ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ
చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఈ మధ్యాన్నం
అమరావతిలోని సీయీఓ కార్యాలయానికి వెళ్లి
తొమ్మిది పేజీల మెమొరాండం ఎన్నికల ప్రధాన అధికారికి అందచేశారు. ఆ తర్వాత ఆ
కార్యాలయం ఎదుటే తమ పార్టీ నాయకులతో కలిసి ధర్నాకు కూర్చున్నారు. రేపు ఉదయం
పోలింగు మొదలవుతుంది అనగా ఈరోజు ఈ పరిణామం చోటు చేసుకోవడం సహజంగానే చర్చనీయాంశం
అయింది. సిఈఓ ఆఫీసు ఎదుట ఒక ముఖ్యమంత్రి
ధర్నా చేయడం ఇదే మొదటి సారి. అయితే గతంలో వేర్వేరు కారణాలతో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ఆ హోదాలోనే ధర్నాలకు దిగిన దృష్టాంతాలు వున్నాయి.
శ్రీ రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న
రోజుల్లో ఆనాటి ఆర్ఎస్ఎస్ నేత సుదర్శన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి గురించి
అవమానకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ
ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రోశయ్య కూడా
ధర్నాలో పాల్గొన్నారు.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి
కూడా ధర్నా చేశారు. పరిపాలనా వ్యవహారాల్లో గవర్నర్ కిరణ్ బేడి జోక్యం మితిమీరి
పోయిందన్నది ముఖ్యమంత్రి ఆరోపణ. దాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఆ నిరసన
మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు.
పొతే మరో తాజా ఉదాహరణ మమతా బెనర్జీ. కేంద్రం
తమ ప్రభుత్వాన్ని, తన అధికారులను సీబీఐ వేధింపులకు గురిచేస్తోందని బెంగాల్
ముఖ్యమంత్రి దీదీ ధర్నాకు దిగారు. రెండు రోజుల నిరసన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి
చంద్రబాబు కోల్ కటా వెళ్లి మమతా బెనర్జీ చేత దీక్ష విరమింప చేసిన సంగతి తెలిసిందే.
అధికారంలో ఉన్న ప్రభుత్వాల అధినేతలే
కేంద్ర ప్రభుత్వం తమపై కక్షతో వ్యవహరిస్తోందని నిరసన దీక్షలు చేస్తున్నారు సరే.
అది వారికి ప్రజాస్వామ్యం ప్రసాదించిన
హక్కు.
మరి అలాగే, సామాన్యులు కూడా అధికార
దర్పాలకు గురవుతూ మౌనంగా వుండిపోతున్నారు తప్ప ఆఫీసుల ముందు ధర్నాలకు దిగడం లేదు.
ప్రభువులు అలాంటివారిని కూడా గమనంలో పెట్టుకోవాలి.