AIR లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
AIR లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, నవంబర్ 2014, సోమవారం

పత్రికాస్వేచ్ఛకు సరికొత్త భాష్యాలు

  

అవి ఎమర్జెన్సీ రోజులు.

హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తవిభాగంలో నేను కొత్తగా అడుగుపెట్టాను.



 పత్రికా స్వేచ్చ పట్ల అపరితమయిన గౌరవాభిమానాలతో జర్నలిజాన్ని  వృత్తిగా స్వీకరించిన నా స్నేహితుడొకరు ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. రేడియోలో పనిచేస్తున్న  నాకు, తన మాదిరిగా  వృత్తిపరమయిన స్వతంత్రం లేదనే భావన అతనిది. సర్కారు జర్నలిస్టుగా ముద్రవేసి నన్ను ఆట పట్టించడం అతగాడికో అలవాటుగా మారింది. దీనికి ఎప్పుడో ఒకప్పుడు అడ్డుకట్ట వేయాలనే తలంపులో వున్న నేను - ఒక రోజు అతడిని బాహాటంగా సవాలు చేసాను. నాకో వార్త చెప్పు. అది యధాతధంగా సాయంత్రం రేడియో వార్తల్లో వస్తుందో రాదో చూద్దాము. అలాగే నేను చెప్పిన వార్త రేపు ఉదయం నీ పేపరులో వస్తే నీకు స్వేచ్ఛవుందని ఒప్పుకుంటాను.

పత్రికా స్వేచ్ఛ పట్ల  అపారమయిన గౌరవం వున్న నా స్నేహితుడు, నేను విసిరిన సవాలుని స్వీకరించాడు. ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. అతను పంపిన వార్తకు అతడి పేపర్లో అతీగతీ లేదు. నేను ఫోనులో చెప్పిన వార్త అదే సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో ప్రసారమయింది. అప్పటినుంచి ఇప్పటివరకు మా స్నేహ బంధం కొనసాగుతూ వచ్చింది కానీ ఆతను ఎప్పుడు పత్రికా స్వేచ్ఛ  గురించిన ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు.

ఈ ఒక్క చిన్న ఉదాహరణతో పత్రికాస్వేచ్ఛ భాష్యం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఈ స్వేచ్ఛ  అనేది జర్నలిష్టులకన్నా వారు పనిచేసే పత్రికల యాజమాన్యాలు ఎక్కువగా అనుభవిస్తున్నాయని అభిప్రాయపడడంలో తప్పులేదేమో.

