కడప ఉప ఎన్నికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కడప ఉప ఎన్నికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

వోటు వేళ వేటు రాజకీయం – భండారు శ్రీనివాసరావు

వోటు వేళ వేటు రాజకీయం – భండారు శ్రీనివాసరావు


(22-04-2011 తేదీన సూర్య దినపత్రికలో ప్రచురితం)

అలనాడు కౌరవ సభలో ధర్మరాజు శకుని ఆడిన కపట ద్యూతంలో సమస్తం కోల్పోయి ఆఖరుకు పణంగా వొడ్డిన ఆలిని కూడా పోగొట్టుకున్న తరువాత అంతఃపురంలో వున్న ద్రౌపదిని నిండు కొలువుకు తీసుకురమ్మని దుర్యోధనుడు తన కింద పనిచేసే ప్రాతికామిని ఆదేశిస్తాడు. తనను కొనిపోవచ్చిన ప్రాతికామినిని ద్రౌపది ఒకే ఒక ప్రశ్న వేసి దానికి జవాబు తెమ్మని కోరుతుంది. జూదంలో ధర్మరాజు ముందుగా ‘తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా?’ అన్నది ద్రౌపది తెలుసుకోదలచిన ధర్మసూక్ష్మం. పైగా దీనికి సమాధానాన్ని ధర్మకోవిదుడయిన భీష్ముడి నుంచి రాబట్టాలనుకుంటుంది.

సరిగ్గా ఇప్పుడు అదే సందేహం ఆంధ్ర ప్రదేశ్ విధానసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముందు మరో రూపంలో నిలుచుంది. టీడీపీ సభ్యుడిగా రాజీనామా చేసిన పోచారం శ్రీనివాసరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఆ పార్టీ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలా లేక సభ్యుడు నేరుగా స్పీకర్ కు పంపిన రాజీనామాను ఆమోదించాలా అన్న ధర్మసంకటంతో ఆయన చాలాకాలంగా గుంజాటన పడుతున్నారు. ద్రౌపది మనసులో మెదిలినట్టుగా వీటిల్లో ఏది ముందు ఏది వెనుక అనే మీమాంస నుంచి బయటపడడానికి మనోహర్ ఎక్కువ సమయమే తీసుకుంటున్నట్టుంది. కాకపొతే, కడప ఉపఎన్నికల రూపంలో తరుముకొచ్చిన రాజకీయ వొత్తిళ్ల దృష్ట్యా ‘జగన్ అనుచర ఎమ్మెల్యేల’ విషయంలో తాడో పేడో తేల్చుకోవాల్సిన స్తితి దాపురించడంతో ఆయన హడావిడిగా న్యాయ నిపుణులను సంప్రదించి, అనర్హత వేటు వేసే విషయంలో ముందు టీడీపికి చెందిన ముగ్గురు సభ్యులకు సంజాయిషీ నోటీసులు పంపారు. ఈ సభ్యుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న తాపత్రయం కంటే జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను కట్టడి చేయడం అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత కలిగిన అంశంగా మారిపోయింది. రాజాజ్ఞను ధిక్కరిస్తూ హరి భజన చేసే ప్రహ్లాదుడిపై బెత్తం ఎత్తలేని అసహాయ గురువులు చండామార్కులు - ఇతర రాక్షస విద్యార్ధులపై దండ ప్రయోగం చేస్తూ, వాటిని చూసయినా రాజకుమారుడు బెదిరిపోయి దారికి రాకపోతాడా అని ప్రయత్నించిన చందంగా – స్పీకర్ కార్యాలయంలో చాలాకాలంగా పెండింగ్ లో పడి వున్న ’అనర్హత’ పిర్యాదులను వెలికి తీసి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ తలపెట్టి ముందుగా సంబంధిత సభ్యులకు నోటీసులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.తదనుగుణంగానే, అనర్హత వేటు వేయాలని కోరుతూ గతంలో తెలుగుదేశం పార్టీ పిర్యాదు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళాయి. లోగడ ఇదే మాదిరి నోటీసు అందుకున్న మరో టీడీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి తాజాగా ఇంకో నోటీసు ఇచ్చారు. అంతకుముందు అందుకున్న నోటీసుకు ప్రసన్న కుమార్ రెడ్డి సమాధానం ఇవ్వడం జరిగింది కానీ, ఆ తరవాత కూడా ఆయన సొంత పార్టీని లెక్క చేయకుండా ఢిల్లీ, విజయవాడలలో జరిగిన జగన్ కార్యక్రమాలకు హాజరయినందువల్ల పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు నిర్ధారణ అయినందువల్ల ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ టీడీపీ, స్పీకర్ కు మరోసారి పిర్యాదు చేసిన నేపధ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా మనోహర్ నోటీసు పంపారు. దీనికి ఆయన ఇచ్చే సంజాయిషీ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ తలపోస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన ప్రజారాజ్యం పార్టీ అద్యక్షుడు చిరంజీవి కూడా జగన్ వెంట వెడుతున్న తమ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలపై సయితం చర్య తీసుకుని అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరాలని నిర్ణయించారు.

