించినవారని అర్థం కాదు) పదిమందో, పదహారు మందో- ఒక్కొక్కరుగా లేచి తమ ప్రసంగం ప్రారంభించినప్పుడల్లా - వేదిక మీద వున్న మిగిలినవారిని పేరు పేరునా స్మరించడం-పనిలో పనిగా పొగుడుకోవడం గమనిస్తే చిర్రెత్తుకొస్తుంది. ఈ పరస్పర కుచమర్ధనాలకే సగం సమయం గడిచిపోతుంది. దండలు, పుష్పగుచ్చాలు, శాలువలు అందించేవారి పేర్లూ, అందుకుంటున్నవారి పేర్లూ - ఎలా సహస్రనామార్చన కొనసాగుతుంది.
ఈ కార్యక్రమంలో వీలైనంతమందికి వీలు కల్పించడంవల్ల సభ హాజరుకి మినిమం గ్యారంటీ వుంటుంది. ఈలోగా ప్రధమ తాంబూలం, లేదా ప్రధాన సత్కారం అందుకోవడానికి అన్నిరకాలుగా అన్నీ సమర్పించుకున్న శాల్తీ వేదిక మీదనే విలవిలలాడిపోతుంటాడు. కవర్ చేయడానికి వచ్చిన స్థానిక విలేకరులు తన సన్మాన కార్యక్రమాన్ని కవర్ చేయకుండానే మరో "గిఫ్టుబాటు" కార్యక్రమానికి వెళ్ళిపోతారేమోనని విలేకరుల గ్యాలరీ వైపు పిచ్చి చూపులు చూస్తూ దొంగ దండాలు పెడుతుంటాడు. ఎద్దు పుండు కాకికి రుచి అన్న సామెత మాదిరిగా నిర్వాహకులకు మాత్రం ఇదేమీ పట్టదు. అతిధులు, విశిష్ట అతిధులు, పరమ విశిష్ట అతిధులతో పాటు అతిధి ఆఫ్ ది డే - అతిధి ఆఫ్ ది ఇయర్తోటే వారికి గడిచిపోతుంటుంది. తెచ్చిన శాలువాలు, కప్పాల్సిన భుజాలు లెక్క పెట్టుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేస్తుంటారు. వక్తలు కూడా ఎవరికి వారు తమ ప్రసంగం పూర్తి కాగానే ఒకరి వెంట మరొకరు - కారణం చెప్పో చెప్పకుండానో వేదిక మీద నుంచి నిష్క్రమిస్తుంటారు. రైలుకో, బస్సుకో పోదామని బయలుదేరి మధ్యలో దొరికిన టైములో కాలక్షేపం కొసం శ్రోతల అవతారాలెత్తినవాళ్ళు కూడా ఆవులించుకుంటూ లేచి నిలబడి చేతి వాచీలవైపు, నిర్గమన ద్వారాల వైపు చూస్తుంటారు. ఇవన్నీ చూస్తూ నిర్వాహకులు - ఆనాటి "వ్యయ ప్రదాత"ను పిలిచి, తమకు జరిగిన ఈ అపూర్వ సన్మానానికి ముక్తసరిగా మూడు ముక్కల్లో ఉచిత రీతిన ధన్యవాదాలు తెలపాల్సిందిగా మనవి చేసుకుంటారు.
ఇదొక్కటే మొత్తం కాంట్రాక్టులో ఉచితంగా దొరికిన అవకాశంగా పరిగణించిన సదరు శాల్తీ - అలవాటులేని ప్రసంగాన్ని అధాటుగా ప్రారంభించి మధ్యలో దారితప్పి -అవాకులు, చవాకులతో శ్రోతల సహనాన్ని పరీక్షించే సమయంలో- సభా నిర్వహణ విధి విధానాలను "స్కాచి" వడబోసిన నిర్వాహకులు సత్కార కార్యక్రమాన్ని హడావిడిగా ముగించి సభకి మంగళం పాడతారు. కరిగిన సొమ్ముకూ, జరిగిన సన్మానానికీ బేరీజు వేసుకుంటూ బేజారైన గుండెతో సత్కార గ్రహీత ఇంటిదారి పడతాడు. నిర్వాహకులు విందు చేసుకుంటూ మరో "బఖరా" వేటలో పడతారు.
వినేవారికి మాట్లాడేవారు లోకువ
NOTE: All images in this blog are copy righted to the respective owners

కన్నుపొయ్యే కాటుకెందుకు? - భండారు శ్రీనివాసరావు

కన్నుపొయ్యే కాటుకెందుకు? - భండారు శ్రీనివాసరావు


ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్‌ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.



ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి అంజయ్య 

ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్‌ ! (మొయినుద్దీన్‌ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లోకూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్‌ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్‌ అవుతోందని చెప్పేసి- ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది - మంత్రులందరూ (రాజీనామాలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్‌ మంటూ బయటకు పరుగెత్తి - ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్‌ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను.
ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే - విలేకరులు వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే.




అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్‌' అని ఎద్దేవా చేసేవారు. అరవైమంది మంత్రులేమిటి - విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం ఆయనది. యాదగిరి (హెలికాప్టర్‌)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే వ్యంగ్య చిత్రాలను కూడా  నవ్వుతూ  ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.


`వెనకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క అయ్యేఎస్‌ ఆఫీసర్‌ (జిల్లాకలెక్టర్‌) ఉండేవాడు. ఇప్పుడో - ఇద్దరు ముగ్గురు అలాంటి అధికార్లు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు జిల్లాకు ఇద్దరు మంత్రులు వుంటే తప్పేంటి `శ్రీనివాసూ' అనేవారు ఆంతరంగిక సంభాషణల్లో.

ఇక వార్తల్ని అందించడంలో తొందరపాటు విషయానికి వస్తే ఆ రోజు నేను హడావిడిలో అరవైమంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పాను. రేడియోలో కూడా అలాగే ప్రసారమైంది. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో సభ్యులసంఖ్య అరవై. 59 మంది మంత్రులే ఆరోజు రాజీనామా చేశారు. సాయంత్రం వార్తల్లో ఈ తప్పు సవరించుకున్నామనుకోండి. ఇలాంటి పొరపాట్లే మరికొన్ని తరహా వార్తల విషయంలో జరిగితేనే వస్తుంది చిక్కంతా.

శ్రీమతి ఇందిరా గాంధి

శ్రీమతి ఇందిరాగాంధీని హత్యచేసినప్పుడు చాల సేపటివరకూ రేడియో ఆ వార్తని వెల్లడించలేదు. ఆవిడ మరణవార్తని జాతికి తెలియచెయ్యడంలో తాత్సారం జరిగిందని దరిమిలా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానిపై కాల్పులు జరిగాయన్న వార్త బయటకు పొక్కింది కానీ అసలేం జరిగిందన్న దానిపై అందరికీ తీరని సందేహాలే. చివరికి రాజీవ్‌ గాంధీ కూడా శ్రీమతి ఇందిరా గాంధీ మరణం గురించి బీ బీ సీ వార్తలు విని ధృవపరుచుకున్నారు.

శ్రీమతి గాంధి పార్ధివ శరీరం 

 ఆమెపై కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒక సిక్కు మతస్తుడు ఉన్నాడన్న సంగతిని రేడియో వార్తల్లో ముందు వెల్లడించలేదు. అందువల్ల - అప్పటివరకూ అందరి మనసుల్లో ఆందోళన - అలజడి తప్పిస్తే అంతా ప్రశాంతమే. కానీ కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒకడిపేరు `బియాంత్‌ సింగ్‌' అన్న విషయం వెల్లడి కాగానే ఒక్కసారిగా అంతా తారుమారయింది. పరిస్థితులు వర్ణించలేనంత భీభత్సంగా పరిణమించాయి. ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఘాతుకానికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ప్రయాణించే సిక్కు ట్రక్కు డ్రైవర్లు ఊచకోతకు గురయ్యారు. అవేశకావేశాల ముందు వివేకం, విచక్షణ తలవంచాయి.

శ్రీమతి గాంధి హత్యానంతరం జరిగిన అల్లర్లలో ఒక దృశ్యం

ఎవరో చెప్పినట్టు ట్యూబునుంచి పేస్టు బయటకు తీయగలమే కానీ మళ్లీ అందులో పెట్టలేం. అలాగే పేల్చిన తూటా కూడా.


నిజమే. వార్తను వెనువెంటనే అందించాలన్న కర్తవ్యదీక్షని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ సామాజిక బాధ్యత సంగతేమిటి? పగలసెగలు రగిలించి, వ్యధలు మిగిలించి, విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్న సమాచారాన్ని తొక్కి పెడితే వచ్చే నష్టం ఏమిటి?
భయంకరమైన పోటీ వాతావరణంలో పయనిస్తున్న ఈనాటి మీడియా మనుగడకు ఎంతో కొంత మేరకు సంచలనాత్మక కథనాలు అవసరమే. కాకపోతే టీ ఆర్‌ పీ రేటింగ్‌లతో పాటు విశాల జనహితాన్ని పట్టించుకోవడం కూడా ఆవశ్యకమే! కాదంటారా!