నా ఈ అభిప్రాయం బలపడడానికి యిటీవల జరిగిన మరో సంఘటన దోహదం చేసింది.
ఆకాశవాణి, దూరదర్శన్ వార్తా విభాగాలలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి పదవీ విరమణ అనంతరం అడిగిన పత్రికలవారికి వారు అడిగిన అంశాలపై నా అనుభవాలను జతచేసి వ్యాసాలు రాసే పనిని ఒక పనిగా పెట్టుకున్నాను. ఈ పత్రికలు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న పత్రికలు. కానీ వాటి సంపాదకులు ఎవ్వరు కూడా నేను రాసిన అంశాలతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా - ఏనాడూ ఒక చిన్నవాక్యాన్ని సయితం ఎడిట్చేయలేదు. రాసినవి రాసినట్టు ప్రచురిస్తూ వస్తున్నాయి. పేరుకు చిన్న పత్రికలయినా పెద్దమనసుతో పత్రికా స్వేచ్చకుపెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో - బాగా ప్రాచుర్యంలో వున్న ఒక పెద్ద దినపత్రిక సంపాదక వర్గం వారు ఈ మధ్య ఫోను చేసి ఒక అంశంపై ఆర్టికిల్ అడిగి మరీ రాయించుకున్నారు. వారు అడిగిన వ్యవధిలోనే పంపడం జరిగింది కానీ ఆ వ్యాసం మాత్రం వెలుగు చూడలేదు. కారణం కూడా వారే సెలవిచ్చారు. నేను పంపిన ఆర్టికిల్ లోని విషయం వారి ఎడిటోరియల్ పాలసీకి అనుగుణంగాలేదట. అందుకే ప్రచురించలేదట.
నార్ల వెంకటేశ్వర రావు గారు, నండూరి రామమోహనరావు గారు, పురాణం సుబ్రమణ్యశర్మ గారు మొదలయిన ఉద్దండ జర్నలిస్టులు సంపాదకులుగా వున్నప్పుడు వారి పత్రికలలో వారి మార్గదర్సకత్వంలో   ఉపసంపాదకుడిగా పనిచేసిన అనుభవం నాకున్నది. ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం రావడానికి ఈ అనుభవమే అక్కరకు వచ్చింది. తెలుగు జర్నలిజానికి పునాది రాళ్లుగా నిలిచిన వీరెవ్వరు - ఎడిటోరియల్ పాలసీఅంటే ముందు పేర్కొన్న పత్రిక వైఖరి మాదిరిగా వుంటుందని వుంటుందని ఎప్పుడు చెప్పలేదు. ఆ పాలసీ అనేది కేవలం పత్రిక రాసే సంపాదకీయాలకు మాత్రమే  పరిమితం కావాలి కాని, . పత్రికలో పడే ప్రతి వార్తా, ప్రతి వ్యాసం ఆ పత్రికా విధానానికి అనువుగా వుండాలని పట్టుబడితే ఇక పత్రికాస్వేచ్చకు  అర్ధమేముంటుంది?

నిజంగా జరిగిన ఒక ఉదంతంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
ఒకానొక ప్రముఖ దినపత్రిక సమాజంలో నైతిక విలువలు భ్రష్టు పట్టిపోతున్నాయని తన సంపాదకీయాలలో గగ్గోలు పెడుతుండేది. ఒక రోజు ఆ సంపాదకుడికి ఒక లేఖ వచ్చింది. అందులో ఇలావుంది.

అయ్యా! సమాజం పట్ల, ఆ సమాజంలో లుప్తమవుతూవస్తున్న నైతిక విలువలపట్ల మీకున్న ఆవేదన మెచ్చదగినదిగావుంది.

అయితే మీకు తెలియని విషయం ఒకటుంది. మీ పత్రిక ఆఫీసు దగ్గరలో  ఓ చాయ్ దుకాణం వుంది. పావలా మనది కాదనుకుని అరకప్పు టీ తాగిస్తే అరకాలం వార్త మీ పేపర్లో రాసే సిబ్బంది ఆ దుకాణంలో ఎప్పుడు సిద్దంగా వుంటారు. సమాజం సంగతి సరే! ముందు మీ ఇల్లు చక్కపెట్టుకోండి







19, జూన్ 2014, గురువారం

అలనాటి ఆకాశవాణి


నిన్న పుట్టింటికి వెళ్ళి వచ్చాను. మగవాళ్ళకి పుట్టిల్లు వాళ్లు మొదట్లో పనిచేసిన ఆఫీసులే కదా. అలా రేడియో స్టేషన్ కు వెళ్లాను. పుట్టిల్లు కదా. వాయినాలు బాగానే ముట్టాయి. మంచి పుస్తకం చేతికి వచ్చింది. రేడియో స్టేషన్ లో పుస్తకాలు ఏమిటి అన్నదానికి కూడా ఒక కధ రెడీగా వుంది.
ఆకాశవాణిలో అలనాడు ఎన్నడో చేరి అంచెలంచెలుగా ఎదిగి దూరదర్శన్ అదనపు డైరెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేసిన డాక్టర్ ఆర్. అనంత పద్మనాభరావు తన అనుభవాల సమాహారాలను గుదిగుచ్చి 'అలనాటి ఆకాశవాణి' అనే పేరుతొ గ్రంథస్తం చేశారు. ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికే నేను వెళ్ళింది. తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు శ్రీ కె వీ రమణాచారి ఈ గ్రంధాన్ని ఆవిష్కరించారు. ఆకాశవాణి డైరెక్టర్ శ్రీ దూరదర్శన్ డైరెక్టర్ శ్రీమతి శైలజా సుమన్, మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ వీ ఎస్ రెడ్డి పాల్గొన్నారు.