ఎన్నో నెలలుగా పెండింగులో వున్న అంశాలకు ఇంత ఆదరాబాదరాగా స్పీకర్ స్తానంలో వున్న డిప్యూటీ స్పీకర్ స్పందించడానికి కారణాలు వూహించడం కష్టమేమీకాదు. పేరుకు స్పీకర్ పదవి అన్నది రాజకీయాలకు అతీతంగా నిర్వహించాల్సినదే అయినా ఆచరణలోకి వచ్చేసరికి అధికారంలో వున్న పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవడం కొత్తేమీ కాదు. పొరుగున వున్న కర్నాటకలో జరిగింది కూడా ఇదే.

కర్ణాటకను ఆదర్శంగా తీసుకుని అసమ్మతి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి కాంగ్రెస్ పార్టీ పావులు కదపడం మొదలెట్టింది. ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క, విప్ కొండ్రు మురళి హడావిడిగా అటు ముఖ్య మంత్రిని, డిప్యూటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను విడివిడిగా కల్సుకుని సంప్రదింపులు సాగించారు. వీటికి తోడు జగన్ వర్గానికి మద్దతు తెలుపుతున్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు భట్టిని కలుసుకున్నట్టు వార్తలు వెలువడడంతో ఏదో జరగబోతున్నదన్న అనుమానాలు వెల్లువెత్తాయి. ‘ఏ క్షణంలోనయినా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం’ అంటూ టెలివిజన్ తెరలపై ఒక రోజల్లా స్క్రోలింగులు పరిగెత్తాయి. ఆయా పార్టీల ప్రతినిధులు, విశ్లేషకులు జరుగుతున్న పరిణామాలపై తమ తమ అభిప్రాయాలతో కొన్ని గంటలపాటు శ్రోతలను హోరెత్తించారు. తమపై వేటు వేసే తెగింపు కాంగ్రెస్ నాయకత్వానికి ఎక్కడిదన్న ధోరణిలో జగన్ మోహన్ రెడ్డికి తొలినుంచి బాహాటంగా బాసటగా నిలబడ్డ కొండా సురేఖ ఎద్దేవా చేశారు. అనర్హత వేటు వేస్తె దాని పరిణామాలు తీవ్రంగా వుంటాయని అంటూ ‘మరో ఆగస్టు సంక్షోభం’ గురించి ప్రస్తావన తెచ్చి ప్రభుత్వ పతనం తప్పదన్న తీరులో హెచ్చరికలు చేశారు. ఏతావాతా ఏమిజరిగిందో కానీ, కాంగ్రెస్ నాయకులు చెబుతూ వచ్చిన ‘ఆ క్షణం’ రాకుండానే ఇరవై నాలుగ్గంటలు లక్షణంగా గడిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీలోని ఈ విలక్షణ లక్షణం మరోమారు వెలుగు చూడడం మినహా జరిగిందేమీ లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తొలుత తీసుకున్న నిర్ణయం అమలును ఒకటి రెండు రోజులు వాయిదా వేసుకోవాలని ఆ పార్టీ తలపోస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయపరమయిన చిక్కులు ఎదురవకుండా జగన్ వెంట నడుస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతను ఆపాదించేందుకు వీలయిన అన్ని ఆధారాలను సిద్ధం చేసుకుని పకడ్బందీగా పిర్యాదు చేయాలన్నదే వాయిదాకు కారణంగా చెబుతున్నారు.ఒక్క పెట్టున అందరిపై వేటు వేయాలా లేక కొందరిపై ముందు చర్య తీసుకుని మిగిలినవారికి తద్వారా హెచ్చరికలు పంపాలా అన్న విషయంలో ఆ పార్టీ నాయకులకు ఇంకా స్పష్టత వచ్చినట్టులేదు. ఏ అడుగు వేస్తె ఏమవుతుందో, దాని ప్రభావం కడప ఎన్నికలపై ఏవిధంగా వుంటుందో అన్న గుంజాటనలో పార్టీ నాయకత్వం కొట్టుమిట్టాడుతున్నట్టుగా వుంది. చివరకు తెముల్చుకుని పిర్యాదు చేసినా దానిపై చర్యకు ఎంతోకొంత కాలం పడుతుంది.

