6, మే 2020, బుధవారం

మద్యనిషేధం పై అసెంబ్లీలో వావిలాల ప్రసంగం



తెలుగు మద్యం పోస్టుపై పాత్రికేయ మిత్రుడు చిర్రావూరి కృష్ణారావు వ్యాఖ్యానిస్తూ నాటి శాసన సభలో జరిగిన చర్చలు గురించి తెలిస్తే రాయమని సూచించారు.
అసెంబ్లీ రికార్డులు పరిశీలిస్తే  1968 జూన్ 26 వ తేదీన వావిలాల వారు చేసిన ప్రసంగం దొరికింది.
ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ఏరియా) మద్య నిషేధం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ వావిలాల గోపాలకృష్ణయ్య గారు చేసిన ఈ ప్రసంగం అచ్చులో దాదాపు రెండు పేజీల పైన వుంది. విషయవిస్తరణ భీతితో దాన్ని కుదించి పోస్టు చేస్తున్నాను.
“మన జీవితమంతా రెండు నాలుకలలో నడుస్తున్నది. నిన్న మొరార్జీ దేశాయి గారు ఇక్కడకు వచ్చి ప్రొహిబిషన్ రద్దు చేయడానికి వీలు లేదన్నారు. ఈవేళ కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉన్న నిజలింగప్ప గారు ఇంకొక మాట చెబుతున్నారు. బెంగుళూరులో వారిని అడిగితె, ఇది శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, సామాన్య ప్రజలు ఎంతవరకు శిరసావహిస్తారు అనే దృష్టితో చూడాలి. ఏమైనా ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొరార్జీ దేశాయి గారు ప్రొహిబిషన్ వల్ల కలిగే నష్టంలో సగం ఇస్తాం అంటున్నారు. అసలు డబ్బు ఎక్కడ వుంది?
“....కాంగ్రెస్ ఆదర్శాలతో వుండేవారు ఈనాడు బహిరంగంగా తాగడానికి పర్మిట్లు ఎందుకు ఇస్తున్నారు. తాగనిస్తారట. పర్మిషన్ లేకుండా తాగేవారిని జైల్లో పెడతారట. తెలంగాణలో ప్రొహిబిషన్ అక్కరలేదా. ఆంధ్రాకే కావాలా. ఇట్లా ఈ రెండు నాలుకల రాజ్యం ఎన్నాళ్ళు సాగుతుందో అర్ధం కావడం లేదు. నేను ప్రొహిబిషన్ కు అనుకూలుడను అనేది మాత్రం క్లియర్ గా చెబుతున్నాను. కానీ ఇప్పుడు ప్రొహిబిషన్ అమలు జరుగుతున్నది అంటే నన్ను నేను మోసగించుకోవడం, మిమ్ములను మోసగించడం తప్ప ప్రొహిబిషన్ ఎక్కడా లేదు. దీనివల్ల అధికారులు లంచగొండులవుతున్నారు. దాదాపు పన్నెండు దేశాలలో ప్రొహిబిషన్ అమలు చేసారు. ఆ దేశాలలో రాజ్యం ఎవరి చేతుల్లోకి పోయింది. బూటులిక్కర్స్ చేతికే పోయింది.మోరల్ ప్రిన్సిపుల్స్ వున్నాయని సంతోశిడ్డాము అంటే పర్మిషన్ ఇస్తుంటారు. గవర్నమెంటు డిస్టిలరీస్ నడపడానికి ప్రయత్నం చేస్తోంది. అవి మంత్రి గారు నడుపుతారా సెక్రెటరీలు నడుపుతారా కాంట్రాక్టర్లకు ఇస్తారు.
“విషం కలిపితే తాగి చనిపోతునట్టు వింటున్నాం. పబ్లిక్ హెల్త్ దెబ్బ తింటోంది. నిజలింగప్ప గారు వ్హేప్పినట్టు దీనివల్ల లా అండ్ ఆర్డర్ ఎఫెక్ట్ అవుతోంది. మోరల్స్ లేవు. బహిరంగంగా తాగుతూ వుంటే ఎదురుగా వుండి కూడ, కళ్ళు వుండికూడా మూసుకుని వ్యవహరిస్తున్నాము.  అమలు చేయడానికి సమర్ధత లేకపోతె వదిలేయాలి. (ప్రొహిబిషన్) అమలు చేస్తారంటే సరిగా అమలుచేయాలి.
“బకాసురుడు బాధ పెట్టినట్టుగా రోజూ ఎస్ ఐ వెళ్లి ఈ ప్రొఫార్మా వుంది. మీరు ఈ గ్రామంలో నాలుగు దుకాణాలు పెట్టుకోండి, కానీ మాకు నెలకు రెండు కేసులు ఇవ్వండి అంటారు. స్టాటస్టిక్స్ చూడండి. పేదవాళ్ళు కాకుండా ధనవంతులు ఎవరైనా జైలుకు పోయారా. అటువంటప్పుడు ఈ యాక్టు ఎందుకు. 160 మంది కాంగ్రెస్ లేజిస్లేటర్లు రద్దు చేయడానికి సంతకం చేసారట. ప్రొహిబిషన్ కావాలి అంటున్నారు. గాంధీజీ సిద్దాంతం అంటున్నారు. త్రాగడానికి ఒప్పుకున్నారు.
“... ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలి. అమలు చేయడానికి సమర్ధత లేదంటారా ఏడుస్తూ ఒప్పుకుంటాము”        



కామెంట్‌లు లేవు: