ఇప్పుడంటే నా రాత, తలరాత ఇలా తగలబడ్డాయి కానీ చిన్నప్పుడు నా చేతి రాత చాలా చక్కగా, పొందికగా వుండేది. ‘వీడికి రాతలో వున్న కుదురు బుద్దిలో వుంటే బాగుండేది’ అనేది మా బామ్మ.
బ్యాంకు కార్డులు వచ్చి బతికించాయి కానీ, లోగడ డబ్బు డ్రా చేయడానికి, 1975 నుంచి నా ఖాతా వున్న స్టేట్ బ్యాంక్ కు వెళ్ళిన ప్రతిసారీ, ‘మీరు మీరే కానీ ఈ సంతకం మీది కాదు’ అనేవారు గ్లాసు విండో వెనుక వున్న ఉద్యోగులు. ఒకసారి ఇలాంటి తకరారే వస్తే నాకు చర్రున కోపం వచ్చి, ఒక కాగితం అడిగి తీసుకుని దానిమీద వరసగా డజను సంతకాలు చేసి, ‘మీ ముందే సంతకం చేశాను కదా! వీటిల్లో ఏ ఒక్కటైనా మరోదానితో సరిపోలితే అప్పుడు అడగండి. నా రాతే అంత! వంకర టింకర ఓ’ అన్నాను. ఇందులో సెన్సాఫ్ హ్యూమర్ ఏం కనిపించిందో ఏమో కానీ, వెంటనే టోకెన్ బిళ్ళ చేతిలో పెట్టి వెయిట్ చేయమంది.
నా రాత సరే! ఒకసారి బ్రహ్మరాత లాంటి చేతి వ్రాత చూశాను.
ఒక పట్టాన అర్ధం అయ్యేలా లేదు. మరో విషయం, అది రాసి ఇప్పటికి అక్షరాలా నూట ముప్పయి సంవత్సరాలు పైనే.
జీవితం అన్నాక మన విషయాలే కాదు, ప్రపంచానికి చెందిన అనేక సంగతులు కొన్ని చెవిన పడుతుంటాయి. మరికొన్ని కంట పడుతుంటాయి. అలాంటి వాటిల్లో ఇదొకటి.
వెనుకటి రోజుల్లో పాత కాగితాలు, దస్తావేజులు భద్రంగా దాచుకునే వారు. ఆస్తులు తరిగీ, కరిగీ కొంత, ఇప్పటిలా కంప్యూటర్లలో భద్రపరచుకునే వీలూ చాలూ అప్పటికి ఏర్పడక పోవడం వల్ల, ఏతావాతా ఏమైతేనేం పాత దస్తావేజులు, దస్త్రాలు అటకెక్కికూర్చున్నాయి. అటకల ఇళ్ళతో పాటు అవీ కొంతకాలానికి కనుమరుగు అయ్యాయి.
రేడియోలో కలిసి పనిచేసిన ఆర్వీవీ కృష్ణారావు గారు కొన్నేళ్ళ క్రితం పాత దస్తావేజు ప్రతి ఒకటి వాట్సప్ లో పంపారు. చెప్పాను కదా! ఎంత పాతది అంటే దాదాపు 130 సంవత్సరాల నాటిది. వారి ముత్తాత కాలం నాటిది.
ఆర్వీవీ కృష్ణారావు (పూర్తి పేరు రాయసం వీరభద్ర వెంకట కృష్ణారావు) గారి తండ్రి రాయసం గంగన్న పంతులు గారు, (వీరు నాకు కూడా తెలుసు). గంగన్న పంతులు గారి తండ్రి వీరభద్రుడు గారు. వారి తండ్రి గారి పేరు కూడా గంగన్న గారే!
ఆర్వీవీ గారి ముత్తాత గంగన్న గారికి కొంత డబ్బు అవసరం పడింది. అదీ అయిదు వందల రూపాయలు. ఈనాం భూమి కొనుగోలు చేయడానికి చేసిన అప్పు తీర్చడానికి ఈ అప్పు అన్నమాట.