కాగా, కడప ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, జగన్ వోటమి అన్న ఒక్క లక్ష్యాన్నే పెట్టుకుని సర్వశక్తులు వొడ్డి పోరాడుతున్నట్టుగావుంది. సగానికి సగం మంత్రివర్గాన్ని కడపలో మోహరించి, గెలుపుకు ఉపయోగపడే ఏ చిన్న అవకాశాన్ని వొదిలిపెట్టరాదన్న ధ్యేయంతో పనిచేస్తున్నట్టుగా ప్రస్తుత వాతావరణం తెలుపుతోంది. అందుకే, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఒక అడుగు ముందుకు వేసి - జగన్ కు, భారతీయ జనతా పార్టీకి ముడిపెట్టి మాట్లాడే సరికొత్త వ్యూహానికి తెర లేపారు. దాన్ని అందిపుచ్చుకున్న పార్టీ నాయకులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ జగన్ పార్టీకి ముస్లిం వోటర్లను దూరం చేసే ప్రచారాస్త్రాలను ప్రయోగిస్తున్నారు. కాంగ్రెస్ ను, ఆ పార్టీ అధినేత్రి సోనియాను అనుదినం విమర్శిస్తున్న జగన్ మోహన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో గెలిచి తిరిగి లోకసభలో అడుగు పెడితే ఆయన వేసే తొలి అడుగులు బీజేపీ వైపే అని తేల్చిచెప్పడం మొదలెట్టారు. సాధారణంగా ఇటువంటి వూహాజనిత అంశాలపై స్పందించాల్సిన అవసరం లేదని దాటవేసేవారు కూడా అధ్యతన భావిలో జగన్ పార్టీ బీజేపీ పంచన చేరుతుందని బల్ల గుద్ది చెబుతుండడం చూస్తే ఇది ఖచ్చితంగా కడప ఉప ఎన్నికలకోసం రూపొందించిన ఎత్తుగడగా అర్ధం అవుతుంది. కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారానికి తగ్గట్టే మీడియాలో కూడా ఈ అంశంపై విస్తృత చర్చలు ప్రారంభమయ్యాయి.

అలాగే, తెలంగాణా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి వెల్లడించాలని వస్తున్న డిమాండ్ కూడా ఈ కోవలోకే వస్తుంది. ప్రధాన పార్టీలే ఈ విషయంలో మీనమేషాలు లెక్కపెడుతున్నప్పుడు అప్పుడే పురుడు పోసుకున్న పార్టీ విధివిధానాలు ఏమిటన్న ప్రశ్న అర్ధరహితం.

ఈ ఎన్నికల సందర్భంగా వెలువడుతున్న అన్ని రకాల అభిప్రాయాలపై ప్రజలు తమ తీర్పును కొద్ది రోజుల్లో చెప్పబోతున్నారు. అది శాసన సభ్యుల అనర్హత విషయం కావచ్చు, అక్రమార్జనలతో సాగించే ఎన్నికల పోరాటాలు కావచ్చు, అవకాశవాద రాజకీయాలు కావచ్చు – అంశం ఏదయినా తుది తీర్పు ప్రజలదే. అంతిమ నిర్ణయం జనాలదే. వోటు వేసే వోటరుకే పాలకులపై వేటు వేసే హక్కు వుంటుంది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవారు ఎవరయినా గుర్తుంచుకోవాల్సిన ప్రాధమిక పాఠం ఇది.

సాధారణంగా ఉపఎన్నికల్లో ఒకటి రెండు స్తానాలు గెలుచుకున్నా పోగొట్టుకున్నా పాలకపక్షానికి వచ్చేదీ పోయేదీ యేమీవుండదు. కానీ ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్న నేపధ్యం ఎంతో విలక్షణమయినది. అందుకే, దేశంలో మరో అయిదు రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీల ఎన్నికలు కూడా కడప ఉప ఎన్నికల ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించ లేకపోయాయి. జాతీయ మీడియా సైతం ఈ ఎన్నికలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కడప ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా జాతీయ స్తాయిలో సైతం ప్రభావితం చేసే అవకాశాలు వుండడమే దీనికి కారణం.(21-04-2011)

11, ఏప్రిల్ 2011, సోమవారం

ఎంత మార్పు! ఎంత మార్పు!! ఇంత మార్పు దేనికోసం? – భండారు శ్రీనివాసరావు


ఎంత మార్పు! ఎంత మార్పు!! ఇంత మార్పు దేనికోసం? – భండారు శ్రీనివాసరావు

కడప ఉప ఎన్నికల్లో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది అన్నదే ఈనాడు అందరి మనస్సులనూ తొలుస్తున్న తొలి ప్రశ్న. వారసత్వ రాజకీయాలను ఈసడించుకునే వారు సైతం ‘వై.ఎస్.ఆర్.’ కి నిజమయిన రాజకీయ వారసులెవ్వరు?’ అని లేవనెత్తుతున్నది రెండో ప్రశ్న.
‘విదియ నాడు కనబడని చంద్రుడు తదియ నాడు తానే కనబడతాడ’న్న సామెత ప్రకారం వీటికి సమాధానం లభించడానికి కొద్ది వారాలు ఆగితే చాలు. స్వల్ప వ్యవధిలో తేలిపోయే విషయాలే అయినా ఎన్నికల సమరంలో దిగినవారెవ్వరూ అంత తేలిగ్గా తీసుకుంటున్న దాఖలాలు లేవు. కారణం రాష్ట్రం లోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు తాజాగా ఎన్నికల బరిలో కాలు మోపుతున్న కొత్త పార్టీ - వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఉప ఎన్నికలు ఒక రకంగా అగ్ని పరీక్షే. ఇందులో నెగ్గగలిగితేనే మునుముందు రాజకీయంగా నెగ్గుకురాగలిగిన పరిస్తితి జగన్ పార్టీది. భవిష్యత్తును ఆటో ఇటో తేల్చగల ‘తుది సమరం’ జగన్ పార్టీ చేయబోతోంది కనుక అసలు సిసలు పరీక్ష ఆ పార్టీదే.
పోతే, తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే కాని  ప్రాణాంతకం కావు. కాకపొతే, ప్రాంతీయ ఉద్యమాలతో దిక్కుతోచని స్తితిలో వున్న ఆ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో లభించే కాసింత విజయం కూడా కొండంత ఆత్మ విశ్వాసాన్ని కొనితెస్తుంది కాబట్టి కడప ఉపఎన్నికలు టీ.డీ.పి. కి సైతం ముఖ్యమయినవే.
ఇక కాంగ్రెస్ విషయం తీసుకుంటే, ఎన్నికల ఫలితాలు ఎలావున్నా, రాష్ట్రంలో ప్రభుత్వ మనుగడకు వెనువెంటనే వచ్చే ముప్పు ఏమీ వుండకపోవచ్చు. అయినా, ఈ ఎన్నికల్లో పరాజయం పాలయితే దాని ప్రభావం ముందు పడేది పార్టీ రాష్ట్ర నాయకత్వం మీదే అన్న ఎరుక ఆ పార్టీ నాయకులకు లేకపోలేదు. పైపెచ్చు, ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కడపలో తగిలిన ‘ఎదురు దెబ్బ’ నేపధ్యంలో – కడప, పులివెందుల ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నిజమయిన అగ్ని పరీక్షగా మారనున్నాయి.