(శ్రీ ఎన్వీ ఎస్ రెడ్డి, డాక్టర్ పద్మనాభ రావు, శ్రీ ఆదిత్య ప్రసాద్) 

వూపిరి తిరగని బాధ్యతలతో ఎప్పుడూ తలమునకలుగా వుండే మెట్రో రైల్ ఎండీ శ్రీ ఎన్.వీ. ఎస్. రెడ్డి ఆకాశవాణి పట్ల తమ అభిమానాన్ని చాలా బాగా  వ్యక్తం చేశారు. 'వాణిజ్య కాలుష్యం సోకని సంస్థ నాటి ఆల్ ఇండియా రేడియో' అంటూ ఒక్క ముక్కలో గొప్పగా చేప్పేశారు.


(ప్రసంగిస్తున్న శ్రీ రమణాచారి)

ఇక రమణాచారిగారు. ఆకాశవాణితో తనకున్న మమకారాన్ని  ఏమాత్రం భేషజానికి పోకుండా బయట పెట్టేశారు.  ఐ.ఏ.ఎస్.లో చేరకముందు అతి పిన్న వయస్సులోనే సైఫాబాద్ కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తున్న రోజులనుంచే ఒక్కసారయినా రేడియో ప్రోగ్రాం లో పాల్గొనాలని ఆయన కోరికగా వుండేదట. అందుకని కాలేజీ పని కాగానే నడుచుకుంటూ వచ్చి రేడియో స్టేషన్ పక్కనేవున్న ఝం ఝం కేఫ్ ఇరానీ హోటల్ నుంచి రేడియో ప్రహరీ గోడ వెంట నడుచుకుంటూ మెయిన గెట్ వద్ద వరకు వచ్చేవారట. లోపలకు పోవాలంటే గేటు దగ్గరే కాపలా మనిషి. ఇక పని కాదనుకుని మళ్ళీ వెనక్కు తిరిగి ఝం ఝం కేఫ్ వరకు, మళ్ళీ  గేటు వరకు అటూ ఇటూ అనేక మార్లు పచార్లు చేసేవారట. ఎలాగయితేనేం ఒక రేడియో నాటకంలో వేసి తన చిరకాల కోరిక తీర్చున్నారట. ఆయన ధారణ శక్తి అపూర్వం. రేడియో దిగ్గజాల పేర్లు ఆయన అలవోకగా స్మరించుకుంటూ పోతుంటే ఆ సమావేశంలో కూర్చున్న రేడియో వారికే మతులు పోయాయి.
పోతే, ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ శ్రీ ఆదిత్యప్రసాద్ ప్రస్తావించిన 'ఆకాశవాణి ప్రచార సభ' పధకం గురించి వింటుంటే ఒకనాడు ఆ సంస్థలో పనిచేసిన నా కళ్ళు చమర్చాయి. ఆ విశేషాలు మరో సారి.

25, డిసెంబర్ 2009, శుక్రవారం

విందామయా నరుడ విందామయా - భండారు శ్రీనివాస రావు

విందామయా నరుడ విందామయా - భండారు శ్రీనివాస రావు

చిన్నప్పుడు చదివిన ముళ్ళపూడి వారి జోక్ గుర్తొస్తోంది.
"పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.
తరవాత్తరవాత - మొగుడి మాట పెళ్ళాం వింటుందట.
పొతే, ఆ తరవాత మాత్రం - ఆ ఇద్దరి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట."

ఈ వినడం అన్నది చెవికి సంబంధించిన విషయం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే పోలా - అనే చెవలాయిలు- వినదగునెవ్వరు చెప్పిన అని- ఎవరేది చెప్పినా చెవులు రెండూ వొగ్గించి, రిక్కించి మరీ వింటారు.