భండారు శ్రీనివాసరావు


NOTE: All images are copy righted to their respective owners.

13, ఆగస్టు 2010, శుక్రవారం

సుత్తి ముక్తావళి - భండారు శ్రీనివాసరావు

సుత్తి ముక్తావళి




(కన్న వింతలూ- విన్న వింతలూ)



'నిన్ను గురించి నువ్వు ఎప్పుడూ చెప్పుకోకు. మంచి చెప్పుకుంటే ఎవ్వరూ నమ్మరు. చెడు చెప్పుకుంటే - ఇంకా ఎంతవుందో అనుకుంటారు'

'మన బతుకు ఎలాంటిదో మన చావు చెబుతుంది. అయితే, మన బతుకు ఎలాంటిదో లోకానికి చెప్పడం కోసం కనీసం ఇద్దరు బతికుండాలి. అందులో ఒకడు మన స్నేహితుడయివుండాలి. ఇంకొకడు తప్పనిసరిగా మన శత్రువై వుండాలి. మన గురించి శత్రువు చెబుతున్నదానికీ- స్నేహితుడు చెబుతున్నదానికీ యెంత వ్యత్యాసం వుంటే - అంత నిత్యనూతనంగా చచ్చిన తర్వాత కూడా మనం బతికేవుంటాం.'





'ఒక మాట నిజం.
బతుక్కన్నా చావుకే  ఆయుష్షు ఎక్కువ.
గట్టిగా ఒక్క తుమ్ము కూడా తుమ్మకుండా ప్రాణాలను కాచుకుంటూ, దాచుకుంటూ ఎన్నేళ్ళయినా బతుకు. నూరేళ్ళు- నూట యిరయై ఏళ్ళు- మహా అయితే నూట పాతికేళ్ళు.
కానీ, ఆ బతుక్కన్నా కూడా పొడవయినది చావు. ఎన్నేళ్ళు బతికి చచ్చినా- బతికినన్నాళ్ళకంటే ఎక్కువ ఏళ్ళు చచ్చినతర్వాత కూడా జనం జ్ఞాపకాల్లో బతికే వుంటాం.'



"ఏ పని అయినా కష్టపడుతూ కాదు - ఇష్టపడుతూ చేయాలి"


'నేను చేయగలనని అనుకోవడం ఆత్మవిశ్వాసం-నేనే చేయగలనని అనుకోవడం అహంకారం.'


'నర మాంసం తినే క్రూర జంతువు కూడా తన మాంసం తినదు'




" పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.తరవాత్తరవాత మొగుడిమాట భార్య వింటుందట.ఆ తర్వాత యిరువురి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట.'


'భయం అనే పదానికి తప్ప దేనికీ భయపడాల్సిన పని లేదు.'




'మీరు అద్భుతాలను నమ్ముతారా?'
'ఎందుకలా అడుగుతున్నారు?'
'మీ జీవితంలో నిన్న ఒక గొప్ప అద్భుతం జరిగింది తెలుసా?'
'నా జీవితంలోనా?'
'అవును. మీ చిన్నాన్న చనిపోయాడని చెప్పి నిన్న మీరు సెలవు పెట్టి వెళ్ళాక - మిమ్మల్ని చూడ్డానికి ఆయనే ఆఫీసుకి వచ్చారు.'


'దేవుడిని నమ్మి బాగుపడ్డామన్నవాళ్ళు తారసపడలేదు కానీ - దేవుడిని నమ్మేదిలేదంటూ లాభపడ్డవాళ్ళు బోలెడుమంది కనబడుతుంటారు.'

'ఉన్నతస్థానానికి చేరుకోవడం ఎంతో కష్టం. చేరుకున్న తరవాత ఆ స్థానాన్ని పదికాలాపాటు పదిలపరచుకోవడం మరింత కష్టం.'