ఎన్నికల చిహ్నం ఏమిటో కూడా తెలియకముందే కొత్త పార్టీ నాయకుడు, వై ఎస్సార్ తనయుడు జగన్, దివంగత నేత భార్య విజయమ్మ- అందరికంటే ముందుగానే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘ఆత్మగౌరవానికి అహంకారానికీ నడుమ జరిగే సమరంగా’ ఆయన తన ఎన్నికల నినాదాన్ని ఓటర్లపై వొదిలారు. ‘కడప ఉపఎన్నికలు వైఎస్సార్ కు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు మధ్య జరిగే యుద్ధంగా’ కూడా ఆయన అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. సోనియాపై ఈగ వాలినా వూరుకోని కాంగ్రెస్ నాయక శ్రేణులు జగన్ వ్యాఖ్యను ఆయన అహంభావానికి నిదర్శనమని విమర్శించాయి. వై ఎస్ జీవించివున్న కాలంలో ఆయన సోనియా పట్ల ప్రదర్శించిన వినయ విధేయతలను ఉటంకిస్తూ, ఆయనే ఈనాడు బతికి వుంటే జగన్ వ్యాఖ్యలకు ఎంతగా కుమిలి పోయివుండేవారో జగన్ తెలుసుకుని మాట్లాడాలని సలహా చెప్పాయి. అయితే, వై. ఎస్. ఆర్. అనేది కొత్త పార్టీ పేరు కనుక దీంట్లో తప్పు పట్టాల్సిందీ, ఆక్షేపించాల్సిందీ ఏముందన్నది జగన్ వర్గీయుల వాదన.
మామూలు పరిస్థితుల్లో అయితే, ఒకటి రెండు స్తానాలకు జరిగే ఉపఎన్నికల ఫలితాల ప్రభావం పాలక పక్షం పై పడే అవకాశం వుండదు. సంఖ్యాబలంలో చిన్న చిన్న తేడాలు ప్రభుత్వ మనుగడకు ప్రమాదకరంగా మారే వీలుండదు. అయితే ఈసారి కడప పార్లమెంట్, పులివెందుల శాసన సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఒక ప్రత్యేక రాజకీయ నేపధ్యంలో జరుగుతున్నాయి. వీటికి లోగడ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శ్రీమతి విజయమ్మ ఇరువురూ కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, ఆ పార్టీకి రాజీనామా చేసి, చట్టసభల్లో తమ సభ్యత్వాలను వొదులుకుని, వై. ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని మళ్ళీ ఎన్నికల బరిలో దిగిన కారణంగా, కడప ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. ప్రత్యేకించి ఇటీవలే జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఎదురయిన పరాజయాలు పాలక పక్షాన్ని కొంత ఇరకాటంలో పడేసిన నేపధ్యంలో, మరో అవమానాన్ని తట్టుకోగల స్తితిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం లేదు. అలాగే, శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ లోపాయకారీగా కుమ్మక్కయ్యాయని వెలువడిన ఆరోపణల దృష్ట్యా టీ.డీ.పీ. అధినాయకత్వం కూడా ఆ మచ్చను మాపుకునే క్రమంలో అభ్యర్ధుల ఎంపికలో తీవ్రమయిన కసరత్తు చేయాల్సిన పరిస్తితి ఏర్పడింది.
అనేక వడబోతల అనంతరం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కడప జిల్లా రాజకీయాల్లో పండిపోయిన సీనియర్ నాయకుడు అయిన డాక్టర్ మైసూరారెడ్డిని జగన్ మోహన రెడ్డిపై పోటీకి టీ.డీ.పీ. నిలబెట్టింది. పులివెందులలో మాత్రం అంతగా జనం నోళ్ళలో నలగని బీటెక్ రెడ్డిని తెరపైకి తెచ్చింది. ఇక కాంగ్రెస్ తరపున ఆ నియోజకవర్గం నుంచి వై ఎస్ సోదరుడు వివేకానందరెడ్డి స్వయానా వొదినె విజయమ్మతోనే అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