కొందరు భార్యలు - " నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు " అన్న తృప్తిలో అన్ని అసంతృప్తులు మరచిపోతుంటారు. మగవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి, మాట వినే పెళ్ళాం దొరికిందని బయట చెప్పుకుంటూ, మురిసి ముక్కచెక్కలవుతూ మగధీరులమని మీసం మెలేస్తుంటారు.

వినికిడి సమస్య అంటూ లేకపోతె, ఈ వినకపోవడం అన్న ప్రసక్తే వుండదు. ఆ సమస్య వుంటే ఈ వినే సమస్యకు తావుండదు. ఎంచక్కా, ఎవరేం చెబుతున్నా వింటున్న ఫోజు పెట్టి- చెప్పేవాళ్ళ నోటి దురద వొదిలించవచ్చు.
విని, తలాడించే అలవాటు మగవాళ్ళలో ముఖ్యంగా పెళ్ళయిన వాళ్లలో ఎక్కువన్న థియరీ ఒకటుంది. ఈ బాపతు మగాళ్ళు ఆ బాపతు అపప్రధ వొదిలించుకోవడానికి ఆదర్శ పురుషుల అవతారం ఎత్తుతుంటారు. " భార్య మాట వింటే తప్పేమిటి? ఆవిడా మనలాంటి మనిషే కదా." అంటూ తమకి తాము సర్ది చెప్పుకుంటారు.

కాగా మరో రకం మగాళ్ళు- తమ మగాడితనాన్ని - వేరే రకంగా ప్రదర్శిస్తుంటారు.

" నన్నడిగితే అసలు మగాళ్ళ మాటల్ని ఆడవాళ్ళు వినకపోవడమే కాదు, ఎదిరించమని కూడా చెబుతాను. నా విషయమే తీసుకోండి. మామూలుగా మొగుళ్ళు రాగానే భార్యలు లేచినిలబడడం ఆనవాయితీ కదా. మా ఇంట్లో అలా కాదు. నేను బయట నుంచి రాగానే మా ఆవిడ లేచి నిలబడబోతుంది. పరవాలేదు కూర్చో అంటాను. నా మాట వినొద్దన్నది మా ఇంట్లో నా రూలు కాబట్టి లేచి నిలబడుతుంది. చూసారా! అదీ నేను నా భార్య కిస్తున్న స్వేఛ్చ." అంటుంటారు ఈ కోవలోకి వచ్చే మొగుళ్ళు.

బొత్తిగా మాట వినని జనం -జనాభాలో ఎక్కువ. వీళ్ళని 'సీతయ్యలు' అంటారని కూడా ఈ మధ్యనే తెలిసింది - ఓ సినిమా పుణ్యమా అని.

పొతే,వినడం వినకపోవడం అన్న రూట్లో ముందుకుపోయే పని కాసేపు పక్కనపెడదాం.

హైదరాబాద్ ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ పీ ఎస్ గోపాల కృష్ణ -'విన్నవింత' అనే శీర్షికతో రేడియో లో ఒక కార్యక్రమం కొన్నాళ్ళు నడిపారు. విన్న వింతలను శ్రోతలతో పంచుకోవడం రచయిత ఉద్దేశ్యం. అయితే వినేవారికి పెద్దపీట వేసే పెద్ద మనసు వున్నవాడు కనుక, విన్నవించుకోవడం అనే అర్థంతో దానికి "విన్నవింత" అని పేరు పెట్టారు.