" ఎవరికయినా వారి అవసరానికి యెంత సాయం చేసినా వెంటనే మరచిపో - ఇతరులు చేసిన సాయం యెంత చిన్నదయినా జీవితాంతం గుర్తుంచుకో "




" మనిషి ఏడుస్తూ పుట్టింది - నవ్వుతూ చనిపోవడానికి "
-భండారు శ్రీనివాసరావు

NOTE: All images in this blog are copy righted to their  respective owners

ఇంకానా! ఇకపై సాగదు! - భండారు శ్రీనివాసరావు

ఇంకానా! ఇకపై సాగదు!    - భండారు శ్రీనివాసరావు



రాను రాను - సామాన్యుడనే వాడికి - ఓటు వెయ్యడం మినహా ఏ ‘హక్కూ’ లేకుండా పోతోంది. కానీ, అతడ్ని అడ్డం పెట్టుకుని బతికేవారికి మాత్రం అన్ని హక్కులూ - హక్కుభుక్తమై పోతున్నాయి.




నిజానికి, పార్టీలూ,పర్టీల నాయకులూ, అమాత్యులూ, అధికారులు,ఉద్యోగులు, పోలీసులూ, అందరూ ప్రజల్లో భాగమే. ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. ఎదిగో - ఎన్నికయ్యో, హక్కులు సాధించుకుని అధికారం చెలాయిస్తున్నారు. సామాన్యులు ఎలాంటి హక్కులూ లేకుండా కునారిల్లుతున్నారు. అదే తానులోంచి వచ్చిన వాళ్ళు మాత్రం వృత్తుల పేరిటా, ఉద్యోగాల పేరిటా,సంఘాలు పెట్టుకుని, హక్కుల పోరాటాల పేరుతో లేని అధికారాలు అనుభవిస్తున్నారు. పై పదవులకు నిచ్చెనలు వేసుకుంటున్నారు.

సంఘాల కుంపట్లు పెట్టుకోని వర్గాలు ఈనాడు కాగడాలు వేసి గాలించినా కనిపించవు. ఎన్జీవోలకు సంఘాలున్నాయి. ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులకు అసోసియేషన్లు ఉన్నాయి. రిక్షాలు లాగేవారికే కాదు, విమానాలు నడిపేవారికీ యూనియన్లు ఉన్నాయి. అమ్మేవారికి, కొనేవారికి సమాఖ్యలున్నాయి. రాసేవారికి, ఆ రాసిన వాటికి అచ్చేసేవారికీ సంస్థలు ఉన్నాయి. ఆడవారికీ, భార్యాబాధితులకు సయితం సమాజాలున్నాయి. వృత్తుల వారీగా, కులాలవారీగా, మతాలవారీగా ఎవరి సంఘాలు వారికి ఉన్నాయి. వీటన్న్టిటికీ, సొంతంగా ఏర్పరచుకున్న హక్కులు ఉన్నాయి. లేకపోయినా, వాటికోసం పోరాడగల యంత్రాంగ వ్యవస్తలున్నాయి.భావాలను విప్పిచెప్పగల గళాలు ఉన్నాయి. వాటిని ప్రజలకు చేరవేసే మాధ్యమాలు ఉన్నాయి. హక్కుల సాధనకోసం సమ్మెలు, బంద్ లు, ఆందోళనలు, నిరసనలు, రాస్తారోఖోలు, రైల్ రోఖోలు, ఘెరావ్ లు, ముట్టడులూ, ఊరేగింపులూ, బైఠాయింపులూ, అటకాయింపులూ, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు, ఇలా ఎన్నో రకాలుగా, ఎన్నెన్నో రూపాల్లో.. సామాన్యుడి సాదారణ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ మరింత దుర్బరంగా మారుస్తూ - పై పెచ్చు తాము పడుతున్న ఈ పడరాని పాట్లన్నీ ఆ సామాన్యుడి కోసమే అని చెప్పి నమ్మించగల టక్కుటమార విద్యలన్నీ వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ లేనివాడు, అసలేమీ లేనివాడు మాత్రం రాజ్యాంగం తనకు కల్పించిన అన్ని రక్షణలకూ తూట్లు పొడుస్తున్న ఈ అస్తవ్యస్త మధ్య చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతూ దిక్కుతోచక విలవిలలాడుతున్నాడు.

రాస్తా రోఖో కారణంగా ఆగిపోయిన అంబులెన్స్

కారణాలు ఏమైనా, హేతుబధ్దత ఎంత ఉన్నా, బంద్ ల వల్లా, రాస్తారోఖోల వల్ల నష్టపోతున్నదీ, కష్టపడుతున్నదీ సామాన్యులే అన్నది నగ్న సత్యం. నిరసనలూ, ఆందోళనల పేరుతో రాజకీయపార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, కార్మిక సంఘాలు, ఇతర సంస్థలూ, ఇష్టారాజ్యంగా నడిరోడ్లపై చేస్తున్న ధర్నాలు, బైఠాయింపులు నిత్యకృత్యంగా మారి జనజీవితాన్ని నరకప్రాయంగా మారుస్తున్నాయన్నది అంతే నిజం.


ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే నెపంతో రోడ్డెక్కుతున్న రాజకీయ పార్టీలు, కార్మికసంఘాలు తమ వైఖరులనూ, విధానాలను పునస్సమీక్షించుకోవాలి. ఏ సామాన్య జనం కోసమైతే ఉద్యమాలు, ఆందోళనలూ, నిర్వహిస్తున్నామని ఆయా పార్టీలూ, సంఘాలు అనుకుంటున్నాయో, ఆ సామాన్య జనాన్నే తమ విధానాలు మరింత చికాకు పరుస్తున్నాయన్న వాస్తవాన్ని అర్దం చేసుకోవాలి. పోరాటాల పేరుతోనో, ఇతరేతర రాజకీయ కారణాలతోనో బడుగుజీవి నడుం విరుస్తున్న ఈ అపబ్రంశపువిధానాలు ఏ నాగరిక దేశంలోనూ కానరావు. సాటి పౌరులకు ఇబ్బంది కలగని రీతిలో నిరసనలు ప్రకటించే పద్ధతులను సభ్యసమాజం పాటించి తీరాలన్న ప్రాధమిక స్పృహ మనదేశంలో కలికానికి కూడా కానరాదు.
ఒకసారి, సూర్యాపేట మీదుగా బస్సులో ఖమ్మం వెడుతుంటే నడుమ దారిలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కారణం వాకబు చేయడానికి వెడితే కొంతదూరంలో ఏదో పార్టీకి చెందిన కార్యకర్త్గలు - పట్టుమని పదిమంది కూడా లేరు. - జండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ నడిరోడ్డు పై ధర్నా చేస్తున్నారు. ‘ఇలా ఎంతసేపు మీ తమాషా చూడాలనిగద్దిస్తే ఒక్క అరగంట ఓపిక పట్టండి సార్! ఫలానా టీవీ వాళ్ళు దోవలో ఉన్నామని ఇప్పుడే సెల్ ఫోన్లో చెప్పారు. అని వాళ్ళనాయకుడు జవాబిచ్చాడు. ఇలాంటి ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోఖోలు ససేమిరా చూపించేది లేదని చానళ్ళన్నీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోగల్గితే మెరుగయిన సమాజం కోసం నిజంగా కృషి చేసినట్టవుతుంది. ప్రచారం కోసం కాకుండా ప్రజాక్షేమాన్ని కోరుకునే సంస్థలు కూడా తమ కార్యకర్తల్ని తక్షణం రంగంలోకి దింపి ‘ఇలా ప్రజలని ఇబ్బందుల పాలు చేసే వారికి దయచేసి ఓట్లు వెయ్యవద్దు అనే ప్లకార్డులను పట్టుకుని మౌనంగా ఆ పక్కన నిలబడితే, నవ్యత్వం కోసం పటుపడే ఛానెళ్ళన్నీ ఆ దృశ్యాలను ఒక్కమారైనా ప్రసారం చేయగలిగితే , ఇంకోసారి ఏపార్టీ, ఏయూనియన్ కూడా ఇలాంటి ఆందోళనలక్ సాహసించదు. కానీ సంచలనం ఒక్కటే సమస్తం అనుకునే ఈ పోటాపోటీ ప్రచార వ్యాపార యుగంలో ఇది నెరవేరని కలే.

కానీ, ఏదో ఒకరోజు ‘సామాన్యుడి రోజు’ కూడా వస్తుంది. నిరసనలని వ్యక్తం చేయడానికి ఎంచుకున్న విధానాల ద్వారా వేలాది మంది ప్రజలను అకారణంగా ఇబ్బంది పెట్టే హక్కు వీరికెవరిచ్చారన్న ప్రాధమిక ప్రశ్న ముందుకు వస్తుంది.


అర్భకుడు, అమాయకుడు అనుకున్న ఈ సామాన్యుడే తిరగబడి ‘ఇంకానా’ ఇకపై సాగదు!’ అంటూ హూంకరిస్తూ - తన జీవితంతో ఆటాడుకుంటున్న ‘వర్గాల’ మెడలు వంచే రోజు తప్పక వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

భండారు శ్రీనివాసరావు

NOTE: All images in this blog are copy righted to their respective owners