పోతే, కడప పార్లమెంట్ స్తానానికి జగన్ కు దీటయిన అభ్యర్దిని వెతికే క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అనేక పాట్లు పడాల్సివచ్చింది. గతంలో ఒకసారి వై ఎస్సార్ కే గట్టి పోటీ ఇచ్చిన టీ.డీ.పీ. నాయకుడు కందుల రాజమోహన రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తీర్ధం ఇప్పించి జగన్ పై పోటీకి నిలబెట్టాలని చేసిన ప్రయత్నాలు కొంత వరకే పనిచేశాయి. కందుల సోదరుల కాంగ్రెస్ పార్టీ ప్రవేశం మాత్రం ఎలాటి అవాంతరాలు లేకుండా జరిగిపోయింది కానీ, జగన్ పై పోటీలోకి దిగడానికి వారిద్దరూ ససేమిరా అనడంతో వైద్య శాఖ మంత్రి డాక్టర్ డీ.ఎల్. రవీంద్రారెడ్డిని ఆఖరు నిమిషంలో పార్టీ అభ్యర్ధిగా ప్రకటించాల్సిన దైన్య స్తితిలో కాంగ్రెస్ పడింది. ఈ కధ ఇన్ని మలుపులు తిరగడానికి దారి తీసిన పరిణామాలు కూడా శోభస్కరంగా లేవనే చెప్పాలి. కడప పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేయడానికి ఈసారి కందుల సోదరులు పెట్టిన ముందస్తు షరతులు టీ.డీ.పీ. అధ్యక్షుడు చంద్రబాబుకు మనస్కరించకపోవడంతో మనస్తాపానికి గురయిన వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి, ఇద్దరిలో ఒకరికి పార్టీ టిక్కెట్టు ఇచ్చిపోటీలో నిలబెట్టి జగన్ కు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు గట్టి ప్రయత్నమే చేసినట్టు మీడియా కోడై కూసింది. జగన్ పై పోటీకి దిగడానికి కందుల సోదరులు పెట్టిన షరతులకు కాంగ్రెస్ అధిష్టానం పచ్చ జెండా వూపని కారణంగానే, వారు పోటీకి వెనుకడుగు వేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. పోటీ చేయాల్సిన అభ్యర్ధులే ఫలితాలు తారుమారయిన పక్షంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం అధినాయకులనుంచి హామీ కోరాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయంటే, వాస్తవ పరిస్తితులు ఎలావున్నాయో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చు.
కందుల సోదరులు పోటీ చేయమని భీష్మించుకున్న నేపధ్యంలో ఇక విధి లేక మంత్రి డీ.ఎల్.రవీంద్రారెడ్డి పేరును కడప పార్లమెంట్ స్తానానికి అభ్యర్ధిగా అధిష్టానానికి సూచించినట్టు ప్రకటించి రాష్ట్ర నేతలు చేతులు దులుపుకున్నారు. అయితే, దానికి ముందే కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ శాసన సభ్యుడు వీరశివారెడ్డి – కడప పార్లమెంటు సీటుకు పార్టీ తరపున డీ.ఎల్. పోటీచేస్తారని మీడియాకు వెల్లడించి ఆ పార్టీలో కొత్త సంప్రదాయానికి తెర తీసారు. చిన్నపాటి కార్పొరేషన్ చైర్మన్ ఎంపిక విషయంలో కూడా అధిష్టానం అనుమతి లేకుండా స్వతంత్రించి నిర్ణయం తీసుకోలేని కాంగ్రెస్ పార్టీలో, ఒక శాసన సభ్యుడు- ఏకంగా పార్లమెంటుకు పార్టీ తరపున పలానా వ్యక్తి పోటీ చేస్తారని ప్రకటించడం కాంగ్రెస్ సంస్కృతి తెలిసిన వారికి వింతగానే అనిపించింది. నిజంగా ఇది చాలా గొప్ప మార్పు. అయితే దేని కోసం ఇంత మార్పు అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మిగులుతోంది. శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పెద్ద పార్టీ, ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో వున్న జాతీయ పార్టీ - ఒక్క వ్యక్తిని ఎదుర్కోవడం కోసం ఇన్ని మల్లగుల్లాలు పడుతుండడం చూసేవారికి ఆ పార్టీ నిజంగానే బలంగా వుందా లేదా అంతగా బలహీన పడిందా అని అనిపించడంలో వింతేమీ లేదు.
అభ్యర్ధి నిర్ణయ ప్రక్రియలో ఇన్నిన్ని కప్పదాట్లకు అవకాశం ఇవ్వకుండా, ముందుగానే రవీంద్రారెడ్డి అభ్యర్ధిత్వాన్ని నిర్ణయించి, ప్రకటించి వుంటే పార్టీ ఇంత అపప్రధ మూటకట్టుకునేది కాదు. ఎందుకంటే, కడప జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో పలుకుబడి కలిగిన నాయకుడాయన. పైపెచ్చు వై.ఎస్.ఆర్.నే నేరుగా రాజకీయంగా ఎదుర్కున్న వ్యక్తి. జగన్ రెడ్డి పై ఆయన విజయావకాశాలు యెలా వుంటాయన్నది ప్రశ్న కాదు. యే ఎన్నికల్లో అయినా గెలుపోటములు అభ్యర్ధుల చేతుల్లో వుండవు. కాకపోతే, జగన్ రెడ్డి పై పోటీ చేసే అభ్యర్ధిని ఎంపికచేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ కిందుమీదవుతోందన్న మీమాంసకు తావు లేకుండా పోయేది. కానీ, అలా చేయకుండా, అభ్యర్ధి నిర్ణయంలో తాత్సారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరంలో కొంత ముందస్తు ఓటమిని అంగీకరిస్తున్న భావాన్ని కలిగించింది. మనసులో మాట దాచుకోకుండా వ్యక్తం చేసే మంత్రి బొచ్చ సత్యనారాయణ ఇదే విషయాన్ని మరోరకంగా వెల్లడించారు కూడా. దీనికి తోడు ఈ ఉప ఎన్నికలు రిఫరెండం కావంటూ పీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ చేసిన ప్రకటన.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో విచిత్రమయిన అంశం ఈ ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పార్టీ టికెట్ కోసం కాంగ్రెస్ అభ్యర్ధులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఢిల్లీ చుట్టూ ఎన్నో ప్రదక్షిణాలు చేయాలి. అధిష్టానం వద్ద పట్టుందని భ్రమ కల్పిస్తూ పబ్బం గడుపుకుంటున్న ఎందరెందరో తాబేదార్లను మెప్పించాలి. ఇంతా చేసినా టికెట్ రావాలని లేదు. ఒకవేళ టికెట్ వచ్చినా బీ ఫారం చేటికి చేతికి ఇస్తారని  ఆశ  లేదు. అధవా బీ ఫారం ఇచ్చినా నామినేషన్ వేసేంతవరకు అధిష్టానం మనసు మార్చుకోదన్న నమ్మకం లేదు. కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేసిన ఎవరినడిగినా ఈ విషయాలు చెబుతారు. అలాటిది, ఈ సారి అనేకమంది కాంగ్రెస్ నాయకులు, ‘అధిష్టానం ఆదేశిస్తే జగన్ పై పోటీ చేస్తామ’ని బహిరంగ ప్రకటనలు చేశారు. అధినాయకత్వం ఆదేశించాలే కాని ఔదలదాల్చని వారెవరుంటారు? మరెందుకిలా బీరాలు పోయినట్టు? దీనికి ఒక కాంగ్రెస్ నాయకుడే ప్రైవేటు సంభాషణలో సమాధానం చెప్పాడు. అధిష్టానం ఆదేశించడం అంటే – ఎన్నికకు పూర్తి బాధ్యత పార్టీ స్వీకరించాలి. యావత్తు భారాన్ని పార్టీయే మోయాలి. మొత్తం పార్టీ శ్రేణుల్నీ సమన్వయం చేసి పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా పనిచేసేట్టు చూడాలి. తీరా ఫలితంలో ఏవన్నా తేడాపాడాలు వస్తే, ఆ అభ్యర్ధుల రాజకీయ భవిష్యత్తును మరో రకంగా కాపాడాలి. అధిష్టానం ఆదేశించడం అంటే ‘కంప్లీట్ ప్యాకేజ్’ అన్నమాట. కాకపొతే, కాస్త అటూ ఇటూగా అన్ని ప్రధాన పార్టీల్లో ఈ ప్యాకేజి ఏదో ఒక రూపంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అమలవుతోందట. (11-04-2011)