మా బోటి రేడియోలో పనిచేసిన వాళ్లకి వినే వాళ్ళే 'దేవుళ్ళు' కాబట్టి , పొద్దునపూట వచ్చే ఆ ప్రోగ్రాం వాళ్ళకో 'నివేదన' గా భావించే వాళ్ళం. ఆయన చెప్పే వన్నీ మంచి విషయాలే కాబట్టి , ఆ రోజుల్లో శ్రోతలు కూడా మంచి సంగతులు వినే బాపతు కాబట్టి- ఆయన కూడా రకరకాల పనికొచ్చే కబుర్లతో దాన్ని తీర్చిదిద్దేవారు.(ఇన్ని కా'బట్టీలు' అవసరమా అంటే- ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పకపోతే రేడియో వాళ్లకి తెలుగు రాదు అని అపోహపడే ప్రమాదం సయితం లేకపోనూ లేదు) . శ్రోతలు కూడా 'రేడియోలోచెప్పడమేమిటి? మనం వినడమేమిటి?' అని భేషజాలకు పోకుండా బుద్దిగా వినేవారు. ఆ విధంగా చెప్పేవారికి వినేవారు, వినేవారికి చెప్పేవారు లేరనే కరువు లేకుండా పోయింది. ఆ మాటకు వస్తే ఆ రోజుల్లో రేడియోలో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో వినేవాళ్ళం అని గుర్తు చేసుకునే ఆనాటి శ్రోతలు ఈ రోజుల్లో కూడా తారసపడడం కద్దు.
మళ్ళీ అసలు సంగతికొస్తే-
'వినంగానే సరిపోదు- విన్నది ఆచరించాలనీ - అప్పుడే విన్నదానికి సార్ధకత' అనే వాళ్ళున్నారు.
'ఒరేయ్ కన్నా! మోటార్ సైకిల్ పై అంత స్పీడ్ గా వెళ్లకురా!' అని తండ్రి అంటే- పిల్లాడు విన్నట్టుగా తలాడిస్తే - నిజానికి అది వినడం కిందికి లెక్క రాదు.
విని పాటించినప్పుడే - 'రాముడు మంచి బాలుడు, తలిదండ్రుల మాట జవదాటడు' అని కన్నవాళ్ళు - వినే వాళ్లకు చెప్పుకునే వీలుంటుంది.

వినడంలో ఇంత విషయం వుంది కాబట్టే- నోములు, వ్రతాలు చేసేటప్పుడు వ్రత కధలు విన్నవాళ్ళకు కూడా 'వ్రత ఫలం' లో భాగం కల్పించారని - సూతుడు శౌనకాది మునులకు చెప్పగా-అది విన్నవాళ్ళలో ఒకడు తెలియచేయడమైనదని సర్వజనులకు ఇందుమూలముగా తెలియపరచడమైనది.



------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

వ్యాపకాల జ్ఞాపకాలు

వ్యాపకాల జ్ఞాపకాలు



వెనుకటి రోజుల్లో -

రేడియో ఒక్కటే రాజ్యమేలుతున్న కాలంలో-

ఒక పెద్ద మనిషి నేను పనిచేస్తున్న ఆకాశవాణి కార్యాలయానికి ఫోన్ చేసి, ' మీ రేడియో వార్తలు వినలేక చస్తున్నాము ' అన్నాడు కోపంగా.

'పరిష్కారం మీ చేతుల్లోనే వుందికదా' అన్నాను జవాబుగా.

ఇందులో సమాధానం కన్నా ఎకసక్కెం పాలు ఎక్కువ వుందనుకున్నాడో ఏమో - 'ఎలా?' అన్నాడు మరింత కోపంగా.

'మీ రేడియో నాబ్ ని ఎడమవైపు తిప్పండి సరిపోతుంది.' అన్నాను కూల్ గా.

రేడియో పెట్టుకోవడం, ఆపుచేసుకోవడం మీ చేతుల్లో పనే కదా! అన్నట్టుగా ధ్వనించిన నా జవాబులో - ఏదయినా చమత్కారం తోచిందో ఏమో కాని, 'భలే వారే' అంటూ ఫోన్ పెట్టేసాడా శ్రోత.

మీడియాలో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి అనుభవాలు మామూలే.

అయితే- ఎంతో కష్టపడి ప్రోగ్రాం తయారుచేసామనే భావనతో వుండే సిబ్బంది - విమర్శలను తట్టుకోలేకపోవడం కూడా సహజమే. కానీ, ఇక్కడ మరో నిజం కూడా ఒప్పుకోవాలి. వ్యంగాస్త్రాలను అలవోకగా సంధించగల మీడియా వారు కూడా కొండకచో వ్యంగాన్ని భరించలేరు. కొన్ని పాళ్ళు స్వామి భక్తీ, కొన్నిపాళ్ళు వృత్తిమీది అనురక్తి - కలగలసి వారినలా మారుస్తుంది. అయితే- విమర్శలు చేసేవారికి - వాటిని స్వీకరించగల సహృదయత వుండాలనుకోవడం అత్యాస కాదేమో!

ఆలోచిస్తే తప్పేముంది?

- భండారు శ్రీనివాస రావు

24, డిసెంబర్ 2009, గురువారం

దూరదర్శన్లో ఉద్యోగ విరమణ రోజున_

________________దూరదర్శన్లో ఉద్యోగ విరమణ రోజున________________________

అందరికీ నమస్కారం...



జాతస్య మరణం ధృవం అన్నట్టు- సర్కారు ఉద్యోగికి ఏదో ఒకనాడు-'ఈనాడు ' అనేది రాక తప్పదు.



నా వృత్తి జీవితపు చరమాంకంలో కొద్దికాలం మీతో కలిసి పనిచేసే సదవకాశం దొరికింది. పరస్పర అవగాహనకు ఈ స్వల్ప సమయం చాలకపోవచ్చు. కానీ మీ అభిమానం చూస్తుంటే ఈ అభిప్రాయం తప్పేమోనని అనిపిస్తోంది.



చూస్తుండగానే ముప్పయ్యేళ్ళు చక చకా గడిచిపోయాయి.ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నట్టు కాలం హాయిగా వేగంగా దొర్లిపోయింది. వొప్పచెప్పిన పనులతోపాటు చిన్నా చితకా ఇతరత్రాలు కూడా నెత్తికెత్తుకున్నందువల్ల -చేసే పనిలో ఏనాడూ రొటీన్ ఫీల్ కాలేదు.ఏరోజుకారోజు కొత్తగా గమ్మత్తుగా గడిచిపోయింది.



అసూయ తెలియని పై అధికారులు-అత్మీయత కనబరిచే సాటి సిబ్బంది- ఏ ఉద్యోగికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది?



అందుకే- అత్త లేని కోడలులాగా అందరిలోను-అందరితోను కలిసిపోయి,కలగలిసిపోయి ఓ మోస్తరుగా అత్తెసరు మార్కులు కొట్టేయగలిగానని అనుకుంటున్నాను.



అయితే ఉప్పూ, కారం తినేవాడిని కనుక - ఎప్పుడో ఒకప్పుడు - ఎవరినోఒకరిని నొప్పించే వుంటాను. మాటతూలే వుంటాను. ఇలాంటి సందర్భాలలో అప్పటికప్పుడే సారీ చెప్పేసి మనసు కడిగేసుకోవడం నాకలవాటు. అయినా, నావల్ల మనసు నొచ్చుకున్నవారెవరైనావుంటే మన్నించమని మనసారా కోరుకుంటున్నాను. అప్పుడే ప్రశాంతమైన ఉద్యోగ విరమణ పర్వానికి అర్ధం పరమార్ధం.



నాకు మాట్లాడడం రాదు.ఇది నా మాట కాదు.-మా ఆవిడ ఉవాచ.

అందుకే మనసులోని మాటలను ఇలా అక్షరాలలో పరచి మీ అందరితో పంచుకుంటున్నను.



మీ వద్ద సెలవు తీసుకునేముందు మరో మాట...



నిజమే!కృతజ్ఞతలు బాహాటంగా చెప్పడం చాల కష్టమే...



అందుకే మీ అందరికీ మరోసారి మరొక్క నమస్కారం.



హైదరాబాదు

02-01-2006. -భండారు శ్రీనివాసరావు