రాత్రి అమెరికా నుంచి మా అన్నయ్య కుమారుడు సత్య సాయి ఫోన్ చేశాడు.
ఈనాడు దినపత్రిక నెట్ ఎడిషన్ లో చాలా
రోజుల నుంచి కార్టూనిస్ట్ శ్రీధర్ ఇదీ సంగతి కార్టూన్లు కనిపించడం లేదు, కారణం
ఏమిటని ఆరా తీశాడు. గత నెల ఆగస్టు పదమూడున శ్రీధర్ వేసిన కార్టూన్ ఆఖరు సారి నెట్
ఎడిషన్ లో వేశారని, అప్పటినుంచి రావడం లేదని వివరం చెప్పాడు.
రెండు రోజుల క్రితమే ఫేస్ బుక్ లో
శ్రీధర్ ఉద్యోగపర్వం నలభయ్ రెండేళ్లుగా సాగుతోందని, ఆ పత్రికలో ఇదొక రికార్డు అని
పేర్కొంటూ ఒక పోస్టు చూశాను. మళ్ళీ ఈరోజు శ్రీధర్ ఫేస్ బుక్ లో ‘ఈనాడుతో తన బంధం
ముగిసిందని, రాజీనామా చేశాను’ అని రెండే రెండు
చిన్న వాక్యాలతో ఓ బుల్లి పోస్టు పెట్టారు. అది బాగా వైరల్ అయింది. కారణాలు ఎవరికి
వారు ఊహించుకుని రాయడమే కానీ ఇదమిద్ధంగా తెలియదు. తెలిసినదల్లా శ్రీధర్ ఈనాడు
నుంచి తప్పుకున్నారని మాత్రమే.
ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్న సత్య
సాయికి శ్రీధర్ కార్టూన్లు అంటే తగని మక్కువ. అందుకే కార్టూన్లు రావడం లేదు అనే ఎరుక
అతడిలో కలిగింది. ఇలాంటి అభిమానులు పెద్ద సంఖ్యలో వున్న శ్రీధర్ అదృష్టవంతుడు.
ఈనాడులో శ్రీధర్ వేసిన మొట్టమొదటి కార్టూన్
అంటూ ఒకటి వైరల్ అవుతోంది. అదే ఇది. కార్టూనిస్ట్ శ్రీధర్ కు ధన్యవాదాలు
(30-08-2021)