ఈ రోజు లెక్కల్లో అదేమంత పెద్ద మొత్తం కాదు. కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద భూస్వాములకు కూడా నగదు అవసరాలు వచ్చేవి. వాళ్లకు తెలిసినదల్లా భూమిని తనఖా పెట్టి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకోవడం. వెసులుబాటు అయినప్పుడు తీర్చడం. ఇలా అప్పు తీసుకోవడానికి పైకి కనపడని పెద్ద తతంగమే నడిచేది.
గంగన్న గారు వుండేది గోదావరి జిల్లా రేలంగి. డబ్బు అప్పు ఇచ్చే ఆసామి వుండేది తణుకులో. ఈ అప్పు పత్రం రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. అంచేత ఇవి రాయడానికి ప్రత్యేకంగా లేఖరులు వుండేవారు. (ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్స్ అంటున్నారు)
కృష్ణారావు గారు పంపిన దస్తావేజు పత్రాల్లో చేతి రాత బ్రహ్మ రాతను పోలివుంది. చదవడం క్లిష్టం అనిపించినా, బ్రిటిష్ రాణి గారి చిత్రంతో వున్న రెండు రూపాయలు విలువ చేసే స్టాంపు పేపరు మీద రాసిన విషయాలను చదివి, అర్ధం అయినంత వరకు కొంత ఇక్కడ యధాతధంగా పొందుపరుస్తున్నాను. (అర్ధం కాని చోట చుక్కలు ఉంచాను)
“.......ఆ 1891....... తణ్క్(ణ కింద కు వత్తు, తణుకు కావచ్చు) గ్రామ కాపురస్తులు, కమ్మవారు, షావుకారు చిట్టూరి యింద్రయ్య (ఇంద్రయ్య) కుమార్డు వెంకట కృష్ణయ్యకు, రేలంగి కాపురస్తులు , బ్రాహ్మణులు, యిన్నాందార్లు (ఇనాందారులు) రాయసం కృష్ణమ్మగారి కుమార్డు గంగన్న వ్రాయించి ఇచ్చిన అస్వాధీనపు తణ్ఖా (తణఖా, ణా కింద ఖా వత్తు) పత్రము.
“.......... యిన్నాం భూమి కొనుగోలు నిమిత్తం నేను చేసిన రుణాల తీరుమానం నిమిత్తంన్ను, నా కుటుంబ .......(బహుశా ఖర్చులు కావచ్చు) నిమిత్తంన్నూ యీ రోజు కృష్ణయ్య గారి వద్ద పుచ్చుకున్న రొఖం రు. 500 (అయిదువందల రూపాయీలు) యిన్ద్కు నెల / ఒక్కింటికి వందకు రు. 1 రూపాయి చొ# వడ్డీతో అయ్యే అసలుఫాయిదాలు తీరుమానం చెయ్యగలందులమని ......”
ఈ విధంగా సాగిపోయింది ఆ రుణపత్రం.
కింద గంగన్న గారు చేసిన సంతకం ఇంకా గమ్మత్తుగా వుంది.
‘రాయసం గంగ్గంన్న వ్రాలు’ అని దస్కత్తు చేశారు. ఆ రోజుల్లో తెలుగు అలా వుండేదేమో!
తణుకు సబ్ రిజిస్త్రార్ ఆఫీసులో రెండు రూపాయల స్టాంపుపై రిజిస్త్రార్ సంతకం చేసి వేసిన మొహర్ వుంది.
అయిదు వందల రూపాయలు అప్పు చేయాలంటే ఇంత తతంగం నడిచేది.
అప్పు పూర్తిగా అసలు ఫాయిదాలతో అనుకున్న వ్యవధికి ముందే చెల్లు వేసి తనఖా పత్రాలను వెనక్కి తీసుకున్నట్టు కూడా వాటిల్లో వుంది.
ఇప్పుడో.....
అప్పు చేయడానికి ఆలోచించనక్కరలేదు. తీర్చే విషయం గురించి అసలు బెంగ పడక్కర లేదు. చేసింది ఎంత పెద్ద అప్పయితే చట్టం నుంచి తప్పించుకునే అవకాశాలు అంత ఎక్కువగా వుంటాయి.
(ఇంకా వుంది)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి